12, డిసెంబర్ 2024, గురువారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (35) - భండారు శ్రీనివాసరావు

 

స్కూలుకు డుమ్మా కొట్టడం ఎన్నడూ చేయలేదు కానీ, మిగిలిన వ్యాపకాలపై ఉన్నంత శ్రద్ధ  చదువు పట్ల చూపడం లేదన్న సంగతి మా అన్నయ్యకు తెలిసి పోయింది. కేశవరావు గారి ఇంటి ఎదురుగా రాముడు మంచి బాలుడు అనే తరహా మోహనరావు గారు మెరిట్ స్టూడెంట్ ఉండేవాడు. తర్వాత ఇంజినీర్ అయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు కూడా. వయసులో నా కంటే పెద్దవాడు. నన్ను ముద్దు చేసేవాడు. దగ్గర కూచోబెట్టుకుని , అక్కినేని నాగేశ్వర రావు సినిమాలో ఒక పాట, మేనాలోనా ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా  అనే పాటను నా చేత పదేపదే పాడించుకుని వినేవాడు. ఇలా పాటలతో, ఆటలతో  కాలక్షేపం చేస్తున్న సమయంలో, నిమిషం నిమిషం తేడాతో మూడు కారు హారన్లు వినపడేవి. ఇంటికి దగ్గరలో వున్న  మూడు మలుపులు తిరిగి మా అన్నయ్య వ్యాను వస్తోందని అర్ధం అయ్యేది. చటుక్కున గేటు తీసుకుని ఇంట్లోకి పరిగెత్తి పుస్తకం పట్టుకునే వాడిని. ఆయన కారు దిగి డ్రైవర్ కి చెప్పాల్సింది చెప్పేసి నేరుగా తన గదిలోకి వెళ్ళేవాడు. ఆయన తెలివి అమోఘం. నాకు పుస్తకం పట్టుకోవడం అంటే బద్ధకం అని గ్రహించాడు.

స్టేషన్ రోడ్డు సీదా వెడితే మునిసిపాలిటీ ఆఫీసు. దానిపక్కనే జిల్లా గ్రంధాలయ శాఖ. అక్కడి నుంచి అనేక పుస్తకాలు, అన్నీ నవలలు, కదల పుస్తకాలు తెచ్చి నాకిచ్చి చదవమనేవాడు.  ఏదోవిధంగా చదవడం అలవాటు చేయాలనేది ఆయన తాపత్రయం. ఆ విధంగా చాలా చిన్న వయసులోనే శరత్ సాహిత్యం, జైనేంద్ర సాహిత్యం, విశ్వనాధ సాహిత్యం మొత్తం చదివేశాను. అలాగే ఇంటికి వచ్చే దినపత్రికలు, వార పత్రికలు. ఈనాడు తెలుగులో ఏదైనా నాలుగు ముక్కలు  రాయగలుగుతున్నాను అంటే అది మా అన్నయ్య పుణ్యం.

స్కూలు జీవితంలో చేసిన ఘన కార్యాలు ఏవీ లేవు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం తప్పిస్తే. రిక్కబజారు స్కూలుకు దగ్గరలో తాత కొట్టు వుండేది. అక్కడ జీడి ఉండలు, పప్పు ఉండలు, చాక్లెట్లు, సరే మనకు (అప్పటికి) అలవాటు లేని కిళ్ళీలు, సిగరెట్లు. నన్ను బాగా ఆకర్షించింది ఇవన్నీ కాదు, గంటకు అణాకు అద్దెకు ఇచ్చే సైకిళ్ళు. అలా ఒకసారి సైకిల్ తీసుకుని నడిపించుకుంటూ దగ్గరలో వున్న పెవిలియన్ గ్రౌండ్ కు వెళ్లి అక్కడ తొక్కే ప్రయత్నం చేసేవాళ్ళం. సీటు మీద కూర్చొంటే కాళ్ళు ఫెడల్ కు ఆనేవి కావు. అలాంటి వాళ్ళకోసం కాంచీ తొక్కుడు అనే పద్దతి ఒకటి వుందని తెలిసింది. అంటే సీటు మీద కూర్చోకుండా సైకిల్ ఫ్రేము మధ్యనుంచి కాళ్ళు పెట్టి తొక్కడం. కాళ్ళూ చేతులు గీసుకుపోయి, మోకాలి చిప్పలు పగలగొట్టుకున్న తరువాత మొత్తం మీద సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను. ప్రాక్టీసు చేయడానికి సైకిల్ ఎవరింట్లో సైకిళ్ళు లేవు. హీరో, ర్యాలీ, అట్లాస్ బ్రాండ్ సైకిల్ వుంటే ఈ రోజుల్లో బెంజ్ కారు ఉన్నంత హోదా. మా పెద్ద బావగారు రామారావు గారికి మంచి కండిషన్ లో వున్న సైకిల్ వుంది. చీకటి పడితే లైట్ వెలగడానికి చిన్న మోటారు ఏర్పాటు వుండేది. చక్రాలు తిరుగుతున్నప్పుడు ఆ మోటారు పనిచేసి, హ్యాండిల్ కు బిగించి  వున్న లైట్ వెలిగేది. లైట్ లేని సైకిళ్ళను రాత్రిపూట  పోలీసులు పట్టుకుని జుల్మానా వేసే వాళ్ళు. బావగారి సైకిల్ కి ఇలా అన్ని హంగులతో పాటు తాళం వేసే ఏర్పాటు కూడా వుంది. ఊరికి వెళ్ళేటప్పుడు దాని తాళం చెవి కూడా వెంటబెట్టుకు వెళ్ళేవాడు. ఎప్పుడైనా టైరు పంచర్ పడ్డప్పుడు మెయిన్ రోడ్డు  వరకు నడిపించుకుంటూ వెళ్లి, పంచర్ వేయించే బాధ్యత పడేది. వేయించి  తిరిగి వచ్చేటప్పుడు దర్జాగా తొక్కుకుంటూ ఇంటికి తెచ్చేవాడిని. ఇల్లు మరింత దూరంలో వుంటే బాగుండు అనిపించేది, వచ్చేటప్పుడు. 

