సూటిగా...సుతిమెత్తగా......భండారు
శ్రీనివాసరావు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక మంచి సాంప్రదాయానికి తెర
తీశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను విడివిడిగా ఢిల్లీ పిలిపించుకుని
ఆయా రాష్ట్రాలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ
క్రమంలో తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు. తెలంగాణా
కొత్త రాష్ట్రం ఎదుర్కుంటున్న కొన్ని సమస్యలపై కేంద్రం స్పందన గురించి ఆ
వెనువెంటనే ప్రధాని మోడీ ట్విట్టర్ లో
ట్వీట్ కూడా చేశారు.
పొతే, చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటన
వల్ల వాయిదా పడ్డ ప్రధానితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం మొన్న మంగళవారం
హస్తినలో జరిగింది. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా హాజరయిన ప్రధానితో భేటీ
సుదీర్ఘంగా సాగింది. చంద్రబాబు నాయుడు తనదయిన పద్ధతిలో పవర్ పాయింటు ప్రెజెంటేషన్
కూడా ఇచ్చారు. దానితో పాటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్కెల జాబితాతో కూడిన వినతి
పత్రం కూడా ప్రధానికి అందచేశారు. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీతో
విడిగా చర్చలు జరిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ
ఇవ్వాల్సిన అవసరం గురించి నొక్కి చెప్పారు. ముందు కొద్దిసేపు అనుకున్న ఈ ముఖాముఖి
భేటీ దాదాపు ఇరవై నిమిషాలు సాగిందని సమాచారం. అనేక విషయాల్లో తన అంతరంగ ఆవిష్కరణకు
ముఖ్యమంత్రి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉంటారనడంలో సందేహం లేదు.
ప్రధానితో తాను జరిపిన సమావేశం వివరాలను గురించి ఆ తరువాత
చంద్రబాబు నాయుడు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలియచేశారు. సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని,
ప్రత్యేక హోదా విషయంలో ఆందోళన చెందవద్దని,
ఆ అంశంలో ముడివడివున్న సున్నితత్వం తనకు తెలుసని ప్రధాని తనతో చెప్పారని చంద్రబాబు తెలియచేసారు. అంతేకాని,
కేసీఆర్ విషయంలో జరిగినట్టు ప్రధాని
పనుపున కానీ, ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా కానీ ఎటువంటి వివరణ వెలువడినట్టు సమాచారం
లేదు.
విలేకరుల సమావేశంలో చంద్రబాబునాయుడు
నాయుడు మాట్లాడిన తీరు, ఆయన హావభావాల్లో తొంగిచూసిన రవంత అసహనం, ఆందోళన గమనిస్తే,
ప్రత్యే క హోదా విషయంలో ప్రధాని మోడీ నుంచి స్పష్టమైన హామీ లభించిన దాఖలా
కానరాలేదు.
ముఖ్యమంత్రి మాటలను బట్టి, సమావేశం జరిగిన తీరు కొంత అర్ధం చేసుకోవచ్చు.
కొన్ని సున్నిత అంశాల విషయంలో ఆయన
బిగబట్టుకుని మాట్లాడుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కానవచ్చాయి.
ఒక ముఖ్యమంత్రిగా తాను ఢిల్లీలో
అడుక్కోవాల్సిన పరిస్తితి దాపురించినదని ఆయన అనడం ఆయనలో కొన్నాళ్ళుగా రగులుతున్న ఆవేదనకు అద్దం పట్టింది.
కాకపోతే ఈ పరిస్తితికి కారణం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నెపం ఆ పార్టీపై
మోపారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన నేతగా నేటి పరిస్తితి ఆయనకు నిజంగా వేదన కలిగించే విషయమే.
ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి.
