20, ఆగస్టు 2021, శుక్రవారం

అమ్మకు ఏదిష్టం? – భండారు శ్రీనివాసరావు

 కాలం మన చేతిలో వుండదు. చూస్తూ ఉండగానే మా ఆవిడ రెండో ఆబ్దీకం వచ్చింది.

మూడు కూరలు, మూడు పచ్చళ్ళు జాబితా రాస్తున్నప్పుడు ఆమెకి ఇష్టం అయిన కూరో, స్వీటో చేయిస్తే బాగుంటుంది అని ఓ సలహా.

ఆమెకి ఏమిష్టం అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. నా ఇష్టాలే తన ఇష్టంగా బతికింది. ఆమెకేది ఇష్టమో  నేను తెలుసుకునే తీరిక, ఓపిక నాకు ఎక్కడిది?

అమ్మకు నేనంటే ఇష్టం అని మనసులో మాట చెప్పాలని అనిపించింది. కానీ గుండెలో మొదలయిన ఆ మాటను గొంతులోనే నొక్కేసాను.

పనసుపొట్టు కూర, దబ్బకాయ పులుసు, ఐస్ క్రీం. ఇలా అనేక సూచనలు. వీటిమధ్య కర్ణపేయంగా వినబడింది ఓ మాట.

‘అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా ఇంటికి వచ్చినవాళ్లు ఎంతమంది అనిచూసుకోకుండా అప్పటికప్పుడు వంట చేసి పెట్టడం’

ఇది అందరికీ నచ్చింది.

కొడుకు సంతోష్, కోడలు నిషా ఈ బాధ్యత నెత్తికి ఎత్తుకున్నారు.

మా ఆవిడ క్రమం తప్పకుండా వెళ్ళే మా ఇంటికి దగ్గరలోని  ఓ దేవాలయాన్ని సంప్రదించారు. డబ్బు చెల్లించి ఓ అయిదు వందల మందికి అన్న వితరణ ఏర్పాటు చేశారు.

ఈ కరోనా కాలంలో పిలవకుండా ఎవరు వస్తారని అనుకున్నాను. రెండు రోజుల ముందే ఆ గుడిలో పలానా వ్యక్తి సంస్మరణలో అన్నదానం అని బోర్డు పెట్టారుట. మా చుట్టుపక్కల అపార్ట్ మెంట్లలో వుండే పెద్దపెద్ద వాళ్ళు కూడా వచ్చారు. ఈ లొకాలిటీలో నన్ను తెలిసిన వాళ్ళు అరుదు. ఆమెకి ఇంతమందితెలుసా! ఇంతమందికి ఆమె తెలుసా! అన్న సంగతి అప్పుడే తెలిసింది.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావుగారు  ఎనభయ్యో పడిలో కూడా, కరోనాని కూడా లెక్క చేయకుండా చనిపోయిన మరదలి మీద, నా మీద  ప్రేమాభిమానాలతో వచ్చి నిలబడి వడ్డన చేశాడు. నాకది ఎంతో అపూర్వంగా  అనిపించింది.

మనిషి ఎలాటివాడు అన్నది అతడు చనిపోయిన తర్వాత తెలుస్తుంది అంటారు.

భార్యను చూసి మొగుడు గర్వపడే అవకాశం నాకు ఇచ్చి వెళ్ళిపోయింది మా ఆవిడ.



(20-08-2021)            

18, ఆగస్టు 2021, బుధవారం

అంతా భ్రాంతియేనా! - భండారు శ్రీనివాసరావు

రహదారులపై వాహనాలు మితిమించిన వేగంతో వెళ్ళకుండా నియంత్రించాలంటే ఏం చెయ్యాలి. స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలి. నిఘా కెమెరాలను అమర్చాలి. ట్రాఫిక్ సిబ్బందినీ,  జరిమానాల మొత్తాన్నీ పెంచాలి లేదా ఉల్లంఘనులకు వేసే శిక్షలను మరింత కఠినతరం చేయాలి.

ఇవన్నీ ఎందుకని అనుకున్నారేమో కెనడాలో 'భ్రాంతి'ని నమ్ముకున్నారు.

చక్కని రహదారుల మధ్యలో అక్కడక్కడా గుంటలు తవ్వారు. వాటిని గమనించి వాహనదారులు ఎవరికివారే వేగం తగ్గించి నడపాల్సిన పరిస్తితి ఏర్పడింది. రోడ్ల గుంతల వల్ల వాహనాల వేగాన్ని బాగా నియంత్రించగలిగామని అక్కడివారు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదేం గొప్ప మా దేశంలో రోడ్ల కంటే గుంటలే  ఎక్కువని మనమూ గొప్పలకు పోవచ్చు కానీ కెనడా గుంటలు మనదగ్గర మాదిరిగా నిజం గుంటలు కావు. గుంతలమాదిరిగా కానవచ్చే పోస్టర్లను రోడ్లపై అతికిస్తారు.(ఫోటోలలో కనబడే చిత్రాలను గమనిస్తే అర్ధం అవుతుంది) వాటిని చూసి డ్రైవర్లు అసంకల్పితంగానే వేగం తగ్గిస్తారు. ఈ నకిలీ గుంటలను మార్చి మార్చి మరోచోటకు మార్చుకునే సౌలభ్యం కూడా వుంది. భ్రాంతితో భయం కలిగించి వేగనియంత్రణ చేస్తున్నారన్నమాట.

ఇంకో విషయం ఏమిటంటే ఈ సమాచారం ఇంటర్ నెట్లో బహుళ ప్రచారంలో వున్న ఓ 'ఈ వదంతి' అంటే, 'ఈ మెయిల్', 'ఈ సేవ'  మాదిరిగా 'ఈ వదంతి'  అన్నమాట. అది అన్నమాట అయినా, ఉన్నమాట అయినా వినడానికి, చదవడానికి బాగుంది కాబట్టి నమ్మేస్తే ఓ పనయిపోతుంది.     

NOTE: Courtesy Image Owner






మీడియా రాగాలు – భండారు శ్రీనివాసరావు

 

‘ఏది నిజం? ఏది నిజం?’
‘ఇదే నిజం, ఇటు చూడు, ఇటే చూడు’
‘అటు చూడకు అటు చూడకు!
‘అది చూపేదంతా, నిజం కాని చేదు నిజం.
‘ఇటు చూస్తే కనబడేది
సృష్టి లోని అసలు నిజం’
‘ఇటే చూడు అటు చూడకు’
“అటు చూడకు, ఇటే చూడు’

‘నిజం కోసం వేసారే ఓరి
పిచ్చివాడా! రాముని కాలం వాడా!
కనపడని నిజం కోసం
ఎందుకు నీకీ
వెతుకులాట!’

‘సరే నేను పిచ్చివాడ్ని, రాముడి కాలం వాడిని.
నిజమన్నది నిజమైతే
ఎందుకు ఈ బహురూపులు ?
నిజం నిజం ఎక్కడంటు, ఏదంటూ
ఎందుకు నాకీ
ఎదురుచూపులు?’

‘పిచ్చివాడివి నీవని
ఊరికె అనలేదు నేను
ఈ కలికాలంలో నిజాలకు
నిజరూపం లేనెలేదు
నిజం తోలు కప్పుకు
తిరుగుతున్నవన్నీ
పచ్చి పచ్చిఅబద్దాలు!
ఈ అబద్దాల గొంగట్లో
పుటం వేసి వెతికినా,
కనబడేది నిజం కాదు,
కానె కాదు’

‘ఏమి చేయమంటావు నన్ను?
నిజం కోసం వెతకనా! అబద్దాన్ని నమ్మనా!?’

‘ఈ నవయుగ మీడియాల
కాలంలో
మరోదారి లేదు నీకు.
కంటికి కనబడిందే
నిజమని నమ్ము.
నమ్మి చెడినవాడు లేడు,
ఈ లోకంలో సుమ్ము’

(17-08-2021)

17, ఆగస్టు 2021, మంగళవారం

ప్రేమలు, పెళ్ళిళ్ళు

 

ప్రేమ వివాహాల మీద సమాజానికి కొన్ని శంకలు, సందేహాలు వీటికి మించి చిన్నచూపు వున్న  కారణంగా చాలా ప్రేమలు పెళ్లి పీటల దాకా రావడం లేదు అనే వాదన ఒకటి వుంది. ఇందులో పూర్తిగా కాకపోయినా కొంత వాస్తవం లేకపోలేదు.

