7, ఏప్రిల్ 2019, ఆదివారం

అందరి చూపూ రాజకీయం మీదే



దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది.
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో,వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ అయాచితంగా లభిస్తూ ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులతో పోలిస్తే వీళ్ళందరూ  తీసికట్టే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బుసంచులూ  వున్న సినీ నటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడంకోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ రాజకీయ రంగ ప్రవేశం కోసం అర్రులు చాచేది అందుకే. తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు కూడా  వుండి తీరాలి అనే నిర్ధారణకు వాళ్ళు  వచ్చేస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనే మాటలు కూడా  పొసగని వాళ్లు సయితం  డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో నీరాజనాలు. ఎక్కడకు వెళ్ళినా, ఏ దేశమేగినా అతడు  ఒక్కసారి తమను  పలకరిస్తే చాలు అనుకుని పులకరించిపోయే జనాలు. తమ అభిమాన నటుడు కరచాలనం చేసినా జన్మ ధన్యం అయిపోయినట్టు కలలు కనే అభిమాన జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి తమ గడప తొక్కితే చాలు ఆ నటుడికి దిగ చెమటలు పట్టడానికి.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే సిబ్బంది. ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెళ్ళాడనుకోండి. నెలకు పదివేలు తీసుకునే  సర్కారు ఉద్యోగి ముందు ఆ హోదాలు, ఇంతోటి వైభోగాలు దిగదుడుపే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల గూండాలు వెంట వుంటారు. కుక్కని కొట్టక్కర లేకుండానే కళ్ళు తిరిగే  డబ్బు రాశులు రాశులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంతనే వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.
మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు అసలే కాదు. అలా అని పెద్ద పేరున్నవాడూ  కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోకి దూసుకుపోగలడు. కింది స్తాయి  నుంచి పై స్తాయి అధికారివరకు తలుపులు తోసుకుని వెళ్ళి, పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు.  ముఖ్యమంత్రి పేషీలోకి అనుమతి లేకుండా జొరబడగలడు. చివరాఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సైతం సందేహించే పోలీసు ఠాణాల్లోకి  సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని దేవాలయాల్లోకి  పదిమందిని వెంటేసుకు పోగలడు.
అతడే రాజకీయ నాయకుడు. మన కధానాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం పని తీరు  తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులు తరచూ చెబుతుంటారు. కానీ ఆ సూత్రం వారికి వర్తించదు.  ఎందుకంటే ఆ పొడవాటి చట్టం చేతులు తమ జేబుల్లోనే ఉన్నాయన్న వాస్తవం వారికి తెలుసు. వారి జోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే ‘బాగు చేయిస్తాం రా’ అని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడుస్తారు. నాయకుల విషయం వచ్చేసరికి  నిబంధనలన్నీ కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద వుంటే చాలు  అన్నీ వున్నట్టే లెక్క. అదే అధికార పార్టీ అయితే ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.
పొలిటికల్ పవర్ కు వున్న పవర్ అలాటిది. అందుకే ఈరోజుల్లో అందరి చూపూ   రాజకీయం మీదే!

మేనిఫెస్టోలు నిజాలు! | Debate On Election Manifesto | News Scan Debate W...





ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 విజయ్ నారాయణ్ న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కఠారి శ్రీనివాస్ రావు (విశ్లేషకులు), శ్రీమతి డాక్టర్ ముళ్ళపూడి రేణుక (టీడీపీ)

6, ఏప్రిల్ 2019, శనివారం

Discussion on Election Commission Transfers AP Chief Secretary Puneta | ...





ప్రతి శనివారం మాదిరిగానే  ఈరోజు  ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ పవన్

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

ఓటర్లని కొనడానికి సాయ శక్తులా ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులు ! | Today's...





ప్రతి శుక్రవారం మాదిరిగానే  ఈరోజు  ఉదయం Prime 9 News Channel లో యాంకర్ శ్రీదేవి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాగోన్నవాళ్ళు: శ్రీమతి సీతా రత్నకుమారి (బీజేపీ), శ్రీ శివశంకర్ (వైసీపీ), శ్రీ మల్లికార్జున యాదవ్ (టీడీపీ)

4, ఏప్రిల్ 2019, గురువారం

News Talk | Special Discussion With Senior Journalist Mr. Bhandaru Srini...





ప్రతి గురువారం మాదిరిగానే ఈరోజు ఉదయం స్నేహ టీవీ న్యూస్ టాక్  ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ స్వర్ణ

2, ఏప్రిల్ 2019, మంగళవారం

KSR Live Show | Kapu reservation movement effect in AP polls - 2nd April...

