పతీ పత్నీ ఔర్ ఓ
‘భార్యను చంపి, ముక్కలు చేసి, కుక్కర్ లో ఉడికించి’ ...అంటూ నిరుడు ఒకరోజు (గురువారం, 23-01-2025) పత్రికల్లో ఒక భయంకరమైన కధనం వచ్చింది. చదవగానే కడుపులో తిప్పే ఇలాంటి వార్తను తక్షణమే మరచి పోవాలి. లేదా పేజీ తిప్పేయాలి. కానీ నేను ఆ పని చేయకుండా 65 ఏళ్ళ కిందటి ఒక పాత క్రైం స్టోరీ గుర్తు చేసుకున్నాను.
అది ఆ రోజుల్లో కొన్ని పత్రికల్లో వచ్చింది.
ఖమ్మం సాయిబాబాగా ప్రసిద్ధి చెంది అక్కడ ఒక ఆశ్రమం కూడా నిర్మించుకుని కొన్నేళ్ళ క్రితం పరమపదం చేరుకున్న జీవై కృష్ణమూర్తి స్వయంగా మా బాబాయి గారి అల్లుడు. మా అక్కయ్య మధురకు భర్త. పూర్వాశ్రమంలో సమర్ధుడైన పోలీసు అధికారి. యూనిఫారంలో ఆయన్ని చూస్తే మాకు వణుకు. నేరగాళ్లకు సింహస్వప్నం. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు, ఆ నాటి ముఖ్యమంత్రి గారి (ఆయన అప్పుడు కారులో లేరు, పైగా ఆ రోజుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు) కారును ట్రాఫిక్ ఉల్లంఘన కింద బుక్ చేస్తే, పనిష్ మెంటుగా నేర విభాగానికి బదిలీ చేశారు.
ఆ రోజుల్లో జరిగిన కధ ఇది.
హుస్సేన్ సాగర్ ఒడ్డున కొన్ని కుక్కలు ఆహారం కోసం వెతుకుతూ కాలి గోళ్ళతో తవ్వుతుంటే మనిషి చేయి ఒకటి బయటకు వచ్చింది. ఎవరో చెబితే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒకచోట చేయి, మరో చోట మనిషి తాలూకు మరో అంగం ఇలా పలుచోట్ల దొరికాయి. ఒక చోట ఆ మనిషి ధరించిన వస్త్రం (తరువాత అది ఆడవాళ్ళు ధరించే నైటీ అని తెలిసింది) కనబడింది.
అప్పుడు మా బావగారు క్రైం ఇన్స్పెక్టర్. ఆ నైటీ భాగాన్ని పరిశీలనగా చూస్తే చాకలి గుర్తు కనిపించింది. (ఆ రోజుల్లో పేపర్లో అలాగే రాశారు కాని, ఈ రోజుల్లో ఇలా ఒక కులం పేరు రాయడం తప్పని తెలుసు. నన్ను మన్నించాలి). దర్యాప్తు చేస్తే ఆ గుర్తు బొంబాయిదని తేలింది. కృష్ణమూర్తిగారు బొంబాయి (ఇప్పుడు ముంబై) వెళ్లి ఆ గుర్తు ఆధారంగా తన పరిశోధన కొనసాగిస్తే, అది నానావతి అనే ఒక డాక్టర్ తాలూకుదని తెలిసింది. తీగెను కదిలిస్తే డొంక కదిలింది.
కుటుంబ కలహాల కారణంగా ఆ డాక్టరుకు భార్యపై తగని కోపం ప్రబలింది. ఆ ఉద్రేకంలో ఆమెను ఇంట్లోనే హత్య చేశాడు. తరువాత పరిణామాలు ఆయన్ని భయపెట్టాయి.
డాక్టరుగా అనేక ఆపరేషన్లు చేశాడు. శరీరంలో ఏ భాగాన్ని ఎలా కత్తిరించాలో బాగా తెలుసు. ఎలా కట్ చేస్తే రక్తం ఎక్కువగా స్రవించదో కూడా తెలిసిన మనిషి. ఆ పరిజ్ఞానంతో శరీర భాగాలను ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద సూటు కేసులో పెట్టి, రైల్వే స్టేషన్ కు వెళ్లి హైదరాబాదుకు వెళ్ళే రైలు ఎక్కాడు. తెలతెలవారుతుండగా ఆ సూటుకేసును రైలు బోగీ గుమ్మంనుంచి హుస్సేన్ సాగర్ లోకి నెట్టి వేశాడు. ఆ రోజుల్లో రిజర్వేషన్ల గొడవ లేదు కాబట్టి తిరుగు రైలులో బొంబాయి వెళ్ళిపోయాడు. హుస్సేన్ సాగర్ లో పడ్డ ఆ సూటు కేసు తెరుచుకుని శరీర భాగాలు చెల్లాచెదురు అయ్యాయి. అవి ఒడ్డుకు కొట్టుకు వచ్చి భూమిలో కూరుకుపోయి, చివరికి వీధి కుక్కల నోటికి ఒక చేయి దొరికింది.
బొంబాయిలో నానావతిని అరెస్టు చేసి మా బావగారు హైదరాబాదు తీసుకువచ్చారు. అప్పుడు సిటీ పోలీసు నేర విభాగం రేడియో స్టేషన్ కు దగ్గరలో వున్న సిటీ పోలీసు కంట్రోల్ రూమ్ పైన వుండేది. ముద్దాయిని విచారిస్తున్న సమయంలో అతడు హఠాత్తుగా మూడో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు.
ఈ క్రైం స్టోరీ దర్యాప్తు గురించి అంధ్రపత్రిక దినపత్రిక కధలు కధలుగా అనేక కధనాలు సీరియల్ గా ప్రచురించింది.
