25, మే 2018, శుక్రవారం

ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్ల పాలన – భండారు శ్రీనివాసరావు

(ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం)
2014 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మొదటి ఏడాది పాలన ముగియవచ్చిన సందర్భంలో లోకసభలో నాటి ప్రతిపక్షనేత రాహుల్ గాంధి ఒక వ్యాఖ్య చేశారు, ‘ఈఏడాది కాలంలో మోడీ దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేద’ని. తన వ్యాఖ్యకు వత్తాసుగా రాహుల్ మరో మాటను జోడించారు. ‘మోడీ పాలనకు తాను సున్నా మార్కులు వేస్తున్న’ట్టు చెప్పారు. అదీ ‘ఉత్త సున్నా కాదు, గుండు సున్నా’ అని ఎద్దేవా కూడా చేసారు. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలను బీజేపీ నాయకులు సహజంగానే తిప్పికొట్టారు. ఇటువంటి విషయాల్లో నాలుక పదును బాగా వున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (అప్పటి ఎన్నికల్లో అమేధీలో రాహుల్ గాంధి మీద పోటీ చేసి ఓడిపోయి కూడా మోడీ కరుణాకటాక్షాల వల్ల కేంద్ర మంత్రివర్గంలో చేరారు) ప్రతివ్యాఖ్య చేస్తూ ఒకింత ఘాటుగానే స్పందించారు.
‘మోడీ ఏమీ చేయలేదంటున్న రాహుల్ గాంధీ, ‘తనను గెలిపించిన అమేథీ నియోజక వర్గానికి ఆ ఏడాది కాలంలో చేసింది సున్నా కంటే తక్కువ’ అనేశారు. అంతటితో ఆగకుండా, ‘పదేళ్ళ యూపీయే పాలన, ఏడాది రాహుల్ పార్లమెంటు సభ్యత్వకాలం పరిగణనలోకి తీసుకుంటే ‘సున్నకు సున్నా, హళ్లికి హళ్లి’ అంటూ కొట్టిపారేశారు.
రాజకీయాల్లో ఈ మాదిరి వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు అత్యంత సహజం అనుకుంటే పేచీయే లేదు. కానీ ఈనాటి రాజకీయాల తీరుతెన్నులే వేరు.
ఇలాంటి సందర్భం మరోసారి వస్తోంది. ఈ ఏడాది మే ఇరవై ఆరోతేదీకి నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ళు పూర్తవుతున్నాయి.
ఈ ఘడియ దగ్గర పడడానికి నెలా, నెలన్నర ముందు అంటే ఏప్రిల్ లో మోడీ తన పాలనపై తనే ఒక వ్యాఖ్య చేశారు.
“ఈ దేశానికి ఇక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాను. నాకు చరిత్రలో స్థానం అక్కర లేదు. నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప, నూటపాతిక కోట్ల మంది ప్రజలు తప్ప..”
లండన్ వెస్ట్ మినిస్టర్ టౌన్ హాల్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రసంగం చేసినప్పుడు విడవకకుండా మోగిన కరతాళధ్వనుల ప్రతిధ్వనులు జనం చెవుల్లో గింగురుమంటూ ఉన్న నేపధ్యంలో నెల రోజులు తిరక్కముందే కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో చేతికి చిక్కింది అనుకున్న విజయం ఆఖర్లో చేజారి కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయినప్పటికీ బీజేపీ గతంలో కంటే తన స్థానాల సంఖ్యను బాగా మెరుగుపరుచుకుంది. మిగిలిన పార్టీల కంటే అత్యధిక స్థానాలు సంపాదించుకున్న ఖ్యాతిని తన ఖాతాలో వేసుకుంది. కానీ, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్ సంఖ్యకు ఎనిమిది సీట్ల దూరంలో బీజేపీ విజయ యాత్ర ముగిసింది. (రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి)
అయితే తదనంతర పరిణామాలు మోడీకి. ఆయన నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీకి తేరుకోలేని అపఖ్యాతిని మూటగట్టి పెట్టాయి.
