13, అక్టోబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (233) : భండారు శ్రీనివాసరావు

 ముగింపుకు ప్రారంభం

‘నాన్నా, నాకో వాగ్దానం చేయండి!

‘నాన్నా,

‘ముందుగా మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను,  మీరు నాకు హీరో. చిన్నప్పటి నుంచీ మీరు నాకు  ఆరాధ్యులు,  నాకు  ప్రేరణ. జీవితంలో మీరు సాధించిన ప్రతి విషయం గురించి నా స్నేహితులకు  చెప్పేటప్పుడు నాకు గర్వంగా ఉంటుంది. కుటుంబంలోనే కాకుండా, సమాజంలో కూడా మీరు సంపాదించిన ప్రేమ, గౌరవం అసమానమైనవి. మేమందరం గర్వపడే విషయాలు అవి.

‘అయితే ఒక మాట నేను చాలా రోజులుగా మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు అంగీకరిస్తారని నమ్ముతున్నాను. నా జీవితంలో చూసిన అత్యంత శక్తివంతమైన మహిళ, అంటే మీ భార్య, నా అమ్మ. ఆమె కళ్లలో కన్నీళ్లు చూడటం నాకు అసహ్యం. నేను భరించలేని విషయం. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి, పత్రిక తిరగేస్తూ వుంటే, ఆమె కంట్లో నీరు చిప్పిల్లే మాటలు మీ నోటి నుంచి వచ్చేవి కావేమో.

‘కోపంగా ఉన్నప్పుడు మనసులో లేని మాటలు కూడా బయటకు వస్తాయి. ఆ సమయంలో ఎదుటివారిని బాధ పెట్టడమే ప్రధాన ఉద్దేశ్యంగా మారిపోతుంది. నేను తెలుసుకున్న ఒక విషయం — కోపంలో చెప్పిన మాటలతో అసలు భావం వ్యక్తం కాదు. శాంతంగా మాట్లాడినప్పుడు మాత్రమే మనం చెప్పాలనుకున్న విషయం ఎదుటివారికి స్పష్టంగా చేరుతుంది. మీకు తెలియని విషయాలు ఏవో మీకు చెప్పాలని ఈ మాటలు చెప్పడం లేదు. మీరు నాకు గురువు. అనుభవం, జ్ఞానం, ఓర్పు అన్నింటా మీరే నాకంటే మిన్న.

‘నా ఉద్దేశ్యం ఒక్కటే నాన్నా!  మీరు మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏదో మీరనుకున్నది కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంట్లో ఏదో ఒక వస్తువు రిపైర్ కి వస్తుంది. ఎవరో చెప్పాపెట్టకుండా అనుకోని సమయంలో వచ్చి ఏదో అడుగుతారు. ఒక్కోసారి తినే తిండిలో రుచి ఉండక పోవచ్చు. కొన్ని సందర్భాలలో అమ్మ మీకంటే భిన్నంగా ఆలోచించవచ్చు. లిఫ్ట్ పనిచేయకపోవడం, విద్యుత్ అంతరాయం, BSNL లైన్ కట్ అవడం, డ్రైవర్ ఆలస్యం, ల్యాప్టాప్ లేదా ఇంటర్నెట్ సమస్యలు, రోడ్లపై ట్రాఫిక్, ఇవన్నీ జీవితాన్ని అమాంతం మార్చి వేసేంత పెద్ద విషయాలు కావు.

‘జీవితంలో నిజంగా ముఖ్యమైంది,  మనం చేసిన తప్పును అంగీకరించి, నమ్రతతో క్షమాపణ చెప్పగల ధైర్యం కలిగి ఉండటం. అలాగే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. నాకు తెలుసు,  నా కోపం వల్ల నేనే ఎన్నో తప్పులు చేశాను. నాకు అత్యంత సన్నిహితులైన వారిని  నా మాటలతో గాయ పరిచాను. ఆ బాధ ఇంకా నా మనసులో ఉంది.

‘నాన్నా,

‘ఈ లేఖ రాయడంలో నా ఉద్దేశ్యం మీకు నొప్పి కలిగించడం కాదు. నా మనసులోని భావాలను మీతో పంచుకోవడమే. మీపై ఉన్న ప్రేమ, గౌరవం ఇలాంటి చిన్న చిన్న సంఘటనల కారణంగా ఏనాటికి తగ్గదు.

జీవితాన్ని ప్రేక్షకుడిగా చూస్తేనే దాని సౌందర్యం తెలుస్తుంది. చుట్టూ జరిగే ప్రతిదీ చూడొచ్చు, కానీ మనపై ప్రభావం చూపేది ఏది అనేది మనమే నిర్ణయించుకోవాలి.

