9, మే 2012, బుధవారం

ఏ తండ్రి చరిత్ర చూసినా!




(తండ్రులకు మాత్రమే!)
ఏ తండ్రి చరిత్ర చూసినా!

‘ఒపీనియన్స్ చేంజ్’ అన్నాడు గిరీశం.
వయసు పెరుగుతున్నకొద్దీ ఓ తండ్రి గురించి అతడి కొడుకు అభిప్రాయాలు యెలా మారిపోయాయో గమనిస్తే నిజమే కామోసు గిరీశం మాటలు అనిపిస్తుంది.
(నాలుగేళ్ల వయస్సులో)
“మా నాన్నకు అన్నీ తెలుసు”
(ఆరేళ్ళ వయస్సులో)
“ఏదో అనుకుంటాడు కానీ మా నాన్నకు అన్నీ తెలియవు”
(ఎనిమిదేళ్ళ వయస్సులో)
“ఏవిటో చెబితే అర్ధం చేసుకోడు.అసలు పిల్లల సంగతి ఆయనకేం తెలుసని”
(పద్నాలుగేళ్ల వయస్సులో)
“మా నాన్నవన్నీ పాతచింతకాయ పచ్చడి ఆలోచనలు”
(ఇరవైఒక్క ఏళ్ళ వయస్సులో)
“ఈ ముసలాయనకు  ఏం చెప్పినా, యెలా చెప్పినా ఓ పట్టాన అర్ధం కాదు”
(ఇరవై అయిదేళ్ళ వయస్సులో)
“ఈ విషయం గురించి మా నాన్నకు ఏదో కొంత తెలుసు కానీ, ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని చూస్తే పోనీలే పాపం అనిపిస్తుంది”
(ముప్పయ్యేళ్ళ వయస్సులో)
“ఈ విషయంలో మా నాన్నను అడిగివుంటే బాగుండి వుండేదేమో కదా!”
(ముప్పయి అయిదేళ్ళ వయస్సులో)
“ఇక నుంచి నాన్నను సంప్రదించకుండా ఒక్క పనీ చేయనుగాక చేయను”
(యాభయ్ ఏళ్ళ వయస్సులో)
“ఇలాటి సంకట పరిస్తితి ఎదురయినప్పుడు మా నాన్నే బతికివుంటే ఏమి చేసి వుండేవాడో!”
(అరవై ఏళ్ళ వయస్సులో తండ్రి సమాధి చెంత)
“నిజంగా  మా నాన్న చాలా గొప్పవాడు. ఆయన
 వున్నప్పుడు ఆయన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయాను
 వ్చ్! ఇప్పుడు అనుకుని ఏం లాభం?”





(నెట్లో అందుకున్న ఓ ఇంగ్లీష్ కధనం ఆధారంగా)
09-05-2012 







































7, మే 2012, సోమవారం

నీతి కధలో నీతి


నీతి కధలో నీతి
లోక్ సభలో ప్రభుత్వ పనితీరుపై చర్చ జరుగుతోంది.
పాలక పక్షానికి చెందిన సభ్యుడు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ అనర్ఘళంగా ప్రసంగిస్తున్నాడు.
మేడం  స్పీకర్! మీ అనుమతితో నేనొక చిన్న కధ చెప్పదలచుకున్నాను.
అనగనగా  ఓ  ఊర్లో ఓ తండ్రి. అతడికి ముగ్గురు కొడుకులు. కొడుకుల ప్రయోజకత్వాన్ని పరీక్షించడానికి తండ్రి ముగ్గురు కుమారులకు తలా వంద రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు.
ఇదిగో ఈ వందా తీసుకువెళ్ళి ఏదయినా సరుకు కొనుక్కు రండి. మీరు తెచ్చిన దానితో ఈ గది నిండిపోవాలి సుమా!అని షరతు కూడా  పెట్టాడు.
పెద్దవాడు వెంటనే వెళ్లి  ఆ వందతో వరిగడ్డి కొనుక్కుని తెచ్చాడు. వాస్తవానికి  ఎక్కువే  వచ్చింది కాని అతడు తెచ్చిన గడ్డితో ఆ గది పూర్తిగా నిండలేదు.
రెండోవాడు వంద రూపాయలు పెట్టి  బోలెడు దూది పట్టుకు వచ్చాడు.  కానీ దానితో కూడా గది పూర్తిగా నిండలేదు. కొంత ఖాళీ మిగిలి పోయింది.
మూడోవాడు తన తెలివిని ఉపయోగించి వంద రూపాయల్లో ఒకే ఒక రూపాయి ఖర్చుచేసి  ఒక  కొవ్వొత్తి కొనుక్కుని తెచ్చాడు. దాన్ని వెలిగించగానే ఆ వెలుతురుతో గది నిండిపోయింది.
కధ పూర్తిచేసిన కాంగ్రెస్ సభ్యుడు మరో వాక్యంతో తన ప్రసంగాన్ని ముగించాడు.
చూశారా!  దేనికయినా  తెలివితేటలు కావాలి. మన ప్రధాని కూడా అచ్చం ఈ కధలోని మూడో కుమారుడిలాటివాడు. ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి మనదేశం  యావత్తూ ఆయన మేధస్సు వెలిగించిన కాంతి సంపదతో  నిండిపోతోంది.
సాటి పాలక సభ్యుల హర్షధ్వానాల నడుమ ఆయన కాలరు ఎగరేస్తూ  తన సీటులో కూర్చోబోతున్న తరుణంలో సభలో ఒక మూలనుంచి ఎవ్వరో సన్నగా గొణిగారు.
దేశం  వెలిగిపోవడం  సంగతి సరే! మరి మిగిలిన తొంభయి తొమ్మిది రూపాయలు ఏమయినట్టు? ఎవరి జేబులోకి వెళ్లినట్టు?”

