ఎవరికి నష్టం? ఆలోచించండి!
ఎస్సెస్సీ లో ప్రధమ శ్రేణి. పీయూసీ లో కూడా మళ్ళీ
మొదటి ర్యాంకే. ఐఐటీ ఎంట్రెన్స్ లో సేమ్ టు సేం ఫస్ట్ ర్యాంకే. ఆల్ ఇండియా ఐఐటీ
కంప్యూటర్ సైన్స్ లో అదే వరస. అదే మొదటి ర్యాంకు. ఐఏఎస్ ఎంట్రెన్స్ పరీక్ష రాస్తే
తిరిగి ఫస్ట్ ర్యాంకు. ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కూడా మళ్ళీ మొదటి
ర్యాంకే.
శ్రీ నారాయణస్వామి, ఐ.ఏ.ఎస్.
చదువుల్లో
ఎక్కడా ఎప్పుడూ ‘ఫస్ట్ ర్యాంక్’ మిస్సు కాని ఈ చెన్నై ఐఐటీ కుర్రాడి పేరు
నారాయణస్వామి. అక్కడ పట్టా పుచ్చుకున్న వెంటనే స్వామికి అమెరికా లోని
ప్రతిష్టాత్మక విద్యా సంస్థ – మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి
ఆహ్వానం అందింది. స్కాలర్ షిప్ తో కూడిన సీటు వచ్చింది.
కానీ నారాయణ స్వామి రూటే వేరు. అతడు ఆలోచించే తరహానే
వేరు. అందుకే అతడు నారాయణ స్వామి అయ్యాడు. ఈనాడు ఇంతగా చెప్పుకోదగ్గ మనిషి
అయ్యాడు.
స్వామిది మధ్య తరగతి కుటుంబం. తన ఐఐటీ చదువుపై ప్రభుత్వం
లక్షలు ఖర్చు పెట్టిందని తెలుసు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో కూడా
తెలుసు. తనలాటి వాళ్లు, తన కంటే పేద వాళ్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సర్కారుకు
చెల్లించిన పన్నులు తన చదువుకు ఉపయోగపడ్డాయని తెలుసు. అందుకే రెక్కలొచ్చిన పక్షి
మాదిరిగా స్వదేశాన్ని వొదిలి విదేశాలకు పోకుండా ఇక్కడే వుండిపోయి ‘తల్లి పాల రుణం’ కొంతయినా తీర్చుకోవాలని
సంకల్పించుకున్నాడు. అందుకే ఐఏఎస్ ఆఫీసర్ అయి ప్రజలకు తన చేతనయిన సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఐఏఎస్
అనే మూడు అక్షరాలను తన పేరుకు
జోడించుకోవడం ద్వారా ప్రజాసేవకు ద్వారాలు తెరుచుకుంటాయని అనుకున్నాడే కాని, ఆ
పదవిని వాడుకుని తన ద్వారా నల్ల ధనం
సంపాదించాలనే నల్ల తాచులు తన చుట్టూ పొంచి వుంటాయని మాత్రం వూహించలేక పోయాడు.
సబ్ కలక్టర్
గా మొదటి పోస్టింగ్ లోనే అతడికి ఐఏఎస్ గురించిన కన్న కలలన్నీ కల్లలేనని తేలిపోయింది.తను అనుకున్నది
అనుకున్నట్టు చేయడం కాకుండా ఎవరో
అనుకున్నది వాళ్లు అనుకున్నట్టు చేయడమే అధికారిగా
తన విధి అని అర్ధం అయింది. అయినా స్వామి తన తీరు మార్చుకోలేదు. తన దారి
మార్చుకోలేదు. తనను తమ అదుపాజ్ఞల్లో వుంచుకోవాలని చూసిన అనధికార శక్తులకు పంటి కింద
రాయిలా మారాడు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేసాడు.
ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో మొదలయిన ఈ కయ్యం
స్వామిని పేద ప్రజల దృష్టిలో దేవుడిని చేస్తే, రాజకీయనాయకుల దృష్టిలో ఎందుకూ
పనికిరాని అధికారిగా ముద్ర వేసింది.
