24, డిసెంబర్ 2018, సోమవారం

Did AP CM Chandrababu Naidu Release Facts in White Paper about Developme...







చెప్పాలనుకుని........ భండారు
శ్రీనివాసరావు
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP
24 X 7  న్యూస్
ఛానల్ లో
 Debate With Venkata
Krishna చర్చాకార్యక్రమం. శ్రీ రవిచంద్రారెడ్డి
(కాంగ్రెస్), శ్రీ మాల్యాద్రి (టీడీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ
పార్ధసారధి (జనసేన), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ).
ఇలాంటి టీవీ చర్చల్లో ఎన్నో చెప్పాలని
అనుకుంటాం. సమయాభావం కారణంగా కుదరక పోవచ్చు. అలాగే  అడగాలని అనుకుంటారు. పరిమితుల కారణంగా అడక్క
పోవచ్చు. కొంప మునిగేదేమీ వుండదు. తెల్లారి లేస్తే మళ్ళీ ఏదో ఒక టీవీలో ఈ చర్చలు
తప్పవు.
ఈరోజు ప్రధానమైన చర్చ టీడీపీ వెలువరించిన
శ్వేత పత్రం.
గత ఆరేడు నెలలకు పైగా కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాల నడుమ, మరీ చెప్పాలంటే బీజేపీ, టీడీపీ ల నడుమ నిధుల విడుదల, వాటి
జమాఖర్చుల విషయంపై బహిరంగ మాటల పోరాటమే నడుస్తోంది. వచ్చే వారంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన
దీన్ని పరాకాష్టకు చేర్చింది. హామీల అమలుకు పూనుకోని ప్రధాని రాష్ట్ర పర్యటన వల్ల
రాష్ట్రానికి ఒరిగేది ఏమిటని టీడీపీ ప్రశ్న. అనేక శ్వేత పత్రాల రూపంలో ఈ
ప్రశ్నల్ని సంధించడానికి, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి చర్చకు తెర తీయాలన్నది
చంద్రబాబు సంకల్పం. తానూ ఏది చేసినా దానికి తగు ప్రాచుర్యం కల్పించడంలో ఘనాపాటి
అయిన బాబుకు ఇదేమీ పెద్ద విషయం కాదు. అదికాదు విషయం.
ఇదేదో రెండుపార్టీల మధ్య వ్యవహారం
కాదు. రాష్ట్రానికి చాలా చేశానని కేంద్రం చెబుతోంది. విభజన హామీలు నెరవేర్చడంలో
కేంద్రం పూర్తిగా విఫలం అయిందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ మాటలు జనాలకు
కొత్తేమీ కాదు. వాళ్ళు పదేపదే చెబుతున్నవే.
కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రము ఎంత
ఖర్చు పెట్టింది అనే విషయంలో ఎవరి లెక్కలు వారివి. ఈ శ్వేత పత్రాలు అయినా ఆ
సందేహాలను తీరుస్తాయా అంటే అనుమానమే. మామూలు ప్రకటనలకు శ్వేత పత్రాలకు చాలా తేడా
వుంది. ఇవి సాధికారకం. చెప్పి తప్పించుకోవడానికి వీలు వుండదు.
గత కొంత కాలంగా చెబుతున్న విషయాలనే
చర్విత చరణం మాదిరిగా వీటిలో వల్లె వేస్తె ప్రజలకు సరయిన సమాధానం దొరకదు. కేంద్రం
కూడా శ్వేత పత్రాల రూపంలో జవాబు ఇస్తే సందేహాలు కొంతవరకయినా తీరతాయి.
కేంద్ర సాయం లేకుండా రాష్ట్రము
ఇబ్బందుల నుంచి గట్టెక్కడం కష్టం. అందుకోసం ధర్మ పోరాటాలు చంద్రబాబు
కొనసాగిస్తున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని అఖిలపక్షాన్ని వెంటబెట్టుకుని
ప్రధానమంత్రిని రాష్ట్ర పర్యటనలో కలుసుకుని ఉమ్మడిగా ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే
దానికి రాజకీయంగా చాలా బలం వుంటుంది. ఒకవేళ ప్రధాని అప్పాయింట్ మెంటు ఇవ్వకపోతే
అప్పుడు తప్పు అటువైపు వుంటుంది.
ఎన్నికలు గుమ్మం ముందు ఉన్న సమయంలో
పాలకపక్షం ఇటువంటి చొరవ తీసుకుంటుందా, అందుకు ప్రతిపక్షాలు కలిసి వస్తాయా?
అనుమానమే. ఎలాంటి అనుమానం లేకుండా ఈ
జవాబు చెప్పొచ్చు.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
రాజకీయ తుపాను కమ్ముకుని వుంది. ఎన్నికలు అయ్యేంతవరకు ఇది తీరాన్ని దాటదు.      

కామెంట్‌లు లేవు: