23, ఆగస్టు 2015, ఆదివారం

నవ్వాలని రూలేమీ లేదు


తరాల మధ్య అంతరం
తండ్రి ఇరవై రూపాయలు ఆదా చేయడానికి అయిదు కిలోమీటర్లు నడిచి వెడతాడు. అతడి కుమారుడు అయిదు కిలోమీటర్లు నడిచి వెళ్ళే సమయం అదా చేయడానికి ఇరవై రూపాయలు ఖర్చు చేస్తాడు. తండ్రి హయాములో ఆయన చేసింది రైటు. కొడుకు తరంలో అతడు చేసింది రైటు. తరం మారిందని గుర్తించేవారిది మరీ మరీ రైటు.
ఎవరు?
ఏకాంబరం లైబ్రేరియన్ ని అడిగాడు, ‘ఆత్మహత్య చేసుకోవడం ఎలా?’ అనే పుస్తకం ఉందా అని.
అతగాడు ఏకాంబరాన్ని ఎగాదిగా చూస్తూ అన్నాడు.
‘వుంది సరే కానీ పుస్తకాన్ని వాపసు ఇచ్చేది ఎవరు?’
నువ్వే దాక్కో
‘ఒరేయ్ బుడుగూ ఇవ్వాళ నువ్వు స్కూలు ఎగ్గొట్టావట! మీ టీచరు నిన్ను వెతుక్కుంటూ మన ఇంటికి వస్తున్నాడు. చప్పున ఎక్కడయినా దాక్కో!’
‘నువ్వే దాక్కో తాతా ! ఎందుకంటె నువ్వు చనిపోయావని స్కూల్లో చెప్పాను’
పనికిరాని ప్రెజెంటు
సీగాన పెసూనాంబ : ఒర్రేయ్ బుడుగూ! మొన్న పక్కింటి బామ్మ గారి పుట్టిన రోజుకు ఫుట్ బాల్ ప్రెజెంటు  చేశావట! ఇదేమైనా బాగుందా!
బుడుగు: ‘ఎందుకు బాగుండదు. నిరుడు నా హ్యాపీ బర్త్ డే అని దణ్ణం పెడితే ఓ భగవద్గీత పుస్తకం నా చేతిలో పెట్టింది. అదేమన్నా బాగుందా నువ్వే చెప్పు’  


(ఇంగ్లీష్ జోకులకు చేతయిన రీతిలో  స్వేచ్చానువాదాలు)        

22, ఆగస్టు 2015, శనివారం

ప్రైవేటు స్కూళ్ళు – సర్కారీ బళ్ళు

(Published in 'SURYA' telugu daily on 23-08-2015, SUNDAY)

పతాక శీర్షికలకు ఎక్కే సంచలన వార్తలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఏనాడూ కొదవ లేదు. కారణం తెలియదు కాని ప్రజానీకానికి సంబంధించి, అదీ సర్కారు స్కూళ్ళకు సంబంధించి అలహాబాదు హైకోర్టు గత మంగళ వారం వెలువరించిన ఒక తీర్పు తెలుగు పాఠకులకు చేరాల్సిన విధంగా చేరలేదేమో అనిపిస్తోంది. సర్కారు పాఠశాలల దుస్తితి గురించి తెలుగు పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కధనాలు వెలువడుతున్న సమయంలోనే ఈ తీర్పు రావడం కాకతాళీయం  కూడా కావచ్చు.
ప్రజల నుంచి పన్నుల  రూపంలో వసూలు చేసే ధనం నుంచి,  నెల నెలా జీతాలు తీసుకుంటున్న వాళ్ళెవ్వరయినా సరే  వాళ్ళు  తమ పిల్లల్ని సర్కారు బడుల్లోనే చేర్పించి తీరాలన్నది  అలహాబాదు హైకోర్టు తీర్పు సారాంశం. అంటే ఎన్నికయిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, చివరాఖరికి న్యాయ స్థానాల్లో పనిచేసే సిబ్బందితో సహా అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం వల్ల ఆ విద్యా సంస్థల స్తితిగతులు మెరుగుపడవచ్చన్నది ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి ఉద్దేశ్యం. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో, మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఎంపికలో అనుసరిస్తున్న విధానాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఎక్కడో కొడితే మరెక్కడో తగిలినట్టు కోర్టు గడప తొక్కిన కారణం ఏదైనా, న్యాయమూర్తి  మాత్రం సర్కారు బళ్ళకు ప్రాణం పోసే సంజీవని మూలిక లాంటి తీర్పు ఇచ్చిన మాట వాస్తవం. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వుందనీ,  మొత్తం మీద లెక్కలు తీస్తే దాదాపు మూడు లక్షల మంది టీచర్లు తక్కువగా వున్నారనీ ఈ విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన వివరాలు.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్తితి కొంత భిన్నం. టీచర్లకు ఎంతో కొంత కొరత వుండి వుండవచ్చు కానీ ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించే తలితండ్రుల సంఖ్య మాత్రం నానాటికి తీసికట్టు అన్న సామెత చందంగా తగ్గిపోతూవస్తోంది.  ‘చదువొక్కటే పిల్లలకు తామిచ్చే ఆస్తి’ అన్న స్పృహ వారిలో పెరగడం వల్ల కావచ్చు, లేదా చదువుకోక పోవడం వల్లనే తామిలా కూలీ నాలీ చేసుకుంటూ బతకాల్సివస్తోందని, ఈ దుస్తితి తమ పిల్లలకు పట్టకూడదన్న ముందు చూపు కావచ్చు  బీదా బిక్కీ కూడా తమ పిల్లల్ని సర్కారు బళ్ళకు కాకుండా కాస్త డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా, కాన్వెంటు స్కూళ్ళకు పంపాలనే ధ్యాస పెంచుకుంటున్నారు. సరే! ఇక కలిగిన వాళ్ళు సరేసరి. వారు చూస్తూ చూస్తూ ఎటువంటి పరిస్తితిలో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించరు. ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే టీచర్లు కూడా తమ పిల్లల్ని ఆ సూళ్ళల్లో చదివించడానికి ఇష్టపడరు. ప్రజల్లో వస్తున్న ఈ మార్పుతో, అసలే  చిన్నచూపుతో కునారిల్లుతున్న సర్కారు బళ్ళు,   చదివించే టీచర్లు వున్నా చదువుకునే విద్యార్ధులు లేక క్రమంగా తమ  అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. నెలకు రెండువందల నుంచి రెండు లక్షల రూపాయల దాకా వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలు దేశంలో లెక్కకు మిక్కిలి వెలుస్తున్నాయంటే, విద్య అనేది ఏ స్థాయిలో అంగడి సరుకుగా మారిపోయిందన్న నగ్న సత్యం ఇట్టే బోధపడుతుంది.
అలా అని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా పూజ్యం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇప్పటికీ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మంచి  ఫలితాలు సాధిస్తున్న గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు,  కేంద్రీయ విద్యాలయాలు ఎన్నో వున్నాయి. అయినా ప్రభుత్వ బళ్ళు అనగానే ప్రజల్లో ఒకరకమైన చిన్నచూపు నానాటికీ పెద్దది అవుతోంది కాని తగ్గడం లేదు.
విద్యారంగం పూర్తిగా వాణిజ్య పోకడలు సంతరించుకుంటోంది కాబట్టి అలహాబాదు హైకోర్టు తీర్పు అమలు అవుతుందన్న ఆశలు పెట్టుకోనక్కర లేదు. ఎందుకంటె దాన్ని పై కోర్టులో సవాలు చేయడానికి విద్యా సంస్థల వాళ్ళు ఎలాగు సిద్ధంగానే వుంటారు. కాకపొతే ఆ తీర్పు సర్కారు బళ్ళకు పూర్వ వైభవం కోరుకునే వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే విద్యాసంస్థల దుస్తితికి కూడా  ఆ తీర్పు అద్దం పడుతోంది. ‘ఎందుకు సర్కారు బళ్ళు ఇలాటి దుస్తితిని ఎదుర్కుంటున్నాయి’ అన్న ప్రశ్నను మనముందు వుంచుతోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగి తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపితీరాలన్న నిబంధన విధించడం ద్వారా ఆ న్యాయమూర్తి, ఈ ప్రశ్నకు సరయిన జవాబు కూడా ఇచ్చినట్టయింది. ‘సర్కారు పాఠశాలలు సరిగా నడవడం లేదు. ఎందుకంటె వాటిని నడుపుతున్నది ఎవరి పిల్లలకోసమో కాని,  తమ పిల్లలకోసం అయితే కాదు’ అన్నదే ఆ సమాధానం.
పవిత్రమైన విద్యాబోధనను డబ్బు సంపాదనకు అతి  సులభ మార్గంగా ఎంచుకున్న మార్కెట్ శక్తులు ఈ తీర్పు అమలుకాకుండా తాత్కాలికంగా అడ్డుకోవచ్చు. కానీ, అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి తీర్పులోని స్పూర్తిని అంత సులభంగా ప్రజల మనసుల్లో నుంచి తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులని మనందరం ఘనంగా చెప్పుకునే ఈనాటి బాలబాలికల చదువుసంధ్యల పట్ల పాలకులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న దుర్మార్గపు  విధానాలను ఈనాడు కాకున్నా ఏదోఒక రోజు ప్రజలు ఎండగట్టే రోజు రాకమానదు. (22-08-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 9849130595

21, ఆగస్టు 2015, శుక్రవారం

చంద్రబాబుతో అభిమాని



ఈ ఫోటోలో కనిపిస్తున్న  వ్యక్తి ఎవరన్నది చిన్న పిల్లవాడు కూడా చెబుతాడు ‘ఈ మాత్రం తెలియదా ఆయన చంద్రబాబునాయుడు నాయుడు’ అని. ఇక రెండో ఆయన పేరు భక్తి భూషణ్ శ్రీవాస్తవ. పేరును బట్టే చెప్పేయొచ్చు ఆయనగారిది ఈ ఊరూ కాదు, మన భాషా కాదని. చాలా ఏళ్ళక్రితం శ్రీవాస్తవ గారు హైదరాబాదు వచ్చారు. అలా బయట నుంచి వచ్చేవాళ్ళు సాధారణంగా చార్మినార్ దగ్గరో, గోల్కొండ కోట దగ్గరో ఫోటోలు దిగాలని కోరుకుంటారు. కానీ శ్రీ వాస్తవ గారికి ఒక్కటే కోరిక. అది చంద్రబాబుతో ఒక ఫోటో దిగాలని. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు రెండో పర్యాయం కూడా ఎన్నికల్లో ఓడిపోయి, అధికారానికి మళ్ళీ దూరం అయి ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగుతున్నారు. నేను అప్పటికి ‘మాజీ’ ని కాలేదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రిని కలిపించడం ఆయనతో ఫోటో తీయించడం నాకంత కష్టం కాలేదు. శ్రీవాస్తవ గారు ఎంతో ఇష్టపడి తీయించుకున్న ఆ ఫోటోని తనవెంట తన వూరికి తీసుకువెళ్ళారు. ఇంతవరకు షరా మామూలు కధే. ఇది జరిగి కూడా అయిదారేళ్ళు అవుతుందేమో. గత వారం నేను శ్రీవాస్తవ గారి వూరు రాంచీ వెళ్లాను. చిత్రంగా ఆయన డ్రాయింగు రూములో ఈ ఫోటో కనిపించింది. బాబు గారిపై ఆయన అభిమానం అధికారాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పెంచుకుంది కాదు కాబట్టి ఆయన ఆ ఫోటోను అంత భద్రంగా దాచుకున్నారని అనిపించింది.
దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో బాబుగారి అభిమానులకి కొదవ లేదు. ఎన్నారైలకి ఓటు హక్కు ఇస్తే ఆంద్ర ప్రదేశ్ కి ఆయనే శాస్విత ముఖ్యమంత్రి అని ఆరోజుల్లో చెప్పుకునేవారు కూడా.

మరి ఆంద్ర ప్రదేశ్ లో కూడా ఈ మాదిరి అభిమానులు ఆయనకు అలా వున్నారా అంటే లేరని చెప్పలేము కానీ వున్నారని కూడా గట్టిగా అనలేని పరిస్తితి. దీన్ని మార్చుకోవడం ఆయన ఒక్కరి చేతుల్లోనే వుంది.       

20, ఆగస్టు 2015, గురువారం

గుణపాఠం, నీతిపాఠం లాంటి రాజీవ్ గాంధీ జీవితం


(Published in ‘SURYA’ telugu daily on 20-08-2015, Thursday)
(ఆగస్టు, 20 -  రాజీవ్ గాంధీ జయంతి)
“కుల,మత, ప్రాంత, భాషా బేధాలకు అతీతంగా భారత ప్రజలందరి నడుమ భావసారూప్యానికీ, వారి ఐకమత్యానికీ నేను కృషి చేస్తానని ప్రతిన పూనుతున్నాను”
ఏటా ఆగస్టు ఇరవై నాడు, రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని   ఇటువంటి ప్రతిన చేయిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో వుండే రాజకీయ పార్టీ ఇష్టాఇష్టాలనుబట్టి నాయకుల జయంతులు కానీ,  వర్ధంతులు కానీ, వారి విగ్రహాలకు పూలహారాలు వేయడం కానీ ఆనవాయితీగా మారే రోజులు వస్తున్నాయి. జాతి పురోగతికి వారు చేసిన సేవలకు ఈ అట్టహాసాలతో కూడిన స్మారక విన్యాసాలు కొలమానం కాబోవు. కాంగ్రెస్ హయాములో దీన్ దయాళ్ ఉపాధ్యాయను  ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా,ఆయన చేసిన  సేవలను గుర్తుంచుకున్న ప్రజలున్నారు.  అలాగే, ఎన్డీయే పాలనలో, నవభారత నిర్మాతగా పేరుగాంచిన  ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతికి చేసిన సేవలను స్మరించుకునే విషయంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా, అంటీముట్టనట్టు వ్యవహరించినా ఆయన గొప్పతనం తగ్గిందేమీ లేదు.  కొందరు నాయకులు వారి వారి పార్టీలకు నాయకులు కావచ్చు కానీ, వారు రూపొందించిన పధకాలు, వారి అభ్యుదయ భావాలు ప్రజల మనస్సుల్లో వారిని చిరంజీవులుగా మారుస్తాయి.
బోఫార్స్ వంటి కుంభకోణాల కారణంగా రాజీవ్ గాంధీ వ్యక్తిత్వం  కొంత మసకబారి ఉండవచ్చు. కానీ ఒక యువ ప్రధానిగా ఆయన ముందు చూపుతో తీసుకున్న కొన్ని సాహస నిర్ణయాలు, అనుసరించిన కొన్ని అభ్యుదయ విధానాలు భారత దేశాన్ని ఓ మలుపు తిప్పాయనడంలో సందేహం లేదు. రోదసీ పరిశోధనల ఫలితాలను ఆధునిక భారత నిర్మాణానికి ఉపయోగించుకున్న తీరు శ్లాఘనీయం. టెలికాం రంగంలో రాజీవ్ గాంధి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల ఫలితాలను ఈనాటి యువ భారతం అనుభవిస్తోంది. అలాగే పంచాయతీ వ్యవస్థల పరిపుష్టి కోసం ఆయన ఏకంగా రాజ్యాంగ సవరణకే  పూనుకున్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం   గ్రామాలకు పంపే ప్రతి రూపాయిలో కేవలం పద్దెనిమిది పైసలే అర్హులయిన  వారికి అందుతున్నాయని, మిగిలిన ప్రజాధనం దళారుల చేతిలో హారతి కర్పూరం అవుతోందని ఆవేదన చెందిన నాయకుడాయన.
ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే రాజీవ్ గాంధీ రాజకీయాల్లో ఉన్నదీ, అధికారంలో ఉన్నదీ చాలా తక్కువ కాలమే. గాంధీ అన్న పేరు, ఇందిరా, నెహ్రూల కుటుంబానికి రాజకీయ వారసుడు కావడం ప్రధాని పీఠం ఎక్కడానికి తోడ్పడి ఉండవచ్చు కానీ, ఆ తరువాత ఎంతో ముందు చూపుతో భారత దేశాన్ని తదుపరి శతాబ్దంలోకి అడుగులు వేయించిన ఆయన దార్శనికతే,  ఇన్నేళ్ళుగా ప్రజల మనస్సుల్లో  ఆయన్ని  ఒక చెరగని జ్ఞాపకంగా ఉంచుతోంది.
ఇందిరాగాంధీ ఆకస్మిక అస్తమయం రాజీవ్ గాంధీని రాజకీయాల్లో ఉదయించే సూర్యుడిని చేసింది. ఒక విషాద భరిత నేపధ్యంలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో  ఓటర్లు యువనేతకు తిరుగులేని ఆధిక్యంతో కూడిన విజయాన్ని అందించారు. భారత దేశపు తొలి యువ ప్రధానమంత్రిగా రాజీవ్ పాలన తొలిరోజుల్లో ప్రజల అనుభవంలోకి వచ్చిన నవ్యత్వంతో కూడిన రాజకీయం,ఎక్కువకాలం కూడా గడవక ముందే బోఫార్స్ వంటి కుంభకోణాలు వెలుగులోకి రావడంతో మసకలుబారింది. దేశం ఆ యువ నేత నుంచి ఎంతో ఆశించింది. కానీ వారి ఆశలను నీరుగారుస్తూ రాజేవ్ సాగించిన పాలనతో ప్రజానీకం విసుగు చెందింది. ఆ తదుపరి జరిగిన ఎన్నికల్లో ఎంతో మెజారిటీతో గెలిపించిన రాజీవ్ గాంధీని, ఆయన పార్టీని  ఆ ప్రజలే తిప్పికొట్టారు. ప్రధాని పదవి నుంచి తప్పించి ప్రతిపక్ష నాయకుడి పాత్రలో కూర్చోబెట్టారు. భారతీయ ఓటర్ల పరిణతికి ఇదొక నిదర్శనమే కాదు,  ఓటర్లు అవకాశం ఇస్తారు  కానీ, అలా లభించిన అధికారాన్ని, ప్రజల అభిమానాన్ని  శాస్వితం చేసుకోవడం అన్నది, గెలిచిన  పార్టీల మీద ఉంటుందన్న వాస్తవాన్ని కూడా రాజీవ్ గాంధీ ఉద్ధానపతనాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాజకీయాల్లో వెలుగులు విరజిమ్ముతున్నవారికి, అవి శాస్వితం అని భ్రమిసేవారికి రాజీవ్ గాంధీ జీవితం  ఒక హెచ్చరిక లాంటి గుణపాఠం.
రాజకీయ కుటుంబంలో పుట్టి, రాజకీయ వారసత్వం కలిగి రాజకీయాల పొడగిట్టకుండా పైలట్ ఉద్యోగం ఎంచుకున్న రాజీవ్ గాంధీ , విధి వైపరీత్యం కారణంగా రాజకీయ రంగప్రవేశం చేసి, అదే రాజకీయ మకిలిలో చిక్కుకుని తిరిగి రాజకీయ ప్రత్యర్ధుల చేతుల్లో దారుణమైన మరణం పొందడం అత్యంత విషాదం. అతి హైన్యంగా ఆత్మాహుతి దాడితో పరమ కిరాతకంగా ఆయన్ని మట్టుబెట్టిన తీరుతో ఆసేతుహిమాచలం కన్నీరు మున్నీరయింది. ఎంతో భవిష్యత్తు కలిగిన యువ నాయకుడి జీవితం ఆ విధంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది.
చిన్న వయస్సులోనే అజరామరమైన కీర్తినీ, అనంతమైన అపకీర్తినీ సరిసమానంగా కూడగట్టుకున్న ఆ యువనేతకు సంబంధించిన ఒక ఉదంతంతో దీన్ని ముగిస్తాను. అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వుండగా అప్పటికి రాజకీయాల వాసన అంటని రాజీవ్ గాంధీ హైదరాబాదు వచ్చారు. అప్పుడాయన ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థలో పైలట్ గా పనిచేస్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి అంజయ్య గారు సచివాలయంలో తనదయిన తరహాలో సహచరులు, సన్నిహితులతో మాటా మంతీ సాగిస్తున్నారు. ఆ సమయంలో ఆయనకో ఫోన్ వచ్చింది. వెంటనే అంజయ్య గారు తత్తరపడుతూ లేచారు. హుటాహుటిన బరకత్ పురాలోని తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి ఆయన, ముఖ్యమంత్రి అధికార నివాసం అయిన బరకత్ పురాలోని హౌసింగ్ బోర్డు వారి టూ.ఆర్.టీ.ఇంట్లోనే వుంటున్నారు. నిజానికి అది చాలా చిన్న ఇల్లు. అవసరాన్ని బట్టి ఆ ఇంటిపైనే  గది మీద  గది నిర్మించు కుంటూ వెళ్ళడం వల్ల చాలా ఇరుకుగా వుండేది. మెట్లు కూడా సౌకర్యంగా ఉండేవి కావు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్లి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు ఆయన కంటపడ్డ దృశ్యం అపూర్వం. అక్కడ వున్న చిన్న వసారా వంటి గదిలో రాజీవ్ గాంధీ ఒంటరిగా కూర్చుని వున్నారు. ఆయన కూర్చున్న కుర్చీ కూడా ఇనుప రేకుది. అలా కూర్చుని ఆయన చేస్తున్న పనేమిటో తెలుసా. తనని పీకు తింటున్న హైదరాబాదు దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే యాపిల్ పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే – రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన విమానం, తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం ఉండడంతో, ఆయనకు ఎందుకు అనిపించిందో బేగం పేట ఎయిర్ పోర్టులో ఎవర్నో స్సాయం అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్యగారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది, ముఖ్యమంత్రి గారు ఆఘమేఘాల మీద ఇంటికి చేరేసరికి ఇదీ సీను.
‘అమ్మ (ఇందిరా గాంధి) ఇచ్చిన ఉద్యోగం’ అని చెప్పుకోవడానికి అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు.పైగా కూసింత గర్వంగా కూడా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసిన తరువాత ‘పరవాలేదు మా అమ్మ సెలక్షన్ మంచిదే’ అనుకున్నారేమో తెలవదు. అయితే తదనంతర కాలంలో అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి ఊడడానికి కూడా రాజీవ్ గాంధీయే కారణం కావడం చిత్రాతిచిత్రం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అనుకోవడానికి ఇది మరో దృష్ట్యాంతం. (20-08-2015)     
https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif


తిరగరా తిరగరా తేరగా .....


తిరుగుబోతుల్ని తాగుబోతుల్ని ఓ గాటన కట్టడం న్యాయం కాదు. తిరుగుబోతుల్లో తాగుబోతులు వుండవచ్చు కాక.  కానీ వాళ్ళు చెప్పే విశేషాలు ఎంతో వింతగా వినడానికి విచిత్రంగా వుంటాయి. యెంత ఇంటికి అంటుకుపోయి వుండేవాళ్ళల్లో కూడా నాలుగు చోట్ల తిరిగిరావాలనే కోరిక అణగారి  వుంటుంది. ఆ కోరికే లేకపోతె మనకు అంత చక్కటి మనుచరిత్ర కావ్య రాజం దక్కేది కాదు. త్రికాల సంధ్యాదులతో ఇల్లు దాటి ఎరుగని ప్రవరాఖ్యుడిని ఆ కోరికే ఇంటి గడప దాటించి హిమాలయాల బాట పట్టించింది.


నిజానికి నేల నాలుగు చెరగులూ చుట్టి రావడం వల్ల మనసు విశాలం అవుతుంది. కొత్తవారితో పరిచయాలు అవుతాయి. కొత్త కొత్త విశేషాలు తెలుస్తాయి.  తెలుసుకోవాలనే కోరికే ప్రపంచ పర్యాటకాన్ని పెంచి పోషిస్తోంది. ఇలా కాళ్ళకు చక్రాలు కట్టుకుని ఊళ్లకు ఊళ్ళు, దేశాలు పట్టి తిరిగొచ్చిన తిరుగుబోతులు చెప్పిన వింతలూ విశేషాలే ఇవి.
సౌదీ అరేబియా దేశంలో మచ్చుకు ఒక్క నది కూడా లేదు.
అమెరికాలో ఏ నిమిషం లెక్క వేసినా అక్షరాలా అరవై వేలమంది దేశాలు చుట్టి రావడానికి విమానాల్లో ప్రయాణిస్తుంటారు.  
ఇండోనీసియాలో వున్న 127 పేలుతున్న అగ్ని పర్వతాలను దగ్గర నుంచి చూడడానికి ప్రాణాలకు తెగించి లక్షలాదిమంది పర్యాటకులు వెడుతుంటారు.
సింగపూరు దేశంలో కంటికి కనిపించనిదేమిటో తెలుసా. ట్రాక్టర్. అది వ్యవసాయిక దేశం కాకపోవడం వల్ల అక్కడ నాగలి పట్టిన రైతులు కనిపించరు.
మనవైపు పిల్లలకు మొనాకో అనగానే నోరూరుంచే బిస్కెట్లు గుర్తుకు రావచ్చు కాని మొనాకో అనేది చాలా చిన్న దేశం. యెంత చిన్నది అంటే అ దేశం మొత్తం విస్తీర్ణం  న్యూ యార్క్  సెంట్రల్ పార్కు కంటే కూడా తక్కువ.
లిబియాలో నూటికి తొంభయి తొమ్మిది శాతం ఎడారి భూములే.
మాల్దీవులు సముద్ర మట్టానికన్నా దిగువన ఉన్నందువల్ల భవిష్యత్తులో ఆ దీవులు ఏదో ఒక రోజు సముద్రంలో కలిసిపోతాయనే అనుమానాలు వున్నాయి.
నార్వే దేశం పూర్తిగా పర్యావరణ అనుకూలమైన విద్యుత్తును  ఉత్పత్తి చేస్తోంది. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో తొంభయ్ తొమ్మిది శాతం జల విద్యుత్తు కావడం గమనార్హం.
పొతే, హైతీ అనే దేశం దీనికి పూర్తిగావిరుద్ధం. అక్కడ ఒక్క చెట్టంటే ఒక్క చెట్టు కూడా లేదు.
నౌరా రిపబ్లిక్ ప్రజలు బాగా కలిగిన వాళ్ళు. ఇంట్లో వొంట్లో పుష్కలం అనే బాపతు. ప్రపంచంలోని స్తూల కాయులందరూ ఒక్క చోట చేరారా అన్నట్టుగా ఉంటుందా దేశం.
అమెరికాలోని జైళ్లలో లక్షలాదిమంది, ఒక లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో నాలుగో వంతుమంది, ఎంచక్కా అక్కడి జైళ్లలో కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటె ఆ దేశంలో  జైళ్ళు అంత వసతిగా బాగుంటాయి.
హవాయ్ భాషలో అతితక్కువగా పదమూడు అక్షరాలే వుంటాయి.
‘నా పేరు బుడుగు, అసలు పేరు చాలా పొడుగు’  అన్నట్టు బ్యాంకాక్ అసలు అధికారిక నామం చాలా చాలా పొడుగు. ఆ పేరులో ఏకంగా 169 అక్షరాలు వున్నాయి.
పాన్ అమెరికన్  అమెరికన్  జాతీయ రహదారి పొడవు  ముప్పయి వేల  మైళ్ళు.  పర్యాటకులు తమ జీవితాల్లో హెచ్చు భాగం ఆ రోడ్డుపైనే తిరుగుతూ గడుపుతుంటారు.
భారత దేశంలో లక్షా యాభయ్ వేల పోస్టాఫీసులు వున్నాయి.
ఫిన్లాండ్ లో లక్షా ఎనభయ్ వేల దీవులు వున్నాయి.
జపాన్ వాళ్ళ తెలివి తేటలే వేరు. గుండ్రంగా కాకుండా చదరపు ఆకారంలో వుంటే ఎక్కువ పుచ్చకాయల్ని సులభంగా నిలవచేయవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆ కాయల్ని చదరపు ఆకారంలో ఉండేలా పెంచుతున్నారు.
పలావు అనేది తినేది కాదు. పసిఫిక్ మహాసముద్రంలో ఓ చిన్న దీవి. ఆ దీవిలో వారిది వింత మనస్తత్వం. ఎవరయినా కోళ్ళని పెంచుకుంటారు, కుక్కల్ని పెంచుకుంటారు. కాని, ఆ దీవిలో వాళ్ళు వందల కొద్దీ షార్క్ చేపల్ని ముచ్చటపడి పెంచుతున్నారు.
కోస్టారికా యెంత శాంతి కాముక దేశం అంటే  ఆ దేశంలో సైన్యం అంటూ లేదు. అది అక్కడ  నిషిద్దం.
సాన్ మారినో దేశస్తులు కారు దిగి కాలు కింద పెట్టరు.  ఆ దేశంలో జనాభాకంటే కార్ల సంఖ్యే ఎక్కువ.
(20-08-2015)

NOTE: Courtesy Image Owner and also 50 traveling facts 

14, ఆగస్టు 2015, శుక్రవారం

లవణం గారు లేరు


ఈ రోజు బెజవాడలో కన్ను మూసిన ప్రముఖ నాస్తిక ప్రచారోద్యమ నాయకుడు లవణం గారితో నా పరిచయం వయస్సు నలభయ్ అయిదేళ్ళు. లవణం గారి నాన్నగారు గోరా గారి ద్వారా లవణం గారు పరిచయం అయ్యారు. గోరాగారు (గోపరాజు రామచంద్ర రావు గారు) నాస్తికులు. దేవుడ్ని నమ్మేవారు కాదు. దేవుడ్ని గురించి ప్రస్తావన వస్తే ‘దేవుడు లేదు’ అనేవారు. ‘నేను దేవుడ్నే నమ్మను, ఇక ఆయన ఆడో మగో నాకేమిటి నిమిత్తం’ అని వాదించేవారు.

1975 నాటి మాట. బెజవాడ ఆంధ్ర జ్యోతిలో పనిచేస్తున్నరోజులు. అప్పటికే హైదరాబాదుకు మకాం మార్చిన ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారికి ఓ ఆలోచన వచ్చి బెజవాడలో అసిస్టెంట్ ఎడిటర్ గా వున్న నండూరి రామమోహన రావు గారిని సంప్రదించారు. అనుదినం జరిగే సంఘటనలపై స్పందించి నాలుగు లైన్లలో హస్యస్పోరకంగా వుండే గేయాన్ని రాయించాలని వారి ఉద్దేశ్యం. రాయగలరా అని అడక్కుండా రాయండి అనేసారు రామ్మోహన రావు గారు నాతొ. ఆవిధంగా మొదలయ్యాయి ఆంద్ర జ్యోతి దినపత్రికలో ఎడిట్ పేజీలో కార్టూన్లవంటి నా వాక్టూన్లు. చిత్రకారుడు రమణ గారు ఓ చిన్న చిత్రాన్ని దానికి జోడించేవారు.
ఆరోజుల్లో గోరాగారి కూరగాయల ఉద్యమం మొదలయింది. బెజవాడ గవర్నర్ పేటలోని రాఘవయ్య పార్కులో కార్యక్రమం. వ్యవసాయ శాఖ మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిధి. పూలదండల బదులు కూరగాయల దండలు వేయాలనేది గోరాగారి ఉద్యమం. కూరగాయలు పెంచితే ప్రజలకు ఉపయోగం అనేది ఆయన సిద్దాంతం. సరే సభ మొదలయింది. కూరగాయలతో చేసిన దండలు వేసారు, పుష్ప గుచ్చాల బదులు కాలీ ఫ్లవర్, క్యాబేజీలతో రూపొందించిన గుచ్చాలు అందించారు. సుబ్బారెడ్డి గారు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే రకం. మనసులో  దాచుకుండే మనిషి కాదు. అయన  మాట్లాడుతూ, గోరాగారి ఉద్దేశ్యం మంచిదే  అయినా మనిషి మానసిక ఆనందానికి పూలతోటలు కూడా అవసరమన్నారు. పూల చెట్లు పీకి వాటి స్థానంలో కూరగాయల మొక్కలు పెంచేబదులు, కాలువగట్ల మీద, వృధాగా వున్న ప్రాంతాలలో  కూరగాయల పాదులు వేస్తె నలుగురుకీ ఉపయోగం అన్నట్టు ప్రసంగించారు. ఆ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని నేను వాక్టూన్ రాసాను. అదే ఇది.
కాయ 'గోరా'లు
“కూరగాయలు పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని, మా శ్రీవారా
రోజంతా పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా!”
గోరాగారి గురించి రాసింది లవణం గారికి నచ్చినట్టు లేదు. మర్నాడు ఆ పేపరు పట్టుకుని రామ్మోహన రావు గారిని కలుసుకుని ‘ఇదేమన్నా బాగుందా’ అని అడిగారు. రామ్మోహన రావు గారు సీరియస్ గా పైకి కనిపించినా హాస్య ప్రియులు.
‘జోకుని జోక్కా తీసుకోవాలండీ లేకపోతె మేకులా గుచ్చుకుంటుంది. కార్టూన్ చూసి నవ్వు కున్నట్టే శ్రీనివాసరావు వాక్టూన్ చదివి నవ్వుకోండి. ఓ పనయి పోతుంది’
ఇదీ ఆయన జవాబు.
వాక్తూన్ సంగతి ఏమోకానీ, లవణం గారితో నా పరిచయం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ నడుమ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏదో  కార్యక్రమానికి వెడితే కలిసారు. ఓ ఫోటో కూడా దిగాము. ఆంద్ర భూమి ఫోటోగ్రాఫర్ అనుకుంటాను. ప్రస్తుతం అయితే నా దగ్గర లేదు.
(14-08-2015)



వాదాలతో, వాయిదాలతో ముగిసిపోయిన పార్లమెంటు సమావేశాలు


పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసాయి. ఈ సమావేశాలు జరిగిన వ్యవధానం కంటే వాయిదాల సమయమే ఎక్కువనే రీతిలో పదేపదే వాయిదాలు పడుతూ చివరికి  గురువారం నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి.


