2, జనవరి 2024, మంగళవారం

కౌటూరి దుర్గాప్రసాద్

 అతడు కంప్యూటర్ రంగానికి చెందినవాడు కాదు, కనీసం కంప్యూటర్ రోజువారీగా ఉపయోగించేవాడు కూడా కాదు. అయినా ఒక కంప్యూటర్ సంస్థ ఒకటి అతడి పేరిట ఒక అవార్డ్ నెలకొల్పి తన సిబ్బందిలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన వారికి ఈ అవార్డ్ అందచేస్తోంది. అతడి పేరు కౌటూరి దుర్గాప్రసాద్. నిరుడు ఇదే రోజుల్లో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు. ‘దుర్గాప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకం. మా సిబ్బందిలో ఆయన స్పూర్తిని నింపాలి అనే ఉద్దేశ్యంతో ఈ అవార్డ్లులు ఇస్తున్నాం’ అని చెప్పారు EDVENSWA అనే ఆ టెక్నాలజీ కంపెనీ   CEO శ్రీకాంత్ ఉప్పులూరి.

‘ దుర్గాప్రసాద్ గారు మా నాన్నగారు శ్రీ ఉప్పులూరి కృష్ణ మూర్తి  స్నేహితులు. ఆ విధంగా నేను చిన్నతనం నుంచి ఆయన్ని ఒక మార్గదర్శిగా భావించి పెరిగాను. ఒక పనిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. ఫలితాల సాధనలో ఒక్కో దారి. ఆ రకంగా చూస్తే దుర్గాప్రసాద్ గారి మార్గం నాకు బాగా నచ్చింది. ఆయన నిబద్ధత, నిజాయితీ లక్ష్య సాధనలో ఆయన అనుసరించే విధానాలు ప్రతి ఉద్యోగికి స్పూర్తిదాయకం అనే నమ్మకం, విశ్వాసంతోనే మా కంపెనీలో ఈ అవార్డులు ఇస్తున్నాం అన్నారాయన.

రిటైర్డ్ ఐ.పీ.ఎస్. అధికారి, రచయిత శ్రీ రావులపాటి సీతారామారావు  సైబర్ టవర్స్ లోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో పాల్గొని విజేతలకు అవార్డులు అందచేయడమే కాకుండా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.   

నిరుడు మరణించి నేటికీ జీవిస్తున్న దుర్గాప్రసాద్ నా మేనల్లుడు కావడమే ఈ కార్యక్రమానికి నేను హాజరు కావడానికి ప్రధాన కారణం.

పాతిక ముప్పయ్యేళ్ల వయసులో తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్న వందమంది  యువతీయువకుల నడుమ ఓ కొంతసేపు గడపడం వల్ల  నా వయసుకూడా ఓ అయిదేళ్లు తగ్గిన భావనతో ఈరోజు గడుస్తోంది.







(02-01-2024)

కామెంట్‌లు లేవు: