5, జులై 2016, మంగళవారం

‘శ్రీరాముడు చెప్పిన’భగవద్గీత


(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 10-07-2016, SUNDAY)
(ఆదివారం ఆటవిడుపురాజకీయాలకు నేడు సెలవు)
అనగనగా రాముడు. ఆయనకో బంటు. పేరు హనుమంతు. రాముడికో కోరిక కలిగింది. నాడు లంకలో రావణుడి చెరలో వున్న సీతను తిరిగి తెచ్చుకునే నిమిత్తం సముద్రం దాటేందుకు వీలుగా వానర సేన సాయంతో నిర్మించిన వారధి, అదే  రామసేతు, ఇప్పుడు ఎలావుందో చూద్దామనిపించింది. ఏదో సినిమాలో హీరో చిన్నప్పుడు పెరిగి, తిరిగిన  ఊళ్లు వెతుక్కుంటూ తిరిగినట్టు,  శ్రీ రాముడు కూడా ఇన్ని యుగాలు, మన్వంతరాలు గడిచిపోయిన తరువాత రోజు రామబంటు ఆంజనేయుడిని వెంటబెట్టుకుని భూలోకానికి వచ్చాడు. తాము వనవాసంలో వుండగా రావణుడు అపహరించుకు పోయిన సీతను మళ్ళీ తన కళ్లబడేలా చేసిన వారధి అంటే ఆయనకు ఎంతో మక్కువ. దాన్ని చూడగానే దానిపట్ల ఆయన పెంచుకున్న ఇష్టం ఆయన మాటల్లో మరో సారి బయట పడింది.
హనుమా! వారధి నిర్మాణానికి నువ్వూ, నీ సహచర వానరులు పడ్డ శ్రమను నేనారోజుల్లో కళ్ళారా చూసాను. మొబిలైజేషన్ అడ్వాన్సులు సరే కనీసం హీనపక్షం రోజు కూలీ కూడా అడగకుండా ఇంత బ్రహ్మాండమయిన వంతెనను నాకోసం ఎంతో కష్టపడి కట్టారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నో యుగాలు గడిచిపోయాయి. ఎన్నెన్నో ప్రకృతి ఉత్పాతాలు ఏర్పడ్డాయి. మరెన్నో సునామీలు సంభవించాయి. అయినా కానీ, ఆనాటి రామసేతు ఆనవాళ్ళు మాత్రం వీటన్నిటినీ తట్టుకుని నిలిచాయి. అంటే వంతెన నిర్మాణంలో మీరు ఉపయోగించిన ఇంజినీరింగ్ పనితనం అంత గొప్పదన్న మాట. ఇక ఇప్పటి సంగతులా  చెప్పే పనే లేదు. కడుతుండగానే కూలిపోయేవి కొన్ని, కుంగి పోయేవి మరికొన్ని అంటూ రాముడు కాసేపు ఆగాడు.
ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న హనుమ వెంటనే అందుకున్నాడు.
జై శ్రీరాం! రామ సేతు నిర్మాణంలో మా గొప్పదనం ఇసుమంత కూడా లేదు. మేము చేసిందల్లా రాళ్ళపై నీ పేరు రాయడం వరకే. వంతెనకోసం టిస్కో కంపెనీ ఉక్కు దిమ్మలు వాడలేదు. అంబుజా సిమెంటో, ఏసీసీ సిమెంటో ఉపయోగించలేదు. అయినా కానీ, నీ దయవల్ల అది గట్టిగా నిలబడింది. అయినా రామయ్యా! పాత సంగతి ఇప్పుడెందుకయ్యా!
రాముడన్నాడు.
కలియుగం వచ్చేసింది ఆంజనేయా! మన రోజులు కావివి. ఇప్పుడు రామసేతును పడగొట్టి దాని స్తానంలో కాలువ లాటిదేదో నిర్మించాలని కొందరు అనుకుంటున్నట్టు మధ్య టీవీ స్క్రోలింగులలో చూసాను. కాలువ నిర్మిస్తారో లేదో కానీ మనం కట్టిన సేతువుని తొలగించడం ఖచ్చితమనిపిస్తోంది. ఎందుకంటే, కాలువ కాంట్రాక్టులో కోట్ల డబ్బు కొందరి చేతుల్లోకి చేరడం ఖాయం. మరికొందరి చేతులు తడిపయినా సరే, వాళ్లు కాంట్రాక్టును దక్కించుకోవడం మరింత ఖాయంగా కనబడుతోంది. మాల్తూసియన్ అనే ఒక ఆర్ధిక వేత్త ఏనాడో చెప్పాడు కదా. జనాలకు ఉపాధి కల్పించడానికి ఒక మార్గం చెప్పాడు. అదేమిటంటే ముందు ఒక గొయ్యి తవ్వించు. మళ్ళీ దానిని పూడ్పించు. గొయ్యి తవ్విన వాడికో పని. దాన్ని పూడ్చినవాడికి మరో పని. తవ్వేవాళ్ళ సంగతి అటుంచు. తవ్వించేవాడికి అంతా మనీనే! అసలా గొయ్యి ఎందుకు తవ్వాలో ఎందుకు పూడ్చాలో అడిగే నాధుడు వుండడు. అలాగే ఇప్పుడు రామసేతు వ్యవహారం. పడగొట్టినందుకు డబ్బులు. మళ్ళీ కాలవ నిర్మించినందుకు డబ్బులే డబ్బులు.

మాటలు వింటూనే హనుమంతుడిలా అన్నాడు.
రోజుల్లో వంతెన నిర్మాణానికి మేము కూలీ డబ్బులు తీసుకోకుండా పని చేసిన మాట వాస్తవమే. అటు రాజ్యలక్ష్మిని,ఇటు గృహలక్ష్మిని పోగొట్టుకుని వుసూరుమంటూ అడవుల్లో తిరుగుతూ వున్న మీనుంచి డబ్బు డిమాండ్ చేయడం  మాకు సబబుగా  అనిపించలేదు. అదీకాక పళ్ళూ కాయలు తిని పొట్ట నింపుకునే మా వానరులకు ఆ పాడు విత్తముతో పని ఏముంటుంది? కాకపొతే, మానవులున్నారే వాళ్లు మామూలు వాళ్లు కాదు. క్షమించాలి. మాట తొందర్లో మీదీ అదే జాతి అని మరచిపోయి మాట తూలాను. అయినా కానీ, కలియుగం మానవులకూ, మన కాలం నాటి మానవులకూ పోలికెక్కడ ప్రభూ. మీరు మీరే! వాళ్లు వాళ్ళే! వాళ్లు బాగా వొళ్ళు బలిసి పోయి వ్యవహరిస్తున్నారు. అలాటి వారినుంచి డబ్బు పిండినా తప్పులేదు. అసలా వంతెన కట్టింది మేము. దాని ఆనుపానులన్నీ తెలిసింది మాకు. అలాటప్పుడు దాన్ని కూలగొట్టడం ఎలాగో మాకు తెలిసినంతగా వేరేవారెవ్వరికీ తెలిసే వీలు లేదు. కాబట్టి మనమే వెళ్లి మన సంగతి మూఢ మానవులతో చెప్పుకుని పనేదో నెత్తికెత్తుకోవడం మంచిదేమో ప్రభూ
హనుమా! ఆగు, తొందర పడకు. నీకు శారీరక బలం తప్ప మేధోపరమయిన తెలివితేటలు పూజ్యం. బలం కూడా ఎవరయినా గుర్తుచేస్తేనే నీకు గుర్తుకొచ్చి అక్కరకొస్తుంది. అదీ నీ పరిస్తితి. ఒక విషయం తెలుసుకో. మన రోజులు కావివి. అప్పుడంటే నేను టెండర్లు పిలవకుండా నామినేషన్ మీద మీకు పని వొప్ప చెప్పాను. మీరూ ఏమీ ఆశించకుండా పని పూర్తిచేశారు. అందుకే