చిన్నప్పుడు సైకిల్ పిచ్చి బాగా వుండేది. పరీక్ష తప్పి, సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపరేషన్ పేరుతొ కొన్నాళ్ళ పాటు మా ఊరు కంభంపాడు వెళ్ళేవాడిని. అయిదారుగురం కలిసి సైకిళ్ళు వేసుకుని ముప్పయ్ కిలోమీటర్ల దూరంలో వున్న నందిగామకు వెళ్లి మొదటి ఆట సినిమా చూసి వచ్చేవాళ్ళం. పోయేటప్పుడు బాగానే వుండేది కాని, వచ్చేటప్పుడు కటిక చీకటి. ఆ రోజుల్లో బెజవాడ- హైదరాబాదు మధ్య సింగిల్ రోడ్డు. ఎదురుగా లారీలు, బస్సులు వస్తుంటే వాటి హెడ్ లైట్ల కాంతికి కళ్ళు బైర్లు కమ్మేవి. దూరంలో లైటు కనబడగానే, ముందుగానే సైకిల్ దిగి రోడ్డు పక్కన ఆ లారీ వెళ్ళేదాకా నిలబడే వాళ్ళం. మొత్తం మీదం బితుకుబితుకుమంటూ  ఇళ్లకు చేరేవాళ్ళం. మేము తిరిగివచ్చేదాకా మా అమ్మగారు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసేది. 

‘ఎందుకు భయం, మేమేమన్నా చిన్నపిల్లలమా!’ అనేవాళ్ళం, మేకపోతు గాంభీర్యంతో

అన్ని కధలకు ఉన్నట్టే నా సైకిల్ కధకు కూడా తొందరలోనే ముగింపు కార్డు పడింది.

మా పెద్ద బావగారు రామారావు గారి రెండో అమ్మాయికి పెళ్లి కుదిరింది. వరుడు మా క్లాస్ మేట్ అయిన జూపూడి ప్రసాద్. పెద్ద మేనకోడలు, హైమక్కయ్యకు (వరుసకు మేనకోడలు కానీ, వయసులో మాకంటే చాలా పెద్ద. అందుకే అక్కయ్య అని పిలవడం అలవాటు అయింది)  అంతకు ముందే పెళ్లి అయింది. కల్లూరు సంబంధం. ప్రతి ఊరికి దొరలు ఉంటారని, మా హైమక్కయ్య భర్త కొండపల్లి లక్ష్మీ నరసింహా రావు గారిని  అందరూ  కల్లూరు దొరవారు అని పిలుస్తుంటే అర్ధం అయింది. పెద్ద మేనల్లుడు డాక్టర్ ఏపీ రంగారావు చనిపోయిన తర్వాత ఇప్పుడు మా కుటుంబంలో హైమక్కయ్యే అందరికీ పెద్ద దిక్కు. 85 ఏళ్ల వయసులో కూడా ఒక్కతే కల్లూరులో వుంటూ సొంతంగా వంటచేసుకుని, ఇంటికి వచ్చిన వాళ్లకు వండి పెడుతూ వుంటుంది. తెలంగాణా ప్రాంతంలో దొరల రాజ్యం ఏనాడో పోయినా, చుట్టుపకల వాళ్ళు మాత్రం ఇప్పటికీ ఆమెను దొరసాని అనే పిలుస్తారు. నెలకోసారి అయినా, హైదరాబాదులో ఉంటున్న మాకు ఫోను చేసి, ఎలా వున్నారని మమ్మల్ని  గురించి వాకబు చేస్తుంది. కల్లూరు రమ్మని పదేపదే చెబుతుంది. ఆమె ఫోన్ చేసినప్పుడల్లా పాత కాలపు ఆపేక్షలు గుర్తుకు వస్తాయి. క్రమంగా అవి అంతరించి పోతున్నాయేమో అని భయం వేస్తుంది.

రిక్కా బజారు స్కూల్లో ఒకే తరగతిలో చదువుతున్న జూపూడి ప్రసాద్ కి కానీ, మాకు కానీ పెళ్లి అంటే తెలియని వయసు. వాళ్ళనాన్న గారు, నరసింహారావు గారు ఖమ్మం మొత్తంలో కిరోసిన్, పెట్రోలు, డీసెల్ డీలర్. ట్రంక్ రోడ్డులో పెద్ద ఇల్లు కట్టుకోవడానికి ముందు స్కూలుకు దగ్గరలో తాత కొట్టు పక్కనే వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్న లేనప్పుడు వెళ్ళేవాళ్ళం. అందరి ఇళ్ళల్లో కుర్చీలు చూశాము కానీ, సోఫాలు చూడడం అదే ప్రధమం. ఆయనకో కారు వుండేది. పెట్రోలు బంకు చేతిలో వున్నప్పటికీ,  నడిచిగాని, రిక్షాలో గాని తిరిగేవారు. నడుం వంగని ఆరోగ్యం. తెల్లటి గ్లాస్కో పంచె, లాల్చీ ధరించి నడిచి వెడుతుంటే ఎదురు పడ్డవారు గౌరవంగా నమస్కారాలు పెడుతుండేవారు. హైదరాబాదులో  కంపెనీ (అప్పుడు బర్మా షెల్) పనిపడితే మాత్రం  కారు తీసేవారు. ఖమ్మం బిర్లా అనే పేరుండేది. నరసింహారావు గారికి ఒక్కడే కొడుకు. ప్రసాద్. ఆడపిల్లలు కూడా లేరు. మా మేనకోడలు జ్యోతితో సంబంధం కుదరడంతో మాకు, క్లాస్ మేట్ తోనే  బంధుత్వం కుదిరింది.  మా కుటుంబంలో జ్యోతి చక్కటి చుక్క. దానికి తగ్గట్టుగా గొప్ప సంబంధం కుదిరిందని అందరూ సంతోషపడ్డారు. పెళ్లి ఎంత ఘనంగా జరిగింది అంటే అంత హంగామా  చూడడం కూడా నాకు కొత్తే. ఎందుకంటే మా ఇంట్లో జరిగిన అక్కయ్యల పెళ్ళిళ్ళు అన్నీ ఇంటి ముందు  తాటాకు పందిళ్ళు వేసి చేసిన సింపుల్  పెళ్లిళ్ళే! షామియానాలు, డైనమో పెట్టి ట్యూబ్ లైట్ల వరుసలతో ఊరేగింపు, టపాసులు కాల్చడం, యూనిఫారాల బ్యాండ్ మేళం ఇవన్నీ ఆ పెళ్ళిలో మాకు అంతవరకూ తెలియని ఆకర్షణలు. ఆ రోజుల్లో ఇవన్నీ కొత్త.   ప్రసాద్ ను, జ్యోతిని పెద్ద రధంలో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించారు. వాళ్ళు నిద్రకు తాళలేక మధ్యలో కునుకు తీశారు.

