6, ఆగస్టు 2011, శనివారం

సోనియా తరువాత ఎవరు ? – భండారు శ్రీనివాసరావు

సోనియా తరువాత ఎవరు ? – భండారు శ్రీనివాసరావు

(06-08-2011 తేదీ సూర్య దినపత్రిక లో ప్రచురితం)


దేశంలోని మీడియా సంస్తలన్నీ ముక్కున వేలేసుకోవాల్సిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది నిన్న పార్ల మెంట్ హౌస్ లో విలేఖరులకు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘ప్రస్తుతం సోనియా ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యకు శస్త్ర చికిత్స అవసరమన్న డాక్టర్ల సలహా మేరకు సోనియా విదేశాలకు వెళ్లారు. రెండు మూడు వారాలపాటు ఆమె అక్కడే వుండవచ్చు. ఆమె లేని సమయంలో పార్టీ వ్యవహారాలను నిర్వహించేందుకు సోనియా నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, జనార్ధన్ ద్వివేదీ,అహ్మద్ పటేల్ వుంటారు” అన్నది ఆ ప్రకటన సారాంశం.

‘వైద్య సంబంధమయిన అంశాల్లో ప్రముఖుల గోప్యతకు గౌరవం ఇవ్వడం సముచితం’ అని కూడా ద్వివేదీ కోరినందువల్ల సోనియా అనారోగ్యానికి సంబంధించి వూహాగానాలకు పోవడం సబబు కాదు. కానీ, సోనియా సాధారణ వ్యక్తి కాదన్న విషయాన్ని ఈ సందర్భంలో గమనంలో వుంచుకోవాలి. ఆమె ఈ దేశాన్ని పాలిస్తున్న యూ.పీ.ఏ. అధినేత్రి. ఆ యూ.పీ.ఏ. ను శాసిస్తున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలు. వ్యక్తిగత గోప్యత ముసుగులో అంతటి ప్రాధాన్యం కలిగిన వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా నొక్కిపెట్టడం ఏ కోణంలో నుంచి చూసినా సమంజసమనిపించుకోదు.

ద్వివేదీ ప్రకటన పలు అనుమానాలకు తావిచ్చేదిగా కూడా వుంది. శస్త్ర చికిత్స విజయవంతమయిందనీ, ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్తితి సంతృప్తికరంగా వుందని చెప్పిన ద్వివేదీ ఆ వెనువెంటనే మాట మార్చి ఆమెకు ఆపరేషన్ ఇంకా జరగలేదనీ, రెండు మూడు రోజుల్లో చేసే అవకాశం వుందని పేర్కొనడం అనేక ఊహాగానాలకు ప్రాణం పోసింది.

సోనియా అనారోగ్యానికి సంబంధించి అనేక కధనాలు మీడియాలో మొదలయ్యాయి. వాటిల్లో నిజానిజాల ప్రసక్తి అటుంచి సోనియా త్వరగా కోలుకోవాలనే అందరూ ఆకాంక్షిస్తారు. అయితే సోనియా ఆరోగ్యానికి సంబంధించి అవసరమయిన దానికన్నా ఎక్కువ గోప్యతను పాటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమి సాధించదలచుకున్నదన్నదే అసలు ప్రశ్న. సోనియా పరోక్షంలో ఆమె బాధ్యతలను నెత్తిన పెట్టుకున్న నలుగురు సభ్యుల బృందం నుంచి కూడా దీనికి సరయిన సమాధానాన్ని ఆశించే పరిస్తితి వుందనుకోలేము.

గత కొద్ది రోజులుగా సోనియా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్టు కొన్ని పత్రికల్లో వార్తలు వస్తూనే వున్నాయి. కానీ అమెరికాకు వెళ్లి హడావిడిగా శస్త్ర చికిత్స చేయించవలసినంత అనారోగ్యంతో ఆమె బాధ పడడంలేదని అంతా భావిస్తూ వచ్చారు. అవసరమయితే తప్ప బహిరంగ వేదికలమీద కనిపించే వ్యక్తి కాదు కనుక ఆమె అనారోగ్యానికి సంబంధించి వార్తలు బయటపడలేదని అనుకోవచ్చు. కానీ, ఆమె అధ్యక్షురాలిగా వున్న కాంగ్రెస్ పార్టీని ఇటీవలి కాలంలో అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని మన్మోహన్ అధికారనివాసంలో వారానికి అనేక పర్యాయాలు పార్టీ కోర్ కమిటీ సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. సోనియా కూడా ఈ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నట్టు సమాచారం. తీవ్రమయిన అస్వస్తతతో బాధ పడుతున్న పక్షంలో ఈ మీటింగులకు రావడం సాధ్యం కాదు. ఒకవేళ వస్తుంటే, మిగిలిన కోర్ కమిటీ సభ్యులకు తెలియకుండా విషయాన్ని దాచడం కొన్నాళ్ళ వరకే సాధ్యం. కానీ, వాళ్ళల్లో ఎవ్వరూ సోనియా ఆరోగ్యానికి సంబంధించి ఏనాడూ పెదవి విప్పిన దాఖలా లేదు.

దీన్నిబట్టి సోనియా ఆరోగ్య పరిస్తితి గురించి ఆమె నియమించుకున్న కోటరీలోని వారికి ఎంతో కొంత సమాచారం తెలిసివుంటుందనే అనుకోవాలి. అందుకే తెలంగాణా గురించిన ప్రసక్తి వచ్చినప్పుడు ‘రెండు మూడు మాసాల వ్యవధానం’ అనే మాట ప్రస్తావించడానికి కూడా ఇదొక కారణం అయివుండాలి.