అల్లుడు జిల్లా కలెక్టర్ కాబట్టి తనని ఎవరూ ఏమీ చేయలేరన్న
ధీమాతో స్వామి మామగారు తన ఇంటి స్థలం చుట్టూ అనుమతి లేకుండా ప్రహరీ గోడ కట్టాడు. ఆ గోడ కారణంగా తమ కాలనీ
నుంచి రాకపోకలకు వీలులేకుండా పోతోందని కొందరు బీదా బిక్కీ కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నారు.
తనిఖీ చేసిన స్వామి, మామగారు కట్టించిన గోడను పడగొట్టించాడు. ఫలితం. ఇంట్లో
గొడవలు, భార్యతో కలతలు. చివరికి విచ్చిన్నమయిన కాపురం.
పేద ప్రజలు నివాసం వుండే ఒక ప్రాంతంలో వరదల వల్ల భయం
లేకుండా ఒక కరకట్ట నిర్మించారు. కట్ట నిర్మించిన కంట్రాక్టర్ ఎనిమిది కోట్లకు
బిల్లు పెట్టాడు. నిర్మాణంలో లొసుగులు వున్నాయని అనుమానించిన నారాయణ స్వామి
బిల్లును చెల్లించకుండా వర్షాకాలం వచ్చేవరకు నిలుపు చేయించాడు. నాలుగు వానలు
పడ్డాయో లేదో కరకట్ట ఆనమాలు లేకుండా పోయింది. కంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడు.
ఆవిధంగా ప్రజాధనం ఎనిమిది కోట్లు కాపాడి ప్రజల అభిమాన
ధనం సంపాదించుకోగలిగాడు కానీ అదేసమయంలో
అనేక మంది శత్రువులను కూడా సంపాదించుకున్నట్టయింది.
ఇంతలో
మరో పరిణామం. వూళ్ళో ఒక మద్యం వ్యాపారి
ప్రభుత్వానికి చెల్లించాల్సిన పదకొండు కోట్ల రూపాయలు ఎగగొట్టాడు. స్వామి రెవెన్యూ
రికవరీ యాక్ట్ ప్రయోగించి అతడి గోళ్ళూడగొట్టి బాకీ వసూలు చేసాడు. అవతల వాడు
సామాన్యుడు కాదు. నిమిషాల మీద ఓ మంత్రి ఫోను. కుదరదని స్వామి సమాధానం. పర్యవసానం
క్షణాల మీద బదిలీ, పాఠశాలల్లో నాణ్యతా
ప్రమాణాల సంరక్షకాధికారిగా.
విసుగు చెందిన స్వామి కేంద్ర సర్వీసులకు వెళ్ళాలని
దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఆ అభ్యర్ధనను కూడా తిరస్కరించింది.
ఎంతో చేద్దామనుకుని వచ్చి ఏమీ చేయలేని నిస్సహాయ స్తితిలో స్వామి ఉద్యోగం
వొదిలి పెట్టాలని నిర్ణయానికి వచ్చాడు. పారిస్ లో ఐక్యరాజ్యసమితి ఉద్యోగం ఆఫర్
కూడా వచ్చింది. స్వామిలాంటి వారికి
ఉద్యోగాల కొరత వుండదు. బయట ఎక్కడయినా వారిని నెత్తిమీద పెట్టుకుంటారు.
స్వామి లాటి అధికారి వెళ్లిపోతున్నాడంటే రాజకీయులకు చీమకుట్టినట్టుకూడా వుండదు.
పైపెచ్చు తమ ఆటలకు అడ్డూ అదుపూ వుండదని సంతోషిస్తారు కూడా.
అయితే జనాలకు ఏదో చేద్దామని ఆశ పడ్డ స్వామి లాటి
అధికారులను కాపాడుకునేందుకు మనం ఏమీ చెయ్యలేమా? అన్నదే ప్రశ్న. వారి బదిలీ ఆపే
అధికారం జనాలకు లేకపోవచ్చు. అలా బదిలీ చేసే రాజకీయులు తిరిగి
ఎన్నిక కాకుండా చేయగల - ‘వోటు’ అనే
‘పాశుపతాస్త్రం’ - జనం చేతిలోనే వుందన్న విషయం మాత్రం మరచిపోకూడదు.
ఏమంటారు? కాస్త ఆలోచించండి. (21-05-2012)