మన మీద ఆరోపణలు రాలేదు. గిట్టనివారెవరూ సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేయలేదు. కాని ఇప్పుడలా కాదు. ప్రతిదీ పద్దతి ప్రకారం జరగాలి. లెక్కలన్నీ పక్కాగా వుండాలి. లేకపోతే కాగో పట్టుకుని విచారణ పేరుతొ మనల్ని నీళ్ళ కాగులో వేసి మరగ పెడుతుంది. దర్యాప్తుల పేరుతొ నిద్ర పట్టకుండా చేస్తారు. జైళ్ళంటారు. నార్కో పరీక్షలంటారు. ముందు ఏసీ కారులో దిల్ కుశా గెస్ట్ హౌస్ కు పోదాం అంటారు. అక్కడికెళ్ళాక అరెస్ట్ అంటారు. తరువాత సీబీఐ కోర్టుకంటారు. కోర్టు న్యాయమూర్తి వున్నాడే నాగ మారుతీ శర్మ. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే మన రోజుల్లో కూడా ఇలాటి ఖరాఖండీ న్యాయమూర్తిని చూడలేదు. అందుకే బదిలీల మీద బదిలీలు తప్పడం లేదు. నిజానికి వాళ్ల నాన్న నా భక్తుడు. అసలు పేరు సుందర లాల్. నా పేరు అనుక్షణం ఆయన నాలుక మీద ఆడుతూ వుండేది. రోజూ రామాయణం పారాయణం చేస్తేకాని ఆయనకు నిద్రపట్టేది కాదు. ఖమ్మంలో వుండగా ఆయన్ని అందరూరామాయణం మునసబు గారనేవారు. మామిళ్లగూడెంలో ఆయన అద్దెకు వున్న ఇంట్లో క్రమం తప్పకుండ సుందరాకాండ పారాయణం జరిగేది. నా పేరు కలవరిస్తూనే ఆయన కళ్ళు మూశాడని చెప్పుకుంటారు. కాని ఆయన కొడుక్కు మన సంగతి తెలుసో లేదో తెలవదు. బెయిల్ ఇవ్వనన్నాడో చెంచల్ గూడా జెయిలే గతి. ఇక అన్నిటికంటే ఘోరం టీవీల్లో మన గురించి జరిగే ప్రచారం. నామీద మానవులు గతంలో ఎన్నో సినిమాలు తీసి డబ్బు చేసుకున్నారు. అదంతా మరచి, మనల్ని జెయిల్లో తోయించే దృశ్యాలను టీవీల్లో పదేపదే మరోపని లేదన్నట్టు చూపిస్తారు. చూసేవాళ్ళు కూడా మరో పని పెట్టుకోకుండా చూస్తారు. రాముడు మంచి బాలుడన్న మంచి పేరు మంచులా  కరిగిపోతుంది. నన్ను నమ్ముకున్న రామదాసు లాటివాళ్ళు బందిఖానాలో పడ్డ మాట నిజమే. కాని, నాకు మాత్రం జెయిళ్లు, బెయిళ్లు తెలియదు. వనవాసంలో లక్ష్మణుడు తెచ్చిపెట్టిన కందమూలాలు తప్ప జెయిల్లో పెట్టే చిప్ప కూడు ఏనాడూ తిని ఎరుగను. ఇప్పుడు పోయిపోయి సీబీఐ చేతుల్లో పడితే ఇక మన చేతిలో ఏమీ వుండదు. నా పేరు పెట్టుకుని గద్దె ఎక్కిన పార్టీ చేతులే పట్టుకోవాలి. వాళ్లు పట్టాన తేల్చరు. అధికార దుర్వినియోగం కుదరదు అంటారు. రాష్ట్రాల్లో ఎన్నికలంటారు. తిధులంటారు. పండగలంటారు. లోపల మనం మళ్ళీ అవతారం ఎత్తాల్సిన త్రేతా యుగం రానే వస్తుంది. అది తప్పిపోయిందంటే మళ్ళీ మరో నాలుగు యుగాలు ఆగాలి. రామరాజ్యంలో ఏదయినా కూడబెట్టుకున్నది ఏదైనా వుంటే అది సర్వం లాయర్లకు చదివించు కోవడానికే