4, డిసెంబర్ 2019, బుధవారం

సినీ ప్రముఖులు - సాంఘిక బాధ్యత


‘కాదేదీ కవితకనర్హం’ మాదిరిగా ఈనాడు ప్రతి విషయమూ టీవీల్లో రోజుల తరబడి చర్చల కొనసాగింపుకు ముడి సరుకుగా మారుతోంది. అది ఇసుక  కావచ్చు, తెలుగు మాధ్యమం కావచ్చు,కులం కావచ్చు, మతం కావచ్చు, కులం కావచ్చు  మరేదైనా కావచ్చు. సినీ పరిశ్రమలోని  కొందరు  ప్రముఖులకు తెలుగే  రాదంటూ ఆ రంగానికే చెందిన మరో ప్రముఖుడి చేసిన  తాజా వ్యాఖ్య ఆ కోవలోనిదే. హైదరాబాదులో ఒక యువతి అత్యాచారానికి, హత్యకు గురైన నేపధ్యంలో తెలుగు సినీరంగ ప్రముఖులు చాలామంది తమ సామాజిక బాధ్యతగా భావించి ఆడపిల్లలకు అండగా నిలబడదాం అంటూ ధైర్యం  చెప్పే ప్రకటనలు టీవీల్లో వస్తున్న సమయంలోనే ఈ రకమైన చర్చకు తెర లేవడం కాకతాళీయం కావచ్చు. 
ఈ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ రాసిన అనంతం గ్రంధంలో పేర్కొన్న ఒక విషయం జ్ఞాపకం వస్తోంది.
ఆ రోజుల్లో ‘సినిమా రచయితలు - సాంఘిక బాధ్యత’ అనే అంశంపై ఒక సదస్సు ఏర్పాటు చేసి సినీ ప్రముఖులను ఆహ్వానించారు.    
మహాకవి శ్రీశ్రీతో పాటు  మరో  ప్రసిద్ధ సినీ రచయిత  త్రిపురనేని మహారధికి ఈ సదస్సులో మాట్లాడే పనిపడింది. సమయాభావం కారణంగా కొంతమందికి ప్రసగించే అవకాశం లభించలేదు. మహారధి, శ్రీ శ్రీ పక్కపక్క కుర్చీలలో కూర్చుని వున్నప్పుడు  మహారధి శ్రీశ్రీతో ఇలా అన్నారు.
‘నాకు కనుక మాట్లాడే అవకాశమే వస్తే, నా ప్రసంగాన్ని ‘సినిమా రచయితలు అందరూ సాంఘిక బాధ్యతను  మరచిపోయిన తర్వాతనే సినిమారంగంలో ప్రవేశించారు’ అనే  వాక్యంతో మొదలు పెడతాను’.
మహారధి వ్యక్తపరచిన ఈ అభిప్రాయంతో శ్రీశ్రీ పూర్తిగా ఏకీవభించారు.
అయితే, ముందే అనుకున్నట్టు మహారధి గారికి    సదస్సులో ప్రసంగించే అవకాశం చిక్కనేలేదు.
ఈ విషయాన్ని శ్రీశ్రీ తన ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల, ‘అనంతం’ లో రాసుకున్నారు.
అనంతం నవల (?) కి ఈ  ‘ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల’  అనే ట్యాగ్ లైన్  ఎందుకు పెట్టారన్నది తెలియదు. పైగా ఆత్మకధ అని పెట్టరాదని శ్రీశ్రీ ఆంక్ష పెట్టారని శ్రీ చలసాని ప్రసాద్ ఆ పుస్తకం మలి ప్రచురణ ముందు మాటలోనే రాసారు.
       

2 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

అదేమిటోగాని పోస్ట్ టైటిల్ కి కాంటెంట్ కి అస్సలు సంబంధం లేనట్లుంది!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ సూర్య : కాబోలు. కాస్త వెతికి పట్టుకోవాల్సి వుంది.