28, మార్చి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (129) – భండారు శ్రీనివాసరావు

 1987 లో మేము మాస్కో వెళ్ళింది నాలుగు సూటు కేసులతో. అవీ కోటీ మాల్.  అంతకు ముందు, బెజవాడలో, హైదరాబాదులో వున్నప్పుడు  పెద్దగా  ఇళ్ళు మారింది లేదు కానీ, ఎప్పుడు మారినా రిక్షాల్లోకి సరిపోయే సామాను మాత్రమే వుండేది. అలాంటిది ఇప్పుడు మాస్కో నుంచి  తీసుకువెళ్లాల్సిన సామాను చూస్తే మాకే కళ్ళు తిరిగాయి. అయిదేళ్లుగా కనబడ్డది కనబడ్డట్టు కొన్నాము కదా! అంచేత వాటిని మన దేశానికి తరలించాలి అంటే ఒక లిఫ్ట్ వ్యాన్ కావాల్సి వచ్చింది. మంచి టేకు కర్రతో చేసిన  లిఫ్ట్ వ్యాన్ సైజు ఒక రైల్వే బోగీ అంత వుంటుంది. దాన్ని  భారీ ట్రక్కులో మన ఇంటికి తెస్తారు. సామాను మొత్తం చక్కగా ప్యాక్ చేసి, పొట్టు బస్తాలో పొట్టు కూరినట్టు అందులోకి ఎక్కిస్తారు. తర్వాత దాన్ని రోడ్డు మార్గంలో, దేశంలో ఎక్కడో ఉన్న  ఓడరేవుకు చేర్చి అక్కడ నుంచి నౌకలో మద్రాసు (చెన్నై) చేరుస్తారు. ఇదంతా మూడు నాలుగు నెలలు పడుతుంది.

కొన్న ప్యాకెట్లు విప్పి చూస్తే మూడు వంతులు పనికి రానివి, అసలు అవేమిటో ఒక పట్టాన అర్ధం కానివి వున్నాయి. దుష్టాంగం ఖండించి శిష్టాంగాన్ని కాపాడినట్టు, పనికి రాదు అనుకున్న సామాను అంతా మరో మాట లేకుండా డస్ట్ బిన్ దగ్గర వదిలేసాము.

మా దగ్గర ఉన్న సోఫాలు, మంచాలు, పరుపులు, డ్రాయింగ్ రూమ్ ఫర్నిచర్, ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, డీప్  ఫ్రిడ్గ్జ్  (ఐస్ క్రీం షాపుల్లో వుండే పెద్ద ఫ్రీజరు), వాషింగ్ మిషన్, చాలా బరువు వుండే  చెకొస్లోవేకియా గ్లాస్ కట్లరీ, సోవియట్ సూవెనీర్లు, బట్టలు, కోట్లు, బూట్లు, ఎన్ని వేసినా, పుష్పక విమానం మాదిరిగా  అందులో కొంత  జాగా మిగిలి పోతోంది. అది ఫుల్ ప్యాక్ అయితే కానీ కుదరదు, ఏవో ఒక సామాను తీసుకురండి అని ట్రక్ వాళ్ళ గోల. లేని సామాను ఎక్కడినుంచి తేము?

దాంతో మా ఆవిడా నేను, పిల్లలం తలా ఒక టాక్సీ వేసుకుని వెళ్లి నానా చెత్త సామాను కొనుక్కువస్తే, అవి లిఫ్ట్ వ్యాన్ లో వేస్తే,  అప్పుడు బయలుదేరింది జగన్నాధరధం ముప్పయ్యారు టైర్ల ట్రక్కు మీద పొందికగా కూర్చుని. అంటే ఎటు అనుకున్నారు. మధ్యలో మరో పెద్ద పాము వుంది. దాని నోట్లో పడకుండా వుంటే పరమపద సోపానం చేరుతుంది. అదేమిటంటే, మాస్కో కష్టమ్స్. ఆ ఆఫీసు ఎక్కడో  మారుమూల వుంది. అక్కడ విదేశాలకు వెళ్ళే లిఫ్ట్ వ్యాన్లను  క్షుణ్ణంగా తరలిస్తారు. నేను, పిల్లలు  ఒక టాక్సీ తీసుకుని దాని  వెంబడే  వెళ్ళాము. అక్కడ ఎంత టైము పడుతుందో ఏమిటో అనుకుంటే వాళ్ళు అడిగింది ఒకే ఒక ప్రశ్న. ఈ లగేజీలో పాలు, పెరుగు వున్నాయా అని. నియత్ (లేవు) అనగానే, ఏమాత్రం  చెక్ చేయకుండా క్షణం ఆలస్యం చేయకుండా, కోపెక్కు (పైసా)  లంచం అడగకుండా ఆమోదముద్ర వేసి పంపేశారు. విదేశీయులు తిండి పదార్ధాలు పట్టుకుపోతే, తమ పౌరులకు ఇబ్బందని ఈ నిఘా పెట్టారని తర్వాత ఎవరో చెప్పారు.