సరిపోతుంది. లోగా యుగాలు, మన్వంతరాల తరబడి కష్టపడి మనం సంపాదించుకున్న మంచితనం కాస్తా టీవీ చర్చల్లో మంట కలిసిపోతుంది. కలియుగం మనుషులంటావా తింటారు తినిపిస్తారు. దర్యాప్తులు, విచారణలు ఏళ్లతరబడి సాగిస్తారు. సాగదీస్తారు. లోపల వాళ్లకు వాళ్లకు లెక్కలు డొక్కలు కుదిరితే కేసులన్నీ అటకెక్కుతాయి. టక్కుటమార విద్యలు నా గురువులు నాకు నేర్పలేదు. పోనీ నేర్చుకుందామనుకున్నా వయస్సులో వంటపట్టవు. ఏదో నువ్వు చెబుతున్నావు కదా, పోతే పోయింది ఒక రాయి విసిరి చూద్దాం అని వెళ్ళామే అనుకో. నిలబెట్టి వెయ్యి ప్రశ్నలు అడుగుతారు. వంద సర్టిఫికెట్లు తెమ్మంటారు. వయస్సు సర్టిఫికేట్ ఏదంటే ఏం చెబుతాం. ఏం చదివారంటే మన దగ్గర ఏం జవాబుంది? చదువు చెప్పిన విశ్వామిత్రుడు తన దగ్గర నేను చదివినట్టు నాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇటు భూలోకానికి అటు స్వర్గలోకానికి కాకుండా మధ్యలో వేళ్ళాడుతూ త్రిశంకు స్వర్గంలో వుండిపోయాడు. ఆయన్ని ఇప్పుడు యెక్కడని వెతికి పట్టుకుంటాం. రోజులు బాగున్న రోజుల్లో రధాల మీద తిరిగాము. కాలం ఖర్మం కలసిరానప్పుడు కాలినడకన అడవుల్లో సంచరించాము. అలాగని రధానికి డ్రైవింగ్ లైసెన్సు తెమ్మంటే ఎక్కడ తెస్తాము చెప్పు. యెలా తెస్తాము చెప్పు.
అంతటితో అయిపోతుందా. అడ్రసు ప్రూఫ్ అడిగారనుకో అదీ లేదు. నేను జన్మించిన అయోధ్యనే మానవులు ఏళ్లతరబడి కోర్టు లిటిగేషనులో పెట్టి తమాషా చూస్తున్నారు. మనిద్దరం విల్లంబులు పట్టుకుని టెండర్ వేయడానికి వెడితే, పని ఇవ్వకపోగా ఎస్ టీ కోటా కింద ఏదయినా ఆశ్రమ పాఠశాలలో చేర్పించి చేతులు దులుపుకుంటారేమో కూడా. అంతటి ఘనులు వీళ్ళు. ఇంకో సమస్య ఏమిటంటే మనం భగవంతుడి అవతారం అన్న ట్యా గ్ లైన్ ఒకటి వుంది. అది పెట్టుకుని ఇప్పుడు కాలినడకన వెడితే ఏం బాగుంటుంది చెప్పు. మిగిలిన కాంట్రాక్టర్ల మాదిరిగా త్రీ పీస్ సూట్ వేసుకువెళ్ళామంటే ఇంతే సంగతులు. మన భక్తులు కూడా మనల్ని అనుమానిస్తారు. అదింకా ప్రమాదం. టెండరు దక్కక పోగా మనకే టెండరు పడుతుంది.
రాముడు చెప్పిన భగవద్గీత అంజనీకుమారుడి చెవికెక్కినట్టులేదు. అతడు తోకతో ఓమారు వీపు గోక్కుని దాంతోనే మరోమారు తల తడుముకుని ఇలా అన్నాడు.
రామసేతు వంతెనను నేనూ నా సహచర వానరులు స్వయంగా కట్టామని మానవాధములకు స్టాంపు పేపరు మీద రాసి ఇస్తాను. అదీ నమ్మరా. అలాటప్పుడు పేపర్లు ఎందుకు, డూప్లికేట్ స్టాంపు కాగితాలు తయారు చేసే తెల్గీ లాటి వాళ్లు బాగు పడడం కోసమా?’
ఓరి అమాయక వానర చక్రవర్తీ! రాముడు మళ్ళీ చెప్పాడు.
