23, అక్టోబర్ 2015, శుక్రవారం

నివ్వెరపోయిన నెహ్రూ


‘నిశ్శబ్దం చాలా భయంకరంగా వుంటుంది’ అనే డైలాగు వుంది ఓ సినిమాలో.
ఒక్కోసారి నిశ్శబ్దం దిమ్మ అదరగొడుతుంది.
లెఫ్ట్ నెంట్ జనరల్ నిరంజన్ మాలిక్ అనే రిటైర్డ్ సైనికాధికారి చెప్పిన విషయం ఇది.
1947 లో దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో జవహర్  లాల్   నెహ్రూ భారత సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అనే విషయంలో సీనియర్ సైనికాధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసారు. అందులో  నెహ్రూ చేసిన ప్రతిపాదన అధికారులను నివ్వెర పరచింది. ‘ఈ పదవికి భారత సైన్యంలో తగినవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి కొంతకాలం పాటు ఎవరయినా  అనుభవం కలిగిన బ్రిటిష్ అధికారితోనే వ్యవహారాలు నడిపించాలనేది నెహ్రూ ఉద్దేశ్యం. ఆ పదవికి తగిన అనుభవం, సమర్ధత వున్న భారతీయులు లేరని తాను అనుకుంటున్నానని ఆయన మొహమాటం లేకుండా చెప్పేశారు. సాక్షాత్తు నెహ్రూనే  అలా అంటుంటే కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది. అందువల్ల ఇష్టం లేకపోయినా తల ఊపారు. ఇంతలో నాథూ సింగ్ రాథోర్ అనే సీనియర్ అధికారి లేచి నిలబడి మాట్లాడడానికి అనుమతి కోరాడు. అలా ధైర్యంగా ఒక ఆధికారి చొరవ  తీసుకుని అడగడంతో నివ్వెర పోవడం నెహ్రూ వంతయింది. అయినా తేరుకుని, చెప్పదలచుకున్నది సూటిగా, భయపడకుండా చెప్పమని ప్రోత్సహించాడు. అప్పుడు రాథోర్ ఇలా అన్నాడు.
‘సర్! దేశాన్ని పాలించే సమర్ధత కలిగిన నాయకుడు కూడా మనకు లేడనుకుందాం. అలా అని,  బ్రిటన్  నుంచి మంచి అనుభవశాలిని మన ప్రధానమంత్రిగా తెచ్చుకోవడం సబబుగా ఉంటుందా?’
రాథోర్ అలా అడగడంతో అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది. నెహ్రూకు కూడా అతడు అడిగిన దాంట్లో విషయం బోధ పడింది. అయన వెంటనే  రాథోర్ వైపు తిరిగి ‘ఈ పదవి నీకే ఇస్తాను, నువ్వు నిభాయించుకునిరాగలవా?’ అని అడిగారు.
రాథోర్ తొట్రు పడకుండా సమాధానం చెప్పాడు.  ‘సర్! మన సైన్యంలో అత్యంత సమర్థుడు అయిన ఓ అధికారి వున్నారు.ఆయన  నా సీనియర్. జనరల్ కరియప్ప. మా అందరిలోకి చాలా చేవకలిగినవాడు’
ఆ విధంగా జనరల్ కరియప్ప భారత దేశపు మొదటి సర్వ సైన్యాధ్యక్షుడు కాగలిగారని నిరంజన్ మాలిక్ కధనం.


(ఫోటో: 1949 లో ఢిల్లీ పాలం విమానాశ్రయంలో నాటి ప్రధాని జవహర్  లాల్  నెహ్రూతో జనరల్ కరియప్ప)  



22, అక్టోబర్ 2015, గురువారం

అమరావతి రివ్యూ

ఆరంభం అదిరింది.
ఒక కార్యక్రమాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించడం ఎట్లాగో విదేశీయులకి కూడా తెలిసివచ్చేలా అద్భుతంగా అన్ని ఏర్పాట్లు ఘనంగా  జరిగాయి.
ఏదీ తక్కువ చేసి చెప్పడానికి వీలు లేదు. అంతా నెంబర్ వన్. సందేహం లేదు.