‘నా చిన్న అనుభవం నాకు చెబుతోంది. జీవితంలో ఇతరులతో మనం చేసే వాదనల్లో తొంభయ్ శాతం తేలిగ్గా తప్పించుకోవచ్చు. ఎందుకంటే చివరికి, వాదనలో ఎవరు  గెలిచినా ఓడినా, అందులో ముఖ్యంగా భార్యాభర్తలు, తండ్రీ కొడుకుల మధ్య జరిగే వాదోపవాదాల వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు.

‘నాన్నా, మీరు ఎప్పుడూ మా కుటుంబానికి అండగా ఉన్నట్లే, నేను ఎప్పటికీ మీ వెనుక నిలబడుతాను. ఈ రోజు నేను ఉన్న స్థానం, నేను జీవిస్తున్న జీవితం  ఇవన్నీ మీరు ఇచ్చినవే!

‘మళ్ళీ చెబుతున్నాను. ఇక ఎప్పుడూ అమ్మకంట నీరు తిరిగేలా మీ ప్రవర్తన వుండకుండా చూసుకోండి. నేను కోరేది ఇదొక్కటే! అందరం కలిసి వీలైనంతగా అమ్మను సుఖపెడదాం. సుఖ పెట్టలేకపోయినా కనీసం ఆమె మనసుకు కష్టం కలగకుండా చూద్దాం. ఇప్పటికే తన జీవితంలో అధిక భాగం మన కోసమే కష్టపడింది. ఇక దానికి ఫుల్ స్టాప్ పెడదాం. కాదనకండి.

ఈ ఒక్క వాగ్దానం చేయండి చాలు.

మీ సంతోష్!

(2016 లో ఒకరోజు)

ఒక పదేళ్ల క్రితం సంతోష్ పుణేలో ఉద్యోగం చేస్తున్న మా రెండో కుమారుడు సంతోష్ మమ్మల్ని చూద్దామని హైదరాబాద్ వచ్చాడు. ఆ రాత్రి మా దంపతుల నడుమ ఏదో చిన్న విషయంలో మాట పట్టింపు వచ్చింది.

‘కోపం వచ్చినప్పుడు పది ఒంట్లు లెక్కపెట్టుకో, అసలే నీకు కోపం జాస్తి, ఎవర్ని ఎంతమాట అంటావో నీకే తెలియదు’ అనేది మా బామ్మ. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు ఒంట్లు  లెక్కపెట్టుకుంటూ కూర్చుంటారా ఎవరైనా, అందులో  ముఖ్యంగా, కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా వంటి దూర్వాసులు. అలాగే ఆ రోజు మా ఆవిడపై మాట తూలాను, పిల్లలు ఇంట్లో వున్నారన్న సోయి కూడా లేకుండా. ఆడది ఏం చేస్తుంది. ఎదురు తిరిగి ఏమీ అనలేదు. అదే వారి బలహీనత. అదే మగవాడి బలం. కంటనీరు తుడుచుకుంటూ పిల్లలను పలకరించింది. నేను షరా మామూలే. మొండి ఘటాన్ని.  రెండు రోజులు వుందామని వచ్చిన వాళ్ళు, మర్నాడే ఈవినింగ్ ఫ్లయిట్ కు వెళ్లి పోయారు. వెడుతూ వెడుతూ నాకు రాసి పెట్టిపోయిన ఉత్తరమే మీరింత వరకు చదివింది. ఇన్నేళ్ళుగా ఈ ఉత్తరం నా వద్ద పదిలంగా వుంది. నా లోని మరో మనిషి లేచినప్పుడు, నన్ను నేను అదుపు చేసుకునే ఆయుధంగా పనికి వస్తోంది. అలాగని నేనేదో గౌతమ బుద్ధుడిగా మారిపోయాను అని కాదు. కొంతలో కొంత ప్రవర్తనను మార్చుకోవడానికి పనికి వస్తోంది. నిజానికి ఈ ఉత్తరాన్ని వాడు ఇంగ్లీష్ లో స్వదస్తూరీతో రాశాడు. దాన్ని తెనుగు చేయడానికి నేను చాలా కష్ట పడ్డాను. ఈ కాలపు పిల్లల ఇంగ్లీష్ తో నాకట్టే పరిచయం లేదు. అలాగే వాళ్లకు నా తెలుగు రాతలు అంతగా అర్ధం కావు.   

‘మీరు ఎలా జీరో అవుతారు’ అని ఈ ఎపిసోడ్స్ రాయడం మొదలు పెట్టినప్పటి నుంచీ చాలామంది అడుగుతున్న ప్రశ్న. చివర్లో చెబుతాను అని తప్పించుకుంటూ వస్తున్నాను. ఇప్పటికే 232 ఎపిసోడ్స్ అయ్యాయి. ఇంకా చెప్పాల్సిన సంగతులు చాలా వున్నాయి. ఇంత చిన్న జీవితం, ఇంత విస్తృతమైనదా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.

