చిన్నతనంలో చేసిన తప్పులు గుర్తుకు
వస్తున్నాయి.
“అక్కయ్య ఉత్తరం రాసింది. కాస్త చదివి
పెట్టరా!” అంటూ కార్డు ముక్క చేతిలో పెడుతూ అడిగేది అమ్మ. భారత భాగవతాదులు ఆమెకు కంఠతా
వచ్చు. కానీ చదవలేదు, రాయలేదు. ఓ బెల్లం ముక్క ఆశ పెడితే కానీ కార్డులో ఏముందో
చదివి పెట్టేవాణ్ని కాదు. అప్పుడు అమ్మ నాతొ యెంత అవస్థ పడిందో ఇదిగో ఇప్పుడు అరవై
ఏళ్ళ తరువాత తెలిసివస్తోంది.
కంప్యూటర్ మీద పనిచేయడం రాదా అంటే
వచ్చు. అది మధ్యలో మొరాయిస్తే ఏం చేయాలో తెలియదు. పిల్లల్ని అడిగితే కాదనరు కానీ
వాళ్ళ తొందర్లో వాళ్ళు వుంటారు. తమకు తెలిసింది చెబుతారు. తలకు ఎక్కకపోయినా
తెలిసినట్టు తలూపుతాము. ఎందుకంటే ఎంతయినా వాళ్ళకంటే పెద్దవాళ్ళం కదా!
మొబైల్ బిల్లు కట్టాలి. పిల్లలు
చెప్పినట్టే అన్ని స్టెప్పులు వేస్తాం. చివర్లో ఓటీపీ అంటుంది. మొబైల్ కు
వస్తుంది. అది చూసుకుని మళ్ళీ కంప్యూటర్లో తల దూర్చేసరికి టైం అయిపోతుందో ఏమో
మళ్ళీ కొత్త ఓటీపీ అంటుంది. ఈసారి సరిగానే సరి చూసుకుని టైప్ చేసి సబ్మిట్ నొక్కుతాము.
అమ్మయ్య పనయి పోయిందని సంతోషపడేలోగా ఎర్ర్రర్ అని వస్తుంది. కధ మళ్ళీ మొదలు.
ఇంతకీ డబ్బు పోయినట్టా, అసలుకే పోయినట్టా! కొత్త మనాది మనదవుతుంది.
అమ్మా! ఎక్కడున్నావమ్మా! అప్పుడు
ఏడిపించినందుకు ఇప్పుడు నవ్వుకుంటున్నావా తల్లీ!