కరోనా కళ్ళప్పగించి చూస్త్తూ ఇక తోక ముడిచే పనిలో ఉన్నట్టుంది.
కరోనా భయ పడుతోంది దేశంలో ప్రజలూ ప్రభుత్వాలు ఏకమై తనని తరిమి కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసికాదు. బహుశా మన దేశానికి మాత్రమే పరిమితమైన వింత వ్యాధిని చూసి. మందు లేని ఆ వ్యాధి పేరు ఇంగ్లీష్ లో GREED తెలుగులో దురాశ.
కరోనా సెకండ్ వేవ్ కోరలు సాచి విస్తరిస్తున్న సమయంలో ఎవరి ప్రాణానికి పూచీ లేని పరిస్థితి. అయినా తాము మాత్రం చిరకాలం బతుకుతామనే నమ్మకంతో డబ్బులు పోగేసుకుంటున్న జనాలను చూస్తుంటే ఆ కరోనాకే మతి పోతున్నట్టు వుంది. అలా సంపాదించే డబ్బు కట్టుకు పోయేది కాదు, పట్టుకుపోయేది కాదు.
లేకపోతె ఏమిటీ బ్లాక్ మార్కెట్? మందులు, మూతి గుడ్డలు, శానిటైజర్లు, ఆసుపత్రులలో ఎడ్మిషన్లు, బెడ్లు, ఆఖరికి అంబులెన్సులు అన్నిటికీ కృత్రిమ కొరతలు పెరిగాయి. ధరలు పెరిగిపోయాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఒకవైపు ప్రాణాలు పోతున్నా కనికరించని కరకు గుండెలు చూసి గుండెలు బాదుకుంటున్నారు.
ప్రళయం అంటే ఇదే. భూమి బద్దలు కావడం కాదు. సముద్రాలు ఉప్పొంగడం కాదు.
ఈ దురాశే నిజమైన ప్రళయం.
అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం!