2, సెప్టెంబర్ 2021, గురువారం

ప్రజావైద్యుడు వై.ఎస్.ఆర్.

 

(వై.ఎస్. వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు (02-09-2021) ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి, తనకు తానుగా ప్రజలందరికీ మేలు చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. రాజకీయ ప్రవేశం చేసిన తొలి నాళ్లలో నిర్వహించిన మంత్రి పదవులు మినహా ఆయన ఎక్కువ కాలం సచివాలయానికి, ఆఫీసు ఫైళ్ళకు దూరంగా, పార్లమెంటు సభ్యుడిగానో లేదా ప్రతిపక్ష నాయకుడిగానో వుండిపోయారు. అలాగే వైద్య విద్య పూర్తిచేసుకున్న తొలినాళ్లలో చేసిన డాక్టరు ప్రాక్టీసు తప్పిస్తే తదనంతర కాలంలో ఆయన ఆ పనిచేసిన దాఖలాలు లేవు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక వైద్యుడిగా తను అనుకున్న విధంగా చేస్తూ పోవడానికి వెసులుబాటు లభించింది ముఖ్యమంత్రి అయినప్పుడే. ఈ అరుదయిన అవకాశాన్ని (గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ వై.ఎస్. మాదిరిగా ఒకే విడతలో నిరవధికంగా అయిదేళ్ళ పదవీ కాలం పూర్తిచేసుకోలేదు) వైఎస్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు పనికొచ్చే అనేక మంచి పనులు చేసిందీ ఆ సమయంలోనే. వై.ఎస్. చనిపోయిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఆయన వల్ల మేళ్ళు పొందిన వాళ్ళు మాత్రం వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే వున్నారు. వీళ్లేమీ బడాబడా కాంట్రాక్టర్లు కాదు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అంతకంటేకాదు. వారందరూ సామాన్యులు. ఇంకా చెప్పాలంటే అతి సామాన్యులు.
ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను, కన్నవి, విన్నవి, ఉదహరించడమే ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
ప్రింటింగు ప్రెస్సుల్లో అనవసరమైన కాగితాలు రద్దీగా పేరుకు పోతుంటాయి. కొంతమంది వాటిని గోనెసంచుల్లో కూరుకుని వేరే చోట అమ్ముకుని పొట్టపోసుకుంటూ వుంటారు. అలా జీవనం సాగించే ప్రకాష్ అనే వ్యక్తికి గుండె జబ్బు అని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ మాటతో అతడికి గుండె జారిపోయింది. కాలూ చేయీ ఆడలేదు. ఆ ప్రెస్సు యజమాని , ఈ విషయాన్ని జర్నలిష్టు సంఘం నాయకుడు అమర్ చెవిన వేసి ఏదైనా సాయం జరిగేలా చూడమన్నాడు. రోగి గురించి పూర్తిగా తెలిసివున్న అమర్ వెంటనే వైఎస్ ని కలిసి విషయం చెప్పారు. ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన అర్జీని అయన చేతికి ఇచ్చారు. తక్షణ సాయం అందించమని వై.ఎస్. తన పేషీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సంబంధిత ఉత్తర్వులు వచ్చేలోగా ఆ రోగి మరణించిన సంగతి సీఎం కు తెలిసింది. సహాయ నిధి వ్యవహారాలు చూసే అధికారిని పిలిచి, వెంటనే ఆ రోగి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున రెండు లక్షల ఆర్ధిక సాయం అందించి రావాలని కోరారు.
వై ఎస్ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాళీ అయ్యే పరిస్తితి ఏర్పడింది. గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ఇదేవిధమైన పరిస్తితి తలెత్తిందని అధికారులు చెప్పేవారు. దీనికి కారణం వారిద్దరి చేతికీ ఎముక లేకపోవడం. అడగని వారిదే పాపం అన్నట్టు ఎవరు అర్జీ పెట్టుకున్నా వెంటనే ముందు వెనుకలు చూడకుండా డబ్బు మంజూరు చేసేవాళ్ళు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య శాసన సభ్యుడు, వారికి సంబంధించిన వారికి వైద్యం చేయించేందుకు ఆర్ధిక సాయం కోరుతూ ఒక అర్జీ ముఖ్యమంత్రి వై.ఎస్. చేతికి ఇచ్చారు. అదంతా చదివి వై ఎస్ ఆయనతో ఇలా అన్నారు.” నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు ఏమాత్రం సరిపోవు.రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’
ఆ ఎమ్మెల్యేకు ఆశ్చర్యంతో మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో అన్నాడు “చూశారా, సి ఎం అంటే ఇలా వుండాలి, మా పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎవరు వెళ్లి అడిగినా, అడిగిన దానిలో సగం కత్తిరించి శాంక్షన్ చేసే వాళ్ళు. దాంతో ఖర్చు రెట్టింపు చూపించి అడగాల్సి వచ్చేది”
వై ఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక ఇంగ్లీష్ పత్రిక విలేకరి తన కుమార్తె పెండ్లికి పిలవడానికి భార్యను వెంటబెట్టుకుని క్యాంప్ ఆఫీసుకు వెళ్ళారు. వైఎస్ లోపలకు వస్తూనే వీరిని చూసి కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పి లోపలకు వెళ్ళారు. సిబ్బంది వారిని ప్రవేశ ద్వారం వద్ద కుర్చీల్లో కూర్చోబెట్టారు. సీఎమ్ కాసేపటి తరువాత వచ్చి బయట కూర్చుని వున్న భార్యాభర్తలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గబగబా విలేకరి భార్య దగ్గరికి వెళ్లి, ‘మీరు మాఇంటి ఆడపడుచు వంటి వారు, మీకు సరిగా మర్యాద జరగలేదు, మన్నించమని’ ఒకటికి రెండుసార్లు అనడంతో ఆవిడ విస్తుపోయారు. వెంటబెట్టుకుని లోపలకు తీసుకుని వెళ్లి తన వద్ద కూర్చోబెట్టుకున్నారు. ‘మీకు ఎంతమంది పిల్లలు, ఎందరి పెళ్ళిళ్ళు అయ్యాయి’ అంటూ ఆప్యాయంగా వివరాలు కనుక్కున్నారు. ఇన్నేళ్ళ తరువాత కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన ఆ విలేకరి ఈ సంగతి గుర్తుచేసుకుంటూ వుంటారు.
నా భార్యకు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపీచంద్, గుండెలో వాల్వ్ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఐ.సీ.యు.లో వున్నప్పుడు చూడడానికి వెడితే, పక్క బెడ్ మీద మరో అమ్మాయి పడుకుని వుంది. పదిహేను ఏళ్ళు ఉంటాయేమో. చాలా క్రిటికల్ ఆపరేషన్ చేశారు. ఆ అమ్మాయి తండ్రి ఆదిలాబాదు జిల్లాలో ఓ రోజు కూలీ. లక్షల్లో ఖర్చయ్యే ఆ ఆపరేషన్, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ వల్ల ఒక్క రూపాయి ఖర్చు కాకుండా జరిగిందని ఆ తండ్రి నాతో చెప్పాడు. పేదా గొప్పా అనే తేడా లేకుండా అందరికీ వైద్య సౌకర్యం అందించే ఆరోగ్య శ్రీ పధకం మా వంటి పేదల ప్రాణాలను కాపాడుతోందని అన్నాడు.
అలాగే ఓసారి సెలూన్ కు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే ఓ కుర్రాడి అనుభవం ఒకటి తెలిసి వచ్చింది. వాళ్లది మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కుగ్రామం. పొట్టచేతపట్టుకుని నగరానికి వచ్చి, తనకు ఇలవరుసగా అబ్బిన విద్యతో పొట్టపోసుకుంటున్నాడు. తను పదో తరగతి పాసయాడు. చెల్లెలు చదువులో ఎదిగివచ్చే నాటికి వై.ఎస్. అమలుచేస్తున్న ఫీజు రీఇంబర్స్ మెంట్ పధకం అమల్లోకి వచ్చింది. ఇంటర్ పాసుకాగానే ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది.
‘నేను ఊరికి పొతే కత్తెర్లు వేసేవాడు అంటారు, అదే మా చెల్లెల్ని ఇంజినీర్ అంటారు. ఈ పధకం వల్ల చదువు అంటడం సంగతి అటుంచి మాలో ఆత్మన్యూనత పోయి మామీద మాకు విశ్వాసం కలుగుతోంద’ని చెప్పుకోచ్చాడా అబ్బాయి.
అప్పటికే, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు, హెచ్.ఎం.ఆర్.ఐ. వారు మరో ఆరోగ్య పధకానికి రూపకల్పన చేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు, నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి, వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే సంచార వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం, పేద పల్లెప్రజల ప్రాణాలు జబ్బుల కారణంగా ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే, ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే, వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ.ఎన్.ఎం. లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టెక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు. అవసరమని భావిస్తే, 108 అంబులెన్సు ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు. రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహిస్తారు.
'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెచ్.ఎం.ఆర్.ఐ. నిర్వాహకులు ముఖ్యమంత్రి సమయం తీసుకుని ఒకనాడు సచివాలయానికి వెళ్ళారు. ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి, మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో, రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హఠాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.
అంతే!
దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.