ఈ నేపధ్యంలోనే లండన్ టౌన్ హాల్ మీటింగులో మోడీ మాటలను పునశ్చరణ చేసుకోవాల్సిన వస్తోంది. లండన్ ప్రసంగంలో స్పష్టంగా కనవచ్చిన నిజాయితీ కర్నాటక వ్యవహారాల్లో ఆయన పార్టీ అనుసరించిన విధానాల్లో ప్రతిఫలించిందా అంటే ‘ఔన’ని చప్పున చెప్పలేని పరిస్తితి.
బీజేపీకి అత్యధిక స్థానాలు లభించిన మాట వాస్తవమే. కానీ కాంగ్రెస్, జెడిఎస్ కలిపి సాధించిన స్థానాలు అంతకంటే ఎక్కువే. అయినా ప్రభుత్వం ఏర్పాటుకు ఆ రెండు పార్టీలు ముందుకు వచ్చినా కాదని, కర్నాటక గవర్నర్ వజుభాయ్ వాలా, బీజేపీ నాయకుడు యడ్యూరప్ప చేత ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈలోగా కాంగ్రెస్ సుప్రీం తలుపు తట్టడం, అత్యున్నత న్యాయస్థానం అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఉభయ పక్షాల వాదప్రతివాదనలను ఆ రాత్రంతా విని తెల్లవారే సమయంలో తీర్పు ఇవ్వడం జరిగింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం జరగకుండా ‘నిలుపుదల’ ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరించింది. శాసన సభలో బలం నిరూపించుకోవడానికి గవర్నర్ యడ్యూరప్పకు పదిహేను రోజులు వ్యవధానం ఇస్తే, సుప్రీం మాత్రం ఆ వ్యవధిని ఇరవై నాలుగు గంటలకు కుదించడంతో రాజకీయ పరిణామాలు ఊహించనంత వేగంతో మారిపోయాయి. కావాల్సిన సంఖ్యా బలాన్ని కూడగట్టుకోవడంలో విఫలమైన యడ్యూరప్ప బల పరీక్షకు ముందే చేతులు ఎత్తేసి రాజీనామా చేయడం, తక్కువ స్థానాలు గెలుచుకున్న జేడీఎస్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం, కుమారస్వామి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన పరమేశ్వరన్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. మోడీ సర్కారు నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకోబోయే ఆఖరు ఘడియల్లో జరిగిన ఈ పరిణామాలు జాతీయ పాలక పక్షానికి మింగుడు పడని వ్యవహారాలుగా పరిణమించాయి. అనుకోని ఈ సంఘటనలు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి జాతీయ అధ్యక్ష బాధ్యతలు కొత్తగా స్వీకరించిన యువ నేత రాహుల్ గాంధీకి ఒకింత ఊరటను, మరింత ఉత్సాహాన్ని కలిగించి ఉంటాయనడంలో సందేహం లేదు. సరే! ఈ విషయాలు అలా ఉంచుదాము.
అందరికీ గుర్తుండే వుండాలి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాసారు.
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు అప్పగించారు. మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
‘దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని అందించడం మా ప్రభుత్వ లక్ష్యం. మీరు కలలు కంటున్న మంచి భారతాన్ని మనం కలిసి నిర్మించుకుందాం. ఈ విషయంలో మీ సంపూర్ణ సహకారం, మద్దతు నాకు లభిస్తుందన్న విశ్వాసం నాకున్నది’ అంటూ ప్రధాని తన లేఖ ముగించారు.
ఈ మాటలు చెప్పిన తరువాత మరో ఏడాది కాలగర్భంలో కలిసింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా అంటే చప్పున జవాబు చెప్పడం కష్టం.
