చంద్రబాబు పాదయాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చంద్రబాబు పాదయాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, అక్టోబర్ 2012, గురువారం

చంద్రబాబు పాదయాత్ర



చంద్రబాబు పాదయాత్ర 

సరిగ్గా 35 సంవత్సరాల క్రితం స్థానికులకు ఏమాత్రం పరిచయం లేని ఓ యువకుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించాడు. గడప గడప తొక్కాడు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించాడు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించాడు. ఊరి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.

ఆనాడు   

రచ్చబండ్లమీద,  ఇళ్ళ అరుగుల మీద  సేద తీరాడు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల  వద్దే అడ్డంకులు ఎదురయినా  మడమ తిప్పలేదు. ఓ జత దుస్తులు, కాలికి చెప్పులు, తోడుగా కొందరు యువకులు..ఇంతకూ మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా  కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ దిరిగాడు. రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని   ఎన్నికల్లో గెలిచాడు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టాడు.


ఈనాడు 


ప్పటికింకా  నిండా  మూడుపదులు నిండని ఆ యువకుడే మళ్ళీ ఈనాడు ఆరుపదులు పైబడిన  వయస్సులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పునర్వైభవం కోసం తిరిగి కాలినడకను ఎంచుకుని ‘వస్తున్నా మీకోసం’ అంటూ సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నాడు. కాకపొతే, అప్పటికీ ఇప్పటికీ ఎన్నో తేడాలు కొట్టవచ్చినట్టు కానవస్తాయి. అప్పుడు జత దుస్తులు, చెప్పులతో, వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో  కార్యకర్తలను వెంటేసుకుని,  మందీ మార్భలం, హంగూ ఆర్భాటం  లేకుండా తిరిగిన చంద్రబాబు,  ఈనాడు విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న డ్యూమాక్స్ స్పోర్ట్స్ షూ ధరించి, కుడియెడమల పార్టీ  నాయకులు, కార్యకర్తలు వెంట నడుస్తుండగా ,  ప్రత్యేకంగా రూపొందించి రికార్డు చేసిన పాదయాత్రా గీతాలు హోరెత్తిస్తుండగా, ‘రాజువెడలె రవితేజములడరగ’  అన్నట్టు పాదయాత్రకు నడుం కట్టారు. ఈనాటి పరిస్థితుల్లో ఇవన్నీ తప్పనిసరి ఆర్భాటాలు. పైగా తొమ్మిదేళ్ళ పైచిలుకు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. రెండు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో వోడించి సమర్ధుడైన  ముఖ్యమంత్రిగా దేశవిదేశాల్లో మన్ననలందుకున్న రాజకీయ నాయకుడు. ప్రచారం ద్వారా రాజకీయ లబ్ది పొందే విషయంలో ఆయువుపట్లన్నీ  తెలిసిన వాడు.  తెలుగుదేశం పార్టీకి  పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలలో  ఏఒక్క చిన్న అంశాన్ని కూడా విస్మరించినా అది కూడదీసుకోలేని  తప్పిదం కాగలదన్న ఎరుక గలిగిన రాజకీయ దురంధరుడు. అందుకే, ఈ యాత్రకు పేరు పెట్టడం దగ్గరనుంచి, యాత్రసాగే మార్గం నిర్ణయించే వరకు ఆయన  అనేక రోజులపాటు సహచరులతో మంతనాలు జరిపారు. పార్టీకి  చెందని నిపుణులను  కూడా విశ్వాసంలోకి తీసుకుని, యాత్ర సందర్భంగా చేసే ప్రసంగాలు, ప్రజలను ఆకట్టుకునే హావభావాలు వంటివాటిల్లో గట్టి కసరత్తు చేసారని వినికిడి. అలాగే ఈ విధమయిన సుదీర్ఘ  పాదయాత్రల్లో  ఎదురయ్యే సాధకబాధకాలు, శారీరక ఇబ్బందులు  అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పిమ్మటనే ఆయన ఈ సాహస నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న క్లిష్ట పరిస్తితిని దృష్టిలో వుంచుకుని ఆలోచిస్తే,  తెలుగు దేశాన్ని  వొడ్డున పడేయడానికి ఇంతకంటే మరో దారి కనిపించని స్తితిలోనే,   ఆయన ఇంతటి ధైర్యం చేసినట్టు తోస్తోంది. ఉప ఎన్నికల్లో వరస పరాజయాలు, కట్టుతప్పుతున్న పార్టీ శ్రేణులు, నాయకత్వ పటిమపట్ల  తలెత్తుతున్న సందేహాలు, ప్రాంతాల పరంగా  నాయకుల్లో  రగులుతున్న విద్వేషాలు, రాజకీయ వారసత్వం గురించి కుటుంబ సభ్యుల్లో పొటమరిస్తున్న విభేదాలు  ఇలా వొకటి కాదు రెండు కాదు అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు పాదయాత్రకు మించిన ప్రత్యామ్నాయం  కనిపించకనే అలవికి మించిన ఈ భారాన్ని తలకెత్తుకున్నారనిపిస్తుంది.