చంద్రబాబునాయుడు ఈనాడు అప్పాయింట్ మెంట్
తీసుకుని ఢిల్లీలో కలుస్తున్న నాయకుల్లో
అనేకమంది, గతంలో ఆయన్ని కలుసుకోవడం కోసం,
ఒక్క క్షణం పాటయినా ఆయన దృష్టిలో పడడం కోసం ఢిల్లీ ఏపీ భవన్ ఆవరణలోని చెట్లకింద నిరీక్షించడం తెలిసిన వారికి
ఈసంగతి బాగా అర్ధం అవుతుంది. నాటి స్తితిని నేటితో పోల్చి చూసుకున్నప్పుడు ఆయనలో
అసహనం కట్టలు తెంచుకోవాలి. కానీ, పరిణతి
చెందిన రాజకీయ చాతుర్యం బహుశా ఆయన్ని ఇంత నిగ్రహంగా వ్యవహరించేలా చేస్తోందని
అనుకోవాలి.
హోదా విషయంలో అన్ని పార్టీలు స్పందించాలని చంద్రబాబు కోరారు.
ఇది ఒక్క బీజేపీ బాధ్యత మాత్రమె కాదని అంటూ, నాడు విభజన సమయంలో అన్ని పార్టీలు వున్న
విషయాన్నీ ఆయన గుర్తు చేసారు.
ఇవన్నీ ఆయన గతంలో అనేక పర్యాయాలు
చెప్పిన విషయాలే.
కానీ, ఇలా ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు
ఇలా వివరణలు, సంజాయిషీలు ఇస్తూ పోవాలి?
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిని
కలిసి వచ్చిన తరువాత ఇంతకంటే తీయని కబురు ఏదో చెబుతారని ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక
హోదా పట్ల ఆశలు పెట్టుకున్న వాళ్ళు నిరాశపడ్డారు.
అయితే, ఈ విషయంలో గత కొంత కాలంగా రాష్ట్ర స్థాయి బీజేపీ, టీడీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఆరోపణలు,
ప్రత్యారోపణలు గమనిస్తున్న వారికి మాత్రం ఇది ముడిపడే విషయం కాదని అర్ధం అవుతూనే వుంది.
ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కేంద్రం ఇవ్వాలనే
డిమాండు ఆంధ్రప్రదేశ్ నాయకుల నుంచి పెరుగుతోంది. చివరికి ఇది ప్యాకేజీకి పరిమితం
అయినా ఆశ్చర్యపోనక్కర లేదు. ముఖ్యమంత్రి
స్పష్టంగా చెప్పకపోయినా ఈ విషయంలో అస్పష్టతతో కూడిన కొంత స్పష్టత ఇచ్చారనుకోవాలి.
అర్ధరాజ్యం కాకపోయినా అయిదూళ్ళయినా పాండవులకు ఇవ్వాల్సిందని దూతగా హస్తిన వెళ్ళిన శ్రీకృష్ణుడు కౌరవరాజు దృతరాష్ట్రుడుని కోరతాడు.
సుయోధనుడు అందుకు కూడా సమ్మతించకపోవడంతో చివరకు సమరమే శరణ్యమవుతుంది.
అభినవ భారతంలో కూడా ఇదే జరుగుతుందా?
బీజేపీ, టీడీపీ ల నడుమ దోస్తీ బీటలు వారుతుందా?
గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర
రాజకీయాలను గమనిస్తున్న వారికి ఒక విషయంలో స్పష్టత వుంది. రాజకీయ పార్టీల నడుమ
సఖ్యత కానీ, దోస్తీ కానీ, పొత్తు కానీ, దాన్ని ఏ పేరుతొ పిలుచుకున్నా అది
తాత్కాలికమే. ఎందుకంటే, ఇటీవలి కాలంలో ఇటువంటి పొత్తులకు సిద్దాంతాలు, సూత్రాలు
కాకుండా రాజకీయ అవసరాలు ప్రాతిపదిక అవుతున్నాయి. నిబద్ధత లోపించినప్పుడు స్నేహాలు
చిరకాలం నిలబడడం కష్టం.
