19, ఫిబ్రవరి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (89 )- భండారు శ్రీనివాసరావు


 

ఆరేడేళ్ళక్రితం వరకు నాది ఊరుకుల పరుగుల జీవితమే. కాలు ఒకచోట పెట్టి నిలబడింది లేదు. 2005 లో రిటైర్ అయిన తర్వాత కూడా ఈ ఉరుకులు  మరో విధంగా, వివిధ టీవీ ఛానల్ చర్చల రూపంలో కొనసాగాయి. మా ఆవిడ మరణంతో 2019లో మొదటి బ్రేక్ పడింది. 2024 లో నా రెండో కుమారుడి ఆకస్మిక మరణంతో పూర్తిగా చతికిల పడింది. 

నా  జీవితంలో రేడియో ఉద్యోగం అనేది ఒక అరాచక పర్వం. నేను పనిచేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలో. కానీ ఏ ఒక్కరోజు నియమ నిబంధనలకు కట్టుబడి కానీ, లోబడి కానీ పనిచేయలేదు. పైగా  నా బల్ల మీద అడ్డం కింద  ‘ఇక్కడ నేనెవరికీ బాసును కాను, ఎవరూ నాకు బాసులు కారు’ అని ఒక కాగితం మీద రాసిపెట్టేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఆఫీసు టైములూ  గట్రా లేవు. ఆఫీసులో మొహం చూపిస్తే ఆ రోజు వచ్చినట్టు. చూపక పోతే బయట ఎక్కడో ఆఫీసు పని మీద, వార్తా సేకరణలో వున్నట్టు. ఇలా అందరికీ సాధ్యం అవుతుందా. కాదు. అలా వీలుండదు కూడా. నూటికో కోటికో కూడా అసాధ్యం. మరి నా విషయంలో అలా ఎందుకు సాధ్యపడింది? అందుకే అరాచకపర్వం అన్నది. ఇలా మినహాయింపులు పొందడానికి నా తత్వం కూడా ఉపయోగపడింది.

ఆలిండియా రేడియో ఒక పెద్ద సామ్రాజ్యం అనుకుంటే అందులో మా న్యూస్ యూనిట్ (ప్రాంతీయ వార్తా విభాగం) సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన ఓ చిన్న  సామంత రాజ్యం. సామంత రాజ్యం అని ఎందుకు అన్నాను అంటే మేము చేసే పని లేదా చూసే పని రేడియో వార్తలు. సేకరించడం, వాటిని గుదిగుచ్చడం, బులెటిన్లు తయారు చేయడం, వాటి అనువాదం సరిగా వుందా లేదా చూసుకోవడం, సరిగ్గా వేళకు  వార్తా ప్రసారం జరిగేలా జాగ్రత్త పడడం ఇవీ క్లుప్తంగా మా విభాగం బాధ్యతలు. వీటిల్లో స్థానికంగా వుండే ఇతర రేడియో పెద్దలకు సంబంధం వుండదు.   ఢిల్లీలో వుండే కేంద్ర వార్తా విభాగానికి మాత్రమే మా విభాగం జవాబుదారీ.

మరి ఇందులో నా పాత్ర ఏమిటి?  నేను చేసిన ఉద్యోగం పేరు అసిస్టెంట్ ఎడిటర్ (రిపోర్టింగ్) .  అధికారిక  విధులను బట్టి చూస్తే నిజానికి ఏమీ లేదు, వార్తా సేకరణ తప్పిస్తే. కానీ నేను నా పరిధి దాటి వ్యవహరించాను. 

శ్రీయుతులు  పన్యాల   రంగనాధ రావు గారు, నర్రావుల సుబ్బారావు గారు, మల్లాది రామారావు గారు, ఆర్ వీ వీ కృష్ణారావు గారు, ఆకిరి రామకృష్ణారావు గారు, ఆసయ్య  గారు, జేబీ రాజు  గారు  ఇలా చాలామంది న్యూస్ ఎడిటర్లు మితిమించిన  వాత్సల్యం చూపి నా విశృంఖలతను పెంచి పోషించారు. 

అయితే, తత్వం అని చెప్పాను కదా! అదే ఇంత ఆరాచకానికి కారణం.

హైదరాబాదు కేంద్రం నుంచి రోజుకు ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం మూడు  న్యూస్ బులెటిన్లు ప్రసారం అవుతాయి. వాటిని ఎడిట్ చేయడం ఎడిటర్ల పని. వారికి సహాయంగా అసిస్టెంట్ ఎడిటర్ న్యూస్ అనే హోదాలో  మాడపాటి సత్యవతి గారు పనిచేసేవారు. 

ఒక్కోసారి ఆ బాధ్యత నాకు అప్పగించేవారు. క్రమంగా నా పని ఉమ్మడి కుటుంబంలో కాపురానికి వచ్చిన కొత్త కోడలు మాదిరిగా తయారయింది. వారానికి మూడు రోజులు ఉదయం రేడియో స్టేషన్ కు వెళ్ళి వార్తలు ఎడిట్ చేసేవాడిని. హెడ్ లైన్స్ పెట్టే బాధ్యత కూడా నాదే.

ఇంటి నుంచి రానూ పోనూ ఆఫీసు వాహన సౌకర్యం వుండేది. ఉదయం పూట రెగ్యులర్ న్యూస్ రీడర్లు  రాకపోతే క్యాజువల్ న్యూస్ రీడర్లను బుక్ చేసేవారు, సురమౌళి , గుడిపూడి శ్రీహరి, పీ ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి గార్లు అప్పటికే రేడియో వార్తల పఠనంలో ఉద్ధండులు. కొంతకాలం మృణాలిని గారు కూడా ఉదయం వార్తలు చదివేవారు.  ఇక రెగ్యులర్ న్యూస్ రీడర్లు  తిరుమలశెట్టి  శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్న దేవి గార్లు సరేసరి. వాళ్ళు చదివే వార్తలు వింటూ పెరిగిన వాడిని.  శ్రీనివాసరావు అన్నీ పనులు చేయగలడు  అని అనిపించుకునే నా తాపత్రయంతో  వాళ్ళలో కొందరు తమ బాధ్యతలను నాకు వదిలేసేవాళ్ళు. ఎడిట్ చేసే బాధ్యత క్రమంగా అనువాదం చేయడం వరకు పెరిగింది. ఆంధ్రజ్యోతిలో కాలాలకు కాలాలు అనువాదం చేసిన అనుభవం ఇలా అక్కరకు వచ్చింది. అదే క్రమంలో జీవన స్రవంతి, వార్తా వాహిని కార్యక్రమాల నిర్వహణ, వ్యాఖ్యానం, పఠనం, అసెంబ్లీ సమీక్షల పర్యవేక్షణ  అలా అదనపు బాధ్యతలు భుజానికి ఎక్కి కూర్చున్నాయి.

ఇలా రోజుకు ముప్పూటలా ఆఫీసు పనులు చేసుకుంటూ, ఆరు పూట్లా నా సొంతపనులు, ఇతరుల పనులు చక్కబెట్టుకుంటూ  కాలం దొర్లిస్తున్న  సమయంలో ..

ఒకానొక రోజు ఉదయం.

రేడియో వార్తల సమయం దగ్గర పడుతోంది. నా పనిలో నేనున్నాను.  న్యూస్ రీడర్ జాడలేదు. అప్పటికే బులెటిన్ మూడువంతులు సిద్ధం చేశాను. ఫోను మోగింది. అనివార్యకారణాల వల్ల రాలేకపోతున్నాను అని సంజాయిషీ. ఫోను పెట్టేసి బులెటిన్ కాగితాలు క్రమపద్దతిలో సర్దుకుని పూనకం పూనినట్టు  స్టూడియోకి బయలుదేరాను. ఆ రోజుల్లో మా వార్తా విభాగం మెయిన్ స్టూడియోకి దూరంగా రేడియో ఆవరణలో ఒక పక్కగా వుండేది. అప్పటికి ఇప్పుడు వున్న స్టూడియో కట్టలేదు.  ఎవరైనా అనౌన్సర్‌లు ఖాళీగా వున్నారేమో అని వాకబు చేశాను. ఎవ్వరూ దొరకలేదు. వార్తల టైము పది నిమిషాలు వాళ్ళకి ఖాళీ సమయం. ఆ సమయంలో కాస్త బయటకి వెళ్లి, చాయ్ తాగి, గాలి పీల్చుకు వస్తారు. నేను ఒక్కడినే స్టూడియోకి వెళ్ళడం చూసి డ్యూటీ ఆఫీసరు పరిగెత్తుకుని వచ్చారు. నేను లైవ్ ప్రోగ్రాములకి కొత్త అని ఆయనకు తెలుసు. జీవన స్రవంతి, వార్తావాహిని లైవ్ కాదు. ముందుగా రికార్డు చేసి ప్రసారం చేస్తారు. వార్తలు ఒక్కటే మొత్తం రేడియో కార్యక్రమాల్లో లైవ్ గా ప్రసారం చేస్తారు. డ్యూటీ ఆఫీసరు నాకు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. దగ్గు వస్తే ఫేడర్  కిందికి లాగాలని, మళ్ళీ పైకి జరుపుకుని వార్తలు చదవాలని చెప్పి వెళ్ళి పోయాడు.

నేను న్యూస్ రిపోర్టర్ ని. వార్తలు చదవడం నా డ్యూటీ కాదు. పైపెచ్చు వార్తలు చదివే వాళ్ళు ఆడిషన్  టెస్టులో పాసవ్వావాలి.  పై అధికారుల అనుమతులు కావాలి. చెప్పాకదా! నా తత్వం గురించి. ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు. సమయం మించకుండా వార్తా ప్రసారం మొదలు కావాలి. అంతే !

ఫేడర్ అంటారో ఇంకేమీ అంటారో నాకు తెలియదు. దాన్ని పైకి లాగి మొదలు పెట్టాను.

“ ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది  భండారు శ్రీనివాసరావు ..”

ఆ విధంగా మొదలయిన నా అరాచక పర్వం ఆకాశవాణిలో ఏళ్ల తరబడి సాగింది.

అరాచకం అంటూ మొదలవ్వాలి కానీ అది కొనసాగుతూనే వుంటుంది. ఆ విశేషాలు మరోసారి.

కింది ఫోటో:

ఆకాశవాణి స్టుడియోలో నేను.



(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో ( 88 ) – భండారు శ్రీనివాసరావు

 

యాభయ్ ఏళ్ల క్రితం నేను హైదరాబాదు ఆకాశవాణి లో విలేకరిగా చేరినప్పుడు రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్ టెలిఫోన్ వుండేది, డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే PABX  ద్వారా ఎక్స్ టెన్షన్ నంబర్  డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో మాకు వస్తుండేవి.

ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్.  చైర్మన్ లైన్లోకి వచ్చారు.  ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో, ఇంకా ఎవరెవరు వస్తున్నారని మాట వరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ మీతో పాటు మీ దగ్గర రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే, నిర్మలా వసంత్, విజయకుమార్,  వాళ్ళల్లో ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన. అప్పుడు లైట్ వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళ కోసం. భోజనానికి పిలుద్దామని అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని కనుక,  మర్యాదకోసం నన్ను కూడా పిలిచి వుంటారు.

ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరాగాంధీ హయాంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు గారు.

ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే,  రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు తెలియకపోయినా , వారి స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ మాట్లాడేవారు. ఎప్పుడో డిల్లీలో వున్నప్పుడు మినహా తప్పకుండా వారి కార్యక్రమాన్ని వింటూ వుంటానని చెప్పేవారు. రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి అని హేళనగా మాట్లాడుకునే రోజుల్లో,  ఇలాటి వారుచెప్పే మాటలే

ఆ కళాకారులకు నూతన జవసత్వాలను ఇచ్చేవని అనుకుంటాను.

ప్రతిరోజూ మధ్యాహ్నం హైదరాబాదు కేంద్రం నుంచి వెలువడే ప్రాంతీయవార్తలు ముగియగానే వ్యవసాయదారుల కార్యక్రమం మొదలయ్యేది. రైతులకు సంబంధించిన అనేక అంశాలను వారికి పరిచితమయిన యాసలో వారిద్దరూ వివరించే తీరు జనరంజకంగా వుండేది. ఏదో సర్కారు ఉద్యోగమే కదా అనుకుంటే వారలా ఆ కార్యక్రమానికి అంతగా కష్టపడి జీవం పోయాల్సిన అవసరం వుండేది కాదు. సత్యనారాయణరావుగారి వంటి వారే కాదు, వారి కార్యక్రమం అంటే చెవికోసుకుని వినేవారెందరో వుండేవారు. తదనంతర కాలంలో హైదరాబాదు కేంద్రంలో వ్యవసాయ కార్యక్రమాలను గోపీచంద్ చాలాకాలం, తాను రిటైర్ అయ్యేవరకు పర్యవేక్షించారు.

అలాగే కార్మికుల కార్యక్రమం. ఆ కార్యక్రమం రూపొందించే తీరుకు ముగ్ధులైకార్మికులు కాని వారు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు,  బాలల పత్రిక ‘చందమామ’ ను చదవడానికి పిల్లల కంటే పెద్దవాళ్ళే ఎక్కువ మక్కువ పడినట్టుగా. అందులో రాంబాబుగా డి. వెంకట్రామయ్య గారు, చిన్నక్కగా శ్రీమతి వి.రతన్ ప్రసాద్ గారు, ఏకాంబరంగా వట్టెం సత్యనారాయణ గారు ఆ రోజుల్లో స్టార్ డం సంపాదించుకున్న రేడియో కళాకారులు. స్కూళ్ళు, కాలేజీల్లో జరిగే వార్షికోత్సవాలకు వీరిని ముఖ్య అతిధులుగా పిలిచి సన్మానించేవారు. వెంకట్రామయ్యగారు తరువాతి కాలంలో న్యూస్ రీడర్ గా మారారు. రిటైర్ అయ్యేంతవరకూ అదే ఉద్యోగం.

ఈ రేడియో కళాకారులవి గొర్రెతోక జీతాలు. ఎదుగూ బొదుగూ లేదు. ప్రమోషన్లు లేవు. ఎక్కడ చేరారో అక్కడే రిటైర్ అయ్యేవాళ్ళు. అయినా మనసుపెట్టి పనిచేసేవారు. వారికిది వృత్తి కాదు. ప్రవృత్తి. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారిలో ప్రముఖ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు, కవులూ, రచయితలూ వుండేవారు. స్టేషన్ డైరెక్టర్లు కూడా వీరికి ఎంతో మర్యాద ఇచ్చేవారు. నేను రేడియోలో చేరకముందు,  శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరధి, స్తానం నరసింహారావు, మునిమాణిక్యం నరసింహారావు, గోపీచంద్, బుచ్చిబాబు, నాయని సుబ్బారావున్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య), న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) బాలాంత్రపు రజనీకాంతరావు, గొల్లపూడి మారుతీరావు, శంకరమంచి సత్యం, నండూరి విఠల్, భాస్కరభట్ల కృష్ణారావు, చేరిన తర్వాత రావూరి భరద్వాజ వంటి దిగ్గజాలు హైదరాబాద్ రేడియో కేంద్రంలో పనిచేశారు. వీరు కాక, శారదా శ్రీనివాసన్, ఫ్లూట్ శ్రీనివాసన్, రతన్ ప్రసాద్ (చిన్నక్క), వింజమూరి సీతాదేవి, పాలగుమ్మి విశ్వనాధం, వేలూరి సహజానంద,  రామమూర్తి రేణు, కేశవపంతుల నరసింహ శాస్త్రి  (సంస్కృత పాఠాలు), తురగా జానకి రాణి, నాగపద్మిని,  తిరుమలశెట్టి శ్రీరాములు, పన్యాల రంగనాధ రావు, ఆర్.ఎ. పద్మనాభరావు, వీవీ శాస్త్రి,   మాడపాటి సత్యవతి, డి.వెంకట్రామయ్య,  జ్యోత్స్నాదేవి, సమ్మెట నాగ మల్లేశ్వర రావు, తురగా ఉషా రమణి  (ప్రాంతీయ వార్తలు) జ్యోత్స్నా ఇలియాస్, ఇలియాస్ అహ్మద్, ఇందిరా బెనర్జీ, మట్టపల్లి రావు,  ఒకరా ఇద్దరా ఇందరు తమ స్వరాలతో, అనుభవంతో హైదరాబాద్ రేడియో కేంద్రానికి  అజరామర కీర్తిని సముపార్జించి పెట్టారు. నాకు తెలిసి వీళ్ళల్లో కళాకారులు  (స్టాఫ్ ఆర్టిస్టులు) ఎవ్వరూ కూడా నెలకు అయిదారువందలకు మించి జీతాలు తీసుకున్నవారు లేరు. ఇందిరాగాంధీ ప్రధాని కావడానికి పూర్వం సమాచార ప్రసార శాఖల మంత్రిగా వున్నప్పుడు రేడియోలో పనిచేసే స్టాఫ్ ఆర్టిస్టుల  (నిలయ కళాకారులు) స్తితిగతులు అర్ధంచేసుకుని, వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ( పే స్కేల్స్) జీత భత్యాలు లభించేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ప్రమోషన్లు ఇతర సౌకర్యాలు కూడా వర్తింపచేశారు.

ఆకాశవాణి నిలయ కళాకారుల ప్రసక్తి వచ్చింది కాబట్టి, వారిలో కొందరు తమ వృత్తిధర్మం పట్ల ఎంతటి నిబద్ధతతో ఉంటారో తెలియచెప్పే ఒక ఉదంతాన్ని రేడియోలో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు మాటల సందర్భంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తాను.
మహాలయ పక్షాలను పురస్కరించుకుని పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ఆయన కొంతకాలం క్రితం సతీసమేతంగా కాశీ వెళ్ళారు. గంగానది ఉధృతంగా వొడ్డును వొరుసుకుని పారుతోంది. ఒక్క కేదారేశ్వర ఘాట్ లోనే వారికి వెసులుబాటు దొరికింది. అక్కడ విధులను సక్రమంగా పూర్తిచేసుకుని, ఘాట్ సమీపంలోని ఒక గుడి దగ్గరకు వెళ్ళారు. ఆ ప్రాభాతవేళలో వినవచ్చిన వయోలిన్ వాయిద్య సంగీతం ఆయన్ని ఆకర్షించింది. పరికించి చూస్తే ఒక అరుగులాంటి గద్దెపై కూర్చుని ఎవరో వయోలిన్ వాయిస్తున్నారు. ఒక్క కట్టు పంచె తప్ప ఆయన శరీరంపై ఎలాంటి ఆచ్చాదనా లేదు. స్వతహాగా సంగీత ప్రియుడయిన కృష్ణారావు గారు త్యాగరాజ స్వామివారు ఓ కృతిలో  ఆలపించినట్టు ‘నాదలోలుడై బ్రహ్మానందాన్ని’ అనుభవించిన అనుభూతిని పొందారు. ‘నాద తనుమనిశం శంకరం నమామి’ అనే  త్యాగరాయ కృతిని చిత్తరంజన్ రాగంలో వయొలిన్ పై అద్భుతంగా పలికిస్తున్న ఆ కళాకారుడికి పాదాభివందనం చేద్దామని వెళ్ళారు. చిరు కానుకగా తన చేతికి వచ్చిన కొంత మొత్తాన్ని ఇవ్వబోగా ఆయన మృదువుగా తిరస్కరించి, అవసరంలో ఉన్నవారికి ఎవరికైనా  ఇవ్వండి అని చెప్పారు. మాటల మధ్యలో ఆయన పేరు తెలియగానే ఆశ్చర్యపోవడం కృష్ణారావు గారి వంతయింది. ఎందుకంటే, గంగాతీరంలో ఒంటరిగా కూర్చుని వయొలిన్ వాయిస్తూ తన్మయత్వంలో ఓలలాడుతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో నిలయ కళాకారులు శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి.  కృష్ణారావుగారు వార్తావిభాగంలో న్యూస్ ఎడిటర్ గా  పనిచేసేరోజుల్లో వారితో పరిచయం కూడా వుండేది. అఖిల భారత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీ సూర్యదీప్తి, బెంగుళూరులో పదవీవిరమణ అనంతరం, తుచ్చమైన లౌకిక సుఖాలను పరిత్యజించి, కాశీ వెళ్లి అక్కడే ఒంటరిగా భాగీరధీ తీరంలో వయోలిన్ పై కృతులు పలికిస్తూ సంగీత పారవశ్యంలో తన శేష జీవితాన్ని గడుపుతున్నారు.

ఇటువంటి కధలు, గాధలు విన్నప్పుడు రేడియోలో పనిచేసిన చాలామంది వృత్తి కోసం కాకుండా తమ ప్రవృత్తి కోసం, అంకిత భావంతో తమ విధులు నిర్వహించారు అనే భావన కలుగుతుంది. వీరు కదా నిజమైన కళాకారులు. ఇటువంటి వారితో అలరారిన రేడియో ప్రాంగణంలో చిరకాలం పనిచేసిన అదృష్టం దక్కిన అనేకమందిలో నేనూ  ఒకడిని కావడం నాకు గర్వకారణం.



(ఇంకా వుంది)

 

18, ఫిబ్రవరి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో ( 87 ) – భండారు శ్రీనివాసరావు

 రేడియో ఎవరు వింటున్నారు?

రేడియో గురించి రాస్తుంటే ఒక తరం వారు ఆసక్తిగా చదువుతున్నారు.  నా బ్లాగు వీక్షకుల సంఖ్య కొద్ది రోజుల్లోనే పద్నాలుగు లక్షల నుంచి మరో డెబ్బయ్ అయిదు వేలు పెరగడం దీనికి రుజువు. ఇక, మరో తరం వారు తరచుగా అడుగుతున్న ప్రశ్న మరోటి. ఇంకా ఈ రోజుల్లో రేడియో వినేవాళ్ళు ఉన్నారంటారా? అసలు ఎవరి ఇళ్ళల్లో అయినా మీకు రేడియో కనిపిస్తుందా? అనేది వారి సందేహం. ఇందులో కొంత నిజం లేకపోలేదు. అలా అని రేడియో అనేది పూర్తిగా కనుమరుగు అయిపోయిందని కూడా చెప్పలేము. కాకపోతే పాత కాలం నాటి రేడియో (ఆకాశవాణి)  కార్యక్రమాలకు ఉన్న సంగీత సౌరభం, విజ్ఞాన, వినోదాల మేళవింపు ఇప్పటికి అలాగే  ఉన్నాయా అంటే చప్పున ఔనని జవాబు చెప్పలేని పరిస్థితి అయితే వుంది.

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ అనేది ప్రసార భారతిలో కొత్తగా చేరి పనిచేసేవారికి ఒక అధికారి పేరు. కానీ సంగీత పరిజ్ఞానం కొద్దో  గొప్పో వున్నవారికి మాత్రం ఆయన ఒక సంగీతకారుడు. రేడియో అంటే సంగీతం అనుకునేవారు ఇలాటి అధికారులు రావాలని,  కావాలని కోరుకుంటారు. కాని ప్రసాద్ గారు మాత్రం రేడియో శ్రోతల సంఖ్య పెరగాలని కోరుకుంటూ వుంటారు. సందర్భం దొరికినప్పుడల్లా సమయం చూసుకుని తన మనసులోని మాటని బయట పెడుతుంటారు.
"ఇప్పుడు రేడియోలు ఎక్కడ దొరుకుతున్నాయండీ" అనే ప్రశ్నకు జవాబు ఆయన వద్ద సిద్ధంగా వుంటుంది. అలా అడిగినవారికి ఒక చిన్న సైజు ట్రాన్సిస్టర్ రేడియోని కానుకగా  ఇచ్చి, 'రేడియో దొరికింది కదా! ఇక వినండ'ని అంటుంటారని ఆయన గురించి మెచ్చుకోలుగా చెప్పుకునే ఒక  మాట ప్రచారంలో వుంది.  కొన్నేళ్ళ క్రితం  ఆదిత్య ప్రసాద్ రాజభవన్ లో నాటి  గవర్నర్  నరసింహన్ గారిని కలుసుకున్నప్పుడు, ఏకంగా వారికి ఒక చిన్ని  ట్రాన్సిస్టర్  రేడియోను  కానుకగా ఇచ్చారట. దాన్ని స్వీకరించిన గవర్నర్ ఎంతగానో సంతోషించారట.

