1, జులై 2020, బుధవారం

మొన్న బాబు, నిన్న వై.ఎస్. నేడు మోడీ, రేపు జగన్ – భండారు శ్రీనివాసరావు

ఫేస్ బుక్ వంటి సాంఘిక మాధ్యమాలు లేని రోజులు అవి. కంప్యూటర్ అంటే అదేదో మన దేశానికి సంబంధించిది కాదనుకునే రోజులు. ఆరోజుల్లో పెళ్ళీ పేరంటాళ్ళలో, విందులు వినోదాల్లో నలుగురు చుట్టపక్కాలు కలిసినప్పుడు ఎవరైనా పొరబాటున చంద్రబాబును పల్లెత్తు మాటన్నా ఎవరూ ఊరుకునేవారు కాదు, వెనకేసుకొచ్చేవారు. 2004 లో ఆయన (టీడీపీ) ఓడిపోయినప్పుడు మా కుటుంబంలోనే వనం గీత వంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టారు, ఆ పూట వంటలు వండుకోలేదు.

వై.ఎస్.ఆర్. రెండో మారు పూర్తికాలం పరిపాలించి వుంటే జనం అలాంటి బాబును కూడా  పూర్తిగా మరచిపోయేవారేమో అన్నవాళ్లు  వున్నారు. కార్పొరేట్లకు దోచిపెడుతున్నారంటూ ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు పెడచెవిన పెట్టారు. ఆయన ప్రారంభించిన 108, 104 ఆరోగ్య శ్రీ పధకాలు సామాన్య జనం దృష్టిలో ఆయన్ని చిరంజీవిని చేశాయి.

తరవాత మోడీ శకం. ఆయన గురించి కూడా సామాన్య జనంలో ఇదే భావన. ఆయన ఏది చెప్పినా ప్రజలు వింటూనే వున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు పడిన కష్టాలన్నీ పెద్ద మనసుతో పంటి బిగువన ఓర్చుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించమంటే వెలిగించారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. కరోనా కష్టాలు వచ్చే నవంబర్ దాకా తప్పవేమో అనే మోడీ మాటను స్వీకరించారు.

ఇక ఈరోజు విజయవాడలో 108, 104 వాహనాలు ఊరేగింపుగా వెడుతున్న దృశ్యాలు టీవీల్లో చూసిన వారికి కూడా అనిపించి వుంటుంది. రేపటి రోజులు జగన్ వే అని.       


6 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

"పెళ్ళీ పేరంటాళ్ళలో, విందులు వినోదాల్లో నలుగురు చుట్టపక్కాలు కలిసినప్పుడు ఎవరైనా పొరబాటున చంద్రబాబును పల్లెత్తు మాటన్నా ఎవరూ ఊరుకునేవారు కాదు"

"2004 లో ఆయన (టీడీపీ) ఓడిపోయినప్పుడు మా కుటుంబంలోనే వనం గీత వంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టారు"

ఈ రెంటినీ కలిపి చూద్దాం. రెండు విషయాలు సుస్పష్టం.

1. చంద్రబాబు ఓడిపోవడానికి కారణం అతడి మీద ప్రజలకు నమ్మకం పోవడం
2. ఇంకా అతడి మీదే నమ్మకం పెట్టుకున్న పట్టణ అగ్రకుల ఎగువ తరగతి ప్రజలకు ఆ వాస్తవం మింగుడు పడలేదు

ఏతావాతా తేలేది ఏమిటనంటే తమకే అన్నీ తెలుసని భ్రమలో ఉన్న లేదా తమకు నచ్చినదే "అలగా వెధవలు" ఒప్పుకొని తీరాల్సిందేనన్న అహంకారం కలిగిన వారికి ఏమీ తెలీదు. జనం నాడి తెలియని (కనీసం తెలుసుకోవాలన్న ఇంగితం లేని) వారు సమాజానికి నాయకులు కాదు సరికదా ప్రతినిధులు కూడా కారు, కాలేరు.

Those who suffer from a public disconnect can never become opinion leaders. If you want to influence opinion, first find out what & why.