మరో క్రైం స్టోరీ కూడా ఇంచుమించు ఇలాగే సాగుతుంది.
ఇదీ జరిగిన కధే. అంచేత ఓ కధలా ముచ్చటిద్దాం. పేర్లూ, ఊర్లూ తర్వాత చెప్పుకుందాం.
అతడో పెద్ద అధికారి. భార్యా, ముగ్గురు పిల్లలు. ఉద్యోగ బాధ్యతల కారణంగా అతడు నెలలో చాలా రోజులు వేరే ఊళ్లలో ఉంటుంటాడు. ఈ క్రమంలో అతడి భార్యకు భర్త స్నేహితుడితో సంబంధం ఏర్పడుతుంది. విడాకులు తీసుకుని అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ ప్రియుడి ఉద్దేశ్యం వేరు. ఆడవాళ్ళను వాడుకుని వదిలేసే రకం.
ఈ విషయం భర్తకు తెలుస్తుంది. అధికార రీత్యా ప్రభుత్వం అతడికి సమకూర్చిన రివాల్వర్ తీసుకుని భార్యను లోబరుచుకున్న వ్యక్తి ఇంటికి వెడతాడు. నా భార్యను పెళ్లి చేసుకుని, నా పిల్లల్ని నీ పిల్లలుగా చూసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అని నేరుగా అడిగేస్తాడు. ‘నాతొ కాలక్షేపం చేసిన ప్రతి అమ్మాయిని పెళ్ళాడాలంటే నేను వెయ్యి పెళ్ళిళ్ళు చేసుకోవాల’ని అతడు ఎకసెక్కంగా మాట్లాడుతాడు. భర్తకు పట్టలేని ఆగ్రహం కలిగి పిస్టల్ తో కాలుస్తాడు. భార్య ప్రియుడు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడు. అతడు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి నేరం ఒప్పుకుని లొంగిపోతాడు. కేసు విచారణ సుదీర్ఘంగా సాగుతుంది. జ్యూరీ అతడ్ని నిర్దోషిగా పరిగణిస్తుంది. కానీ సెషన్స్ జడ్జి జ్యూరీ నిర్ణయాన్ని కాదని కేసును హై కోర్టుకు పంపుతాడు. అక్కడ అతడికి జీవిత ఖైదు విధిస్తారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు ధ్రువ పరుస్తుంది.
ఇక్కడ కధ మరో మలుపు తిరుగుతుంది.
కధలో మలుపుకు కారణం ఓ పత్రిక. ఒకానొక రోజుల్లో విపరీతమైన పాఠకాదరణ కలిగిన ఇంగ్లీష్ వారపత్రిక బ్లిట్జ్. ఆ పత్రిక ఎడిటర్ ఆర్కే కరంజియా.
ఇప్పుడు పేర్లూ వివరాలు చెప్పుకుందాం. అతడి పేరు నానావతి. నేవీ కమాండర్. స్నేహితుడి పేరు ప్రేమ్ ఆహూజా. బాగా డబ్బున్నవాడు. విలాసపురుషుడు.
బ్లిట్జ్ పత్రిక ముద్దాయిని భుజాలకు ఎత్తుకుని ధారావాహిక కధనాలు నానావతికి మద్దతుగా ప్రచురిస్తుంది. దానితో ప్రజలందరూ ఆ కేసు గురించే మాట్టాడుకోవడం మొదలవుతుంది. పాతిక పైసల పత్రికను రెండు రూపాయలు పెట్టి కొనుక్కుని చదివేవారు. నానావతి పేరుతొ పిల్లలు ఆడుకునే బొమ్మ పిస్తోల్లు, ఆహూజా పేరుతొ టీ షర్ట్లులు అమ్మడం మొదలైంది. నానావతికి నైతిక మద్దతు తెలుపుతూ ర్యాలీలు, ఊరేగింపులు జరుగుతాయి. దేశవ్యాప్తంగా నానావతి కేసు ఓ సంచలనంగా మారుతుంది.
చివరికి అప్పటి మహారాష్ట్ర గవర్నర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ క్షమాభిక్ష పెట్టి అతడి యావజ్జీవ శిక్షను రద్దు చేయడంతో కధ సుఖాంతమవుతుంది.
కేసు నుంచి బయట పడిన నానావతి తన కుటుంబాన్ని తీసుకుని కెనడా వెళ్లి అక్కడే సెటిల్ అయి అక్కడే చనిపోవడంతో అతడి కధ ముగుస్తుంది.
ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. బ్లిట్జ్ పత్రిక యజమాని, సంపాదకుడు ఆర్కే కరంజియా పార్సీ. ముద్దాయి నానావతి కూడా పార్సీ.
1959లో కాబోలు ఇది జరిగింది. అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నాను. ఆంధ్ర పత్రిక వాళ్ళు దీన్ని ఓ సీరియల్ గా ప్రచురించేవారు. బ్లిట్జ్ పత్రిక ఏమి రాసిందో తెలియదు కానీ అంధ్రపత్రిక మాత్రం ఆసక్తికరమైన వార్తా కధనాలను వండి వార్చేది.
కోర్టులో వాదోపవాదాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవడం మీద ఆ రోజుల్లో జనాలకు చాలా ఆసక్తి వుండేది. ప్రాసిక్యూషన్ తరపున రాం జెట్ మలానీ వాదిస్తే, ముద్దాయి నానావతి తరపున ఖండాలావాలా ఈ కేసు వాదించారు.
ఈ వాస్తవ కధనాన్ని ఆధారంగా చేసుకుని హిందీలో ఒక సినిమా తీశారు.
ఇరవై నాలుగు గంటల టీవీ చానళ్ళ కాలంలో ఇది జరిగివుంటే పండగే పండగ.
(ఇంకావుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి