ఆరు
రాత్రులు – ఆరు పగళ్ళు
ఇదేమీ
వెనుకటి రోజుల్లోని మళయాళం డబ్బింగు సినిమా టైటిల్ కాదు. అచ్చంగా నా సొంత గొడవ.
ఎవరితోనూ పెట్టుకున్న గొడవ కాదు, నాకై నేను, నాతో నేను పెట్టుకున్న గొడవ. పైగా అయిదేళ్ళ కిందటిది కూడా.
మా
ఆవిడ చనిపోయిన ఏడాదికి హైదరాబాదులోనే వుంటున్న మా రెండో అన్నయ్య కొడుకు, కోడలు లాల్, దీప కొంచెం మార్పుగా వుంటుందని
నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు.
పెద్ద
ఇల్లు, విశాలమైన
పడక గదులు, అన్నింటికీ
మించి అతి విశాలమైన మనసులు కలిగిన దంపతులు దీప, లాల్ బహదూర్, తమ మాటలతో చేతలతో ఆకట్టుకునే పిల్లలు
వారి స్పురిత,
హసిత.(ఇప్పుడు
అమెరికాలో వుంటున్నారు, ఒకరు
ఉద్యోగం చేస్తూ,
మరొకరు పై చదువులు పూర్తి చేస్తూ) నాకు తోడుగా నా మేనల్లుడు రామచంద్రం, అతడి భార్య కరుణ. ఆ దంపతుల ఏకైక
కుమార్తే దీప.
అందరికీ
ఎవరి పడక గదులు వారికే వున్నాయి. కరోనా రోజులు. అందరూ ఎడం ఎడంగా కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా
విశాలమైన హాలు. చుట్టూ పూలమొక్కలు, కూరగాయల పాదులు, అన్ని
రకాల ఫల వృక్షాలు. అన్ని రకాల వసతులతో ఒక చక్కని పల్లెటూరులో వున్నట్టు వుంటుంది.
వాళ్ళు ఆ విల్లా కొనుక్కున్నప్పటినుంచీ నన్నూ మా ఆవిడనూ వారి దగ్గరికే వచ్చి
కొన్నాళ్ళు గడపాలని పోరుపెట్టేవారు. కానీ మా ఆవిడ వుండగా వీలుపడలేదు.
ఓ
శుక్రవారం వచ్చి నన్ను కారులో తీసుకుపోయారు. తెలిసిన ఇల్లే. తెలిసిన మనుషులే.
అక్కడ
ఉండగానే నాకేమీ తెలియదనే నిజం ఒకటి తెలిసివచ్చింది. అది తెలియగానే సెల్ ఆఫ్ చేసాను. పత్రికలు
ముట్టుకోలేదు. టీవీ వార్తలు చూడలేదు. ఇన్నాళ్ళూ జీవించిన ప్రపంచానికి కొంచెం దూరం జరిగాను.
దీనికి
కారణం మా మేనల్లుడు రామచంద్రం. నాకంటే చాలా చిన్నవాడు.
మరో
కారణం, నాలో మరో నేను
వున్నాడు అనే సంగతి తెలియరావడం.
ఆ
రెండో నేను నాలో ఉన్నాడని
తెలిసింది కాని, ఎవరో
ఏమిటో తెలియదు.
అది
తెలియడానికే ఈ ఆరు రాత్రులు, ఆరు
పగళ్ళు ఖర్చు చేయాల్సివచ్చింది. తెలిసిందా అంటే ఏమి చెప్పాలి, మహామహులకే సాధ్యం కాలేదు ఆ సంగతి
తెలుసుకోవడం. నాకెలా
వీలుపడుతుంది?
సత్సంగత్వే
నిస్సంగత్వం
ఆధ్యాత్మికం, ఆముష్మికం ఈ పదాలు చిన్నతనం నుంచి
అనుక్షణం వినబడే కుటుంబ నేపధ్యం అయినప్పటికీ వాటిపట్ల అభిలాష కానీ అనురక్తి కానీ
ఏర్పడలేదు. అలా అని వాటిని తృణీకరించే స్వభావమూ నాకు అలవడలేదు. జీవితంలో అనేక
విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. వాటిల్లో ఇవీ ఒక భాగమే అనే తత్వం.