రాజకీయ రణ క్షేత్రం లో వున్నవారు కొన్ని కఠిన వాస్తవాలను గమనం లోకి తీసుకోకతప్పదు. తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీ వరసగా రెండు పర్యాయాలు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితుల్లోవుండిపోయి,  మూడోసారి కూడా  అధికార పీఠాన్ని అందుకోలేకపోతే, పార్టీ శ్రేణులు  కట్టుతప్పిపోకుండా  నిభాయించగలగడం అన్నది  ఎంతటి  సమర్ధుడైన నాయకుడికి కూడా అలవికి మించిన వ్యవహారమే.  అందుకే,  రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు టీసుకోక తప్పని స్తితి. ఈ క్రమంలోనే,  వివిధ సామాజిక  వర్గాలను ఆకర్షించేవిధంగా వరుస వెంట విడుదల చేస్తున్న డిక్లరేషన్లు ఈ క్రమంలో పురుడుపోసుకున్నవే.’ ఇప్పుడు కాకపొతే ఎప్పటికీ సాధ్యం  కాదు’ అనే నిర్ధారణకు వచ్చిన తరువాతనే పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఈ పాదయాత్ర భారాన్ని  తన భుజస్కందాలమీద వేసుకున్నారు.
ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర అంత తేలికయిన విషయమేమీ  కాదు. శారీరక శ్రమతో పాటు ఎన్నో  వ్యయ ప్రయాసలు ఇందులో ఇమిడి వున్నాయి. టీడీపీ కి చెందిన ఒక నాయకుడి అంచనా ప్రకారం రోజుకు కనీసం ఇరవై లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఈ లెక్కన నూట పదిహేడు రోజుల యాత్రకు యెంత పెద్ద  మొత్తం కావలసివస్తుందో వూహించుకోవచ్చు. యాత్ర రెండో రోజున కాలి  కండరాలు పట్టేసాయని  చంద్రబాబే స్వయంగా చెప్పారు. షష్టిపూర్తి దాటిన  వయస్సులో ఇంతంత దూరాలు నడవడం ఆషామాషీ కాదు. కాకపొతే, వ్యక్తిగత క్రమశిక్షణకు, దినవారీ వ్యాయామాలకు, యోగాభ్యాసాలకు   మారుపేరు చంద్రబాబు అన్న పేరు తెచ్చుకున్న మనిషి కాబట్టి  కాలి నడకలో ఎదురయ్యే శారీరక శ్రమను కొంతమేరకు తట్టుకోగలరేమో చూడాలి.
ఈ పాదయాత్ర వల్ల వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమీ వుండకపోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా బోలెడు వ్యవధానం వుంది. అయితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలాంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి. తమ నడుమ  వుండేవారికే జనం ఈ నడుమ పట్టం కడుతున్నారు. ఏసీ  గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారు. పైపెచ్చు  ఇటు రాష్ట్రంలో, అటు జాతీయ స్థాయిలో కూడా పాలక పక్షం అయిన కాంగ్రెస్ పరిస్తితి నానాటికీ దిగజారుతోంది. యెంత ప్రయత్నం చేసినా వరసగా మూడోసారి అధికారం లోకి రావడం వుత్తమాట అని అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతొ ఆ పార్టీ నాయకులే ప్రైవేటు సంభాషణల్లో పబ్లిగ్గా చెబుతుంటారు.  సీమాంధ్ర ప్రాంతంలో పక్కలో బల్లెంగా తయారయిన మరో కొత్త పార్టీ నాయకుడు ప్రస్తుతం జైల్లో వున్నందున ప్రజల్లోకి చొచ్చుకు పోవడానికి తెలుగుదేశం పార్టీకి  ఇది సరయిన తరుణం. కాకపోతే, యాత్ర సందర్భంలో ప్రజల సమస్యలు ప్రస్తావనకు తెచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వుండాల్సి వస్తుంది.  తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు  ఏం చేసారన్న ప్రశ్న సహజంగా జనం నుంచి ఎదురయ్యే అవకాశం వుంటుంది. రాజశేఖరరెడ్డికి ఈ సమస్య ఎదురు కాలేదు. ఎందుకంటే ఆయన అంతకుముందు ఎప్పుడు పాలనాపగ్గాలు చేతిలో పట్టుకోలేదు.  అందుకే ఆయన యధేచ్చగా ఆనాటి  ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ ప్రజలను ఆకట్టుకోగలిగారు. ప్రజల ఇబ్బందులను, కడగండ్లను కళ్ళారా చూడగలిగే అవకాశం ఈ యాత్ర వల్ల చంద్రబాబుకు లభిస్తుంది. ఒకేమాదిరి వూకదంపుడు వుపన్యాసాలతో విసిగించకుండా, ప్రజలతో  మమేకం కాగలిగితే  తెలుగుదేశం అధినేతకు యాత్రా ఫలసిద్ధి  ప్రాప్తిస్తుంది. పనిలో పనిగా కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు  ఏర్పాటుచేసుకుని, నేరుగా వారిని విశ్వాసంలోకి తీసుకుని, పార్టీని పునాదులనుంచి  పటిష్టం చేసుకోగల అవకాశాన్ని కూడా ఆయన వాడుకోగల గాలి. అప్పుడే ఈ యాత్ర ఉభయతారకంగా వుంటుంది. 

వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం    
                
            చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఈ యాత్ర సక్రమంగా ఎలాటి ఆటంకాలు,అవాంతరాలు లేకుండా జయప్రదంగా పూర్తి అయిన పక్షంలో రాజకీయ పాదయాత్రల్లో  ఒక రికార్డుగా మిగిలిపోతుంది. 2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ‘ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర  రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఇప్పుడు చంద్రబాబు  ‘వస్తున్నా ..మీకోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్  నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340  కిలోమీటర్లు సాగి వచ్చే ఏడాది జనవరి 26 వ తేదీ ‘రిపబ్లిక్ దినోత్సవం’ నాడు శ్ర్రీకాకుళంజిల్లా ‘ఇచ్చాపురం’లోనే ముగుస్తుంది. మనోవాంఛాఫల సిధ్యర్ధం ఈ ఇద్దరు నాయకులు తమ తమ యాత్రలకు తుది మజిలీగా ‘ఇచ్చా’పురాన్ని ఎంపిక చేసుకున్నారేమో అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డికి కోరిక నెరవేరింది. చంద్రబాబు సంగతే వేచి చూడాలి. (04-10-2012)