గద్దర్ టు గణేశా! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గద్దర్ టు గణేశా! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఏప్రిల్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (298) : భండారు శ్రీనివాసరావు

 

గద్దర్ టు గణేశా!
నాలుగేళ్ల క్రితం అంటే 2022లో ఒక రోజు.
'రెయిన్ బో ఇయర్స్'. ఇది ఒక తెలుగువాడు రాసిన ఇంగ్లీష్ నవల.
దీన్ని నవల అనాలా! లేక కాల్పనిక పాత్రలతో కూర్చిన ఒక వ్యక్తి వాస్తవ జీవన చిత్రం అనాలా!
రాసింది ఆషామాషీ వ్యక్తి అయితే ఇంత చర్చ అనవసరం. కర్నాటక కేడర్ లో అడిషినల్ చీఫ్ సెక్రెటరీ స్థాయి వరకు ఎదిగిన ఓ సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి రాయడం వల్ల, పుస్తకం టైటిల్ కు CONFLICTS TO CONTENTMENT అనే ట్యాగ్ లైన్ జోడించడం వల్ల పెరిగిన ఆసక్తి కారణంగా ఈ పుస్తకం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది.
పుస్తక పరిచయ కార్యక్రమం హైదరాబాదులోని టూరిజం ప్లాజాలో జరిగింది. మండుటెండ మాడుస్తున్నా సభామందిరం కిటకిటలాడింది. అనేకమంది విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారులు, రచయితలు, పాత్రికేయులు హాజరయ్యారు.
హాజరీ ఈ స్థాయిలో ఉండడానికి ఈ పుస్తకం గురించి అంతకు ముందు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ‘మావో నుంచి మహర్షి దాకా’ అనే శీర్షికతో శ్రీ కారుసాల వెంకటేష్ రాసిన సవివర సమీక్షా వ్యాసం కూడా చాలావరకు కారణం అని చెప్పవచ్చు.
పుస్తక రచయిత పేరు మాఢభూషి మదన్ గోపాల్. తెలంగాణా గడ్డ మనిషి.
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మదన్ గోపాల్ తండ్రి ఎం. వెంకటాచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. పుచ్చలపల్లి సుందరయ్యగారితో కలిసి పనిచేశారు. వామపక్ష భావజాలంతో పుట్టి పెరిగిన మదన్ గోపాల్, మరో అడుగు ముందుకు వేసి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ సానుభూతిపరుడిగా ఎదిగారు. ఇటువంటి వ్యక్తి ఇండియన్ సివిల్ సర్వీసులో ఐ.ఏ.ఎస్. హోదా పొందడం ఓ విచిత్రం. నక్సలైట్ అభిమాని అనే కారణంతో కొన్నాళ్ళు సస్పెండ్ అయిన చరిత్ర కూడా వుంది.
నవలల్లో రచయిత కధని మలుపులు తిప్పినట్టే, ఊహకు అందని, మనిషి బుర్రకు చిక్కని ఏదో ‘మానవాతీత శక్తి’ కూడా మనుషుల జీవితాలను అనేక మలుపులు తిప్పుతుంది. ఈ క్రమంలో అనేక రకాల ఘర్షణలు, సంఘర్షణలు. (CONFLICTS). మరి CONTENTMENT సాధించడం ఎల్లా!
(ఈ పుస్తకం అప్పటికి చదవలేదు. నిజం చెప్పాలి అంటే ఇంతవరకూ కూడా చదవలేదు.)
మదన్ గోపాల్ కి చలం గురించి ఎవరు చెప్పారో తెలియదు. తిరువన్ణామలైలో వుంటున్న గుడిపాటి వెంకటాచలంతో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలు పెట్టారు. ఆ ఉత్తరాలు చదివిన చలం, ‘నీ రాతలతో నా తల తినడం ఆపేసి, ఓసారి నా దగ్గరకు రా’ అని ఓ కార్డు ముక్కమీద జవాబు రాసి పడేసారు.
మదన్ ఆ పిలుపు పట్టుకుని రమణాశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. ఆ సమయంలో చలం, వచ్చిన వాళ్ళని కలుసుకుంటున్నారు. మదన్ గోపాల్ వెళ్లి ఎదురుగా నిలబడితే ‘ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు’ అనే ప్రశ్న ఒక్కటి కూడా వేయకుండా, వెంటనే ఆయనకు బస ఏర్పాటు చేశారు. పొద్దున్నే ఉపాహారం, కాసేపు తోట పని. పగలు చలం చెంత గడపడం. శ్రీ రమణుని బోధనలు గురించి తెలుసుకోవడం. అప్పుడు అనిపించింది. జీవితం అంటే వేరే ఒకటి వుందని. దాని ద్వారా లభించే CONTENTMENT అనేది మరోటి ఉంటుందని. మూఢ భక్తి వేరు, ఆధ్యాత్మిక చింతన వేరు . ఆధ్యాత్మికత అంటే తనను తాను తెలుసుకోవడం. అదే శ్రీ రమణుని భక్తిమార్గం అని అప్పుడే ఆయనకు తెలిసింది.
సరే! ముందు మొదలు పెట్టిన ‘గద్దర్ టు గణేశా’ ఏమిటి అంటే!
పుస్తక పరిచయ కార్యక్రమం మొదలు కాబోతున్న తరుణంలో వచ్చిన ప్రజా గాయకుడు గద్దర్ ని గమనించిన మదన్ గోపాల్ లేచి నిలబడి, గద్దర్ గతంలో పాడిన ఓ పాట పాడుతూ సగౌరవంగా ఆహ్వానించారు. ఆ తర్వాత గణపతి ప్రార్ధనతో సభ మొదలయింది.
నా ఈ రాతలో కూడా కొన్ని CONFLICTS కనిపించి వుంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే, నేనింకా CONTENTMENT దశకు చేరుకోలేదు. CONFLICTS నడుమే కొట్టుమిట్టాడుతున్నాను.
తోకటపా: ఈ కొత్త పుస్తకం కోసం వెడితే పాత మితృలు, పాత పరిచయస్తులైన అనేకమంది ఐ.ఏ.ఎస్. అధికారులు కనిపించారు.
మిత్రుడు జ్వాలా కోరికమీద రచయిత మదన్ గోపాల్, ఆంధ్రజ్యోతి (అప్పటి) ఎడిటర్ కె. శ్రీనివాస్, తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, నాటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, 108 సర్వీసు మాజీ సీఈఓ వెంకట్ చంగవల్లి, 104 సర్వీసు మాజీ సీఈఓ డాక్టర్ ఉట్ల బాలాజీ అందరం కలసి జ్వాలా ఇంటికి వెళ్లాం.
మా మేనకోడలు, జ్వాలా శ్రీమతి అయిన వనం విజయలక్ష్మి, “వండనలయదు నేవురువచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌనతని గృహిణి” అనే ప్రవరాఖ్యుని ఇల్లాలు బాపతు కాబట్టి, మా అందరికీ అప్పటికప్పుడు వండివార్చిన వేడి వేడి విందు భోజనం ఆనాటి మా కలయికలో నిజంగా హై లైట్.
గతంలోకి తొంగి చూస్తుంటే ఇలాంటి మధురమైన ఘటనలు, సంఘటనలు ఎన్నో, ఎన్నెన్నో.
కింది ఫొటోలు జ్వాలా ఇంట్లో:








(ఇంకా వుంది)