PS (చంద్రబాబు అభిమానుల కొరకు): ఈ వ్యాఖ్య చంద్రబాబు గురించి కాదు. తమ తమ సొంత బయాసులను జనాభీష్టమని లేదా ప్రజోపయోగమని భ్రమించే వర్గాలు ఆత్మపరీక్ష చేసుకోవాలని మాత్రమే నా ఉద్దేశ్యం.

శ్యామలీయం చెప్పారు...

మిత్రులు జై గారు,
మీరు గొప్ప వారండీ. ఏ ఒక్క అవకాశమూ వదలుకోరు కదా, చంద్రబాబు(అంతేనా? చంద్రబాబు & కో వారందరి మీదా) వాగ్బాణాలతో పొడవటానికి. ఒకరకంగా మీ‌అత్యాశక్తి ముచ్చటవేస్తున్నది. ఇక్కడ భండారు వారు ఎవరు ఎందుకు గెలిచారూ లేదా ఓడారూ అన్న విషయం‌ గురించి లోతైన చర్చను చేయలేదు కదా. కేవలం తను చెప్పదలచుకొన్న విషయానికి సంబంధించి ఉపరిస్పర్శగానే ప్రస్తావించారు. మీరైతే అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నారు. సెబాసో సెబాసు. కొసాకి మీరు ఈ వ్యాఖ్య చంద్రబాబు గురించి కాదంటూ‌ ఒకముక్క జోడించారు చూడండి అది మరింత శ్లాఘనీయమైన ఎత్తుగడ అని ఒప్పుకొని తీరాలి. ఎవరెందుకు గెలిచారో ఎవరెందుకు (ఓడి)పోయారో అన్నది ఎల్లప్పుడూ జనం చర్చించుకొనేందుకు పనికివచ్చే అంశం అన్నది నిజమే‌ ఐనప్పటికీ అది రానురాను మేధావివర్గం వారికి విశ్లేషణలపేరుతో అనునిత్యమూ గంధపంకాదులనలదేందుకు పనికివచ్చే అంశంగా అవుతున్నది, ఇప్పటికే ఐనది కూడా. ఎంతకాదన్నా, అందరూ కొద్దోగొప్పో సామాన్యులే విధి ముందు. ఓడతానని చంద్రబాబూ అనుకొని ఉండడు, పోతానని రాజశేఖరుడూ అనుకొని ఉండడు. ప్రస్తుతం‌ జనాభీష్టమని లేదా ప్రజోపయోగమని ఎంతో చేస్తున్నాడని కితాబులు అందుకొంటున్న వారు రేపటిరోజులు తమవే అనుకోవటం అవశ్యం సబబేను. అప్పట్లో‌ బాబు మళ్ళా రావటం సబబు అనుకొన్నవారూ, రాజశేఖరుడు కలకాలం రాజ్యం ఏలటం సబబు అనుకొన్నవారూ లేరూ. ఇలాంటీ సబబైనవీ, సబబని జనమో మేధావులో అనుకొన్నవాటిని విధి ఎంతవరకూ అమోదిస్తున్నదీ అన్నది ఎప్పుడూ చెప్పలేం‌ కదా. ఎందుకంటే విధి తనప్రణాళిక ప్రకారం నడుస్తుంది కాని మన మేధావుల అభిలాషలకు అనుగుణంగానో‌, జనం నాడి అని ప్రచారంలో ఉండే మాట ప్రకారమో కాదు. మీరన్నట్లు ప్రజల్లోని కొన్ని వర్గాలు ఆత్మపరీక్ష చేసుకొంటూనే ఉండాలి ముఖ్యంగా పరీక్షాకాలాల్లో. తద్భిన్నవర్గాలు పరీక్షలు పెడుతున్నాం విపక్షానికి అనుకుంటారు కాని విధి తమకూ పరీక్షలు పెట్టగలదని ఎన్నడూ‌ అనుకోరు. చిత్రం. కొసాకి చెప్పవచ్చే‌ మాట ఏమిటంటే చర్చలు భేషుగ్గా చేయవచ్చును కాని విధిని మనం నిర్ణయించలేం అని. కాబట్టి అన్నిపక్షాలు కొంచెం వినయగుణం కలిగి ఉండటం బాగుంటుంది.

అజ్ఞాత చెప్పారు...

చంబా అభిమానులు ఏవేవో డొంకతిరుగుడు సుదీర్ఘ గజిబిజి వ్యాఖ్యలు వ్రాసే బదులు అసలు వాస్తవాన్ని ఒప్పుకోరు.
The fact is people outrightly rejected Chandra Babu and his spoon media.

అజ్ఞాత చెప్పారు...

కన్నుల పండుగగా ఉన్న కొత్త అంబులెన్సులు చూసి కుల్లి కుళ్ళి ఏడుస్తాయి పచ్చ మూకలు

అజ్ఞాత చెప్పారు...

You hit the nail on its head Jai Garu. Apt analysis. Totally agree with you.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

నా వ్యాఖ్య చంద్రబాబు గురించి కాదని మీరు నమ్మ(లే)కపోతే మీ ఇష్టం. కావాలంటే చంద్రబాబు/టీడీపీ స్థానంలో ప్రభాస్/సాహో సినిమా మార్చుకొని చూసుకోండి.

ప్రజాస్వామ్యంగా అంతిమంగా నిర్ణేతలు ప్రజలే. జనాభీష్టాన్ని తెలుసుకొని అందుకు అనుగుణంగా వళ్ళు దగ్గర పెట్టుకొని పని చెసిన నాయకులను ఆదరించడం చైతన్యవంతులయిన భారత జనావళికి పరిపాటి. కొన్ని చిన్నచిన్న పొరపాట్లు ఉన్నా overall direction బాగుంటే తప్పిదాలను క్షమించగలిగిన సహృదయం వారి ప్రత్యేకత. నేనే పుడుంగు, జనానికి ఏది మంచో నాకే ఎరిక అని విర్రవీగిన ప్రతోడిని మట్టి కురిపించడం ఇంకో స్పెషాలిటీ. The Indian public may be generous when it comes to failure but is ruthless on bad attitude.

చంద్రబాబు ఓడిపోయాడనడం పాక్షిక సత్యం. రాజకీయ పరిపక్వత & విజ్జ్యత కలిగిన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అతడిని ముక్తఖంఠంతో తిరస్కరించారనడమే సంపూర్ణ స్పష్ట అన్వయనం. Let us not reverse cause & effect.

ఫలానా పార్టీ/సినిమా/జట్టు గొప్పయని నమ్మడం కేవలం ఒక అభిప్రాయం. అవి సూపర్ డూపర్ హిట్టవుతాయని ఢంకాపథంగా చెప్పడం అంచనా.

A proper analysis requires knowledge, empathy, rational curiosity and a degree of hands-off objectivity.

వాస్తవ పరిస్థితులకు దూరంగా అద్దాల మేడలో ఉంటూ తమ అభిప్రాయాలనే జనమతంగా పరిగణించే వ్యక్తులు రోజూ టీవీలలో కనిపిస్తూనే ఉంటారు. ఇందుట్లో దాదాపు అందరూ చదువుకున్న ఎగువ తరగతి అగ్రవర్ణ పట్టణ ప్రాంతీయులే. ఎవరికీ జనమంటే పట్టదు, గిట్టదు, కొండొకచో చులకన.

చంద్రబాబును (లేదా సాహో సినిమాను) ప్రజలు తిరస్కరించారు. కారణాలను విశ్లేషించుకుని సరిదిద్దు చర్యలు చేబడితే తదుపరి తడవ హిట్టు, కాకుంటే ఫట్టు. జనాభీష్టం ఏమిటో కనుక్కొనే ప్రయత్నం కూడా చేయని, పైగా అది అవసరం కూడా కాదనే స్వభావం కలిగిన "విశ్లేషకులు" మాత్రం *ఎప్పుడూ* ఓడిపోతూనే ఉంటారు. Politicians are defeated by people but the "experts" defeat themselves through ivory tower attitude that disconnects them from the masses.

PS: మీరు ఆక్సిడెంట్ గెలుపోటములు రెంటినీ ఒకే గాడి మీద వేయడం comparing apples with oranges అవుతుంది. Considering every outcome as random & non-assignable is fatalist & pessimistic.