“సత్సంగత్వే
నిస్సంగత్వం
నిస్సంగత్వే
నిర్మోహత్వం
నిర్మోహత్వే
నిశ్చలత్వం
నిశ్చలతత్వే
జీవన్ముక్తి:”
మంచి
మనసున్న మనుషులతో సాంగత్యం మనసుపై మంచి సానుకూల ప్రభావం చూపుతుంది. ఆది
శంకరాచార్యులు తన భజగోవింద స్త్రోత్రంలో చెప్పిన ఈ శ్లోకం అంతరార్ధం ఇదే.
ఈ ఆరు
రాత్రులు, ఆరు
పగళ్ళ కాలంలో మంచి మాటలు వినడానికీ, మంచి రచనలు చదవడానికీ, మంచి మనుషులతో గడపడానికీ ఓ మంచి అవకాశం లభించింది. సందేహాలు, సమాధానాలతో కూడిన అర్థవంతమైన చర్చలకు
ఆస్కారం దొరికింది. గూడుకట్టుకుని ఉన్న సందేహాలు తీరాయా, దొరికిన సమాధానాలు సంతృప్తి ఇచ్చాయా
అంటే చప్పున జవాబు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు దాదాపు డెబ్బయి సంవత్సరాల
నుంచీ కూడబెట్టుకున్న సంచితం మెదడులో
నిక్షిప్తమై గడ్డకట్టి వుంది. ఇలా అయిదారు రోజుల ప్రయత్నంతో దాన్ని పెకలించడం
కష్టం.
వయసులో
పెద్ద అయిన నావి సందేహాలు. నాకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడయిన నా మేనల్లుడు
రామచంద్రం వాటిని తీర్చే ప్రయత్నం చేసేవాడు. ఇదో వైచిత్రి.
ఉదయం
మొదలయిన వాదసంవాదాలు ఒక పెట్టున తేలేవి కావు. అపరాహ్నం వరకూ సాగి వాటి నడుమనే
ఉపాహారాలు, అల్పాహారాలు, మధ్యాన్న భోజనాలు. ఇక సాయంసమయంలో మొదలయితే
అర్ధరాత్రివరకూ అంతువుండేది కాదు. ఇద్దరు ప్రాసంగికులే. ఇద్దరూ
శ్రోతలే. జవాబుల అన్వేషణలో ప్రశ్నలు, సందేహాల నివృత్తిలో మరిన్ని
ప్రశ్నలు.
మా
మేనల్లుడు రామచంద్రానికి పూర్వజన్మ వాసనలతో కూడిన ఆధ్యాత్మిక భావజాలం వుంది. అది
బహుశా వారి నాన్నగారు కొమరగిరి అప్పారావు బావగారి నుంచి వారసత్వంగా లభించి
వుంటుంది. చేసింది గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం అయినా రామాయణ, భారత భాగవతాలు నాలుకపై ఆడుతుంటాయి.
చిన్నవయసులోనే ఇలాంటి అధ్యాత్మిక వాసనలు ఉన్న వారిని తోటివారు చిన్నచూపు చూడడం
కద్దు. కానీ రామచంద్రం విషయం కొంత విభిన్నం. మా కుటుంబంలో అందరికీ రామచంద్రం చెప్పే విషయాలు వినడంలో
ఆసక్తి వుంది. నా ఒక్కడికీ కొంత మినహాయింపు ఇవ్వాలేమో. ఎందుకంటే నాదంతా అనుమానాలతో
కూడిన ఆరాలు. దేవుడు అంటే భక్తీ లేకా కాదు, దేవుడు అంటే నమ్మకం లేకా కాదు. ఏ
విషయాన్ని వెంటనే నమ్మేయడం ఎందుకనే సాధారణ ప్రాపంచిక విషయ పరిజ్ఞానం తాలూకు ప్రభావం నామీద ప్రబలంగా ఉన్న కారణంగా
వచ్చిన తిప్పలు ఇవి. మూఢ నమ్మకాల మీద అతిమూఢ౦గా పెంచుకున్న అయిష్టత, ఏహ్యత ఒక కారణం కావచ్చు.
ఈ
నేపధ్యంలో ఈ ఆరు రాత్రులు, ఆరు
పగళ్ళ అధ్యాయం మొదలయింది.
భండారు
శ్రీనివాసరావు అనే నేను ...
బాగానే
వుంది, నువ్వే
శ్రీనివాసరావువి. మరి ఆ ఆ పేరు తీసేస్తే నీవెవరు?