కాకపొతే, సోనియాతో తమకు అత్యంత సాన్నిహిత్యం వుందని చెప్పుకునే రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవ్వరికీ సోనియా అనారోగ్యం గురించి ముందస్తుగా తెలిసి వుంటుందనడానికి ఆధారాలు కానరావడంలేదు. గురువారం నాడు పార్టీ విప్ ను సయితం ధిక్కరించి పార్ల మెంట్ సమావేశాలకు టీ కాంగ్రెస్ సభ్యులు హాజరు కాకపోవడం, సోనియా గాంధీ అనారోగ్యం గురించి మీడియాలో వార్తలు రావడం మొదలయిన ఉత్తర క్షణం నుంచి వారి వైఖరిలో మార్పు వస్తున్న సంకేతాలు రావడం – ఈ వాదనను బలపరుస్తున్నాయి. సోనియా అనారోగ్యం నేపధ్యంలో పార్టీని మరింత ఇబ్బంది పెట్టకుండా సోమవారం నుంచి సభకు హాజరు కావాలని వారు నిర్ణయించుకున్నట్టు వెలువడ్డ సమాచారాన్ని బట్టి కూడా వారికి ఏమీ తెలియదని అనుకోవాల్సివస్తోంది.

సోనియా అనారోగ్యం విషయం బయటకు పొక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని అనుకోవడానికి మరికొన్ని ఆధారాలు వున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లోకసభకు ఎన్నికయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడు – ఆ సమయంలో సభలో సోనియా గాంధీ కానీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కానీ లేకపోవడం మీడియా దృష్టిని దాటిపోలేదు. కానీ, రాజకీయ వైరుధ్యాల కారణంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో వారిరిరువురూ సభలో లేకుండా జాగ్రత్త పడ్డారని అనుకున్నారు కానీ, అప్పటికే సోనియా గాంధీ అమెరికా చేరుకున్న సంగతిని ఎవరూ పసికట్టలేకపోయారు. ప్రతి చిన్న విషయానికి బ్రేకింగ్ న్యూస్ లతో ఆదరగొడుతూ, తామే ముందు అని వూదరగొట్టే టీవీ చానళ్ళు సోనియా అమెరికా వెళ్ళిన సంగతి పట్టుకోలేకపోవడం విచిత్రం అనిపిస్తుంది. విదేశానికి వెళ్ళబోయే ముందు సోనియా ఏర్పాటుచేసినట్టు చెబుతున్న ఈ కమిటీలో పార్టీలో కాకలుదీరిన సీనియర్లను కాదని మరో నలుగురిని ఎంపిక చేసిన తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఈ నలుగురిలో రాహుల్ గాంధీ పేరు జాబితాలో ముందు వుండడం మరికొన్ని వూహాగానాలకు వూతమిచ్చేదిగా వుంది. తన పరోక్షంలో పార్టీ వ్యవహారాలను చూడడానికి నియమించిన కమిటీలో ప్రధమ సభ్యుడు, ప్రధాన సభ్యుడు అయిన రాహుల్ గాంధీ తల్లి సోనియా వెంట అమెరికా వెళ్ళిన బృందంలోనే వున్నారు. పైగా, పార్టీ ప్రెసిడెంట్ తరువాత కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ స్తానం ఎవ్వరిది అంటే అనేక దశాబ్దాలనుంచి తటాలున గుర్తువచ్చే ప్రణబ్ ముఖర్జీకి ఇందులో స్తానం కల్పించకపోవడం సరికొత్త వూహాగానాలకు వూపిరిపోస్తోంది. ఈ కమిటీ కేవలం పార్టీ వ్యవహారాలను చూసేందుకు నియమించింది కాబట్టి మంత్రులకు స్తానం కల్పించలేదని అనుకుందామంటే ఇందులో రాహుల్ తరువాత పేరు మరో కేంద్ర మంత్రి ఆంటోనీదే కావడం అంతుబట్టని విషయం.

ప్రణబ్ అంత స్తాయి కాకపోయినా ఆంటోనీ కూడా కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడే. సచ్చీలుడు, నిరాడంబరుడు అవినీతి మరకలు అంటని రాజకీయ నాయకుడని పేరు. యువకుడయిన రాహుల్ కు సరయిన మార్గ నిర్దేశనం చేయడానికి ఆంటోనీ వంటి నాయకుడు అవసరమని సోనియా భావించి వుండవచ్చు.

సోనియా తరువాత పార్టీలో ఎవరి స్తానం ఏమిటి అన్న ప్రశ్నకు ఆమె పరోక్షంగా ఇచ్చిన సమాధానం ఈ కమిటీ నియామకం అనుకోవాలా ? అలా అనుకుంటే పార్టీ పగ్గాలు ఎవరి చేతిలోకి రాబోతున్నాయన్నది అర్ధం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. కాకపొతే, అప్పుడు కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడున్న పద్ధతిలో నడుస్తాయని అనుకోవడానికి మాత్రం వీలుండదు.

(05-08-2011)

5, ఆగస్టు 2011, శుక్రవారం

తీరికలేని మనుషులు - భండారు శ్రీనివాసరావు

తీరికలేని మనుషులు - భండారు శ్రీనివాసరావు


మొన్న రాత్రి మహా టీవీలో ఏదో చర్చకు పిలిస్తే వెళ్లాను. తెలకపల్లి రవి గారు, ఘంటా చక్రపాణి గారు కూడా వచ్చారు. ప్రోగ్రాం మధ్యలో అనివార్యంగా వచ్చే ‘విరామ సమయం’లో రవి – మాటల మధ్య ప్రసిద్ధ రష్యన్ రచయిత చెఖోవ్ రాసిన ఓ చిన్న కధ చెప్పారు.

‘గుర్రబ్బండి నడుపుతూ పొట్టపోసుకునే ఒక వృద్ధుడు ఈ కధలోని ప్రధాన పాత్ర. ఆ రోజు ఉదయమే అతడి కొడుకు ఆకస్మికంగా మరణిస్తాడు. అంత దుఃఖంలో కూడా బండి నడపక పోతే పొట్ట గడవని స్తితి అతనిది. తన బండి ఎక్కినవాళ్లకు కుమారుడి మరణ వార్త చెప్పాలని నోరు తెరిచినప్పుడల్లా వాళ్లు అడ్డంపడుతుంటారు. ఎందుకంటె ఈ పాడు ప్రపంచంలో ఎవడి గోలవాడిది. తన కష్ట సుఖాలు పక్కవాడితో పంచుకోవాలనే ఆత్రుత తప్ప ఎదుటివాడి బాధ ఏమిటో ఎవరికీ పట్టదు. చివరికి, ఎవరికీ తన కడుపులోని దుఖం చెప్పుకోకుండానే ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తాడు. కొష్టంలో గుర్రాన్ని కట్టివేస్తూ పిల్లవాడి చావు కబురు దాని చెవిలో వేసి కడుపులో భారం దించుకుంటాడు.’

చెఖోవ్ ఈ కధ రాసి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ మనుషుల మనస్తత్వాల్లో ఎలాంటి మార్పులేదు.

టీవీల్లో జరిగే చర్చలే దీనికి మంచి ఉదాహరణ. ఎవరికి వారు తమ వాదం వినిపించాలని ప్రయత్నిస్తారే తప్ప ఇతరులమాట వినిపించుకోరు. అందరికీ అన్నీ తెలియాలన్న రూలేమీ లేదు. తెలియంది తెలుసుకుంటే పోయేదీ లేదు. అనవసరమయిన ఈ అభిజాత్యం అవసరమా ? ఎవరికివారే తెలుసుకోవాలి.(05-08-2011)

3, ఆగస్టు 2011, బుధవారం

బాబోయ్! బ్యూరోక్రసీ!! - భండారు శ్రీనివాసరావు

బాబోయ్! బ్యూరోక్రసీ!! - భండారు శ్రీనివాసరావు


ఏమి సేతురా లింగా!


ఆ వార్త దావానలంలా నగరంలో ఒక్కసారిగా గుప్పుమంది.
ఒకరు కాదు, ఇద్దరు కాదు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ నిర్మాత, ఒక డైరక్టర్, ఓ రచయిత – వూరిమధ్యవున్న ఓ హోటల్ గదిలో పురుగులమందు తాగి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి వెళ్ళిన పోలీసులకు ఆ గదిలో ఓ లేఖ దొరికింది.

అందులో ఇలా వుంది.

"అయ్యా!

విషయం : మహాభారతం మీద మీరు నిర్మించాలనుకున్న సినిమా.
రిఫరెన్స్ : ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం కోసం మీరు పెట్టుకున్న ధరఖాస్తు.

"మీరు పంపిన పై ధరఖాస్తు కింది సంతకందారు పరిశీలనకై వచ్చింది. మహాభారతం అనే సినిమా తీయడానికి ప్రభుత్వ సాయం కోసం మీరు పెట్టుకున్న  ధరఖాస్తును ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. మహాభారతం సబ్జెక్ట్ లోని కొన్ని అంశాలు మరీ సున్నితమైనవిగా భావించి ప్రభుత్వం ఈ ధరఖాస్తును పరిశీలించేందుకు ఒక అత్యున్నత స్తాయి సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఇందుకోసం మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, శ్రామిక హక్కుల కమిషన్ తో పాటు ఈ అంశంతో సంబంధం వున్న వివిధ ప్రభుత్వ శాఖల సూచనలను కూడా సేకరించడం జరిగింది. మీరు దాఖలు చేసిన మహా భారతం స్క్రిప్ట్ ను నిశితంగా పరిశీలించిన తరువాత ఆయా శాఖలు పంపిన సూచనలు సిఫారసులను అభ్యంతరాలతో సహా ఈ కింది విధంగా క్రోడీకరించడం జరిగింది.

1. మీరు పంపిన స్క్రిప్ట్ ప్రకారం మహాభారతం కధలో కౌరవులు అనబడేవారు వంద మంది, వారితోపాటు మరో అయిదుగురు పాండవులు వుంటారని అర్ధం చేసుకోవడం జరిగింది. ఈ సంఖ్యల పట్ల కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆ శాఖ జారీ చేసిన మార్గదర్శిక సూత్రాల ప్రకారం ఒక కుటుంబంలో ఇంత మంది సంతానం వుండడం పూర్తిగా అసంగతం. పైగా అలాటి విషయాలను సినిమా మాధ్యమం ద్వారా ప్రచారం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. చిన్న కుటుంబం ఆవశ్యకతను గురించి ప్రచారం చేయడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న దృష్ట్యా - ఒకే ఒక్క కుటుంబంలో శత సంతానాన్ని చూపించే మహాభారతం వంటి సినిమాలకు సాయం చేయరాదని ఆ మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది. ఈ చిత్రంలో కౌరవ పాండవుల సంఖ్యను మూడు దాటకుండా చూసుకోగలిగిన పక్షంలో ఆర్ధిక సాయం చేసే విషయాన్ని పరిశీలించవచ్చని ఆ శాఖ సిఫారసు చేసింది. మీరు స్క్రిప్ట్ ని మార్చుకునే ఉద్దేశ్యం ఉన్నట్టయితే ఈ అంశాన్ని గమనంలో వుంచుకోవలసిందిగా కోరడమయినది.

2. ప్రస్తుత ప్రజాస్వామ్య యుగంలో రాజులు, చక్రవర్తులను సినిమాల్లో చూపించడం భావ్యం కాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. కాకపొతే, కౌరవులను లోక సభ సభ్యులుగాను, పాండవులను రాజ్యసభ సభ్యులుగాను చూపిస్తూ స్క్రిప్ట్ లో మార్పులు చేసిన పక్షంలో దరఖాస్తును పరిశీలించవచ్చని ఆ శాఖ సూచించింది. కధ చివరిలో కౌరవులను పాండవు లు జయించినట్టు చూపడం పట్ల కూడా ఈ శాఖ అభ్యంతరం తెలిపింది. లోక సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఒకరికొకరు తీసిపోరు అన్న పద్ధతిలో ముగింపు వుండాలని ఈ శాఖ స్పష్టం చేసింది.
౩. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ కధలోని మరో ప్రధాన అంశంపై అభ్యంతరం తెలిపింది. మీరు పంపిన మహాభారతం స్ర్కిప్ట్ ప్రకారం కౌరవులు క్లోనింగ్ విధానం ప్రకారం ఒక కుండలో జన్మించినట్టు వుంది. ప్రస్తుత చట్టాల ప్రకారం భారత దేశంలో క్లోనింగ్ నిషేధం. ఈ దృష్ట్యా , కౌరవులు సాధారణ పద్ధతిలో జన్మించినట్టు స్క్రిప్ట్ ను మార్చాల్సి వుంటుంది.

4. జాతీయ మహిళా హక్కుల కమిషన్ అభ్యంతరం మరో రకంగా వుంది. అయిదుగురు పాండవులకు కలిపి ఒకే భార్య వున్నట్టుగా స్క్రిప్ట్ లో చూపించారు. మహిళలను కించబరిచే విధంగా రూపొందించిన ఈ కధను ఎట్టి పరిస్తితిలోను ప్రస్తుతం వున్న రీతిలో అనుమతించడం తగదని స్పష్టం చేసింది.

5. ఈ చిత్రంలో దృతరాష్ట్రుడు అనే పాత్రను అంధుడిగా చూపించారు. దానికితోడు ఈ దృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఇతర పాత్రలు అనేక దృశ్యాలలో అంధుడు, అంధుడు అని నిందాపూర్వకంగా మాట్లాడినట్టు గా స్క్రిప్ట్ లో వుంది. ఈ దృశ్యాలను తొలగించాలని వికలాంగుల మంత్రిత్వశాఖ గట్టిగా సిఫారసు చేసింది.

6. ఈ చిత్ర కధ ప్రకారం ఓఘట్టంలో ద్రౌపది అనే స్త్రీ పాత్రను నిండు సభలో వస్త్రాపహరణం చేసినట్టు వుంది. ఇది యావత్ స్త్రీ జాతికే అవమానకరమని , ఈ సన్నివేశాన్ని స్క్రిప్ట్ లో నుంచి తొలగించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ తన సిఫారసులో పేర్కొన్నది.

పోతే, ఇలాటి సన్నివేశాలను సినిమాల్లో చూపించడంవల్ల మహిళా సంఘాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం వుందని, దరిమిలా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావచ్చుననీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ సన్నివేశాలను తొలగించకుండా స్క్రిప్ట్ ని ఆమోదించడం తమకు సమ్మతం కాదని పేర్కొన్నది.

7. కౌరవ పాండవులను జూదరులుగా చూపించారని, ప్రజల్లో జూద ప్రవృత్తిని ప్రోత్సహించే విధంగా వున్న సన్నివేశాలను తొలగించాలని కూడా హోం శాఖ సూచించింది. అంతగా కధకు అవసరం అనుకుంటే కౌరవ పాండవులు గుర్రపు పందేల్లో పోటీ పడినట్టు చూపవచ్చని ఆ శాఖ సలహా ఇచ్చింది. గుర్రపు పందేలు జూదం కిందికి రావని సుప్రీం కోర్ట్ గతంలో పేర్కొన్న విషయాన్ని హోం శాఖ తన సిఫార్సుకు జత చేసింది.

8. విరాటరాజు కొలువులో పాండవులు ప్రచ్చన్న వేషాలలో ఎలాటి జీత భత్యాలు లేకుండా పని చేసినట్టు చూపించారు. ఇది వెట్టిచాకిరీ కిందకు వస్తుందని, 1976 వెట్టిచాకిరి నిర్మూలన చట్టంలో పేర్కొన్న అధికరణాలకు ఇది విరుద్ధమని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. అందువల్ల విరాట పర్వాన్ని మహాభారతం స్క్రిప్ట్ నుంచి తొలగించాలని కోరింది.

9. కౌరవ పాండవ యుద్ధంలో అభిమన్యుడనే పదహారేళ్ళ కుర్రవాడు యుద్ధంలో పాల్గొన్నట్టు చూపారు. అంత చిన్నకుర్రవాడు యుద్ధం చేసినట్టు చూపించడం 1986 బాల కార్మిక నిరోధక చట్టం నిబంధనలకు వ్యతిరేకమని జాతీయ లేబర్ కమిషన్ అభ్యంతరం తెలిపింది. యుద్ధంలో పాల్గొన్న అభిమన్యుడికి పరిహారం చెల్లించినట్టు స్క్రిప్ట్ లో ఎక్కడా పేర్కొనక పోవడం – 1948 కనీస వేతన చట్టం లోని నిబంధనలకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. అభిమన్యుడి పాత్రకు సంబంధించి స్క్రిప్ట్ లో తగు మార్పులు చేయాలని సిఫారసు చేసింది.

10. మహాభారతం స్క్రిప్ట్ లో శ్రీకృష్ణుడు అనే పాత్ర వుంది. నెమలి ఈకలను తలపై ధరిస్తూ ఈ పాత్ర కనిపిస్తుంది. నెమలి జాతీయ పక్షి కావున ఆ పక్షి ఈకలతో కృష్ణుడిని చూపించడం 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టానికి విరుద్ధం. అందువల్ల కృష్ణ పాత్ర ఆహార్యాన్ని ఈ సిఫార్సుకు అనుగుణంగా మార్చుకోవాల్సిందిగా కోరడమయినది.

11. యుద్ధసన్నివేశాలలో ఏనుగులను, గుర్రాలను వాడినట్టు స్క్రిప్ట్ లో వుంది. 1890 జంతుహింస నిరోధక చట్టం, 1960 జంతుహింస నిరోధక(సవరణ) చట్టం నిబంధనల ప్రకారం యుద్ధ సన్నివేశాలకు సంబంధించి తగు మార్పులు చేసుకోవాల్సిందిగా కోరడమయినది. జంతుహింస విషయమై శ్రీమతి మేనకా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో – మహాభారత సంగ్రామ దృశ్యాలలో వాటిని చూపించడం మరిన్ని ఆందోళనలకు దారితీసే అవకాశం వుంది.

12. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పొదుపుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన మార్గదర్శిక సూత్రాలను మహాభారతం స్క్రిప్ట్ తయారీలో పాటించినట్టు లేదు. అన్నివేలమంది సైనికులు అనవసరమని ఆ శాఖ అభిప్రాయపడింది. యుద్ధంలో పాల్గొన్న సైనికులు 1959 ఆయుధాల చట్టం అలాగే 1878 భారతీయ ఆయుధ చట్టం కింద లైసెన్సులు పొందినట్టు రుజువులు చూపించడం అవసరమని ఆంతరంగిక భద్రతా శాఖ పేర్కొన్నది.

"అందువల్ల మీరు పంపిన మహాభారతం స్క్రిప్ట్ కు పైన సూచించిన విధంగా అవసరమయిన మార్పులను చేసిన పక్షంలో మీ సినిమా నిర్మాణానికి మీరు కోరిన ఆర్ధిక సాయం మంజూరు చేసే విషయాన్ని పరిశీలించడం జరుగుతుందని ఇందుమూలంగా తెలియచేయడం జరుగుతోంది. తగిన మార్పులు చేర్పులతో కూడిన మహాభారతం సినిమా స్క్రిప్ట్ ను తిరిగి పంపవలసిందిగా కింది సంతకందారు మిమ్మల్ని కోరుతున్నారు.

కావున తెలియపరచడమయినది."

(సంతకం)

అండర్ సెక్రెటరీ, భారత ప్రభుత్వం

(నెట్లో చక్కర్లు కొడుతున్న ఆంగ్ల రూపానికి స్వేచ్చానువాదం )

-03-08-2011

2, ఆగస్టు 2011, మంగళవారం

నమ్మలేని నిజాలు - భండారు శ్రీనివాసరావు


నమ్మలేని నిజాలు - భండారు శ్రీనివాసరావు

ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు, కరీంనగరులో కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు దరఖాస్తు చేసుకొన్నారు.

కవిసమ్రాట్

 ఇంటర్వ్యూ రోజున విశ్వవిద్యాలయంలో నాటి  తెలుగు శాఖాధిపతి -  అభ్యర్థి అయిన  విశ్వనాథ వారిపై  ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు.

తెలుగు శాఖాధిపతి : నీ పేరు?

విశ్వనాథ వారు : ( "నన్నే గుర్తించ లేదా? పైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని ... ) విశ్వనాథ సత్యనారాయణ.

తెలుగు శాఖాధిపతి : ఏమేం కావ్యాలు వ్రాసావు?

విశ్వనాథ వారు : ( పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ... ) “నేనేం కావ్యాలు వ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురా? నీలాంటి వాడు ఉన్నంత కాలం ఈ విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను” ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)

తరువాత విశ్వనాథ వారు ఏ విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం తెలుగువారి  దురదృష్టం.

చాలా ఏళ్ళ తరువాత ఈ విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.

కొసమెరుపు :

విశ్వనాథ వారు ఈ విషయాన్ని బయటపెట్టాక, రిటైరైన ఆ తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని " ఇది నిజమేనా? " అని అడిగాడు. దానికి ఆ సాహితీమూర్తి సమాధానం –

“ఆయన మహాకవి అని నాకు తెలుసు. కాని ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడా అభ్యర్థిని ప్రశ్నిస్తాడని ఆయనకు తెలియదు. ఆయనకు ఆ కనీస జ్ఞానం కొరవడడం శోచనీయం."

ఆనాటి ఆ తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.

బిరుదురాజు రామరాజు

సేకరణ: ఆచార్య ఫణీంద్ర

1, ఆగస్టు 2011, సోమవారం

జీవనస్రవంతి – -భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి – -భండారు శ్రీనివాసరావు

తపస్సు చేయగా చేయగా భగవంతుడు ప్రత్యక్షమై రెండు వరాలు కోరుకోమన్నాడు.
భక్తుడు భక్తి పులకాంకితుడై – ప్రపంచంలో అన్నింటికన్నా ఉత్తమమయిన ఒక వైన్ బాటిల్ నూ, సమస్త విశ్వంలోనే సర్వోత్తమంయిన మహిళామణినీ అనుగ్రహించమన్నాడు. ఆ దేవ దేవుడు ప్రసాదించి అదృశ్యమయ్యాడు.
భక్తుడు కళ్ళు తెరిచి చూస్తే, ఎదురుగా ఒక వైన్ బాటిల్, ఆ పక్కనే మాతృత్వ మధురిమకూ సేవాతత్పరతకూ ప్రతీక అయిన మదర్ తెరిస్సా కనిపించారు.
నీతి: కోరుకునే కోరిక ఏదయినా అది నిర్దిష్టంగా వుండాలి.

నాలుగు చీమలు అడవి దారెంట వెడుతుంటే ఓ ఏనుగు ఎదురు పడింది.
ఒక చీమ మిగిలిన వాటితో చెప్పింది నలుగురం కలసి ఏనుగుని చంపేద్దామని.
రెండో చీమ ‘అలాకాదు. ఏనుగు కాలు ఒకటి విరిచేసి వొదిలేద్దాం’ అంది.
మూడోది ‘మన దారికి అడ్డొచ్చిన ఈ ఏనుగును ఒడిసిపట్టుకుని దూరంగా విసిరేద్దాం’ అంది భుజాలు ఎగరేస్తూ.

నాలుగో చీమ వాటిని వారిస్తూ ఉదారంగా చెప్పింది.

‘అదేమో వొంటరిదాయే. మనం చూస్తే నలుగురం వున్నాం . పాపం ఆ ఏనుగుని ఇవ్వాల్టికి వొదిలేస్తే పోలా.’

మనుషులు చేసే తెలివితక్కువ పనులను కూడా మనసారా అభినందించాల్సిన సందర్భం ఒకటి వుంది. - అది పెళ్లి .


గర్ల్ ఫ్రెండ్ లేకపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్టే .
వుంటే మాత్రం జీవితంలో మిగిలినవి అన్నీ పోగొట్టుకున్నట్టే.

చీకట్లు చుట్టుముట్టినప్పుడు వెలుగు ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధించండి. అప్పటికీ చీకటి తొలగకపోతే వెంటనే వెళ్లి - ఎలెక్ట్రిసిటీ బిల్ కట్టండి. 

