18, నవంబర్ 2015, బుధవారం

పేదవాడి గృహ ప్రవేశం

సూటిగా ......సుతిమెత్తగా ....... 
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 19-11-2015, THURSDAY) 
సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలనే కోరికే ఆదిమ మానవుడిని జనవాసాల నాగరిక జీవనం వైపుగా మళ్ళించింది. లేనిపక్షంలో పొదలు, గుహలకే మనిషి జీవితం పరిమితమై వుండేది.
సొంతిల్లు అనే కల కనని మనుషులు వుండరు. ఇల్లు అనేది నివసించడానికే కాదు మరణించడానికి కూడా అవసరం అని నమ్మే వాళ్ళు వున్నారు. ఒక ఇంటివాళ్ళు కావాలనే కోరిక పెంచుకునే విషయంలో  వున్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడా లేదు. కలిగిన వాళ్ళు తమ విభవం కొద్దీ ఒకటికి మించిన ‘ఇళ్ళు’ కట్టుకుంటే, లేనివాళ్ళు కనీసం ఒక్క ‘ఇల్లు’ అన్నా సొంతం అవుతే బాగుండని కోరుకుంటారు. ఇదేమీ తీరని కోరిక  కాకపోయినా అంత తేలిగ్గా సాధ్యం అయ్యే విషయం కూడా కాదు. అందుకే ఇల్లంటే అందరికీ అంతటి మక్కువ.
అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో అత్యధికులు ఇళ్లు లేనివాళ్ళే. తల దాచుకోవడానికి కొందరు అద్దె కొంపల్ని నమ్ముకుంటే అసలా మాత్రం గూడు లేనివాళ్ళు కూడా పుష్కలంగానే వున్నారు. బహుళ అంతస్తుల సుందర హర్మ్యాల దాపునే చివికి జీరాడుతున్న గుడిసెలు కూడా కానవచ్చే దృశ్యం బహుశా మన దేశానికే పరిమితం కావచ్చు. ఏదో ఒక పాత సినిమాలో జమీందారు రైలెక్కడానికి మందీ మార్బలంతో స్టేషనుకు వస్తాడు. తాను ఎక్కాల్సిన మొదటి తరగతి బోగీకి ఆనుకుని సామాన్యులు ప్రయాణించే సాధారణ బోగీలు వుండడం చూసి ఆ ఖామందుల వారికి ఒళ్ళు మండుతుంది. వెంటనే సెక్రెటరీని పిలిచి  ‘ఈ రైలుకు రెండో తరగతి బోగీలు తగిలించింది ఎవర’ని హుంకరిస్తాడు. ‘అయ్యా! రెండో తరగతి ఉంటేనే మొదటి తరగతికి గుర్తింపు, అందుకే ఆ ఏర్పాటు’ అని తెలివిగా జవాబిచ్చి అప్పటికి తప్పుకుని ఊపిరి పీల్చుకుంటాడు.
ఎంతో బాగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో కూడా ఇళ్ళు లేని నిర్భాగ్య దామోదరులు వున్నారు. ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్డు పక్కన ‘హోమ్ లెస్’ అని చిన్న బోర్డు పెట్టుకుని ఇలాటి వాళ్ళు అక్కడక్కడా కానవస్తుంటారు. మూడేళ్ళ క్రితం తీసిన అధికారిక గణాంకాల ప్రకారం అమెరికా వంటి సంపన్న దేశంలో ఇల్లు లేనివాళ్ళ సంఖ్య సుమారు కాస్త అటూ ఇటూగా ఆరున్నర లక్షలు. అయితే అసలు సంఖ్య ఇంకా ఎక్కువే అన్నది కొందరి వాదన. మన దేశంలో పేదలకోసం ఏటా లక్షల సంఖ్యలో ఇళ్ళు నిర్మిస్తున్నామని మన రాజకీయ నాయకులు ప్రకటనలు చేస్తుంటే విని ఆ దేశాల వాళ్ళు  నోళ్ళు వెళ్ళబెట్టడానికి కారణం వుంది. మన దగ్గర పేదవాడి ఇల్లు అంటే నాలుగు మట్టి గోడలు, పైన తాటాకు కప్పిన పూరి పాక అని.  కానీ  అభివృద్ధి చెందిన దేశాల్లో ‘ఇల్లు’ అంటే ఆ  లెక్క వేరు.
బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు  టి. అంజయ్య.

రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన  ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి అంజయ్య విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు మన పక్కా ఇళ్ళ ప్రణాళికలు అచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.

పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశనస్థలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, ఇళ్ళ స్థలాలకు   ఈనాడు వున్న ధరలు లేని ఆ పాత  రోజుల్లో కూడా పేదలకు  నివేశన స్థలాలు  అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు  స్థలాలను  పేదవారికి ఇళ్ళ స్థలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ  స్థలాల కేటాయింపు అనేది అదనపు పెద్దరికాన్ని కట్టబెట్టింది. కేటాయించిన స్థలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత పక్కాగా అమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో పక్కా ఇళ్ళ పధకం అనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రధానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈనాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు, లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత కొన్నేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి తిలాపాపం తలా పిడికెడు చందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.
దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే కడుపు నిండినవాడు, కడుపు మండినవాడు అనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే సిసలయిన  పాలకుల అసలయిన కర్తవ్యం.


(ఐ.డీ.హెచ్.కాలనీ)

ఈ నేపధ్యం ఎందుకంటె గత వారం తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఎన్నికల వాగ్దానాల అంబుల పొదిలోని ఒక ప్రధాన అస్త్రానికి పదునుపెట్టి ప్రదర్శించారు. బడుగులకో గూడు ఏర్పాటు చేయాలనే సదుద్దేశ్యంతో కేసీఆర్ రెండు పడకల ఇంటి పధకానికి తొలి రూపం ఇచ్చారు. హైదరాబాదులోని ఐ.డీ.హెచ్. కాలనీలో ఏడాది క్రితం తానే శంకుస్థాపన చేసిన 396 రెండు పడక గదుల  ఇళ్ళ కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసి తిరిగి తన చేతుల మీదుగానే ప్రారంభించి, బలహీన వర్గాల గృహ నిర్మాణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెర తీసారు. అంతకుముందే  నిర్మాణదశలో కాలనీని  సందర్శించిన గవర్నర్ నరసింహన్, ఆ ఇళ్ళను చూసి ముచ్చట పడ్డ విషయం గమనార్హం. బడుగులకు నాలుగు గోడలు కలిగిన ఓ పూరి పాక అప్పగించి చేతులు దులుపుకునే పాత పద్దతికి మంగళం పాడుతూ కేసీఆర్ చేపట్టిన ఈ పధకం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కాలనీని ఒక పర్యాయం పైనుంచి పరికిస్తే ఒక సంపన్న కాలనీని చిన్నదిగా చేసి చూసినట్టుగా అనిపిస్తుంది. అలాటి సౌకర్యాలను ఈ కొత్త కాలనీలో కల్పించారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయిన వారు ఆ ఇళ్ళను చూసి ఇటువంటి ఇల్లు తమకూ వుంటే యెంత బాగుంటుందని అనుకునే వుంటారు. అంత చూడముచ్చటగా ఉందా కాలనీ. ఆ విధంగా తన ఎన్నికల వాగ్దానంలో ఒక దాన్ని పాక్షికంగా అయినా అమలు చేసి చూపించిన ఘనత కేసీఆర్ కి దక్కింది.
అయితే ఇంతటితో ప్రభుత్వం బాధ్యత తీరిపోలేదు, సరికదా మరింత పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం చూసినా తెలంగాణా కొత్త రాష్ట్రంలో ఇంటి వసతి లేని పేదల సంఖ్య లక్షల్లో వుంది. రెండు పడక గదుల ఇళ్ళు ఏటా అరవై వేలు కట్టాలన్నది ప్రభుత్వ యోచన. మూడువందల ఇళ్ళు కట్టి చూపడానికి, నిర్మాణ వ్యవధి ఏడాదే అయినా మొత్తం మీద వాగ్దానం కొంతమేరకయినా నెరవేర్చడానికి   ఏడాదిన్నర పట్టింది.  ఈలెక్కన లక్షల ఇళ్ళ నిర్మాణం ఎప్పుడు పూర్తికావాలి? దానికి తగ్గట్టు, ఈ కొత్త కాలనీ నిర్మాణంతో పేదల కళ్ళల్లో కొత్త ఆశలు చిగుళ్ళు వేస్తున్నాయి. తమకూ సర్కారు అటువంటి ఇల్లు ఎప్పుడు కట్టించి ఇస్తుందా అనే ఎదురు చూపులు పెరుగుతున్నాయి.
అలాగే,  ఇల్లు కట్టించి, ఇంటి తాళాలు అప్పగించగానే పని పూర్తి అయినట్టు కాదు. కాలనీల నిర్వహణ సంపన్నులకే పెనుభారంగా మారిపోతున్న ఈ రోజుల్లో రెక్కాడితే కాని డొక్కాడని ఆ బడుగుల కాలనీలను కనిపెట్టి చూసేదెవరు? కొందరికి వచ్చి అందరికీ రాకపోతే, రానివారిలో కలిగే అసహనాన్ని తీర్చేదెవరు?
సరే! ఈ అనుమానాలని కాలమే తీర్చాలి. మొత్తం మీద మొదటి అడుగు పడింది. కేసీఆర్ తన సొంత ఇంటి పండుగలా ఈ పేదల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తిచేసారు. ఇల్లు అలుకగానే పండుగ కానట్టు ఈ పేదల గృహ ప్రవేశ పధకం ఎలాటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకు వెళ్ళగలిగితే, రెండు రూపాయల బియ్యం అనగానే జనాలకు ఎన్టీఆర్ గుర్తుకు వచ్చినట్టు, రెండు పడక గదుల ఇల్లు అనగానే తటాలున గుర్తు వచ్చేది కేసీఆర్ పేరే అవుతుంది.     (18-11-2015)            
రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  


16, నవంబర్ 2015, సోమవారం

కడుపు చించుకుంటే.....


(నవంబర్ పదహారు జాతీయ పత్రికా దినోత్సవం)
పత్రికలు, మీడియాకు సంబంధించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇష్టం లేకపోయినా,  ఆ రంగానికి చెందిన ఒకప్పటి  మనిషిగా ఒక్కోసారి  కల్పించుకోవాల్సి వస్తోంది.
చాలామంది 'పలానా పత్రిక చదవం, పలానా మీడియా చూడం' అంటుంటారు. ఎందుకంటే అవి పాక్షికంగా ఏదో ఒక పార్టీకి వెన్ను కాస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. ‘చదవం, చూడం’ అని అంటూనే వాటిల్లో వచ్చిన వార్తలని గురించి ప్రస్తావిస్తుంటారు. అదో వైచిత్రి.
నా వరకు నేను నలభై ఏళ్లనుంచి రోజూ మూడు నాలుగు పత్రికలు చందా కట్టి ఇంటికి తెప్పించుకుని చదువుతుంటాను. ‘అవి ఏం రాస్తున్నాయి’ అనే దానికంటే, అవి  వార్త ఇచ్చే విధానంలోని వైవిధ్యాన్ని గమనిస్తుంటాను. పత్రికల  నడుమ వృత్తి పరమైన పోటీ వుండడం తప్పేమీ కాదు. పై చేయి అనిపించుకోవడానికి ప్రయత్నించడం తప్పుపట్టేదేమీ కాదు. కానీ క్రమంగా ఈ పోటీ పాత్రికేయుల చేతుల్లోనుంచి ఆ పత్రికల యజమానుల చేతుల్లోకి పోతోంది. దానితో ఏ పత్రికకు ఆ పత్రికకు ఓ రంగూ రుచీ వాసనా ఏర్పడుతున్నాయి. కొంచెం అటూ ఇటూగా ఈ దోషం అంటుకోని  పత్రికంటూ కలికానికి కూడా కనిపించడం లేదు.
నిజమే! మునుపటి రోజుల్లో మాదిరిగా మడి కట్టుకుని పత్రిక నడపడం సులభం కాని పరిస్తితి వున్న మాట వాస్తవమే. అయితే, మనుగడకోసం  ఎంతో కొంత రాజీ పడే ధోరణి కాస్తా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి ఇతరేతర రంగాల్లో వుండే అవలక్షణాలన్నీ  కట్ట గట్టుకుని  ఈ రంగంలో ప్రవేశించాయి. ఈ రంగానికి వున్న అపరిమితమైన 'రీచింగ్' వల్ల, యేది చెప్పాలన్నా, ప్రజలకు క్షణాల మీద  యేది చేరాలన్నా మీడియాను మించిన మార్గం లేకపోవడంతో రాజకీయుల కళ్ళు ఈ రంగం మీద పడ్డాయి. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు తమ పెట్టుబళ్లను  ఈ రంగంలోకి మళ్ళిస్తున్నారు. నేరుగా 'రిటర్న్స్' వెంటనే రాకపోయినా మరో మార్గంలో అందుతున్న ప్రయోజనాలు వారిని ఇందుకు ఆకర్షిస్తున్నాయి. డబ్బు పోయినా అంతకు మించిన గౌరవం, తద్వారా సామాజికంగా, రాజకీయంగా వొనగూడుతున్న లాభాలు వారిని ఇందుకు పురిగొల్పుతున్నాయి. అందుకే దేశంలో ఎక్కడా లేనన్ని టీవీ ఛానళ్ళు తెలుగునాట పురుడు పోసుకుంటున్నాయి.  పెట్టుబళ్ల వరకు అయితే పరవాలేదు. రాజకీయాల్లో వుండే కల్మషం, కుళ్ళూ, ఒకళ్ళను మరొకళ్ళు కత్తులతో నరుక్కునే సంస్కృతి - కాఫీ డికాషన్ మాదిరిగా ఇందులోకి దిగుమతి అవుతున్నాయి. ఆ పత్రిక ఏం చెప్పింది అని గతంలో మరో పత్రిక గమనించేది. దాన్ని గురించి ప్రస్తావించాల్సివస్తే పాత్రికేయ మర్యాదలు పాటించేవారు. పేరు పెట్టకుండా ‘ఒక పత్రిక’ అనేవారు. లేదా ‘మా పత్రిక కాదు’ అని రాసుకునే వారు.
కానీ ఇప్పుడో. ఒక పత్రిక ఏదైనా రాస్తే దాన్ని తమ పత్రికలో ఖండఖండాలుగా ఖండించడం ఎల్లా అన్నదొక్కటే యావ.    
ఫలితం. 'ఈ పత్రిక అలాగే రాస్తుంది, ఈ టీవీ  అలాగే చూపిస్తుంది' అని జనం తేలిగ్గా మాట్లాడుకునే పరిస్తితి. ఇది జర్నలిజానికి మంచిదా అంటే అంత ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.
ఇందులో ఒకర్ని నిందించే పరిస్తితి ఎప్పుడో దాటిపోయింది. అందరూ అందరే. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేని స్తితి.
పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది, వాటి యజమానులు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడే పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోవడాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు. అసలు విషాదం ఏమిటంటే ఆయా పార్టీల అభిమానులైన పాఠకులు సైతం వేర్వేరు పారావారాలుగా విడిపోయి తగువులు పడడం. సోషల్ మీడియాలో కూడా ఆ రంగుల్ని చల్లడం.
ఎవరు ఏమైనా అనుకోండి కానీ, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేసిన వాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం.
ఇష్టం వున్న వాటిని చదవండి. ఇష్టం వున్నవాటిని చూడండి. 'అలా యెందుకు రాశారు, ఇలా యెందుకు చూపారు' అని ప్రశ్నిస్తే అవే ప్రశ్నలు మీకూ ఎదురవుతాయి.