టీడీపీ, బీజేపీ స్నేహం ఎన్నాళ్ళు
సాగుతుంది అనేది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. అది వారి సమస్యాకాదు. కాకపోతే ప్రత్యేక హోదా అనే విషయంలో వారికి ఆసక్తి వుంది.
ప్రత్యేక హోదా సంజీవని కాదని కూడా ప్రజల్లో అధిక సంఖ్యాకులకు అర్ధం అయిపోయింది.
అయితే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని రాజకీయ పార్టీలు తమని ఈ విషయంలో
వంచిస్తున్నాయేమో అనే భావన ప్రబలినప్పుడే అసలు కష్టాలు మొదలవుతాయి. ఈ కష్టాలు ముందు మెడకు చుట్టుకునేది కూడా ఆ
రాజకీయ పార్టీలకే. ఎందుకంటే, ప్రత్యేక హోదా అనేది కొత్త రాష్ట్రానికి యెంత అవసరమో
సాకల్యంగా వారికి వివరించి చెప్పింది అవే
కాబట్టి. ఆ అంశం ముదిరి పాకానపడి భావోద్వేగ స్వరూపాన్ని సంతరించుకున్నప్పుడు అసలు కధ
మొదలవుతుంది. అప్పుడు ప్రజలకు నచ్చచెప్పడం
పార్టీలకే కాదు, బ్రహ్మకు కూడా తరం కాదు.
పాండవోద్యోగ విజయాల్లో శ్రీకృష్ణుడు
చేసిన హితబోధ ఇదే.
‘క్రమక్రమముగా కొలువు కూటము రణకూటమగుచున్నది,
పదుగురున్నప్పుడే కురురాజా నా మాటలు ఆలకింపుడు’ అంటూ, జరిగింది, జరుగుతున్నది,
జరగబోయేది అన్నీ అయిదు పద్యాల్లో ముందస్తుగానే తెలియ చేస్తాడు సమస్తం ఎరిగిన కృష్ణ
పరమాత్మ.
అందుకే సుతిమెత్తగా చెబుతున్న ఈ సూటి మాట.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పటికే జనంలో బాగా
పాకిపోయింది. అది సంజీవనా, కాదా! మంత్రం
దండమా కాదా! సర్వరోగ నివారిణా కాదా అనే మీమాంసతో
నిమిత్తం లేని దశకు వారు చేరుకుంటున్నారు. ఈ అగ్గికి ఆద్యం పోసేవాళ్ళు ఎట్లాగు
సిద్ధంగా వుంటారు. అలా అని వారిని తప్పుపట్టడం సరికాదు. రాజకీయ పార్టీలు రాజకీయమే
చేస్తాయి.
ఈ పరిస్థితికి మీరంటే మీరు కారణం అంటూ
ఒకరినొకరు దెప్పుకుంటుంటే ప్రజలు
నమ్ముతారని అనుకోవడం వుట్టి భ్రమ. కాకపోతే, ఆయా పార్టీల వీరాభిమానులు తమ పార్టీల
వాదనకు అనుగుణంగా చెలరేగిపోతుండవచ్చు. అదంతా ప్రజాభిప్రాయం అనుకుంటే ఎవరిని వారు
మోసం చేసుకోవడమే అవుతుంది.
కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా
ఇచ్చి తీరాలని ప్రతి పార్టీ విడివిడిగా కోరుతూనే వుంది. కానీ ఒక్క తాటిపై నడవాలని
కానీ, ఒక్క మాటపై నిలబడాలని కానీ ఏ ఒక్క పార్టీ కోరుకోవడం లేదు. రాష్ట్ర విభజన
సమయంలో కూడా సీమాంధ్ర ప్రాంతం రాజకీయ
నాయకులు ఇదే తప్పిదం చేశారు. మళ్ళీ అదే పునరావృతం అవుతుంటే పార్టీలతో నిమిత్తం
లేనివారికి బాధగా ఉంటోంది.
రాజకీయ లబ్ది అనే కోణం ఒదిలిపెట్టి ఇప్పుడు
జరగాల్సింది ఒక్కటే. ప్రజలకు వున్నది వున్నట్టు చెప్పడం. నిజాయితీతో చెప్పే చేదు
నిజాలను సయితం స్వీకరించే సాధుగుణం ఇంకా జనంలో సజీవంగానే వుంది. కానీ,
ప్రతిదీ రాజకీయకోణం నుంచి చూడడం మానేసి కనీసం ఒక్కసారయినా రాజకీయ నాయకులు నిబద్ధతతో
ప్రజలముందుకు రావాలి.
పరిష్కార మార్గాలు మూడే మూడు.
ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన
హామీకి కట్టుబడి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా తనంత తానుగానే
ఆ ప్రకటన చేయడం.
ప్రత్యేక హోదాకు ఏవయినా సహేతుకమైన
కారణాలు అడ్డు పడుతుంటే వాటిని కేంద్రంలోని బీజేపీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
స్వయంగా వివరించి, పరిహారంగా భారీ
సాయాన్ని ప్రకటించి, నిధులను వెంటనే విడుదల చేయడం.
ఇవేవీ కుదరవు అనుకుంటే, టీడీపీ, బీజేపీ
నాయకులు లేనిపోని మాటలతో, వాగ్వాదాలతో పొద్దుపుచ్చే వైఖరికి స్వస్తి చెప్పి రాజకీయ
రణక్షేత్రంలో నేరుగా తలపడడం.
నిష్టూరమనిపించినా, టీడీపీ, బీజేపీలు
మరో వాస్తవం గుర్తు పెట్టుకోవాలి.
ప్రత్యేక హోదా వల్ల కానీ, ప్రత్యేక
ప్యాకేజీ వల్ల కానీ రాజధాని కూడా లేకుండా ఏర్పడ్డ కొత్త రాష్ట్రానికి మంచి మేలే
జరుగుతుంది. అంతేకాకుండా, ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలుగు దేశం పార్టీకి,
ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిధుల కొరత నుంచి మంచి ఉపశమనం చిక్కుతుంది.
చేయవలసిన పనులు సకాలంలో చేసి వచ్చే ఎన్నికలనాటికి పార్టీని సంసిద్ధం చేసే రాజకీయ వెసులుబాటు
లభిస్తుంది. ఈ రీత్యా ప్రధానమైన రాజకీయ లబ్ది చేకూరేది తెలుగు దేశం
పార్టీకే. అల్లాగే, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారనే ఆదరణ ప్రజల్లో దొరికేది భారతీయ
జనతా పార్టీకి. కానీ, అటు వైసీపీకి కానీ, మరో వైపు కాంగ్రెస్ కు కానీ ప్రస్తుతానికి పెద్దగా ఒనగూడే రాజకీయ ప్రయోజనం ఏమీ వుండదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర
ప్రభుత్వాన్ని మెడలు వంచి ఒప్పించాం అని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప.
వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాల్సిన
విషయాలను ఒదిలిపెట్టి, ప్రజలను భావోద్వేగాలకు గురిచేయడం వల్ల అసలే ఇబ్బందుల్లో వున్న కొత్త రాష్ట్రానికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిన వాళ్ళు
అవుతారు.
ఈ విషయంలో సీమాంధ్ర పార్టీలు, పొరుగున
వున్న తెలంగాణాలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతున్న తరుణంలో అక్కడి పార్టీలు అనుసరించిన
ఐక్యతా విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
అంతేకాని, వైసీపీ టీడీపీని, టీడీపీ
వైసీపీని, బీజేపీ కాంగ్రెస్ నీ, కాంగ్రెస్ బీజేపీని తప్పులెన్నే తప్పుడు విధానాలనుంచి
తక్షణం తప్పుకోవాలి.
ప్రజల ప్రయోజనాలను ఏ పార్టీ కాపాడుతుందో, అ పార్టీ ప్రయోజనాలను
ప్రజలు కాపాడతారు.
(18-05-2016)