కాకపోతే, క్లైమాక్సే  నిరాశ పరిచింది.
నిర్మాతకు గిట్టుబాటు కాదు కాని, టీవీ తెరలపై వంద రోజుల బొమ్మ. 

....డు వాన విదిచ

సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు చదువుతారంటారు.
కానీ ఇది ‘రాంగున్నర రాంగు’ అభిప్రాయమన్నది మా సుబ్బారావు నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అనేది కూడా మా వాడి థియరీనే! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్‌' చేయడానికి వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు.
కాకపోతే, ఈ రకమైన సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు, చిన్నప్పుడు మా వూళ్ళో పార్ట్ టైమ్‌ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొస్తుంటారు. వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి, వాటిలోని విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని , ఆపైన, వాటిని జాగ్రత్తగా అతికించి, తాపీగా ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం అన్నది వూరి పోస్ట్ మాస్టరుగా తనకున్న కాపీరైట్‌ అని భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా సాగిస్తూ వుండేవాడు. అంతటితో ఆగితే ఏ చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ' ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?' అంటూ ఆరాలు తీసేవాడు. ఇలా చాన్నాళ్లు అతగాడి సెన్సార్‌షిప్‌ని మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని రాసి వూరుకుంది. అంటే ‘చదివినవాడు గాడిద’ అన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం. కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే వెధవ అలవాటున్న ఆ పెద్ద వెధవ - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.


తాజాతోక
చివర్లో `తాజాకలం' బదులు `తాజాతోక' అనే పదం వాడడం వల్లా ఈ రెండూ ఎక్కడో విన్నట్టుగా వుందే అనే ఫీలింగ్‌ పాఠకులకు కలిగితే దానికి రచయిత పూచీ ఎంతమాత్రం లేదనన్నీ, ఆ పదాలపై అన్ని స్వామ్యములు, ఈప్రజాస్వామ్యదేశంలో, ఏ కొందరివో కాక అందరివనన్నీ సమస్త ప్రజానీకానికీ ఇందుమూలంగా తెలియచేయడమైనది. – రాయని రచయిత

NOTE: Cartoon Courtesy : www.shutterstock.com

నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య......1


పిన్ డ్రాప్ సైలెన్స్
సూది కింద పడ్డా వినబడేంత నిశ్శబ్దం అని దీనికి అనువాదం చెప్పుకోవచ్చు. ఇలాటిది ఎప్పుడయినా అనుభవంలోకి వచ్చిందా?


ఫీల్డ్  మార్షల్ శామ్ బహదూర్ మానెక్ షా. ఒకానొక కాలంలో స్వతంత్ర భారత దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన ఒక సారి గుజరాత్ లోని అహమ్మదాబాదులో సభలో మాట్లాడుతున్నారు. మానెక్ షా ఇంగ్లీష్ లో మాట్లాడ్డం సభికులకు నచ్చలేదు. గుజరాతీ భాషలోనే ప్రసంగించాలని పట్టుబట్టారు. అసలే సైన్యాధ్యక్షుడు. క్రమశిక్షణ పెద్ద పీట వేసే రకం. ఆయన ఒక్క నిమిషం సభికులని తేరిపార చూసి ఇంగ్లీష్ లోనే ప్రసంగం కొనసాగిస్తూ ఇలా చెప్పారు.
“నేను అనేక యుద్ధాల్లో పాల్గొన్న మనిషిని. సైన్యం అంటే ఏ ఒక్క భాష మాట్లాడేవాళ్ళో వుండరు. అనేక ప్రాంతాలవాళ్ళు సైన్యంలో చేరతారు. సిఖ్ రెజిమెంట్ లో పనిచేసే వారి నుంచి పంజాబీ నేర్చుకున్నాను. మరాఠా రెజిమెంటులో చేరిన వారి నుంచి మరాఠీ భాష  నేర్చుకున్నాను. అలాగే  మద్రాసు సాపర్స్ నుంచి తమిళ భాష బెంగాలీ సాపర్స్ నుంచి బెంగాలీ నుడికారం పట్టుకున్నాను. బీహార్ రెజిమెంటు నుంచి హిందీ, ఘూర్ఖా రేజిమెంటు నుంచి నేపాలీ భాష  నేర్చుకున్నాను. దురదృష్టం, గుజరాతీ భాష నేర్చుకుందాం అంటే అదేమిటో గుజరాత్ నుంచి ఎవ్వరూ సైన్యంలో చేరడం లేదు, అందరూ వ్యాపారాల పట్ల మక్కువ చూపే వాళ్ళే!’

అంతే! సభ మొత్తం ‘పిన్ డ్రాప్ సైలెన్స్!’         

21, అక్టోబర్ 2015, బుధవారం

అంత సీను లేదు.....


'ఏరా అబ్బాయ్. నువ్వుజగన్నాధం కొడుకువి కదా! నెలకు లక్షా యాభయ్ వేలు జీతమటగా! మీ  నాన్న చెప్పాడు. మరి, (పెళ్లి చేసుకుని) మాకు 'పప్పన్నం' ఎప్పుడు పెడతావ్!"
"అంతమాట అనకండి అంకుల్! పప్పన్నం పెట్టగలిగే స్తోమత లేదు. ఏదో, చారూ మజ్జిగా అంటే పరవాలేదు"


సూటిగా....సుతిమెత్తగా..... అక్షర సత్యాల్లో అర్ధ సత్యాలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 22-10-2015, THURSDAY)

“భారత దేశపు తొలి మహిళా ప్రధాని శ్రీమతి గాంధి, 1984,  అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీలో తన అధికార నివాసం ప్రాంగణంలోనే అంగరక్షకుల తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి కొద్ది రోజులముందుగానే తన తుది ఘడియలు దగ్గర పడుతున్నాయని ఆవిడకు తెలిసి వచ్చింది. దీనికి కారణం ఆవిడకు ఒక గుళ్ళో  కనబడిన ఓ  అపశకునం. హత్య జరిగిన అక్టోబర్ మాసంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ చాలా మనసుపడి కాశ్మీర్ పర్యటన పెట్టుకున్నారు. కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం అంటే ఆవిడ తెగ ముచ్చట పడేవారు. అంతేకాదు, కాశ్మీర్ లోయలోని ఒక హిందూ దేవాలయాన్ని,  అలాగే ముస్లింల ప్రార్ధనా మందిరం అయిన ఒక ప్రముఖ  మసీదును సందర్శించాలన్న కోరికతో కూడా ఆమె  ఆ పర్యటనకు బయలుదేరివెళ్ళారు. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక అపశకునం కనబడింది. అది చూడగానే తన రోజులు దగ్గర పడ్డాయని తోచింది. ఆ సమయంలోనే ప్రియాంకా గాంధి తన రాజకీయ వారసురాలయితే బాగుంటుంది అని కూడా  ఆమెకు అనిపించింది. కాకతాళీయం కావచ్చు కానీ, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆవిడ హఠాత్ మరణానికి గురయ్యారు. ప్రియాంక రాజకీయ వారసత్వం గురించి  శ్రీమతి గాంధీ మనసులోని ఈ మాటను తదనంతర కాలంలో సోనియా గాంధి చెవిలో వేసినా, ఆవిడ దానికి ఇష్టపడలేదు.” (శ్రీమతి  ఇందిరాగాంధీ మరణించే నాటికి ప్రియాంక  గాంధి  వయస్సు  కేవలం పన్నెండేళ్ళే. మరి రాజకీయ వారసత్వం గురించిన ఆలోచన ఎలా వచ్చిందో!)


“వీపీ సింగ్ ప్రభుత్వ పతనానంతరం రాజీవ్ గాంధీని ఆనాడే ప్రధానమంత్రిని చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ సుముఖత చూపని కారణంగా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. పైగా రాజీవ్ బదులు ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలని వెంకట్రామన్ కోరుకున్నారు.”
ఇవన్నీ అక్షర సత్యాలు అవునో కాదో తెలియదు. కానీ ఈ సంగతులన్నీ, శ్రేమతి గాంధి అంతరంగికుడు ఎం.ఎల్ ఫోతేదార్ రాసిన  ఒక పుస్తకంలో  అక్షరబద్ధం అయ్యాయి.
శ్రీమతి గాంధీ దుర్నిరీక్షంగా దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇద్దరు అధికారులు తమ గుప్పెట్లో పెట్టుకుని పాలిస్తూ వుండేవారు. శ్రీమతి గాంధీ ఆంతరంగిక వర్గంలోని వారు కాబట్టి వారిరువురి మాటా మంత్రులకే కాదు, సీనియర్ అధికారులకు కూడా శిరోధార్యం. వారు ఏదైనా చెప్పారంటే ఇక అది శిలాశాసనం.  ఆర్.కే. ధావన్, ఎం.ఎల్. ఫోతెదార్  అనే ఈ ఇరువురూ, ఇందిర పుణ్యమా అని  రాజకీయంగా కూడా ఎన్నో   ఎత్తులకు ఎదిగారు.
ఫోతెదార్ రాసిన ఈ ఆత్మకధ పుస్తకం త్వరలో మార్కెట్లోకి రానుంది.
పెద్ద పెద్ద వ్యక్తులు రాసే ఆత్మకధలు అటుంచి, వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళు రాసే పుస్తకాల్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉండడానికి ఆస్కారం ఎక్కువ. అంచేతే పుస్తక ప్రచురణ కర్తలు కూడా ఇటువంటి వారు రాసే ఆత్మకధలకు, జీవిత చరిత్రలకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురిస్తున్నారు. వాటిల్లో ఇటువంటి కొన్ని అంశాలకు ముందుగానే మీడియా ద్వారా ప్రాచుర్యం కల్పించి సొంత పబ్బం గడుపుకుంటున్నారనే అపవాదు కూడా వారిపై వుంది.
ప్రముఖులు జీవించివున్నకాలంలో,  వారితో సన్నిహితంగా మెలిగేవారికి ఆ ప్రసిద్దుల  జీవితాల్లో, జనాలకు తెలియని కొన్ని ఆసక్తికర అంశాలను గమనించగలిగే అవకాశం వుంటుంది. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని, వారు మరణించిన తరువాత వారికి సంబంధించిన విషయాలను ఇలా ఆత్మకదల ద్వారా బయట పెట్టడంలో నైతికత ఏమిటన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం ఉండడంలేదు. ఇది ఏదో మన దేశానికి సంబంధించింది మాత్రమె కాదు. నిజం చెప్పాలంటే ఇలా పుస్తకాలను మార్కెట్ చేసే సంస్కృతి విదేశాలనుంచే దిగుమతి అయింది.
వాస్తవానికి,  సాహిత్య ప్రక్రియల్లో ఆత్మకధలు లేదా జీవితచరిత్రలు ప్రధానమయినవి. వీటిని చదువుతుంటే మనకు చెందని కాలానికి చెందిన అనేక విషయాలను అవగాహన చేసుకోగలుగుతాము. మనం ఈనాడు చూస్తున్న ప్రదేశాలు, ఆచారవ్యవహారాలు వాటికి పూర్వ రూపం ఎలావుండేదో తెలుసుకోవడానికి వీటిని చదవడం ఒక్కటే సరయిన మార్గం. ఏనుగుల వీరాస్వామి గారు రాసిన నా కాశీ యాత్ర పుస్తకం చదువుతుంటే ఆనాటి హైదరాబాదు నగరం ఎలావుండేదన్న వాస్తవ చిత్రం  కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అప్పటి ధరవరలు, వేషధారణలు, ఆహారవ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి ఈరకమయిన పుస్తకపఠనం ఉపయోగపడుతుంది. అయితే ఇవి రాసిన వారు యెంత ఘటనాఘటన సమర్దులయినా కించిత్తు స్వోత్కర్ష దొర్లడం కద్దు. కొన్నింట ఏకంగా పర దూషణ ఏరులై పారుతుంది. ఇక ఆ పెద్దమనిషి యెంతటి మేరుఘనగధీరుడయినప్పటికీ  ఆ రచనని ఆస్వాదించడం పంటికింద రాయి చందమే. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు రాసే  తమ జీవిత చరిత్రల్లో ఈ రకమయిన ఆత్మ స్తుతి-పరనింద తొణికిసలాడుతుంటాయి. వీటివల్ల అసలు వాస్తవాలు మరుగున పడిపోతుంటాయి. మహాత్మా గాంధీ రాసుకున్న మై ఎక్స్ పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది దీనికి పూర్తి మినహాయింపు. తనలోని బలహీనతలను ఒప్పుకోవడానికి, బయట పెట్టుకోవడానికి  ఆయన ఎంతమాత్రం సంశయించకపోవడం ఆ పుస్తకంలోని గొప్పతనం. అలాగే సందర్భాన్నిబట్టి, లేదా వాస్తవాలనుబట్టి తనలోని గొప్పతనాన్ని కానీ, ఇతరులలో తనకు నచ్చని విషయాలను కానీ చెప్పాల్సివచ్చినప్పుడు ఆ విషయాలను సుతిమెత్తగా చెప్పడం మళ్ళీ ముళ్లపూడి వెంకటరమణ గారికే సాధ్యమయింది.
చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ, పెరిగిపెద్దయిన తరవాత కూడా ఎలాటి ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే మిగిలిపోతే పాతసంగతులు గుర్తుచేసుకునే ఛాన్సు వుండదు. ఒకవేళ గుర్తుచేసుకున్నా విన్న జనం మొహానే నవ్వుతారు. కానీ, చిన్నతనంలో ఏ తిరుగుళ్ళు తిరిగినా, పెద్దయిన తరవాత కూడా అలాగే మిగిలిపోకుండా జీవితంలో ఒక స్తాయినీ, సంఘంలో ఒక హోదాను అందుకోగలిగితే, చిన్నప్పటి చిల్లర జీవితానికి ‘ గ్లామరు’ దానంతట అదే వచ్చిపడుతుంది. అప్పటి సంగతులు చెబితే వినేవాళ్ళుంటారు. పుస్తకాలు రాసుకున్నా, రాయించుకున్నా అచ్చువేసే వాళ్ళుంటారు. కొనేవాళ్ళ సంగతి ఎలావున్నా, రివ్యూలు రాసేవాళ్ళు సిద్ధంగానే వుంటారు. అందుకే, తృణమో ఫణమో చదివించుకుని  ఇలాటి ఆత్మకధలు లేదా జీవిత చరిత్రలు రాయించుకునే రచనలకు  ఈ రోజుల్లో మంచి గిరాకీ వుంది. సచ్చీలురయిన గొప్పవారి జీవితాలను కడిగి గాలించినా ముచ్చటపడి చదువుకునే  రసకందాయఘట్టాలు మచ్చుకయినా కనిపించవు కాబట్టీ , అలాటి వారి గురించి రాసినా చదివేవారు వుండరు కాబట్టీ,  పైపెచ్చు రాసేవారికీ వేసేవారికీ గిట్టుబాటు వ్యవహారం కాదు కాబట్టీ అటువంటి  వాటి జోలికి ఎవరూ పోరు. పోతే, జీవిత చరిత్రలను వేయించుకోగలిగిన స్తాయికి చేరుకున్నారంటేనే,  అటువంటి వారి ఘనమయిన గతంలో ‘ఏవో కొన్ని  రసరమ్య ఘట్టాలు’ వుండేవుంటాయి. లేకపోయినా ‘చరిత్రలు’ రాసిపెట్టే వాళ్లకు ఆ తెలివితేటలు పుష్కలం. అవసరమైతే అలాటి ఆసక్తికర అంశాలను తమ కల్పనాచాతుర్యంతో సృష్టించగలరు. ఇంతవుంటే చాలు ఎంతో చేసి చూపగలరు. ఈ సత్తా వున్నవారినే ఇందుకోసం ఎంపిక చేసుకుంటారు. అంతే కాదు, ఆ సన్నివేశాలకు తగిన మసాలాను దట్టించి చదవాలనే ఉత్సుకతను చదువరులలో పెంచగలరు. ఆ రకమైన ముఖ్యాంశాలను గ్రంధ ప్రచురణకు ముందుగానే, ఆకర్షణీయమయిన ప్రమోలుగా రూపొందించి, పత్రికల్లో రివ్యూల ద్వారా, మీడియాలో ఇంటర్వ్యూల రూపంలో జనాలమీదకు వొదలగల టక్కుటమార విద్యల్లో ప్రచురణకర్తలు ఆరితేరిపోయారు. ఈ క్రతువులన్నీ ముగిసిన తరవాత కానీ అసలు పుస్తకం మార్కెట్లోకి రాదు.

అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ మార్కెటింగ్ టెక్నిక్కులు ఇటీవల మనవైపు కూడా విస్తరిస్తున్నాయి. అందుకో చక్కని ఉదాహరణ, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ - తన జీవితం లోని కొన్ని ఘట్టాలతో రాసిన  “ప్రయాణం” అనే పుస్తకం. ముందు చెప్పిన విధంగానే అమ్మకాలు పెంచే ప్రచార పర్వాన్ని ‘సన్’ పత్రిక ప్రారంభించింది. ఈ పుస్తకం గురించి సమీక్ష రాస్తూ అందులోని ఒక ఆసక్తికరమయిన విషయాన్ని బయట పెట్టింది.

టోనీ బ్లేర్ మహాశయులవారు, బార్లలో పనిచేస్తూ చదువుకుంటున్న రోజుల్లో ఒక ఫ్రెంచ్ యువతితో ప్రేమలో పడ్డారుట. ఆమెపై మరులుపెంచుకున్న టోనీకి ఆ వ్యామోహం నుంచి బయటపడడం ఒక పట్టాన సాధ్యం కాలేదుట.

ఆలోచించడం మానుకో, ఆనందించడం నేర్చుకో’ అని ఆ ఫ్రెంచ్ అమ్మడు అతడికి సుద్దులు నేర్పిందట. తనంటే పడిచచ్చిపోతున్న ఆ పడుచువాడు, భవిష్యత్తులో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రి కాగలడని ఆ యువతి అప్పట్లో వూహించి వుండదు.

సన్’ పత్రిక లో వచ్చిన ఈ ‘వేడి వేడి కబురు’ అందరినీ ఆకట్టుకుంది. ఏమయితేనేం - మొత్తానికి ఈ ట్రిక్ పనిచేసింది. టోనీ పుస్తకాలూ వేడి వేడి పకోడీల్లా అమ్ముడు పోయాయి.

ఇంగ్లాండ్ పుస్తక దుకాణాలలో ఈ పుస్తకాన్ని జనం హాటు కేకుల్లా ఎగరేసుకుపోయారు. ఫ్రెంచ్ అమ్మాయితో బ్రిటన్ మాజీ ప్రధాని ప్రేమ పురాణం  కాబట్టి పనిలో పనిగా ఫ్రాంకులు కూడా మూట కట్టుకోవాలని ఈ పుస్తకాన్ని ఫ్రెంచిలో భాషలో సయితం ప్రచురించారు.

పుస్తక విక్రయాలను పెంచుకునే ప్రచారంలో భాగంగా టోనీ బ్లేర్ అమెరికన్ టెలివిజన్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రిన్సెస్ డయానాను ఆకాశానికి ఎత్తేసారు. అంతటి అందగత్తె ఈ భూప్రపంచంలో మరొకరు కానరారు అని కానరాని లోకాలకు తరలిపోయిన డయానాను వేనోళ్ళ పొగిడారు.
ఇంతకీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా,  యిరవై నాలుగు (బ్రిటిష్) పౌండ్లు మీవి కాదనుకుంటే ఆ అనుమానం తీరిపోతుంది.
మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు జలగం వెంగళరావు 'నా జీవిత కధ' అనే పేరుతొ ఒక ఆత్మకధ వెలువరించారు. ఆ పుస్తకంలో కొన్ని అంశాలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావడంతో అది వివాదాస్పదం అయింది.
పీవీ నరసింహారావు గురించి  శ్రీమతి గాంధీ తనతో ఇలా చెప్పారంటూ  వెంగళరావు ఆ పుస్తకంలో ఉదాహరించిన విషయాలు దిగ్భ్రాంతి గొలిపేవిగా వున్నాయి.
"నేనింతవరకు అలాటి (పీవీ) అసమర్ధ నాయకుడ్ని చూడలేదు. కందూ భాయ్ దేశాయ్, త్రిపాఠీ, ఉమా శంకర్ దీక్షిత్ లాగే ఈయనా ఒక  సీనియర్ అన్న నమ్మకంతో ఆయన్ని(ఆంద్ర ప్రదేశ్) ముఖ్యమంత్రిని చేసాను. కానీ ఆయన  బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం నాకెంతో బాధ కలిగిస్తోందని" ఇందిరాగాంధి తనతో చెప్పుకున్నట్టు వెంగళరావు పేర్కొన్నారు.
అలాగే మర్రి చెన్నారెడ్డి గురించి వెంగళరావు వెలిబుచ్చిన కధనాలు:
"సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడానికి నాలుగు రోజులు ముందు ప్రధాని తనయుడు చెన్నారెడ్డి స్థానంలో అంజయ్యను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంజయ్ మరణ వార్త చెన్నారెడ్డిని సంతోషంలో ముంచివేసింది. సంతాపం వెలిబుచ్చడానికి బదులుగా చెన్నారెడ్డి సంబరాలు చేసుకున్నారనీ, మిఠాయిలు పంచిపెట్టారనీ, కృష్ణాజిల్లాకు చెందిన ఒక లెజిస్లేటర్ తనతో చెప్పినట్టు  వెంగళరావు తన పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే, అసలా పుస్తకం తాను తన చేతుల్తో రాయలేదనీ, ఎప్పటి జ్ఞాపకాలో  గుర్తు తెచ్చుకుని చెబుతుంటే వాటిని తన కోడలు అక్షరబద్ధం చేసారని, పుస్తకం పూర్తయిన తరువాత దాన్ని సమాచార శాఖ ఉన్నతాధికారి, అనేకమంది ముఖ్యమంత్రులవద్ద పీ.ఆర్.వొ. గా పనిచేసిన భండారు పర్వతాలరావు 'ఎడిట్' చేసారని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చారు. అయితే పుస్తకంలో కొన్ని అంశాలు కొందరు  వ్యక్తులను బాధపెట్టేవిగా  వున్నాయని, వాటిని తొలగించడం మంచిదనీ అంటూ తాను గ్రంధ ప్రచురణకు  ముందుగానే వెంగళరావు దృష్టికి తీసుకువచ్చినట్టు పర్వతాలరావు వివరణ ఇచ్చారు.  అయినా ఆయన తన సహజ శైలిలోనే,  'ఏం పర్వాలేదంటూ'  తన సలహాను  పట్టించుకోలేదని,  అంచేత ఆ పుస్తకంలో తన పేరు ఎక్కడా ప్రస్తావించవద్దని కోరినట్టు పర్వతాలరావు  చెప్పారు. అలాగే పర్వతాలరావు గారి పేరు అందులో ఎక్కడాలేదు.
ఈ కోవలోకి వచ్చేదే  మరో ఆత్మకధ మల్లెమాల పేరుతొ ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత  ఎం.ఎస్.రెడ్డి రాసిన 'ఇదీ నా కధ'. ఆ పుస్తకంలో సినిమారంగానికి చెందిన అనేకమంది ప్రముఖుల ప్రస్తావనలు వివాదాస్పదం అయ్యాయి. కొందరు సినీ ప్రముఖులను కించబరిచే వ్యాఖ్యానాలు అందులో  వున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పుస్తకం ప్రతులను విక్రేతలనుంచి వెనక్కి తెప్పించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
ఉపశృతి: జీవిత చరిత్రల నుంచి నేర్చుకునే విషయాలు వుండాలి. అంతేకాని, అమ్మకాలు పెంచుకోవడం కోసమే రాస్తే వాటిపై జనాలకు నమ్మకాలు తగ్గిపోతాయి. (21-1-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