అలాటి కాగితాలు వాళ్లకు చిత్తు కాగితాలతో సమానం. వాళ్ళు ముందు నిన్ను రామసేతువు లేఅవుట్ సబ్మిట్ చేయమంటారు. ప్రాజెక్ట్ వివరాలు అడుగుతారు. ఇన్ కంటాక్స్ రిటర్న్ లు తెమ్మంటారు. అప్రూవ్ చేసిన ప్లాను అడుగుతారు. మునిసిపల్ పర్మిట్లు, ఎస్కవేషన్ పర్మిట్టు, రామసేతు కట్టిన కంట్రాక్టర్ పేరు వివరాలు, అతడికి యెంత ఖర్చయింది, ఎన్నాళ్లలో కట్టాడు, దాన్ని సకాలంలో పూర్తిచేసిన సర్టిఫికేటు వుందా ఇలా రకరకాల పత్రాలు అడుగుతారు.ప్రశ్నలు వేస్తారు. రామసేతు పూర్తయిన తరువాత దాన్ని ఎవరు ప్రారంభించారు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్పింగులు గట్రా పట్రా అంటారు. ఎందుకంటె కలియుగంలో మనిషి మాటకన్నా సర్టిఫికేట్లకే విలువెక్కువ. ప్రత్యేకించి పవిత్ర బారతంలో పత్రాల గోల మరీ ఎక్కువ. పెన్షన్ తీసుకునే వాడు స్వయంగా వెళ్ళినా అతడు బతికే వున్నట్టు సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా అధికారులు ఏదీ ఒప్పుకోరు. నువ్వు ఖల్లు ఖల్లున దగ్గుతున్నా సరే డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర వుంటేనే నీకు దగ్గు జబ్బు వున్నట్టు లెక్క.
శ్రీ రామ గీత వింటున్న పవన సుతుడుడికి మతి పోయినంత పనయింది.
స్వామీ ఇదెక్కడి మాయ లోకం. నువ్వు ప్రతి వందేళ్లకీ మాటు సూరదాసు, తులసీదాసు, త్యాగరాజు, జయదేవుడు, భద్రాచల రామదాసు, భక్త తుకారాం లాటివారికి నీ ఉనికినీ, మహిమలనూ ప్రదర్శిస్తూనే వున్నావు. అయినా సరే ఇప్పటికీ నువ్వున్నావా అసలున్నావా అని సినిమా పాటలు రాస్తూనే వున్నారు. ఇక నీ ఉనికి గురించిన చర్చోప చర్చలు టీవీ తెరలపై అనంతంగా సాగి పోతూనే వున్నాయి. రామాయణం పుక్కిటి పురాణమని, రామసేతు నిర్మాణం అసలు జరగనేలేదనీ వాదించేవారు లెక్కకు మిక్కిలిగా వున్నారు. స్తితిలో నాకు ఒకే దారి కనబడుతోంది. ఏమయినా సరే నువ్వు రాముడిగా మరో సారి అవతారం ఎత్తాలి. రామాయణం నిజంగా జరిగిందేనని నిరూపిస్తూ దాన్ని మరోసారి మానవులకు ప్రదర్శించి చూపాలి.అన్నాడు ఆంజనేయుడు ఆవేశంగా.
రాముడు తనదయిన రీతిలో మందహాసం చేసి చెప్పాడు.
అదంత సులభం కాదు అంజనీ పుత్రా. ఈనాటి రాజకీయ నాయకులతో పోలిస్తే రావణుడు లాటి విలన్ కూడా జనాలకు ఒక హీరో లాగానే అనిపిస్తాడు. కనిపిస్తాడు. మధ్య మారీచుడు నాకు తారస పడితే అడిగాను. మారీచుడు ఎవరో గుర్తున్నాడు కదా. ఈనాటి మిమిక్రీ కళాకారులందరికీ ఆదిగురువు. అరణ్యంలో బంగారు లేడిని వేటాడుతూ వెడుతున్నప్పుడు అచ్చు నా స్వరాన్ని అనుకరిస్తూ హా లక్ష్మణా అంటూ లక్ష్మణుడిని ఎలుగెత్తి పిలిచాడు చూడూ మారీచుడే. ఏమన్నాడో తెలుసా! రాజకీయాలు, ఈటీవీ   ఛానళ్ళు వున్నంతవరకు మళ్ళీ భూమి మీద కాలు పెట్టేది లేదని తెగేసి చెప్పాడు.
శ్రీరాముడు బోధించిన భగవద్గీతతో ఆంజనేయుడికి జ్ఞానోదయం అయింది.
స్వస్తి.
(09-07-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595 

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

this is the worst post I read in your blog. Pl remove it.

నీహారిక చెప్పారు...

ఇది మీరు వ్రాసిన భగవద్గీతలాగా ఉంది. బాగుంది.
మీరు కోరుకున్నట్లే జరుగుతుంది,తధాస్థు !