ఎందుకంటే  అన్నం తింటున్నది గొంగట్లో కనుక. (16-11-2015)

(NOTE: COURTESY IMAGE OWNER)

14, నవంబర్ 2015, శనివారం

సభ్యసమాజాన్ని ఒణికిస్తున్నఉగ్రవాద భూతం

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 15-11-2015, SUNDAY)
సూటిగా ....సుతిమెత్తగా ..... 
నిన్న శనివారం, తెల్లవారుతూనే పారిస్ లో జరిగిన ఘోరకలి గురించిన సమాచారాన్ని మోసుకుంటూ వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక నగరం పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో అనేకమంది అమాయకులు నేలకొరిగారు. ప్రాధమిక సమాచారం ప్రకారం చనిపోయిన వారి సంఖ్య నూటపాతిక దాకా వుంది. అయితే పూర్తి సమాచారం వెల్లడయ్యే సరికి మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు.
పారిస్ అంటేనే అందాల నగరం. ఆ అందాల నగర వాసులకి శుక్రవారం సాయంత్రం ఓ ఆటవిడుపు. అర్ధరాత్రి బాగా పొద్దుపోయేవరకు సరదాలు తీర్చుకోవడానికి వారాంతపు సెలవు దినాల తొలిరేయి. అటువంటి రాత్రివేళ  తెగబడిన ఉగ్రవాదులు వరుసగా నగరంలోని అనేక ప్రాంతాలపై విరుచుకుపడి జరిపిన పేలుళ్లు, కాల్పులు- పౌరులకు, పోలీసులకు ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా చేసాయి.