ఒక్క లిఫ్ట్ వ్యాను నింపడానికే  మేము ఇంత హైరానాపడితే, కొందరు రెండు, మూడు లిఫ్ట్ వ్యానులు ఆర్డర్ పెట్టారు. మాస్కో నుంచి రష్యా కొనలో వున్న ఓడ రేవుకి, అక్కడ నుంచి సముద్ర మార్గంలో చెన్నైకి చేరవేయడానికి  ఒక్కో లిఫ్ట్  వ్యాన్ కి వసూలు చేసేది నామమాత్రం రవాణా చార్జి.  పైగా ప్యాకింగు బాధ్యత కూడా వాళ్ళదే. ఈ లెక్కన మాస్కో సగం ఖాళీ అయి వుంటుందని అనిపించింది. మా ఇల్లు ఖాళీ అయినా, చెత్తంతా వదలడంతో తెరిపిగా అనిపించింది. సామాను వెళ్ళిపోయింది సరే! మేము వెళ్ళే దాకా ఎలా. సమాధానం వాళ్ళే చెప్పారు. మేము వచ్చినప్పుడు ఎలా అన్నీ అమర్చి పెట్టారో అలాగే మళ్ళీ సెట్టింగు వేసి ఒప్పచెప్పారు. మళ్ళీ కృష్ణ దేవరాయల ఆస్థానం మొదలు. ఇప్పుడు ఆఫీసుకు పోయే పని కూడా లేదు. లిఫ్ట్ వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి షాపింగ్ పని కూడా లేదు. వచ్చిన వాళ్లకు వండిపెట్టే  మా ఆవిడ పని మాత్రం షరా మామూలే.

కాస్త విశ్రాంతి దొరికింది కాబట్టి,  ముందు భాగంలో ప్రస్తావించి వదిలేసిన రమేశ్ చంద్ర గారి ముచ్చట చెప్పుకుందాం. అది చెప్పాలి అంటే కొంత నాందీ ప్రస్తావన వుండాలి కదా!

రష్యా కమ్యూనిష్టుల ఏలుబడిలోకి వచ్చిన తరవాత ఏడు దశాబ్దాల పై చిలుకు కాలం, ఆ దేశంలో మతమన్నది కనబడలేదు, మతమన్న మాట వినబడలేదు. అయితే, “మతం మత్తు మందు” అని నమ్మిన కమ్యూనిస్టు పాలకులు కూడా ఆ దేశంలో, ఏ చర్చినీ , మసీదునీ కూలగొట్టక పోవడం విచిత్రం.

సరికదా,  పైపెచ్చు వాటికి  ఏటేటా సున్నాలు, రంగులూ కొట్టి ముస్తాబుచేసి తాళాలువేసి వుంచేవారు. విదేశాలనుంచి వచ్చే గౌరవ ప్రభుత్వ అతిధులకి వాటిని ఎంతో గౌరవంగా చూపించేవారు కూడా. రేడియో మాస్కోలో పనిచేసే విదేశీయులకు కూడా సెలవు రోజుల్లో విహార యాత్రల పేరుతొ చర్చీలు, మసీదులను సందర్శించే వీలుకలిపించేవారు. నేను కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఓసారి మాస్కోలోనూ, మాస్కో పొలిమేరల్లోను  ఉన్న పురాతన  ప్రార్ధనాలయాలను చూడడం జరిగింది. అయితే వాటిల్లో ఎక్కడా మతపరమైన కార్యకలాపాలు జరగడం లేదు. ముందే చెప్పినట్టు వాటిని ప్రతిఏటా ఎంతో ఖర్చుచేసి, మ్యూజియంలో మాదిరిగా  పదిలంగా ఉంచుతున్నారు.   

మేము మాస్కోలో వున్న రోజుల్లో ఓ వింత విషయం మా చెవిన పడింది.

మాస్కోలోని లెనిన్ స్కీప్రాస్పెక్త్ (లెనిన్ పేరు పెట్టిన ప్రధాన రహదారి) నిర్మాణ సమయంలోనో, లేదా ఆ రోడ్డును వెడల్పుచేసే సమయంలోనో, పాతకాలం నాటి ఒక చర్చి అడ్డం వచ్చిందట. దాన్ని కూలగొట్టడం లేదా కొన్ని లక్షల రూబుళ్ళు ఖర్చుచేసి  ఆ చర్చి భవనాన్ని పక్కకు జరపడం అనే రెండు ప్రత్యామ్నాయాలు అధికారుల ముందు నిలిచాయి. మతం పొడగిట్టని కమ్యూనిస్ట్ పాలకులకు, ఆ చర్చిని వున్నపలాన పడగొట్టడం చిటికెలో పని.

