11, జూన్ 2019, మంగళవారం

అణకువ కూడిన అధికారం



ఖమ్మంలో మా మేనకోడలి కుమార్తె వివాహానికి వెళ్లి హైదరాబాదు వచ్చాము. ఉదయం పదిగంటల ప్రాంతంలో ఫోను.
‘వైస్ ప్రెసిడెంట్ గారి పీఎస్ ని విక్రాంత్ ని. సారు మాట్లాడుతారు’
‘ శ్రీనివాసరావ్ ! చూడు మొన్న మీరు వచ్చి కలిసి గోరాశాస్త్రి గారి శతజయంతి కార్యక్రమానికి రమ్మన్నారు. ఇరవై నాడు పెట్టుకోమని చెప్పాను. పార్లమెంట్ సమావేశాలు వున్నాయి. రాజ్యసభ శనివారం ఎక్స్టెండ్ అయితే ఇబ్బంది. ఆ తరువాతి వారం పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా!’ అన్నారు అవతల నుంచి వెంకయ్యనాయుడు గారు.
నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆ మాట ఆయన ఫోను చేసి మరీ చెప్పక్కర లేదు. ఆయన పియ్యే ఫోను చేసిచెప్పినా సరిపోయేది.
ఆయనే తిరిగి  అన్నారు ‘మా వాళ్ళు మీతో కో ఆర్డినేట్ చేస్తారు. డేట్ ఫిక్స్ చేసి రెండ్రోజుల్లో చెబుతారు’
అలా చెప్పడం వెంకయ్యనాయుడి గారి హుందాతనం.
రేడియో రోజులు జ్ఞాపకం వచ్చాయి. అసెంబ్లీలో ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆయన రాష్ట్రంలో ఎక్కడ ప్రెస్ తో మాట్లాడినా హైదరాబాదు మాకు ఫోను చేసి చాలా క్లుప్తంగా చెప్పేవారు. మేము రేడియో వార్తల్లో యెంత ఇవ్వగలమో అంతే చెప్పేవారు. సాయంత్రం వార్తలు విని ‘బాగానే వచ్చింది’ అంటూ మళ్ళీ ఫోను చేసి చెప్పేవారు. చేసేవారు. ‘మరో పాయింటు వుంది, అది రేపు ఉదయం వార్తల్లో కలిపి ఇవ్వడానికివీలుంటుందా’ అంటూనే అది కూడా  చెప్పేవారు.
ఉదయం వార్తల్లో అది కూడా వస్తుందని నేను వేరే చెప్పక్కర లేదనుకుంటా.  


Debate on Allocation of Ministerial Portfolios | AP CM Jagan Reddy Cabin...

AP CM Jagan tries to Touch PM Modi Feet | Right or Wrong? Bhandaru Srini...





తెలుగు పాపులర్ టీవీ లో శ్రీ పవన్ కుమార్ ఏపీ రాజకీయ అంశాలపై నిర్వహించిన ముఖాముఖి చర్చలో నేను....

Why YSRCP MLA RK Roja didnt get Minister Berth: Bhandaru Srinivasa Rao E...





 ....



తెలుగు పాపులర్ టీవీ లో శ్రీ పవన్ కుమార్ ఏపీ రాజకీయ అంశాలపై నిర్వహించిన ముఖాముఖి చర్చలో నేను....






10, జూన్ 2019, సోమవారం

Will Pawan Kalyan Continues His Political Strategies in AP? | The Debate...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం  గోపి  నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ రఘురాం (బీజేపీ), శ్రీ కిరణ్ (జనసేన), శ్రీ గోవిందరెడ్డి (వైసీపీ)

8, జూన్ 2019, శనివారం

కొలువు తీరిన కొత్త ప్రభుత్వం – భండారు శ్రీనివాసరావు


(published in SURYA telugu daily in it's EDIT PAGE on 09-06-19, SUNDAY) 