(01-08-2011)



31, జులై 2011, ఆదివారం

మగవారికి మాత్రమే - భండారు శ్రీనివాసరావు

మగవారికి మాత్రమే - భండారు శ్రీనివాసరావు

(తమలపాకుతో నీవిట్లంటే తలుపుచెక్కతో నేనిట్లంటా)




(కొందరు ఆడవాళ్ళను గురించి మరికొందరు మగవాళ్లు సరదాగా చెప్పిన మాటలు ఇవి. వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు అందరు ఆడవాళ్ళకు వర్తించాలని రూలేమీ లేదు)

“పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు గా వుంటారు. కలసివున్నట్టుగా కనిపిస్తారు కానీ ఎన్నటికీ కలవలేరు.”- అల్ గోరె
“మగవాళ్ళు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మంచి భార్య దొరికిందా సుఖపడతారు. లేకపోతే నష్టం లేదు. పెద్ద వేదాంతి గా మారే అవకాశాలు పెరుగుతాయి.”- సోక్రటీస్

“తన భర్త గొప్పగొప్ప పనులు చేసి విజయాలు సాధించాలని ప్రతి భార్యా ఉత్సాహపడుతుంది. అతడిని ఆవైపుగా ప్రోత్సహిస్తుంది. కానీ, అంతవరకే. మొగుడు వాటిని సాధించడం మాత్రం ఇష్టపడదు.” - మైక్ టైసన్

“బహుశా ఎవ్వరూ జవాబు చెప్పలేని ప్రశ్న ఏదయినా వుందా అని నన్నడిగితే నా మెదడుకు ఒక్కటే తడుతోంది- ఆడది కోరుకునేది ఏమిటి ? అన్నదే ఆ ప్రశ్న.” – జార్జ్ క్లూనీ

“నేను మా ఆవిడతో మాట్లాడింది కేవలం మూడంటే మూడే ముక్కలు. ఆమె బదులుగా ఏకంగా ఒక దండకమే చదివింది.” – బిల్ క్లింటన్

“మీరూ మీ ఆవిడా ఇన్నేళ్ళుగా కలసి కలతలు లేని కాపురం చేస్తున్నారు. ఏమిటి ఇందులో రహస్యం అని నా మిత్రులు అడుగుతుంటారు.ఇందులో పెద్దగా దాచుకోవాల్సింది ఏమీ లేదు. ఎన్ని పని వొత్తిడులు వున్నా వీలు చేసుకుని వారానికి రెండు సార్లు ఏదయినా రెస్టారెంటుకు వెళ్లి మంచి సంగీతం వింటూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తుంటాము. కాకపొతే ఆవిడ ప్రతి మంగళవారం శుక్రవారం వెడుతుంది. నేను మాత్రం శని,ఆదివారాల్లో వెడుతుంటాను.” – జార్జ్ డబ్ల్యు. బుష్

“ఉగ్రవాదం అన్నా ఉగ్రవాదులన్నా నాకు భయమనిపించదు. నేను పెళ్లి చేసుకుని రెండేళ్ళయింది.”- -రూడీ గిలానీ

“ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్నమాటేకాని నిజానికి సుఖపడిందేమీ లేదు. మొదటి భార్య నన్ను వొదిలేసింది. రెండో ఆవిడ ఆ పని చెయ్యకపోగా ముగ్గురు పిల్లలకు తండ్రిని చేసింది.” – డొనాల్డ్ ట్రంప్

“కాపురం పది కాలాలపాటు సజావుగా సాగాలంటే భర్తలకు నేను చెప్పే సలహాలు రెండే రెండు.
ఒకటి. మీరు చెప్పేది రైట్ కాదని తెలిసినప్పుడు నిజాయితీగా దాన్ని భార్యముందు వొప్పుకోండి. రెండు. మీరే రైట్ అనుకున్నప్పుడు దాన్ని మీ ఆవిడతో చెప్పకుండా నోరుమూసుకోండి.” - షాక్విల్ ఓ’ నీల్

“భార్య పుట్టినరోజు మరచిపోకుండా గట్టిగా గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఒక మార్గం వుంది. ఓ ఏడాది దాన్ని గురించి మరచిపోయి చూడండి. ఆ తర్వాత గుర్తుంచుకోవడం ఎలాగో ఆవిడే నేర్పుతుంది.” - కోబె బ్రియాంట్
“పెళ్ళికి ముందు ఏం చేసానో తెలుసా ? జీవితంలో ఏవేం కావాలనుకున్నానో అన్నీ చేసికూర్చున్నాను.”.- డేవిడ్ హాసెల్ హాఫ్

“నేనూ మా ఆవిడా ఇరవై ఏళ్ళపాటు హాయిగా, నిశ్చింతగా వున్నాము. ఆ తర్వాతే ఇద్దరం కలుసుకోవడం, పెళ్ళిచేసుకోవడం జరిగింది.”- అలెక్ బాల్డ్విన్

“మంచి భార్యకో మంచి లక్షణం వుంటుంది. తప్పు తనదైనప్పుడు భర్తను ఉదారంగా క్షమిస్తుంది.”-బరాక్ ఒబామా

“వివాహం అనేది ఒక యుద్ధం లాటిది. కాకపొతే ఈ యుద్ధరంగంలో శత్రువులిద్దరూ కలసి ఒకే చోట నిద్రిస్తారు.” – టమ్మీ లీ

ఒకడు చెప్పాడు.” నా భార్య దేవత”
“అంత అదృష్టం అందరికీ వుంటుందా. మా ఆవిడ బతికే వుంది.” – జిమ్మీ కిమ్మెల్

“లేడీస్ ఫస్ట్ అంటారు ఎందుకని ?”


“దేవుడు కూడా ఆ మాటనే నమ్ముకుని ఆడవాళ్లనే ముందు లోకంలోకి పంపాడు. వాళ్లు మొత్తం ప్రపంచాన్ని ఒక మెస్ చేసికూర్చుంటారని ఆయనకూ తెలియదు” – డేవిడ్ లెటర్ మాన్

“ముందు ఎంగేజ్ మెంట్ రింగ్. తరువాత మ్యారేజ్ రింగ్. ఆ తరువాత ...”
“ఇంకేం రింగ్. మిగిలేది ఒక్కటే. సఫరింగ్” - జే లెనో

(31-07-2011)

30, జులై 2011, శనివారం

అవినీతి వ్యతిరేక పోరాటంలో రాజకీయ కోణాలు – భండారు శ్రీనివాసరావు

అవినీతి వ్యతిరేక పోరాటంలో రాజకీయ కోణాలు – భండారు శ్రీనివాసరావు

(30-07-2011 ‘సూర్య’ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

ఆగస్టు ఒకటినుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభ కానున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ సమావేశాలు ఎంత సజావుగా సాగగలవన్న దానిపై ఉజ్జాయింపుగా ఒక అంచనాకు రావడం కష్టమేమీకాదు. అయితే, ఈ సమావేశాల పుణ్యమా అని - లోక్ పాల్ ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం, కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు- అనే రెండు కీలక అంశాలపట్ల రెండు ప్రధాన రాజకీయ పార్టీలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చింది.

రాజకీయ అవినీతికి సంబంధించిన పలు వార్తలు వివిధ కోణాలలో వెలువడుతున్న నేపధ్యంలో కేంద్ర క్యాబినెట్ గత గురువారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సమావేశమై లోక్ పాల్ ముసాయిదా బిల్లును ఆమోదించింది. స్పెక్ట్రం కుంభకోణం తాలూకు కారుమేఘాలు వర్షాకాల సమావేశాలను కబళించే వాతావరణం ప్రస్పుటంగా కానవస్తున్న దృష్ట్యా, లోక్ పాల్ బిల్లుకు ఏదో ఒకవిధమయిన స్వరూపం ఇవ్వక తప్పని పరిస్తితిని- ప్రతిష్ట మసకబార్చుకున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎదుర్కుంటోంది. అందుకే కేంద్ర మంత్రివర్గం, లోక్ పాల్ బిల్లు వ్యవహారాన్ని ప్రాధాన్యతా క్రమంలో ముందుకు తీసుకురావాల్సివచ్చింది. అయినా సరే, ఈ బిల్లుకు సంబంధించి పౌరసమాజ ప్రతినిధులు చేసిన ప్రధానమయిన సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టి తను అనుకున్న పద్ధతిలోనే లోక్ పాల్ బిల్లుకు తుది రూపం ఇచ్చింది. ఈ బిల్లు పరిధి నుంచి ప్రధానమంత్రినీ, న్యాయ వ్యవస్థను మినహాయించి లోక్ పాల్ వ్యవస్థకు వుండాల్సిన కోరలు తొలగించారు. ప్రధాని పదవిని కూడా బిల్లు పరిధిలోకి తీసుకురావాలని మన్మోహన్ సింగ్ మొన్నటి క్యాబినెట్ సమావేశంలో పట్టుబట్టినప్పటికీ మంత్రివర్గంలోని ఇతర సభ్యులు అందుకు ససేమిరా అంగీకరించలేదన్న స్క్రోలింగులు ఈ వార్తతో పాటే టీవీ తెరలపై దర్శనమివ్వడం విశేషం. ముసాయిదా బిల్లు తనకు అసంతృప్తి కలిగించిందనీ, మళ్ళీ ఆగస్టు 16 నుంచి దీక్ష ప్రారంభిస్తాననీ అన్నాహజారే వ్యాఖ్యానించడాన్నిబట్టి చూస్తే ఇది పార్లమెంటులో బతికి బట్టగట్టి చట్టరూపం తీసుకుంటుందన్న ఆశలు నీరుగారిపోతున్నాయి.

యూ.పీ.యే. సర్కారుపై వస్తున్న అవినీతి ఆరోపణలు, వెలుగుచూస్తున్న కుంభకోణాలపై ప్రభుత్వ పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షం బీ జే పీ వ్యూహరచన చేస్తూ వుండడంతో లోక్ పాల్ బిల్లును పార్ల మెంటులో ప్రవేశ పెట్టి అవినీతి నిర్మూలనలో తనకూ చిత్తశుద్ధి వుందని నిరూపించుకోవడం కోసమే ఈ ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం ఆమోదించి వుంటుంది.

పోతే, బీ.జే.పీ. పరిస్తితి మరింత విడ్డూరం.

స్పెక్ట్రం కుంభకోణం దర్యాప్తులోను, తదుపరి విచారణ లోను వెల్లడవుతున్నసంచలనాత్మక సమాచారాన్ని పదునయిన అస్త్ర శస్త్రాలుగా సమకూర్చుకుని పార్ల మెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేసి దానిని ప్రధమ ముద్దాయిగా నిలబెట్టి రాజకీయ లభ్దిపొందాలని పధకాలు సిద్ధం చేసుకుంటున్న ఆ పార్టీ అధిష్టానానికి కర్నాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం తెచ్చిపెట్టిన తలనొప్పి అంతా ఇంతా కాదు. ఏ అవినీతిపై గళం విప్పి, కదను తొక్కి పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ ను ఓ పట్టు పట్టాలని అనుకున్నదో అదే అవినీతి భాగోతం కర్నాటక లోకాయుక్త రూపంలో బీ.జే.పీ. గొంతులో పచ్చి వెలక్కాయగా మారింది. దానితో, ఇష్టం వున్నా లేకున్నా యడ్యూరప్పను ముఖ్య మంత్రి పదవినుంచి తొలగించాల్సిన అనివార్య పరిస్తితి ఆ పార్టీకి ఎదురయింది. గతంలో, ఈ మాదిరి రాజకీయ సంక్షోభాలు, పదవీ గండాలు యడ్యూరప్పకు కొత్తేమీ కాదు. 2008 మార్చి మాసంలో కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి, రాజకీయ పరమపద సోపాన పఠంలో యడ్యూరప్ప పలు పర్యాయాలు పెద్దపాము నోటబడి అట్టడుగుగుకు దిగజారే ప్రమాదం అనేకమార్లు ఆయనకు ఎదురయింది. అయినా తప్పించుకుని పీఠానికి అంటిపెట్టుకునే వుండగలిగారు. కానీ, ఈసారి పరిస్తితి పూర్తిగా మారిపోయి ఆయన మాజీ సీ యెం కాక తప్పని పరిస్తితి ఏర్పడింది. వర్షాకాల సమావేశాల్లో బీ.జే.పీ. అనుసరించదలచిన వ్యూహమే ఇప్పడు యడ్యూరప్పకు అడ్డుగోడగా తయారయింది. పార్ల మెంటులో కాంగ్రెస్ పార్టీని కడిగి గాలించాలంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పను వొదిలించుకోక తప్పదు. ఆ క్రమంలోనే బీ.జే.పీ. అధిష్టానం ముఖ్యమంత్రి మార్పుకు పచ్చ జెండా వూపాల్సివచ్చింది.

