20, ఆగస్టు 2011, శనివారం

దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని – భండారు శ్రీనివాసరావు

దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని – భండారు శ్రీనివాసరావు


శ్రీ రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తూ ఒకానొక ప్రదేశంలో ఓ శీతల తరుచ్ఛాయకు చేరి ధనుర్బాణాలను పక్కన బెట్టి విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం లేచి కూర్చున్న రామునికి తన విల్లుకింద నలిగిపోయి నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపించింది. ఆ కప్ప దుస్తితికి తానే కారణం అని మధనపడుతూ ఆ చిరుజీవిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన వింటి బరువును మోస్తూ, అమితమయిన బాధను భరిస్తూ కూడా ఎందుకలా మౌనంగా వున్నావని ప్రశ్నించాడు. దానికా మండూకం జవాబు చెబుతూ - ‘సమస్త లోకాలను కాపాడే దేవదేవుడివి నువ్వు. ఏదయినా కష్టం వస్తే లోకులందరూ నీకే మొరబెట్టుకుంటారు. అలాటిది నీ బాణం కిందే నలిగిపోతున్న నేను, కాపాడవలసిందని ఇక ఎవర్ని వేడుకునేది?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో శ్రీరాముడు అవాక్కయాడు.

మన దేశానికి స్వతంత్రం వచ్చి అరవై నాలుగేళ్ళు నిండాయి. స్వతంత్ర ఫలాలను భావితరాలకు భద్రంగా అప్పగించే పవిత్ర లక్ష్యంతో బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రాసుకుని, దాన్ని కాపు కాయడానికి ఒకదానికి మరొకటి దన్నుగా మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఈ అరవై ఏళ్ళ పైచిలుకు కాలంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా, ఎన్నెన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నా – పార్లమెంటు, ఎక్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కలికితురాయిని భారత కీర్తి కిరీటానికి అమర్చిపెట్టాయి. ఈ మూడింటికీ చెదలుపట్టే పరిస్తితే దాపురిస్తే నేనున్నానంటూ దీన జనానికి బాసటగా నిలబడే నాలుగో వ్యవస్థ మీడియా వుండనే వుంది. అందుకే దానికి ఫోర్త్ ఎస్టేట్ అన్న అనధికారిక నామం స్తిరపడింది.


అయితే, ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగం తమపై వుంచిన బాధ్యతలను పాటిస్తున్నాయా కర్తవ్యాలను నెరవేరుస్తున్నాయా లేదా వాటినుంచి దూరంగా జరుగుతున్నాయా అన్న అనుమానం సామాన్య జనంలో కలుగుతోంది. బ్రోచేవాళ్ళే దోచేవాళ్ళుగా మారుతున్న విషాద పరిస్థితుల్లో భారతావని లోని దీన జనావళి స్తితి రాముని కాలం నాటి కధలోని కప్పను తలపిస్తోంది.


ప్రజాధనాన్ని అప్పనంగా ఆరగిస్తున్న ప్రజాప్రతినిదుల అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడడం, నియమనిబంధనల చట్రంలో వారిని వుంచాల్సిన బాధ్యత కలిగిన అధికారగణం సయితం అదే అవినీతి కూపంలో ఇరుక్కునిపోవడం, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్త లోని కొందరు న్యాయాధీశులే - కంచే చేనుమేసిన చందంగా దొరికిపోయి అభిశంసనలకు గురికావడం, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినప్పుడు వాటిని సరిదిద్దే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన మీడియా లోని అత్యధిక భాగం ఈ యావత్తు భాగోతంలో భాగం కావడం అరవై అయిదేళ్ళ వయస్సులో స్వతంత్ర భారతానికి అంటుకున్న మకిలి. కడిగినా వొదలని మురికి.