పాతికమంది మంత్రులలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీలకు చెందినవారికే ఒక్కొక్కటి చొప్పున ఈ అయిదు పదవులు. ఈ మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ళ వరకూ మార్చరు. మార్పులు చేర్పులూ ఏమి చేయాల్సి వచ్చినా ఆ తరవాతనే.
ఇది సాహసమనాలా! దుందుడుకుతనం అనాలా!  అభిమానులు సాహసం అంటారు. వ్యతిరేకులు తెంపరితనం అంటారు. ఏ పేరుతొ పిలిచినా, ఎవరు ఏమనుకున్నా వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తాను అనుకున్నట్టే చేశారు. చేయగలిగారు. ఆయనది ప్రాంతీయ పార్టీ కాబట్టీ, ప్రజలు అత్యధిక స్థానాలు కట్టబెట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు కాబట్టి జగన్ మోహన రెడ్డి ఈ విధంగా దుస్సాహసాలు చేయగలుగుతున్నారనీ సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు లేకపోలేదు. కానీ ఈ వాదన సరికాదు. గతంలో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులకీ, మరికొన్ని జాతీయ పార్టీల నాయకులకీ ప్రజలు ఇదే మోస్తరుగా అధికార పగ్గాలు అప్పగించిన దాఖలాలు వున్నాయి. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా జగన్ మాదిరిగా ఈ స్థాయిలో ప్రయోగాలు చేయలేదని నిక్కచ్చిగా చెప్పొచ్చు.   
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వై.ఎస్. జగం మోహన రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఈ కోవలోకే వస్తాయి. అవి సాహసోపేతమైనవా, దుందుడుకు చర్యలా అనేది కాలమే తేలుస్తుంది.
మొత్తం పాతిక మంది మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. వీరిలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని ముఖ్యమంత్రి జగన్ నిన్ననే ప్రకటించారు. రాజ్యాంగం మూడో షెడ్యూల్ ప్రకారం ఉపముఖ్యమంత్రి అంటూ పేరుపెట్టి ఎవరిచేతా ప్రమాణం చేయించడానికి వీలుండదు. అంచేత, పలానా వారు ఉప ముఖ్యమంత్రి అంటూ విడిగా జీవోలు జారీ చేస్తారు. మంత్రుల ప్రమాణ స్వీకారకార్యక్రమం ముగిసిన గంటల వ్యవధిలోనే ఉప ముఖ్యమంత్రులకు,మిగిలిన మంత్రులకు శాఖలు కేటాయిస్తూ  ప్రకటన వెలువడింది. పుష్ప శ్రీ వాణి (ఎస్టీ), సుచరిత (ఎస్సీ), అంజాద్ భాషా (మైనార్టీ), పిల్లి సుభాష్ చంద్ర బోస్ (బీసీ), ఆళ్ళ నాని (కాపు) ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక మహిళకు హోం శాఖను అప్పగించి ఒక చక్కటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మళ్ళీ ఆయన కుమారుడు వై.ఎస్. జగన్ సైతం అదే బాటలో హోంమంత్రిగా ఒక మహిళను నియమించారు.
శాసన సభలో మొత్తం 175 స్థానాలు వుంటే వాటిలో 151 జగన్ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. అదొక అద్భుత విజయం. ఇంతమంది అధికార పక్ష సభ్యుల నుంచి కేవలం పాతికమందిని మంత్రులుగా ఎంపిక చేసుకోవడం మాత్రం అంత ఆషామాషీ కాదు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించినప్పటి నుంచి కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేసేవరకు ఆయన తీసుకున్న వ్యవధానం ఒకరకంగా తక్కువే అయినా ఈ కొద్ది సమయంలోనే కాబోయే మంత్రులు గురించి అనేక ఊహాగానాలు అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వెల్లువెత్తాయి. ఆశావహుల సంఖ్య  ఎక్కువ. తీసుకోవాల్సిన సంఖ్య చాలా తక్కువ. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా, కులాలు, మతాల వారీగా అన్ని వర్గాలను సంతృప్తి పరచడం అనేది కత్తిమీది సామే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు చెబుతూ వుండేవారు,  ముఖ్యమంత్రికి ఎదురయ్యే మొదటి పరీక్ష మంత్రివర్గం ఏర్పాటు చేయడమని.  ‘అలాగే మంత్రివర్గ విస్తరణ. ఈ రెండూ ఏ సీఎం కయినా అత్యంత క్లిష్టతరమైన సమస్యలు, ప్రత్యేకించి మా వంటి జాతీయ పార్టీ ముఖ్యమంత్రులకు’ అనేవారాయన.
అందుకే కాబోలు జగన్ మోహన రెడ్డి ఇందుకోసం ఒక మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కనబడుతోంది. అదే ఆది నిష్టూరం.
వైసీపీ లెజిస్లేచర్ సమావేశాన్ని ఆయన దీనికి ఉపయోగించుకున్నట్టుగా వుంది. మంత్రివర్గం కూర్పులో తన మనసులో ఉన్న విషయాలను నిజాయితీగా వారితో పంచుకున్నారు. పరిమితులు గురించి వారికి నచ్చచెప్పినట్టుగా కనబడుతోంది. ఏ విషయాన్ని అయినా దాపరికం లేకుండా సంబంధించిన వారితో పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
పార్టీ ఏర్పడినప్పటి నుంచి, పార్టీ ఎన్నో ఇబ్బందులలో ఉన్నప్పటి రోజుల నుంచి అంటిపెట్టుకుని ఉన్న అనేక ప్రముఖమైన పేర్లు మంత్రుల జాబితాలో లేకుండా పోయాయి. పైగా రెండున్నరేళ్ళ వరకు వడ్డన పూర్తి చేసారు. కొసరు  వడ్డనపైనా, మారు వడ్డనపైనా ఆశలు పెట్టుకోకుండా ఆ విషయంలో ఒక విస్పష్టమైన ప్రకటన చేశారు. వర్తమాన రాజకీయాల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సాహసమైనా వుండాలి, ఎవరినీ లెక్కచేయని  గుండె ధైర్యం అయినా వుండాలి.
అగ్ర కులాల వారిని  తగు మోతాదులోనే మంత్రులుగా తీసుకుని, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేయడం, అదీ ఈస్థాయిలో జరగడం నిజంగా విడ్డూరమే. ఈ మధ్యకాలంలో కనీవినీ ఎరుగని విషయమే. బహుశా ప్రజలకు చేసిన వాగ్దానాలను నిర్దిష్ట కాలంలో పూర్తిచేసి చూపాలంటే నమ్మకంగా కష్టించి పనిచేసే జట్టు అవసరం ఎంతయినా వుంటుంది. ఫలితాలను రాబట్టే ఈ జట్టును ఎన్నికల ముందు వరకు కొనసాగించి, హామీల అమలు పట్ల ప్రజల్లో ప్రభుత్వ పనితీరు పట్ల  నమ్మకాన్ని పెంచడం, ఆ తర్వాత ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని అందుకు సంసిద్ధం చేసే విధంగా ఫలితాలను రాబట్టే మరో జట్టును అప్పుడు ఎంపిక చేసుకోవడం అనే ద్విముఖ వ్యూహంగా కనబడుతోంది. రాజకీయ నాయకుడిలో అటు పాలననూ, ఇటు పార్టీ నిర్వహణనూ సమంగా సంభాళించుచుకునే సామర్ధ్యం వుండాలి. ఈ వ్యూహాలన్నీ ఆ దిశగా వేస్తున్న అడుగులు అని పరిశీలకులు భావిస్తున్నారు.         
ఒక విషయం అందరూ గమనించి వుంటారు. తమ పార్టీ గెలుపు తధ్యమని నిర్ధారించుకున్న మరుక్షణం నుంచీ జగన్ మోహన రెడ్డి తాను ప్రయాణించాల్సిన  మార్గాన్ని గురించి ఒక నిర్దుష్టమైన అవగాహనకు వచ్చి వుండాలి. ఈ అయిదేళ్ళ కాలంలో ప్రతి నిమిషం అమూల్యమైనదిగా భావించివుండాలి. అందుకే కాబోలు చేసే ప్రకటనలలో ఆ ఉరవడి. వేసే అడుగుల్లో ఆ వడివడి.