ముగింపు ముందే రాయడానికి ఒక కారణం వుంది.  

ఒక వారం అయిందనుకుంటా.

తెల్లవారుఝామున నిద్రలో నేను చనిపోయాను. ఇంట్లో ఒక్కడినే. నిద్రలో కనుక ఈ విషయం ఎవరికీ తెలియదు. పొద్దున్నే పనిమనిషి వచ్చి బెల్లు కొట్టింది. రాత్రి బాగా పొద్దుపోయిందేమో నిద్ర లేవలేదు అనుకుని వెళ్ళిపోయింది. తరువాత వచ్చిన వలలి వనితకు కూడా అదే అనుభవం. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఇంట్లో నా అలికిడి లేదు. ఫోన్ చేశారు తీయలేదు. మర్నాడు అనుమానం వచ్చి పక్కింటి వాళ్ళతో మా అన్నయ్య కు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ సందేహమే నిజమైంది. వాళ్ళ దగ్గర ఉన్న తాళం చెవులతో తలుపు  తెరిచి చూస్తే, ఏముంది పడక గదిలో  విగత జీవిగా మంచం మీద పడివున్న నేను.

ఆ రోజు తెల్లవారుఝామున నాకు వచ్చిన కల ఇది.  ఆ సమయంలో వచ్చిన కలలు నిజమవుతాయని అంటారు. కానీ అంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా  ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించడానికి అంతటి పుణ్య కార్యాలు ఏమీ చేయలేదు.

కానీ ఈ కల నాకొక సత్యాన్ని ఎరుకపరిచింది.

ఇలాగే రాసుకుంటూ పొతే ఇక నేను చివర్లో చెప్పాలని అనుకున్న విషయం చెప్పే అవకాశం వుండకుండా పోతుందేమో! ఇదేమీ డిటెక్టివ్ త్రిల్లర్ కాదు, చివరి వరకూ సస్పెన్స్ లో వుంచడానికి.

ముందు చెప్పాల్సింది చెప్పేద్దాం! తరువాత సంగతి తరువాత.  ముగింపుకు ప్రారంభం అన్నమాట.

(కింది ఫోటో)




(ఇంకావుంది)

12, అక్టోబర్ 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (232) : భండారు శ్రీనివాసరావు

 

సిగరెట్లు మానడం ఎలా!
‘ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశాను’ అనే జోకులు వింటూనే వుంటాము.
చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి. (ఈ రోజుల్లో అయితే ఒక పూటకు సరిపోవు)
సిగరెట్లను సిగరెట్టు మాదిరిగా తాగే మా స్నేహితులు, నా గురించి చెప్పుకునేమాట వేరు. ‘శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడు’ అన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడు’ అనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను, మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. ఉదాహరణకు 20 సిగరెట్ల ఇండియా కింగ్స్ ప్యాకెట్ కేవలం ఒక్క రూపాయి. కొన్న ప్రతిసారీ చిల్లర సమస్య రాకుండా డజనో, ఆరడజనో కార్టన్లు కొనేసేవాడిని. ఇంగ్లీష్ భాష ఎంతమాత్రం తెలియని ఆడామగా రష్యన్ సహోద్యోగులతో కాసేపు ‘మాటామంతీ’ లేని కాలక్షేపం చేయడానికి ఈ సిగరెట్లు చక్కగా అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు సిగరెట్ ప్యాకెట్ల నుంచి ఏకంగా కార్టన్ల స్థాయికి పెరిగడం జరిగింది.
2004లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా గోల్డ్ ఫెక్ కింగ్ సైజ్ సిగరెట్ల కార్టన్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు.
వెళ్లే ముందు, ముందు జాగ్రత్తగా ఎర్రమంజిల్ కాలనీలో మా క్వార్టర్ ఎదురుగా వున్న రెడ్ రోజ్ రెస్టారెంట్ దగ్గరి పాన్ షాపులో బండిల్స్ కొద్దీ సిగరెట్ ప్యాకెట్లు కొంటుంటే, ఆ షాపు వాడు ‘ఏం సార్ మీరు కూడా దుకాణం ఏదైనా పెడుతున్నారా’ అన్నట్టు నా వైపు విచిత్రంగా చూసాడు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు, నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!
హైదరాబాదులో మా ఇల్లే ఒక పెద్ద యాష్ ట్రే. నేను ఊది పారేసే సిగరెట్లకు ఇల్లు నిర్దూమధామంగా తయారయ్యేది. మా ఆవిడ ఓపిగ్గా ఆ చెత్త అంతా పనిమనిషి చేత ఎత్తి పోయించేది.
రాత్రి పూట సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారిపోయినప్పుడు తగలడి పోయిన తలగడల సంఖ్య మా ఆవిడే చెప్పాలి.
“మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు? ‘ఏవి తండ్రీ నాడు విరిసిన రింగు రింగుల పొగల మేఘాలు” అని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు.
దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా కడుపులో పడకుండానే, జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా చేరుకున్నాను. మిగిలిన జాతీయ ఛానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి.
మామూలుగా అయితే బాబుగారి ఇంట్లో విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి ఆ రెండు పార్టీల నాయకుల నడుమ ఎడతెగని చర్చలు లోలోపల సాగుతున్నాయి.
బయట ఫుట్ పాత్ మీద చెట్ల నీడన, నిలబడి కొందరం, కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం.
ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళ కలకలు. అలా నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు.
కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ఇల్లు నిమ్స్ పక్కనే కనుక కబురు తెలిసి వచ్చారు.
ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాబోలు కాకర్ల వారు కూడా స్వయంగా వచ్చి చూసారు. రిపోర్టులన్నీ తిరగేశారు. కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి, ‘నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమ’ని సలహా ఇచ్చారు. ఇది అయ్యే పనా అని మా ఆవిడ చిన్నగా నవ్వి ఊరుకుంది.
కళ్ళు తెరిచి ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను హఠాత్తుగా ముందుకు వొంగి, ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారు’ అని ఒక బహిరంగ ప్రకటన చేసాను. ఆయన విలాసంగా మందహాసం చేసి, నెత్తి మీది వెంట్రుకలు చేత్తో పట్టి చూపిస్తూ, ‘ఇలాటి వాళ్ళను నా సర్వీసులో ఇంతమందిని చూసాను’ అంటూ, ‘అదంత తేలిక కాద’ని ఆయనే చెబుతూ, నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి, ‘రాత్రి అందరూ నిద్ర పోయిన తరువాత నీ మొగుడు నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మా’ అని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా నేనూ పట్టుదల కలిగిన మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి సిగరెట్ తాగాలని కూడా అనిపించలేదు.
కింది ఫోటోలు:
మాస్కోలో మా ఇంట్లో సాయం కాలక్షేపాలు, కొండొకచో మధ్యాహ్న ముచ్చట్లు.






(ఇంకావుంది)

11, అక్టోబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (231) : భండారు శ్రీనివాసరావు

 

మనసు కోతి

ఇంటి జాగాలోనే మొక్కకోసమో, పాదు కోసమో ఓ జానెడు బెత్తెడు నేల తవ్వుతాం. బొచ్చెడు మట్టి బయటకు వస్తుంది. మళ్ళీ ఆ గుంటను అదే మట్టితో పూడ్చినా ఇంకా చాలా మన్ను మిగిలే వుంటుంది.
జీవితం అంతే! తవ్వుతూ పొతే బోలెడు బోలెడు అనుభవాలు, తరచుకుంటూ పొతే ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు. కొన్ని మరచియేవి. మరికొన్ని మరచిపోలేనివి.
2003 లో ఒక రోజు. అంటే ఇరవై రెండేళ్ల నాటి మాట.
అబూ రోడ్ చేరేసరికి ఉదయం ఏడున్నర.
బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన సుమోలో మా ఆరుగురిని సామానుతో సహా మౌంట్ అబూకి చేర్చారు. సుమారు యిరవై కిలోమీటర్లకు పైగా ఘాట్ రోడ్. ఆరావళీ పర్వత పంక్తుల్లో మౌంట్ అబూ ఎత్తయిన శిఖరం అంటారు. శిఖరం అన్న మాటే గాని పైన అన్ని వసతులతో కూడిన ఒక చిన్నపాటి పట్టణమే వుంది. మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ చాలా బాగుంది. స్నానాలు ముగించుకుని బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కేంటీన్ కి బయలుదేరాము.
నిటారుగా నిర్మించిన సిమెంట్ రోడ్డుపై నుంచి కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. డైనింగ్ హాల్ ఎంతో నీటుగా వుంది. పుంగనూర్ కి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త స్వచ్చందంగా అంత దూరం నుంచి వచ్చి అక్కడ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేసే విధులను నిర్వహిస్తున్నాడు. బ్రహ్మకుమారీల ప్రధాన కార్యస్థానంలో పనిచేసేవారందరూ అలాటి వారే. ఎవరూ జీతాలు తీసుకోరు. బ్రేక్ ఫాస్ట్ లో దక్షిణాది వంటకాలు కూడా వుండడంతో మాకు ఎలాటి ఇబ్బంది ఎదురు కాలేదు. తరువాత మెల్లగా నడుచుకుంటూ ఆ కొండల మీద కలయ తిరిగాము. మబ్బులు తాకుతూ వెడుతున్న అనుభూతి. పురాణ సినిమాలలో నారదుడు గుర్తుకువచ్చాడు.
కాసేపు గదిలో సేదతీరామో లేదో మళ్ళీ భోజనాలకు పిలుపు. ఈసారి నార్త్ ఇండియా వంటకాలు. కాకపొతే పులిహార వడ్డించారు. తెలుగు వాళ్లమని పెరుగు స్పెషల్.
భోజనం ముగించుకుని మెట్లెక్కి శిఖరం అంచున ఫోటోలు దిగాము.
మధ్యాహ్నం నుంచి బ్రహ్మకుమారీల సెషన్స్ మొదలయ్యాయి. బ్రదర్ శాంత కృష్ణ మెడిటేషన్ గురించీ, బ్రహ్మకుమారీల గురించీ వివరంగా చెప్పారు. మాలో కొంతమందిమి, జర్నలిష్టులకు సహజసిద్దమయిన రీతిలో రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేసినా, ఆయన నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పారు.
మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వాన.
హైదరాబాదుకు చెందిన బ్రహ్మకుమారీల ప్రతినిధి సరళ, ఐఏఎస్ అధికారి శ్రీ మంగపతిరావు, రెవెన్యూశాఖలో పనిచేసిన శ్రీమతి నైనాదేవి, మా ఆవిడ నిర్మల హైదరాబాదు నుంచి వచ్చిన బృందంలో వున్నారు. మా పని తరలి వచ్చిన మగ పెళ్లివాళ్ళ మాదిరిగావుంది.
శుక్రవారం
‘అంబర చుంబిత’ అన్న అల్లసానివారి పద్యం గుర్తుకు వచ్చింది.
మేము వుంటున్న జ్ఞాన సరోవర్ నుంచి సుమారు యిరవై కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో పైకి వెడితే వచ్చే గురు శిఖిరం మీద నిలబడ్డపుడు ఎవరికయినా ఈ పద్యపాదం స్ఫురించకమానదు.
ఆకాశం అంచుల్లో నిలబడ్డ అనుభూతి కలిగించే ఆ సుందర దృశ్యం అనిర్వచనీయం. ఎటుచూసినా తెల్లని పొగ మంచు. అడుగు దూరం అవతల వున్నది కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు. ఎదురుగా వున్న మనుషులను కూడా పోల్చుకోలేని పరిస్తితి.
అక్కడికి వెడుతున్నప్పుడు మా డ్రయివర్ బాబు ఆ పొగమంచులో ముందుకు వెళ్లడం కుదరదని వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. ఉసూరుమనిపించింది.
కానీ ఇంతలో హెడ్ లైట్లు వేసుకుని ఒక కారు ఎదుటినుంచి రావడంతో ఏమనుకున్నాడో కానీ ముందుకే నడిపించాడు. ముందు సీట్లో కూర్చున్న నాకు అడుగు ముందు ఏమివుందో కనిపించడం లేదు. అయినా డ్రయివరు బాబు మాత్రం ఎంతో చాకచక్యంగా నడుపుతూ మమ్మల్ని పైకి చేర్చాడు. అప్పటికే అక్కడ చాలామంది వున్నారు. ఏదో మాట్లాడుకుంటూ పోకపోతే ఎదురుగా వచ్చేవారు డీకొట్టే ప్రమాదం వుంది. అందుకే అవసరం వున్నా లేకపోయినా గలగలా మాట్లాడుకుంటూ, నూట యాభయి రూపాయలు పెట్టి కొనుక్కున్న కాల్చిన మొక్కజొన్న కంకులు తింటూ, దాదాపు మూడువందల మెట్లెక్కి, గురు శిఖరం చేరుకున్నాము. అంత పొగమంచులో కూడా చిరు చెమట పట్టింది. ఆ శిఖరం మీద దత్తాత్రేయ ఆలయం వుంది. చాలా చిన్న గుడి. గుడికంటే అక్కడ వేళ్ళాడదీసిన గంట పెద్దదిగా అనిపించింది. ఆ గంట మోగిస్తే దాని ధ్వని లోయలో ప్రతిధ్వనించడం ఒక అనుభూతి. అక్కడ కొన్ని ఫోటోలు దిగాము కానీ ఆ దట్టమయిన పొగమంచులో, రీలు కెమెరాలో తీసిన ఆ ఫోటోలు ఎలావస్తాయో తెలియదు. అన్ని మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం డోలీలు వున్నాయి. నూటయిరవై రూపాయలు ఇస్తే పైకి తీసుకువెళ్ళి కిందకు తీసుకువస్తారు. దోవలో డ్రైవర్ బాబుని అడిగాము, చంద్రబాబునాయుడు ఎవరో తెలుసా అని. ‘ఆంధ్రా సీఎం’ అని చటుక్కున జవాబిచ్చాడు. అదే గుజరాత్ సీఎం ఎవరంటే ఉప రాష్ట్రపతి పేరు చెప్పాడు.
మేము వెళ్ళిన దోవలో రెండు లోయల నడుమ కట్టిన ఒక డాం కనిపించింది. మౌంట్ అబూలో కొన్ని ప్రాంతాలు మాత్రమే బ్రహ్మకుమారీల అధీనంలో వున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశవాణి, దూరదర్శన్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రాజస్తాన్ టూరిజం కార్యాలయం వున్నాయి.
గురుశిఖరానికి వెళ్ళే దారిలో పది పన్నెండు చిన్న చిన్న ఊళ్లు, ఆవుల మందలూ వాటి కాపరులూ కానవచ్చారు. విచిత్రమేమిటంటే వాళ్ళు మేమూ కూడా చలిదుస్తులు వేసుకోలేదు. పొగమంచులో చలిగా అనిపించదు. వెంట తీసుకువెళ్ళిన షాల్స్ కారులోనే వొదిలేసి తిరిగాము. కాకపొతే, గొడుగు తప్పనిసరి. ఎప్పుడు వాన పడుతుందో తెలవదు. వాన వచ్చిందో పొగమంచు పరార్.
కిందికి వచ్చి కేంటీన్ లో భోజనాలు చేశాము. పులిహార, రోటీలు, రసం, పెరుగు, మామిడి పండ్లు. శుక్రవారం కదా. మా ఆవిడకు పులుపు నిషిద్దం. అన్నంలో పాలూ పంచదార కలుపుకుని భోజనం ముగించింది. అక్కడ మాకు హైదరాబాదు నుంచి వచ్చిన సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరరెడ్డి, శర్మ, సుబ్బారావు, ఆయన భార్య పరిచయం అయ్యారు.
మధ్యాహ్నం నాలుగ్గంటల సమయంలో కాస్తంత ఎండ పొడ. కానీ అది వేడిగా వుందో చల్లగా వుందో అనుమానమే.
గమ్మత్తుగా సాయంత్రానికి వాతావరణం హైదరాబాదులో మాదిరిగా మారిపోయింది.
ఆరు గంటలకు అసలు సెషన్ మొదలు. మా అందరికీ బాడ్జీలు, ఇతర సమాచారం వున్న ఫోల్డర్లు ఇచ్చారు. విశాలంగా వున్న ఒక పచ్చిక బయలులో సమావేశం మొదలయింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లందరూ అక్కడ జమయ్యారు. ఆ ప్రదేశం ఎంతో అందంగా వుంది. తివాచీ పరచినట్టుగా పచ్చని పచ్చిక. ఎత్తయిన చెట్లు. ఎటుచూసినా రంగురంగుల పూలమొక్కలు. అకాడమీ ఆఫ్ బెటర్ వరల్డ్ కు చెందిన బ్రదర్ మోహన్ సింగ్హన్ ఒక విషయం చెప్పారు.
కొన్నేళ్ళకు పూర్వం ఆ ప్రదేశం రాళ్ళు రప్పలతో, రక్కసి పొదలతో నిండి వుండేదట. నీటి సౌకర్యం ఏమాత్రం లేని ఆ రోజుల్లో నంజుడప్ప అనే ఆయన స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. చిన్న చిన్న మట్టి పాత్రలకు చిల్లులు పెట్టి, వాటికి దూది పెట్టి, నీళ్ళను నింపి ఒక్కొక్క మొక్కని తడుపుతూ, వాటినన్నిటినీ పసిపాపలమాదిరిగా సాకుతూ పోషించి పెంచాడట. అలా నాలుగయిదేళ్ళలోనే ఆయన ఆ ప్రాంతం రూపురేఖలను మార్చివేశాడట. ఇది విన్న తరవాత చేసే పనిపట్ల నంజుడప్ప అంకిత భావానికి జోహారు అర్పించకుండా వుండలేకపోయాము.
బ్రహ్మకుమారీ సంస్త అధినేత్రులందరూ , రాజయోగి దాదీ మనోహర్ ఇంద్రాజీ తో సహా ఆ సమావేశానికి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసారు. తరువాత మెడిటేషన్ హాలులో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. మంగపతిరావు గారూ నేనూ కూడా జ్యోతులను వెలిగించాము. మీడియా ఇంచార్జి కరుణ ఆధ్వర్యంలో ఇది జరిగింది.
మధ్యాహ్నం వరకు కన్ను పొడుచుకున్నా కానరాని పొగమంచు. సాయంత్రం ఏడవుతున్నా సూర్యాస్తమయం కాని స్తితి. మౌంట్ అబూలోని ఈ ప్రకృతి వైరుధ్యాన్ని మనస్సులో పదిల పరచుకుంటూ, మెడిటేషన్ హాలులో దాదీ రతన్ మొహినీజీ హిందీలో చేసిన అనుగ్రహ భాషణాన్ని ఆలకించాము.
‘కర్మబంధాలలో చిక్కుపోయిన ఆత్మ, తన తండ్రి అయిన పరమాత్మను గుర్తించలేదన్నారు. దానికి ధ్యానం ఒక్కటే మార్గం అన్నారు. ఆధ్యాత్మిక మార్గం హేతువుని తిరస్కరిస్తుంది, అయితే అది హేతువుని అధిగమించి వెళ్ళగలదన్నారు’ దాదీజీ.
శనివారం ఉదయం
తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి, ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మకుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యానముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో, ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తి కాగానే బ్రహ్మకుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. అమృత ఘడియలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే, నేను మాత్రం ఆ వాతావరణాన్నీ అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానంలో ఏదయినా వుందా?
మరునాడు మౌంట్ అబూ నుంచి కిందికి దిగాము. అక్కడ బ్రహ్మకుమారీలకు ఒక బ్రహ్మాండమయిన సమావేశ మందిరం వుంది. దాదాపు లక్షమంది సౌకర్యంగా కూర్చుని ప్రసంగాలు వినడానికి, కార్యక్రమాలు తిలకించడానికీ వీలుగా దానికి రూపకల్పన చేసిన తీరు అద్భుతంగా వుంది. అంత పెద్ద హాలులో ఎక్కడా స్తంభాలు లేకుండా మందిరం పైకప్పు నిర్మించారు. వేదికకు సుదూరంగా కూర్చున్నవారికి కూడా స్పుటంగా వినగలిగేలా అత్యాధునికమయిన లౌడ్ స్పీకర్లను అమర్చారు. నిర్మాణ కౌశలానికి ఒక మచ్చు తునకగా పరిగణించాల్సిన ఈ సుందర మందిరం దేశానికి బ్రహ్మ కుమారీల భిక్షే.
ఉపశ్రుతి:
చారిత్రక ప్రదేశం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రదేశం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం పట్ల పూర్తి నమ్మకం, విశ్వాసం, ఆసక్తి వుంటే మాత్రం ఆ యాత్ర పరిపూర్ణం అవుతుంది. లేని పక్షంలో ఇలా లేనిపోని ఊసులు రాసుకోవడానికి తప్పిస్తే, ఇలా వెళ్లాం, అలా చూశాం, ఇదిగో వచ్చాం బాపతు అవుతుంది.