నిన్ను
గుర్తు పట్టేది ఎల్లా? నీ
రూపం చూశా? నీ
మాటలు వినా? నీ
రాతలు చదివా? ఎలా?
ఈ
శరీరానికి ఆ పేరు
ఉందా! లేదా పేరును బట్టి శరీరానికి శ్రీనివాసరావు అనే అస్తిత్వం వచ్చిందా!
ఈ నేను
కాని దాన్ని నేను, నేను
అనుకోవడం అజ్ఞానం అవుతుందా!
అంటే ఈ
నేను, నేను కాదని
బోధపరచుకోవాలా!
సత్యం
బోధ పడడానికి ఎంత దూరం దృష్టి సారించాలి. అంత దూరం దృష్టి ఆనుతుందా!
పెంజీకటి
కావల అన్నాడు పోతన,
అంటే
పెనుచీకటికావల వెలుగు ఉంటుందా! అసలు ఈ కటిక చీకటిని చీల్చి చూడడం ఎల్లా!
దేహంలో
ఆరు కోశాలు అని అంటారు.
అన్నమయ
కోశం (అన్నంతో జీవించేది), ప్రాణమయ
కోశం ( శరీరంలో వున్న వ్యవస్థ), మనోమయ
కోశం(ఆలోచింప చేసేది), విజ్ఞానమయ
కోశం ( జ్ఞానం కలిగించేది), ఆనందమయ
కోశం ( దివ్యానుభవం కలిగించేది).
మొదటి
అయిదు దాటి చూస్తే చివరిదానికి చేరుకుంటాడు మానవుడు. దాన్ని కూడా దాటి చూడగలిగితే
సర్వం ఆనందమయం. అక్కడ గోచరిస్తుంది ప్రకాశంతో విరాజిల్లే ఆత్మ.
అదే
అసలయిన నేను అంటారు భగవాన్ రమణ మహర్షి.
గీతలో
చెప్పినట్టు చంపేదెవరు? చచ్చేదెవరు?
అంతా
నీ భ్రమ.
అన్నీ
నేనే అనే పరమాత్మ ఒకటి వుంది. మిగిలినవన్నీ భ్రాంతులే.
నేనెవరు
అని ఓమారు మనల్ని మనం ప్రశ్న వేసుకుని నిశ్చల ధ్యానంతో జవాబు వెతుక్కుంటే ..
ప్రతి
మనిషి శరీరంలో మూడు భాగాలు. ఒకటి ఉపాధి (శరీరంతో కూడిన నేను), రెండోది స్థూల శరీరం (రక్తమాంసాలు
కలిగినది), మూడోది
సూక్ష్మ శరీరం (జీవుడు)
కంటికి
కనబడే స్థూల శరీరాన్నే నేను అనే ఓ మిథ్యా భావనలో, భ్రమలో ఉంటాము.
జీవుడు
అనే సూక్ష్మ శరీరము, జన్మజన్మల
కర్మఫలాలను అనుభవించడానికి స్థూల శరీరాన్ని ధరిస్తుంది. ఆ కర్మ ఫలాలు కూడా మూడు.
ప్రారబ్ధం,
ఆగామి, సంచితం.
ప్రస్తుత
శరీరంలో జీవుడు అనుభవిస్తున్న కర్మని పుణ్యం, ప్రారబ్ధం అంటారు.
అనాదిగా
తెచ్చిపెట్టుకున్న కర్మని ఆగామి అంటారు.
కర్మశేషం
వుంటే అది సంచితంగా మరో జన్మలో దఖలు పడుతుంది.
కర్మశేషం
తొలగిన రోజున జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. అంటే పాపపుణ్యాలు రెండింటినీ క్షయం
చేసుకోవడం అన్నమాట.
ఏమి
అర్ధం అయింది? అంత
తేలికగా అర్ధం కానిది, అంతం
లేనిది కనుకే వేదాంతం అన్నారు.
అర్ధం
అయినా కాకపోయినా ఈ వయస్సులో అప్పుడప్పుడైనా కొన్ని ఆముష్మిక విషయాలు గురించి ఆలోచించడం
మంచిదనిపించింది. అంతే!
“అహం
వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః
ప్రాణాపాన
సమాయుక్తః పచామ్యన్నం
చతుర్విధం”
(శ్రీ
మద్భగవద్గీత, పంచ
దశాధ్యాయం, పురుషోత్తమ
ప్రాప్తి యోగము)
తాత్పర్యం:
నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని ప్రజ్వలింప చేసే
ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము,
భోజ్యము,
లేహ్యము,
చోష్యములనే నాలుగు
విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను.