(07-05-2012)

6, మే 2012, ఆదివారం

కాశీ సమారాధన - 1



కాశీ సమారాధన - 1

(కొత్త సీరియల్ ప్రారంభం – ఆదివారం స్పెషల్)

మా బామ్మ గారు రుక్మిణమ్మ గారు ఏ వయసులో కాశీ యాత్ర చేసివచ్చారో తెలియదు కాని అప్పుడు నేను  చాలా చిన్నవాడిని. ఆవిడ రెండోసారి వెళ్లి వచ్చినప్పుడు మాత్రం నన్ను వెంట తీసుకువెళ్ళకుండా మా మూడో అన్నయ్య శ్రీ వేంకటేశ్వర రావును  తోడు తీసుకు వెళ్లడం, నాకు కోపం వచ్చి వాళ్లు వెడుతున్న ఎడ్లబండికి  అడ్డం పడుకోవడం, కాసేపటికి మా పెద్దన్నయ్య శ్రీ పర్వతాలరావు వచ్చి గదమాయించి నన్ను ఇంటికి తీసుకుపోవడం బాగా గుర్తు. మా బామ్మ గారు కాశీ యాత్ర చేసి తిరిగివచ్చిన తరువాత నేరుగా ఇంటికి రాకుండా వూరి నడుమ వున్న ముత్యాలమ్మ గుడి రావి చెట్టు వద్ద విడిది చేసేవారు. వూళ్ళోని వాళ్లందరూ గుమికూడి ఆమెను, ఆమె వెంట కాశీ వెళ్లి వచ్చిన వారిని మేళ తాళాలతో వూరేగింపుగా ఇంటికి తీసుకువచ్చేవారు. తరువాత కాశీ సమారాధన చేసి వూరబంతి (వూళ్ళోని వారందరికీ సామూహిక భోజనం) పెట్టి యాత్రావిశేషాలను పూసగుచ్చినట్టు చెప్పేవారు. వూరిజనమంతా వొళ్ళంతా చెవులు చేసుకుని వింటూ వారే కాశీ పోయివచ్చినంతగా మహాదానందపడేవారు.
ఆ తరువాత కాశీ గురించి విన్నది, కన్నది ఏనుగుల వీరాస్వామయ్య గారు రాసిన కాశీ యాత్ర పుస్తకంలోనే. అది ఎన్నివందల సార్లు చదివిందీ నాకే గుర్తులేదు. ముఖ్యంగా శ్రీశైలం అడవిబాటలు, ఆనాటి హైదరాబాదు విశేషాలు చదువుతున్నప్పుడు అంత కష్టపడి యాత్ర చేసింది ఆ పుస్తకం చదివే మన అందరికోసం  అనిపించింది. అప్పటి సంగతులను కళ్ళకు కట్టినట్టు అందులో రాసిన విధానం ఎంతగానో ఆకట్టుకునే తీరుగా వుంది. ‘ఏదో తిరిగాము, తిన్నాము’ అన్నట్టుగా కాకుండా ఆ నాటి ఆచార వ్యవహారాలను, సాంఘిక స్తితిగతులను విడమరచి చెప్పడం ద్వారా యాత్రాకధనాలకు ఆయన ఒక విశిష్టతను ఆపాదించి పెట్టారు.
దరిమిలా మరో రెండు సార్లు కాశీ వెళ్లాను. మా బావగారు కౌటూరు కృష్ణ మూర్తి గారు చనిపోయినప్పుడు అస్తికలను  గంగలో కలపడానికి ఆయన పెద్ద కుమారుడు దుర్గాప్రసాదరావుతో పాటు నేను కూడా  తోడుగా కాశీ వెళ్లాను. 