4, మార్చి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (102) – భండారు శ్రీనివాసరావు

 

ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున, పగలో రాత్రో సరిగా అర్ధం కాని సమయంలో, గంటకు కొన్నివందల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న రష్యన్ ఎయిర్ లైన్స్ ఏరో ఫ్లోట్ విమానంలో, నా భార్యాపిల్లలు, మిగిలిన ప్రయాణీకులు నిద్రావస్థలో వున్నప్పుడు సీటుకు జారగిలపడి ఆలోచిస్తూ గతంలోకి జారిపోయాను.
అద్భుతంగా సాగిన నా రేడియో జీవితంలో మాయని మచ్చలాంటి సంఘటన 1987 లో జరిగింది.
శ్రీ కె.ఎస్. వ్యాస్ అత్యంత ప్రతిభావంతుడైన ఐ.పి.ఎస్. అధికారి. నేను బెజవాడ వెళ్లినప్పుడల్లా మా అక్కయ్య అడిగేది, ‘ఒరేయ్ నీకు చాలామంది తెలుసు కదా! ఎలాగైనా వ్యాస్ గారి ఫోటో ఒకటి తెచ్చి పెట్టరా. ప్రతిరోజూ నిద్రలేవగానే ఆ ఫొటోకు దణ్ణం పెట్టుకుంటాను’ అని బ్రతిమిలాడేది.
వ్యాస్ (కోట శ్రీనివాస్ వ్యాస్) బెజవాడలో పోలీసు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి, బెజవాడకు ఇంటి పేరుగా మారిన రౌడీ అనే పదం చరిత్ర పుటల్లో చేరిపోయింది. రాత్రివేళ అల్లరిచిల్లరగా తిరుగుతూ అడ్డు తగిలిన వారిపై, గుండు సూదులతో గ్యాస్ నింపిన సోడా సీసాలను గాలిలోకి ఎగురవేసి, ఒకదానితో ఒకటి కొట్టుకుని పేలిపోయేలా చేసి, బాంబు పేలుళ్ల వంటి ఆ భయంకరమైన చప్పుళ్ళతో బీభత్సం సృష్టించే రౌడీ మూకలు అడ్రసు లేకుండా పోయాయి. పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ అర్ధరాత్రి వరకు గాలి తిరుగుళ్ళకు అలవాటుపడిన కాలేజి విద్యార్ధులు రాత్రి తొమ్మిది లోపలే ఇళ్లకు చేరేవాళ్ళు. అప్పటివరకు వాళ్ళని ఎలా అదుపు చేయాలో తెలియక తలలు పట్టుకున్న తలితండ్రులకు వ్యాస్ గారు దేవుడిలా కనపడడంలో ఆశ్చర్యం లేదు. (అయితే, రౌడీల అణచివేత పేరుతొ తమ కార్యకర్తలను వ్యాస్ వేధిస్తున్నారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసేవాళ్ళు)
సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన పోలీసు అధికారి వ్యాస్ ని ఆ నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హైదరాబాదుకు రప్పించి, రాజధాని నగరంలో అస్తవ్యస్తంగా వున్న ట్రాఫిక్ ని చక్కదిద్దే బాధ్యత అప్పగించారు.
ముఖ్యమంత్రి ఏరికోరి నియమించిన అధికారి, నేను వ్యక్తిగతంగా ఎంతగానో అభిమానించే అధికారి అయిన వ్యాస్ గారితో ఒకే ఒక్క విషయంలో వచ్చిన పేచీ, అనేక విపరీత పరిణామాలకు దారి తీస్తుందని అప్పట్లో ఏమాత్రం ఊహించలేకపోయాను.
ఉద్యోగం రేడియో కరస్పాండెంట్ కావడం వల్ల చాలామంది సీనియర్ పోలీసు అధికారులతో నాకు చెప్పుకోదగిన మంచి పరిచయాలే వుండేవి. అలాగే వ్యాస్ గారితో కూడా. ఇక వ్యాస్ గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.
ఆయన నివాసం రవీంద్ర భారతి ఎదురుగా వున్న ఒక మాన్యుమెంట్ మాదిరి ఎత్తైన భవనం. సెక్యూరిటి త్రెట్ కారణంగా బాగా రద్దీగా వుండే కూడలిలో ఆయనకు ఆ భవనం కేటాయించారని అనుకునేవారు. కూతవేటు దూరంలో (పాత) పోలీసు కంట్రోల్ రూమ్ లో ఆఫీసు. ఈ రెంటి నడుమ నేను పనిచేసే రేడియో స్టేషన్.
వ్యాస్ గారికి ప్రచార యావ లేదు. కానీ ట్రాఫిక్ సమస్యలను చక్కదిద్దడానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికపై ఆయన తీసుకున్న చర్యలు విశేష ప్రచారాన్ని కట్టబెట్టాయి. వన్ వే ట్రాఫిక్ నిబంధనలను అనేక ప్రధాన రహదారులకు విస్తరించడం, హెల్మెట్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం వగైరా అన్నమాట. దానితో వ్యాస్ గారి పేరు ప్రతిరోజూ పత్రికల్లో వచ్చేది. హెల్మెట్ నిబంధన అమలుచేసిన తీరు వివాదాంశంగా మారింది. హెల్మెట్ ధరించని వారిని పోలీసులు కాపు కాసి పట్టుకునేవారు. పోలీసు కంట్రోల్ రూమ్ కూడలి వద్ద మోటారు సైకిళ్ళపై సిబ్బంది సిద్ధంగా వుండేవారు, హెల్మెట్ లేకుండా తప్పించుకుని పోయేవారిని వెంటాడి పట్టుకోవడం కోసం. ఇక్కడే విలేకరులకు, పోలీసులకు నడుమ తరచుగా వాగ్వాదాలు జరిగేవి. వార్తల సేకరణ కోసం విమానాశ్రయం, సచివాలయం, ఆసుపత్రులు ఇలా అనేక చోట్లకు అనుదినం పోవాల్సిన అవసరం విలేకరులది. ప్రతి చోటికి హెల్మెట్ వెంటబెట్టుకుని వెళ్ళడం కుదరదు. పైగా యాభయ్ ఏళ్ల క్రితం రోడ్ల పరిస్థితి ఇంత మెరుగ్గా లేదు. ఎక్కడ చూసినా గుంటలు, గోతులు. వేగంగా పోవాలన్నా పోలేని విధంగా వుండేవి రోడ్లు. అక్కడక్కడా స్పీడ్ బ్రేకర్లు వున్నా అవి వున్న చోట పసుపు రంగుతో గీతలు గీయాలనేది రూలు. ప్రశ్నిస్తే అది మా పని కాదు, వేరే శాఖ వాళ్లది అని జవాబు.
ఇలా ప్రతిరోజూ విలేకరులకు, పోలీసులకు ఘర్షణలు.
నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం సచివాలయానికో, మరో చోటికో. అసలా నౌకరీయే తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు. తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని జీతం పెరిగి నా ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా పెద్దగా కనబడడం మొదలయింది.
నాకు బీపీ వుందని డాక్టర్లు నిర్ధారించి దాదాపు నలభయ్ ఏళ్ళు గడిచాయి. ఈ మాయదారి రోగం రావడానికి అప్పట్లో నాకు కనబడ్డ కారణం ఆటోరిక్షా డ్రైవర్లు.
ఆఫీసుకు పోవాలంటే ఆటోనే శరణ్యం. సందు మొగదల్లో ఆటోలు ఆపుకుని అందులో శేషతల్పశాయి మాదిరిగా డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటూ వుండేవారు. వాళ్ళల్లో వొకడ్ని నిద్రలేపి, రేడియో స్టేషన్ కు పోవాలి వస్తావా అని అడిగేవాడిని మర్యాదగా. ‘రాను’ అనే సమాధానం వచ్చేది దురుసుగా.
ఇక సంభాషణ నా చేయి దాటిపోయేది.
‘ఏం ఎగస్ట్రా ఇవ్వాలా?’
‘ఆ మాట వేరే చెప్పాలా’ కాసింత ఎటకారం.
ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. ఆ ఆటోని వొదిలేసి మరోటి పట్టుకుంటే మళ్ళీ అదే జవాబు ‘రాను’
మరో ఆటోవాలా సమాధానం మరో రకంగా వుండేది.
‘సికింద్రాబాదుకయితే సరే’
దానికి నేనూ సరే. ఎందుకంటే ఈ మధ్యలో ఏదో ఒక క్రాస్ రోడ్డు రాకపోదా. ఎవరో ఒక ట్రాఫిక్ పోలీసు కనబడక పోడా! అదీ నా ఆలోచన.
అనుకున్నట్టే పోలీసు తగిలేవాడు. నేను పలానా అని చెప్పగానే అతడు ఆటోవాడికి నాలుగు తగిలించేవాడు. లేదా ఓ క్లాసు పీకేవాడు. అంతే. నేను ఎంచక్కా అదే ఆటోలో ఆఫీసుకుకి చేరిపోయేవాడిని. ఉద్యోగ మహత్యం.
కానీ ఇది ఒక రోజు మాట కాదు కదా. ప్రతి రోజూ ఇదే తంతాయే!
భార్యాపిల్లల్ని తీసుకుని సినిమాకు బయలుదేరిన వాడిని, ఆటోవాళ్ళ పుణ్యమా అని చివరకు ఆటో వాడితో సహా పోలీసు స్టేషన్ కు చేరేవాడిని. అక్కడ దృశ్యం షరా మామూలే.
ఇదంతా చూసి మా వాళ్లు చిరాకు పడి నాతో బయటకు రావడమే మానుకున్నారు. ఆటో వాళ్ళు నాకు భయపడి మా ఇంటి సందు చివర ఆటోలు ఆపుకోవడం మానుకున్నారు.
ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం, ఝామ్మని తిరగడం మొదలయింది కానీ, జీవితంలో ఇబ్బందులను స్కూటరు వాలా కోణం నుంచే గమనించడం కూడా మొదలయింది. నా ఈ మొదటి స్కూటరు కొనడం వెనుక కూడా చాలా కధ నడిచింది.
ఆ రోజుల్లో వెస్పా స్కూటర్లకి మంచి గిరాకి. ధరలో కొంత డబ్బు ముందు చెల్లిస్తే తరువాత ఎప్పుడో రెండు మూడేళ్లు వెయిట్ పీరియడ్ తర్వాత స్కూటర్ రిలీజ్ చేసేవాళ్ళు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి ప్రతి నెలా ఇన్ని స్కూటర్లు అని విచక్షణ కోటా వుండేది. నేను నాకు తెలిసిన వాళ్లకి చాలామందికి రవాణా శాఖ మంత్రి జే. చొక్కారావు గారికి చెప్పి సిఫారసు లెటర్లు ఇప్పించిన సందర్భాలు వున్నాయి. వీటికి బ్యాంకు అప్పులు ఇచ్చేవి. కొత్త స్కూటరు ఖరీదు ఏడెనిమిది వేల కంటే తక్కువే. బాంకు ఋణం ఇచ్చినా, రెండు, మూడు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సిరావడం వల్ల, అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా, తీసుకోవడానికి ఓ పట్టాన ధైర్యం చాలేది కాదు. బ్యాంకు వాళ్ళ ఈ షరతు నాకు కుదిరేది కాదు. ఆరేడు వందల జీతగాడి దగ్గర అంత మొత్తం ఎందుకు వుంటుంది? ఈ కారణం చేత నేను గవర్నమెంటు కోటాలో చాలా తక్కువ ధరలో స్కూటరు కొనుక్కోగల అవకాశం వుండి కూడా ఆ పని చేయలేకపోయాను.
అంచేత అలా విధిలేక ఆటో వాళ్ళతో నిత్య పోరాటం చేస్తూ రోజులు గడుపుతున్న కాలంలో..
కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను, హైదరాబాదు వచ్చి అప్పటికి నగరంలో వున్న ఏకైక స్టార్ హోటల్ బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని భాస్కరులు (పత్రికా రచయితలు) ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవధానం, వెసులుబాటు దొరికింది. ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఆయన వెంటనే స్పందించి అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి, కావాల్సిన వారికి లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం.
రెండు రోజుల తరువాత కోటీలోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను. బాంకు అధికారి స్కూటరు లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే, ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు.
ఆ రోజుల్లోనే, గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని, దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. మా వైభోగం ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు.
చిత్రం ఏమిటంటే, 1987లో మాస్కో వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు జరిగిన ‘హెల్మెట్ ధరించని జర్నలిస్ట్ అరెస్ట్’ అనే సంచలన ఉదంతానికి కారణమైన ‘నేను’, ఆ రోజు వెడుతున్నది ఈ గిర్నార్ స్కూటర్ మీదనే.
ఆటో వాళ్ళ బాధ పడలేక బ్యాంకు లోను తీసుకుని స్కూటర్ కొనుక్కుంటే, మూడో వాయిదా కూడా కట్టక మునుపే పోలీసులు పట్టుకునే వారు. హెల్మెట్ లేదంటారు. ఈ గతుకుల రోడ్లమీద హెల్మెట్ ఎందుకని నా ప్రశ్న. నేనే కాదు అనేకమంది పత్రికా విలేకరులతో పోలీసుల వాగ్వాదాలు నిత్యకృత్యంగా మారాయి. అలాగే ఈ విధానానికి వ్యతిరీకంగా ప్రతి రోజూ వార్తలు, కార్టూన్లు. ఈ పరిణామాలు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారాయి.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి, ఆ నాటి మంత్రి అయిన అమరనాధ రెడ్డి గారి మృతి కారణంగా ఆ రోజు అసెంబ్లీ అనుకోకుండా వాయిదా పడింది.