 అయినా వారు ఆ పని చేయకుండా చర్చి భవనం చుట్టూ కందకం మాదిరిగా తవ్వి, భూగర్భంలో దానికింద చక్రాలతో అమర్చిన  ఉక్కు పలకను ఉంచి, అంగుళం అంగుళం చొప్పున నెమ్మది నెమ్మదిగా ఆ మొత్తం చర్చి భవనాన్ని  ఏమాత్రం దెబ్బతినకుండా, వున్నదాన్ని వున్నట్టుగా దూరంగా జరిపి రోడ్డుపని పూర్తిచేశారని చెప్పుకునేవారు. ఇది నిజమైతే వింతల్లో వింత.

మేము మాస్కోలో వున్నప్పుడు భారత రాయబార కార్యాలయంలో పనిచేయడానికి రమేష్ చంద్ర అనే యువ అధికారి వచ్చారు. హైదరాబాదు వాసి. సీనియర్ జర్నలిస్ట్  వీజేఎం దివాకర్ పూర్వాశ్రమంలో కాలేజ్ లెక్చరరుగా పనిచేసే రోజుల్లో ఈ రమేష్ చంద్ర ఆయన విద్యార్ధి. ఐ.ఎఫ్.ఎస్.కు  సెలక్ట్ కాగానే ఈ తెలుగు యువకుడిని మొట్టమొదట మాస్కోలో పోస్ట్ చేసారు. ఎవరు చెప్పారో, ఎవరిద్వారా తెలుసుకున్నారో తెలియదు కానీ, మాస్కోలో దిగిన వెంటనే మా ఇంటికి ఫోన్ చేసారు. అప్పటికి ఆయన బ్రహ్మచారి. అంచేత వీలున్నప్పుడల్లా మా ఇంటికి భోజనానికి వచ్చేవారు. గొప్ప సాయి భక్తుడు. ఆయనకు ఎలాట్ చేసిన ఫ్లాట్ లో  ఓ గురువారం సాయంత్రం సాయి భజన పెట్టి మమ్మల్ని అందర్నీ పిలిచారు. ఆ తర్వాత  తెలుగువాళ్ళ౦దరి  ఇళ్ళలో ప్రతి శనివారం సాయంత్రం సాయి భజన ఒక  కార్యక్రమంగా మారిపోయింది. మాస్కో యూనివర్సిటీలో డాక్టరీ చదువుకోవడానికి వచ్చిన రవి అనే హైదరాబాదు విద్యార్ధి కూడా సత్యసాయి భక్తుడు కావడంతో అతడి ప్రోద్బలంతో మరికొంతమంది విద్యార్ధులు కూడా ఈ భజన బృందంలో చేరారు. రవి తల్లిగారు విశాలాక్షి హైదరాబాదు టెలిఫోన్స్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో పనిచేసేవారు. మేము మాస్కోరావడానికి ముందు నుంచీ ఆ కుటుంబంతో పరిచయం వుండేది. బదరీనాద్ కాబోలు యాత్రకు వెడుతూ దారి మధ్యలో కొండ చరియలు విరిగి పడడంతో విశాలాక్షి దంపతులు దుర్మరణం చెందారు.

మధ్యలో రమేశ్ చంద్ర హైదరాబాదు వెళ్లి, పెద్దలు నిర్ణయించిన సంబంధం చేసుకుని భార్య కాత్యాయని గారిని తీసుకుని మాస్కో వచ్చారు. ఆవిడ గారు కూడా సాయి భక్తురాలే. రష్యాలో కాత్యా అనే పేరు గల ఆడపిల్లలు అనేకమంది తారసపడతారు. కాత్యాయని గారు మాస్కో వచ్చాక కాత్యా అయిపోయారు.

మా రష్యన్ స్నేహితుడు పిలిపెంకో, అయన భార్య కూడా రమేష్ చంద్ర, రవి బృందం నిర్వహించే ఈ సాయి భజనల్లో పాల్గొనేవారు. చక్కటి స్వరంతో వారు భజన గీతాలు ఆలపిస్తుంటే రష్యన్ జంట కూడా గొంతు కలిపేవారు. అంత భారీ మనిషి బాసిపెట్లు వేసుకుని, చేతులతో చప్పట్లు చరుస్తూ,   ‘సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం’ అని పిలిపెంకో వచ్చీరాని తెలుగులో పాడుతుంటే వినడానికి, చూడడానికి  చాలా విచిత్రంగా వుండేది. అన్నింటికంటే విచిత్రం కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న మాస్కో నగరంలో ఇలా వారానికి ఒకచోట సాయి భజనలు జరగడం.

ఆ భజనల మహత్యం, స్వయం ప్రతిభ  రెండూ కలిసి  రమేశ్ చంద్ర ఉద్యోగపర్వంలో అంచెలంచెలుగా ఎదిగి, నిరుడు నవంబరులో విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శిగా రిటైర్ అయ్యారు.  

