5, జూన్ 2016, ఆదివారం

మౌనమే శ్రేయస్కరం


అనగనగా అమ్మ. అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది. పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ మాతృహృదయం మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. పిల్లాడేమో చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ పొరుగు పెరట్లోని కరివేపాకు రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో కన్నతల్లి మరింత మురిసిపోయేది. నా బాబే! నా తండ్రే! అంటూ గారంగా బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని దొంగతనాలేమిట్రా! దొంగతనం చేయడం తప్పురా తండ్రీ అంటూ అమ్మ తల్లడిల్లిపోతుంటే ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మా అనేసి దొంగ పిల్లాడు చక్కా జైలుకు పోతాడు.
నీతికధ అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న కధనాలు గమనిస్తున్నప్పుడు కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తోంది.
మంచివాళ్ల మౌనం మరీ ప్రమాదం అని పెద్దలు జయప్రకాశ్  నారాయణ్ చెబుతుంటారు. అయితే,  చెబితే వినేవాళ్ళు లేనప్పుడు, వినిపించుకునే  పరిస్తితి లేనప్పుడు మౌనమే శ్రేయస్కరమని విదురనీతి చెబుతోంది. నాకు అర్ధం అయినంతవరకు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  సాగుతున్న  అర్ధం లేని రగడలో విదురుడి మాటే రైటని పిస్తోంది.  

ఇలా మాట్లాడ్డం తగదు అని ఒకరికి చెప్పబోయేలోగా మరొకరు రెచ్చిపోయి మాట్లాడతారు. తెరవబోయిన నోరు ఠక్కున మూతబడిపోతుంది. 