ఈ మధ్య తరచుగా టీవీల్లో చూస్తున్న పాత సినిమాలో ఒక ముసలి పాత్ర, ప్రేమించి పెళ్ళిచేసుకున్న కూతురుతో అంటుంది ‘నువ్వు సంతోషంగా వున్నావా తల్లీ!’ అని. అంటే ఎక్కడో మనసు మూలల్లో ఓ అనుమానం,  ప్రేమ పెళ్ళి చేసుకున్న ఆడపిల్లలు సంతోషంగా వుండరేమో అని.

మా కుటుంబంలో చాలా ప్రేమ పెళ్ళిళ్ళు జరిగాయి. నూటికి నూరు శాతం ఆ దంపతులందరూ సంతోషంగా, ఆనందంగా వున్నారు. ఈ క్రమంలో కొందరు, కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు కూడా చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ పెళ్లి రోజున చెప్పేది ఏమిటంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ ప్రేమను అంగీకరించి, ఆశీర్వదించిన కారణంగానే తామిలా హాయిగా, ఆనందంగా పిల్లాపాపలతో కాపురాలు చేసుకుంటున్నామని.

నాకు అర్ధం అయింది ఏమిటంటే ప్రేమ పెళ్ళిళ్ళు జయప్రదం కావాలంటే వాటికి ఇరు కుటుంబాల ఆమోదముద్ర వుంటే, వాళ్ళు చీకూ చింతా లేకుండా వైవాహిక జీవితాన్ని గడపగలుగుతారు.   

మా మేనకోడలు ఫణి కొలిపాక ఈరోజు ఫోన్ చేసింది. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు. వాళ్లది ప్రేమ వివాహమే.

“మామయ్యా! నా పెళ్ళిలో మీరు ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందో లేదో. పెళ్లి చేసుకుని సంతోషంగా వున్నట్టు కనపడడం కాదు, నిజంగా సంతోషంగా ఉండాలని మీరు మాకు చెప్పారు” అంటూ గుర్తు చేసింది.

నిజంగా నాకు గుర్తు లేదు. కానీ ఫణి మాటల్ని బట్టి, హాయిగా సాగిపోతున్న వారి కాపురాన్ని బట్టి చూస్తే ఫణి మాత్రం నా మాటలు గుర్తు పెట్టుకుని ఆచరిస్తున్నట్టే అనిపించింది. అంతకంటే ఏం కావాలి?

Happy marriage anniversary Ramesh garu, Phani. 

(17-08-2021)

16, ఆగస్టు 2021, సోమవారం

వాగ్ధాటికి మారుపేరు వాజ్ పాయ్

 

(ఈరోజు ఆయన వర్ధంతి)
అరవై ఏళ్ళ పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో గాంధీ మునిసిపల్ హైస్కూలు ఆవరణలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని వాజ్ పాయ్.
భాష అర్ధం కాని వారిని సయితం తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మరణ ఘడియలు దగ్గర పడేముందు మాట పడిపోవడం విధి వైచిత్రం.



“మౌత్ కి ఉమర్ క్యా హై?
దో పల్ భీ నహీ”
– కీర్తిశేషులు వాజ్ పాయ్ రాసుకున్న కవితా పంక్తులు

15, ఆగస్టు 2021, ఆదివారం

జాతికి ఇవ్వాల్సిన కానుక – భండారు శ్రీనివాసరావు

 

 (ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

దసరా, దీపావళి, సంక్రాంతి  మొదలయిన పండగల సరసన చేర్చదగిన జాతీయ పర్వదినాలు ఆగస్టు పదిహేను, జనవరి యిరవై ఆరు.

పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో స్వతంత్ర భరతజాతి యావత్తు ఒక్కటై జరుపుకున్ననాటికి  నేను నెలల బిడ్డని. రెండో పండగ, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని  తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూఇటుగా నాలుగేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి.


నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరిలో పాల్గొనే వాళ్ళం.


ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది.  'జనగణమన' గీతంలో ఏఏ భాషల ప్రస్తావనవుందో, ఏఏ ప్రాంతాల  ప్రసక్తి వుందో మాకు అప్పటికి తెలియదు.  ఆ గీతాన్ని ఎవరు రాసారో,  ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం.

జనగణమన చరణాలలోని  'న' ను 'న' లాగా, 'ణ' ను 'ణ' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే అప్పుడు  మాకు తెలిసింది. ఢిల్లీ  ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ  జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.

అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?

'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అంటే, ‘కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలు నసిగే  రోజులు వచ్చేసాయి. పండగదినం స్థానంలో సెలవురోజు వచ్చింది. తప్పులు లేకుండా ‘జనగణమన' పాడడం పోయి  ఆ  గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. భారతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండవాదం కూడా  పుట్టుకొచ్చింది. ఏటేటా జరిగే  పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్య, నిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ , జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.


సైనిక కవాతులు, శస్త్రాస్త్ర ప్రదర్శనలు, భారీ టాంకులు, వైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతను, జాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే, మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?

శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి  దారుణం?

మతమన్నది మనకంటికి మసకయితే

గతమన్నది మనకంటికి కురుపయితే

మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం వారు,  ఈనాటి పరిస్తితులను చూసి, 'మనం కోరుకున్న స్వేఛ్చాభారతం ఇదేనా  అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?

మతాల దురభిమానాలతో, కులాల కుంపట్లతో, ప్రాంతీయ ద్వేషాలతో దేశం  యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే,

స్వార్ధమే పరమావధిగా, సంపాదనే ఉపాధిగా, అడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా , నీతికి దూరంగా, అవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై  జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే,

జనరంజకంగా పాలించాల్సిన అధికార  యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే,

రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్థలు, మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి  కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితం, తానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే,

జనం నిస్సహాయంగా నిలబడి చూడాల్సి రావడం యెంత విషాదం, యెంత దారుణం, యెంత దుస్తరం, యెంత బాధాకరం?  

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, ప్రపంచం గర్వించదగిన  గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు  ఈ ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో  కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా,  ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా  పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్థా నాన్ని పదిలం చేసుకుంది.

జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'ఓటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం.

అక్షరజ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి.

గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది.

వీసెలు, మణుగుల తూకాల నుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు,  'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా   ఇంకా 'మైలు'రాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.

చదువూసంధ్యా లేనివాళ్లనీ, ఎందుకూ  పనికిరాని వాళ్ళనీ మనపై   ఇతర దేశాల వారికి చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్లు,  దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో ఓటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత  ఒకే బాలట్ పేపరుపై  ముద్రించిన అనేక పార్టీల  గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే   గుర్తుపట్టి  ఓటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన  ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు. 

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్తస్థితిని  అధిగమించి  ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.

'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన  దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ  క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి తప్పించుకుని స్వయంసమృద్ధిని సాధించుకోగలిగాము.

ఏ ఇంగ్లీష్ వారితో తలపడి, అహింసా మార్గంలో వారితో  పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఆ ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని, దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.  

అయితే , 'అంగట్లో  అన్నీవున్నా అల్లుడి నోట్లో శని' అన్న సామెత చందంగా  ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది. స్వతంత్ర భారతం ఆలపిస్తున్న స్వేఛ్చా గీతికల్లో వుండి వుండి అపశ్రుతి వినబడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. కానీ, నడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. కాలికి కాలే అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

విభిన్న స్వరాలతో వినిపిస్తున్న సందేశం మంచిదే. కానీ మధ్య మధ్య వినబడుతున్న  అపస్వరాలు అసలు అర్ధాన్నే మార్చివేస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే  వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది. హరించి వేస్తోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగా, ధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా, అవలక్షణలక్షిత సమాజం కళ్ళముందే ఆవిష్కృతమవుతోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యం, అతి సహజం. కానీ  అవి  తాత్కాలికం కావాలి. శాశ్వతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత  మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండా, తప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం. అభివృద్ధి సురుచిర సాధ్యం.