కొత్త కోడలు కాపురం చేసే కళ కాలి మెట్టెలు చూసే చెప్పొచ్చన్నట్టు ఈ సమావేశాలు ఇలానే జరుగుతాయని మొదటి రోజునే బోధపడింది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులను, ఒక కేంద్ర మంత్రిని తొలగించాలని ప్రతిపక్ష హోదా సయితం లేని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ డిమాండుతో సమావేశాలకు అంకురార్పణ జరిగింది. అంతవరకు సభను సాగనిచ్చేది లేదన్న వాదనతో వాదోపవాదాలను మరింత సాగతీసింది. ‘అల్లా ఎల్లా కుదురుతుంది కుదరదు కాక  కుదరదు’ అంటూ గతంలో ప్రతిపక్షంలో వుండగా ఇలానే సభను అడ్డుకున్న బీజేపీ, గతాన్ని హాయిగా  మరచిపోయి  మొండికేసింది. ‘ముందు రాజీనామాలు, తరువాతే చర్చ’ అని కాంగ్రెస్ ఓ పక్కా, ‘ముందు చర్చ ఆ తరువాతే సమాధానాలయినా ఇంకేదయినా’ అంటూ పాలకపక్షం, తమదయిన పాత్రలను తమదయిన బాణీల్లో పాత్రోచితంగా అవధులు మీరి మరీ పోషించాయి. ‘కోడి ముందా గుడ్డు ముందా’ అనే రీతిలో సాగిన ఈ వివాదానికి తెర పడే అవకాశాలు ఎటూ లేవు కాబట్టి పార్లమెంటు విలువయిన సమావేశాల సమయమంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. పరిస్తితి ఈ విధంగా గాడి తప్పడానికి ‘మీరు కారణం అంటే మీరు కారణం’ అని ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్నారు తప్పిస్తే,  ఏఒక్కరూ, ‘ఉమ్మడిగా మనం కారణం’ అనుకోలేదు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏ దిశగా సాగుతున్నదో అర్ధం చేసుకోవడానికి ఇదొక్కటి చాలు.
చట్టసభలు సజావుగా నడవాలంటే  పాలక పక్షం ముందు బాధ్యత తీసుకోవాలి. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి. ఈ పవిత్ర కర్తవ్య నిర్వహణలో పాలక ప్రతిపక్షాల వైఫల్యమే, బాధ్యతారాహిత్యమే  పార్లమెంటు సమావేశాలు ఇలా నిరర్ధకంగా ముగియడానికి ప్రధాన కారణం. ఈ విషయం నిర్ధారించడానికి పార్లమెంటరీ నియమ నిబంధలని అపోసన పట్టక్కరలేదు. బజారున పోయే ఏ సామాన్యుడిని అడిగినా ఇదే చెబుతాడు.
నిజానికి సభ సజావుగా నడవకపోతే ప్రతిపక్షానికే  నష్టం. పాలకపక్షానికి ఒకరకంగా వెసులుబాటు. సభ జరిగేలా చూసుకుంటే పాలక పక్షం తప్పొప్పులను ఎత్తి చూపి నిలదీయడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభిస్తుంది. సభ జరక్కపోతే ఏదో అప్పటికి ‘మమ’ అనిపించి పాలక పక్షం బయటపడొచ్చు. అయితే సభను అడ్డుకోవడం ద్వారా లభించే ప్రచార లాభం రాజకీయ పార్టీలను మరోరకంగా ఆలోచింపచేస్తున్నాయి. అందుకే ఇన్ని గడబిడలు. ఇన్ని శషభిషలు.      
ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఒక పార్టీని ఓడించి మరో పార్టీకి పట్టం కడుతున్నారు అంటే ఏమిటి అర్ధం. పాత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి, కొత్తగా వచ్చే ప్రభుత్వం అయినా కొత్త బాటలో నడవక పోతుందా అనే ఆశతో.
నిరుడు జరిగిన లోక సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అక్కున చేర్చుకుని అంతటి స్థాయిలో ఆదరించడానికి దోహదం చేసిన అంశాల్లో ఇదొకటి. ‘మార్పు’ కోరి వారు మోడీకి  ఓటు వేసారు. ఎన్నికలకు ముందు మోడీ కానీ, ఆయన నేతృత్వం వహించిన ఎన్డీయే కూటమి కానీ ప్రజలకు కొత్తగా చేసిన పెద్ద పెద్ద వాగ్దానాలు కూడా ఏమీ లేవు. యేవో కొన్ని నామకర్ధం చేసినా వాటిపై సామాన్యులు పెట్టుకున్న ఆశలు పెద్దగా లేవనే చెప్పాలి.  ప్రజలు మోడీకి పట్టం కట్టింది ఆయన ఏదో మార్పు తీసుకువస్తాడనే ఆశతోనే. ప్రధాని పీఠం ఎక్కిన కొత్తల్లో ఆయన ప్రదర్శించిన వ్యవహార శైలి, చెప్పిన మాటలు, చేసిన ప్రకటనలు ఈ ఆశలకు కొత్త ఊపిరిలూదాయి.
అయితే మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో అధికార పక్షం అటు సభలో, వెలుపలా గతాన్ని మరచి వ్యవహరించిన తీరు, సమర్ధించుకున్న విధానం ప్రజలు మోడీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లాయి. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు, ‘గతంలో మీరు అధికారంలో వున్నప్పుడు మీ నిర్వాకం ఏమిటి’ అని ఎదురు ప్రశ్నించడం,  ‘మార్పు’ తెస్తామన్న సర్కారుకు శోభస్కరం కాదు. తప్పులు చేసారు కనుకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించి బీజేపీని గద్దె ఎక్కించారు. ‘తప్పులు చేస్తూ ఆ తప్పులు  మీరూ చేసినవే కదా’ అని సమర్ధించుకుంటే ఇక వారికీ వీరికీ తేడా ఎక్కడ?
