‘సూర్య’ దినపత్రికలో గత అయిదారేళ్ళుగా,
’సూటిగా..సుతిమెత్తగా...’ శీర్షికతో వారానికి
రెండు పర్యాయాలు ఆర్ధిక, సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు రాస్తూ వస్తున్న భండారు శ్రీనివాసరావు,
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు ‘తాపీ ధర్మారావు’ పేరిట ఇచ్చే ‘పత్రికారచన’ కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు.
ఈ నెల 12 వ తేదీ గురువారం, సాయంత్రం నాలుగు
గంటలకు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో,
ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధక్షతన జరిగే
కార్యక్రమంలో తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సి. లక్ష్మారెడ్డి చేతుల
మీదుగా భండారు శ్రీనివాసరావు ఈ
పురస్కారాన్ని స్వీకరిస్తారు. ఈ పురస్కారం కింద రు.5,116 నగదు, శాలువా, ప్రశంసాపత్రం
అందచేస్తారు.
తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు శ్రీ కే.వీ.రమణాచారి,
ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి శ్రీ దేశపతి శ్రీనివాస్ కార్యక్రమంలో ముఖ్య
అతిధులుగా పాల్గొంటారని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కే. తోమాసయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసుకు చెందిన
భండారు శ్రీనివాసరావు గతంలో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలోనూ, హైదరాబాదు దూరదర్సన్ వార్తా విభాగంలోనూ వివిధ హోదాల్లో సుమారు మూడు దశాబ్దాలపాటు పనిచేసారు. భారత
ప్రభుత్వం పనుపున మాస్కోలోని రేడియో మాస్కో తెలుగు విభాగంలో కూడా అయిదేళ్లపాటు న్యూస్ రీడర్ గా పనిచేసారు. పదవీవిరమణ
అనంతరం వార్తాపత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. టీవీ ఛానళ్ళ చర్చల్లో రాజకీయ
విశ్లేషకుడిగా పాల్గొంటున్నారు.
భండారు శ్రీనివాసరావుతో పాటు, వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన మరో 35 మంది కూడా కీర్తి పురస్కారాలు అందుకుంటారు.