రేడియోలో ‘దూడలు’ – భండారు శ్రీనివాసరావు


చాలా ఏళ్ళ కిందటి సంగతి.
ఢిల్లీలో  బాబూ జగ్జీవన్ రామ్ మరణించినట్టు  ఆరోజు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో    పీటీఐ వార్తా సంస్థ వార్త ఇచ్చింది.  మరో నలభయ్ అయిదు నిమిషాల్లో విజయవాడ నుంచి ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ప్రాంతీయ వార్తావిభాగం అధికారి శ్రీ ఆర్వీవీ కృష్ణారావు, వెంటనే స్పందించి,  జగ్ జీవన్  రాం గురించిన సమస్త సమాచారం సిద్ధం చేసుకుని సవివరంగా ఆ వార్తను ప్రసారం చేసారు. న్యూస్ రీడర్, కీర్తిశేషులు కొప్పుల సుబ్బారావు ఆ రోజు బులెటిన్ చదివారు. ప్రాంతీయ వార్తల అనంతరం ఢిల్లీ నుంచి వెలువడే సంస్కృత వార్తల్లో ఈ సమాచారం లేకపోవడంతో సిబ్బంది కంగారు పడ్డారు. ఆ తరువాత ఏడూ అయిదుకు వచ్చే  ఢిల్లీ తెలుగు వార్తల్లోనూ, ఎనిమిది గంటల జాతీయ వార్తల్లోనూ ఆ  మరణ వార్త లేకపోవడంతో కంగారు మరీ ఎక్కువయింది. బెజవాడ రేడియో కప్పదాటు వేసిన విషయం బయట పడింది. అప్పటి తెలుగు దేశం లోక్  సభ  సభ్యుడు శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ ఈ విషయాన్ని  ప్రశ్న రూపంలో లేవనెత్తారు. సమాచార శాఖ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో, ఈ వార్త ప్రసారం చేయడంలో పీటీఐ పై ఆధారపడి దేశంలోని  ఏడు రేడియో స్టేషన్లు తప్పు చేశాయని తెలిపారు. గమ్మత్తేమిటంటే ఈ పొరబాటు చేసిన విజయవాడ రేడియో స్టేషన్ పేరు ఈ జాబితాలో లేదు.
ఏది ఏమైనా ఈ ఉదంతంతో రేడియో అధికారులు మరణ వార్తల ప్రసారం విషయంలో అనుసరించాల్సిన ఆదేశిక సూత్రాలు ఢిల్లీ నుంచి జారీ అయ్యాయి. రేడియో విలేకరి స్వయంగా వెళ్లి చూసి  ఇచ్చేదాకా, ముఖ్యుల మరణ వార్తను ప్రసారం చేయరాదని ఆంక్షలు విధించారు.
తరువాత చాలా కాలానికి   ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఢిల్లీలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో  మరణించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీ పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు జాతీయ వార్తా ఛానళ్ళు సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా అంజయ్య మరణ వార్త లేట్ న్యూస్రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.
విజయవాడలో ఉన్న కృష్ణారావు గారు హైదరాబాదులో ఉన్న నాకు ఫోను చేసి అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన చనిపోయింది ఢిల్లీలో. నిబంధనల ప్రకారం  ఢిల్లీ విలేకరి ఆ  వార్తను ధ్రువపరచాలి. అందుకోసం ప్రయత్నించారు కానీ ఆ సమయంలో ఢిల్లీలోఎవరూ దొరకలేదు. చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయక పొతే  ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది. దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు గారు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి ఉదయం ఆరూ నలభయ్ అయిదు  నిమిషాలకు మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.
మళ్ళీ సీను రిపీట్. ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి ఇచ్చినా నిబంధనల పేరుతొ తీసుకోలేదు.
తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ వార్తకు ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరాఅంటూ మళ్ళీ పుట్టపాగ రాధాకృష్ణ గారే పార్ల మెంటులో హడావిడి చేసారు.
ఇలాటివే మరి కొన్ని అవకతవకలు రేడియో వార్తల్లో దొర్లాయి. ఒకటి జగ్జీవన్ రాం మరణ వార్త, రెండోది లోక్ నాయక్ జయప్రకాశ్ కన్నుమూత గురించిన వార్త. ఈ రెండింటినీ ధ్రువ పరచుకోకుండానే వార్తల్లో ఇవ్వడం, నాలుక  కరచుకోవడం జరిగింది. పార్లమెంటు శ్రద్ధాంజలి ఘటించింది కూడా. ఆ తరువాత కానీ జరిగిన పొరబాటు తెలియరాలేదు.
ఇంకా పాత కాలంలో తమిళనాట (అప్పుడు మద్రాసు రాష్ట్రము) ద్రవిడ నాయకుడు అన్నాదొరై మరణ వార్త ప్రసారం చేసే విషయంలో రేడియోవాళ్ళు తొందర పడి దూడ వేసారనే వదంతి ఒకటి  వుంది. నాకైతే తెలియదు.