1993  శ్రావణ మాసంలో   మా అమ్మగారు వెంకట్రావమ్మగారు  పరమపదించినప్పుడు మరోసారి కాశీ వెళ్లాను. నిజం చెప్పాలంటే ఆ యాత్ర మా జీవితంలో నభూతో నభవిష్యతి. ఆమె చనిపోయిన రెండో రోజే  కర్మకాండ గురించిన చర్చల్లో మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు కాశీ ప్రసక్తి తేవడం, అందరం మరో మాట లేకుండా ఆయన మాటకు సరే అనడం, అమ్మ సంతానానికి చెందిన సుమారు ముప్పై మందిమి కాశీ బయలుదేరడం అంతా ఓ కలలా జరిగిపోయింది. అంతమందికి అంత తక్కువ వ్యవధిలో రైలు రిజర్వేషన్లు దొరకడం, పదహారేళ్లనుంచి పండు ముదిమిలో వున్నవారివరకు వెనుకంజ వేయకుండా కాశీ యాత్రకు సంసిద్ధులు కావడం, ఎలాటి ఇబ్బందీ ఎదురుకాకుండా అందరం కాశీ, ప్రయాగ, గయ మొదలయిన పుణ్య క్షేత్రాలను సందర్శించి మా అమ్మగారికి సంబంధించిన కర్మ కాండలను అన్నింటినీ సక్రమంగా పూర్తిచేసుకుని భద్రంగా ఇళ్లకు చేరడం, మొదటి మాసికాన్ని మా వూరు కంభంపాడులో మా మూడో అన్నయ్య, కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు గారు తన సంకల్ప బలంతో, అత్యల్ప స్వల్ప వ్యవధానంలో నిర్మించిన ‘అమ్మా నాన్నల గుడి’ వద్దే,  సమస్త వూరిజనం నడుమ, వివిధ ప్రాంతాలలోనె కాకుండా, అనేక రాష్ట్రాల్లో స్తిరపడ్డ అశేష బంధు జనం సమక్షంలో ‘ఒక పెళ్లి వేడుక’ మాదిరిగా నిర్వహించడం అంతా ‘అమ్మ’ చలవ వల్లే సాధ్యపడింది. ఆ సందర్భంలో మేనల్లుడు కౌటూరు దుర్గాప్రసాదరావు ప్రచురించిన ‘అమ్మ’ పుస్తకంలో చిన్నా పెద్దా అందరూ రాసిన సంస్మరణ కవితలు అబ్బుర పరిచేవిగా వున్నాయి. ఈ పుస్తకంలోనే మా ఐదో అక్కయ్య కొమరగిరి అన్నపూర్ణ ‘కాశీ యాత్రా విశేషాలను’ కళ్ళకు కట్టినట్టు రాసిన కధనాన్ని పొందుపరచడంతో ఆ పుస్తకానికి ఎక్కడలేని ఆదరణ లభించింది. అందుకే ఏ కొలమానాన్నిబట్టి చూసినా    ‘ధన్యజీవి’ మా అమ్మ.
ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత, మళ్ళీ -   ఆకాశవాణి పూర్వ సంచాలకులు వేమూరి విశ్వనాధ శాస్త్రి దంపతుల పూనికపై, వారి సారధ్యంలోనే కిందటి నెలలో నేనూ మా ఆవిడా ఇంకోసారి కాశీ యాత్ర చేసే అవకాశం లభించింది. కాకపొతే ఈ సారి కాశీతో పాటు, కలకత్తా, అయోధ్య, బైధ్యనాద్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించడం జరిగింది.
ఆ విశేషాలు తెలియచెప్పే ఉద్దేశ్యంతోనే – ఇదిగో ఈ ‘కాశీ సమారాధన.’   
(గమనిక – ఈ అంశంపై ఆసక్తి కలిగిన పాఠకుల సౌలభ్యం కోసం, ‘కాశీ సమారాధన’ తాజా భాగాలను ‘ప్రతి ఆదివారం’ పోస్ట్ చేస్తుంటాను.- భండారు శ్రీనివాసరావు)                                 

5, మే 2012, శనివారం

వృత్తి రహస్యం


వృత్తి రహస్యం
కేంద్రమంత్రులు ప్రణబ్ ముఖర్జీ, కపిల్ సిబాల్ మధ్య సాపత్యం ఏమిటంటే వాళ్ళిద్దరూ ప్రతినెలా క్షౌరం చేయించుకోవడానికి ఒకే సెలూన్ కు వెడతారు.
కపిల్ సిబాల్ కిందటినెల వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే బార్బర్  కపిల్ ని అడిగాడు.
ప్రతిరోజూ పేపర్లో వస్తుంటుంది స్విస్ బ్యాంకు, బ్లాకుమనీ అంటూ, ఇంతకీ  ఏమిటండీ దీని గొడవఅని.
ఆ ప్రశ్నతో  కపిల్ సిబాల్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు.
నువ్వు నాకు క్షౌరం చేస్తున్నావా లేక సీబీఐ మాదిరిగా ఎంక్వైరీ చేస్తున్నావా?’ అంటూ అతడిపై అంతెత్తున ఎగిరిపడ్డాడు.
దాంతో బార్బరు ఏమీ అనుకోకండి, వూరికే అడిగానుఅంటూ వెనక్కి తగ్గాడు.
మర్నాడు ప్రణబ్ ముఖర్జీ గారు తలపని చేయించుకోవడం కోసం వస్తే అదే బార్బరు తారసపడ్డాడు.
కత్తెర,కత్తీ పట్టుకుని  ఓపక్క పని చేస్తూనే, మళ్ళీ నోరు జారి బెంగాలీ బాబు గారిని కూడా అదే ప్రశ్న వేసాడు స్విస్ బ్యాంకూ,బ్లాకుమనీ గట్రా మతలబేమిటని.
ప్రణబ్ ముందు కలవరపడ్డా తమాయించుకుని ఈ ప్రశ్న నన్నే యెందుకు అడుగుతున్నావనిదబాయించాడు.
ప్రణబ్ కు  కోపం వచ్చిన సంగతి  గమనించిన బార్బరు వెంటనే ఆర్ధిక మంత్రికి క్షమాపణలు చెప్పాడు. ‘ఏదో మాటవరసకు అడిగాను, దయచేసి మరచిపోండి, మన్నించండి అని వేడుకున్నాడు.
మరునాడు తెలవారుతూనే సీబీఐ బృందం  ఆ సెలూనుపై దాడిచేసి  కేంద్రమంత్రులను బ్లాకు మనీ గురించీ, స్విస్ బ్యాంకు గురించి ఆరా తీసిన బార్బరును అదుపులోకి తీసుకుని విచారించడం మొదలు పెట్టింది.
నువ్వు రాం దేవ్ బాబా ఏజెంటువా?’
కాదు సార్! నాకే పాపం తెలియదు సార్
మరి అలాంటప్పుడు, క్షౌరం చేసేవాడివి ఆ పని చేయకుండా నీకు స్విస్ బ్యాంకు గురించీ, బ్లాకుమనీ గురించీ ఆరాలెందుకు?’
ఒక సంగతి చెప్పమంటారా సార్! అది మా వృత్తి రహస్యం. మాదగ్గరకు వచ్చే కాంగ్రెస్ 


మంత్రులను స్విస్ బ్యాంకు గురించి, బ్లాకు మనీ గురించి అడగ్గానే ఇక చూడండీ!  వాళ్ల 


వెంట్రుకలు  వున్నట్టుండి నిక్కబొడుచుకుంటాయి. అలాటి జుట్టు కత్తిరించడం సులభంగా


వుంటుంది. అందుకే అలా అడుగుతుంటాను.’ (05-05-2012)

3, మే 2012, గురువారం

కాంగ్రెస్‌ వాకిట్లో ఆగస్టు సంక్షోభం?


కాంగ్రెస్‌ వాకిట్లో ఆగస్టు సంక్షోభం?

