2, ఏప్రిల్ 2022, శనివారం
పదవులు ఊరికే రావు – భండారు శ్రీనివాసరావు
ఏడాదిలో పెరిగిన నా సంపాదన - భండారు శ్రీనివాసరావు
‘ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమంటూ టైప్ చేస్తుంటారు, గూడలు అరిగిపోయేలా?’ (ఏమిటి ఉపయోగం? కూటికా! గుడ్డకా! సినిమాకా!) అనేది నా భార్య బతికున్న రోజుల్లో. బ్రాకెట్లో రాసినవి నా సొంత కపిత్వం.
రిటైర్ అయిన తర్వాత నేను రాస్తూ వచ్చిన
వ్యాసాలను కొన్ని పత్రికల వాళ్ళు వేస్తూ వచ్చారు
కానీ రచయితకు విదిలించింది ఏమీ లేదు. ఎక్కడో అక్కడ నేను రాసిన అక్షరాలకు నలుపూ
తెలుపూ రంగులు అంటుతున్నాయి కదా అని నేనూ పట్టించుకోలేదు.
పొతే, నా బ్లాగుకు
హిట్లు అన్ని లక్షలు అని చంకలు కొట్టుకోవడం తప్పిస్తే దాని రాతలవల్ల నాకు
అంటుకున్నవి మెడ నొప్పులు, గూడ నొప్పులు మాత్రమే.
కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా
అన్నయ్య కుమారుడు సత్య సాయి కష్టపడి నా బ్లాగును Google Adsense తో అనుసంధానం చేశాడు. పాత వాటిని ఆ సంస్థ లెక్కలోకి తీసుకోదట. పోనీలే
అనుకున్నాను.
నిన్ననో మొన్ననో చూస్తే రెండు అమెరికన్
డాలర్లు నా ఖాతాలో పడ్డట్టు కనిపించింది. అవి నా బ్యాంకు ఖాతాకు చేరి, జీ ఎస్ టి పోను ఎంత మిగులుతుందో అది నాకనవసరం.
డెబ్బయి అయిదేళ్ళ వయసులో నా రాతల
ద్వారా నేను రెండు డాలర్లు సంపాదించాను, అంతే
నాకు కావాల్సింది.
నా భార్య బతికి వుంటే, నేనో మిలియన్ డాలర్లు సంపాదించినంత సంతోషపడి వుండేది.
మొగుడనే వాడు ప్రయోజకుడు కావడాన్ని
మించి ఏ భార్యకు అయినా సంతృప్తి ఏముంటుంది?
ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నా
మనుమరాళ్లకు నా డబ్బులతో చిన్న చాకలేట్ కొనివ్వగలను అనే ఊహే నాకు ఆనందాన్ని
ఇస్తోంది.
(02-04-2021)
తోకటపా:
ఏడాది క్రితం రెండు డాలర్లు. ఈ ఏడాదిలో పిల్లలు పెట్టినట్టున్నది. ఈరోజు చూస్తే ఆ
మొత్తం అక్షరాలా ఇరవై ఏడున్నర అమెరికన్ డాలర్లకు పెరిగింది. ఇప్పటి మార్కెట్ రేటు
ప్రకారం 2088 రూపాయలు (ట)
(02-04-2022)
1, ఏప్రిల్ 2022, శుక్రవారం
లీకు వీరులు – భండారు శ్రీనివాసరావు
ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్
ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు తటపటాయించాను.
కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్
ముందు కూర్చొన్నాను.
ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి నిజానికి లీకులే.
పొగడ్తలతో కూడిన గొప్ప వార్తలు, వ్యాసాలు రాయడానికి చాలామంది వుంటారు.
రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని కట్టుడు కధలు పత్రికల్లో/ మీడియాలో రావడం వాళ్లకి
ప్రధానం.
అయితే ఈ కధనాలు వాళ్ళు చెప్పినట్టే
రావాలి కానీ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడా బయటకి రాకూడదు. అలా బయటకు వచ్చిన లీకులపై
విస్తృతంగా చర్చ జరిగిన పిమ్మట ‘ఆ వార్తలు మీడియా సృష్టి, నాకేమీ సంబంధం లేదు’ అని ఖండన ఇచ్చుకునే విధంగా వుండాలి. అలా అని ఆ వార్తలో
పూర్తిగా నిజం వుండకూడదనీ కాదు. అలా అని అసలు
నిజం లేదనీ కాదు. ఆ లీకు వీరుడి పేరు ఎటువంటి
పరిస్థితుల్లో వెల్లడి కారాదు. (సోర్స్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు’ అనే unwritten హక్కు గురించి మాట్లాడేది ఇలాంటి
సందర్భాలలోనే). ఇన్ని షరతులతో లీకులు బయటకి వస్తాయి కాబట్టే వాటికి అంతటి డిమాండ్.
ఇంతకీ ఈ లీకులు ఏమిటి? ఎలా పురుడు పోసుకుంటాయి?