అంచేతే కాబోలు తన పాలన రెండేళ్ళు పూర్తయిన కొన్ని మాసాలకే మోడీ తన అంబుల పోదిలోని బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించారు. సైనిక దాడి ‘సర్జికల్ స్త్రయిక్’ తో పోల్చతగ్గ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అకస్మాత్తుగా ప్రకటించి ప్రజలనూ, పార్టీలను నివ్వెర పరిచారు. అయితే ప్రయోగించిన చాలా కాలం వరకు ఆ అస్త్రం గురికి తగిలిందా, గురి తప్పిందా అనే విషయంపై వాదోపవాదాలు సాగుతూనే వున్నాయి. ఇలా ఉండగానే మరో రెండేళ్ళ పదవీ కాలం పూర్తి అవుతోంది. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో సాధించిన విజయాల వల్ల సాధించుకున్న ప్రతిష్టను, తగినంత బలం లేకపోయినా కొన్ని రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకునే క్రమంలో ఆ పార్టీ అనుసరించిన అనైతిక విధానాలు మసకబారేలా చేసాయి. పులిమీద పుట్రలా కర్నాటక పరిణామాలు.
మరో ఏడాది మాత్రమే పదవీ కాలం మిగిలుంది. మోడీ మనసులో ముందస్తు మాట మెదులుతోందని వస్తున్న సమాచారం నిజమైతే ఇక అంత వ్యవధానం కూడా ఉండకపోవచ్చు.
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
వచ్చే ఏడాది ఎన్నికల కాలమే కనుక రాజకీయ ప్రత్యర్ధుల నడుమ వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు ముదిరి పాకాన పడడం వింతేమీ కాదు. నాలుగేళ్ళుగా బీజేపీ పాలకులు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నలభయ్ ఏళ్ళలో సాధించలేని ప్రగతిని నాలుగేళ్లలో చేసి చూపించామని మోడీ మద్దతుదారులు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం ఎట్లాగో చేస్తారు. ప్రతిపక్షాలు చెబుతున్నట్టుగా ‘పాలకపక్షం ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని నిష్క్రియాపరత్వం ప్రదర్శించింది’ అనడం పూర్తిగా నిజమూ కాదు, అలాగే ‘కళ్ళు మిరుమిట్లు గొలిపే పురోగతిని సాధించాము’ అనే ప్రభుత్వ పక్షం ప్రకటనలు కూడా సంపూర్తిగా వాస్తవమూ కాదు. అసలు వాస్తవం ఈ రెంటి నడుమా వుంటుంది. కాకపోతే, రాజకీయం వారిచేత అలా మాట్లాడిస్తుంది.
గత ప్రభుత్వాల వైఫల్యాల పాత జాబితాలను పదేపదే వల్లె వేస్తూ పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. కాలం గడుస్తున్నా మళ్ళీ ఆ పాత పల్లవే అందుకుంటూ వుంటే, ప్రజలు విసిగిపోయి, మరొకర్ని పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు పెడతారు.
పాలకులు గమనంలో ఉంచుకోవాల్సిన వాస్తవం ఇది. (EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 9849130595
(మే నెల ఇరవై ఆరవ తేదీకి నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ళు)

4 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...



ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్ల పాలన - చప్పున జవాబు చెప్పడం కష్టం :)

జిలేబి

bonagiri చెప్పారు...

దేశం దశ, దిశ మార్చగల అద్భుతమైన అవకాశాన్ని రాష్ట్రాల ఎన్నికలు గెలవడం కోసం వృధా చేసారు.

అజ్ఞాత చెప్పారు...

కర్ణాటక పుచ్చలకాయ ఎన్నికలతో మీడియా ఛానెల్లు
బుచికి విశ్లేషణలతో వారం రోజులు సంపకతిన్నాయి. మళ్లీ మీరు పూస గుచ్చినట్టు చెప్పడం అవసరమా సార్. కర్ర విరగదు పాము చావదు అన్నట్టు ఏమిటి మీరు చెప్పేది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: నిజమే.