ఇప్పుడీ
గీతా ప్రవచనం ఎందుకంటే నేను ఓ అరవై, డెబ్బయ్ ఏళ్ళు వెనక్కి పోవాలి.
నా
చిన్నతనంలో మా బామ్మగారు రుక్మిణమ్మ గారు ప్రతిరోజూ అపరాహ్ణకాలంలో భోజనానికి
కూర్చున్నప్పుడు మొదటి ముద్ద చేతిలో పట్టుకుని ఈ గీతా వాక్యాన్ని చదివేది. అది
ఎందుకు చదివేదో నాకు అర్ధం అయ్యేది కాదు. ఆ శ్లోకం పూర్తి పాఠం కూడా నాకు
గుర్తులేదు, అక్కడక్కడ
ఒకటి రెండు పదాలు మినహా.
నాకు
గుర్తున్న ఆ ఒకటి రెండు పదాలు ( ‘అహం వైశ్వా..... పచామ్యన్నం......
చతుర్విధం...) గురించి అడిగాను రామచంద్రాన్ని. అతడు వెంటనే ఈ పదాలు శ్రీకృష్ణ పరమాత్మ
చెప్పినవని చెప్పి పైన చెప్పిన విధంగా టీకాతాత్పర్యాలు వివరించాడు.
అరవై
ఏళ్ళకు పైగా నా మనసును తొలుస్తున్న
సమస్యకు పరిష్కారం దొరికింది. సత్సంగం వల్ల ప్రయోజనం ఇదే!
ఈ
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నన్ను కష్టపెట్టడానికే పుట్టారు’ అనేది ఓ నలభయ్ ఏళ్ళ
క్రితం నాకున్న ఓ నిశ్చితాభిప్రాయం.
అది
చిన్నప్పుడు బలవంతాన కలరా సూదిమందు ఇచ్చిన సర్కారు మనిషి కావచ్చు, అడిగిన అప్పచ్చులు వెంటనే పెట్టలేదని
నేను కోపం పెంచుకున్న మా బామ్మ కావచ్చు, హోం వర్కు చేయలేదని నా వీపు వాయగొట్టిన లెక్కల మాస్టారు కావచ్చు,
దాచిపెట్టుకున్న
గోలీలు కాజేసిన నా బెస్టు ఫ్రెండు కావచ్చు ఇలా ఈ డెబ్బయి ఏళ్ళ పైచిలుకు సాగిన నా ఈ
జీవితంలో, ప్రతి
దశలో ఎవరో ఒకరు నన్ను కష్టపెడుతూనే వచ్చారని అదేమిటో ఓ పిచ్చి నమ్మకం. ఆ
నమ్మకంతోనే వాళ్ళతో పెరుగుతూ విరుగుతూ వచ్చిన మానవ సంబంధాలు.
ఇన్నేళ్ళ
తరవాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏమిటో అంతా విష్ణుమాయ.
‘ఈ
లోకంలో ప్రతి ఒక్కరూ నన్ను సుఖపెట్టడానికే పుట్టారు’ అనేది కొత్తగా మొగ్గ
తొలుస్తున్న భావన.
అది
పొరుగింటివారు కావచ్చు, ఆటో
డ్రైవరు కావచ్చు, ఇంట్లో
పొద్దున్నే పత్రికలు వేసే పేపరు బాయి కావచ్చు, ఇలా ఎందరెందరో వాళ్ళ సుఖాల్ని
వదులుకుని నన్ను సుఖపెడుతున్నారనే అభిప్రాయం నాలో నాకే ఒక కొత్త
మనిషిని చూపిస్తోంది.
ఈ ఆరు
రాత్రులు, ఆరు
పగళ్ళ వల్ల నాకు సిద్ధించిన ఫలితం ఇదే!
ఈ ఎరుక
నలభయ్ ఏళ్ళ క్రితమే కలిగివుంటే ఈనాడు నాకు ఎటు చూసినా మంచి మిత్రులే వుండేవాళ్ళు.
అలాంటి విలువయిన సంపదను నేనే చేతులారా పోగొట్టుకున్నానన్నమాట.
ఇప్పుడు
ఏమనుకుని ఏం లాభం?
కింది
ఫోటో:
మా
బామ్మగారు భండారు రుక్మిణమ్మ గారు
(ఇంకా వుంది)