సంగీత కచ్చేరీలు జరిగే బటాక్లాన్ హాలులో ఉగ్రవాద దాడికి ఎక్కువమంది చనిపోయారు. కచ్చేరీ వినడానికి వచ్చిన ప్రేక్షకులను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఎనభయ్ మందిని పొట్టనబెట్టుకున్నారని తొలివార్తలు తెలిపాయి.
పారిస్ నగరంలోని మరో అయిదు ప్రదేశాల్లో కూడా ఉగ్రవాదులు తమ తుపాకులకు పనిచెప్పారు. బార్లు, రెస్టారెంట్లలో కాలక్షేపం చేస్తున్న పౌరులు ఈ దాడులలో ప్రాణాలు కోల్పోయారు. మారణహోమానికి కారణ మయిన ఉగ్రవాదులనందరినీ తాము మట్టుబెట్టామని పోలీసులు నమ్ముతున్నారు. అయితే వారిలో ఇంకా ఎవరయినా తప్పించుకున్నారా అనే విషయంలో స్పష్టత లేదు.
ఉగ్రవాద దాడితో ఫ్రాన్స్ ప్రభుత్వం ఉలిక్కి పడింది. ఆంతరంగిక అత్యవసర పరిస్తితి విధించింది. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడంలో సుశిక్షితులైన సాయుధ భటులను రంగంలోకి దింపింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఇళ్ళు ఒదిలి వీధుల్లోకి రావద్దని నగర పౌరులను హెచ్చరించారు.     
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్  కీ  మూన్, రష్యా అధ్యక్షుడు  పుతిన్  ఇతర అగ్రరాజ్యాల నాయకులు, పారిస్ లో జరిగిన  మానవ హననం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి నాగరిక ప్రపంచం  సంఘటిత కృషి జరపాలని ఉద్బోధించారు.
బ్రిటన్ పర్యటనలో వున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లండన్ లోని వెంబ్లే స్టేడియంలో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ ‘ఉగ్రవాదానికి సూఫీ సంప్రదాయమే విరుగుడు’ అని ఉద్బోధ చేసిన రోజునే పారిస్ లో ఈ ఘటన జరగడం  కాకతాళీయం కావచ్చు.
పొతే, పారిస్ పేలుళ్ళపై  అనేకమంది ప్రత్యక్ష సాక్షుల కధనాలతో విదేశీ మీడియా అట్టుడికి పోతోంది.   
బెన్ గ్రాంట్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఓ మద్యశాలలో కూర్చుని వున్నప్పుడు ఉగ్రవాదులు బయట కార్లనుంచి కాల్పులు జరిపారు.
‘మేము వెనుక వైపు వుండడం కలిసి వచ్చింది. కాల్పుల శబ్దం వినబడగానే మేము ఓ బల్ల కింద దాక్కున్నాము. మాకేమీ కనబడలేదు. కాసేపటి తరువాత చూస్తే ఎటు చూసినా శవాలే. అప్పుడు తెలిసింది జరిగిన ఘోరం ఎంతటిదన్నది.’ బెన్ గ్రాంట్ చెప్పాడు. అతడి గొంతులో భయంతో కూడిన దైన్యం.
‘మేము చాలాసేపటి వరకు బయటకు రాలేకపోయాము. ఎందుకంటె మా కళ్ళ ముందు ఎన్నో శరీరాలు అచేతనంగా గుట్టలుగా పడివున్నాయి’ గ్రాంట్ చెప్పాడు విషాద వదనంతో.
అదే రోజు పారిస్ లోని  నేషనల్  స్టేడియంలో ఫ్రాన్స్, జర్మనీ జట్ల నడుమ కీలకమైన ఫుట్  బాల్ మ్యాచ్ జరుగుతోంది. ‘ఆట సగంలో ఉండగానే బయట నుంచి రెండు సార్లు పెద్దగా పేలుడు శబ్దాలు వినవచ్చాయి.’ అని స్థానిక దినపత్రిక విలేకరి చెప్పాడు.
‘ప్రెసిడెంట్  హోలాండ్ కూడా ఆట చూడడానికి వచ్చారు. మ్యాచ్ మామూలుగా సాగిపోతోంది. పైకి చూస్తే ఆకాశంలో ఓ హెలికాప్టర్ ఎగురుతూ కనిపించింది. ఆట జరుగుతుండగానే ఎవరికీ తెలియకుండా భద్రతా దళాలు ప్రెసిడెంటుని అక్కడ నుంచి తప్పించి తీసుకువెళ్లినట్టు ట్విట్టర్  చూస్తే తెలిసింద’ని విన్సెంట్ అనే ఆ విలేకరి వెల్లడించాడు.
‘వున్నట్టుండి ఆటను  మధ్యలో నిలిపేశారు. ప్రేక్షకులందరూ వెంటనే స్టేడియం ఒదిలి వెళ్ళిపోవాలని లౌడ్ స్పీకర్లలో ప్రకటించారు. జనం కంగారుగా బయట పడడానికి హడావిడి పడ్డారు.’ అని ఆ విలేకరి తెలిపాడు. 
కాల్పులు జరిగిన అయిదు ప్రదేశాల్లో ఒకటయిన పారిస్ లోని కంబోడియా రెస్టారెంటులో భోజనం చేస్తున్న పిర్రే ఫార్ట్ కధనం ప్రకారం కాల్పుల శబ్దం అరనిమిషం పాటు వినపడింది.
‘బయట ఎవరో టపాసులు కాలుస్తున్నారని అనుకున్నా. తీరా చూస్తే అవి ఉగ్రవాద చర్య అని అర్ధం అయింది. రెస్టారెంటులో తుపాకీ తూటా తగిలి ఒక వ్యక్తి పడి వున్నాడు. అతడి చేతిలో ఓ మృత శిశువు. ఆ దృశ్యం కనబడగానే కడుపులో దేవినట్టయింది’ అని అతగాడు చెప్పాడు.
కష్టకాలంలో వున్న ఫ్రాన్స్ దేశానికి అనేక దేశాలు నైతిక మద్దతు ప్రకటించాయి. తోడుగా నిలుస్తామని హామీ ఇచ్చాయి.
అయితే ఇవన్నీ షరా మామూలు ప్రకటనలుగా మిగిలిపోకూడదు. ఉగ్రవాదం ఒక దేశాన్ని బలహీన పరచడం తమకు రాజకీయంగా మంచిదే అని అనేక దేశాలు తలపోస్తూ వుండడం అంతగోప్యమేమీ కాదు. తమ ప్రత్యర్ధి దేశం ఉగ్రవాదపు కబంధ హస్తాలలో నలిగిపోవడం కొందరికి కొంత ఉపశమనం కలిగించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పెంచి పోషించే ఉగ్రవాద భూతానికి కృతజ్ఞత ఉంటుందని ఆశించడం అత్యాశే అని అనేకదేశాల విషయంలో పలుమార్లు రుజువయింది. ఎందుకంటే ఉగ్రవాద ఉన్మాదులకు వివేచన పూజ్యం. వారికి తలకెక్కిన తలతిక్క మినహా మరేదీ తలకెక్కదు. నాశనం వినాశనం అనే రెండు పదాలే తప్ప వారికి శాంతి వచనాలు తెలవ్వు. చంపు, లేదా చచ్చిపో అనే రెండే రెండు వంటబట్టించుకున్న మరమనుషుల వంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు.
ఈ ఉగ్రవాదుల బలం అవతలి వాళ్ళలోని చావు భయం. చావు భయం లేకపోవడం వారికున్న మరో బలం.సంఖ్యాబలం రీత్యా చూస్తే అత్యంత బలహీనులయిన వీరు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం, వారిని ఎదురించాల్సిన శక్తులకు ఐకమత్యం లేకపోవడం.
ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు జెడలు విదిల్చినా వీరందరూ గళం కలిపి చెప్పే మాట ఒక్కటే. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని. కానీ కార్యాచరణ శూన్యం.
అధిక సంఖ్యలో వున్న మంచి వారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం. కలిసికట్టుగా అందరూ కృషి చేస్తే ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అంత అసాధ్యమేమీ కాదు. కానీ ఈ విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి స్వార్ధాలు వారివి.
వీటి నుంచి ప్రపంచ దేశాలు బయట పడనంత వరకు ఉగ్రవాదులు ఇలా తోకలు ఝాడిస్తూనే వుంటారు.
అదే జరుగుతోంది. అందులో మరో అంకమే పారిస్ ఘటనలు.
(14-11-2015)

రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్:  98491 30595  
NOTE: Courtesy Image Owner        

12, నవంబర్ 2015, గురువారం

అది ప్రశ్న! ఏది జవాబు ?