(03-05-2012 సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

- మూడోసారి ఆశలు ఆవిరి కానున్నాయా?
- అధిష్ఠానం ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా?
- అసాధారణ సమస్యలతో రాష్ట్ర కాంగ్రెస్‌
- దిగజారుస్తున్న అధిష్ఠానం ఒంటెత్తు పోకడలు
- మసకబారిన ప్రధాని ప్రతిష్ఠ
- పట్టి పీడిస్తున్న అవినీతి, కుంభకోణాలు
- మిత్రపక్షాల కనుసన్నల్లో పాలన 


sonia-manmohan-అసలు కాంగ్రెస్‌ లో ఏం జరుగు తోంది? అధిష్ఠానం అన్నీ గమని స్తోంది అని తరచుగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయ కులు చెబుతుండే మాటలు నిజం కాబో తున్నాయా? రాష్ట్ర కాంగ్రెస్‌ను పట్టి కుదు పుతున్న రుగ్మతలకు శాశ్వత పరిష్కారం దిశగా అధిష్ఠానం పావులు కదుపుతోందా? వరసగా రెండోసారి అధికారంలోకి రాగలిగామని మూడేళ్ల క్రితం మురిసి పోయిన అపురూప క్షణాలు గత కాలపు ముచ్చటగా మారిపోతున్న నేపథ్యంలో, 2012 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా పార్టీని గెలిపించుకుని, రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకున్న ఆశలు కాస్తా ఆవిరి అయిపోతున్నాయేమో అన్న అనుమానం ఢిల్లీ పెద్దలకు కలిగిందా?

తాము కోరి ఎంపిక చేసుకొని నియమించిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ అంచనాలకు, ఆకాంక్షలకు అందకుండా వ్యవహరి స్తున్నారన్న అభిప్రాయం హస్తిన నాయకులను కలవర పెడుతోందా?
డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత రాష్ట్ర వ్యవహారాలను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న అధిష్ఠానం ప్రయ త్నాలు బెడిసికొట్టి, 1982 నాటి చరిత్ర పునరావృతం కాబోతున్నదన్న సందేహం పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతోందా?

ఇంతకీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
ఏమీ జరగకుండా అంతా సజావుగా ఉన్నపక్షంలో ఢిల్లీలోని అధిష్ఠానం పనుపున ఇంతమంది దూతలు ఇన్ని సార్లు హైదరాబాదు చక్కర్లు యెందుకు కొడుతున్నట్టు? సవాలక్ష సమస్యలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టి ఉన్న సమయంలో ముఖ్యమంత్రీ, పీసీసీ అధ్యక్షుడు ఇన్నిన్ని పర్యాయాలు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నట్టు?
సమాధానాలు తెలియని అనేక ప్రశ్నలు. ఒక వేళ తెలిసినా పైకి చెప్పుకోలేని అనేక ఆశక్తతలు. వెరసి ఈనాటి రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితి.ఆటు పోట్లు, హెచ్చు తగ్గులు, ముఠా తగాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు- ఇవన్నీ ఏ రాజకీయ పార్టీకయినా తప్పని తల నొప్పులే! కానీ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలు గమనిస్తుంటే ఆ పార్టీ అసాధారణ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నదన్న భావన కలుగుతోంది. ఏదో ఒక జబ్బుకయితే రోగనిర్ధారణ చేసి రోగ నిదానానికి ప్రయత్నం చేయవచ్చు.

ఒకదాని కొకటి పొసగని రుగ్మతలతో పడకేసిన కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి పూర్వవైభవం తేవడం మాట అటుంచి, పార్టీ తన కాళ్ళమీద తాను నిలబడేట్టు చేయడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడే వ్యవహారంగా కానరావడం లేదు. అందుకే, అనేక విచికిత్సల అనంతరం అధిష్ఠానం కాయకల్ప చికిత్సకు పూనుకున్నట్టుంది. బాగా ముదిరిపోయిన వ్యాధి ఏ చికిత్సకూ లొంగదు అన్న అనుమానం ఓ పక్క వేధిస్తున్నా, ఇక తప్పని సరై తానే కల్పించుకుని పరిస్థితులను ఏదో ఒక మేరకయినా చక్కదిద్దాలన్న ఆలోచనకు వచ్చినట్టుంది. బహుశా దాని ఫలితమే కాబోలు, ఇటీవల కాలంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో అధిష్ఠాన నాయకులు జరుపుతున్న నిర్విరామ చర్చలు, మరో వైపు తర్జని చూపుతూ చేస్తున్న హెచ్చరికలు!

నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇంతగా దిగజారి పోవడానికి ప్రధాన కారణం అధిష్ఠానం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలే. కానీ ఆ విషయం అధినాయకత్వం ముఖాన్నే చెప్పగల, చేవ కలిగిన నాయకుడేడీ? రాష్ట్ర కాంగ్రెస్‌ అస్తవ్యస్థ పరిస్థితికి సంబంధించి ముద్దాయి స్థానంలో ఉండాల్సిన అధిష్ఠానం తీర్పరి పీఠంపై ఉండడమే విషాదం. దీనికి తోడు - జాతీయ పార్టీ ముసుగులో ‘పేను పెత్తనం’ చేయాలనే ఆభిలాష అదనం.
తమది 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌ నాయకులు, తమ పార్టీ చరిత్రలో కలిసిపోకుండా చూసుకోవాలంటే తమ వ్యవహారశైలిని మార్చుకుని తీరాలి. నిర్ణయాలు ఢిల్లీలో తీసుకున్నా స్థానికంగా తీసుకుంటున్న అభిప్రాయాన్ని కల్పించాలి.

ప్రతి చిన్న విషయానికీ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్న అపప్రథ, రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నారు, చీటికీ మాటికీ ముఖ్యమంత్రులను మారుస్తున్నారన్న ఆరోపణ నిజానికి యూపీఏ-1 హయాంలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిన మాట వాస్తవమే. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల విషయంలో నాటి అధినేత్రి ఇందిరా గాంధీ అనుసరించిన వైఖరికి భిన్నంగా సోనియా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఆ రోజుల్లో ప్రబలింది. 2009 ఎన్నికల్లో యూపీఏ-2 ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా అధిష్ఠానం వ్యవహార శైలిలో వచ్చిన ఈ గుణాత్మక మార్పు దోహదం చేసిందని భావించేవారు అనేకమంది ఉన్నారు.

అయితే, కాంగ్రెస్‌ నాయకత్వంలో యూపీఏ మరోసారి అధికార పీఠం ఎక్కిన తరువాత అధిష్ఠానం తన పద్ధతికి కొంత దూరం జరుగుతున్నదేమో అన్న అభిప్రాయం కలుగుతోంది. మన్మోహన్‌ ప్రధానిగా మొదటి టరంలో సంపాదించుకున్న ప్రతిష్ఠ మసకబారడం మొదలయింది. లెక్కకు మిక్కిలి అవినీతి ఆరోపణలు, అనుదినం వెలుగు చూస్తున్న కుంభకోణాలు, ఎన్నికల్లో ఎదురీతలు, వీధికెక్కి సవాళ్లు విసురుతున్న మిత్రపక్షాలు, ఒకటేమిటి అనేకానేక సమస్యల అమావాస్యల నడుమ యూపీఏ -2 సంకీర్ణ ప్రభుత్వం నడి సంద్రంలో నావ మాదిరిగా కొట్టుమిట్టాడు తున్నది. న్యూక్లియర్‌ ఒప్పందం విషయంలో నాటి మిత్ర పక్షం సీపీఎం కు ధాటీగా బదులిచ్చి, మీ అవసరం మాకు లేదు అని దాష్ఠీకంగా జవాబు చెప్పగలిగిన కాంగ్రెస్‌ నాయకత్వం ఈనాడు మిత్రపక్షాల కనుసన్నల్లో పాలన చేయాల్సిన దుస్థితి లో ఉంది.

వారు చెప్పిన వారిని మంత్రిపదవి నుంచి తొలగిం చడం, పలానా వారినే తీసుకోవాలి, పలానా శాఖ ఇవ్వాలి అంటే జీ హుజూర్‌ అంటూ తల ఆడించడం- ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ఎంతటి శోభ కలిగిస్తుందో ఆ పార్టీ పెద్దలే చెప్పాలి. ఢిల్లీ స్తాయిలో తన పరిస్థితే ఇలా పెట్టుకుని- రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడానికి పూనుకోవడం అవివేకమే అయినా తప్పని బాధ్యతగా నెత్తికెత్తుకోవాల్సిన దుస్థితి. లోపల అయ్యవారేం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్న చందంగా తయారయింది. కానీ తప్పు దిద్దుకోవడానికి తరుణం కాదాయె.

Copy of bandaruముంగిట్లో 18 అసెంబ్లీ ఉపఎన్నికలు, ఒక లోకసభ ఉపఎన్నిక పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పాలుపోని పరిస్థితి. బహుశా నిర్ణయం అయిపోయింది, అమలు చేయడమే ఆలశ్యం అనే వాళ్లు కూడా ఉన్నారు.రాష్ట్రపతి ఎన్నిక అనంతరం ఆగస్టులో కాయకల్ప చికిత్స మొదలు పెడతారేమో! అప్పుడూ లొంగకపోతే, ఆఖరి ఔషధంగా గరళ వైద్యం తప్పదేమో! దుష్టాంగాన్ని ఖండించయినా శిష్టాంగాన్ని కాపాడమన్నారు కదా పెద్దలు. కాకపోతే, తొలగించే అంగాలు ఒకటా రెండా అన్నదే ప్రశ్న.

30, ఏప్రిల్ 2012, సోమవారం

డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు


 డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు 
ఈ కాలంలో సీటుకోసం వెంపర్లాడని వెర్రివాళ్ళెవ్వరుంటారు?
రాజకీయాలు తీసుకుంటే సర్పంచ్ సీటుతో ప్రారంభించి  సీఎం సీటు వరకు ఎగబాకాలనుకుంటారు.
సినిమాల్లో అయితే ఎగస్ట్రా పాత్రనుంచి మొదలుపెట్టిసెట్లో  వెనుక హీరో’ అనో హీరోయిన్ అనో రాసున్న సీటు సొంతం చేసుకోవాలని కలలు కంటారు.
మహాసభల్లో స్టేజీ మీద మొదటి వరస సీటు దక్కించుకోవాలనుకునేవారు కోకొల్లలు.
ప్రేక్షకుల్లో కూర్చోవాల్సిన పరిస్తితే వస్తే అక్కడా మళ్ళీ ముందు వరస కోసం వెతుకులాటే!
చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాలనుంచి పెద్ద పెద్ద సభలవరకూ ఈ సీట్ల గోల తప్పదు.
కెమెరా యాంగిల్ నుంచి వీ.వీ.ఐ.పీ. పక్క సీటు కోసం ఆత్రపడేవాళ్ళు తక్కువేమీ కాదు.
యాభై అరవై ఏళ్ళక్రితం పల్లెటూళ్ళకు వచ్చే బస్సుల్లో డ్రైవర్ పక్కన వుండే ఫ్రంటు సీటు కోసం వూళ్ళో మోతుబరులు పోటీపడేవారు.
ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు.  అమ్మ   (శ్రీమతి ఇందిరాగాంధి)  కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు.  ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేది. అంజయ్య గారు  ముందు సీటు ఎంపిక చేసుకోవడానికి నాకు మరో కోణం కనిపించేది.  ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ.  లైఫ్ బాయ్ ఎక్కడవుంటే  ఆరోగ్యం అక్కడ వుంటుంది’  అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం.  బాత్రూంబెడ్ రూముల్లో  కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.
ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ  కారుకు  యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం  పూర్తిగా మారిపోయింది. మంత్రులుముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా  యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు అభివాదం చెయ్యడానికీరెండు వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం  మరో కారణం.
ఇంతకీ ఈ సీట్ల గొడవ ఎత్తుకోవడానికి కారణం లేకపోలేదు.
ఆస్ట్రేలియాలో స్కై స్కానర్’ అనే ఓ వెబ్ సైట్ సంస్థకు ఏమీ తోచకతోడికోడలు పుట్టిల్లు ఎక్కడో తెలియక – తరచుగా విమానాల్లో ప్రయాణించేవారు  ఏ సీటు అంటే బాగా మక్కువ పడతారో లెక్కలు తేల్చడానికి ఏకంగా ఓ సర్వే చేపట్టింది. దానాదీనా తేలిందేమిటంటే చాలా ఎక్కువమంది గాలి తిరుగుబోతులు’  తాము ప్రయాణించే విమానాల్లో ‘6-A’ నెంబరు కలిగిన సీటును కోరుకుంటారట.
విమానం ఆగగానే ఆలశ్యం లేకుండా దిగిపోయేందుకు ఆ సీటు అయితే బాగా వుంటుందన్నది వాళ్ల అభిప్రాయం. అలాగే టాయిలెట్లు కాస్త దూరంలో వుండడం కూడా 6-A’ నెంబరు సీటు కోరుకోవడానికి కారణంగా చెబుతున్నారు. అలాగే, విమానం ముందు భాగంలో ఎడమవైపు వరసలో వుండే సీట్లు కూడా చాలామంది కోరుకునే సీట్లని ఈ సర్వే తేల్చింది.
పోతే ఎవ్వరూ కూడా  అంతగా ఇష్టపడని సీటు ఒకటి వుందని ఈ సర్వేలో తేలింది. అదేమిటంటే విమానం వెనుక భాగంలో రెండు సీట్ల నడుమ వుండే ‘31-E’ సీటట.
6-A’ నెంబరు సీటుకు డిమాండు వుందని తేలడంవల్ల గిరాకీని  బట్టి రేట్లు పెంచే సంస్కృతి కలిగిన విమానయాన సంస్తలు ఆ సీటుకు  ‘ప్రీమియం’  చార్జీ వసూలు చేసే అవకాశం లేకపోనూలేదని ఈ సర్వే చేసిన స్కై స్కానర్’ ట్రావెల్ ఎడిటర్  శామ్ బాల్డ్ విన్ మహాశయులవారు హెచ్చరిస్తున్నారు.
లాభం లేనిదే వ్యాపారి వరదను సయితం  లెక్కచేయకుండా ప్రయాణం పెట్టుకోడని సామెత.
కాబట్టి, సర్వేల్లో అసలు మతలబు ఇదన్నమాట.
సర్వేజనా సుఖినోభవంతు! (30-04-2012)