స్కూటర్ తీస్తుంటే, ఆంధ్రభూమి విలేకరి సూర్య ప్రకాష్ కలిసి, నన్ను కాస్త విజయనగర్ కాలనీలో దింపుతావా అని రిక్వెస్ట్ చేశాడు. మధ్యాన్నం వార్తలకు చాలా సమయం వుంది. సరే పద అని స్కూటర్ మీద ఎక్కించుకున్నాను. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వెడుతుంటే హుమాయూన్ నగర్ కూడలి వద్ద ఒక ట్రాఫిక్ పోలీసు స్కూటర్ ఆపి పక్కన పెట్టమన్నాడు. షరా మామూలు వాదనల తర్వాత పద
పోలీసు స్టేషన్ కు పోదాం అన్నాను.
నడిరోడ్డు కంటే పోలీసు స్టేషన్ చాలా అనువు. ఫోన్ వుంటుంది. పై అధికారులతో మాట్లాడడానికి వీలుంటుంది.
పోలీసులు అనాల్సిన మాట నా నోట వచ్చేసరికి వాళ్లకూ పట్టుదల పెరిగింది. స్టేషన్ కు తీసుకువెళ్ళారు.
నానా రభస. సూర్య ప్రకాష్ ఇంటికి వెళ్లి విషయం అందరికీ చెప్పాడు. దాంతో జర్నలిస్టులందరూ సంఘీభావం ప్రకటించి మూకుమ్మడిగా పోలీసు స్టేషన్ కు వచ్చారు.
ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఆయన అప్పుడు మద్రాసులో వున్నారు. మర్నాడు జర్నలిస్టులు అసెంబ్లీని బహిష్కరించారు. ప్రభుత్వం దిగివచ్చింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. నన్ను పట్టుకున్న పోలీసు ఇనస్పెక్టర్ ని వేరే చోటుకి బదిలీ చేశారు.
ఇదంతా నాపై తీవ్ర ప్రభావం చూపింది. ఈలోగా మాస్కో ఎసైన్మెంట్ వచ్చింది. దాంతోపాటే బీపీ కూడా వచ్చింది. మాస్కో వెడదామా వద్దా అనే సంశయానికి ఈ ఉదంతం తెర దించింది. అనేక మలుపులు తిరిగి ఈ కధ సుఖాంతం అయింది కానీ ఆనాటి నుంచి మళ్ళీ గిర్నార్ స్కూటర్ ఎక్కలేదు.
(మరో విచిత్రమైన విషయం ఏమిటంటే కె.ఎస్. వ్యాస్ ని పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ కాల్చి చంపిన వార్త ముందుగా తెలుసుకున్నవారిలో నేనున్నాను. నేను మాస్కో నుంచి తిరిగివచ్చిన తర్వాత , 1993 జనవరి 27 వ తేదీన నాటి హోం మంత్రి ఏమ్వీ మైసూరారెడ్డి విలేకరులను ఆ రాత్రి విందుకు ఆహ్వానించారు. అదే రోజు సాయంత్రం
లాల్ బహదూర్ స్టేడియంలో జాగింగ్ కు వెళ్ళిన కె ఎస్ వ్యాస్ ని నలుగురు నక్సల్స్ దగ్గర నుంచి కాల్చి చంపారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. ఇటువంటి వార్తలు ప్రజలకి వెంటనే తెలిసే అవకాశం లేదు. హోం మంత్రికి సెట్లో ఎవరో ఈ సంగతి చెప్పారు. వార్త వింటూనే చేష్టలుడిగిన హోం మంత్రి, విందు కేన్సిల్ చేసుకుని వెంటనే వెళ్ళిపోయారు.
నా రేడియో సహచరుడు షుజాత్ ఆలీ సూఫీ అందించిన సమాచారంతో అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి ప్రసారం అయిన తొమ్మిది గంటల ఇంగ్లీష్ వార్తల్లో ఈ హత్యోదంతం ప్రధాన వార్తగా రావడంతో ప్రజలందరికి, గ్రే హౌండ్స్ సృష్టికర్త, డి.ఐ.జి. శ్రీ కె ఎస్ వ్యాస్ ఇకలేరనే సంగతి తెలిసింది)
ఈ ఆలోచనలతో తెల్లారిందో, రాత్రి పొద్దుపోయిందో తెలియదు కానీ మంచు వర్షంలో తడుస్తూ, విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడుతున్న మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం షెర్మెతోవా ఎయిర్ పోర్ట్, ఏరో ఫ్లోట్ విమానం విండో నుంచి కానవచ్చింది.
కింది ఫోటోలు :
నేను అభిమానించే పోలీసు అధికారి, కీర్తిశేషులు శ్రీ కె.ఎస్. వ్యాస్ ( మరింత మంచి ఫోటో కోసం నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు )
హెల్మెట్ లేని కారణంగా నన్ను అరెస్టు చేసి ఉంచిన హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ ముందు సీనియర్ జర్నలిస్టుల ధర్నా
(ఇంకావుంది)
All reactions:
1
Like
Comment
Send
Share
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook

3, మార్చి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (101 ) – భండారు శ్రీనివాసరావు

 


వెనుకటి రోజుల్లో ఇతర ప్రాంతాలనుంచి విద్యార్ధులు హైదరాబాదు ఎక్స్ కర్షన్ కు వస్తే వాళ్లకు చూపించే ప్రదేశాల్లో రేడియో స్టేషన్ కూడా వుండేది. బేగం పేట ఏరోడ్రోం  మరోటి.  విమానాశ్రయం అనే వాళ్ళు కాదు,  ఏరోడ్రోం అంటేనే చెప్పుకోవడానికి గొప్పగా వుండేది. ఆ రోజుల్లో ఇప్పట్లా కాదు, రోజు మొత్తంలో కలిపి ఒకటీ అరా  విమానాలే హైదరాబాదు వచ్చి వెళ్ళేవి. కొన్ని నైట్ హాల్ట్ బస్సుల మాదిరిగా రాత్రంతా అక్కడే వుండి మరునాడు బయలుదేరి వెళ్ళేవి.  అందుకని స్కూలు పిల్లల్ని తీసుకువచ్చిన మాస్టర్లు కూడా ఏదో ఒక విమానం వచ్చే టైమో, వెళ్ళే టైమో ముందుగా కనుక్కుని అక్కడికి తీసుకువెళ్ళేవాళ్ళు. విమానాశ్రయం మేడ మీద అద్దాల కిటికీల్లో  నుంచి విమానం దిగివస్తున్న వాళ్ళను చూసి సంతోషంతో కేరింతలు కొట్టేవాళ్ళు, అల్లాగే అసెంబ్లీ బిల్డింగ్, దానిపక్కనే పబ్లిక్ గార్డెన్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం ఇలా అన్ని చోట్లకీ తిప్పి వెనక్కి తీసుకుపోయేవాళ్ళు. తరువాత తరువాత ఈ జాబితాలో నెహ్రూ జూ పార్కు, రవీంద్రభారతి వచ్చి చేరాయి.

ఇంతకుముందే చెప్పినట్టు గొప్ప సంస్థల్లో పనిచేసే అవకాశం రావడం వల్ల  అంతవరకూ చాలా గొప్పవాళ్ళు, వీళ్ళను ఒక్కసారి కలిస్తే చాలు అనుకున్నవాళ్ళతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం లభిస్తుంది. రేడియోలో చేరడం వల్లనే,  పన్యాల రంగనాధ రావు గారు, తిరుమలశెట్టి శ్రీరాములు గారు, మాడపాటి సత్యవతి గారు, డి.వెంకట్రామయ్య గారు ఇలాటి గొప్ప స్వర సంపన్నులతో సహోద్యోగిగా సాంగత్యం చేసే స్వానుభవం సొంతం అయింది. (నిజానికి రేడియో వార్తల్లో ‘గారు’ వాడరు ‘శ్రీ’ తప్ప. కానీ ఈ గొప్పవారిపట్ల పెంచుకున్న గౌరవంతో ‘గారు’ చేర్చి గౌరవించుకుంటున్నాను)

జర్నలిజం వృత్తిలో చేరినప్పుడే సీనియర్లు, జూనియర్లు అనే తేడా వొదులుకోవాలని, ‘హోదాలతో’ సమకూరే పెద్దరికాలను పక్కనపెట్టాలని నా పెద్దలు నాకు నేర్పిన పాఠం. అందుకే నా వృత్తి జీవితంలో నాకు ఎవ్వరూ ‘బాసులు’ కారు, నేను ఎవ్వరికీ ‘బాసును’ కాను. ఇదే సూత్రాన్ని నేను మూడు దశాబ్దాలపాటు పాటించాను. ఆచరించాను.

 

1975 లో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగంలో అసిస్టెంట్  ఎడిటర్ (రిపోర్టింగ్) గా చేరినప్పుడు, నా ఉద్యోగ బాధ్యత కాకపోయినా వారానికి మూడు రోజులు ఉదయం ఆరుగంటల నలభయ్ అయిదు నిమిషాలకు ప్రసారం అయ్యే ప్రాంతీయవార్తల బులెటిన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసేవాడిని. అప్పుడు పరిచయం గుడిపూడి శ్రీహరి.

తిరుమలశెట్టి శ్రీరాములుడి. వెంకట్రామయ్యజ్యోత్స్నాదేవి రెగ్యులర్ న్యూస్ రీడర్లు. మాడపాటి సత్యవతి గారు అసిస్టెంట్ ఎడిటర్. అప్పుడప్పుడు  వార్తలు చదివేవారు. వారి వీక్లీ ఆఫ్స్సెలవు రోజుల్లో వార్తలు చదవడానికి క్యాజువల్ న్యూస్ రీడర్లుగా పీ.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రిసురమౌళిగుడిపూడి శ్రీహరి గార్లు వచ్చేవారు. అప్పుడప్పుడు అనుకోకుండా వాళ్లకు  గొంతు  పట్టేసిన సందర్భాలు వచ్చేవి. అప్పుడు నేనే  బులెటిన్ పేపర్లు పట్టుకుని వెళ్లి స్టూడియోలో కూర్చుని వార్తలు చదివేసేవాడిని. (ఈ  అనుభవం తర్వాత రోజుల్లో నాకు అక్కరకు వచ్చింది. రేడియో మాస్కోలో వార్తలు చదవడానికి నన్ను ఎంపిక చేసే సమయంలో, వస్తుతః నేను రేడియో విలేకరిని అయినప్పటికీ, , అవసరార్థం నెత్తికి ఎత్తుకున్న ఈ అనుభవం పనికివచ్చింది)

ఉదయం పూట న్యూస్ రీడర్లు చదివే వార్తలను ఎడిట్ చేసి, ప్రాధాన్యతా క్రమంలో హెడ్ లైన్స్ (ముఖ్యాంశాలు) ఎంపికచేసి   ఇవ్వడం నా బాధ్యత. ఉద్యోగంలో చేరకముందే, స్కూలురోజులనుంచే వీళ్ళు చదివే వార్తలు నేను రేడియోలో  వింటూ వుండేవాడిని. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే మహత్తర అవకాశం నాకు రేడియో ఉద్యోగం ఇచ్చింది.

శ్రీహరి సంగతి కదా చెప్పుకుంటున్నాం.

ఆయన వయసులో నాకంటే పెద్ద.  కానీ ఆహార్యంలో నాకంటే కుర్రవాడు. హాలీవుడ్ సినిమా హీరో మల్లే నెత్తిన హ్యాటు. చలవ కళ్ళజోడుకోటుబూటుతో మోటార్ సైకిల్ మీద ఆయన రేడియో ప్రాంగణంలో ప్రవేశిస్తూ వుంటే చూడాలి. శ్రీహరి గారి దగ్గర రకరకాల హ్యాట్లు (టోపీలు కాదు, హాలీవుడ్, హిందీ   సినిమాల్లో  హీరోలు పెట్టుకునేవి), పలురకాల నల్ల కళ్ళజోళ్లుకొట్టవచ్చేటట్టు కనబడే ముదురు రంగుల బుష్ కోట్లువీటన్నితో కలిపి చూస్తే అసలు వయసు కంటే చాలా చిన్నవాడిగా కనబడేవాడు. అంచేత నేను కూడా చనువు తీసుకుని ఏకవచనంలోనే సంబోధించేవాడిని. ఆయనా అల్లాగే నన్నూ ఏమోయ్ శ్రీనివాసరావ్ అని పిలిచేవాడు. అలా అరమరికలు లేని స్నేహం మా నడుమ వుండేది.   

ఆహార్యానికి తగ్గట్టే శ్రీహరి వార్తలు చదివే తీరు కూడా విభిన్నంగా వుండేది. బయట కులాసాగా తిరిగినట్టే స్టూడియో లోపల కూడా బేఫికర్ గా వార్తలు చదివేవాడు. వార్తలు చదువుతూ గొంతు సవరించుకోవడం, ఊపిరి పీల్చి వదిలిన ధ్వని ఇవన్నీ మా రేడియో వాళ్లకి నచ్చవు. అదే రిపోర్టులో రాసి ఆయనకు చెప్పమనే వారు. నేను చెబితే ఆయన నవ్వి ఇలా అన్నాడు.

‘మనం పోటీ ప్రపంచంలో ఉన్నాము. ఇలా అనేవాళ్ళు ఎప్పుడయినా బీబీసీ వార్తలు విన్నారా! వాయిస్ ఆఫ్ అమెరికా వార్తలు విన్నారా! అక్కడ ఇటువంటివి సహజంగా తీసుకుంటారు. నిజానికి అలా చేయడం వల్ల ఈ ప్రోగ్రాము ముందుగా రికార్డు చేసింది కాదులైవ్ ప్రోగ్రాం అని శ్రోతలకు తెలుస్తుంది కూడా

ఆయన చెప్పింది నాకు సరిగానే అనిపించింది.

శ్రీహరికి భార్యావియోగం కలిగింది. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అనుకున్నా. కొన్నేళ్ళ తర్వాత ఆయనా దూరం అయిపోయారు. 2022 జులై లో తన 88 వ ఏట హైదరాబాదులో కన్నుమూశారు.    మనిషి పోయినా స్వరం మాత్రం తెలుగు శ్రోతల గుండెల్లో పదిలంగా వుంటుంది.

అలాగే సురమౌళి. ఈయన కూడా రేడియోలో క్యాజువల్ న్యూస్ రీడర్. మాసిపోయిన లాల్చీ పైజామాతో అత్యంత సాదా సీదాగా వుండే సురమౌళిని చప్పున అర్ధం చేసుకోవడం కష్టం. అసలు ఆ పేరే విచిత్రం. ముందు కలం పేరు అని భ్రమపడే అవకాశం వుంది. అయితే  ఆయనతో పరిచయం పెరిగినకొద్దీ ఆ మనిషిలోని గొప్ప లక్షణాలు నాకు క్రమంగా బోధ పడుతూ వచ్చాయి. ఫక్తు లోహియావాది. జార్జ్ ఫెర్నాండేజ్ వంటి నాయకులతో సన్నిహిత పరిచయం.

చాలా ఏళ్ళ క్రితం నేనూ జ్వాలా నరసింహారావు  ఓసారి ఢిల్లీ వెళ్లాం (బహుశా అదే మొదటి పర్యాయం అనుకుంటా ఢిల్లీ చూడడం). అప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. చూద్దామనే కోరిక. ఇద్దరం పార్లమెంటు లాబీల్లోకి వెళ్లాం. ఇప్పట్లా అప్పట్లో కఠినమైన నిబంధనలు లేవు. లోపలకు వెళ్లి గేలరీ నుంచి పార్లమెంటు సమావేశాలు  చూడాలంటే పాసు అవసరం. దానికి ఎవరయినా ఎంపీ సంతకం కావాలి. అటూ ఇటూ చూస్తుంటే జార్జ్ ఫెర్నాండెజ్ కనిపించారు. దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాం. హైదరాబాదునుంచి వచ్చామనీ, సురమౌళి స్నేహితులమనీ చెప్పాం. అంతే! మేము ఎవరమో తెలియకపోయినా, సురమౌళి పేరు చెప్పగానే ఫెర్నాండెజ్ మారుమాట మాట్లాడకుండా విజిటర్స్ గేలరీ కాగితం మీద సంతకం చేసి ఇచ్చారు. దటీజ్ సురమౌళి.

బద్రీ విశాల్ పిత్తి వంటి పెద్దపెద్ద వారితో సన్నిహిత పరిచయాలు వున్నాకూడా వాటిని ఎన్నడూ తన సొంత ప్రయోజనాలకు వాడుకోలేదు. ఒక స్థిరమైన ఉద్యోగం చేసిన దాఖలా లేదు. అప్పుడప్పుడూ రేడియో వార్తలు చదువుతూ, రచనలు చేసుకుంటూ జీవితం వెళ్ళదీశాడు. ఎన్టీఆర్ హయాములో జి. నారాయణరావు గారు అసెంబ్లీ స్పీకర్ గా వున్నప్పుడు శాసనసభలో ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సభ్యులు చేసే ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేసే ఒక ఉద్యోగాన్ని సృష్టించి సురమౌలికి ఒప్పచెప్పారు. అదీ తాత్కాలికమే.

పెద్ద సంస్కరణవాది.  పుట్టుకతో బ్రాహ్మణుడు అన్న సంగతి పుట్టినప్పుడే మరిచిపోయిన మనిషి. పెళ్లి విషయంలో కులం పట్టింపు పాటించలేదు. పుట్టిన అమ్మాయికి వెన్నెల అని పేరు పెట్టాడు. నిండైన విగ్రహం. కృష్ణ వర్ణం. తెల్లటి లాల్చీ,  పైజామా ధరించిన సురమౌళిని ఎంత దూరం నుంచి అయినా గుర్తుపట్టవచ్చు. అనేక భాషలు తెలిసిన వాడు. రాం మనోహర్ లోహియా రచనలను పుక్కిటపట్టాడు. గంభీరమైన స్వరంతో వార్తలు చదివేవాడు. మంచి స్నేహితుడు. అలాంటి వాడు చిన్న వయసులోనే చనిపోవడం విచారకరం.

ఇక పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి గారు. వారు ఫిలిం జర్నలిస్టు. అక్కినేని నాగేశ్వరరావు వంటి  పెద్ద పెద్ద సినీ నటులతో పరిచయాలు ఉండేవి. శ్రీహరి కూడా హిందూ వంటి ప్రముఖ పత్రికలకు సినిమా వ్యాసాలు రాస్తుండేవారు. కానీ ఏనాడు వారి నోటి వెంట ఈ హీరో తెలుసు, ఆ హీరోయిన్ తెలుసు అనే మాట వినపడేది కాదు. వచ్చి తమ పని చేసుకుని వెళ్ళిపోయేవారు. ఆంజనేయ శాస్త్రి గారిది చాలా పెద్దమనిషి తరహా. అనేక సినిమా కార్యక్రమాల వత్తిడి ఉన్నప్పటికీ రేడియో డ్యూటీ వున్నరోజున  టైం ప్రకారం వచ్చి వార్తలు అనువాదం చేసుకుని చదివి వెళ్ళిపోయేవారు. చిక్కడపల్లిలో మా ఇంటికి దగ్గరలోనే వుండేవారు.  సురమౌళి, శ్రీహరి, శాస్త్రి గార్లది విభిన్న ఆహార్యం. వార్తలు చదివే పద్దతి కూడా విభిన్నం.   

కింది ఫోటోలు:

పాత తరం వారి ఫోటోలు  గూగులమ్మ దగ్గర కూడా దొరకవని తేలిపోయింది. పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి గారి ఫోటో కోసం వెతికితే, ఆయన ఫోటో లేదు కానీ  ఆయన పేరిట నెలకొల్పిన అవార్డు ప్రదాన కార్యక్రమం ఫోటో దొరికింది. అందులో వేదిక కింద దండ వేసి వున్న ఆయన ఫోటో ఒకటి కనపడింది.  గుర్తు పట్టేలా లేదు. ఇక సురమౌళి ఫోటో అసలు దొరకనే లేదు. ఫోటో కాదు కదా ఆయన గురించిన సమాచారమే లేదు.  శ్రీహరి ఫోటో మాత్రం  లభ్యం అయింది.

సురమౌళి ఫోటో దొరకలేదు అనే బాధ లేకుండా విజయ జ్యోతి గారు అనే పాఠకురాలు  ఆ ఫోటో పంపారు. వారికి నా ధన్యవాదాలు.












  

(ఇంకావుంది)