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే – నిరుటి ఎన్నికల తరువాత ఆ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఒకప్పుడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీకి లోకసభలో ప్రధాన ప్రతిపక్షం హోదాకు సరిపడనంతగా అతి తక్కువ స్థానాలు కట్టబెట్టి ఓటర్లు ఆ పార్టీపై తమ కసి ప్రదర్శించారు. ఆ స్థాయిలో పరాజయం మూటగట్టుకున్న పార్టీ నేతల నోళ్ళు చాలా రోజులు మూగనోము పట్టాయి. కానీ ఆ నోళ్ళు మళ్ళీ పెగలడానికి కారణం కాంగ్రెస్  పార్టీ నాయకత్వం ప్రతిభ ఎంతమాత్రం కాదు. ఈ పుణ్యమో, పాపమో ఆ చలవ పూర్తిగా మోడీ ప్రభుత్వానిదే. ఇందుకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి రుణపడివుండాలి.
మోడీ ప్రభుత్వం నిరుడు కేంద్రంలో కొలువు తీరినప్పుడు ఆ ప్రభుత్వం మీద ఇంత  త్వరగా అవినీతి  ఆరోపణలు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు ఆ అవినీతి లెక్కకట్టలేనంత స్థాయిలో మోడీ హయాములో జరిగిందని ఎవ్వరూ అనుకోవడం లేదు. గతంతో పోలిస్తే ఇదేమంత లెక్కలోది కాకపోవచ్చు. కానీ ఇక్కడ అధికార కేంద్రంలో వున్నది మోడీ. ‘మార్పు తెచ్చి తమ తలరాతల్ని మారుస్తాడ’ని ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్న నరేంద్ర మోడీ హయాములో, చాయ్ వాలా నుంచి ప్రధాని హోదాకు ఎదిగిన అతి సామాన్య నాయకుడి పరిపాలనలో ఏ తప్పు జరిగినా దానికి  చిన్నా పెద్దా తేడా ఉండరాదనే నలుగురూ కోరుకుంటారు.  త్రేతాయుగంలో  శ్రీరాముడి పాలనతో పోల్చిచూసుకుని అంచనాలకు వస్తారు. మంచి పేరు తెచ్చుకోవడం ఎల్లవేళలా మంచిదే. కానీ ఏమాత్రం తభావతు వచ్చినా ఆ మంచి పేరు మంచులా కరిగిపోయే ప్రమాదం పొంచుకునే వుంటుంది. ప్రస్తుతం మోడీని చూసేవారు ఇటువంటి కళ్ళతోనే గమనిస్తున్నారు. జరిగింది చిన్నదో పెద్దదో తప్పు తప్పే అని ఒప్పుకుని, గతంలో తాము ప్రవర్తించిన తీరు కూడా సరయినది కాదని  లోకసభ సాక్షిగా హుందాగా ఒప్పుకుని వుంటే, ‘దాసుడి తప్పులు దండంతో సరి’ అన్న చందంగా కధ సుఖాంతం అయ్యేది. పాలకపక్షానికి అనవసర సమర్ధింపుల హైరానా తప్పేది. ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు మనకు అలాటి రాజనీతిజ్ఞులు యేరీ! అందరూ రాజకీయ నాయకులే.  
పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత రాజకీయ ప్రయోజనమో, లేదా మీడియా ప్రచారమో సంపాదించుకుని ఉండవచ్చు. కానీ అంశం ఎలాటిదయినా, అందులోని తీవ్రత ఎంతటిదయినా సాక్షాత్తు ఆ పార్టీ అధినేత్రే లోకసభ వెల్ లోకి ప్రవేశించి నిరసన తెలపడం ఆవిడ స్థాయికి తగింది కాదు. గతంలో ఇదేమాదిరిగా సభను అడ్డుకుకున్న బీజేపీ తీరును గుర్తుచేసి, ఆ పార్టీ గతాన్ని ఎండగట్టడంవరకు పరిమితమై, సభను నడపడంలో సహకరించి వుంటే కాంగ్రెస్ లోని ‘మార్పును’ ప్రజలు గమనించేవారు. ఈ విధంగా హుందాగా ప్రవర్తించకపోవడం ద్వారా,  మీడియా ప్రచారాన్ని మించిన ప్రజాదరాన్ని బీజేపీ, కాంగ్రెస్ రెండూ దారుణంగా కోల్పోయాయి.
పార్లమెంటు సమావేశాలకు అయ్యే ఖర్చు నిమిషానికి రెండున్నర లక్షలు, రోజుకు ఆరుకోట్లు, నూరు రోజులకు వెరసి అక్షరాలా ఆరువందల కోట్లు అంటూ గణాంకాలు చెబుతున్నారు. మరి సభ జరక్కుండా చేసి ఎదుటివారి మీద నిందలు మోపుతున్న ఈ రాజకీయ పార్టీలు ఇంతటి ఖర్చుకు యేమని సమాధానం చెబుతాయి. ఆయా పార్టీలనుంచి ఈ ప్రజాధనాన్ని తిరిగి వసూలు చేసే రాజ్యాంగ సవరణ చేయాలని ఎవరయినా కోరుకుంటే తప్పేమిటి?           

సమావేశాలు ముగిసిన తరువాత, బీజేపీ, కాంగ్రెస్ తరహా చూస్తుంటే ఈ అంశాలపై రెండు పార్టీల నడుమ ఈ పోరు ముందు ముందు కూడా కొనసాగేటట్టు వుంది. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో బీజేపీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు నెల రోజుల పాటు విస్తృతంగా తిరిగి కాంగ్రెస్ తీరును ఎండగట్టాలనీ, ప్రజలకు వాస్తవాలు వివరించాలనీ ప్రధాని మోడీ తమ పార్టీ వారితో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గకపోవచ్చు. అయితే ఒకటే ