24, జులై 2024, బుధవారం

లోకం చుడుతున్న వీరుడు రాజేష్ వేమూరి


రాజేష్ వేమూరి అనే పేరు వినగానే నాకు అల్లసాని పెద్దన విరచిత స్వారోచిత మనుసంభవం అనే మనుచరిత్ర  కావ్యంలోని ప్రవరుడు, మహాకవి ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం గుర్తుకు వస్తాయి.
ప్రవరాఖ్యుడి గురించి ఖమ్మం కాలేజీలో మా తెలుగు లెక్చరర్ ఆదినారాయణ గారు చెప్పేవారు.
అరుణాస్పదపురం అనే  ఓ మారుమూల కుగ్రామంలో కాపురం చేసుకుంటూ, తలితండ్రులను పోషించుకుంటూ త్రికాల సంధ్యాదులు సక్రమంగా క్రమంతప్పకుండా  నిర్వర్తించుకుంటూ కాలం గడిపే ఓ శోత్రియ శ్రేష్టుడు ప్రవరుడు.  అతడికి తన ఇల్లే కైలాసం. ఊరు దాటి ఎరుగడు. కానీ లోకం చూడాలనే కోరిక. పొలిమేర దాటలేని ఆశక్తత. అంచేత ఊరిలోకి ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చేవాడు. అతిథి మర్యాదల అనంతరం తాను చూడాలని అనుకుని చూడలేని ప్రదేశాల విశేషాలు వారినుంచి వింటూ తృప్తి పడేవాడు. ఈ క్రమంలో యువకుడు అయిన ఓ యువ సిద్ధుడు తటస్థ పడడం, పరాయి ప్రదేశాలను గురించి అతడు చెప్పిన సంగతులు వింటూ, ఇంత చిన్న వయస్సులో అన్ని ప్రాంతాలు ఎలా తిరిగాడని అబ్బుర పడడం,  సరే ఈ కధ ఇంతవరకే చెప్పుకుందాం. తర్వాత కధ తెలియని వాళ్ళు వుండరు. 
ఇదెందుకు చెప్పాను అంటే, ఈ కావ్యంలోని ప్రవరుడి వంటి వారు అనేకమంది ఈ నాటికీ వుంటారు. దేశాలు చుట్టి రావాలని వారికి  వుంటుంది, కానీ అందుకు అనేక అవరోధాలు. అంచేత రాజేష్ వంటి వారు దేశాలు చుట్టి రాసే పుస్తకాలు చదివి,  సంతోషించడం. ఇంత చిన్న వయస్సులో ఇన్ని దేశాలు ఎలా తిరిగారని ఆశ్చర్యపడడం.
మనుచరిత్రలోని  సిద్ధుడి వద్ద, అనుకున్నదే తడవుగా  లోకాలు చుట్టి రావడానికి పాదలేపనం అనే దివ్యమైన పసరు  వుంది.  మరి రాజేష్ దగ్గర ఏముంది. తిరగాలనే ఆకాంక్ష వుంది. దాన్ని నెరవేర్చుకునే పట్టుదల వుంది. పట్టుదలకు తగ్గట్టు సహకరించే భార్య భార్గవి వున్నారు. పోదాం పద డాడీ అంటూ  సంచి సర్దుకుని, నేనూ రెడీ అనే   చిన్నారి హన్ష్ ప్రోద్బలం వుంది. అన్నింటికీ మించి రకరకాల దేశాలు చూడాలి, అక్కడి ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలి అనే బలమైన కోరిక వుంది. విశాలమైన హృదయం వుంది. ఏతావాతా జరిగింది ఏమిటి అంటే ఇరవై రెండు దేశాల వీసా స్టాంపులు వాళ్ళ పాసుపోర్టుల్లో భద్రంగా వున్నాయి. కాణీ ఖర్చులేకుండా మనల్ని కూడా ఆ పుస్తకాల ద్వారా ఆ దేశాలు  తిప్పారు. ఈ పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పండి. ముందు ముందు మరిన్ని దేశాలు తిరుగుతారు. మరిన్ని పుస్తకాలు రాస్తారు. మనమూ  వాటిని చదువుతూ వారితో పాటు ఆయా దేశాలు ఉత్తపుణ్యానికి చదువుతాము. ఉభయతారకం అన్నమాట.
ఇంతకీ దూర్జటి పద్యం గురించి ప్రస్తావించారు కానీ ఆ ప్రసక్తి రాలేదేమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాను. ముగింపు కోసం అట్టే పెట్టాను.
శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఆఖరి నూరో పద్యం ఇది.
“దంతంబుల్పడనప్పుడే తనవునం దారూడి యున్నప్పుడే
 కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే 
విన్తల్మేన చరించనప్పుడే కురుల్వెల్ల గానప్పుడే చింతింపన్వలె
నీ పదాంబుజములన్ శ్రీ కాళ హస్తీశ్వరా!”
ప్రతిపదార్ధం అవసరం అనుకోను.  
తిరగగలిగిన వయసులో తిరగకుండా, ఇప్పుడు 78 ఏళ్ల వయసులో తిరగాలనే  కోరిక ఉన్నప్పటికీ   తిరగలేని అశక్తత కలిగిన మా వంటి వారి గురించే ఆ పద్యం రాసారని అనిపించింది. 
అయినా భక్త గోపన్న అన్నట్టు, తక్కువేమి మనకు, రాజేష్ పుస్తకం చేత వున్నవరకు.
కావున, కాబట్టి దేశాలు  తిరగలేని మా బోంట్ల తరపున వారికి  మనః పూర్వక ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

మీ అద్భుత మైన చదివించే తీరుకు సాటి లేదండీ రావు గారు

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మరి రాజేష్ గారి పుస్తకం పేరు కూడా చెప్పండి సార్.