ఇక, కేంద్రంలో కాంగ్రెస్ పరిస్తితి నానాటికి తీసికట్టు అన్న సామెత చందంగా తయారవుతోంది. యూ.పీ.ఏ. ప్రభుత్వం మొదటి దఫా పదవీకాలం అయిదేళ్ళలో సంపాదించుకున్న ఘనకీర్తి యావత్తూ రెండో మారు అధికారంలోకి వచ్చిన అచిర కాలంలోనే ఆవిరయిపోయింది. ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిగత నిజాయితీ, నిస్వార్ధ వ్యక్తిత్వం సయితం యూ.పీ.ఏ. సర్కారుపై వెల్లువెత్తిన కుంభకోణాల మాటున మసకబారిపోయాయి. ఆయన మంత్రివర్గంలో కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖను నిర్వహించిన రాజా స్పెక్ట్రం కుంభకోణం విచారణ సందర్భంగా వెల్లడించిన విషయాలు మన్మోహన్ సింగ్ గురించి ప్రజలు వేరే విధంగా ఆలోచించే పరిస్తితిని కల్పించాయి. మరో మూడేళ్లలోపు రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పీఠం పై కూర్చోబెట్టాలనే లక్ష్యసాధన దిశగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ అధినాయకత్వం- తమది పరిశుద్ధ ప్రభుత్వమని నిరూపించుకునే క్రమంలో తన భాగస్వామ్య పక్షం డీ.ఏం.కే. నాయకులనే అవినీతి కేసుల్లో ఇరికించి జైలుకు పంపి ప్రజలనుంచి మంచి మార్కులు రాబట్టాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు కోర్టు సమక్షంలో రాజా చేస్తున్న తీవ్రమయిన ఆరోపణలు సాధారణ రాజకీయ ఎత్తుగడల్లో భాగమని జనం నమ్మేలా చేయడానికి మన్మోహన్ సింగ్ ఎంతో శ్రమించాల్సివుంటుంది. డ్రగ్స్ వాడకం వంటి కేసుల్లో పట్టుబడిన వ్యక్తులు వెల్లడించే పేర్లు ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ఉబలాటపడే అధికార యంత్రాంగానికి సదా ఉపయోగపడే ‘చట్టం’ – ప్రధాని మన్మోహన్ సింగ్, ఇప్పటి హోం మంత్రి, ఒకప్పటి ఆర్ధిక మంత్రి అయిన చిదంబరం గురించి న్యాయస్తానంలో మాజీ కేంద్ర మంత్రి రాజా బాహాటంగా చేసిన ప్రస్తావనల పట్ల కూడా అదేవిధంగా ‘తన పని తాను చేసుకుపోతుంది’ అనే నమ్మకం జనంలో కలిగించగలిగితే అంతకన్నా ఆహ్వానించాల్సిన అంశం మరొకటి వుండదు. కానీ, ఒకరిపట్ల ఒకరకంగా, మరొకరిపట్ల మరోరకంగా అవసరాన్నిబట్టి చట్టాల అన్వయం మారిపోతూ వుండడమే మన వ్యవస్థ లోని విషాదం. అందుకే చట్టాల పట్ల సామాన్యుడికి విశ్వాసం సన్నగిల్లుతోంది. అవినీతిపై ఆయా రాజకీయ పార్టీలు ఎక్కుబెట్టే బాణాలన్నిటి వెనుకా పైకి కనబడని రాజకీయ లక్ష్యాలు, ఉద్దేశ్యాలు ఏవో దాగున్నాయని ప్రజలు నమ్మే పరిస్తితి దాపురిస్తోంది.

మొన్నటికి మొన్న అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమం పట్ల భారత ప్రజానీకం ముఖ్యంగా యువత స్పందించిన తీరు గమనించిన వారికి దేశ భవిష్యత్తు గురించి కొత్త ఆశలు రెక్కలు తొడిగాయి. కల్మాడీ, కనిమొళి, రాజాల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతున్న విషయాలు గమనించిన తరువాత ఈ ఆశలు మరింత ముప్పిరిగొన్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయ అవినీతి కేసుల విషయంలో న్యాయస్తానాలు స్పందిస్తున్న తీరు సయితం హర్షనీయం.

అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత చందంగా రాజకీయ అవినీతి గురించి జరిగిన దర్యాప్తులు, అవి నిగ్గు దేల్చిన నిజాలు కాలగర్భంలో కలసిపోతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాల కాలంలో అవినీతి, లంచగొండితనం ఆరోపణలు రుజువై శిక్ష పడ్డ రాజకీయ ప్రముఖులు కలికానికి కూడా కానరారు. నేరానికి తగిన శిక్ష తధ్యం అన్న భయం వున్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేర ప్రవృత్తి సయితం తగ్గుముఖం పడుతుంది.

మనకంటే చిన్న దేశాల్లో కూడా లంచగొండి రాజకీయనాయకులు చట్టం నుంచి తప్పించుకోలేక జైల్లో మగ్గుతున్న సందర్భాలు వున్నాయి. ఉదాహరణకు 1997-2002 నడుమ నికరాగువా అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్నాల్డోపై తీవ్రమయిన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని గురించి విచారించిన ఆ దేశపు సుప్రీం కోర్టు ఆర్నాల్దో కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే, గతంలో యుగోస్లావియా అధ్యక్షుడిగా పనిచేసి కోట్లాది డాలర్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కున్న మిలోసెవిక్ ప్రస్తుతం జైలు వూచలు లెక్కబెడుతున్నాడు. 1990 – 2000 మధ్య పెరు ప్రెసిడెంటుగా వున్న ఫ్యుజిమోరి తన పదవీకాలంలో దేశంలో టెర్రరిజాన్ని పూర్తిగా మట్టుబెట్టగలిగాడు. కానీ, సంపూర్ణ అధికారం అతడిని ఒక టెర్రరిస్టుకన్నా ప్రమాదకారిగా మార్చింది. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టాడు. దానితో విసిగిపోయిన ప్రజలు తిరగబడి అతడిని గద్దె దించారు. ఫ్యుజిమోరి దేశం విడిచిపెట్టి పారిపోయినా అతడిని పట్టుకుని పెరు తీసుకువచ్చి జైల్లో పెట్టారు.

చట్టం అందరిపట్లా ఒకే రకంగా వ్యవహరించినప్పుడే ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనే వాక్యానికి అర్ధం వుంటుంది. లేని పక్షంలో అది ఒక పనికిరాని వూతపదంగా మిగిలిపోతుంది. (28-07-2011)