2014 లో హైదరాబాదు రేడియో ప్రాంగణంలో డాక్టర్ ఆర్. ఏ.  పద్మనాభరావు గారు  రచించిన 'అలనాటి ఆకాశవాణి'  పుస్తక ఆవిష్కరణ సభలో ఆయనే ఈ విషయాన్ని మర్యాదకు భంగం కలగని రీతిలో, చాలా మన్ననగా ప్రస్తావించారు. 'రేడియో ప్రచార సభఆలోచన కూడా వారిదే.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కే.వీ. రమణాచారి తమ ప్రసంగంలో   రేడియోతో తనకున్న  అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఆలిండియా సర్వీసులో చేరడడానికి ముందు ఆయన కొంతకాలం హైదరాబాదులో లెక్చరర్ గా పని చేసారు. మధ్యాన్నం చాయ్ తాగడానికి ఆలిండియా రేడియో మీదుగా  వెళ్లి వస్తుండేవారట. ‘ఆకాశవాణి – నిషేధిత ప్రాంతము’ అనే బోర్డు చూస్తూ, జీవితంలో ఎప్పుడయినా రేడియో స్టేషన్ లోకి అడుగుపెట్టే అవకాశం వస్తుందా అని అనుకునేవారట. ఒకరోజు గేటు వద్ద సెంట్రీని మాటల్లో పెట్టి లోపల వరకూ వెళ్లారట కూడా. దరిమిలా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పలు పర్యాయాలు రేడియో సమావేశాల్లో, అలాగే ఒక రచయితగా, కవిగా అనేకమార్లు రేడియో స్టేషన్ కు వచ్చి రికార్దింగుల్లో పాల్గొన్నా కూడా,  ఆ తొలినాటి రేడియో ప్రవేశ అనుభవం  మరపున పడలేదని గుర్తు చేసుకున్నారు, కేవీ రమణాచారి గారు.

సహజంగా హాస్య ప్రియులైన రమణాచారి చెప్పినట్టు, ఈనాడు కావాల్సింది 'హాయ్! ఓయ్! రేయ్!అంటూ చెలరేగిపోయే మిర్చీ బజ్జీ శ్రోతలు కాదు. మంచి సంగీతాన్నిమనిషికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి శ్రోతల సంఖ్య పెరగాలి. ఆకాశవాణి అధికారులు కూడా రేడియో పూర్వపు  ఔన్నత్యాన్ని, వైభవాన్ని తిరిగి పొందడానికి వీలైన చక్కటి కార్యక్రమాలను రూపొందించాలి.   అందుకు నాందిగా, ఆదిత్య ప్రసాద్ గారి మాదిరిగా ఒకరికొకరు చిన్న చిన్న రేడియోలు చిరు కానుకలుగా ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం రావాలి.

పోతే, రేడియో ఎవరు వింటున్నారు అని కదా మొదలు పెట్టింది.

ఇప్పటికీ పూర్వంలా ప్రతి ఇంట్లో రేడియో మోగుతూ ఉండకపోవచ్చు. కానీ నెట్లో రేడియో వినేవాళ్ళు బహు కొల్లలు.

నేను రేడియోలో పనిచేసే రోజుల్లో వార్తల్ని టైం ప్రకారం వినేవాళ్ళు నాకు తెలుసు. శ్రీ ఎం. సత్యనారాయణ రావు ఏ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా పనిచేసే రోజుల్లో, వారిని  ఢిల్లీలో వారింట్లో కలుసుకున్నాను. చిత్రంగా నేను వెళ్ళిన సమయానికి ఆయన రేడియో వార్తలను చాలా శ్రద్ధగా వింటున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు. ఒకసారి రికార్డింగు పనిమీద ఇంటికి వెళ్లాను. కాసేపు ఆగి మొదలెడదా౦ అన్నారు. నాకు అర్ధం కాలేదు. ఒకటీ పది కాగానే పక్కనే వున్న ట్రాన్సిస్టర్ చేతిలోకి తీసుకున్నారు. ‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది.. అంటూ వార్తలు మొదలయ్యాయి. ఓహో! ఇందుకా ఆగమన్నది అని అప్పుడు బోధ పడింది.

మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన కీర్తిశేషులు  రోశయ్య గారికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా వార్తలు వినే అలవాటు వుండేది.  అలాగే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మంచి రేడియో శ్రోత. ఉమ్మడి రాష్ట్రంలో  చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా వున్నప్పుడు   ఖమ్మం నుంచి రోడ్డు మార్గాన హైదరాబాదు వస్తూ, మధ్యాన్నం రేడియో వార్తల టైం కాగానే డ్రైవర్ని కారు పక్కకు తీయమని చెప్పి, (ఆ రోజుల్లో సింగిల్ రోడ్డు)  వార్తలు వినేవారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పారు.

ఢిల్లీలో సెంటర్ ఫర్ మీడియా సర్వీసు అనే ప్రసిద్ధ సంస్థ సంస్థాపకులు డాక్టర్ ఎన్.   భాస్కర రావు చేతిలో ఎప్పుడూ ఒక చిన్న రేడియో వుంటుంది. ప్రతి రేడియో బులెటిన్ ను ఆయన శ్రద్ధగా వింటుంటారు.

తెలంగాణా మొదటి  ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రధాన పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన జ్వాలా నరసింహారావుకు క్రమం తప్పకుండా రేడియో వార్తలు వినే అలవాటు వుంది. కారులో వెడుతున్నాకూడా  వార్తల సమయం కాగానే రేడియోపెట్టి వార్తలు వింటుంటారు.

ఈ జాబితాలో చివరన పేర్కొంటున్నప్పటికీ  రేడియో శ్రోతల్లో, అభిమానుల్లో  ప్రధముడుగా చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే  కప్పగంతు శివరామ ప్రసాద్ గారు.   రేడియో అభిమాని అనే బ్లాగు నడుపుతూ, ఆకాశవాణి కళాకారుల అపురూప చిత్రాలను సేకరించడం ఆయన హాబీ. రేడియోకి సంబంధించిన అనేక సాంకేతిక అంశాల్లో ఆయన అథారిటి.

(కింది ఫోటో)

మంగళగిరి ఆదిత్య ప్రసాద్





(ఇంకా వుంది)

17, ఫిబ్రవరి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (86 )- భండారు శ్రీనివాసరావు

 

ఈ రేడియో డైరెక్టర్ కి రేడియో ఉద్యోగం అంటే పడదట ......

వేమూరి విశ్వనాధ శాస్త్రి అంటే వాళ్ళ కుటుంబంలో తెలుసు. వీ.వీ. శాస్త్రి అంటే రేడియోలో పనిచేసేవారికి తెలవకుండా పోదు. ప్రోగ్రాం సైడులో అతి చిన్న కింది మెట్టు అంటే  డ్యూటీ ఆఫీసర్ (ట్రాన్స్ మిషన్ ఎక్జిక్యూటివ్) నుంచి అదే స్టేషన్ కు డైరెక్టర్ గా ఎదిగిన అనుభవశాలి. హైదరాబాదులోనే కాదు భోపాల్ వంటి చోట్ల కూడా పనిచేసారు. రేడియోని ‘స్కాచి’ వడబోశారు. చిత్రం ఏమిటంటే ఆయన అరవయ్యవ దశాబ్దంలో రేడియోలో చేరినప్పుడు, ఇష్టం లేని పెళ్ళికి తల వంచి తాళి కట్టించుకున్న వధువులా, విధి లేక చేరానని చెబుతారు. ఎవరన్నా ఏదన్నా అనబోతే,  తన వాదనకు మద్దతుగా బీబీసీ   సీనియర్ అధికారి  లయొనెల్  ఫీల్డెన్ (Lionel Fielden) రాసిన ‘బెంట్ ఆఫ్ మైండ్’ పుస్తకాన్ని ఉదహరిస్తారు. ఇంకో చిత్రం ఏమిటంటే ఆయనకు రేడియో ఉద్యోగం పడదు కానీ రేడియో అంటే ప్రాణం, అందులో  ముఖ్యంగా రేడియో వార్తలు ఆయనకు మరీ మరీ ఇష్టం. సుమారు నలభయ్ ఏళ్ళ సుదీర్ఘ రేడియో ప్రస్థానంలో  రేడియో గురించిన  మధురమైన ఎన్నో  జ్ఞాపకాలు ఆయన మదిలో పదిలంగా వున్నాయి.   

చిన్నప్పుడు ఆయన ఇంట్లో రేడియో వుండేది కాదు. రేపల్లెలోని శంకర్ విలాస్ కాఫీ హోటల్లోని  రేడియో ఒకటే దిక్కు. అక్కడికి వెళ్లి వార్తలు వినాలంటే కాఫీ టిఫిన్లకు చిల్లర డబ్బులు కావాలి. అందుకోసం, నాన్నగారి లాల్చీ జేబులో నుంచి చిల్లర కొట్టేసే చిల్లరమల్లర దొంగతనాలకు కూడా వెనుతీయలేదు. ఇంతా చేసి ఆలిండియా రేడియో వార్తల్లో వచ్చే జాతీయ అంతర్జాతీయ సమాచారం పట్ల ఆయనకు  ఆసక్తి వుండేది కాదు. జోలిపాల్యం మంగమ్మ వంటి న్యూస్ రీడర్లు వార్తలు చదివే విధానం అంటే చెవి కోసుకునేవారట. ఇంటికి వెళ్ళిన తరువాత కూడా రేడియో న్యూస్ రీడర్ల మాదిరిగానే వార్తలను  అనుకరిస్తూ బిగ్గరగా చదవడం శాస్త్రిగారి హాబీ.

ఎమ్మే పాసయిన తరువాత రేడియోలో ట్రాన్స్మిషన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆయనతో పాటు ఇరవై రెండు మంది సెలక్ట్ అయితే ఈయన కడమాఖరిలో ఇరవై రెండోవారు. ఢిల్లీలో ఇంటర్వ్యూ. ఆ కమిటీకి  ఆనాటి  రేడియో డీజీ శ్రీ నారాయణ్  మీనన్ చైర్మన్.  ఆయనకు ఎందుకో శాస్త్రి గారిపట్ల వాత్సల్యం కలిగింది. సంగీత, నృత్యాలు గురించి అడిగిన  ఏ ప్రశ్నకూ ఆయన సరయిన సమాధానం ఇవ్వలేకపోయారు. చివరికి ఆ అధికారే కల్పించుకుని ‘ఢిల్లీ నీకు కొత్తా, ఏమేం  చూసావు ఇక్కడ’ అంటూ చనువుగా అడిగారు. ఢిల్లీలో తాను  చూసిన హుమాయున్ సమాధి గురించి చెప్పారు. అనేక విషయాలు గురించి ఈ కుర్రవాడికి అవగాహన  లేకపోయినా, తెలిసిన విషయాలు గురించి పరిపూర్ణ పరిజ్ఞానం వుందని ఆయన అభిప్రాయపడ్డట్టు శాస్త్రిగారికి తోచింది. సరయిన జవాబులు చెప్పలేకపోయినా, చెప్పిన పద్దతి నచ్చిందేమో తెలియదు.  శాస్త్రిగారి ‘బెంట్ ఆఫ్ మైండ్’  రేడియో పట్ల లేకపోయినా,  శాస్త్రి గారిని మాత్రం ఆ ఉద్యోగానికి  సెలక్ట్ చేసారు. దీన్నే డిస్టినీ అంటారు శాస్త్రి. దీన్నే తలరాత అంటారేమో. రాసిపెట్టి వుంది కాబట్టే ఆ ఉద్యోగానికి తాను పెట్టుకున్న దరకాస్తు సకాలంలో చేరిందని అంటారు శాస్త్రిగారు. దీనికి మరో ఉపాఖ్యానం వుంది.

ఇంచుమించుగా అరవై ఏళ్ళ కిందటి సంగతి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎం కాం చదివిన ఓ కుర్రాడికి ఉద్యోగ నిమిత్తం ఒక గెజిటెడ్ అధికారి సంతకం కావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే ఒక వాటాలో తహసీల్దార్ అద్దెకు ఉంటున్నాడు. కుర్రాడి అన్నయ్య, ఆయనకు  విషయం చెబితే, ‘దానిదేముంది ఆఫీసుకు పంప’మన్నాడు. ఆ తహసీల్దార్ రోజూ ఆఫీసుకు వెళ్ళే తీరు ఆ కుర్రాడికి చూడ ముచ్చటగా వుండేది. ఓ బిళ్ళ బంట్రోతు ఓ కర్ర పట్టుకుని అక్కడ ఎవరూ లేకపోయినా ‘జరగండి, పక్కకి జరగండి అయ్యగారు వస్తున్నారు’ అంటూ అరుస్తూ ముందు వెళ్ళేవాడు. అతడి వెనక తహసీల్దారు. ఆయన వెనుక దస్త్రాల పెట్టె మోసుకుంటూ మరో బంట్రోతు. వాహనం వుండేది కాదు. ఆఫీసుకు నడిచి వెడుతున్నా కూడా ఈ వైభోగం అంతా వుండేది. ఇదలా ఉంచితే..

అన్నయ్య చెప్పిన ప్రకారం ఆ కుర్రాడు తహసీల్ కచేరీకి వెళ్ళాడు. గది ముందు బిళ్ళ బంట్రోతు తానే అధికారిలా హడావిడి చేస్తున్నాడు. రోజూ ఇంట్లో చూసే మనిషే అయినా, ‘ఎవరు మీరు ఏం కావాల’ని గద్దించి అడిగాడు. కుర్రాడు తహసీల్దారుని కలవాలని చెప్పాడు. ‘ఆయనకు తీరిక లేదు, అయిదు రూపాయలు అవుతుంది ఉన్నాయా’ అన్నాడు. అయిదు కాగితం చేతిలో పడగానే లోపలకు పంపాడు.        

తహసీల్ దారు కుర్రాడిని తెలియనట్లే మాట్లాడాడు. వచ్చిన విషయం చెబితే కాగితాలు తీసుకుని పైకీ కిందికీ ఓసారి చూసాడు. ‘ఢిల్లీలో ఉద్యోగమా ఎంతిస్తార’ని అడిగాడు. ‘బేసిక్ 230 అని రాసి వుంది’ అని కుర్రాడు చెప్పాడు. అది వింటూనే ‘సరి సరి నా జీతమే నూట ముప్పయి. నేను సంతకం పెట్టాలా వెళ్ళు వెళ్ళు’ అన్నాడు.

కుర్రాడు బయటకు వచ్చాడు. బంట్రోతు ‘పనయిందా’ అన్నాడు. లేదన్నాడు కుర్రాడు. ‘లోపలకు పంపినందుకు మూడు, సంతకం పెడితే స్టాంప్ కొట్టినందుకు రెండు. అంచేత ఇదిగో ఈ రెండు రూపాయలు తీసుకుని బయటకు నడవ’మన్నాడు బిళ్ళ బంట్రోతు.

నిజానికి ఆ రోజుల్లో తహసీల్దారు గెజిటెడ్ కాదు. కానీ ఉద్యోగ హోదా రీత్యా సంతకం చేస్తే చెల్లుతుంది. పొతే ఆ వూళ్ళో మరో గెజిటెడ్ అధికారి వున్నాడు. పశువుల డాక్టరు. అక్కడ బంట్రోతుల హడావిడి లేదు, ఆవులు, గేదెల రొద తప్ప.

నేరుగా వెళ్లి కలిశాడు. ‘అయిదు రూపాయలు ఇచ్చుకోవాలి, తెలుసుకదా’ అన్నాడు.

కుర్రాడు డబ్బులు తీసి ఆయన చేతికే ఇచ్చాడు. అధికారి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఆ చేత్తోనే సంతకం చేసి, తనే స్టాంప్ వేసి ఇచ్చాడు. అక్కడ అన్నీ ఆయనే.



