27, ఫిబ్రవరి 2021, శనివారం

నవ్వుకుని వదిలేస్తే పోలా – భండారు శ్రీనివాసరావు

 

Srinivasa Subrahmanya Sai Bhagavatulaగారు  నా వేరే  పోస్టుకి కామెంటు పెడుతూ ఈ కింది ప్రశ్న అడిగారు. జవాబు క్లుప్తంగా ఇవ్వడం కుదరక  మళ్ళీ  ఓ పాత పోస్టునే  పెడుతున్నాను. వారికి  నా కృతజ్ఞతలు

వారిలా రాశారు:

 

 

“ఇది సందర్భం కాదు అని తెలుసు, అయినా సాహసించి ఇక్కడ మిమ్ములను అడుగుతున్నాను,దయచేసి అన్యధా భావించకండి.

మీరు నెహ్రూ కాలాల్లో ఆయన పరిపాలనపై ఊమెన్ అనే కార్టూన్ చిత్రకారుడు వేసిన వ్యంగ్య కార్టూన్ లపై నెహ్రూగారు ఎప్పుడైనా అసహనం చూపించటం గానీ, మండిపడటం కానీ విన్నారా, చూశారా చదివారా ?

కిందిది నా జవాబు :

 

 

నవ్వుకుని వదిలేస్తే పోలా – భండారు శ్రీనివాసరావు

సామాన్యుడికి ఊరట కలిగించేవి చిన్న చిన్న కార్టూన్లు, జోకులు. దినవారీ సీరియస్ వాతావరణం నుంచి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. దురదృష్టం ఏమిటంటే, ఆరోగ్యకరమైన, ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలను కూడా హరాయించుకోలేని వాతావరణం ఈనాడు సమాజంలో వుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో, వారి అనుయాయుల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ రోజురోజుకీ తగ్గిపోతోంది. ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో ఇదొకటి.

ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం. 1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి ఘోర పరాభవం ఎదురయినప్పుడు, ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్ అది. నెహ్రూ అభిమానులనుంచి దాడి తప్పదని అనుకుంటుంటే, ఊహించని విధంగా లక్ష్మణ్ గారికి నెహ్రూ నుంచి ఫోన్ వచ్చింది.

ఈరోజు ఉదయం పత్రికలో మీ కార్టూన్ చూశాను. చూడగానే నాకెంతో సంతోషమయింది. నా మనసుకు ప్రశాంతత చిక్కింది. నాదో కోరిక. అదే కార్టూన్ ని కొంచెం పెద్దదిగా గీసి పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అడిగారు నెహ్రూ, కాసింత శ్లేషతో కూడిన హుందాతనం చూపిస్తూ. (https://www.ndtv.com/opinion/when-nehru-was-caricatured-by-rk-laxman-558107)

వెనక, ప్రసిద్ధ కార్టూనిస్టు శంకర్ ఆధ్వర్యంలో శంకర్స్ వీక్లీ అనే పూర్తి నిడివి కార్టూన్ల పత్రిక వచ్చేది. ఇందిరాగాంధీ హయాములో దేశంలో ఎమర్జెన్సీ అమలు అవుతున్న కాలంలో పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా కార్టూన్ గీయడం తనకు సాధ్యం కాదని చెబుతూ ఆయన ఆ పత్రిక ప్రచురణనే నిలిపివేశారు.

ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా, వారివారి అనుయాయులవారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.

బాపూ సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి.

అది కూడా రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.

అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓ హెలికాప్టర్ కొని దానికి యాదగిరి అని పేరు పెట్టారు. ఒక ప్రముఖ పత్రిక అంజయ్య గారి కార్టూన్ వేసినప్పు డల్లా ఆయన వేలికి హెలికాప్టర్ కట్టి ప్రచురించేది. అయన కూడా అది చూసి నవ్వుకునే వారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కాలం తెచ్చిన మార్పు ఇది. అప్పుడు హెలికాప్టర్ అసహజం, ఇప్పుడు విమానాలు సహజం. ప్రతి విమర్శా, ప్రతి జోకూ రాజకీయ నాయకులను ఎద్దేవా చేయడానికి ఉద్దేశించించినవని అనుకోకూడదు.

నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు అలా కార్టూన్ల రూపంలో వ్యక్తీకరింపబడుతుంటాయి. వాటిని చూసి, చదివి హాయిగా నవ్వుకోగలిగితే (అంజయ్య గారిలాగా) ఏ గొడవా వుండదు. (15-11-2020)

 

26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

News Watch With Journalist Bandaru Srinivas rao Part 1 (2014)


రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయి,   తెలంగాణా రాష్ట్రం  ఆవిర్భావానికి   ముందు,  అప్పటి  ఎన్నికలపై  ఇచ్చిన ఇంటర్వ్యూ. ఒక మిత్రుడు  అమెరికా నుంచి వాట్సప్ లో పంపారు, ఇప్పటి ఎన్నికల పరిస్తితులకు అనుగుణంగానే ఉందంటూ.


చివరి నవ్వు

 

2019, ఆగస్టు.
గలేరియా మాల్ లో ఓ షాపు.

“ఎంత”
“ట్వెల్ ఫిఫ్టీ”
“అయితే నాలుగివ్వండి” అన్నాను పర్సులో నుంచి యాభయ్ నోటు తీస్తూ.

అప్పుడు వినపడింది నవ్వు.
ముందు సేల్స్ గర్ల్ అనుకున్నాను.
ఆమె వైపు చూస్తే ఆ అమ్మాయి నా మొహం లోకి చూస్తూ సన్నగా మందహాసం చేస్తోంది. మరి అంత బిగ్గరగా నవ్వుతోంది ఎవరు?
తీరా చూస్తే మా ఆవిడే.

నవ్వుతోంది. చిన్నగా కాదు. పగలబడి నవ్వుతోంది. అందరూ చూస్తున్నారు అనే ధ్యాస లేకుండా.
బహుశా అంత హాయిగా నవ్వింది మా నలభయ్ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో మొదటిసారి అనుకుంటా. అందుకే అలా చూస్తుండి పోయాను.

అంతగా నవ్వు తెప్పించే మాట అమాయకంగా ఏమన్నాను?
ఆ తర్వాత తెలిసింది, ఆమె నవ్వింది నా అమాయకత్వాన్ని చూసి కాదు, నా తెలివి తక్కువతనాన్ని చూసి అని.

తర్వాత ఉబెర్ లో ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఆ నవ్వు అలా తెరలు తెరలుగా వస్తూనే వుంది.
“మీకు కిలో కాఫీపొడుం రేటు తెలవదు, అలాంటి షాపుల్లో పదీ పరక్కూ దొరుకుతాయని ఎలా అనుకున్నారు” అని నవ్వుతూనే అంది.

ఇంతకీ ఆ రోజు జరిగింది ఏమిటంటే సినిమా చూసి వస్తూ ఓ షాపులోకి వెళ్ళాము. ఏదో తల నూనె కొన్నది. చూడబోతే చిన్నసీసా.
డబ్బులు ఇవ్వబోతూ నేనడిగిన ప్రశ్న”ఎంత” అని. “ట్వెల్ ఫిఫ్టీ” అన్నది షాపులోని అమ్మడు. “పన్నెండున్నర రూపాయల సీసా కోసం మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు ఒకేసారి నాలుగు సీసాలు కొనుక్కోవచ్చు కదా” అంటూ యాభయ్ నోటు తీశాను. నిజానికి దాని ధర పన్నెండు వందల యాభయ్ రూపాయలు. ఈ విషయం తనకు తెలుసు. నాకు తెలవదు. మరి నాది అమాయకత్వమో, తెలివితక్కువతనమో కూడా తెలియదు. ఏదైతేనేం అది చూసే ఆమెకు నవ్వొచ్చింది. మామూలుగా కాదు. తెరలుతెరలుగా.

ఇలా పగలబడి నవ్వడం మొదటిసారి. నాకప్పుడు తెలియదు, మరో వారం తర్వాత అదే చివరిసారి అవుతుందని.

నవ్వు లాగే జ్ఞాపకాలు.
తెరలు తెరలుగా అలా వస్తూనే వుంటాయి.

23, ఫిబ్రవరి 2021, మంగళవారం

నడిచివచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు (Idream)


చెప్పింది చెప్పినట్టు, చెప్పింది మార్చకుండా (ఇంటి పేరుతొ సహా) నా జీవనయాన క్రమాన్ని నాతోనే చెప్పించిన  ఐ డ్రీం (Idream) నాగరాజు గారికీ, అ సంస్థ యాజమాన్యానికీ కృతజ్ఞతలు. 

https://youtu.be/jVNIPkwB_48


21, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఓ మంచి పుస్తకం చదివాను – భండారు శ్రీనివాసరావు

 మంచి పుస్తకం చదవడానికి, మంచి సినిమా చూడడానికి, మంచి పాట వివిధభారతిలో వినడానికీ చెరువులో చేపలు పట్టేవాడికి ఉన్నంత ఓపిక వుండాలని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు చెబుతుండేవారు. గాలం వేసి ఎంతో ఓపికగా ఎదురుచూడగా, చూడగా ఒక మంచి చేప ఆ గేలానికి చిక్కుతుంది. అలాగే పుస్తకాలు, సినిమాలు, రేడియోలో పాటలు కూడా. చదవగా చదవగా ఓ మంచి పుస్తకం, చూడగా చూడగా ఓ మంచి సినిమా, వినగా వినగా ఓ మంచి పాట అలా అన్నమాట.

సలీం గారు మంచి రచయిత. గతంలో వారి కధలు అనేక పత్రికల్లో చదివాను. బాగా రాస్తుంటారు, పెద్ద ఉద్యోగ బాధ్యతల నడుమ తీరిక చేసుకుని.
ఆ మధ్య తాను రాసిన ఒక నవలను అభిమానంతో నాకు కొరియర్ లో పంపారు. చాలా రోజులుగా అది మంచంమీద నా తలగడ పక్కనే వుండేది. ఏరోజుకారోజు చదవాలని అనుకోవడం. మరేదో రాసే హడావిడిలో దాన్ని పక్కన పెట్టడం.



రాత్రి శనివారం బాగా పొద్దుపోయిన తర్వాత సలీం గారి నవల చేతిలోకి తీసుకున్నాను. అలా చదువుతూ పోయాను. గంట, రెండు గంటలు అలా సమయంతో నిమిత్తం లేకుండా చదువుతూనే వున్నాను. పూర్తిచేసిన తర్వాత కానీ పుస్తకం కింద పెట్టలేదు, నేను నిద్ర పోలేదు.
మంచి పుస్తకం అంటే ఒక పెద్దాయన చెప్పిన నిర్వచనం జ్ఞాపకం వచ్చింది.
“ఏకబిగిన చదివించగలగాలి. చదవడం పూర్తి చేసిన తర్వాత కూడా చాలా సేపు ఆ లోకంలోనే వుండిపోగలిగేలా చేయగలగాలి. గుండె గొంతుకలో కొట్టాడుతున్నఅనుభూతి కలిగించాలి”
సలీంగారు రాసిన “మౌన రాగాలు” అనే ఈ పుస్తకానికి ఆ మూడు లక్షణాలు వున్నాయని చదవడం పూర్తి చేసిన తర్వాత నాకనిపించింది.
అభినందనలు సలీంగారూ. (21-02-2021)

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం లో కేంద్రానిదే తుది నిర్ణయం - Bhandaru Srini...