6, నవంబర్ 2021, శనివారం

ఇద్దరు స్నేహితుల హృదయావిష్కరణ – భండారు శ్రీనివాసరావు



కొంత పరస్పర డబ్బా అనిపిస్తే తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ ఈ ప్రోగ్రాం చేసిన జర్నలిస్ట్ ప్రేమకు అవేవీ పట్టవు. వాళ్ళ నాన్న జ్వాలాలాగే తాను అనుకున్నది అనుకున్నట్టు చేసుకుపోవడమే ఆమెకు తెలుసు.

ఒకరిని గురించి మరొకరు చెప్పడం ద్వారా ఇద్దరు స్నేహితులను పరిచయం చేయాలని అనుకున్నట్టుంది. అలాగే చేసింది. ఈ క్రమంలో కొందరికి  నేను పైన చెప్పిన మాట కొంత నిజమనిపించవచ్చు. చేయగలిగింది లేదు.

జ్వాలా, నాకు మధ్య ఉన్న స్నేహానికి షష్టిపూర్తి దాటింది. ఈ సందర్భంలో మా ఇద్దర్నీ కూర్చోబెట్టి ప్రేమ అనే ప్రేమమాలిని అనే బుంటీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

అదేమిటో విచిత్రం. ముసురుపట్టినట్టు ఈరోజు నా పోస్టులు అన్నీ వీడియోలే!   







Journalist BHANDARU SRINIVAS RAO's Comments on Jai Bhim Movie ...

జవాబుకు తగ్గ ప్రశ్న- భండారు శ్రీనివాసరావు

 సమాధానంఎలా వుండాలని కోరుకుంటారో ప్రశ్న ఆ విధంగా వుండాలని కార్పొరేట్ గురువులు చెబుతుంటారు.

అందుకో ఉదాహరణే ఈ కధ.
ఏకాంబరం, పీతాంబరం మంచి మిత్రులు.
‘దేవుడ్ని పూజిస్తూ సిగరెట్ తాగొచ్చా’ అన్నది పీతాంబరం అనుమానం. వెళ్లి గుళ్ళో పూజారి ఒంటరిగా వున్నప్పుడు అడిగాడు.
“తప్పు నాయనా! తప్పు. దైవ ప్రార్ధన చేసేటప్పుడు అటువంటి తప్పుడు పనులు ఎంతమాత్రం కూడదు” అన్నాడు పూజారి.
ఆ విషయమే వెళ్లి స్నేహితుడితో చెప్పాడు.
“నువ్వు అలా అడిగుండాల్సింది కాదు’ అన్నాడు పీతాంబరం.
తరువాత పీతాంబరం వెళ్లి మళ్ళీ అదే పూజారిని కలుసుకుని అడిగాడు,“పొగతాగుతూ దైవాన్ని స్మరించుకోవచ్చా!” అని.
“దానికేం నాయనా! నిక్షేపంగా దైవ ప్రార్ధన చేసుకోవచ్చు. సర్వకాల సర్వావస్తలలో దేవుడ్ని స్మరించుకోవడం అవశ్యం అభిలషణీయం”

రాయడం నాకో వ్యసనం ఓ వ్యాపకం - భండారు శ్రీనివాసరావు


కానీ ఆ రాసిన వాటిలో ఒకటి ఇలా నాలుగు చెరగులా పాకుతుందని అనుకోలేదు. మహా న్యూస్ ఎండీ శ్రీ వంశీ ఈరోజు అంటే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు నన్ను స్టూడియోకి ఆహ్వానించి ఈ అంశంపైన గంట ప్రోగ్రాం చేశారు. అనేక వెబ్ ఛానల్స్ నా దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఇవేమీ నాకు కొత్తకావు. కానీ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాసాన్ని చదివి దానిమీద ఇంటర్వ్యూ చేయడం ఇదే మొదటిసారి. ఇది కేవలం నా వ్యాసానికి ప్రేరణ ఇచ్చిన జస్టిస్  చంద్రు గొప్పతనం. నాదేమీ లేదు.నిమిత్తమాత్రుడిని.

మహా  న్యూస్ ఛానల్. సుమన్ టీవీల యాజమాన్యాలకు కృతజ్ఞతలు.





4, నవంబర్ 2021, గురువారం

జై భీమ్ సినిమా

 

తమిళ్ హీరో సూర్య నటించిన   జై భీమ్ డబ్బింగ్  సినిమాపై  సాంఘిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న  అనేక పోస్టులు చూస్తున్నప్పుడు ఈ సినీ కధకు ప్రేరణ అయిన జస్టిస్ చంద్రు గురించి ఎనిమిదేళ్ల క్రితం నా బ్లాగులో ఆయన్ని గురించి రాసిన వ్యాసం గుర్తుకు వచ్చింది.



 

పర్వాలేదు, మనం మంచి వాళ్ళ మధ్యనే ఉంటున్నాం – భండారు శ్రీనివాసరావు (2013)

ఒకరకంగా మన అందరం అదృష్టవంతులమే. ఎందుకంటే , జస్టిస్ చంద్రు వంటి అరుదయిన మంచి మనుషులు జీవిస్తున్న కాలంలోనే మనమూ బతుకుతున్నాము కాబట్టి.

జస్టిస్ చంద్రు చెన్నై హై కోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన్ని గురించిన నాలుగు మంచిమాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.వి.రావు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో మూడుకోట్లకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోయివున్నాయనీ, ఇవన్నీ ఓ కొలిక్కి రావాలంటే 300 లసంవత్సరాలకు పైగా పడుతుందనీ జస్టిస్ రావు చెప్పారు. ఆయన చెప్పింది అక్షరసత్యమే కావచ్చుకాని, జస్టిస్ చంద్రు వంటి న్యాయమూర్తులు మరికొందరు వుండివుంటే, బహుశా కేసుల పరిష్కారానికి అంత సమయం అవసరం పడదేమో! ఎందుకంటే కేసుల పరిష్కారం విషయంలో జస్టిస్ చంద్రు నెలకొల్పిన రికార్డు అలాటిది మరి. న్యాయమూర్తిగా ఆయన అక్షరాలా యాభై నాలుగు వేల కేసులను పరిష్క రించారు. భారత న్యాయస్తానాల చరిత్రలో ఇదొక అరుదయిన రికార్డు.

సరే! విషయానికి వద్దాం.

ఏదయినా ఉద్యోగంలో వున్న వ్యక్తి యెంతటి సమర్ధుడైనా సరే, ఏదో ఒకనాడు పదవీ విరమణ చేయకతప్పదు. జస్టిస్ చంద్రుకు కూడా ఆ రోజు వచ్చింది.

మామూలుగా ఇలాటి సందర్భాలలో కొన్ని సంప్రదాయాలు వుంటాయి. న్యాయమూర్తి ఎవరయినా రిటైర్ అవుతున్నప్పుడు కోర్టులోనే అధికారికంగా ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ వగైరా హాజరవుతారు. వీడుకోలు ప్రసంగాలు చేస్తారు. పుష్పగుచ్చాలు అందచేస్తారు. తేనీటి విందు జరుగుతుంది. అందరూ కలసి ఫోటో దిగుతారు. వీలునుబట్టి, ఆ సాయంత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీడ్కోలు విందు ఏర్పాటుచేస్తారు.

కానీ జస్టిస్ చంద్రు తరహానే వేరు. అందువల్ల ఆయన పదవీ విరమణ ఆయన పద్దతిలోనే జరిగింది. ఏడేళ్ళపాటు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యేముందు ఆయన ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయవద్దని అందులో ముందుగానే అభ్యర్ధించారు.

ఒక జడ్జి నిరాడంబరంగా పదవీ విరమణ చేయడం ఎన్నడూ జరగలేదా అంటే జరిగింది. కానీ ఎప్పుడూ? మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1929లో జరిగింది. ఆరోజుల్లో జస్టిస్ జాక్సన్ నాటి అడ్వొకేట్ జనరల్ తో చెప్పారు. ‘ నా రిటైర్ మెంటు విషయంలో అనవసరమైన హడావిడి ఏమీ చేయవద్దు. నా విధులు నేను నిర్వర్తించాను. వీడ్కోలు ఇవ్వాల్సిన అవసరం ఏమి వుంది?’

మళ్ళీ ఎనభై రెండేళ్ళ తరువాత జస్టిస్ చంద్రు అలాటి నిర్ణయం తీసుకోగలిగారు.

మార్చి ఎనిమిది, శుక్రవారం.

జస్టిస్ చంద్రు రోజుమాదిరిగానే కోర్టుకు వచ్చారు. తన ఆస్తిపాస్తుల వివరాలను స్వచ్చందంగా తెలియచేస్తూ ఒక డాక్యుమెంటును ప్రధాన న్యాయమూర్తికి అందచేసారు. తరువాత తన చాంబర్స్ కు వచ్చి అవసరమైన కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. మీడియా మిత్రులతో కూర్చుని తేనీరు సేవిస్తూ కొద్దిసేపు ముచ్చటించారు.

రిటైర్ అయినరోజున కూడా ఆయన అధికారిక వాహనాన్ని వాడుకోలేదు. అన్నిసంవత్సరాలుగా వెన్నంటివున్న డఫేదారునూ వెంటతీసుకోపోలేదు.

తరువాత హై కోర్టు బయటకు వచ్చి నడుచుకుంటూ సుభాష్ చంద్రబోస్ రోడ్డు దాటి అక్కడవున్న సంగీత రెస్టారెంటులో మిత్రులతో కాఫీ తాగుతూ ముచ్చట్లు చెబుతూ గడిపారు. ఆ పిదప, బీచ్ రోడ్డు స్టేషన్ కు వెళ్ళి వేలాచెర్రి వెళ్ళే ఎం.ఆర్.టీ.ఎస్. లోకల్ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు.

న్యాయమూర్తిగా వున్నప్పుడు కూడా జస్టిస్ చంద్రు ఉద్యోగంతోపాటు వచ్చే హంగులు ఆర్భాటాలకు దూరంగానే వుంటూ వచ్చారు. సాధారణంగా న్యాయమూర్తులు తమ చాంబర్ నుంచి కోర్టు హాలుకు వెళ్ళేటప్పుడు యూనిఫారం ధరించిన బిళ్ళ బంట్రోతు వొకరు చేత దండం ధరించి ముందు నడుస్తూ వెళ్లడం ఆనవాయితీ. జస్టిస్ చంద్రు దీనికి స్వస్తి చెప్పారు. తన అధికారిక వాహనానికి యెర్ర దీపం ఏర్పాటు తీసేయించారు. సెక్యూరిటీ సిబ్బందిని అవసరంలేదని చెప్పి వాపసు పంపేసారు. ఇంటివద్ద పనులకోసం బంట్రోతులను వాడుకోలేదు.

చెన్నై హైకోర్టులో జస్టిస్ చంద్రు చాంబర్ ముందు ఒక బోర్డు మీద ఇలా రాసివుండేది.

పూలు,బొకేలు పట్రాకండి – నేనేమీ దేవుడ్ని కాను

ఆకలితో లేనుకాబట్టి పళ్ళూ మిఠాయిలు తేకండి

చలితో గడగడలాడిపోవడం లేదు – శాలువల అవసరం ఏమీ లేదు

అలా అని మీనుంచి నేనేమీ ఆశించడంలేదనుకోకండి.

లోపలకు వచ్చేటప్పుడు శుభాశీస్సులు పట్టుకురావడం మాత్రం మరచిపోకండి.”

బహుశా ఇప్పుడాబోర్డు అక్కడ వుండి వుండదు. దాని అవసరం కూడా వుండకపోవచ్చు.

(09-04-2013)

 

3, నవంబర్ 2021, బుధవారం

పతి ప్రేమకు పరీక్ష – భండారు శ్రీనివాసరావు

 

ఒక అపార్ట్ మెంటులో ఆడవాళ్ళ కిట్టీ పార్టీ జరుగుతోంది. మాటల మధ్యలో మొగుళ్ళూ, ప్రేమలూ అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. భార్య పట్ల మొగుడికి యెంత ప్రేమ వుందో తెలుసుకోవడానికి అక్కడ వున్నవాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు.
‘ఏమండీ మీరంటే నాకెంతో ఇదీ, సాయంత్రం పెందరాడే ఇంటికి రండి’ అంటూ ఎవరి మొగుళ్ళకు వాళ్ళు విడివిడిగా ఎస్ ఎం ఎస్ లు పంపారు. వచ్చిన జవాబుల్లో ఒక దానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని కూడా అనుకున్నారు. అనుకున్నట్టే వాళ్ళ భర్తల నుంచి వెంటనే తిరుగు ఎస్ ఎం ఎస్ లు వాళ్ళ సెల్ ఫోన్లకు వచ్చాయి. అవి ఇలా వున్నాయి.
“హలో స్వీటీ నీ ఒంట్లో బాగుంది కదా!”
“ఇవ్వాళ కూడా హోటల్ కూడేనా కొంపతీసి”
“ఇంటి ఖర్చులకి ఇచ్చిన డబ్బులు అప్పుడే అయిపోయాయా”
“ఏవిటి సంగతి, ఇలా గారాలు పోతున్నావు”
“నువ్వా నేనా కల కంటున్నది. ఇది నిజమేనా”
“పక్కావిడ కొనుక్కున కొత్త చీర అంతనచ్చిందా”
“ఆఫీసరు ముండావాడితో వేగలేక ఇక్కడ చస్తుంటే, బుర్ర లేకుండా ఏవిటీ వెకిలి జోకులు,”
“ఎన్ని సార్లు చెప్పాను, నీకు ఆ వెధవ సీరియల్స్ చూడొద్దని”
“గెరేజ్ లో కారు తీసి మళ్ళీ ఏ గోడకో గుద్దావా ఏమిటి, నయగారాలు పోతున్నావు”
“సాయంత్రం స్కూలు నుంచి పిల్లల్ని నేనే తీసుకు రావాలన్న మాట. అర్ధమయింది, తప్పుతుందా”
చివరికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏ మెసేజ్ కి వచ్చిందంటే:
“ఎవడ్రా నువ్వు! మా ఆవిడ మొబైల్ నుంచి మెసేజులు పెడుతున్నావు?”
(వాట్స్ అప్ లో గిరికీలు కొడుతున్న ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)

2, నవంబర్ 2021, మంగళవారం

రూపాయి నోటుపై సంతకం

“మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”

కౌంటర్ లోని వ్యక్తి అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని ‘మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మా’ అని.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-
ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.
భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.
అయన సంతకంతో వున్న రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.
ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.