మాజీ ముఖ్యమంత్రి అంజయ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మాజీ ముఖ్యమంత్రి అంజయ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మే 2024, శుక్రవారం

గతం గుర్తులు



నాలుగు దశాబ్దాల కిందటి ముచ్చట.
ముఖ్యమంత్రి అంజయ్య గారిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే అంజయ్య గారు తన పదవికి  రాజీనామా చేసారు. మర్నాడు – కొత్త నాయకుడి ఎన్నిక. అప్పటికి  ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ జ్వాలా కలసి ఆయన వెస్పా స్కూటర్ మీద చిక్కడ పల్లి నుంచి ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి బాగా పొద్దు   పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ లేదు.  మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్ – ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షికను నా జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈ గడ్డ”.
(ఇప్పుడు సాక్షి పత్రిక ఎడిటర్ వి.మురళి ఆ హెడ్డింగు పెట్టారు. అప్పట్లో ఆయన ఆ పత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు)

25, అక్టోబర్ 2013, శుక్రవారం

అంజయ్య గారితో నా అనుభవాలు

రాజీవ్ గాంధీ - అంజయ్య గురించి రాసిన తరువాత అనేకమంది అంజయ్య గారి గురించి రాయమని కోరారు. లోగడ రేడియో అనుభవాల్లో అనేక సందర్భాల్లో అంజయ్య గారి గురించి ప్రస్తావన వుంది. వాటిని కాస్త కుదించి, అంజయ్య గారికి మాత్రమే పరిమితం చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. పునరుక్తి దోషం అని ఎవరికయినా అనిపిస్తే మన్నించండి. 


(ఏదో సినిమాలో రాళ్ళపల్లి చెప్పినట్టు టేప్ రికార్డర్ పట్టుకుని ఈ పక్కన నేను, ఆ పక్కన అంజయ్య గారు. మా మధ్యలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ చైర్మన్  శ్రీ వై.వి.ఎస్. మూర్తి)

ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు.  అమ్మ   (శ్రీమతి ఇందిరాగాంధి)  కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు.  ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేది. అంజయ్య గారు  ముందు సీటు ఎంపిక చేసుకోవడానికి నాకు మరో కోణం కనిపించేది.  ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ.  లైఫ్ బాయ్ ఎక్కడవుంటే  ఆరోగ్యం అక్కడ వుంటుంది’  అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం.  బాత్రూంబెడ్ రూముల్లో  కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.

ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ  కారుకు  యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం  పూర్తిగా మారిపోయింది. మంత్రులుముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా  యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు అభివాదం చెయ్యడానికీరెండు వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం  మరో కారణం.