“అసహనం అంటే ఏమిటి?
‘సహనం కానిది’
‘అలా కాదు. ఇప్పుడు దేశంలో సహనం, అసహనం అనే అంశాల మీద విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది, దానిపై చెప్పండి’
‘వేదం ఏం చెబుతోంది, సహనావతు అంటోంది. బైబిల్ ఏం చెబుతోంది, ఆ మాటకు వస్తే ఖురాన్ ఏం బోధిస్తోంది? అంటే ఏమిటన్న మాట...’
‘అదికాదు, ఇప్పటి పరిస్తితుల్లో ఎవరు సహనం కోల్పోతున్నారు, ఎందుకు అలా జరుగుతోంది?’
‘ఎవరంటే, నాకు తెలిసి సహనం లేనివాళ్ళు అసహనంగా వ్యవహరిస్తున్నారు. అసహనంగా వుండేవాళ్ళు సహనంగా వుండేవారిపై దండెత్తుతున్నారు’
‘అది సరే! నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి? సహనం వుంది ఎవరికి? లేనిది ఎవరికి?’
‘సహనం అనేది జన్మతో వచ్చేది. అది జన్మ ఉన్నంత వరకు అంటిపెట్టుకునే వుంటుంది. అసహనం కూడా అంతే”

‘మీకూ మీతో ఇంటర్వ్యూకు ఓ దణ్ణం. బతికుంటే పాత పేపర్లు తినయినా బతుకుతాను’ 

(12-11-2015)  
NOTE: Courtesy Image Owner 

?

?
“లోపల ఇంతసేపూ ఏం మాట్లాడుకున్నారు?’
‘బయట మీడియాతో ఏం చెప్పాలో.. దాన్ని గురించి’

?  

11, నవంబర్ 2015, బుధవారం

మతాన్ని కులం జయించిందా!


అపజయం అనాధ శిశువు వంటిది, తమదని చెప్పుకోవడానికి కానీ, బాధ్యత పంచుకోవడానికి కానీ  ఎవ్వరూ ముందుకు రారు.
బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఎదురయిన  ఓటమి ఇటువంటిదే. మొన్నమొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మోడీ, అమిత్ షా ద్వయం సాధించిన ఘన విజయాలు, ఈ బీహారు పరాజయం మాటున మసకలు బారాయి. రాజకీయాల్లోనే కాదు ఈనాడు  ఏ రంగంలో అయినా సమర్ధతకు గీటురాయి విజయమే, కేవలం విజయమే అనే పరిస్తితుల్లో మనం జీవిస్తున్నాం.
పద్దెనిమిది మాసాల క్రితం అదే బీహారులో, అదే మోడీ, అదే అమిత్ షా కలిసి పార్టీని విజయపధంలో నడిపించి మొత్తం నలభయ్ లోకసభ స్థానాల్లో అక్షరాలా ముప్పయి రెండు ఎగరేసుకుపోతే, అలనాటి వారి శేముషీ వైభవాన్ని పొగడడానికి ఆదిశేషుడికి కూడా  సాధ్యం కాదన్న రీతిలో భజన బృందాలు పోటీ పడి కీర్తనలు పాడాయి. ఇప్పుడు మళ్ళీ అదే బీహారులో, అదే మోడీ, అదే అమిత్ షా ద్వయం అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడితే, ఇంతటితో వారి పని అయిపోయిందంటూ అదే నోటితో విమర్శల జడివాన మొదలయింది.
ఈ పరిస్తితికి కారణం ఎవ్వరు?
నిజం చెప్పుకోవాలంటే నిజానికి వాళ్లిద్దరే కారణం. అలనాటి ఘన విజయానికి వీళ్ళిద్దరే కారణం అని భజన బృందాలు సంకీర్తనలు అందుకున్నప్పుడు, ‘అలా కాదు, ఇది సమష్టి విజయం’ అని వారిద్దరూ నోరు విప్పి చెప్పలేకపోయారు. స్వతంత్ర భారత ఎన్నికల చరిత్రలో మున్నెన్నడూ కనీ వినీ ఎరుగని ఘన విజయానికి వాస్తవంగా వారిద్దరి కృషే ప్రధాన కారణం అయినప్పటికీ, ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలకు తగినట్టుగా పార్టీ విజయంగా అభివర్ణించి వున్నట్టయితే, ఇప్పుడీ అపజయం మూటని సొంత భుజాల మీద మోయాల్సిన దుస్తితి వచ్చేది కాదు. సమర్ధతతకు వన్నె తెచ్చేది వినయం ఒక్కటే. అది మరపున పడితే ఇటువంటి సంకట స్తితి ఎటువంటి సమర్ధుడికయినా తప్పదు.