ఆ విధంగా రేడియో ఉద్యోగానికి సకాలంలో దరకాస్తు చేసుకోవడం సాధ్యపడిందని, ఇలా జరగడం విధి రాతే అని, తదనంతర కాలంలో ఆ ఉద్యోగంలో చేరి హైదరాబాదు ఆలిండియా రేడియో డైరెక్టరుగా పదవీవిరమణ చేసిన వేమూరి విశ్వనాధ శాస్త్రి గారు మాటల మధ్యలో గుర్తు చేసుకున్న ‘స్వకీయం’ ఇది.’

అప్పుడు శాస్త్రిగారికంటే మంచి మార్కులతో ముందు వరసలో  ఎంపిక అయినవారిలో ధిగ్గనాధీరులు వున్నారు. శ్రీయుతులు  గొల్లపూడి మారుతీరావు, శంకరమంచి సత్యం మొదలయిన వాళ్ళు వారు. అందరికీ హైదరాబాదులో పోస్టింగు ఇచ్చారు.

ఆలిండియా రేడియోకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని గురించి శాస్త్రి గారు చెప్పింది వినసొంపుగా వుంది.   

1935 లో బెంట్  ఆఫ్ మైండ్ రచయిత లయొనెల్  ఫీల్డెన్ ఇండియాకు వచ్చారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ (ISBS) అని కొత్తగా ప్రారంభించిన సంస్థకు ఆయన మొదటి కంట్రోలర్.

ఎందుకో ఆయనకు ఆ పేరు నచ్చలేదు. ఏదైనా చక్కటి పేరు కోసం అయన తపన పడ్డాడు. ఒకరోజు వైస్రాయ్ గౌరవార్ధం ఇచ్చిన విందులో Lord Linlithgow ని కలుసుకుని ఈ మాట చెప్పారు. ఆయన కూడా కాస్త ఆలోచించి ‘ఆలిండియా..’అని ఆగిపోయారు. మళ్ళీ ఆయనే బ్రాడ్ కాస్టింగ్ బదులు రేడియో అంటే ఎలా ఉంటుందని అడిగారు. ఆ రెంటినీ కలిపితే  ‘ఆలిండియా రేడియో’. ఆ పేరు లయొనెల్  ఫీల్డెన్ గారికి తెగ నచ్చింది. అదే స్థిరపడి పోయింది (ట). దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఆలిండియా రేడియో భారతీయ భాషల్లో ‘ఆకాశవాణి’ గా మారిపోయింది (తమిళాన్ని మినహాయిస్తే).

సాయంత్రాలు తీరిగ్గా  కూర్చుంటే ఇలాటి కబుర్లు విశ్వనాధ శాస్త్రి గారు అలవోకగా బోలెడు చెబుతారు. శాస్త్రిగారి భార్య చనిపోయిన తర్వాత, హైదరాబాదులో ఒంటరిగా ఉంటున్న శాస్త్రి గారిని  వాళ్ళ అబ్బాయి వచ్చి, తన వెంట  అమెరికా తీసుకు వెళ్ళాడు. గ్రీన్ కార్డు కూడా వచ్చింది.

మరిప్పుడు, ఇలాంటి కబుర్లు అన్నీ ఆయన  ఎవరికి  చెబుతున్నారో ఏమో! 

కింది ఫోటో: వీవీ శాస్త్రి గారు 




(ఇంకా వుంది)

16, ఫిబ్రవరి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (85 )- భండారు శ్రీనివాసరావు

 

యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై.  అబ్ ఆప్  వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే

పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. వినిపించవచ్చు.

ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.

డెబ్బయ్యవ దశకంలో రేడియో శ్రోతలకు చిరపరిచితమైన ఈ స్వరం హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా  సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూ ప్రాంతీయ వార్తల్లో వినపడేది.

ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీమక్తర్ (వసీం అక్తర్) చదివే వార్తలు వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది.  నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. ఉర్దూలో ఓనమాలు తెలియకపోయినా ఆయనకు అభిమానిగా మారాను. నాకు ఉర్దూ రాదు. కాని వసీమక్తర్ కు తెలుగు తెలుసు. పొడి పొడి మాటల్లోనే భావం అర్ధం అయ్యేలా చెప్పేవాడు. ఇక వార్తలు సరేసరి. ముందే చెప్పినట్టు సంగీతం వింటున్నట్టుగా వుండేది. దురదృష్టం ఏమిటంటే ఇటువంటివారి ఫోటోలు దొరక్కపోవడం. వసీమక్తర్ చనిపోయిన రోజు నాకు బాగా జ్ఞాపకం. ఎంతోమంది ఆయన్ని కడసారి చూడడానికి వచ్చారు. వాళ్ళల్లో అన్ని మతాల వాళ్లు వున్నారు. వసీమక్తర్ తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకురావడం ఆయన్ని గురించిన మరో జ్ఞాపకం.

కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా,  పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది. ఆ అదృష్టం నాకు రేడియో ఉద్యోగంలో దక్కింది.


దేశానికి స్వాతంత్రం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి.


“1933లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి హైదరాబాదు చిరాగ్ ఆలీ సందులో
చిన్న రేడియో కేంద్రం నెలకొల్పాడు. ఆయన  కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం పనిచేసేది. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా  పరిమితమైన దూరాలకే వినిపించేవి.  ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ప్రసారాలు
చేసేవారు.  అయితే ఉర్దూతో పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా
వుండేవి.  ఈ కేంద్రం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా, సాయంకాలం అయిదున్నర నుంచి రాత్రి పదిన్నర దాకా ప్రసారాలు చేసేది.
హిందూస్తానీ సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు.  చాలా ఏళ్ళ తరువాత కర్నాటక సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు. ముస్లిం వనితల కోసం పరదా పధ్ధతి, వారికోసం విడిగా వాకిలి ఏర్పాటుచేశారు. వసీంఖాన్ అనే ఆయన  తెలుగు కార్యక్రమాల అధికారిగా పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గా చలం కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసేవారు.
కురుగంటి సీతారామయ్య, మహారధి సంభాషణలు, వార్తలు వంటివి రాసేవారు. కే.ఎల్. నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత, వెంకటేశ్వర్లు అనేవాళ్ళు  వార్తలు చదివేవాళ్ళు. మల్లి  పాటలు, ఎల్లి పాటలు మొదలయిన శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి” అని డాక్టర్ పి ఎస్ గోపాల కృష్ణ చెప్పారు.


ఉర్దూలో వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు, పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.
మొహరం మాసంలో రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.
ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.
రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్ రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్ లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది. నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతాబాద్ లోని యావర్ మంజిల్ అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు. నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.
తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్ బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే వంటి సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్ రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చారు.

తోకటపా: డెక్కన్ రేడియో స్టేషన్ ఫోటో కోసం చేసిన ప్రయత్నం వృధా అయింది. నేను 1975లో రేడియోలో చేరినప్పుడు ఉన్న పాత భవనం కూల్చి ఆ ప్రదేశంలో నూతన భవనంతోపాటు కొత్త స్టుడియోలను నిర్మించారు. ఆ భవనం ఫోటో కూడా పదిలపర్చలేదు. ఇక నేను పుట్టని రోజుల నాటి డెక్కన్ రేడియో ఫోటో కోసం వెతకడం అత్యాశే అనిపించి ఆ ప్రయత్నం మానుకున్నాను. ఇలాంటి సందర్భాలలో జంధ్యాల శంకర్ గారు గుర్తు వస్తుంటారు. ఆయన విజయవాడ నగరానికి మేయరుగా పనిచేశారు. మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారికి మంచి సన్నిహితులు. ఆయన మేయరుగా ఉన్న సమయంలో విజయవాడలోని కొన్ని పురాతన భవనాలను, చారిత్రక ప్రదేశాలను ఫోటోలు తీసి భద్రపరిచే కార్యక్రమం చేపట్టారు. చేశారు కూడా. కాలక్రమంలో ఆ భవనాలు నేలమట్టం అయ్యాయి. ఆయన తీయించి భద్రపరచిన ఫోటోలు కూడా, సరైన సంరక్షకులు లేక చెదలుపట్టి పోయాయి. ఇప్పుడు ఆ చెదలు పట్టిన ఫోటోలు కూడా లేవు. జంధ్యాల శంకర్ గారి ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరు చందం అయింది.

(ఇంకా వుంది)

15, ఫిబ్రవరి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో – ( 84) – భండారు శ్రీనివాసరావు

 రేడియో కధాకమామిషు

రేడియో ఉద్యోగం కోసం హైదరాబాదులో ఇంటర్వ్యూకు హాజరై బెజవాడకు తిరిగి వచ్చినప్పటి నుంచి అసలీ ఉద్యోగం ఏమిటి అనే వెంపర్లాట నాలో  మొదలయింది. మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి  ఇంటికి వచ్చే నాలుగయిదు తెలుగు, ఇంగ్లీషు  పత్రికలు తిరగెయ్యడం తప్ప రేడియో కార్యక్రమాలు శ్రద్ధగా వినే అలవాటు లేదు. మా అన్నయ్య ఆఫీసు నుంచి ఇంటికి రాగానే రేడియోలో ప్రాంతీయ వార్తలు పెట్టేవాడు. అంటే దాని అర్ధం నన్ను కూడా వాటిని వినమని. అంతవరకూ నేను చేస్తున్నది ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ ఉద్యోగం. రేడియో వాళ్ళు పేపర్లో ప్రకటించిన ఉద్యోగం హోదా అసిస్టెంట్ ఎడిటర్ బ్రాకెట్లో రిపోర్టింగ్ అని వుంది. ఆ ఉద్యోగం తీరుతెన్నులు ఏమిటో బొత్తిగా తెలియదు. రిపోర్టింగ్ అనే పదాన్ని బట్టి రిపోర్టర్ జాబు అనుకున్నాను. జ్యోతిలో నండూరి రామ్మోహన రావు గారి దయ వల్ల రిపోర్టింగ్ లో కొంత అనుభవం వుంది. తిరుమలశెట్టి శ్రీరాములు గారు, డి. వెంకట్రామయ్య గారు, మాడపాటి సత్యవతి గారు చదివే ప్రాంతీయ వార్తలు వింటూ వుండేవాడిని. విజయవాడ రేడియో కేంద్రంలో అప్పటికి ప్రాంతీయ వార్తా విభాగం లేదు. అంచేత వివరాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయినా ఉద్యోగం వచ్చినప్పటి మాట కదోయి నాయనా అని నాకు నేనే సర్దిచెప్పుకునేవాడిని.


నాకు బుద్ది తెలుస్తున్న తొలి రోజుల్లో రేడియోని చూసింది మా స్వగ్రామం కంభంపాడులోని చామర్తి వీరభద్రరావు మామయ్య గారింటిలో. వాళ్ళ ఇంటి మధ్య హాలులోని అల్మారాలో ఒక భోషాణం పెట్టె మాదిరిగా వుండేది. దాని కిందనే మోటారు కార్లలో వాడే బ్యాటరీ మాదిరిగా ఒక పెద్ద బ్యాటరీ వుండేది. కార్లలో వాడే బ్యాటరీ కాదు గానీ రేడియో కోసం ప్రత్యేకమైన బ్యాటరీ. బాగానే పెద్దది. ఎవరెడీ కంపెనీ వారి బ్యాటరీ. ఆ కంపెనీ గుర్తు 9 అంకె. ఆ నెంబరు మధ్యలో నుండి దూకుతున్నట్లున్న పిల్లి బొమ్మ ఆ బ్యాటరీ మీద ఉండేది.
ఆ పెద్ద గదిలో పైన ఆ మూల నుంచి ఈ మూలకు నైలాన్ తో అనుకుంటా తయారు చేసిన ఒక జాలీ మాదిరి యాంటీనా కట్టి వుండేది. (అప్పటికి దాని పేరు  యాంటీనా అని తెలియని వయసు) మా  మామయ్యగారు రేడియో ఆన్ చేయగానే కింది భాగంలో పచ్చటి లైటు ముందుకూ వెనక్కూ సాగుతూ ఒక చోట ఆగిపోయేది. మా మామయ్యగారికి భానుమతి పాటలు అంటే చాలా ఇష్టం. ఆ పాటలు రేడియోలో ఎప్పుడు వస్తాయో ఆయనకు ముందుగా ఎలా తెలుసో నాకయితే తెలియదు. కానీ రేడియోలో అవే పాటలు వచ్చేవి. బహుశా ఆకాశవాణి ప్రచురించే వాణి పత్రిక తెప్పించేవారేమో. ఒక వేళ భానుమతి స్వరం వినబడకపోతే, వెంటనే గ్రామఫోన్ పెట్టె బయటకు తీసి, బాసింపట్టు వేసుకుకూర్చుని భానుమతి పాట రికార్డు వేసుకుని వినేవాడు. మాకేమో రేడియో వినాలని. ఆయనకేమో భానుమతి పాట వినాలని. రేడియోలో అప్పుడప్పుడూ హరికధలు, ఆదివారాల నాడు తెలుగు సినిమా (సంక్షిప్త శబ్ద చిత్రం) వేసే వాళ్ళు. ఇక ఆ రోజు ఆయన ఇల్లు తిరుణాల మాదిరిగా వూరిజనంతో నిండిపోయేది. ఎందుకంటే వూరి మొత్తానికి అదొక్కటే రేడియో. అలాంటి రోజుల్లో మా మామయ్య గారు ఆ రేడియోను తీసుకుని వచ్చి పదిలంగా బయట వరండాలో ఓ బల్ల మీద వుంచి రేడియో పెట్టేవారు, వచ్చిన జనమంతా విననడానికి వీలుగా.
పొరబాటున ప్రసారంలో ఏదైనా అంతరాయం వస్తే ఆయన వెంటనే హార్మనీ పెట్టె బయటకు తీసి దానిపై వున్న మీటలపై చేతివేళ్ళను కదిలిస్తూ, మరో చేతితో ఆ పెట్టెకు వెనుకవైపువున్న చెక్క పలకను వెనక్కీ ముందుకూ జరుపుతూ గొంతెత్తి ఏదో ఒక పద్యం అందుకునేవారు. కొంతమంది ఊరిజనం కూడా ఆయనతో గొంతు కలిపేవారు.
ఒక విధంగా మా మామయ్య గారిల్లు పొద్దుగూకే వేళకు వూరిజనాలకు వినోదకేంద్రంగా మారిపోయేది.
అదీ రేడియోతో నా మొదటి పరిచయం.
తర్వాత స్కూలు చదువుకోసం బెజవాడ వెళ్లి మా లాయరు బావగారు తుర్లపాటి హనుమంతరావు గారింట్లో ఉండేవాడిని. ఆయన ఇంట్లో ఆఫీసు గదిలో ఒక బీరువా మీద ఒక చిన్న సైజు రేడియో వుండేది. దానికి మా వూళ్ళో రేడియో మాదిరిగా యాంటీనా వున్నట్టు లేదు. కరెంటుతో పనిచేసేది. కాకపోతే ఆ రేడియో పెట్టే అధికారం మా బావగారికి మాత్రమే వుండేది. ఇంట్లో వాళ్ళం ఎవ్వరం దాని మీద చేయివేసే సాహసం చేసేవాళ్ళం కాదు. పొద్దున్నే భక్తి రంజని, ఇంగ్లీష్ వార్తలు అంతే! ఆ తర్వాత రేడియో నోరు తెరిచేది కాదు. అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొట్టమొదటిసారి చంద్రుడి మీద కాలుమోపినప్పుడు ఆ చారిత్రాత్మక సంఘటనను బీబీసీ కాబోలు ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ రోజు మా బావగారు నిబంధనలను కాస్త సడలించి రేడియో పెట్టారు. గుర్రుబర్రు మంటూ ఇంగ్లీష్ లో ప్రసారం అయిన ఆ కార్యక్రమంలో ఒక్క ముక్క అర్ధం కాకపోయినా అందరం చెవులొప్పగించి విన్నాం.


బీసెంటు రోడ్డులో జంధ్యాల నారాయణ మూర్తి (సినిమా డైరెక్టర్ జంధ్యాల తండ్రి) గారి బుష్ రేడియో స్టోర్స్ వుండేది. మా బావగారు ఆయన గారు మంచి స్నేహితులు. అంచేత పిల్లలం అప్పుడప్పుడూ ఆ దుకాణంలో కాసేపు కూర్చుని రేడియో కొనడానికి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టే ప్రోగ్రాములు వినేవాళ్ళం. ఆ విధంగా మా ముచ్చట తీర్చుకునేవాళ్ళం.