ఈ పెళ్లి జరగడానికి ముందు ఊళ్ళో కొందరి ఇళ్లకు వెళ్లి శుభలేఖలు ఇచ్చే బాధ్యత మా బావగారు నాకు అప్పగించారు. అంతేకాదు, ఈ పని త్వరగా తెముల్చుకు రావడానికి మొట్టమొదటిసారి తన సైకిల్ తాళం చెవిని కూడా నాకు అప్పగించారు. వెంటనే పంచకల్యాణి గుర్రం ఎక్కినంత ఉత్సాహంతో నేను సైకిల్ ఎక్కి ఒకటి రెండు శుభలేఖలు పంపిణీ చేశాను. మా రెండో బావగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన తల్లి, మాపెద్ద మేనత్త  కాఫీ తాగిపోరా సన్నాసీ అంది. ఆవిడ మాట అందరికి వేదం. కానీ నా తరహా వేరు కదా. పైగా గుర్రం లాంటి సైకిల్ వుండగా, ఆమె కుంపటి మీద తయారుచేసి ఇచ్చే కాఫీ కోసం టైం వేస్టు చేయడం ఇష్టంలేక, ఆమె మాట కాదని, బయటకు వచ్చి సైకిల్ ఎక్కాను. రెండు గజాలు కూడా పోలేదు, బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాను. పడడం పడడం ఎడమ చేయి మణికట్టు దగ్గర విరిగింది. ఖమ్మం స్టేషన్ పక్కన ఖుద్దూస్ డాక్టరు దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయన ఎక్స్ రే తీయించి చేతికి వెదురు బద్దలు కట్టి, దానిమీద  సిమెంటు కట్టు వేశాడు. ఆ కట్టుతోనే పెళ్ళిలో తిరిగాను. తరువాత మూడు నెలలకి కాబోలు కట్టు విప్పారు.

ఈ సంఘటనతో నా సైకిల్ ఉబలాటానికి శాశ్వతంగా తెర పడింది.

కింది ఫోటో:

స్కూల్లో నా క్లాస్ మేట్, తర్వాత మేనకోడలు భర్త కీర్తిశేషుడు జూపూడి ప్రసాద్  




(ఊహా చిత్రం, చిత్రకారుడికి కృతజ్ఞతలు)




(ఇంకా వుంది) 

      

         

 

 

10, డిసెంబర్ 2024, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (34) - భండారు శ్రీనివాసరావు

 

 

ఖమ్మంలో మా అన్నయ్య  ఉద్యోగం అంతా జిల్లా కలెక్టర్ గారితో ముడిపడి వుండేది. ఆయన దౌరా వెడితే ఆయనతో పాటు మా అన్నయ్య కూడా వెళ్ళేవాడు. కలెక్టర్ గారి నివాసం రైలు కట్ట పక్కన.

ఆ రోజుల్లో ఖమ్మం కలెక్టర్ ఆఫీసు ట్రంకు రోడ్డులో వుండేది. చాలా చిన్న భవంతి. మెట్లు ఎక్కగానే ఎదురుగా స్వింగ్ డోర్. దాని వెనుక ఒక నీలంగుడ్డ పరచిన మేజా బల్ల. వెనుక కుర్చీలో కలెక్టర్. అదీ పరిస్తితి. అటాచ్డ్ బాత్ రూమ్ కూడా వుండేది కాదు. వెనక పెరట్లో ఎక్కడో దూరంగా వుండేది.

 

సయ్యద్ హషీం ఆలీ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు ఆయన వద్ద జిల్లా పౌర సంబంధాల అధికారిగా వుండేవారు. (తదనంతర కాలంలో ఆ శాఖకు డైరెక్టరుగా, అయిదుగురు ముఖ్యమంత్రులకు, 'చెన్నా టు అన్నా' - పీఆర్వోగా పనిచేశారు) ఆ కలెక్టర్ గారు ఎప్పుడు దౌరా వెళ్ళినా మా అన్నయ్యను వెంటబెట్టుకుని వెళ్ళేవారు. పత్రికల్లో వార్తలు, ఫోటోలు వేయించుకోవడం ఆయనకు సుతరామూ ఇష్టం వుండేది కాదు. మరి, ఎందుకు తనని కూడా తీసుకువెడుతున్నట్టు. అసలు విషయం ఏమిటంటే జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు సామాన్య ప్రజలు, ప్రధానంగా బీదాబిక్కీ ఆయన్ని కలుసుకుని తమ సమస్యలు చెప్పుకునే వారు. హషీంఆలీ గారి తెలుగు భాషా పరిజ్ఞానం అంతంత మాత్రం. కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది తర్జూమా చేసి చెప్పేటప్పుడు తనని తప్పుదోవ పట్తిస్తారేమో ఆయనకు అనుమానం. అందుకని ఆ పనిలో తోడ్పడడం కోసం మా అన్నయ్యను వెంట ఉంచుకునే వారు. ఈ సాన్నిహిత్యాన్ని కొందరు అపార్ధం చేసుకున్నారు కూడా. కలెక్టర్ గారితో మీకు బాగా పరిచయం వున్నట్టుందే అని అడుగుతుండేవారు. మా అన్నయ్య స్వతహాగా హాస్య ప్రియుడు. ‘అవునండీ. బాత్ రూమ్ అవసరం లాంటిది మా పరిచయం. బాత్ రూమ్ లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడే వుండిపోరుకదా. అలాగే నేను కలెక్టర్ గారిని రోజూ ఎన్నిసార్లు కలుసుకున్నా అవసరం మేరకే. అది పూర్తికాగానే బయటకు వస్తాను’ అనేవారు.

ఒక రోజు కలెక్టర్ ని కలవడానికి భద్రాచలం దగ్గర ఓ పల్లెటూరు నుంచి ఓ రైతు వచ్చాడు. గుమ్మం ముందు హమేషా వుండే డవాలా బంట్రోతు ఆ సమయంలో ఏదో పనిమీద వెళ్ళాడు. లోపల కలెక్టర్ గారు బాత్రూంకు పోవడానికి లేచి పెరటి ద్వారం వైపు వెడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో రైతు స్వింగ్ డోర్ తెరుచుకుని ‘కలెక్టర్ దొరగారెక్కడ?’ అని అడిగాడు. తాను అడుగుతున్నది సాక్షాత్తు కలెక్టర్ నే అని అతడికి తెలియదు. హషీం ఆలీగారు ఏమాత్రం నొచ్చుకోకుండా, అతడిని కూర్చోబెట్టి విషయం తెలుసుకుని సమస్యను పరిష్కరించే విషయంలో తన కింది సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి పంపేశారు.