గతాన్ని గమనంలోకి తీసుకుని అంచనా వేస్తే, బీహారు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎండీయే కూటమి గెలుపు నల్లేరు మీది నడకే కావాలి. ఎందుకంటే, ఆయన ప్రత్యర్ధి నితీశ్ కుమార్ అప్పటికే పదేళ్లుగా బీహారును ముఖ్యమంత్రిగా పాలిస్తూ వస్తున్నారు. ఎంతటి సమర్ధుడికయినా, నిష్కళంక నాయకుడికయినా ప్రభుత్వ వ్యతిరేకత అనేది పూర్వజన్మ సంచితంలా వెంటే వెన్నాడి వస్తుంటుంది. దీన్ని తట్టుకుని మూడో పర్యాయం ప్రజల మెప్పును పొందడం కాకలు తీరిన వారికి సయితం కత్తి మీది సామే. పైగా ప్రత్యర్ధి ఎవ్వరు? తన కీర్తి కిరీటపు ధగధగలు ప్రపంచం నలుదిక్కులా పరచుకుపోతుంటే, శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రాజకీయాకాశంలో  వెలిగిపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన్ని ఒంటరిగా నిలువరించడం అసాధ్యం అని నిర్ధారణకు వచ్చిన తరువాతనే, బీహారులోని మోడీ ప్రత్యర్ధులందరూ ఏకమై మహా కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన వేళా విశేషం ఏమిటో కాని, మొదటి ముద్దలోనే ఈగ పడిన చందంగా నెలలు నిండకమునుపే ఆ కూటమికి బీటలు పడ్డాయి. ఇక నిజాయితీకి నిలువుటద్దం, పుటం వేసి గాలించినా ఎలాటి అవినీతి మరకలు కానరాని నితీశ్ కుమార్ జత కట్టింది ఎవరితో. రాజకీయాల్లో ఉచితానుచితాలు పాటించని లాలూ ప్రసాద్ యాదవ్ తో. ఉత్తర దక్షిణ ధ్రువాల వంటి వీరిద్దరి కలయికతో ఏర్పడ్డ మహా కూటమి పోటీ పడింది ఎవరితో, మన దేశంలోనే కాక దేశదేశాల్లో తన కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో.
ఇన్ని వ్యతిరేక పవనాల నడుమ నితీశ్ కుమార్ సాగించిన ఈ ఎన్నికల పోరాటంలో మామూలుగా అయితే మోడీ పక్షానిది ఏక పక్షపు విజయం కావాలి. మరి జరిగిందేమిటి? సరే ఈ ప్రశ్నకు బీహారు ప్రజలు తమ తీర్పుతో జవాబు చెప్పేశారు. అయితే, ఎందుకిలా జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకాల్సి వుంది. ఈ క్రమంలో అనేకానేక విశ్లేషణలు జనం ముందుకు వస్తున్నాయి.
కొందరిది మతం మీద కులం సాధించిన విజయం అంటుంటే, మరికొందరు అదేమీ కాదు, అసహనం మీద సహనం సాధించిన గెలుపని అభివర్ణిస్తున్నారు. మోడీ అమిత్ షా జోడీ అహంభావపు మొండి వైఖరి పార్టీ కొంప ముంచిందని కొందరు గగ్గోలు పెడుతుంటే, బీహారు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మునిగిపోయే కొంపలు ఏవీ లేవని ఇంకొందరు కొట్టి పారేస్తున్నారు.
ఎన్నికల్లో ఇది సహజాతి సహజం. అందరి అభిప్రాయాలు సరయినవి కాకపోయినా ప్రతి దాంట్లోనుంచి ఏరుకుంటే ఎంతోకొంత మంచి దొరుకుతుంది. సూక్ష్మం గ్రహిస్తే వర్తమానం నుంచి భవిష్యత్తుకు బాట వేసుకోవడానికి మార్గం సులువవుతుంది.
విజయం లభించినప్పుడు సంయమనం అవసరం. అపజయం సిద్ధించినప్పుడు రాగద్వేషాలకు అతీతమైన ఆత్మావలోకనం అంతే అవసరం.
విజయంతో విర్రవీగినా చతికిల పడక తప్పదు. అపజయంతో నిస్పృహ చెంది చతికిల పడ్డా రానున్న విజయాలకు దూరం కాక తప్పదు.
ప్రజలిచ్చిన అధికారం శాస్వితం కాదు. అలాగే, ఏదో చెప్పి, ఏదో చేసి అధికారం దొరకబుచ్చుకుందామని ప్రయత్నం చేసినా అది తాత్కాలికమే అవుతుంది.
ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం వున్న రాజకీయ నాయకులు, తమ పార్టీల మంచి చెడులు గురించి కాకుండా  ప్రజల గురించి ముందు పట్టించుకోవాలి. అప్పుడు ప్రజలే ఆ పార్టీలను గురించి పట్టించుకుంటారు.
ప్రస్తుతం మెజారిటీ పార్టీలు తద్విరుద్ధంగా ఆలోచిస్తున్నాయని అనిపిస్తోంది.