రాజకీయుల నాలుకకు నరం వుంటుందా!

 

అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960 అధ్యక్ష ఎన్నికలనాటికి డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే – తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్ స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘ మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.
అసత్యాలు సరే గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాజకీయాల తీరుతెన్నులను గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
‘కండవర్ విండిలై విండవర్ కండిలై’ అని తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే – ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.
ఈ నిజం తెలుసుకోవడానికి పెద్ద కష్టపడక్కరలేదు. ఓ పదినిమిషాలు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం లేదా ఏ టు జెడ్ టీవీ ఛానల్లు ప్రసారం చేసే చర్చాకార్యక్రమాలు చూస్తే చాలు. వాళ్ళ నాలుకలు ఎన్ని వంకర్లు తిరుగుతాయో అర్ధం అవుతుంది. ఇంత కరాఖండిగా ఎలా చెబుతున్నానంటే ఇది స్వానుభవం కనుక.
NOTE: Courtesy Image Owner



1, సెప్టెంబర్ 2021, బుధవారం

కూతురి పాత్రలో కోడలు – భండారు శ్రీనివాసరావు

 

“మీరు చాలా అదృష్టవంతులండీ” అన్నది పొద్దున్న వచ్చిన పనిమనిషి.
నేనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే, అది ఎందుకు అని అడిగే సందర్భం కాదు కదా!
మళ్ళీ తనే చెబుతోంది.
“పొద్దున్న వస్తానా, ఆయమ్మ అదే మీ కోడలు గారు ప్రతిరోజూ తను పని(అంటే Work from Home అన్నమాట)లోకి వెళ్ళే ముందు నాకు ఇవన్నీ పదేపదే చెబుతుంటారు.
‘పాపా పడుకునే బెడ్డు క్లీన్ చేయి. పక్క బట్టలు రెండ్రోజులకోసారి మార్చు. దిండు కవరు మార్చి వేయి. గది బాగా శుభ్రంగా ఉంచు. బాత్‌రూం లో తడి లేకుండా పొడి బట్టతో తుడిచేయి. బయట ఆరేసిన ఆయన బట్టలు అన్నీ తెచ్చి ఆయన అలమారాలో పెట్టు. మంచి నీళ్ళ సీసా గ్లాసు మరిచిపోకు.’
“ఇలాగే ఎన్నెన్నోజాగర్తలు చెప్పి వెళ్లి ఆ మిషన్ ముందు కూచుంటారు. అదేమిటో, ఇవ్వాళ రావడం లేటయింది. కానీ నేను వచ్చేలోపే నాకు చెప్పిన పనులన్నీ ఆమెగారే చేసినట్టున్నారు. గదంతా శుభ్రంగా వుంది. ఇలా కనిపెట్టి చూసే కోడలు దొరకడం మీ అదృష్టం అంటున్నాను. పాపం ఆ మహాతల్లి వుంటే ఆమెని ఎంత సుఖపెట్టేదో ఈ అమ్మాయి”
అలాగా! అనుకున్నాను. ప్రతిరోజూ నా గది అలాగే శుభ్రంగా వుంటుంది. పనిమనిషి రాని రోజున కోడలు నిషానే ఇవన్నీ చేస్తోంది అని కూడా తెలియదు. అసలు ఎవరు ఏ పని చేస్తున్నారో గమనించే తీరిక లేకుండా ఏదో కొంపలు మునిగినట్టు కంప్యూటర్ ముందు కూచుంటాను. ఇంట్లో ఏమి జరుగుతుందో తెలవదు, ఒకప్పుడు ఇప్పుడు కూడా. వెనుకటిలాగే నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి.
పనిమనిషి మహాలక్ష్మి అన్నట్టు నేను అదృష్టవంతుడినే! కానీ కోడలికి థాంక్స్ ఎలా చెప్పాలి?
(01-09-2021)

31, ఆగస్టు 2021, మంగళవారం

కధలు రాయడం ఎలా! – భండారు శ్రీనివాసరావు

 (ఆగస్టు 31ఆరుద్ర జయంతి)



నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దుర్మార్గానికి పూనుకుంది కూడా నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’

కధలెలా రాయాలి’ అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.

పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా అంతే వుంటుంది. ఆరుద్ర గారంటే మాటలా మరి!


NOTE: Courtesy Image Owner

 

సర్వకళల సమాహారం – హరికధ


(ఈ రోజు హరికధా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి)

కానీ హరికధలంటే బోరు కొట్టే కధలు మాత్రం కాదు.హరికధలు, ఒకానొక కాలంలో జనాలను కట్టిపడేసిన భక్తిరస ధునులు. ప్రజలను సమ్మోహితులను చేసిన శ్రవణానందకర ధ్వనులు.
ఈ నాటి పిల్లలకు కాని ఇంకా చాలామంది పెద్ద వాళ్ళకు కాని హరికథ అనే ప్రసిద్ధ కళా రూపం వొకటి వుందని కూడా తెలియదేమో అనిపించే రోజుల్లో జీవిస్తున్నాము. ఎనభయ్యో దశకములో కూడా హరికథకు ఎంతో కొంత ప్రభావము వుండేది.
యాభయ్, అరవై దశకాల్లో అయితే హరికథ ఎంతో ఉచ్చ స్థితిలో వుండేది. దేవాలయాల ఉత్సవాలలో, వినాయక చవితి, దేవి నవరాత్రుళ్ళు, శ్రీరామ నవమి పందిళ్ళలో, పెద్ద స్థితిమంతుల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలలో హరికథా కాలక్షేపాలు ఉండేవి. మధ్య మధ్యలో వేసవికాలంలో కూడా గ్రామస్తులు అంతా కలసి రామాయణమో, మహా భారతమో సీరియల్ గా చెప్పించుకొనేవారు. సాంస్కృతిక కార్యక్రమాలు నెలనెలా నిర్వహించే గాన సభల్లో కూడా ఏడాదికి వోసారి అయినా హరికకధ పెట్టించే వారు.

“హరికధ అనేది సర్వ కళాసమాహారం. హరికథ చెప్పే దాసు గారికి సాహిత్యం, సంగీతం క్షుణ్ణంగా వచ్చి తీరాలి. రామాయణ,భారత,భాగవతాదులు కరతలామలకంగా వుండాలి. కొద్దో గొప్పో నాట్యం తెలిసి వుండాలి. వీటన్నితో పాటు సమయస్పూర్తి, చతురత, రక్తి కట్టించే సామర్ధ్యం అవసరం. అభినయ కళ తెలిసివుండడం కూడా ముఖ్యం. ఇన్ని వుంటేనే ఉంటేనే దాసుగారికి బంతిపూల దండలు దండిగా పడేది. హరి కథలు చెప్పే దాసుగారిని భాగవతార్ అని పిల్చేవారు. అమ్ముల విశ్వనాథ భాగవతార్ అలా. హరికథకి వయోలిన్, మృదంగం పక్క వాయిద్యాలు. దాసుగారు కుడిచేతిలో చిడతలు పట్టుకొని కీర్తనలు పాడేటప్పుడు తాళం వేస్తూ వుండే వారు. కాళ్ళకు గజ్జెలు. దాసు గారి ఆహార్యం పట్టు పంచె, పట్టు ఉత్తరీయం, నుదుట సింధూరం. అన్నట్టు దాసుగారు తనతో ఎప్పుడూ తీసుకు వెళ్ళేది శ్రుతి బాక్స్.

“కథా ప్రారంభంలో దాసుగారు పక్క వాయిద్యాల సమేతంగా వేదిక మీద కూర్చునే గణపతి ప్రార్ధనతో మొదలుపెట్టి తాను ఏ కధ చెప్పదలచుకొన్నారన్నది సూచన ప్రాయంగా తెలియచేస్తూ రెండు మూడు కీర్తనలు పాడే వారు. తర్వాత లేచి నిలబడి, గజ్జెలు కళ్ళకు అద్దుకొని, వాటిని కాళ్ళకు కట్టుకొని, ‘శ్రీమద్రమారమణ గోవిందా’ అని తానంటూ, సభికులందరి చేతా గట్టిగా అనిపిస్తూ కథలోకి ఉపక్రమించే వారు. కీర్తనలు ఆలపించేటప్పుడు పక్క వాయిద్యాల సహకారం తీసుకొనే వారు. సందర్భోచితంగా నాట్యం చేస్తూ కథను రక్తి కట్టించే వారు. నిద్రలో జోగే శ్రోతలను మేలు కొలిపెందుకు మధ్యమధ్యలో గోవిందలు కొట్టించేవారు. సినిమాలో కూడా హరికథలు పెట్టేవారు. పది పదిహేను నిమషాలు ఉండేవి. విజయా వారి షాహుకారు సినిమా హరికథ తోనే ప్రారంభం అవుతుంది. నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించిన కవితా వారి వాగ్దానం సినిమాలో రేలంగి హరిదాసుగా ఘంటసాల పాడిన సీతా కల్యాణం చాలా మంది ఇష్టపడే మరపు రాని హరికథ.
“హరికథ అంటే ఆది భట్ల నారాయణ దాసు గారి పేరే అందరికి గుర్తుకు వస్తుంది. విజయనగరం సంస్థానం ఆస్థాన విద్వాంసులు ఆయన. ఫిడేలు ద్వారం వెంకట స్వామి నాయుడు గారికి ముందు విజయనగరం సంగీత కళా శాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు కూడా. హరికధ చెప్పే ప్రతివారు మేము నారాయణదాసు గారి శిష్యులమనో లేదా ఆయన కథలు చెపుతున్నామనో చెప్పుకొనేవారు. ఇప్పటికి కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో నారాయణ దాసు గారి ఉత్సవాలు చేస్తూ వుంటారు.
కూచిభొట్ల కోటేశ్వర రావు అనే ఆయన బక్క పలచగా పొడుగ్గా వుండేవారు. భక్త పోతన హరికథ ఎంతో గొప్పగా చెప్పే వారు. లలిత సరస గాన కళానిధే అంటూ ప్రార్ధన చేసేవారు. లేచి నిల్చున్న వెంటనే వాసుదేవ అని కళ్యాణి రాగంలో త్యాగరాజ కీర్తన ఎంతో శ్రావ్యంగా పాడే వారు. సందర్భానికి తగ్గట్టుగా పిట్ట కథలు చెప్పే వారు. పోతన భాగవతాన్ని అమ్ముకోలేక ఎంత బాధ పడ్డాడో అందరికీ తెలిసిందే. పోతన గారిలాగే కూచిభొట్ల వారుకూడా తమకున్న అద్భుతమయిన హరికథా విద్యను అమ్ముకోలేదు. ఏమిస్తే అది పుచ్చుకొనే వారు. పెద్ద వారయినా పెద్ద మనసు వున్నవారు. ప్రాతఃస్మరణీయులు. అమ్ముల విశ్వనాధం గారు మరో గొప్ప విద్వాంసులు. చల్లపల్లి, అవని గడ్డ ప్రాంతం వారు. స్ఫురద్రూపి. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులు.మండలి బుద్ధప్రసాద్ గారు ప్రచురించిన దివిసీమ రత్నాలలో అమ్ముల విశ్వనాధం గారి గురించి చాలా వివరంగా వుంది. నారాయణదాసు గారి తర్వాత బహుశః శిలా విగ్రహం వేయించుకోగలిగిన గౌరవం పొందింది అమ్ముల వారే. శివధనుర్భంగం కథ చాలా గొప్పగా చెప్పేవారు. అమ్ముల విశ్వనాధం గారి అమ్మాయి దుర్గాభవాని ప్రస్తుతం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది.
“సీరియల్ హరికథల గురించి కొంత చెప్పాలి. పొలం పనులు అయిపోయి అందరు తీరిగ్గా వున్నప్పుడు సీరియల్ హరికథలు పెట్టించుకునేవారు. గుళ్ళో కళ్యాణ మండపం స్టేజిగా రామాయణమో, భారతమో పూర్తిగా చెప్పించే వారు. రాత్రి ఏడు ఎనిమిది మధ్య ప్రారంభమయిన కథ పన్నెండు గంటల దాకా సాగేది. మధ్యలో హారతి పళ్ళెం పట్టే వారు. హరికధ వినడానికి వచ్చిన హారతి పళ్ళెంలో తమకు తోచిన విధంగా అణా, అర్ధణా, బేడా, పావలా కాసులు వేసేవాళ్ళు. పళ్ళెం మధ్యలో చిన్న కుంది పెట్టి వొత్తి వెలిగించి దీపం పెట్టే వాళ్ళు. చీకట్లో కొంతమంది అణా వేసి పావలా కొట్టేసేవారని జోకులు కూడా ఉండేవి. చిల్లర లేక పోతే హారతి పళ్ళెం పట్టే వాడిని అడిగి తీసుకునే వెసులుబాటు వుండేది. ‘నా దగ్గర పావలా వుంది నేను వో అణా వెయ్యాలి మిగతాది ఇచ్చెయ్యి’ అని అడిగి తీసుకునే వారు.