ఆ రోజుల్లో ఖమ్మం మొత్తంలో రెండే రెండు గవర్నమెంటు స్కూళ్ళు. ఒకటి నేను  చేరిన రిక్కబజార్ హైస్కూలు. రెండోది రైల్వే స్టేషన్ దాటి వెళ్ళిన తర్వాత ప్రభాత్ టాకీసు దగ్గర అనుకుంటా, మల్టీ పర్పస్ హైస్కూలు. ఇలాంటి పేరు వినడం నాకు మొదటిసారి. అక్కడ మా అక్కయ్య కొడుకు కౌటూరి దుర్గాప్రసాద్ చదివేవాడు. ఇక రిక్కా బజార్ స్కూలు మామిళ్ళ గూడెం లోనే వుండేది. మా అన్నయ్య ఇంటి నుంచి నడక దూరం. వెళ్ళే దారిలో ఎడమవైపు మా మేనకోడలు విజయలక్ష్మి భర్త, తదనంతర కాలంలో తన తెలివితేటలతో రాణించి, ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా దశాబ్ద కాలానికి పైగా పనిచేసిన జ్వాలా నరసింహారావు తండ్రి కట్టించిన ఇల్లు. మా చుట్టపక్కాలు అందరికి ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల్లో ఆస్తులు వున్నాయి. పిల్లల చదువుల కోసం వారిలో చాలామంది ఖమ్మంలో సొంత ఇండ్లు కట్టుకున్నారు. అలాగే వనం వారి కృష్ణాపురానికి చెందిన వనం శ్రీనివాసరావు గారు కూడా మామిళ్ళగూడెంలో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని ఒక వాటా అద్దెకు ఇచ్చి మరో వాటాలో పిల్లలు వుండి  చదువుకునే వీలు కల్పించారు. అప్పటికి జ్వాలాతో స్కూలు స్నేహమే కానీ బంధుత్వం ఏర్పడలేదు. మా అందరికీ గురువుగారైన కేఎల్ నరసింహారావు గారు చాలాకాలం జ్వాలా వాళ్ళ ఇంట్లోనే అద్దెకు వున్నారు. కోటు, టై తో ఇంగ్లీష్ సినిమాల్లో రిచర్డ్ బర్టన్ లా వుండేవారు. ఆ ఇంటిపక్కనే ఖమ్మం మూసీ అని చెప్పుకునే ఓ మురికి కాలువ పారుతుండేది. మామూలు రోజుల్లో పెద్దగా నీళ్ళు ఉండేవి కావు. మధ్యమధ్యలో వున్న బండరాళ్ళపై కాళ్ళు పెట్టి ముక్కు మూసుకుంటూ కాలువ దాటే వాళ్ళం. వర్షాకాలంలో మాత్రం కాలువలో నీటి ఉధృతి బాగా వుండేది. వరద తీసేదాకా పిల్లలం దాన్ని దాటడం ఇబ్బందిగానే వుండేది. 

రికాబ్ బజార్ స్కూలు కొంత భాగం పెంకుటిల్లు, కొంత భాగం తరగతులకోసం వేసిన షెడ్లు. బెజవాడలో నేను చదువుకున్న సీవీఆర్ స్కూలుకి, దీనికి పోలికే లేదు. మాస్టార్లు కొత్త, స్నేహితులు కొత్త. అక్కడ మాస్టారు గారూ అనేవాళ్ళం. ఇక్కడ అందరూ సారూ సారూ అంటున్నారు. అక్కడేమో భీమారావు మాస్టారు. ఇక్కడేమో వెంకటేశ్వర్లు సారు. ఇలా అన్నీ తేడాలే కనిపించేవి కొత్తల్లో. అయితే తేడా కనపడని విషయం ఒకటి కనిపెట్టాను. చదువులో ఫస్ట్ వాళ్ళు చాలామంది వున్నారు.  లాస్ట్ నుంచి ఫస్ట్ మళ్ళీ నేనే. రిక్కా బజారు స్కూల్లో నా క్లాస్ మేట్స్ లో అన్ని రకాల వాళ్ళు వున్నారు. బాగా చదివి ఫస్ట్ మార్కులు తెచ్చుకునే జ్వాలా, ఎల్.వీ.ఆర్.ఎస్. శర్మ, సయీద్ రహమాన్, అబ్దుల్ రహమాన్, ఏమ్వీ కే హెచ్ ప్రసాద్, జూపూడి హనుమంత రావు, వనం వరదారావు  అత్తెసరు మార్కులు తెచ్చుకునే గుర్రం రామ్మోహన్, జూపూడి ప్రసాద్, నా బోటి వారు, పరీక్ష రాసే బెంచిపై  కత్తి పెట్టుకుని, దర్జాగా కాపీ కొట్టి పాసయ్యే నవాబ్,  ధర్మా, చీనా వంటి రౌడీ రకం, అల్లరిచిల్లరగా తిరిగే బ్యాచ్ ఇంకోటి. నానా గోత్రభ్యః అన్నట్టు వుండేది మా తొమ్మిదో తరగతి సెక్షన్. ఇక శర్మ గయ నుంచి జ్వాలాకు ఎన్నో ఏళ్ల తరువాత రాసిన ఉత్తరంలో పేర్కొన్నట్టు, మా అయ్యవార్లు అంటే సార్లు, చిన్ని రామారావు గారు, కొందరికి మాత్రమే విడమరచి చెప్పి మిగతా వాళ్ళను కసురుకునే వెంకట్రామారెడ్డి సారు, ‘వనజభవుండు నిన్నొసట...’ అంటూ చెప్పే తెలుగు సారు అయ్యదేవర రామచంద్ర రావు గారు, చిన్ని రామారావుగారు,  వీరభద్రం గారు, అవధాని గారు,  రసూల్ సారు, ఇన్ని రకాల మందలతో వేగుతుండేవారు. 

అయితే  అందరిలో జ్వాలా తీరే ప్రత్యేకం. పెద్దగా చదువుతున్నట్టు కనబడేవాడు కాదు. కానీ పరీక్షల సమయానికి చక్కగా సిద్ధం అయ్యేవాడు. మార్కులు బాగా తెచ్చుకునే వాడు. టీచర్లకు కూడా ఆయన అంటే ఇష్టం.  అదేమి  చిత్రమో తెలియదు.  ఆయన స్నేహితులందరూ, వనం నరసింగ రావు, ఆయన తమ్ముడు  వనం రంగారావు (ఇప్పుడు లేరు) వయసులో పెద్దవాళ్లు కూడా. వాళ్ళ ముచ్చట్లు కూడా ఒక పట్టాన అర్ధం అయ్యేవి కావు. వాళ్ళ ఊరి రాజకీయాలు, కాలేజీ రాజకీయాలు. లేదా క్రికెట్ కబుర్లు. వాళ్ళ ఇంటి పక్క ఖాళీ స్థలంలో ఆడితే క్రికెట్టు, లేదా ఫుట్ బాల్. క్రికెట్ గురించి, ఆ ఆటలో వాడే ఇంగ్లీష్ పదాలు గురించి ఏమీ తెలియదు కనుక, నేను అప్పుడప్పుడు కాసేపు ఫుట్ బాల్ ఆడేవాడిని. మామిళ్ళ గూడెం క్రికెట్ క్లబ్ పేరుతొ ఒక టీం వుండేది. దానికి వనం రంగారావు (వనం గీత భర్త)  అనే ఓ దూరపు చుట్టం కెప్టెన్. అయితే ఈ మొత్తం కార్యకలాపాలకి జ్వాలా ఇల్లు కేంద్రం. అంచేత అన్నిట్లో ఆయన మాటే చెల్లుబడి అయ్యేది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు చిన్ననాటి నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉండేవి. తను అనుకున్నది చేసేవాడు. లేదా అదే పని ఇతరులచేత చేయించేవాడు. ఫలితంగా పురుడు పోసుకుంది లిల్లీ పుట్ పార్టీ. ఆ పార్టీ  తరపున స్కూలు ఎన్నికల్లో నన్ను ఒప్పించి పోటీకి నిలబెట్టాడు.  జూపూడి ప్రసాద్, జూపూడి హనుమంత రావు, ఎల్.వీ.ఆర్.ఎస్. శర్మ జమలాపురం రామచంద్రం, కందిబండ రామ్మోహన్ రావు, రామబ్రహ్మం, అందరం చిన్న ఆకారాల వాళ్ళమే. అందుకే మా పార్టీకి మేము పెట్టని పేరు లిల్లీ పుట్ పార్టీ. ఒక స్కూలు ఎన్నికలకు గోడలమీద నినాదాలు రాయడం మాతోనే మొదలయింది అనుకుంటా. ప్రచారం హడావిడిగానే జరిగింది కానీ ఫలితం వేరేగా వచ్చింది. గెలవడం అంటే ఏమిటో, ఓడడం అంటే ఏమిటో తెలియని వయసు కనుక పెద్దగా బాధ పడ్డది లేదు.

సో, ఖమ్మంలో నా చదువు ఓటమితో మొదలయింది. అదే కంటిన్యూ అయింది.

కింది ఫోటో:

చిన్నప్పుడు ఫోటో అంటేనే  తెలియదు కనుక అప్పటి ఫోటోలు లేవు. అంచేత  పెద్దయిన తర్వాత జ్వాలా నేనూ.



(ఇంకావుంది)

9, డిసెంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (33) - భండారు శ్రీనివాసరావు

 


ఖమ్మం

అప్పటికి నేను చూసిన రైల్వే స్టేషన్లలో బెజవాడ చాలా పెద్దది. తరువాత ఖమ్మం. ఆ రోజుల్లో ఒకటే ప్లాట్ ఫారం.  దానికి రెండు చివర్లో , మధ్యలో రెండు చోట్లా సిమెంటుతో పోతపోసిన బోర్డులపై పసుపు రంగు మీద ఖమ్మా మెట్ అని నల్లటి అక్షరాలతో స్టేషన్ పేరు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు  మూడు భాషల్లో రాసివుండేది. తరువాత చాలాకాలానికి ఖమ్మం అని మార్చారు. ఊళ్ళో షాపులమీద కూడా ఖమ్మంమెట్టు అనే పేరే వుండేది. కాలక్రమంలో ఖమ్మం అయింది. ప్లాట్ ఫారం ఒకవైపు నుంచి రైలుకట్ట మీద నడుచుకుంటూ పొతే, రైల్వే గేటు, దాన్ని దాటి ముందుకు పొతే, కట్ట కింద కాలిబాట, మామిడి తోపు, దాన్ని దాటుకుని లోపలకు వెడితే మా ఇద్దరు బావగార్ల ఇళ్ళ నడుమ మట్టి రోడ్డు. దాన్ని మామిళ్ళ గూడెం అనే వాళ్ళు. బహుశా మామిడి తోపు కారణంగా ఆ పేరు వచ్చిందేమో.

అదే స్టేషన్ లోకి వెళ్లి బయటకు వస్తే రోడ్డు మార్గం. రిక్షాల మీద ఇళ్లకు వెళ్ళే వాళ్ళు ఆ దోవగుండా కంకర రాళ్లు తేలిన మార్గంలో మామిళ్ళ గూడెం వచ్చేవాళ్ళు. వల్లభి గ్రామ కాపురస్తులు అయిన   మా పెద్ద బావగారు రామారావు గారు, పిల్లల చదువులకోసం ఖమ్మంలో స్థలం కొని ఇల్లు కట్టారు. గృహ ప్రవేశం చూడడం నాకు అదే మొదటిసారి. పెంకుటిల్లు, గిలాబు చేయని డాబాలు తప్ప వేరే ఇంటి నిర్మాణాలు ఎరుగని చిన్నతనం. పెద్ద బావగారు కొన్న స్థలంలో  ముందూ వెనుకా జాగా వదిలి మేడ కట్టుకున్నారు. ముందు ఒక గది, దాన్ని ఆనుకుని వరండా, పక్కన మరో గది, లోపల విశాలమైన హాలు, రెండు పక్కలా రెండు గదులు, వంటహాలు, వెనుక మరో వంట ఇల్లు, ఆనుకుని బావి, పెరడు, లెట్రిన్ వగైరా, ఇంటి ముందు నుంచి పైకి మెట్లు, చుట్టూ ప్రహరీ. హంగామాగానే వుండేది. తలుపులకు రంగులు, కిటికీలకు అదో రకమైన రంగుల అద్దాలు. గమ్మత్తుగా వుండేది. ఇంటి ముందు జేగురు రంగులో వున్న సిమెంటు బెంచి. అప్పటికి కరెంటు సౌకర్యం వచ్చింది. పై కప్పు నుంచి వేలాడదీసిన కరెంటు వైరుకు డోములో అమర్చిన బల్బ్. ఇంటి మొత్తం మీద ఒక సీలింగు ఫ్యాను. అవసరమైన చోట పెట్టుకోవడానికి ఒక టేబుల్ ఫ్యాన్.   మెయిన్ గేటుకు రెండు పెద్ద తలుపులు. . దీన్ని పాటక్ అనేవారని గుర్తు. ప్రతిసారీ వాటిని తెరిచే తీసే అవసరం లేకుండా మనుషులు లోపలకు రావడానికి, వెళ్ళడానికి ఒక చిన్న తలుపుతో ఏర్పాటు. ప్రతి ఇంటికి ఈ ఏర్పాటు వుండేది.

ఆ ఇంటికి అనుకునే మా రెండో బావగారు కొలిపాక రామచంద్రరావుగారి ఇల్లు. వాళ్ళదీ ఇలాంటి మేడే. కాకపోతే ఇంటి ముందు జాగా తక్కువ. వెనుక వైపు పెరడు చాలా  పెద్దది. ఆ ఇంటి పక్కనే ఆయన తమ్ముడు ఆనందరావు బావ ఇల్లు. కొద్ది కాలం తరువాత , బ్రాహ్మణ బజారులో అద్దె ఇంట్లో ఉంటున్న మా  నాలుగో బావగారు, లాయరు కౌటూరి కృష్ణమూర్తిగారు, రామారావు బావ ఇంటి పక్కనే పెద్ద జాగా కొనుక్కుని విశాలమైన ఇల్లు కట్టుకున్నాడు. ఆయన పక్కన కొండపల్లి వాళ్ళ ఇల్లు. సినిమా దర్శకుడు దశరథ్ నాన్న కొండపల్లి రఘురాం రిక్కా బజార్ స్కూల్లో నా క్లాస్ మేట్. రాముడి కొడుకు దశరధుడు అని సరదాగా అంటుండేవారు.

మా బావగార్ల ఇళ్లకు వెళ్ళే దారిలో అప్పటికి సరైన రోడ్డు లేదు. మధ్యలో చిన్న చిన్న రాతి గుట్టలు. రోడ్డుపక్కన దీప స్తంభాలు. ప్రతి రోజూ సాయంత్రం వేళల్లో మునిసిపల్ సిబ్బంది వచ్చి కిరోసిన్ దీపాలు వెలిగించేవాళ్లు. కొంతకాలానికి కరెంటు దీపాలు, రాతి గుట్టలని తొలగించి రోడ్డు వేశారు. కరెంటు రావడంతో  వీధి దీపాలు వచ్చాయి. ఒక ఫేజు సరఫరా కారణంగా గుడ్డిగా వెలిగేవి. ఇళ్ళల్లో బల్బుల పరిస్థితి కూడా అంతే. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి.

మా బావగార్ల ఇళ్ళు దాటగానే ఒక మోరీ, ఒకటి రెండు ఇళ్ళు ఉండేవి. తర్వాత ఊరే లేదు. కాలిబాటల్లో నడుచుకుంటూ వెడితే  బురాన్ పురం విసిరేసినట్టు వుండేది. మధ్యల్లో అక్కడక్కడా ఒకటి రెండు ఇళ్లు కనిపించేవి. రావులపాటి సత్యనారాయణ రావు గారు (మాజీ ఐజీ, రచయిత రావులపాటి సీతారామారావు గారి తండ్రి) రావులపాటి జానకి రామారావుగారు (పీయూసీలో నా క్లాస్ మేట్ డాక్టర్ రావులపాటి గోపాలకృష్ణ తండ్రి) అక్కడ వుండేవారు. వారివి కూడా చాలా విశాలమైన గృహాలే.

మా అన్నయ్య పర్వతాల రావు గారు ఒక బజారు ఇవతల మామిళ్ళగూడెంలోనే కేశవరావు గారి ఇంటిలో ఒక పోర్షన్ లో అద్దెకు వుండేవాడు. పక్కన మరో పోర్షన్ లో నా క్లాస్ మేట్ జమలాపురం రామచంద్రరావు తండ్రి వెంకటేశ్వర రావు గారు కాపురం వుండేవారు. ఆయన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ . చాలా హుందాగా, చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపించేలా వుండేవారు. ఇక రామచంద్రం చేతి వ్రాత ముత్య్ల్లాల కోవ. మళ్ళీ అంత చక్కటి చేతిరాతను నేను చూడాలేదు.  

మా అన్నయ్యది మూడుగదులు వరుసగా వుండే వాటా. మూడు గదులు పేరే కాని మొదటి గది ఇనుప తీగెల జాలీ ఉన్న గది. మధ్యది పడక గది. చివరిది వంటిల్లు. ముందు పక్కనా పెద్ద ఖాళీ జాగా. డీపీఆర్వో గా మా అన్నయ్యకు ప్రభుత్వ వాహనం, ఒక పెద్ద వ్యాను వుండేది. దాన్ని ఆ జాగాలో పార్క్ చేసేవారు. ఆ వ్యానులో ప్రొజెక్టరు, డాక్యుమెంటరీ రీలు డబ్బాలు, తెర ఉండేవి. నెలకోసారి ఒక్కో వూరికి వెళ్లి  సినిమాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు తెలిపే డాక్యుమెంటరీలు వేసేవాళ్ళు. మా అన్నయ్య వెంట రుద్రవరం వెంకటేశ్వర్లు గారని ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హమేషా వుండేవారు. ఆ రోజుల్లో ప్రజల్లో పొదుపు అలవాటుని ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాలో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజర్ అని ఒక అధికారి వుండేవారు. రుద్రవరం గారిది ఆ ఉద్యోగం. స్వయంగా కవి, రచయిత అయిన వెంకటేశ్వర్లు గారు మా అన్నయ్యకు చక్కని స్నేహం కుదిరింది. వారిద్దరూ కలిసి అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు చక్కని ప్రచార పత్రాలను తయారు చేసేవారు. వీరికి సింగ్ మాస్టారు అనే ఆర్టిస్ట్ జత కలిసారు. సింగ్ శారు మా ఇంటికి అయిదు ఇళ్ళ అవతల వుండేవారు. అన్నయ్య సూచనల మేరకు  వెంకటేశ్వర్లు గారు   రాయడం, సింగ్ సారు బొమ్మలు గీయడం. అంతా మాకు తమాషాగా, సరదాగా వుండేది. బెజవాడలో మా బావగారు మా చదువు పట్ల శ్రద్ధతో మాటూ కఠినంగా వుండేవారు. మా అన్నయ్యది ఉదారతత్వం. ఒకరు చెప్పకుండా ఆయన జీవితంలో పైకి వచ్చారు. అలానే నేను కూడా మా అంతట మేమే మా బాగోగులు చూసుకోవాలని భావించేవారు. జీవితంలో చదువుతో పాటు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయనేది మా అన్నయ్య అభిప్రాయం. ఈ వ్యవహార శైలిని నేను వేరే విధంగా అర్ధం చేసుకున్నాను. స్వేచ్ఛకు నా సొంత నిర్వచనం చెప్పుకుని గాడి తప్పాను. నేను ఖమ్మం రాగానే మా అన్నయ్య నా చేతికి పది రూపాయలు ఇచ్చి, స్టేషన్ బజారుకు వెళ్లి  చెప్పులు కొనుక్కోమని చెప్పాడు. అంతవరకూ కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు. సంతోషంగా ఎగురుకుంటూ వెళ్లి ఒక జత హవాయి చెప్పులు కొన్నాను. వాటి మీద నాకెంత మోజంటే, బెజవాడ అలంకార్ టాకీసు సెంటర్లో రెండు చెప్పుల షాపులు, బాటా, కరోనా వుండేవి. అద్దాల బీరువాలో అనేక హవాయి చెప్పులు కనబడుతుండేవి. మేము పిల్లలం అటు వెళ్ళినప్పుడల్లా ఆ షాపుల ముందు నిలుచుని అద్దాల అలమరాల్లోని చెప్పులని అదేపనిగా చూస్తుండే వాళ్ళం. ఆ రోజుల్లో కొత్తగా బాటా కంపెనీ వాళ్ళు బాటా శాండక్ (?) అనే  పేరుతొ హవాయి మోడల్ చెప్పులు మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ రోజుల్లో కొత్త మోడల్ ఐ ఫోన్ కి వున్న గిరాకీ అప్పుడు  ఆ బాటా చెప్పులకి వుండేది. విరగబడి కొనుక్కునేవారు.

