సంయమనానికి ముందు వెనుకలు లేని మాట నిజమే. కానీ,
ఒక నిర్ణయం అయిపోయిన తరువాత, దాన్ని తిరగరాయడం అసాధ్యం అని తెలిసిన తరువాత సమాధానపడి
సంయమనంతో మిగిలిన అంశాలను చక్కబరుచుకోవడం అన్నది వివేకవంతుల లక్షణం. కానీ ఆవేశకావేశాలు
ముసురుకున్నప్పుడు వివేకం కళ్ళు మూసుకోవడం సహజాతిసహజం.
రాష్ట్ర విభజన గురించిన నిర్ణయం జరిగిపోయింది. నిర్ణయం
తప్పా వొప్పా అన్నది భవిష్యత్తు తేలుస్తుంది. బ్రిటిష్ వాళ్లు మనకు స్వతంత్రం
ఇవ్వకుండా వుంటే బాగుండేదని అనే వాళ్లు నిన్న మొన్నటిదాకా వున్నారు. వాళ్ల సంఖ్య
ఇప్పుడు తగ్గిపోయి వుంటుంది.
నేను ఎన్నో సార్లు టీవీ చర్చల్లో చెప్పాను. మళ్ళీ
చెబుతున్నాను. విభజన అన్నప్పుడు కొందరు మోదపడడం, మరి కొందరు ఖేదపడడం తప్పదు.
ఒకప్పుడు అఖండ భారతంగా వున్న భరత ఖండం, ఖండ
ఖండాలయింది. అనేక దేశాలుగా విడిపోయింది.
ఒక విషయం గుర్తు పెట్టుకోండి. రాష్ట్రాన్ని
విభజించాలని కాకుండా ఎట్టి పరిస్థితుల్లో అయినా కలిపే వుంచాలని నిర్ణయం తీసుకుని
వున్నట్టయితే – ఇప్పుడు గొంతెత్తి విమర్శిస్తున్నవాళ్ల పల్లవి పూర్తిగా మారిపోయి
వుండేది. అలాగే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని స్వాగతిస్తూ జేజేలు పలుకుతున్నవాళ్ళు,
నిర్ణయం ఎదురు తిరిగి వుంటే తీసుకున్నవాళ్ళ జేజెమ్మలను శాపనార్ధాలు
పెడుతుండేవాళ్ళు.
వేదాంతం చెబుతున్నానని కాదు. కానున్నది కాకమానదు.
కానిది కానే కాదు. ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని’ అనే కవి వాక్యం ఇక్కడ స్మరణీయం.
నేను మొదటి నుంచీ చెబుతూ
వస్తున్నది ఒకటే. 1969 లోనో, 1972 లోనో
రాష్ట్ర విభజన జరిగివుంటే ఈపాటికి ఈ రెండు రాష్ట్రాలు కౌలాలంపూర్, సింగపూర్ మాదిరిగా
అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థను శాసిస్తూ వుండేవి. కానీ ఈ ఆలోచన వొలికిపోయిన పాల
మాదిరి. ఆనాడు అత్త అడ్డుపడింది. ఈనాడు కోడలు దారి తెరిచింది. ఇటుపక్కా, అటు పక్కా
అనుకుంటూ వున్నట్టు అయిన ఆలస్యానికి కానీ,
జరుగుతున్న తొందరపాటుకు కానీ ఆ ఇద్దరికీ పూచీ లేకపోవడమే ఇందులో విచిత్రం. ఇదే
రాజకీయం అంటే!(06-12-2013)