వీరగంధం వెంకట సుబ్బారావు, రాజశేఖరుని లక్ష్మీపతి రావు, ర్యాలి రామచంద్ర రావు, కంచిభొట్ల వీర రాఘవయ్య, నౌడూరి విశ్వనాధ శాస్త్రి , కడలి వీరదాసు, ముదపాక మల్లేశ్వర రావు, ప్రగడ వీర భద్ర రావు, ముదునూరు శంకర్ రావు, ఎల్లమంద రావు, చోరగుడి పాండురంగరావు గార్లు హరికధలు చెప్పడంలో దిట్టలుగా పేరుతెచ్చుకున్నారు. ములుకోట్ల సదాశివ శాస్త్రి గారు అని తెనాలి అనుకొంటా. హైస్కూల్ లో తెలుగు మాష్టారుగా వుండే వారు. త్యాగరాజ చరిత్రను రామ భక్తి అంతా జోడించి చెప్పే వారు. పాతూరి మధుసూదన్ రావు గారు మొత్తం సంస్కృతంలోనే హరికథ చెప్పే వారు, సంసృతం రాని వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా. రేడియోలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, ఏ కధ అయినా అనర్ఘళంగా చెప్పేవారు. షెడ్యూల్ చేసిన ప్రోగ్రాం లేక పోతే ప్రయాగ వారి హరికథ వుండేది. గాంధీ, నెహ్రు, బోస్ చరిత్రలు కూడా ఆయన హరికధలుగా చెప్పే వారు.
“తర్వాత తరంలో అందరికీ తెలుసున్న వ్యక్తి కోట సచ్చిదానంద శాస్త్రి గారు. చాలా రమణీయంగా హాస్యోక్తులతో ఎన్ని గంటలు విన్నాఇంకా ఇంకా వినాలనిపించేలా చెప్పేవారు.
“బుర్రా శివరామకృష్ణ శాస్త్రి కూడా మంచి కథకులు. ఆడ వారిలో కూడా మంచి విద్వాంసులు వున్నారు. తెనాలి ఉమా చౌదరి భాగవతారిణి కొన్నేళ్ళపాటు ఆంధ్రదేశంతో పాటు ఇతర రాష్ట్రాలోని తెలుగు వారికి సయితం అభిమాన పాత్రులయ్యారు. నగరాజకుమారి, వజ్రాల విజయ శ్రీ , మంత్రిప్రగడ లలిత కుమారి చెప్పే హరికథలు అంటే జనం చెవి కోసుకొనే వారు.
పోతే, మరో ప్రసిద్ధ హరికధా విద్వాంసులు బుద్ధవరపు కురంగేశ్వర రావు గారు. వీరి గురించిన ప్రస్తావన ‘నియోగి సర్వస్వం’ లో వున్నట్టు తెలియచేసారు. హరి కధలు చెప్పడంలో వీరు అందె వేసిన చేయి. అపర రామ దాసు అని పేరు. రామదాసు హరికధ చెబుతూ రామా రామా అంటూనే కైవల్యం చెందారట. ప్రసిద్ధ రచయిత శ్రీ నిడదవోలు వెంకటరావు గారు శ్రీ కురంగేశ్వర రావు గారి హరికధా గాన ప్రశస్తి గురించి తన రచనల్లో ప్రస్తావించారు. ఆయన తన అనుభవాన్ని ఇలా రాశారు. “ నేను వీరి కధను విని తన్మయత్వము చెందిన వారిలో ఒకడిని. కధ చెబుతూ భక్తి పారవశ్యములో తన్మయత్వములో అట్లే నిలిచెడివారు. అప్పుడు హారతి నొసగిన తరువాత తిరిగి కధ ప్రారంభించెడివారు.”
“రాజమండ్రి దగ్గర కపిలేశ్వరపురం జమీందార్ సత్యనారాయణరావు గారు సర్వారాయ హరికథ గురు కులం ప్రారంభించి, హరికధలపట్ల ఆసక్తివున్న వారికి అక్కడే వసతి కల్పించి రెండు మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేసారు. ఇప్పుడు హరికథ చెపుతున్నవారిలో చాలా మంది కపిలేశ్వరపురం గురుకులం విద్యార్ధులే - ఉమా మహేశ్వరితో సహా. ఉమా మహేశ్వరి చాలా చిన్నతనంలోనే సంసృతంలో హరికధ చెప్పి అందరిని మెప్పించారు. మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు కళా కృష్ణ గారిని వివాహం చేసుకొని ఈ దంపతులిద్దరూ వొకరు పేరిణి నాట్యం ద్వారా మరొకరు హరికథ ద్వారా కళాసేవ చేస్తున్నారు.
ఆచార్య తూమాటి దోణప్ప గారు హరికధా సర్వస్వం అనే గ్రంధం రాశారు. తెలుగు యూనివర్సిటీ వారు తమ రజితోత్సవాల సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పుస్తకాల్లో ఇది కూడా వుంది. ఇంకా అవి వున్నాయో లేదో కూడా తెలియదు. హరికధను అభిమానించే వారంతా కొని దాచుకోవాల్సిన పుస్తకం.

“రేడియోలో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు గంట సేపు హరికథ వచ్చేది. రేడియో సంగీత సమ్మేళనం, నాటక సప్తాహంలాగా హరికథా సప్తాహం కూడా నిర్వహించే వాళ్ళు. హరిదాసులు అందరు వారి లెటర్ హెడ్స్ పైనా, కర పత్రాల పైనా ‘రేడియో ఆర్టిస్టు’ అని వేసుకొనే వారు. ఇప్పుడు కూడా హరికథలు ప్రసారం చేస్తున్నారో లేదో తెలియదు. చేస్తే చాలా సంతోషం. మానేస్తే అంత కంటే అన్యాయం మరోటి వుండదు. తోలుబొమ్మలాటలు పోయాయి. పౌరాణిక నాటకాలు మరచి పోతున్నారు. హరికథని అలా కానివ్వకూడదు. తమిళనాడులో ఇంకా హరికధ ఆదరణకు నోచుకుంటూనే వుందన్న సంగతి మరచిపోకూడదు.
“గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కధా గాన కళా పరిషద్ ఏర్పాటు చేసింది. సంగీత,సాహిత్య, నాటక అకాడమీల్లాగానే అది కూడా కాలగర్భంలో కలసిపోయింది. అలాగే బుర్రకధలు. ఎన్నికలప్పుడే ప్రచారాలకోసం గుర్తుకొచ్చే విధంగా క్రమంగా మాయమయిపోతున్నాయి.

(31-08-2021)

30, ఆగస్టు 2021, సోమవారం

ఇదీ సంగతి

 రాత్రి అమెరికా నుంచి మా అన్నయ్య కుమారుడు సత్య సాయి ఫోన్ చేశాడు.

ఈనాడు దినపత్రిక నెట్ ఎడిషన్ లో చాలా రోజుల నుంచి కార్టూనిస్ట్ శ్రీధర్ ఇదీ సంగతి కార్టూన్లు కనిపించడం లేదు, కారణం ఏమిటని ఆరా తీశాడు. గత నెల ఆగస్టు పదమూడున శ్రీధర్ వేసిన కార్టూన్ ఆఖరు సారి నెట్ ఎడిషన్ లో వేశారని, అప్పటినుంచి రావడం లేదని వివరం చెప్పాడు.

రెండు రోజుల క్రితమే ఫేస్ బుక్ లో శ్రీధర్ ఉద్యోగపర్వం నలభయ్ రెండేళ్లుగా సాగుతోందని, ఆ పత్రికలో ఇదొక రికార్డు అని పేర్కొంటూ ఒక పోస్టు చూశాను. మళ్ళీ ఈరోజు శ్రీధర్ ఫేస్ బుక్ లో ‘ఈనాడుతో తన బంధం ముగిసిందని, రాజీనామా చేశాను’ అని రెండే రెండు చిన్న వాక్యాలతో ఓ బుల్లి పోస్టు పెట్టారు. అది బాగా వైరల్ అయింది. కారణాలు ఎవరికి వారు ఊహించుకుని రాయడమే కానీ ఇదమిద్ధంగా తెలియదు. తెలిసినదల్లా శ్రీధర్ ఈనాడు నుంచి తప్పుకున్నారని మాత్రమే.

ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్న సత్య సాయికి శ్రీధర్ కార్టూన్లు అంటే తగని మక్కువ. అందుకే కార్టూన్లు రావడం లేదు అనే ఎరుక అతడిలో కలిగింది. ఇలాంటి అభిమానులు పెద్ద సంఖ్యలో వున్న శ్రీధర్ అదృష్టవంతుడు.

ఈనాడులో శ్రీధర్ వేసిన మొట్టమొదటి కార్టూన్ అంటూ ఒకటి వైరల్ అవుతోంది. అదే ఇది. కార్టూనిస్ట్ శ్రీధర్ కు ధన్యవాదాలు




 

(30-08-2021)

తరం మారుతోంది – భండారు శ్రీనివాసరావు

 

‘మీరలా కాసేపు ప్రెస్ క్లబ్ కి వెళ్లి రండి. ఇంట్లో వుండి ఇలా కాళ్ళకు చేతులకు అడ్డం పడుతూ, వచ్చిన పనివాళ్ళని కసురుకుంటూ వుంటే ఇల్లు సర్దడం ఇప్పట్లో కాదు’ అనేది మా ఆవిడ మేము ఇల్లు మారినప్పుడల్లా.
అన్నీ ఒక పద్దతిగా చేయాలనేది నా థియరీ, అసలు ఏ పద్దతి నాకు తెలియకపోయినా.
ముందు బీరువాలు పెట్టాలి, తర్వాతే మంచాలు. అప్పుడు అన్నీ తేలిగ్గా అమరుతాయి. ఆ మాటే వచ్చిన వర్కర్లతో చెప్పాను అంటే మా ఆవిడ వినిపించుకునేది కాదు. ‘చెబితే చెప్పారు, అలా కసురుకుంటూ చెప్పడం ఏమిట’ని లా పాయింటు తీసేది. దాంతో ఆమె చెప్పినట్టే ఎక్కడో కాలక్షేపం చేసి ఇంటికి వచ్చేసరికి చిందరవందరగా వున్న ఇల్లు కాస్తా కడిగి తుడిచిన అద్దంలా కనిపించేది.
మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత మా పిల్లలు అంటే కొడుకూ, కోడలు ఇంటి సంప్రోక్షణ (ప్రక్షాళన) మొదలు పెట్టారు. మూడు రోజులుగా ఇంట్లో పనులు జరుగుతున్నా కేకలు, అరుపులు లేవు. పనివాళ్ళకి ఏమి కావాలో మెల్లిగా చెప్పి చేయిస్తున్నారు. వాళ్ళు కూడా ఎదురు చెప్పకుండా చేస్తున్నారు.
ఎక్కడ వచ్చింది ఈ తేడా ?
జవాబు సులభంగా చెప్పవచ్చు.
తరం మారుతోంది.
(30-08-2021)