కింది ఫోటో:

భారత విదేశాంగ శాఖలో ఉన్నతస్థానంలో రిటైర్ అయిన శ్రీ రమేశ్ చంద్ర




 

 

(ఇంకా వుంది)

27, మార్చి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (128) – భండారు శ్రీనివాసరావు

 

“కామ్రేడ్! భండారు!  మీకు మాస్కో రేడియో తరపున కృతజ్ఞతలు”

నా ఎదురుగా కుర్చీలో కూర్చుని ఈ మాటలు చెబుతున్న మనిషిని చూసి ఆశ్చర్యపోయాను. ఆయన్ని  ఆఫీసు క్యాంటీన్ క్యూలో చాలాసార్లు చూశాను. లావుగా ఎత్తుగా తెల్లటి శరీర ఛాయతో బలిష్టంగా ఫుల్ సూటులో  వున్న ఆ వ్యక్తి,  రేడియో మాస్కో విదేశీ విభాగానికి అత్యున్నత అధికారి అని ఆ రోజే తెలిసింది.

రోజూ వెళ్ళినట్టే ఆ రోజూ ఆఫీసుకు వెళ్లాను. సగం బోసిపోయినట్టు అనిపించింది. గీర్మన్ వచ్చి మన డైరెక్టర్ మిమ్మల్ని చూద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు వస్తే మీకు  పరవాలేదా అని మన్ననగా అడిగాడు. ఆయన మన దగ్గరికి ఎందుకు మనమే వెడదాం అన్నాను గీర్మన్ తో. అయితే పదండి అని తీసుకు వెళ్ళాడు. మేము పనిచేసే అంతస్తులోనే వుంది ఆయన గది. గది ముందు  బంట్రోతులు కానీ  పియ్యేలు కానీ ఎవరూ లేరు. లోపల చిన్న గదిలో ఆయన కూర్చుని వున్నారు. మాకు ఎలాంటి కుర్చీలు, బల్లలు వుండేవో ఆయనకు అలాంటివే వుండడం చూసి ఆశ్చర్యపడ్డాను. తేడా ఏమీ లేదు. బెల్లు కొడితే వచ్చే ప్యూను లేడు. వ్యక్తిగత సిబ్బందీ లేరు. మేము వెళ్ళగానే ఆయన లేచి నిలబడి చాలా మర్యాదగా కరచాలనం చేశారు.

ఆయన రష్యన్ లో మాట్లాడుతుంటే గీర్మన్ దాన్ని తెలుగులోకి, నేను చెప్పే  మాటలను రష్యన్ లోకి అనువాదం చేస్తూ పోయాడు.

‘చాలా ఏళ్ళుగా మా రేడియోలో పనిచేస్తూ వచ్చారు. అదీ మాకు సంతృప్తికరంగా. మీరు ఇన్ని రోజులు ఇక్కడ సుఖంగా వున్నారని నేను అనుకుంటున్నాను

‘అవునండి, ధన్యవాదాలు

‘కొన్ని కారణాల వల్ల తెలుగు విభాగాన్ని ఈ రోజుతో మూసి వేస్తున్నాము. నిజానికి చివర్లో మూసి వేస్తున్నది మీ విభాగాన్నే. తెలుసు అనుకుంటాను. రేపటి నుంచి మీరు రానక్కరలేదు. మీ అపార్ట్ మెంటు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నాళ్ళు వుండాలన్నా ఉండవచ్చు.   మీరు మీ కుటుంబంతో తిరిగి ఇండియా వెళ్ళడానికి మా వాళ్ళు మీకు అన్నివిధాలుగా సాయం చేస్తారు. ఆల్ ది బెస్ట్!’

అన్నాడు మళ్ళీ చేతులు కలుపుతూ.

ఈ రోజుతో మీ ఉద్యోగం సరి అని చెప్పడం ఇంత సింపుల్ గా వుంటుందని నేనెప్పుడూ ఊహించలేదు.

ఆ రోజు ఆఖరి బులెటిన్ చదివి వెళ్ళాలి. నేను వెళ్ళే సరికి అనువాదం చేయాల్సిన వార్తలతో పాటు నా పేరు రాసి వున్న ఒక కవర్ పెట్టి వుంది. నాకు రావాల్సిన జీతం, ఇతర అలవెన్సులు, మూడు నెలల అడ్వాన్స్ తో పాటు, అన్నీ కోపెక్కులతో సహా లెక్క కట్టి ఇచ్చారు.

రేడియోలో చేరిన కొత్తల్లో ఒక జీతాల రోజున  నేను వెళ్ళలేదు. మరునాడు సెలవు. ఆ మరునాడు మధ్యాన్నం ఆఫీసుకు వెళ్లాను. నా జీతం కవరులో పెట్టి బల్ల మీద కనిపించింది. అదేమిటి అని అడిగితే, విక్టర్ చెప్పాడు, మరో పదిహేను రోజులు ఆగి వచ్చినా ఆ కవరు అలాగే అక్కడే  వుంటుంది అని.

మధ్యాన్నం బులెటిన్ రికార్డు చేసిన తరువాత విక్టర్, గీర్మన్, లిదా స్పిర్నోవా, నటాషా లను తీసుకుని రేడియో భవనం దగ్గరలో వున్న ఒక రెస్టారెంట్ కి వెళ్లి, అక్కడ బీర్లు తాగి, ఐస్  క్రీమ్స్ తిని ఆఫీసుకు వచ్చాము. మొదట్లో ఈ బీరు ఆఫీసులోనే దొరికేది. తర్వాత తర్వాత సంస్కరణల ప్రభావమో ఏమిటో తెలియదు, ఆఫీసుల్లో బీర్ల అమ్మకాలు నిలిపి వేశారు. అయితే బస్ స్టాపుల్లో అయిదు కోపెక్కులు వేస్తే గ్యాలన్ బీరు కొనుక్కునే కియోస్క్లులు ఉండేవి. చాలామంది అంత చలిలో కూడా మన దగ్గర మంచి నీళ్ళ వాటర్ క్యాన్ల వంటి క్యాన్లు నింపుకుని, రోడ్డు మీదే నిలబడి  బీరు తాగడం చాలా సార్లు చూశాను. వీరిలో మహిళలే ఎక్కువ. సిగరెట్లు తాగడంలో కూడా వారిదే పై చేయి. నా దగ్గర ఎప్పుడూ వుండే ఇండియా కింగ్స్ పెద్ద ప్యాకెట్లు రెండు  నటాషాకు ఇస్తే చాలా సంతోషపడింది.

ప్రతి రోజూ సాయంత్రం వార్తలు ముగించేటప్పుడు, ఈరోజు తెలుగులో వార్తలు ఇంతటితో సమాప్తం అనడం మామూలు.  ఆ రోజు కాస్త స్వేచ్ఛ తీసుకుని, మాస్కో రేడియో నుంచి తెలుగులో వార్తలు ఈ రోజుతో పూర్తిగా సమాప్తం అని చదివాను. బయటకి వచ్చిన తరువాత గీర్మన్,  విన్నాను సుమా అన్నట్టు కన్ను గీటి చిన్నగా నవ్వాడు.  

మాస్కో జీవితం ముగింపుకు రాబోతోందని ముందరి నుంచే తెలుసు కాబట్టి ఇంట్లో ఎవరం కూడా పెద్దగా ఆందోళన పడలేదు.  

అప్పటికే ఇండియన్ ఎంబసీ పనిచేస్తున్న తెలుగు దౌత్యాధికారుల్లో ఒకరైన కేవీ రమణ గారు కుటుంబంతో సహా ఇండియా  వెళ్ళిపోయారు. అలాగే నేవీ దౌత్యాధికారులు పరకాల సుధీర్, దాసరి రాము, రెడ్డి గార్ల పదవీ కాలం కూడా పూర్తయింది.  ఆ సమయంలో మరో తెలుగు యువ ఐ ఎఫ్ ఎస్ అధికారి రమేశ్ చంద్ర మాస్కో ఎంబసీలో పనిచేయడానికి వచ్చారు. అప్పటికి వారికి వివాహం కూడా కాలేదు. అంచేత తరచుగా మా ఇంటికి వస్తుండేవారు. రమేశ్ చంద్ర విషయానికి వస్తే, తరువాత అనేక దేశాల్లో భారత రాయబారిగా పనిచేసి, చివరకు నిరుడు నవంబరులో అనుకుంటా, భారత విదేశాంగ శాఖలో అదనపు  కార్యదర్శిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం భార్య శ్రీమతి కాత్యాయని, ఇద్దరు ఆడపిల్లలతో బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వారి అన్నగారు ఆకెళ్ళ పేరి శివకుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఫేస్ బుక్ మితృలు కూడా. (రమేశ్ చంద్ర గారి గురించి మరికొంత వివరంగా తరువాత రాస్తాను. ఎందుకంటే  తెలుగు కుటుంబాలు అన్నీ స్వదేశం తరలిపోయిన తర్వాత మాస్కోలో మిగిలింది మేమిద్దరమే) అలాగే మరో ఐ.ఎఫ్.ఎస్. అధికారి గీతేష్ శర్మ కొత్తగా మాస్కో వచ్చారు.  ఇండో టిబెట్ సరిహద్దు దళాల డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన రామకృష్ణారావు (వీరు చాలా కాలం హైదరాబాదులో కూడా పనిచేశారు, అప్పుడు పరిచయం) గారి అల్లుడు. మాస్కో  తరువాత గీతేష్,  జర్మనీ వంటి అనేక దేశాల్లో భారత రాయబారిగా పనిచేశారు. నాలుగేళ్లు  స్టేట్ బ్యాంక్ మాస్కో అధికారిగా పనిచేసిన  వై.రాదాకృష్ణ (వై.ఆర్.కె.)  ఆయన భార్య తత్వమసి  స్వదేశానికి వెళ్ళిపోయారు. తర్వాత రోజుల్లో ఆయన స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. 

 

కింది ఫోటో:

ఉద్యోగాలకోసం మాస్కో వెళ్లి అనుకోకుండా కలిసి, మిత్రులుగా కలిసి మెలిసి తిరిగి, తిరిగి ఇండియా వచ్చిన తర్వాత కూడా మాలో కొందరం అప్పుడప్పుడు, హైదరాబాదులో  కలుస్తూనే వున్నాం. అలా

ఆరేళ్ళ కిందట, 32 ఏళ్ళ తర్వాత మాస్కో బ్యాచ్ లో కొందరం మళ్ళీ కలిశాము.

ఫోటోలో  ఎడమవైపు నుంచి:

శ్రీ గీతేష్ శర్మ, ఆస్ట్రేలియాలో భారత రాయబారి, శ్రీ కే.వీ.రమణ, మాస్కో ఇండియన్ ఎంబసీలో ఫస్ట్ సెక్రటరీ (స్టీల్), రత్నా గీతేష్ శర్మ, , కమొడోర్ సుధీర్ పరకాల, కమాండర్ దాసరి, (మాస్కో ఇండియన్ ఎంబసీ), భండారు శ్రీనివాస రావు అనే నేను  (రేడియో మాస్కో), సురేష్ బాబు (ఆర్మీనియా, జార్జియా, మంగోలియాలో భారత రాయబారి) శ్రీమతి క్షేమ సురేష్ బాబు)



సందర్భం, సన్నివేశం:

2019 లో గీతేష్, రత్నల కుమార్తె మానస, అర్జున్ గర్గ్ ల పెళ్ళి రిసెప్షన్ హైదరాబాద్ లో.

 

(ఇంకా వుంది )

26, మార్చి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (127) – భండారు శ్రీనివాసరావు

 సోవియట్ యూనియన్ లో ఏమీ జరగదు అన్న ధీమా కాస్తా ఏదో జరుగుతోంది అనే సందేహంగా మారి, కాదు, జరగకూడనిది ఏదో జరిగింది అనే నిశ్చయానికి రావడానికి మొదటి అడుగు పడింది 1990, మొదట్లోనో,  చివర్లోనో.

గొప్ప గొప్ప రష్యన్ పుస్తకాలను  వివిధ భాషల్లోకి అనువదించే రాదుగ ప్రచురణాలయాన్ని మూసివేయడంతో తెలుగు విభాగం బాధ్యులు అయిన ఆర్వీయార్  హైదరాబాదుకు, ప్రగతి ప్రచురణాలయం నిడమర్తి ఉమామహేశ్వర రావు గారు మైసూరుకు తరలిపోయారు. ఇలాంటి మూసివేత  పరిణామాలు అప్పటికి కలలో కూడా ఊహించలేనివి.

తరువాత వేటు రేడియో  మాస్కో విదేశీ విభాగాల మీద పడింది. రేడియో మాస్కో నివాస భవనంలో మా పక్కనే వుండే ఫిలిప్పీన్స్ సహోద్యోగి, ఒకరోజు ఉన్నట్టుండి  ఇల్లు ఖాళీ చేసి కుటుంబంతో సహా చెప్పాపెట్టకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఇలా ఎంతమందికి ఉద్వాసన  పలికారో ఎవరికీ తెలియదు.

 

రేడియో మాస్కోలో సుమారు ఎనభయ్ కి పైగా ప్రపంచ భాషల్లో ప్రసారాలు జరిగేవి. అందులో పద్నాలుగు భారతీయ భాషలు. ఒకరోజు ఒడియా భాషలో ప్రసారాలు నిలిపి వేయాలని హఠాత్తుగా  నిర్ణయం తీసుకుని ప్రకటించారు. ఆ భాషలో ప్రసారాలకు బాధ్యుడు అయిన అరుణ్ మొహంతి మాస్కోలోనే చదువుకుని, మాస్కో రేడియోలో ఒరిస్సా భాషలో వార్తలు చదువుతూ అలాగే, అక్కడే  సెటిల్ అయ్యాడు. అంతకు ముందు ఏడాదే అతడు తన రాష్ట్రానికి వెళ్లి పెళ్లి చేసుకుని తిరిగి వచ్చాడు. కొత్త పెళ్లి కూతురు నమిత మా ఆవిడకి మంచి స్నేహితురాలు అయింది. పెళ్లి కబురు తెలియగానే రేడియో మాస్కో వాళ్ళు సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ బదులు  అతడికి రెండు పడక గదుల అపార్ట్ మెంటు కేటాయించారు.  ఇంతలోనే ఈ పరిణామం.

అయితే అరుణ్ కి బెంగాలీ వచ్చు. రష్యన్ చదువుకున్నాడు కాబట్టి కొన్నాళ్ళు కొనసాగాడు. ఈ లోగా కన్నడ విభాగం మూసేసామని ప్రకటించారు. కన్నడ, రామకృష్ణ గారు, ఆయన భార్య, సరోజ, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారి  కుమార్తె నందిత వెంటనే మైసూరు వెళ్ళిపోయారు.

తరువాత దెబ్బ గుజరాతీ  భాష ఇన్ చార్జ్ వ్యాస్ పై పడింది. తరువాత అస్సామీ, పంజాబీ,  మళయాళం, తమిళ్,   ఇలా నెల రోజులు తిరిగే సరికి భారతీయ విభాగంలో సగానికి పైగా ఖాళీ. పిలవడం, విషయం చెప్పడం, ఇండియాలో ఎక్కడికి పోవాలో తెలుసుకోవడం, అక్కడికి ఏరో ఫ్లోట్ విమానం టిక్కెట్లు ఇవ్వడం చకచకా జరిగిపోతోంది. ఎవరి టైం రాగానే వాళ్ళు మూటా ముల్లె సదురుకుని స్వదేశం వెళ్ళిపోవడం. చిత్రం ఏమిటంటే దక్షిణ భారత దేశానికి సంబంధించి చిట్టచివర మూసివేసింది తెలుగు విభాగం.

అయిదేళ్ళపాటు మాస్కోలో మా ఆవిడ చేసిన అన్న వితరణ మా వీడ్కోలు సమయంలో కొట్టవచ్చినట్టు కనబడింది.

అదెలాగంటే :

అక్టోబర్ విప్లవం యాభయ్యవ వార్షికోత్సవానికి గుర్తుగా 1772 అడుగుల ఎత్తయిన  ఆస్తాంకినో టవర్ ను మాస్కో రేడియో, టెలివిజన్ లకోసం  మాస్కోలో నిర్మించారు. దీని నిర్మాణం 1963  లో మొదలయి 1967   లో పూర్తయింది. అప్పట్లో ఎత్తయిన నిర్మాణాల్లో మొదట చెప్పుకునే అమెరికన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా ఎత్తులో ఇది 43 అడుగులు పెద్దది. తొమ్మిదేళ్ళ తరువాత కెనడాలో సీఎన్ టవర్ నిర్మించేంతవరకు ఈ రికార్డ్ ఆస్తాంకినో ఖాతాలోనే వుండిపోయింది. ఆ తరువాత ఎత్తయిన నిర్మాణాలు అనేక దేశాల్లో మొదలయి ఆస్తాంకినో రికార్డ్ మరుగున పడిపోయింది. ప్రచండమయిన పెనుగాలు వీచే పరిస్థితుల్లో ఈ టవర్ పై భాగం కొన్ని మీటర్లు అటూ ఇటూ వొరిగిపోతూ మళ్ళీ సర్దుకునే విధంగా దీని నిర్మాణాన్ని డిజైన్ చేశారు.  పొడవాటి తాటిచెట్లు విపరీతమయిన గాలి తాకిడికి అటూ ఇటూ వూగిపోతూ వుండడం చూసిన వారికి దీనిలోని ప్రత్యేకత సులభంగా అర్ధమవుతుంది. పై నుంచి చూస్తే, కింద పరచుకున్న మబ్బుల చాటున వున్న  ఎత్తైన భవనాలు కనబడేవి కాదు.  ఈ టవర్ ను కొన్ని విభాగాలుగా చేసి మధ్య మధ్యలో  రివాల్వింగ్ రెస్టారెంట్లు మొదలయినవి ఏర్పాటు చేశారు. మా కుటుంబం భారత దేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో హిందుస్తానీ సమాజ్ వారు అంత ఎత్తున వీడ్కోలు విందు ఏర్పాటు చేయడం మరపురాని మరో అనుభూతి. 

ఈ రెస్టారెంట్లలో టేబుల్ ముందుగా బుక్ చేసుకోకపోతే ప్రవేశం దుర్లభం. అక్కడి ధరలు సాధారణమయినవే కాని అంత ఎత్తులో విందు చేయడం అన్నది ఒక మహత్తర అనుభూతి కాబట్టి  వాటికి పర్యాటకుల  తాకిడి ఎక్కువగానే వుంటుంది. కాకపోతే మాస్కో రేడియోలో పనిచేసే  విదేశీయులు తమ ఆఫీసు ద్వారా బుకింగ్ చేసుకునే సౌలభ్యం వుంది.