హైస్కూల్లో చేరిన తర్వాత సెలవుల్లో మా వూరికి వెళ్ళినప్పుడు ఊరి మద్యలో మైకులో వినిపించే పంచాయతీ రేడియో సెంటర్ మాకు ఆటవిడుపు. రోజూ సాయంత్రం వేళల్లో ఓ రెండు మూడు గంటలు రేడియో వినడానికి వూళ్ళో వాళ్ళు ఆ మైకు దగ్గరికి చేరేవాళ్ళు. అది కూడా ఒక్క విజయవాడ మెయిన్ స్టేషన్ మాత్రమే. సాయంత్రం ప్రాంతీయ వార్తలు, ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు, వ్యవసాయదారుల కార్యక్రమం, ఎప్పుడయినా ఓ హరికధా కాలక్షేపం. వివిధభారతి పాటలు అవీ వినడానికి వీలులేదు. మొదట్లో బాగున్నా, సినిమాపాటలు వినే ఛాన్స్ లేకుండా పోయిందని బాధపడే వాళ్ళం.


ఈ లోపల మా ఇంటి పెత్తనం మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు చేతికి వచ్చింది. ఆయన చేసిన మొదటి పనేమిటంటే విజయవాడ వెళ్లి నాలుగు బా౦డ్లో, అయిదు బా౦డ్లో తెలియదు, ఓ ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కొచ్చాడు. మా వూళ్ళో అడుగుపెట్టిన మొదటి ట్రాన్సిస్టర్ అదే. అంతకు ముందు బ్యాటరీతో పనిచేసే రేడియో మాత్రమే మేము చూశాము. ఎక్కడికిపడితే అక్కడికి తీసుకువెళ్ళే ఆ రేడియో ఆ రోజుల్లో వూళ్ళో వాళ్ళందరికీ చూడముచ్చటగానే కాకుండా విచిత్రంగా కూడా వుండేది. రేడియో సిలోన్ నుంచి మీనాక్షి పొన్ను దొరై సమర్పించే కార్యక్రమంలో వినిపించే తెలుగు పాటలు మొదటిసారి వినే భాగ్యం కలిగింది.
ఇక ఆ తర్వాత రేడియో యుగం మొదలయింది.  ప్రతి ఇంటా రేడియో. ప్రతి చేతిలో బుల్లి ట్రాన్సిస్టర్. క్రికెట్ కామెంటరీలు వింటుంటే అచ్చం క్రికెట్ గ్రౌండ్ లోనే వున్నామా అనే అనుభూతి కలిగేది. ఆ ఉత్సాహం రేడియో వినేవాళ్ళ మొహాల్లో, చేతల్లో కేరింతల రూపంలో కనబడేది. రేడియో పుణ్యమా అని బుర్ర కధలు, హరి కధలు, పురాణ కాలక్షేపాలు, సంగీత కచ్చేరీలు అన్నీ ఇళ్ళ లోగిళ్ళలోకి తరలివచ్చాయి.
ఎప్పటికో అప్పటికి సొంతంగా రేడియో కొనుక్కోలేకపోతానా అనే కోరిక నాతోపాటే పెరిగి పెద్దయి రేడియో ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా తీరలేదు. ఎందుకంటే రేడియో వాళ్ళే మాకో ట్రాన్సిస్టర్ రేడియో, దానితోపాటే చేతిలో పట్టుకుని తిరిగే టేప్ రికార్డర్  ఇచ్చారు. దాంతో కొనే అవసరం లేకుండా పోయింది. ఆ రేడియోకి కావాల్సిన బ్యాటరీ సెల్స్ కూడా నెలకోసారి ఆఫీసువాళ్ళే సప్లయి చేసేవాళ్ళు. బదిలీ అయినప్పుడో, రిటైర్ అయినప్పుడో ఆ రేడియో తిరిగిచ్చేయాలనేది కండిషన్. నా విషయంలో ఇది కూడా జరగలేదు. ఎందుకంటే ఏ బదిలీలు లేకుండా చేరిన చోటే, అంటే హైదరాబాదులోనే మూడు దశాబ్దాల తర్వాత పదవీవిరమణ చేశాను. ప్రభుత్వ సర్వీసులో ఇదొక రికార్డు అనేవాళ్ళు. మూడు దశాబ్దాల క్రితం ఇచ్చిన ఆ రేడియో ఏమైందో తెలియదు. మధ్యలో అయిదేళ్ళు దేశంలోనే లేను. రేడియో మాస్కోలో పనిచేయడానికి వెళ్లాను. తిరిగివచ్చిన తర్వాత కూడా ఆ రేడియో గురించి అడిగినవాళ్ళూ లేరు. ఆ రికార్డులు వున్నట్టూ లేదు. అసలు అదేమై పోయిందో నాకూ గుర్తులేదు. ఒకసారి బి.హెచ్.ఇ.ఎల్. ప్రెస్ మీట్ కు వచ్చిన విలేకరులందరికీ అరచేతిలో ఇమిడే బుల్లి ట్రాన్సిస్టర్ రేడియోలు గిఫ్ట్ గా ఇచ్చారు. దీనివల్ల నాకు కలిగిన ప్రయోజనం ఏమిటంటే, సచివాలయంలో మంత్రుల ప్రెస్ మీట్లు కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సంగతులను అక్కడికక్కడే వారికి వినిపించేవాడిని. ఇప్పుడే కదా చెప్పింది అప్పుడే ఎలా రేడియో వార్తల్లో వచ్చింది అని వాళ్లు ఆశ్చర్యపోతుంటే అదో తుత్తిగా ఫీలయ్యేవాడిని.


ఉద్యోగం చేసిన రోజుల్లో పుట్టని యావ, అసలు రేడియో ఏమిటి, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అనే మీమాంస రిటైరైన తర్వాత మొదలయింది. ఇటువంటి విషయాల్లో అవగాహన కలిగిన వాళ్ళు చాలామంది నాలాగే రిటైర్ అయ్యారు. అనేకమంది జీవించి లేరు. ఉన్నవారిలో కూడా చాలామందికి కొన్ని కొన్ని జ్ఞాపకం. అక్కడక్కడా మతిమరపు. డాక్టర్ పద్మనాభ రావుగారి లాంటి వాళ్ళు విషయ సేకరణ చేసి రేడియోకి సంబంధించి కొన్ని పుస్తకాలు రాసారు. మరొక వ్యక్తి డాక్టర్ పి.ఎస్. గోపాల కృష్ణ. గతంలో ఆలిండియా రేడియో, హైదరాబాదు కేంద్రానికి డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన స్వయంగా రాసి అనేక సదస్సుల్లో సమర్పించిన పరిశోధనాపత్రాలు అనేకం వున్నాయి. ఆయన పనితీరు నాకు తెలుసు. పైగా ధారణ శక్తి అపారం. సాధికారత లేకుండా ఏదీ రాయరు. కాబట్టి ఆయన్నిఅడిగీ, ఫోనులో మాట్లాడి చాలా విలువైన సమాచారం సేకరించాను. అలాగే మరొకరు వీవీ శాస్త్రి గారు. హైదరాబాదు స్టేషన్ డైరెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. సాయంకాలక్షేపాల కబుర్లలో రేడియోకి సంబంధించిన కబుర్లు అనేకం ఆయన నోటి వెంట విన్నాను.  ఏతావాతా మొత్తం మీద చాలా సమాచారాన్ని పోగుచేసి, కొంతవరకు నా బ్లాగులో భద్రపరిచాను. వాటి ఆధారంగా మరికొన్ని రేడియో సంగతులు ఈ శీర్షిక ద్వారా తెలియచెప్పాలనేది సంకల్పం. ఇక  రాజకీయ పార్టీలు, వాటి నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రుల సంగతులేవీ అంటే వాటిని గురించి ముందు ముందు ముచ్చటించుకోవచ్చు.

కింది ఫోటో:

మా మామయ్య చామర్తి వీరభద్ర రావు గారు



(ఇంకా వుంది)