మొదటిసారి జీవితంలో నా  చెప్పుల సరదా మా అన్నయ్య  పుణ్యమా అని ఆ రోజు  తీరింది. చెప్పులకు రెక్కలు వచ్చినట్టు గాలిలో తేలుతూ ఇంటికి చేరాను.

కింది ఫోటో :

ఖమ్మం రైల్వే స్టేషన్ (Courtesy Google)



(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (32) - భండారు శ్రీనివాసరావు

 


 

దాశరధి గారిని మొదటిసారి చూసినప్పుడు నాకు ఆయనే దాశరధి అని తెలవదు.

పట్నం కాబట్టి, మా బావగారు పెద్ద వకీలు కాబట్టి అనేక పనుల మీద అనేకమంది బెజవాడ  వచ్చి పోతుండేవాళ్ళు. హోటళ్ళలో విడిది చేసే అలవాట్లు అప్పటికి రాలేదు. తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లోనే మకాము, భోజనం కూడా. ఆ విధంగా, గవర్నర్ పేటలోని మా బావగారిల్లు ఒక సత్రం మాదిరిగా వుండేది.

ఒక రోజు పొద్దున్నే లేచి పక్కబట్టలు మడత పెడుతుంటే, వరండాలో గోడపక్కన పొడుగుబల్ల మీద పడుకుని ఒక పొట్టి మనిషి నిద్రపోతూ కనిపించాడు.  రాత్రి ఏదో రైలుకు వచ్చి పడుకున్నట్టున్నారు. తరువాత మా అక్కయ్య చెబితే తెలిసింది ఆయన దాశరధి అని. అప్పటికే మద్రాసులో సినిమాలకు పాటలు రాస్తున్నారట.

దాశరధి గారు పనులు చక్కబెట్టుకుని వెడుతూ వెడుతూ తను రాసిన కొన్ని పుస్తకాలు మా బావగారికి ఇచ్చి వెళ్ళారు. అప్పుడే ఆయన రచయిత అని కూడా తెలిసింది.  ఆ తరువాత ఎన్నో ఏళ్ల తరవాత నేను రేడియోలో చేరిన తర్వాత ఒక సందర్భంలో హైదర్ గూడాలో దాశరధి గారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంటుకు వెళ్లాను. సినీ ప్రముఖుడు ఒకరు మరణిస్తే సంతాప సందేశం రికార్డు చేయడానికి వెళ్ళిన గుర్తు. ఆయన ఎంత సాదాసీదాగా వుంటారో, ఆయన ఇల్లు కూడా అంతే సాదాసీదాగా వుంది. ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా నేను వెళ్ళిన పని పూర్తి చేయించి పంపడం ఆయన సంస్కారం.

అలాగే సినీ నటుడు రామన్న పంతులు గారితో అలాగే పరిచయం. ఒకప్పుడు ఆయనగారు కూడా బెజవాడలో ప్లీడరే. తరువాత మద్రాసు వెళ్లి చాలా సినిమాల్లో నటించారు. వాటిల్లో ఎన్టీఆర్ గిరీశం గా నటించిన కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లుగా వేషం వేశారు. బాపూ తీసిన బంగారు పిచిక సినిమాలో రామన్న పంతులు గారు, భార్యా విధేయుడిగా  ప్రధాన పాత్ర పోషించారు. రామన్న పంతులు గారి మనుమడే జంధ్యాల దర్శకుడిగా తీసిన మొదటి చిత్రంలో హీరో. చిత్రమైన విషయం ఏమిటంటే రామన్న పంతులు గారి మనుమడు ప్రదీప్ కూడా భార్యా విధేయుడిగా ఇటీవల ఒక సినిమాలో ‘అంతేగా అంతేగా’  అంటూ ప్రేక్షకులని అలరించారు. జంధ్యాల మద్రాసు వెళ్లి స్క్రిప్ట్ రైటర్ గా మొట్టమొదట సినిమా కెరీర్ మొదలు పెట్టిన రోజుల్లో నేనొకసారి మద్రాసులో ప్రదీప్ గారిని చూశాను. అప్పటికి ఆయన సినిమాల్లో వేయడం మొదలు కాలేదు. తిరిగి వారిని కూడా హైదరాబాదు ఆలిండియా రేడియోలో చేరిన తరవాతనే ఒకటిరెండు సార్లు కలుసుకున్నాను. ప్రదీప్ భార్య  శ్రీమతి సరస్వతి గారు కూడా దూరదర్శన్ లో యాంకర్/ అనౌన్సర్ గా తాత్కాలికంగా కొన్నేళ్ళు పనిచేసి పేరు తెచ్చుకున్నారు.

తన తాతగారు రామన్న పంతులు గారి గురించి నటుడు ప్రదీప్ ఇలా చెప్పారు.

 

వీళ్ళమ్మా శిఖతరగ, ప్రతి గాడిద కొడుకు తిండిపోతుల్లా నా యింట జేరి నన్ననేవాళ్ళే”. “తాంబూలం యిచ్చేసాను. యిహ తన్నుకు చావండి” లాంటి సంభాషణ తెలుగు వారు మరచిపోలేరు. గురజాడ గారు కన్యాశుల్కంలో ఆ మాట చెప్పిస్తారు. కన్యాశుల్కం నాటకం గానీ, సినిమా గానీ చూసిన వారికి ఆ మాట గుర్తుండిపోతుంది. అందుకు గల కారణం ఆ పాత్ర యొక్క అద్భుతమైన అభినయం. ఆ స్వరం, ఆ రౌద్రం ప్రత్యేకం. ఆ నటుడి పేరు విన్నకోట రామన్న పంతులు. నటులు శాశ్వతం కాదు. నటన అజరామరం.

రంగస్థలం, సినిమా రంగం, ఆకాశవాణి నటులు,  ప్రయోక్త, రూపశిల్పి, మార్గదర్శి, బహుముఖ ప్రజ్ఞాశాలి విన్నకోట రామన్న పంతులు గారు. తన 62 ఏళ్ళ జీవితంలో 40 సంవత్సరాలు నాటకరంగానికి, కళాకారులని తీర్చి దిద్దడానికి, మేకప్ వేయడానికి, నాటకంలో కర్టెన్లు కట్టడానికి వెచ్చించారు. తన ఇంటినే రిహార్సల్ గదిలా మార్చేశారు. విన్నకోట గారు  దర్శకత్వం వహించిన నాటకాలలో నటించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటులు ఎందరో ఉన్నారు. రామచంద్ర కాశ్యప, ఏ.ఆర్.కృష్ణ, నిర్మలమ్మ, మురళీ మోహన్, అన్నపూర్ణ, వీరభద్ర రావు, సుబ్బరాయ శర్మ, జంధ్యాల వంటి వారు ఈ జాబితాలోకే వస్తారు”

రామన్న పంతులు గారి కుమారుడు విన్నకోట విజయ్ రాం కూడా నటుడే. జంధ్యాల దర్సకత్వంలో కొన్ని సినిమాలలో హాస్య పాత్రలు పోషించారు. దురదృష్టం తన ప్రతిభను పూర్తిగా నిరూపించుకోవడానికి అవకాశం లేకుండా చిన్నవయసులోనే చనిపోయాడు.  

   

మా బావగారింటికి ఆదివారం నాడు కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడానికి చాలా మంది లాయర్ స్నేహితులు వస్తుండేవాళ్ళు. కీసర నరసింహారావుగారు, (వీరి పిల్లలు, ఒకడు  వేదాద్రి  తదనంతర కాలంలో పెనుగంచి ప్రోలులో స్థిరపడి అక్కడ అయ్యప్ప స్వామి పెద్దస్వామిగా ఒక వెలుగు వెలిగి అక్కడే కన్నుమూశాడు. మరో కుమారుడు మూర్తి సెంట్రల్ ఇంటలిజెన్స్ బ్యూరోలో అధికారిగా పదవీ విరమణ చేశాడు) మోగులూరు వెంకటేశ్వర రావు గారు,  కొన్నాళ్ళు మద్రాసులో వుండి, కొన్ని సినిమాల్లో వేసి తిరిగి బెజవాడ వచ్చిన రామన్న పంతులు గారు, రామచంద్ర కాశ్యప గారు, అడ్డంకి శ్రీరామ మూర్తి గారు, చింతలపాటి శివరామ కృష్ణ గారు,   బంగారప్పన్ను లాయరు గారు, మా క్లాస్ మేట్ దశరధరాం తండ్రి లక్కావజ్జల నారాయణ మూర్తిగారు ఇలా చాలామంది వచ్చేవాళ్ళు. మధ్య హాల్లో కుర్చీలు, బల్ల ఒక పక్కకు జరిపి, వాళ్ళు వచ్చే సమయానికి కింద జంపఖానా పరచి సిద్ధం చేసేవాళ్ళం. మా అక్కయ్య అడపాదడపా చిన్న స్టెయిన్ లెస్ స్టీల్ గ్లాసుల్లో టీలు పంపేది. మేము అందిస్తుండేవాళ్ళం.  వాళ్ళలో కొందరికి సిగరెట్లు అవసరం అయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి జైహింద్ టాకీసు కార్నర్లో ఉన్న రెడ్డి కిళ్ళీ షాపులో కొని తెచ్చి ఇచ్చేవాళ్ళం. కొందరు బర్కిలీ, కొందరు పాసింగ్ షో, కొందరు చార్మినార్. మాకు పాసింగ్ షో సిగరెట్టు పెట్టె నచ్చేది. దానిమీద ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్న మనిషి బొమ్మవుండేది. రెడ్ విల్స్ అప్పుడు వున్నట్టు లేదు. మార్కోపోలో వుండేది కానీ, అది తాగేవాళ్లు తక్కువ. చాలా ఖరీదు. అది తాగేవాళ్ళ పక్కన నిలుచుంటే కమ్మటి వాసన వచ్చేది, జర్దా కిళ్ళీ లాగా.

పెద్ద వాళ్ళ ఆటలు అయిపోగానే ఖాళీ అయిన సిగరెట్ పెట్టెల కోసం పోటీపడే వాళ్ళం. వాటితో బచ్చాలు ఆడుకోవచ్చని.

ఇలా రోజులు గడుస్తున్న రోజుల్లో మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారికి  ఖమ్మంలో జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఉద్యోగం వచ్చింది. అప్పటికే నా భారం మోస్తున్న బావగారి భారాన్ని తగ్గించడానికి నన్ను ఖమ్మం స్కూల్లో చేర్చడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా సీవీఆర్ హైస్కూలు నుంచి టీసీ సర్టిఫికేట్. ఖమ్మం రిక్కా బజార్ గవర్నమెంట్  స్కూల్లో తొమ్మిదో తరగతిలో అడ్మిషన్.

ఆంధ్రా ప్రాంతంలో ఎస్.ఎస్.ఎల్.సి. తెలంగాణాలో హెచ్ ఎస్ సీ.  ఆంద్రాలో ఇంటర్ మీడియెట్, తెలంగాణా ప్రాంతంలో పీయూసీ (ప్రీ యూనివర్సిటీ)

ఈ గోలలు ఏవీ అర్ధం కాని నేను హాయిగా ఖమ్మం వచ్చేశాను.

నా చదువు మరో రూపం సంతరించుకుంటుందని నాకప్పుడు తెలియదు.   

 

కింది ఫోటోలు:


(ఒకనాటి  ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ గవర్నర్  కుముద్ బెన్ జోషీతో దాశరధి కృష్ణమాచార్య, మా బావగార్లు అయితరాజు రామారావు, కొలిపాక రామచంద్ర రావు 



కన్యాశుల్కం లో అగ్నిహోత్రావధానిగా విన్నకోట రామన్న పంతులు గారు 



ముద్దమందారం హీరో ప్రదీప్ 



 




 

(ఇంకా వుంది)