20, అక్టోబర్ 2015, మంగళవారం

ఇదిగిదిగో అమరావతి ....(ఆహ్వానం)


రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు... వీరి వ్యవహార శైలే విభిన్నం.
మా ఇద్దరు అబ్బాయిల పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇద్దరికీ పెళ్లి పత్రికలు ఇచ్చివచ్చాను. పెద్దవాడి పెళ్ళి నాటికి  బాబుగారు ముఖ్యమంత్రి.  వై.ఎస్.ఆర్. ప్రతిపక్ష నాయకుడు. అలాగే చిత్రంగా రెండోవాడి వివాహం నాటికి వీరి పాత్రలు తారుమారయ్యాయి. అయినా వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళారు. అందుకే ఈ ఇద్దరు నాయకులంటే నాకే కాదు జర్నలిష్టు సోదరుల్లో చాలామందికి అభిమానం.  నేను దూరదర్సన్ నుంచి రిటైర్ అయిన తరువాత కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలకు పిలుపులు అందుతూనే వచ్చాయి. ఇదిగో ఇప్పుడు అమరావతి పిలుపు.



మధ్య్యాన్నం మామూలుగా నా బ్లాగు లోకంలో నేనుంటే, పుల్లారావు యాదవ్ అనే ఆయన ఫోను చేసారు. టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు మీ ఇంటికి వచ్చి అమరావతి ఆహ్వానం ఇస్తారు, ప్రస్తుతం జర్నలిష్టు కాలనీలో వున్నాం, ఇక్కడనుంచి ఎలా రావాలో చెబుతారా అని అడిగారు. అక్కడికి దగ్గరలో ఆంద్రజ్యోతి దగ్గర మా అన్నగారు రామచంద్రరావు గారు వుంటారు, అక్కడ ఇవ్వండి, శ్రమపడి ఇంత దూరం  రానక్కర లేదు అన్నాను. కానీ ఆయన, చంద్రబాబునాయుడు నాయుడు గారు మిమ్మల్ని పర్సనల్ గా కలిసి ఇవ్వాలని చెప్పారని చెప్పబోతుంటే నేనే వారించాను, పర్వాలేదు అక్కడ ఇవ్వండి, నాకు చేరుతుంది అని. మొత్తం మీద వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళారని మా అన్నయ్య ఫోనుచేసి చెప్పారు.  ఫోటో తీసి వాట్స్ ఆప్ లో పోస్ట్ చేసారు.



(ఆహ్వానం పంపించడంలో ఇంత శ్రద్ధ తీసుకున్న  చంద్రబాబు గారికి ధన్యవాదాలు.)