అజ్ఞాత చెప్పారు...

ధూర్జటి పద్యంలో విదేశాటనం గురించి చెప్పలేదు కదా🤔 అయినా అలా అన్వయించుకున్నారా ? అయితే ఒకే.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అవునండి, అజ్ఞాత గారు. విదేశాటనం గానీండీ, స్వదేశంలో గానీండి అసలు పర్యటన ప్రస్తావనే‌ లేదు ఈ పద్యంలో. మరి భండారు వారికి అలా ఎందుకు అనిపించిందో! ఈ పద్యానికి ఒక సదరు శతక సంబంధ పుస్తకంలో కనిపించిన సూక్ష్మ తాత్పర్యం ఇదీ 👇.

// "శ్రీ కాళహస్తీశ్వరా! ఎప్పుడో ముసలితనము వచ్చును అప్పుడు భగవన్నామ స్మరణ చేయవచ్చును అనుకొనక శరీరము పూర్తి పటుత్వములో నున్నప్పుడే, దంతములు ఊడిపోక ముందే, స్త్రీలు అసహ్యించుకోక ముందే నీ నామస్మరణ చేయవలెను. " //



Zilebi చెప్పారు...

ఏమండీ వినరావారు

భండారు వారు "అలా అనిపిస్తోంది " అన్నారు

అందులో తప్పేముంది ? అందరూ ఒకలాగానే , శతకానికి తాత్పర్యం వ్రాసిన వారిలానే అనుకోవాలని‌ రూలేమన్నా‌ వుందా ?


అజ్ఞాత చెప్పారు...

పద్యం లో మొదటి మూడు పాదాలు మాత్రమే స్వీకరించారు భండారు గారు. చివరి పాదం మెమి లాగా స్వంతంగా వేసుకున్నారు. అయినా విదేశీ పర్యటనలు పుస్తకం చదవడం కంటే యూ ట్యూబ్ లో వీడియోలు చూడడం ఇంకా బాగుంటుంది.

Zilebi చెప్పారు...

అడిగిన వారి జవాబు రాలే మీరెవరండీ నడుమ కొంచెం ఎక్సస్ పేచీ :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

భండారు వారు తన బ్లాగులో వచ్చిన కామెంట్లకు జవాబులివ్వడం మీరెప్పుడయినా చూసారా, "జిలేబి" గారు? వారొక మౌనముని, ఒకప్పటి కొందరు ప్రధాన మంత్రులకు ఏ మాత్రం తీసిపోరు మౌనం పాటించే విషయంలో.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

సదరు పద్యపాదాలన్నీ భండారు వారు యధాతధంగానే ఇచ్చినట్లున్నారు. పద్యం పూర్తిపాఠం, భావము ఈ యూట్యూబ్ లింక్ లో వినచ్చు 👇.

https://youtu.be/0isIYrls-Sc?si=WKmcYhnXPj34mohB

Zilebi చెప్పారు...

అందుకే నండోయ్ వారి తరపున వకాల్తా పుచ్చుకొని‌ మీ పై దండ(గ) యాత్ర మొదలెట్టింది :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

వారొక మౌన స్వామి (కుర్తాళంలోని ఆంధ్రా ఆశ్రమం పేరులాగా)....... వారికి మీరొక వాగ్ధాటి గల వకీలున్నూ. సరిపోయింది.

అజ్ఞాత చెప్పారు...

మౌన స్వామి కాదు బ్లాగులో పోస్టులు వ్రాస్తూనే ఉన్నారు కదా. రేడియో లో పని చేశారు కదా one way traffic అన్న మాట. వారు చెప్పేది మనం వినాలి. శ్రోతల మాటలు వారు పట్టించుకోరు. అదన్నమాట.

Zilebi చెప్పారు...

ఏమండీ వినరా వారు
తాతగారు దీని గురించి యేమీ చెప్పడం లేదేమీ ?

అజ్ఞాత చెప్పారు...

తాత గారు కూడా ఈమధ్య "మౌనం ఉత్తమ భాషణం" అనే సీద్ధాంతం వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అయినా వారు చాలా కాలం పాటు తెలుగు బ్లాగులోకంలో ప్రముఖులుగా వెలిగారు కదా? చాలదా?

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

☝️ పై "అజ్ణాత" (7:16 pm) నేనే.

- విన్నకోట నరసింహారావు

అజ్ఞాత చెప్పారు...

ఈ అనానిమాస్ నేనే. Lol

అజ్ఞాత చెప్పారు...

సరదా కోసం ఒక సినిమాలో బాలకృష్ణ చెప్పిన సూపర్ డైలాగ్

'నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు' 🤣

Zilebi చెప్పారు...

చాలదా ?

చాల దండి .

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// "Lol" //
లాగిన్ చెయ్యకుండా కామెంట్ పోస్ట్ అయి పోవడంతో అజ్ఞాత గా పడింది. అందువల్ల అది నేనే అని చెప్పాను. అందులో "లోల"డానికేం వుంది, అజ్ఞాతుడా?

అజ్ఞాత చెప్పారు...

అయ్యో అందుకని కాదు సార్. ఎస్ ఆ అనానిమస్ నేనే అని చెబుతుంటే హిలేరియస్ గా అనిపించింది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఫర్వాలేదు లెండి 🙂👍.

అజ్ఞాత చెప్పారు...

మ మ మాస్ అనాని మాస్.
నేనే ఆ అనని మాస్.

అజ్ఞాత చెప్పారు...

పేరులో 'నేముం'ది అనామికా
రామ రామ అని అందామికా

ఉన్న పేరొక్కటే రామ రామ
నిక్కముగ చెప్పెను శ్యామ శ్యామ