‘ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. అందరూ సమానమే కాకపోతే  వారిలో కొంతమంది ఎక్కువ సమానం’ అని  ఆనిమల్ ఫాం రచయిత జార్జ్ ఆర్వెల్,   సోవియట్ల సమానత్వం గురించి చేసిన వ్యాఖ్యలో కొంత నిజం లేకపోలేదు. డాలర్లు చెల్లించే విదేశీయులకోసం  కోసం మాస్కోలో ప్రత్యేక హోటళ్ళు వున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని హోటళ్లకు తగ్గట్టుగా అవి చాలా డాబుసరిగా వుంటాయి. అందులో పనిచేసేవారు ఇంగ్లీష్ తెలిసిన రష్యన్లు. సాధారణ రష్యన్ పౌరులు వాటిల్లో అడుగు పెట్టే వీలు లేదు. విదేశీ అతిధులను  తీసుకువచ్చే టాక్సీ డ్రైవర్లు కూడా హోటల్ గుమ్మం దగ్గరే ఆగిపోవాలి. అల్లాగే సోవియట్ యూనియన్ సందర్శనకు వచ్చే ఇతర దేశాల కమ్యూనిస్ట్ నాయకులు షాపింగ్ చేయడం కోసం ప్రత్యేక దుకాణాలు వున్నాయి.  ప్రపంచంలో దొరికే అన్నిరకాల వస్తువులు అక్కడ అమ్ముతారని చెప్పుకునే వారు. పైగా వాటిని విదేశీ కరెన్సీ లో కాకుండా స్తానిక కరెన్సీలో కొనుగోలు చేసుకునే సౌలభ్యం వుంది. అయితే,  వాటిల్లో  ప్రవేశం అంత సులభం కాదు. ప్రత్యేకించి రష్యన్లకి.   కొందరికే కొన్ని కాకుండా అందరికీ అన్నీ అనే సిద్ధాంతంతో మొదలయిన సామ్యవాదం చివరికి కాలక్రమంలో భ్రష్టు పట్టడానికి ఇలాటి అవకరాలన్నీ దోహదం చేసాయని అక్కడ చాలాకాలంగా వుంటున్న వారు చెప్పుకోగా విన్నాను.

బెజవాడ నుంచి వచ్చిన ఒక ప్రముఖ కమ్యూనిస్ట్  (సీపీఎం)  నాయకుడు ఒకసారి మా  ఇంటికి భోజనానికి వచ్చారు. మాటల సందర్భంలో ఈ విషయం చెప్పారు. కానీ ఆయన పాత తరం కమ్యూనిస్ట్ నాయకుడు. అలాంటి  షాపుల్లో  పాశ్చాత్య  దేశాల్లో మాత్రమే  దొరికే చాలా ఖరీదైన వస్తువులు నామమాత్రపు ధరకు కొనుక్కోగలిగే సదుపాయాన్ని ఆయన ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. ‘మేము  ఈ దేశానికి సోవియట్ పార్టీ ఆహ్వానం మేరకు వచ్చింది  షాపింగ్ చేయడం కోసం కాదు’ అన్నారాయన. అంత గొప్ప వ్యక్తి పేరు గుర్తు రానందుకు చింతిస్తున్నాను. బహుశా వారి పేరు   లావు బాల గంగాధర రావు  గారని లీలగా గుర్తు.

 

ఆస్తాంకినో టవర్ విందుకు వెళ్ళేటప్పుడు లెనిన్ స్కీ ప్రాస్పెక్టస్ మీదుగా వెళ్ళాము. మాస్కో రేడియోకి   టాక్సీలో వెళ్ళాలి అంటే ఈ రోడ్డు మీదుగానే వెళ్ళాలి.

మాస్కోలో లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్ అనేది ప్రధాన వీధి. ఎనిమిది లేన్ల మార్గం. వీటికి అదనంగా ట్రాములువిద్యుత్ తో నడిచే బస్సులు  ఇదే రోడ్డుపై తిరుగుతుంటాయి. వీటన్నిటితో యెంతో విశాలంగా వుండే ఆ వీధికి సోవియట్ వ్యవస్తకు ఆది పురుషుడయిన లెనిన్ పేరు పెట్టారు. ఆ వీధి మధ్యలో రాకపోకలకు వీలయిన మరో మార్గం వుంటుంది. కానీ దాన్ని వాడుతున్న దాఖలాలు ఎన్నడూ కానరాలేదు. బహుశా గోర్భచేవ్ వంటి నాయకులకోసం దాన్ని ప్రత్యేకించారేమోనని అనుకుండేవాళ్ళం. చివరికి తెలిసిందేమిటంటే,  అది స్కూలు బస్సులు వెళ్ళే మార్గమని.

ఒకసారి ఆ మార్గంపై వెడుతున్న ఒక కాన్వాయ్ ని చూసాము. ముందు మిలీషియా వాహనం ( రష్యన్ లో పోలీసులను 'మిలీషియాఅంటారు.) దానివెంట ఒక బస్సుదాని వెనక అంబులెన్స్వెనుకనే మరో పోలీసు వాహనం,   ఏదో స్కూలు పిల్లలు పిక్నిక్ కి వెళుతున్నప్పటి సంబడం అది అని చెప్పారు. పిల్లల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలన్నా స్కూలు వాళ్ళు ముందు పోలీసులకు తెలియచేయ్యాల్సి వుంటుంది. అల్లా వుంటుంది అక్కడ పిల్లల పట్ల తీసుకుండే శ్రద్ధ.

మా కుటుంబం శాశ్వతంగా వదిలివెడుతున్నది ఇలాంటి వ్యవస్థ వున్న దేశాన్ని.

కింది ఫోటో:

మాస్కోలో సోవియట్ రేడియో, టెలివిజన్ టవర్ ఆస్తాంకినో



 

 

(ఇంకావుంది)