ఈనాటి పరిస్తితుల్లోని మరో విషాద కోణం ఏమిటంటే-


నిస్సిగ్గుగా లంచాలు మేస్తున్నవాళ్ళు అందుకు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ప్రజల డబ్బును తేరగా భోంచేసి త్రేనుస్తున్నవాళ్ళు అందుకు తత్తరపాటు పడడం లేదు. పైపెచ్చు అదొక హక్కుగా భావించి సమర్ధించుకుంటున్న తీరు మరింత బాధాకరం. విచారణ సంస్తల దర్యాప్తు క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. చివరకు నిగ్గుతేలే నిజాలు న్యాయస్తానాలలో ఏమేరకు నిలుస్తాయో ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటె వ్యవస్థలోని లోపాలను పసికట్టి, వాటికి తగిన తరుణోపాయాలను కనిపెట్టి కాచుకోవడం ఎలాగన్నది అక్రమార్కులకు వెన్నతో బెట్టిన విద్య. ప్రజాధనం దోపిడీలో హెచ్చుతగ్గుల తేడాలే కాని అందరూ అందరే అన్న నగ్న సత్యాన్ని ఎవరికి వారే బయటపెట్టుకుంటున్నారు. కొన్ని అవినీతి పురాణాలు వెలుగు చూస్తున్న సందర్భాలను గమనిస్తుంటే, తాముతిన్న దానికన్నా ఎదుటి పక్షం వారు నాలుగాకులు ఎక్కువ తిన్నారన్న దుగ్దే వారిని ఎక్కువగా వేధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక స్తాయిని దాటిపోయి వెగటు కలిగిస్తున్నా దొంగని దొంగే పట్టించిన చందంగా అందరి భాగోతాలు తెర చాటునుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుడ్డిలో మెల్ల అంటే ఇదే కాబోలు. ఏదో ఒక రకంగా భవిష్యత్ తరాలకు మేలుచేసేదే కాబట్టి ఆహ్వానించదగ్గ పరిణామమే అనుకోవాలి. ఇక్కడ వ్యక్తులను పేరు పేరునా పేర్కొనాల్సిన పని లేదు. అందరూ ఓ తానులోని ముక్కలే. ఈ వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్థితులు సృష్టించిన అష్టావక్రులే. ఒకరిని మరొకరు నిందించుకుంటున్న తీరుతెన్నుల్ని చూసి ఆనందించడం కాదు ఈ రోజున చేయాల్సింది. ఇలాటి అస్తవ్యస్త వ్యవస్థ నిర్మాణానికి ఏదో ఒకరూపంలో ‘రాళ్ళెత్తి’న కూలీలు’ గా తమకూ భాగం వుందని ప్రజలందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి.


అవినీతి అంశంగా ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో సంభవిస్తున్న పరిణామాలు అవినీతిని ఈసడించుకునే పౌరులందరినీ కలత పరుస్తున్నాయి. అక్కడ అన్నా హజారే ఉద్యమం తీసుకున్నా, ఇక్కడ జగన్ ఆస్తులపై సీ.బీ. ఐ. సాగిస్తున్న సోదాల విషయం తీసుకున్నా మేధావులు, రాజకీయపార్టీల నడుమ సాగుతున్న చర్చలు పక్కదోవపడుతున్నాయి. ఉభయపక్షాల్లో దేన్నో ఒకదానిని గుడ్డిగా సమర్ధించడం మినహా నిష్పక్షపాతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేని స్తితి. మీడియాలో జరిగే చర్చల్లో కూడా అసలు అంశం వెనక్కు పోయి అనవసర విషయాలు తెరమీదకు వస్తున్నాయి. నిజాలకంటే నెపాలకు పెద్దపీట వేస్తున్నారు.


ఈ సందర్భంలో- కొన్నేళ్ళక్రితం మన దేశానికి వచ్చిన ఒక విదేశీ యాత్రికుడు తన అనుభవాలను రాస్తూ పేర్కొన్న విషయాలను ప్రస్తావించడం సముచితంగా వుంటుంది.


“భారత దేశానికి రాకముందు నేను నాస్తికుడిని. ఇక్కడకు వచ్చిన తరువాత క్రమక్రమంగా నా కళ్ళు తెరిపిళ్ళు పడడం మొదలయింది. ఈ దేశంలో బీదా బిక్కీ తాగుతున్న నీళ్ళు చూసిన తరువాత ఈ జనాలను ఏదో అదృశ్య శక్తి కాపాడుతోందన్న భావన నాలో ప్రబలింది. అలాటి మురికి నీళ్ళు తాగుతూ కూడా జనం జీవించి మనగ లుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ దేవుడి కృప లేనిది సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లమీద వాహనాలు విచ్చలవిడిగా తిరుగాడుతున్న తీరుకు రోజూ ఎన్నో వందలమంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ వుండాలి. అలా జరగడం లేదంటే వీరిని భగవంతుడే కాపాడుతూవుండాలి.”