29, ఏప్రిల్ 2012, ఆదివారం

కప్పల గోల



కప్పల గోల
‘మనసు భద్రం తమ్ముడూ!’ అన్నాడో కవి.
ఎందుకంటే మనసు చేసే గందరగోళం ఇంతా అంతా కాదు. లేని దాన్ని సృష్టిస్తుంది. వున్నదానిని కానరాకుండా చేస్తుంది. మనసు చేసే మాయనుంచి బయటపడలేకపోతే ఇక ఆ ‘మనిషి గతి ఇంతే!’
చైనా లో ఓ నీతి కధ వుంది.
ఓ వయసు మళ్ళిన పెద్దమనిషికి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఇంటి పక్క మడుగులో వున్న కప్పలు రాత్రి వేళల్లో చేసే గోల.
మండూక సంతానం చేసే బెకబెకల శబ్దాలు ఆ పెద్దమనిషికి చిన్నపాటి కునుకు కూడా పట్టకుండా చేస్తున్నాయి. వాటి బెడద వొదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఆసామీ పొరుగున బస్తీలో హోటల్ నడుపుతున్న మరో పెద్ద మనిషిని సంప్రదించాడు.
‘నా దగ్గర ఓ లక్ష కప్పలు వున్నాయి. మీరు కొంటానంటే రోజూ ఓ వేయి కప్పలయినా సప్లయి చేస్తాను’
బస్తీ పెద్దమనిషి సంతోషంతో కప్పలా గెంతబోయి వెంటనే తమాయించుకుని, రోజూ ఓ వెయ్యి కొనడానికి  పల్లెటూరి పెద్దమనిషితో ‘కప్పల బేరం’ కుదుర్చుకున్నాడు.
వూరికెళ్లిన పెద్దమనిషి మర్నాడే తిరిగొచ్చాడు. ఆయన చేతిలో రెండే రెండు కప్పలు వున్నాయి.
‘మిగిలినవేవి?’ అని బస్తీ మనిషి అడిగాడు.
‘రాత్రిళ్ళు  అవి చేసే బెకబెకల ధ్వనులు విని ఆ మడుగులో కనీసం ఓ లక్ష కప్పలయినా వుంటాయని భ్రమ పడ్డాను. తీరా చూస్తే అంత గోల చేస్తున్నవి ఈ రెండే!’ పల్లెటూరి మనిషి బదులు చెప్పాడు.
అంటే ఏమిటన్న మాట!
చుట్టూ జగమంతా నిద్రిస్తున్నప్పుడు, వొంటరితనం వేధిస్తున్నప్పుడు మనసు చేసే అల్లరి ఇది. చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. (29-04-2012)