ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మే 2015, గురువారం

ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు




(నిన్నటి మాటో మొన్నటి ముచ్చటో కాదు చాలా చాలా  పాతకాలం కబుర్లు. నేను పుట్టడానికి పదేళ్ళ ముందు, శిష్ట్లా లక్ష్మీ పతి శాస్త్రిగారు అనే ఓ పెద్ద మనిషి, 1935 లోనే  కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు నుంచి చదువుకోసం హైదరాబాదు చేరారు. ఏళ్ళతరబడి హైదరాబాదు నగరంతో తాను  పెంచి పోషించుకున్న అనుబంధాన్ని తన అనుభవాలతో రంగరించి ఆ పెద్దాయన, 'హైదరాబాదు, నాడు - నేడు' అనే పేరుతొ తొంభయ్ పేజీల  పుస్తకం రాసారు. 2008 లో అది ముద్రణకు నోచుకుంది. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారికి అందులో ఎన్నో విషయాలు అచ్చెరువు గొలిపేలా వున్నాయి. చిన్న పుస్తకం. కానీ అందరూ చదవదగ్గ గొప్ప పుస్తకం. ప్రతులకు, విశాలాంధ్ర బుక్ హౌస్ అని అందులో రాసారు. వెల యాభయ్ రూపాయలు. అందులోని విషయాలు యెంత ఆసక్తికరంగా ఉన్నాయంటే, ఏది ఒదలాలో, ఏది చేర్చాలో తెలియనంత అయోమయంలో పడిపోయాను. పుస్తకంలో అన్నీ మెరుపులే. కానీ బ్లాగు పరిమితుల దృష్ట్యా కుదించి రాయాల్సి వస్తోంది. లక్ష్మీ పతి శాస్త్రి గారి మూల భావానికి న్యాయం చేయడానికే చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. అయినా ఏదో లోపం చేసానేమో అన్న అనుమానం   నన్ను బాధిస్తూనే వుంది.  వారికి క్షమాపణలతో కూడిన ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు)
ఇక ఇక్కడి నుంచి మాటా పలుకూ అన్నీ శాస్త్రిగారివే:





"అది జూన్ నెల ఇరవయ్యవ తారీఖు, 1935 వ సంవత్సరం. గుడ్లవల్లేరులో వున్న మా ఇంటికి హైదరాబాదులో వున్న మా బావగారి నుంచి టెలిగ్రాం వచ్చింది.
"23వ తేదీతో స్కూళ్ళలో ఎడ్మిషన్లు అయిపోతవి. చిక్కాయిని వెంటనే పంపండి"
"చిక్కాయి నా ముద్దు పేరు.
'చిక్కడు సిరి కౌగిటిలో, చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, చిక్కడు శృతి లతికావలి, చిక్కెనతడు తల్లి చేతన్ రోలన్' అనే పోతన పద్యంతో మా అమ్మ నన్ను అలరిస్తూ వుండేది.
"మా నాన్నగారు కోర్టు పనిమీద మద్రాసు వెళ్ళారు. మా అమ్మ దగ్గర దమ్మిడీ లేదు. మర్నాడు రైలు ఎక్కితేకాని హైదరాబాదు చేరలేను. అమ్మ అప్పుచేసి అయిదు రూపాయలు చేతిలో పెట్టింది. పప్పులూ, ఊరగాయలు, పాత్ర సామానులు వున్న రెండు పెద్ద మూటలు కూడా ఒప్పచెప్పింది. రైల్లో ఆ రాత్రి బెజవాడ చేరి మర్నాడు ఉదయం నైజాం బండి ఎక్కాను. సికింద్రాబాదుకు రైలు టిక్కెట్టు మూడు రూపాయల పదమూడు అణాలు.
"కాసేపట్లో ఎర్రుపాలెం వచ్చింది. ఆ రోజుల్లో పద్నాలుగు ఏళ్ళు దాటని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకూడదని శారదా యాక్టు వుండేది. నైజాంలో అది చెల్లదు. అంచేత పిల్ల పెద్దమనిషి కాకపూర్వమే వివాహం చేయాలనుకునే పూర్వాచారం వారు 'ఎర్రుపాలెం శరణంభవ' అనుకుంటూ అక్కడ ఆ తంతు పూర్తికానిచ్చేవాళ్ళు.
"మహబూబాబాదులో ఎవరో ఒకాయన (ముస్లిం లు ధరించే) ఎర్ర కుచ్చు టోపీతో రైలెక్కాడు. నుదుట రూపాయి కాసంత బొట్టుతో లక్ష్మీ దేవిని తలపిస్తూ పక్కన  ఓ ముత్తైదువ. ఇదేమిటబ్బా అని ఆశ్చర్యపోతుండగా ఆ పెద్దమనిషి టోపీ తీసి పక్కనబెట్టాడు. పిలకున్న బ్రాహ్మణుడాయన.  నిజాం ప్రభుత్వోద్యోగులందరూ ఏదో ఒక  టోపీ ధరించాలి. 'సర్ పే లాల్ టోపీ'
"వరంగల్ స్టేషన్ లో ఆగినప్పుడు దిగి కాణీ పెట్టి  ఓ చక్కిలం కొనుక్కున్నాను. అణా ఇస్తే చిల్లర ఒక కాణీతో పాటు యేవో గీతల మాదిరి అక్షరాలు వున్న రాగి నాణెం ఇచ్చాడు. అది హాలీ అర్ధణా. హాలీ అంటే నిజాం సిక్కా. అక్కడ బ్రిటిష్ సర్కారు సిక్కా, నిజాం సిక్కా రెండూ చెల్లుతాయట. సర్కారు నూరు రూపాయలకు హాలీ నూట పదహారు రూపాయలు. అదీ లెక్క.    
"సికిందరాబాదు చేరిన తరువాత నానా ప్రయాసపడి ఎట్టకేలకు మలక్ పేట లోని మా అక్కయ్య ఇంటికి చేరాను. హైదరాబాదు నగరంతో నా సుదీర్ఘ అనుబంధం నాటి నుంచి,  నా పన్నెండేళ్ళ వయస్సులో మొదలయింది"

(ఇంకా వుంది)