ఒక్కోరోజు అంతే, మన చేతుల్లో లేకుండా మంచి వాళ్ళతో గడిచిపోతుంది.
‘పోదామా?’ అంటాడు జ్వాలా ఫోనులో.
సహజబద్ధకం ‘నో’ అనమంటుంది. పొతే, ‘పోయొస్తే
పోలా’ అంటూ వెనకనుంచి మా ఆవిడ రాగాలు.
అందుకోసమే ఎదురుచూస్తున్నట్టు వెంటనే ‘ఓకే’ అనేయడం. ఇలా చేయడం వల్ల గతంలో కూడా అనేకమంది పెద్దవాళ్ళను కలవడం జరిగింది. గిరీశం అన్నట్టు అలాంటివాళ్ళతో మాట్లాడ్డం ఒక ఎడ్యుకేషన్.
పొత్తూరి వారు అక్షరాలా పెద్దమనుషులు.
వారి వస్త్ర ధారణ, మాట తీరు, చిన్నలను మన్నించి పలకరించే పధ్ధతి, ఇవన్నీ ఎప్పుడు
అలవడతాయి అనిపిస్తుంది ఆయన్ని చూసినప్పుడు. పొత్తూరి వారి వయస్సు ఎనభయ్ మూడు. నాదీ
కాస్త అటూఇటూగా డెబ్బయ్యవ పడి. ఇక ఇప్పుడు ఈ అనుకరణలు ఎందుకు వృధా అని ఆదుర్తి
సుబ్బారావు గారి సినిమాలోలా లోపల నుంచి ఆత్మారాముడి గగ్గోలు.
కాసేపట్లోనే చాలా కబుర్లు చెప్పారు
పొత్తూరి గారు. అవన్నీ రాసుకుంటే సొంతంగా ఒక పుస్తకం వేసుకోవచ్చు. కానీ, ఆయన్ని కలవడానికి
వెళ్ళిన స్వార్ధపు ఆలోచన వేరే వుంది. ఆయన రాసిన ‘అమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయడు’ అనే పుస్తకం
ఆయనను అడిగి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో వెళ్లాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు ఈ మధ్యనే ఆ పుస్తకాన్ని
ఆవిష్కరించారు.
(‘నాయడు’ అని నేను తప్పుగా రాయలేదు, అలా
రాయడానికి కారణం రచయితే పేర్కొన్నారు ఆ పుస్తకంలో, అయినా నాకు
ఇప్పటికీ ఆయన పేరు, వాసిరెడ్డి వేంకటాద్రి ‘నాయుడు’ అనే అనిపిస్తుంది)
ఈ పుస్తకం పట్ల నా ఆసక్తికి బాదరాయణ సంబంధం లాంటి మరో కారణం వుంది. అదేమిటంటే, వాసిరెడ్డి
వెంకటాద్రినాయుడు కట్టించిన శివాలయం మా వూరు కంభంపాడులో వుంది. (ఆయన ఇలా అనేక
గ్రామాల్లో మొత్తం 108 గుళ్ళు కట్టించారని ప్రతీతి).
మా తాతల కాలం నుంచి మా వూరి గుడికి మా
వంశస్తులే ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్నారు.
(ఆ పుస్తకం గురించి మరో సారి, అలాగే ఈ
రోజు అనుకోకుండా వెళ్లి కలిసిన మా రేడియో సహోద్యోగి మాడపాటి సత్యవతి గారి గురించి
కూడా)