(ఇంకా వుంది)

10, అక్టోబర్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (230) : భండారు శ్రీనివాసరావు

  

ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను.

అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది.

గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా  వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని  చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల  హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల మీద ప్రత్యేక దర్శనాలు లేని దేవాలయం అది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు  అనే తేడా లేకుండా అందరూ వరుసగా వెళ్లి దైవ దర్శనం చేసుకోవడానికి వీలైన గుడి అది.  అందుకే నాకు ఆ గుడి అంటే మక్కువ ఎక్కువ. గర్భగుడిలో వున్న బాలాజీకి  వీసా దేవుడు అనే పేరుంది. అక్కడికి పోయి పదకొండు ప్రదక్షిణలు  తర్వాత, దర్శనం చేసుకుని మనసులో  కోరుకుంటే  అమెరికన్ వీసా దొరుకుతుంది అనే నమ్మకం ఆ గుడి విషయంలో వుంది అని విన్నాను.  కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ ఆ గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు అంటారు.

సువిశాల ప్రాంగణంలో  అనేక ఏళ్ళుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ దేవాలయానికి  ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందర రాజన్ అనే పెద్దమనిషి. ఉన్నత చదువులు అభ్యసించారు. కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త. రిటైర్ అయిన తర్వాత  అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తి స్వీకరించారు. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండరాదని దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ.

నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఆయన తరచుగా  మా దగ్గరకు వస్తుండే వారు. అనేక ఆధ్యాత్మిక  విషయాలు చర్చిస్తూ వుండేవారు.

ఆయన కుమారుడే  సౌందర రాజన్ రంగరాజన్.

తండ్రిలాగే ఆయన కూడా విద్యాధికుడు. ఎప్పుడైనా ఆ గుడికి వెళ్ళినప్పుడు తండ్రీ కొడుకులతో మాట్లాడడం నాకు ఓ వ్యాపకంగా మారింది. పెద్ద చదువులు చదివి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగినప్పుడు రంగరాజన్ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోయారు. ఇది జరిగి కూడా చాలా ఏళ్ళు అవుతోంది.

ఆ సంగతులు ఆయన మాటల్లోనే. 

మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. నుదిటిమీద పెద్దగా నామాలు పెట్టుకునే బడికి  వెళ్లేవాణ్ణి. క్రైస్తవ పాఠశాలలైనాసరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్పాలి.

ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంత కాలం, చిలుకూరు గుడికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు.

దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999 లోనే సంవత్సరానికి పది లక్షల రూపాయల జీతం!

అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. 1987లో నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో  వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసింది.

నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.

మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు నాన్నగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు  ఓ అధికారి ఇలా అన్నారు.

సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ వారసత్వపు హక్కుల గురించిన ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా, నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని!

నాకప్పుడు 35 ఏళ్లు. మంచి జీతం, ఇంకా మంచి భవిష్యత్తు వున్న ఉద్యోగం. ప్రేమించి పెళ్ళాడిన భార్య. చీకూ చింతాలేని సంసారం.

ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నలుగురూ నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా నా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను.

రోజూ దేవుడికి సమర్పించిన నైవేద్యం మాత్రమే నా ఆహారం. ఆధునిక వస్త్ర ధారణ వదిలేసి అలా మారిపోయిన నన్ను చూసి మా ఆవిడ మొదట్లో వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది.

ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను.

అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టిక్కెట్టు  దర్శనాలు లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ. తప్పకుండా పాటిస్తున్నాం.

ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా పోయింది.

“1990కి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభై వేల మంది దాకా వస్తున్నారు. గుడికి వచ్చేవారికి సనాతనధర్మం గొప్పతనం గురించి చెబుతుంటాం. సనాతన ధర్మమంటే మూఢాచారాలు, స్త్రీలపట్ల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించడం కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే.

వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాలసారం అదేనని నేను నమ్ముతా.

ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది.  దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను.

(శ్రీరంగం దేవాలయంలో ఓ దళితుడు స్వామి దర్శనం కోసం అల్లాడుతుంటాడు. కానీ అతడికి ప్రవేశం దొరకక పోగా ప్రధాన అర్చకుడు అతడిని గులక రాయితో కొడతాడు. గుడిలోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం స్రవిస్తూ వుంటుంది. దానితో పూజారికి జ్ఞానోదయం అవుతుంది. ఆ దళితుడిని తన భుజాల మీదకు ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లి స్వామి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇలా భుజాలకు ఎత్తుకుని దళితుల చేత దేవాలయ ప్రవేశం చేయించడాన్ని మునివాహన సేవ అంటారు)

అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. చెప్పినట్టే చేశాను. ఓరోజు ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అని పాడుకుంటూ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే  ఒక  హరిజన భక్తుణ్ణి గుడిలోకి మోసుకెళ్లాను.

ఈ విషయం మీడియాలో రావడంతో, బౌద్ధ గురువు దలైలామా ప్రశంసాపూర్వక లేఖ రాసారు. అభినందనలు అనంతంగా సాగాయి. ఇవన్నీ ఆ బాలాజీ  దయ అని నేను నమ్ముతాను.

వీటన్నింటి వెనక నా భార్య సుధ ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం వదులుకుని, అర్చకత్వం స్వీకరించిన  భర్త వెంట నడవాలంటే  గొప్ప మానసిక బలం కావాలి. బాగా చదువుకుని పైకి వచ్చిన నా పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపింది”

 

ఇటువంటి వారితో పరిచయాలు, వారి జీవితాలతో ముడిపడి వున్న సంఘటనలు దేవుడి పట్ల నా భావనలను పూర్తిగా మార్చి వేసాయి.

నేనే ఒక జీరోని అని నమ్ముతున్నప్పుడు, నా చుట్టూ వున్నవాళ్ళు అందరూ నా కంటే గొప్పవాళ్లే కదా!  అలాగే ఈ విశాల విశ్వంలో మన అందరికంటే శక్తివంతమైన ఒక పరమాత్మ ఉన్నాడని నమ్మితే అందులో తప్పేముంది? తప్పల్లా, ఆ పేరు చెప్పుకుని చేసే తప్పుడు పనులని సమర్థించడమే!

కింది ఫోటో:

చిలుకూరు ఆలయ ఆవరణలో సౌందర రాజన్ గారి గృహంలో  మా ఆవిడ, నేను.



(ఇంకా వుంది)