బీహారు ఎన్నికల ఫలితాలు చెబుతోంది కూడా ఇదే! (11-11-2015)
NOTE: Courtesy Image Owner 

భార్య (చెప్పిన) రహస్యం


ప్రధమ కబళే మక్షికాపాతః
అంటే మొదటి ముద్దలోనే ఈగ పడింది అని అర్ధం.
ఈ శీర్షికలో ముందు బ్రాకెట్లో రాసిన పదం ‘చెప్పిన’ అని లేదు. రాసిన తరువాత చూసుకుంటే, చూడ్డం మంచిదయింది, లేకపోతే పుట్టి పూర్తిగా మునిగేది. ఆ విధంగా కలిగిన జ్ఞానోదయంతో  తెలివినపడిన వాడినై,  అర్జంటుగా ముందో  బ్రాకెట్టు పెట్టి అందులో ‘చెప్పిన’ అనే పదాన్ని యమర్జెంటుగా కూరిపెట్టి, ‘భార్య రహస్యం’ ఏవిటి?  అనే దిక్కుమాలిన అనుమానాలు తలెత్తి సంసారపు పుట్టి నిండామునగకుండా నిండుదా  జాగ్రత్త పడ్డాను.
ఇంతకీ అసలు విషయం ఏవిటంటే, మా ఆవిడ బయట వర్షం పడొచ్చనే వాతావరణ హెచ్చరికలు నమ్మినదై, బయట పెత్తనాలకు పోలేకా,  లోపల కరెంటులేని కారణంగా  టీవీ సీరియల్ చూసే అవకాశం బొత్తిగా లేకయున్నూ,  ఇత్యాది బలమైన అనేక  కారణాల కారణంగా విధిలేని స్తితిలో ఇంటిపట్టునే వుండిపోయి, తప్పనిసరై  నాతో మాటవరసకు మాటలు కలిపి వాటి మధ్యలో ఒక తూటా పెట్టి  పేల్చింది. ఆ మాట  అన్నది మా ఆవిడ కాబట్టి, ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అదేవిటో ఈ భార్యామణులు  ఉన్నట్టుండి తమ తమ మొగుళ్ళను ఎవరితోనో ఒకరితో పోల్చి తమ ఈగోను చల్లార్చుకుంటూ ఉంటారని ఆడవాళ్ళంటే వోర్చుకోలేని ఒకాయన ఎప్పుడో  చెప్పాడు. సాధారణంగా పక్కింటాయనతోనో, ఎదురింటాయనతోనో (వాళ్ళ సంపాదనలతో సుమా) పోల్చి ‘మీరూ వున్నారు ఎందుకూ...’ అని సన్నాయినొక్కులు నొక్కడం పరిపాటి. కానీ ఈసారి మా ఆవిడంబాళ్ళు నన్ను పోల్చి చెప్పింది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా వాళ్ళతో కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తోటి. ‘ఆయనకూ   మీకూ  తేడా ఏమీ  కనబడడం లేదండీ’ అని ఉన్నట్టుండి   అనేసింది. ‘అమ్మ భడవఖానా. నన్నంటే ఏదో మొగుడుముండావాడ్ని సరిపుచ్చుకుంటాను కాని నన్ను ప్రధాన మంత్రితో పోల్చడం, కాదు కాదు సాక్షాత్తు ప్రధాన మంత్రిని నాతో పోల్చడం  ఏవిటి అసాధ్యం కూలా’ అనుకున్నాను.
ఏవిటో  అనుకున్నాకాని ఆమె లాజిక్కు ఆమెకు వుంది.
“నరేంద్ర మోడీ గారి లాగే  నేను మొండివాడ్ని(ట). కాదు, నాలాగే ఆయన మొండివాడు. ఎవరి మాటా వినడు” ఆవిడ ఉవాచ. కాదంటే కుదరని మాట.
“ఎవరు ఏమైనా  పరవాలేదు తన మాటే నెగ్గాలి అనే  తరహా ఆయన్ది, మీలానే” అని లా పాయింటు తీసింది.
“హౌరా!” అనుకున్నాను నాలో నేనే.
“అన్ని ధరలు పెరిగాయి కాస్త నెల బడ్జెట్ పెంచవయ్యా మగడా అంటే కుదరదంటే కుదరదని  మీలాగే నిక్కచ్చిగా తెగేసి చెప్పేరకం.” ఏమనడానికి ఏముంది? నిజమే కదా!
ఇంతవరకు బాగానే వుంది అనుకుంటూ వుంటే ఆఖరి తూటా పేల్చింది.
“మీరు బయట టీవీల్లో మాట్లాడ్డం తప్పిస్తే ఇంట్లో వాళ్ళతో ఓ మాటా వుండదు ఓ ముచ్చటా వుండదు. ఆయన్ని గురించి వాళ్ళ పార్టీ వాళ్ళదీ అదే గోల”
“అందుకే మీకూ ఆయనకూ తేడాలేదనేది” అనేసింది పేపరు మడిచి పక్కనపడేస్తూ.   

ఇంకేం అనను? అనాల్సింది అంతా తానేఅనేసిన తరువాత. (11-11-2015)