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే
ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించేరోజుల్లో అధికార పక్షంలోని అసంతృప్తులే ఈ లీకుల్ని
విలేకరులకు ఉప్పందించేవారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వచ్చింది. తదనంతర కాలంలో ఇవి పతాక స్థాయికి చేరి
ఏది నిజమో ఏది అబద్ధమూ తెలియనంతగా మారిపోయి పాత్రికేయ ప్రమాణాలను, విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా విశ్వరూపం దాలుస్తున్నాయి.
ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పనిచేసే
పౌర సంబంధాల అధికారులు ఈ లీకు వ్యవహారాలను చూస్తుంటారు. అల్లాగే మంత్రుల దగ్గర
పనిచేసేవాళ్ళు.
ఒక ఉదాహరణ చెప్పుకుందాం.
ఓ ఉదయం, నేను
రేడియోలో చేరిన కొత్తల్లో అనుకుంటాను, (అప్పటికి
మీడియా విస్తృతి ఇంత లేదు. పత్రికలే రాజ్యం చేస్తున్నాయి, ఇప్పటికీ వాళ్ళదే రాజ్యం. అందుకే పలానా పత్రిక కావాలని రాసింది అని
రాజకీయులు అంటుంటారు. ప్రింటులో వచ్చే వార్త ఖచ్చితం అని నమ్మేవారు ఉండడమే ఇందుకు
కారణం) ఓ పత్రికా విలేకరికి ముఖ్యమంత్రి
కార్యాలయంలోని సోర్స్ నుంచి ఫోన్ వస్తుంది. సంభాషణ ఇలా నడుస్తుంది.
‘ఏమిటి సంగతులు ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా!’
‘మా దగ్గర వార్తలు ఏముంటాయి? మీరిస్తేనే
కదా మాకు వార్తలు’
‘అలా అంటావు కానీ మీరు రాసేవే మాకు వార్తలు. మొన్న చెప్పాను కదా! ఆయన ఆ
పెద్దాయన్ని కలిశాడు అంటున్నారు. నీకేమైనా తెలుసా?’
‘తెలియదే. ఎప్పుడు?’
‘నేనూ విన్నదే! కనుక్కోని చెప్పు’
ఇక అక్కడినుంచి ఆ విలేకరి పని
మొదలవుతుంది. ‘ఆయన’ అంటే ముఖ్యమంత్రి. మరి పెద్దాయన ఎవరు?
‘ఆయన’ డ్రైవర్ నెంబరుకు ఫోను చేశాడు. వీ ఐ పీ రాకపోకలు కనుక్కోవాలంటే
పోలీసులు, డ్రైవర్లను మించి విలేకరులకు మంచి
సోర్సు దొరకదు.
డ్రైవర్ దొరికాడు కానీ కావాల్సిన
సమాచారం రాలేదు. కాకపొతే ఓ విషయం చెప్పాడు. ఆ రోజు ‘ఆయన’ అధికారిక వాహనం కాకుండా
వేరే కారులో వెళ్ళిన మాట ధృవీకరించాడు. వెంట ఎవరు వెళ్లిందీ చెప్పాడు. ఆ వెంట
వెళ్ళిన వాళ్ళను పట్టుకుంటే ‘ఆ పెద్దాయన’ ఎవరో తెలిసింది.
ఇవన్నీ జరిగిన సంగతులు. తర్వాత
కావాల్సిన విధంగా మసాలాలు దట్టించి వార్తను
వండి వార్చడమే.
‘అధిష్టానంపై తిరుగుబాటుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి!’
‘కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ మంత్రిని రహస్యంగా కలుసుకుని చర్చలు
జరిపిన ముఖ్యమంత్రి’
ఇది హెడ్డింగు. అసలు వార్త అనేక
సోయగాలు అద్దుకుని అక్షరాల రూపంలో మర్నాడు పత్రికలో మొదటి పేజీలో దర్శనం ఇస్తుంది.
దానితో పాటే ముఖ్యమంత్రి కార్యాలయం
జారీ చేసిన ‘ఖండన’ ప్రకటన కూడా ఆ పత్రిక కార్యాలయానికి చేరుతుంది.
ఇతి వార్తాః
31, మార్చి 2022, గురువారం
ఐ.ఏ.ఎస్. అధికారులకు జైలు శిక్ష
వార్త: ఐ.ఏ.ఎస్. అధికారులకు జైలు శిక్ష
30, మార్చి 2022, బుధవారం
ఇడ్లీల గొప్పతనం ఇంతింత కాదయా!
ఈరోజు ఇడ్లీల దినోత్సవం అంటున్నారు. కాబట్టి ఒక కధ
చెప్పుకుందాం.
భారత దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు.
ఆ రోజుల్లో ఒక అయ్యరు గారు మద్రాసు నుంచి కలకత్తాకు
హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు.
తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది. ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి
రైల్వే వారు స్పెన్సర్ బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో
కడుపు నింపుకున్నారు. అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల
టిఫిన్ క్యారియర్ విప్పి అందులో ఒక గిన్నెలోని రెండు ఇడ్లీలు తీసి తినడం ఆ
ఆంగ్లేయుడు గమనించాడు. తెల్లగా, గుండ్రంగా ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత
ఆయనలో మొదలయింది. అయితే అడగడం మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు.
మధ్యాన్నానికల్లా రైలు వాల్తేరు చేరుకుంది. రైల్వే
వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు. అయ్యరు గారు రైల్వే
భోజనాన్ని మృదువుగా తిరస్కరించి తన క్యారియర్ తెరిచి రెండో గిన్నెలో వున్న మరో
రెండు ఇడ్లీలు కమ్మగా తినడం ఆ బ్రిటిష్ వ్యక్తి గమనిస్తూనే వున్నాడు. యెంత
ఆలోచించినా తోటి ప్రయాణీకుడు తింటున్నవేమిటి అనేది ఆయనకు అర్ధం కాలేదు. దాంతో ఆయన
ఉత్కంఠ మరింత పెరిగింది.
రైలు బెర్హంపూరులో ఆగింది. మళ్ళీ అదే సీను.
బ్రిటిషర్ ఇక తట్టుకోలేక నేరుగా అడిగేశాడు.
“అయ్యా! ఇలా అడగడం
మర్యాద కాదని తెలిసీ అడుగుతున్నాను. మీరు తింటున్న ఆ తెల్లటి పదార్ధాలను నేను
ఎప్పుడూ చూడలేదు. అవేమిటో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా వుంది”
అయ్యరు ఇలా జవాబిచ్చారు.
“ఇవి ఐ.క్యు.
టాబిలెట్స్. అర్ధం మీకు తెలుసుగా. మేధస్సు పెంచడానికి వీలైన పోషకాలు వీటిలో
వున్నాయి. వీటిని తిని, భోజనం
గట్రా ఏమీ లేకుండా మేము రోజులతరబడి వుండగలం”
“వీటిని ఎలా తయారు
చేస్తారు” బ్రిటిషర్ ఆరా.
అయ్యరు గారు ఇడ్లీలు తయారు చేయడానికి కావాల్సిన
సంభారాలు గురించీ, తయారు
చేసే విధానం గురించీ వివరంగా చెప్పారు.
“మంచి సంగతులు మీనుంచి
తెలుసుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతె నాకూ ఓ రెండు టాబ్ లెట్లు ఇవ్వగలరా! వూరికే
కాదు, మీరు
చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించుకుంటాను” అని ఆంగ్లేయుడు అభ్యర్ధించాడు.
అయ్యరు ఒక క్షణం ఆలోచించి చెప్పాడు.
“నా దగ్గర ఇంకా మూడే
మిగిలాయి. కలకత్తాలో నేను మా చుట్టాల ఇంటికి వెడుతున్నాను, కనుక నాకు ఇబ్బంది
లేదు. మీరే చెప్పారు కాబట్టి ఇడ్లీకి ఓ ఇరవై రూపాయల చొప్పున ఇవ్వండి చాలు”
బ్రిటిషర్ యెగిరి గంతేసినంత పనిచేసి అరవై రూపాయలు
అయ్యరుకు ఇచ్చి మూడు ఇడ్లీలు తీసుకుని తిన్నాడు.
మర్నాడు ఉదయానికల్లా హౌరా స్టేషన్ వచ్చింది.
రైలు దిగి ఎవరి దారిన వారు విడిపోయే సమయంలో బ్రిటిషర్
అడిగాడు. “ఈ టాబ్ లెట్లు తయారు చేసే విధానం చెప్పారు. అంతా చెప్పారా! ఏమైనా
మరచిపోయారా!”
“చెప్పేందుకు ఏమీ లేదు, అంతా వివరంగా
చెప్పాను”
“మరి ఈ టాబ్ లెట్ల
ఖరీదు అంత వుండకూడదే”
“చెప్పాను కదా ఇవి
మేధస్సును వికసింప చేసే ఐ.క్యు. ట్యాబ్ లెట్లని. మీరు మూడే తిన్నారు. రాత్రికి
ఇప్పటికీ మీలో యెంత తేడా వచ్చిందో చూడండి. అంటే అవి పనిచేయడం మొదలయిందన్న మాట” అని
అంటూ అయ్యరు తన హోల్డాలు, టిఫిన్
క్యారియర్ చేతబుచ్చుకుని చక్కాపోయాడు.
(ఒక ఇంగ్లీష్ కధనానికి
స్వేచ్చానువాదం)
29, మార్చి 2022, మంగళవారం
చంద్రబాబు నాయుడు – నేను.
28, మార్చి 2022, సోమవారం
లోనారసి