4, జూన్ 2016, శనివారం

అందరూ బాగుండాలి


ఈ భావన యెంత గొప్పది.
మనం అందరి మంచి కోరితే మనకి కూడా మంచి జరుగుతుంది. లోకమంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉండడం వల్ల ఎల్లప్పటికీ మనకు మంచే జరుగుతుంది. 
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తాః సుఖినో భవస్తు
ఈ శ్లోకంలోని పరమార్ధం ఇదే. ఇదే అయినప్పుడు గోవులు, బ్రాహ్మణులు శుభంగా వుంటే సరిపోతుందా  అనే కుశంక ఒకటి ఎలాగు వుంది. దీనికి జవాబు కంచి పరమాచార్య ఏనాడో  తానూ రాసిన ‘హిందువుల ధర్మంలో చెప్పారు.
పూర్వాచారాలు పాటించే బ్రాహ్మణ కుటుంబాల్లో వైశ్వదేవం అని చేస్తారు. భోజనం చేసే ముందు చేసే బలిహరణం అన్నమాట. దాన్ని ఆంతర్యం చాలా గొప్పది. మనం వుంటున్న ఈ భూమండలానికి పైనా కిందా అనేక లోకాలు వున్నాయి. వాటిల్లోని ఎన్నో కోట్ల జీవరాశులకు తృప్తి కలిగించడం దీని ఉద్దేశ్యం. ఈ విధమైన భూత తృప్తి భోజనానికి ముందూ తరువాత చేయడం విధాయకం. ఉత్తరాపోసన పట్టేటప్పుడు ‘ఇతర ప్రాణులను ఉద్దేశించి ఇది చేయడం జరుగుతోంది’ అని చెబుతారు.
బ్రాహ్మణులే కాదు ఇలా ఎవరయినా చేయవచ్చు. సమస్త భూతరాశి తృప్తి కోసం ప్రార్ధించవచ్చు. బ్రాహ్మణులకు ఇది విధాయకం కనుక వారు శుభంగా వుండి ప్రార్ధిస్తే సమస్త జీవ రాశులకు శుభం కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఆ శ్లోకంలో పేర్కొన్నారు. గోవులు బాగా వుంటే ఇక చెప్పేది ఏముంది.
ఇలా భోజనాత్పూర్వం సకల జనుల తృప్తి కోసం ప్రార్ధన చేయడం అనేది అనేక దేశాల్లో వుంది.
మిసెస్ సూజన్ విల్సన్ బెల్ వ్యూ లోని ఒక పాఠశాలలో టీచరు. ఆవిడ భర్త మిస్టర్ గోర్డన్ - రెడ్మండ్ టౌన్ సెంటర్ లోని కార్యాలయంలో పనిచేస్తారు. వారికి అయిదుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయాయి. మిగిలిన ముగ్గురి చదువులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. హాస్టళ్ళలో వుంటున్నారు. ప్రస్తుతానికి భార్యాభర్తా ఇద్దరే బెల్ వ్యూ లోని సొంత ఇంట్లో వుంటున్నారు. కొన్నేళ్ళ క్రితం మేము సియాటిల్  లో ఉంటున్న మా పిల్లలకోసం అమెరికా వెళ్ళినప్పుడు సూజన్ దంపతులు  ఒక రాత్రి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. ఇల్లు పొందికగావుంది. ముందూ వెనుకా విశాలమయిన ఖాళీ జాగా. ఇంట్లోకి అడుగు పెట్టగానే నల్లటి రంగులో తళ తళ మెరిసిపోతూ పియానో దర్శనమిచ్చింది. దాని పక్కనే మరింబా అనే మరో సంగీత వాయిద్యం.
 శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లులా ఇంట్లో అంతా సంగీత వాతావరణం. సాధారణంగా అమెరికన్లు బయటవారిని ఎవరినీ భోజనాలకు ఇళ్లకు పిలవరు, అంతగా పిలవాల్సి వస్తే హోటల్లో డిన్నర్ ఇస్తారని చెప్పుకునేవాళ్ళు. అందుకే మేము వాళ్లు పిలిచినప్పుడు కొంత సందేహిస్తూనే వెళ్ళాము. కానీ వారి ఆదరణలో కృత్రిమత్వం ఏమీ కనిపించలేదు. పైగా సాయంత్రం మొత్తం మాతోనే గడపడానికి సిద్దమయినట్టు కనిపించారు. ఇండియానుంచి, అదీ దక్షిణ భారతం నుంచి వచ్చిన శాకాహారులమని తెలిసి వంటకాలను తయారుచేసినట్టున్నారు. అందరం కలసి భోజనాల బల్ల దగ్గర కలిసి కూర్చుని భోజనం చేసాము. అంతకు ముందు మిస్టర్ గోర్డన్, మిసెస్ విల్సన్ ప్రార్ధన చేసారు.
! లార్డ్! ఇండియానుంచి వచ్చిన అతిధులు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మా పిల్లలు నిరుడు హైదరాబాదు వెళ్ళినప్పుడు వీరు వారిని చక్కగా చూసుకున్నారు. వారికి ఇలా భోజనం పెట్టగలిగే అవకాశం కల్పించిన నీకు కృతజ్ఞతలు.
మా బామ్మ గారు జ్ఞాపకం వచ్చారు. భోజనానికి ముందు ఆవిడ తప్పకుండా దేవుడి ప్రార్ధన చేసేవారు.
అమెరికన్లు అనగానే విందుతో పాటు మందు అనే దురభిప్రాయం తొలగిపోయేలా మా భోజనం పూర్తయింది. తరవాత మిసెస్ విల్సన్ చక్కటి పాటలు పాడారు. మిస్టర్ గోర్డన్ పియానోతో సహకారం అందించారు. డిజర్ట్ సర్వ్ చేసేటప్పుడు వారి ఫ్యామిలీ ఫోటోలు చూపించారు. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు నెమరు వేసుకున్నారు. భాష అర్ధం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురయినా వారి ఆప్యాయతను, ఆత్మీయతను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాము.
కావున, చెప్పేది ఏమిటంటే మంచి అనేది విశ్వవ్యాప్తంగా వుంటుంది. ఒకరి సొంతం కాదు.
(04-06-2016)

  

దొందూ దొందే
పెళ్లి కూతురు,  పెళ్లికొడుకూ పెళ్ళయిన తరువాత పల్లకీలో వెడుతున్నారు. దారిలో పూత పూసిన  చింత చెట్టు కనిపించింది. దాన్ని చూడగానే పెళ్లి కూతురు ‘చింత చెత్తు పూత పూసిందే’ అన్నది. ఆ అమ్మాయికి ‘ట’ పలకదు. అబ్బాయి వెంటనే ‘ పూతే కాలం వస్తే పూయదా’ అన్నాడు. అతగాడికి ‘స’ పలకదు.
వీరిద్దరి మాటలు వింటున్న పల్లకీ బోయీల్లో ఒకడన్నాడు.
“దొందూ దొందేరా కొందప్పా”

అతడికి ‘డ’ పలకదు.