2004లో ఎన్నికలు ముగిశాయి. వై ఎస్
నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. ప్రత్యర్ధి శిబిరం టీడీపీ తో
పాటు కాంగ్రెస్ లోని కొన్ని వర్గాల్లో
కలవరం. వైఎస్ ముఖ్యమంత్రి అయితే ఎలా! ఈ రాష్ట్రం ఏమైపోతుంది. పార్టీలు సరే.
అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లలో కూడా ఇదే కలవరపాటు. ఆందోళన.
పాత జానపద చిత్రాలలో రాజుగారి సైనికులు
వూళ్ళపై పడి దోచుకునేవారు. ఆడవారిని చెరపట్టేవారు. ఇలాంటి సన్నివేశాలు
దర్శనమిస్తాయని నోళ్ళు నొక్కుకున్నారు.
కానీ తర్వాత ఏం జరిగింది. రౌడీ మూకలు వీధుల్లో
స్వేచ్చావిహారం చేయలేదు. ఇళ్ళపై పడలేదు. ముఠాకక్షలు, కార్పణ్యాలు ప్రబలలేదు.
హత్యలు, మాన భంగాలు జరగలేదు. అధికారులను వేధించలేదు. అసలు కర్ఫ్యూ అనేది గతకాలపు
ముచ్చట అయింది. పై పెచ్చు అనేక కొత్త కొత్త ప్రజా సంక్షేమ పధకాలకు ఆయన పాలనా కాలం ఒక సాక్ష్యంగా
నిలిచింది.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ఇతర
ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాడు. ఎందుకంటే
మనది రాజ్యాంగానికి కట్టుబడి నడిచే వ్యవస్థ కనుక.
ఈ మధ్య ఓ ఇష్టాగోష్టి సమావేశంలో మాజీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకరు ఈ సంగతి చెప్పారు.
కాబట్టి ఎన్నికల ద్వారా అధికారంలోకి
వచ్చిన ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిందే. అంతే కాని జానపద చిత్రాల్లో మాదిరిగా దుందుడుకు
ధోరణితో పాలించడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విధంగా సాగుతున్న ప్రచారానికి
ఎలాంటి ప్రాతిపదిక లేదని ఆయన చెప్పిన మాటల తాత్పర్యం.