భారత స్వాతంత్ర దినోత్సవ శుభసమయంలో  మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

(15-08-2021)





ఇలా కూడా చెప్పొచ్చు

 

డెబ్బయ్యవ దశకంలో నేను నార్ల వారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు నాకు తొలి గురువు నండూరి రామమోహన రావు గారు. ఆయనా, పురాణం గారు అవ్యాజానురాగంతో నన్ను అనేక విధాలుగా ప్రోత్సహించారు.
ఈ క్రమంలో నండూరి వారు కొన్ని అదనపు బాధ్యతలు నా భుజంపై మోపారు. కానీ నాకు అదనపు భారం అనిపించలేదు. సంతోషపడ్డాను కూడా.
ఆరోజుల్లో ఇప్పటిలా కంప్యూటర్లు లేవు. ఏ రచన అయినా చేతి రాతే. ఆఫీసులో కింద కంపోజింగ్ విభాగం వుండేది. చిన్న చిన్న అరలతో కూడిన నిలువెత్తు చెక్క బల్లల ముందు నిలబడి అక్షరాలు కూర్చేవారు. ఆ అరల్లో సీసంతో తయారు చేసిన తెలుగు అక్షరాలు, వత్తులు, దీర్ఘాలతో సహా అన్ని సైజుల్లో ఉండేవి. మేము పంపించిన వ్యాసాలు లేదా రచనల కాగితాలను చిన్న చిన్నగా కత్తిరించి వాటిని ముందు పెట్టుకుని కళ్ళు చికిలించుంటూ పేరాలు పేరాలుగా కంపోజ్ చేసేవారు. వార్తలకు ఒక సైజు అక్షరాలు, హెడ్డింగు లకు ఒక సైజ్, సబ్ హెడ్డింగులకు మరో సైజు ఇలా అన్నమాట. ఆ సైజుల్ని పాయింట్లు అనేవారు. 36 పాయింట్ 24 పాయింటు 16 పాయింట్, 12 పాయింట్ ఇలా ఉండేవి. తరువాత వాటిని న్యూస్ ప్రింట్ కాగితాలపై రోల్ చేసి, ప్రింట్ వేసి ప్రూఫ్ రీడర్లకు పంపేవారు. ప్రూఫ్ దిద్దిన వాటిని పొడవాటి ఎస్ గ్యాలీల రూపంలో సబ్ ఎడిటర్లకు పంపేవారు. వాళ్ళు సరిదిద్దిన వాటిని మళ్ళీ రోల్ ప్రింట్ వేసి నండూరి వారి టేబుల్ వద్దకు చేర్చేవాళ్ళు. ఆయన చూసిన తర్వాత ఇక ఫైనల్. వాటిని పేజి మేకింగ్ సెక్షన్ కు పంపడం జరిగేది.
రామ్మోహన రావు గారు సంపాదకీయం రాసేవారు. అదే ఎడిట్ పేజీలో, సంపాదకీయం కింద రోజువారీగా నేను రాసే వాక్టూన్లు, బయటివారు రాసిన ఆర్టికిల్స్ ప్రచురించేవారు. అప్పుడప్పుడు వాటిని కంపోజ్ చేయించి పేజీలో పెట్టే బాధ్యత నామీద పడేది. ఒక్కోసారి ఆర్టికిల్ సైజ్ ఎక్కువ కావడం వల్ల పేజీలో సరిపోయేది కాదు, మరో పేజీలో తరువాయి భాగం అని రాయడానికి నార్ల వారి నిబంధనలు ఒప్పుకునేవి కావు. మధ్య మధ్యలో కొన్ని పదాలు, మార్చడం, లేదా వాక్యాలు తీసివేయడం చాలా కష్టంగా వుండేది. అనుభవలేమి కారణంగా, రచయితలు పంపిన వ్యాసాలలో చివరి పేరాలు తీసేసేవాడిని, పేజీలో పట్టడానికి వీలుగా.
ఈ విషయం నండూరి వారి దృష్టికి వచ్చినట్టుంది. నన్ను పిలిచి చెప్పారు.
‘శ్రీనివాసరావు గారు! ఒక విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ప్రతి రచయితకు తాను రాసిన ప్రతి రచన సొంత బిడ్డలాంటిది. వాటిని మన వీలుసాలు కోసం ఇష్టం వచ్చినట్టు మారిస్తే వాళ్ళ మనసు బాధ పడుతుంది. కావాలంటే నా ఎడిటోరియల్ తగ్గిద్దాము. అంతే కాని రచయితలను మనస్తాపానికి గురిచేయవద్దు’
ఆయన ఇదే విషయాన్ని మరోలా అంటే దాష్టీకంగా చెప్పవచ్చు. కానీ ఆయన తరహా వేరు. చాలా సూటిగా, సున్నితంగా చెప్పడం ఆయనకు అలవాటు.
ఆ రోజులకు, అలాంటి ఎడిటర్లకు శత సహస్ర వందనాలు
(15-08-2021)