ఈ యాత్రీకుడి అనుభవాలు దేశంలో ఈ నాటి పరిస్తితులకు అన్వయించుకోవచ్చు.


లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వార్తల నేపధ్యంలోనే కనిమొళిలు, రాజాలు, కల్మాడీలు కటకటాల్లో వూచలు లెక్కబెడుతున్నారు. లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన వై.ఎస్.జగన్ వంటి రాజకీయనాయకులపై న్యాయస్తానాలు సీ.బీ.ఐ. దర్యాప్తుకు ఆదేశించాయి. అవినీతి ఆరోపణలపై కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రీ సేన్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని రాజ్య సభ ఆమోదించింది. నేడో రేపో లోక్ సభ కూడా ఆ పని చేయబోతోంది.

అంటే ఏమిటన్న మాట. వ్యవస్థ అనుకున్నంత అస్తవ్యస్తంగా లేదనుకోవాలి. పనిచేస్తున్నదనే అనుకోవాలి.


కాబట్టి పూర్తిగా నిరాశ చెందాల్సిన పని లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముప్పూటలా వాక్రుచ్చే రాజకీయనాయకుల మాటలు నీటి మూటలని అనుకోనక్కరలేదు. ఎందుకంటె ఆ విదేశీ యాత్రీకుడు పేర్కొన్నట్టు మచ్చలు పడ్డ ఇంతమంది రాజకీయ నాయకులు, ఇంతమంది అధికారులు, ఇంతమంది న్యాయకోవిదులు, ఇంతమంది మీడియా వారు వున్నాకూడా దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే వుంది.


కవికుల తిలకుడు తిలక్ తన కవితా ఖండిక ‘ప్రార్ధన’ లో కోరుకున్నట్టు – ‘దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని’.


(19-08-2011)


6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

/వ్యవస్థ అనుకున్నంత అస్తవ్యస్తంగా లేదనుకోవాలి. పనిచేస్తున్నదనే అనుకోవాలి./
అదే వుంటే అన్నాలు ఎందుకు?

అజ్ఞాత చెప్పారు...

మీరు కాంగ్రెస్‌లో కపిల్‌సైబాల్ అభిమానిలా వున్నారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@మీరు కాంగ్రెస్ లో కపిల్ సిబాల్ అభిమానిలా వున్నారని వ్యాఖ్యానించిన అజ్ఞాతకు - మీ స్పందనకు ధన్యవాదాలు. అంశాలను బట్టి రాస్తుంటాను కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అనిపించడం సహజమే.నాకు తోచింది రాయడమే తప్ప ఎవరికో నచ్చాలని రాయడం అలవాటు లేని పని.-భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

I would say, this is the most balanced review I have read in recent times :)

~sUryuDu

అజ్ఞాత చెప్పారు...

"వ్యవస్థ అనుకున్నంత అస్తవ్యస్తంగా లేదనుకోవాలి. పనిచేస్తున్నదనే అనుకోవాలి."

ఇది మాత్రం తప్పు సార్.
వ్యవస్థ సరిగ్గా పని చెస్తే, ఈ కుంభకోణాలు జరగకూడదు.
ఒకవేళ ఎవరైనా చేయడానికి ప్రయత్నించినా, మొగ్గలోనే తుంచేయాలి.
ఇప్పుడైనా తప్పనిసరి పరిస్థుతులలోనో, కక్ష సాధించడానికో దర్యాప్తులు జరుగుతున్నాయి కాని వ్యవస్థ తన పని చేసుకుపోవడం వలన కాదు.

అజ్ఞాత చెప్పారు...

అంతే మరి, అజ్ఞాతకు తోచింది చెప్పారు. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ పోవడమే. అందుకే జగన్ అన్నాడు ఓ దేవుడా ఈ దేశాన్నితన బారి నుండి రక్షించమని.