కాని పక్షంలో తనంతట తానుగా ప్రత్యేక హోదా గురించీ,  మద్య నిషేధం గురించీ ప్రస్తావించాల్సిన అవసరం ఆయనకు లేదు. ముందెప్పుడో ప్రతిపక్షాలు గుర్తుచేస్తే అప్పుడు చూసుకోవచ్చని మిన్న కుండాల్సిన అంశాలు ఇవి. కానీ జగన్ తీరే వేరు. మొదటి రోజునుంచే ఆయనే వీటి ప్రస్తావన తెస్తున్నారు. ప్రత్యేక హోదాపై  కేంద్రం కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించినా, రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఇది కుదిరేపని కాదని పనికట్టుకుని పదేపదే చెబుతున్నా జగన్ మోహన రెడ్డి ఈ విషయంలో తన పంధా వీడినట్టు కానరావడంలేదు. పై పెచ్చు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసివచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీకి సంఖ్యాబలం తగ్గివున్నట్టయితే బాగుండేది, మనం బెట్టు చేసి ఒప్పించడానికి వీలుండేది అనే పద్దతిలో మరో కుండ బద్దలు కొట్టారు. అదే సమయంలో ‘జగన్ మోహన రెడ్డితో తన సమావేశం అద్భుతంగా జరిగిందని మరో పక్క ట్వీట్ చేస్తున్న సమయంలోనే జగన్ ఈ విధంగా మాట్లాడడం కాకతాళీయం కావచ్చు కానీ, రాజకీయంగా చేయాల్సిన ప్రకటన కాదని జగన్ ని విమర్శించిన వాళ్ళూ వున్నారు. అయితే జగన్ లో జనం మెచ్చిన ప్రత్యేకత ఇదే అనే విషయాన్ని వాళ్ళు మరచిపోతున్నారు.
అలాగే మద్య నిషేధం. ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాటను వేదంగా భావించే తత్వం కనుక ఆయనే ఈ అంశాన్ని తన ప్రాధాన్యతల జాబితాలో చేర్చుకున్నారు. ఖజానా బోసిపోతుందేమో అనేదానితో నిమిత్తం లేకుండా, మద్యం అమ్మకాల ద్వారా  వచ్చిపడే అపార నిధులు లేకుండా ఇచ్చిన హామీల అమలు ఎలా సాధ్యమవుతుందని లిప్తపాటు కూడా ఆలోచించకుండా జగన్ మోహన రెడ్డి మద్యంపై యుద్ధాన్ని ఏకపక్షంగా ప్రకటించారు. అయిదేళ్ళ కాలంలో మద్యాన్ని అయిదు నక్షత్రాల హోటళ్లకు మాత్రమె పరిమితం చేస్తూ దశలవారీగా నిషేధం అమలుచేస్తామని స్పష్టం చేసారు. అందులో భాగంగా ముందు బెల్ట్ షాపులపై బెల్ట్ తీసారు.
రివర్స్ టెండరింగ్. మొదట వినగానే జగన్ కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగానే ఆంగ్ల పడికట్టు పదాల గారడీ చేస్తున్నారని అనిపించే అవకాశం వుంది. కానీ పరిపాలనలో ముఖ్యంగా ఆర్ధిక కుంభకోణాలకు కేంద్రాలుగా మారుతున్న భారీ కాంట్రాక్టులలో పారదర్శికతను తీసుకురావడానికి జగన్ మోహన రెడ్డి ఈ రివర్స్ టెండరింగ్ విధానానికి రూపకల్పన చేసారు. నిజానికి ఇదికొత్త విషయం కాదు. పాదయాత్ర సందర్భంలో అనేక బహిరంగ సభల్లో ప్రజలకు ఈ విధానాన్ని గురించి వివరిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జగన్ మోహన రెడ్డి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలుసుకుని ఈ విధానాన్ని కార్యరూపంలోకి తేవడం కోసం ఒక న్యాయమూర్తిని ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేసారు.     
ఇవన్నీ గమనించేవారికి జగన్ మోహన రెడ్డి పనితీరు పట్ల సానుకూల వైఖరి పెరిగే వీలుంది. మొట్టమొదట ఏర్పరచుకున్న అభిప్రాయం ఒక పట్టాన చెరిగిపోదని అర్ధం వచ్చే ఒక ఆంగ్ల సామెత వుంది.
‘మాట తప్పను, మడమ తిప్పను’ అనే నైజాన్ని తన తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి పుణికిపుచ్చుకున్నానని వై.ఎస్. జగన్ తరచూ పేర్కొంటూ వుంటారు.  ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చే పవిత్రమైన బాధ్యత ఇప్పుడ ఆయన భుజస్కంధాలపై వుంది.
యుద్ధ వీరుడికి సాహసం అవసరమే. కానీ ప్రజాస్వామ్యంలో పోరాడే వీరుడికి సాహసంతో పాటు ఒకింత సంయమనం కూడా ఆవశ్యకం.

ముఖ్యమంత్రుల ‘ఇంటి’ ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు


(Publishrd in ANDHRA BHOOMI daily in it's Edit Page on 09-06-2019, SUNDAY)

దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి  నీలం సంజీవరెడ్డి. ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలు నుంచి  హైదరాబాదుకు మారగానే ఆయన  మొదట్లో ప్రస్తుతం రాజభవన్ పక్కన వున్న దిల్ కుష భవనంలో వుండేవారు. ‘కర్నూలు రాజధానిలో డేరాలు వేసుకుని వుండి వచ్చారు కదా! ఇప్పుడు హైదరాబాదులో జీవితం ఎలావుంద’ని ఒక విలేకరి ముఖ్యమంత్రిని అడిగారు. ‘ఏం చెప్పనబ్బా!  ఈ ఇల్లు ఎంత పెద్దగా వుందో  చూస్తున్నారు కదా! మా ఆవిడ ఏ గదిలో వుందో కనుక్కోవడానికి అరగంట పడుతోంది’ అని నవ్వుతూ బదులిచ్చారని ఆ నాటి రోజులకి ఈనాటి కాలానికీ ఒక వారధిలా ఉన్న సీనియర్ పాత్రికేయులు, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు  జీ.ఎస్. వరదాచారి మాటల సందర్భంలో చెప్పారు. తరువాతి కాలంలో సంజీవరెడ్డి బేగంపేట లోని గ్రీన్ లాండ్స్ ప్రభుత్వ అతిధి గృహాన్ని తన అధికార నివాసంగా ఎంచుకున్నారు.  ప్రైవేట్ బస్సుల జాతీయకరణ విషయంలో  న్యాయస్థానం తనకు వ్యతిరేక తీర్పు ఇచ్చినందుకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేవరకు ఆయన  అదే భవనంలో నివాసం వున్నారు. ఆయన తర్వాత దామోదరం సంజీవయ్య  ముఖ్యమంత్రి అయ్యారు. సంజీవరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా వున్నప్పుడు సంజీవయ్య ఖుర్షిద్ జా అనే ఒక ప్రైవేటు భవంతిలో నివాసం వుండేవారని సంజీవయ్య బావమరది డాక్టర్  సి.బి. శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం రాజీవ్ గాంధి విగ్రహం నుంచి రాజ్ భవన్ వైపు వెళ్ళే రహదారిలో ఆ భవంతి వుండేది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మకాం గ్రీన్ లాండ్స్ కి మారింది. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాల కారణంగా  రెండేళ్ళ తర్వాత సంజీవరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. తదుపరి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చాలా రోజులు  ప్రస్తుతం విద్యుత్ సౌధకు సమీపంలోని  ఏరువాక ప్రభుత్వ భవనంలో వుండి, తరువాత బేగంపేటలో  గ్రీన్ లాండ్స్ ఎదురుగా, రోడ్డుకు  ఆవలవైపు ఉన్న మరో ప్రభుత్వ భవనాన్ని(ఇప్పుడు మంజీరా గెస్ట్ హౌస్) తన అధికార నివాసంగా ఎంచుకున్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత అధికార  నివాసభవనం ఉండాలనే బ్రహ్మానందరెడ్డి ఆలోచన  ఫలితంగా ఆనందనిలయం రూపుదాల్చింది. తిరుపతి ఆనంద నిలయం మనసులో ఉందేమో తెలవదు, బ్రహ్మానందరెడ్డి ఆ భవనానికి అదే పేరు పెట్టారు. వాస్తు చూసి ఏర్పాటుచేసుకున్నా ఎక్కువరోజులు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. రాష్ట్ర విభజన ఉద్యమాల ఫలితంగా ఆయన పదవి నుంచి దిగిపోవడంతో పీవీ నరసింహా రావు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు.  ఆంద్ర ఉద్యమం కారణంగా  రాజీనామా చేసి  తప్పుకునేంతవరకు ఆయన కూడా ఆనంద నిలయంలోనే కొనసాగడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం రాష్ట్రం  రాష్ట్రపతి పాలనలో వుంది.
తదనంతరం జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు.  గతంలో  హోంమంత్రిగా వున్న  సమయంలో పంజాగుట్ట ప్రాంతంలోని  ద్వారకాపురి కాలనీలో ముచ్చటపడి కట్టుకున్న చిన్న భవంతిలోనే కొనసాగారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన వసతులు అరకొరగా ఉన్నప్పటికీ  చివరి వరకు ఆయన ఆ ఇంట్లోనే కాలక్షేపం చే
సారు.
ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి వ్యవహార శైలి విభిన్నం. ఆయన తార్నాక లోని సొంత ఇంట్లోనే వుండి, దానికి అన్నిరకాల హంగులు సమకూర్చుకున్నారు. బహుశా సొంత నివాసాలకు ప్రభుత్వ ఖర్చుతో వసతులు ఏర్పాటు చేసుకునే సాంప్రదాయానికి అప్పుడే బీజం పడిందని అనుకోవాలి.  ఆ రోజుల్లో మొత్తం హైదరాబాదులో లిఫ్ట్ సౌకర్యం ఉన్న ప్రైవేటు గృహాలు రెండే ఉండేవని, వాటిల్లో ఒకటి చెన్నారెడ్డి గారి తార్నాక నివాసం అని జనం చెప్పుకునేవారు.
తదుపరి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పరిస్తితి దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయనకు బరకత్ పురాలో రెండు గదుల సొంత ఇల్లు వుండేది. మామూలుగానే చాలా ఇరుకు. ఇక ముఖ్యమంత్రి అయితే ఆ తాకిడి తట్టుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. దాంతో ఆయన గతంలో సంజీవ రెడ్డి నివాసం ఉన్న గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ని అధికార నివాసంగా చేసుకుని, దానికి జయప్రజా భవన్ అనే పేరు పెట్టారు.
అంజయ్య గారి ఇంటికి  సంబంధించి ఒక ఆసక్తికరమైన ముచ్చట చెప్పుకోవాలి.
ఆయన ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు రాజీవ్ గాంధి విమానాల పైలట్ గా పనిచేసేవారు.  ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. అంజయ్య గారు తత్తరపడుతూ లేచి, వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నారు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే,  రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన ఇండియన్ ఎయిర్ లైన్స్  విమానం, తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కాని, ఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది, ముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన భవనం వెంకట్రాం మాత్రం తాను అంతకుముందు మంత్రిగా వున్నప్పుడు వున్నప్పుడు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్ లోనే వుండిపోయారు. భవనం వెంకట్రాం తర్వాత ముఖ్యమంత్రి అయిన కోట్ల విజయ భాస్కరరెడ్డి లోగడ పీవీ ముఖ్యమంత్రిగా నివసించిన ఆనంద నిలయానికి మారారు. ఇంతవరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఇంటి ముచ్చట్లు.
ఇక, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్టీ రామారావు ఆబిడ్స్ లోని తన సొంత ఇంట్లోనే వున్నారు. ఒక ముఖ్యమంత్రి అధికార నివాసాలు ఒకటికి మించి గుర్తించి అందుకు తగిన సదుపాయాలు కల్పించే పద్దతి ఆయన హయాములోనే మొదలయింది. గండిపేటలోని తన ఆశ్రమాన్ని కూడా రెండో అధికార నివాసంగా మార్చుకున్నారు.  కొన్నాళ్ళు ప్రతిపక్షంలో వుండి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తు బాగుందని భావించారేమో తెలియదు, బంజారా హోటల్ సమీపంలోని తన కుమార్తె పేరిట ఉన్న ఒక చిన్న భవనంలో నివాసం వున్నారు. ప్రభుత్వం పక్కనే ఉన్న మరో భవనాన్ని అద్దెకు తీసుకుని ముఖ్యమంత్రి అవసరాలకు తగిన విధంగా వసతులు సమకూర్చడం జరిగింది. ఒక నెల రోజులపాటు ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర రావు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే వున్నారు.
1995లో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే నివాసం  వున్నారు.  హోదాకు, అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వమే కొన్ని వసతులు సమకూర్చింది.
వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్నిమాసాలపాటు నాగార్జున సొసైటీలోని తన కుమార్తె ఇంట్లో నివాసం వున్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత నివాస భవనం ఉండాలనే కాసు బ్రహ్మానంద రెడ్డి ఆలోచనను ఆయన మళ్ళీ ఆచరణలోకి తీసుకువచ్చారు. బేగం పేట మంత్రుల క్వార్టర్స్ లోని కొన్ని భవనాలను తొలగించి, అన్ని వసతులతో కూడిన  విశాలమైన ఒక మంచి భవనాన్ని ప్రభుత్వ ఖర్చుతో కొద్ది నెలల కాలంలోనే  నిర్మించారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేవరకు అందులోనే నివాసం వున్నారు.
తరువాత ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయిన కే. రోశయ్య ఆ భవనంలో చేరడానికి ఇష్టపడలేదు. అమీర్ పేటలోని ప్రకృతిచికిత్సాలయం దాపునే తాను నిర్మించున్న భవంతిలోనే వుండిపోయారు. ముఖ్యమంత్రిగా రోశయ్య నుంచి బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా కాలం జూబిలీ హిల్స్ లోని సొంత ఇంట్లోనే వున్నారు. ఆ తరువాత తన నివాసాన్ని బేగం పేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసానికి మార్చుకున్నారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్నాళ్ళు సొంత ఇంట్లో నివసించిన తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్నాళ్ళు  వై.ఎస్. హయాములో నిర్మించిన నివాసంలోనే వున్నారు. అక్కడ వున్న సోఫాలను కానీ, ఫర్నిచర్ ను కానీ మార్చకుండా అందులో నివసించారని కేసీఆర్ వ్యక్తిగత అధికారులు చెబుతుంటారు. అక్కడే వుంటూ, పక్కనే  కొత్తగా విశాలమైన ఆధినిక వసతులు కలిగిన  సీఎం క్యాంపు కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేశారు.
పోతే, అటు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన  చంద్రబాబునాయుడు, అమరావతి నిర్మాణం అనే భారీ ప్రాజెక్టు భుజాలకు ఎత్తుకోవడం వల్ల నూతన  రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అంటూ ఒక అధికార నివాస భవనం ఏర్పాటు చేసుకోలేక పోయారు. అంచేత తాత్కాలికంగా కృష్ణానదీ తీరాన  ఒక ప్రైవేటు గెస్టు హౌస్ ను తన అధికార నివాసంగా మార్చుకున్నారు. దానికి పక్కనే ఉన్న స్థలంలో ప్రజావేదిక పేరుతొ ప్రభుత్వమే మరో సదుపాయాన్ని కల్పించింది. అధికారంలో ఉన్నంతకాలం  చంద్రబాబు దాన్నే తన నివాసంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడదే ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇందుకు ఓ నేపధ్యం లేకపోలేదు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న అయిదేళ్ళు, కృష్ణానది కరకట్ట మీద అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా కొందరు విలాసవంత మైన భవనాలను నిర్మించారని, ఈ కట్టడాలు పర్యావరణానికి మేలు చేయవనీ, వాటిని తొలగించాలని కోరుతూ వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే వీటిని కూల్చివేయడం జరుగుతుందని గట్టిగా చెబుతూ వచ్చారు. ఇలా ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగింది. ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షనేత జగమ్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమయ్యారు.
ఈ దశలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి ఒక లేఖ రాసారు. తాను  నివాసం ఉంటున్న భవనాన్ని మళ్ళీ కొంతకాలం వాడుకోవడానికి నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పక్కనే నిర్మించిన ప్రజావేదికను కూడా ప్రతిపక్ష నేత హోదా కలిగిన  తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేసారు. ఈ లేఖ ఇంకా కొత్త ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందో లేదో తెలవదు కానీ మీడియాలో ఇది పెద్ద వివాదాస్పద చర్చనీయాంశంగా తయారయింది. ఒకప్పుడు కరకట్ట మీద నిర్మించిన అక్రమ భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేసిన వైసీపీ  అధినేత వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ఇప్పుడు అదే భవనాలలో ఒకదాన్ని చంద్రబాబుకు అధికారికంగా కేటాయిస్తే ఆ అక్రమ కట్టడాన్ని సక్రమ నిర్మాణంగా ప్రభుత్వమే అంగీకరించినట్టు కాగలదని ఆ పార్టీలోనే కొందరు ఆక్షేపిస్తున్నారు. అభ్యంతర పెడుతున్నారు.
ఈ సందర్భంలో  ఓ పాత సంగతి ప్రస్తావన అసందర్భం కాబోదు.  
అప్పుడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు.
ఒకప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మంత్రుల నివాసాలు అన్నీ ఒకేచోట ఉండాలనే ఉద్దేశ్యంతో బంజారాహిల్స్, రోడ్ నెంబరు పన్నెండులో మంత్రుల నివాస ప్రాంగణాన్ని నిర్మించారు. అందులో ఒక భవనాన్ని ప్రతిపక్షనేతగా తనకు కేటాయించాలని వై.ఎస్. కోరారు. నాటి ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని త్రోసిపుచ్చింది. అప్పటి నిబంధనల ప్రకారం నెలకు పదిహేను వేల రూపాయలకు మించని అద్దె కలిగిన భవనానికి కిరాయి చెల్లిస్తామని తెలియచేసిందని వై.ఎస్. వ్యక్తిగత సహాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన భాస్కర శర్మ చెప్పారు.
ఇప్పుడు పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా ఏర్పాటు అయింది కాబట్టి, జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి ఇంతవరకు ముఖ్యమంత్రుల నివాసాల అంశం ఆసక్తికరంగా సాగుతూనే వస్తోంది. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా వారి నివాసాల మీద ప్రభుత్వాలు ఖర్చు చేసే వ్యయాన్ని తగ్గించే దిశగా ఏమైనా ఆలోచనలు చేస్తే బాగుంటుంది.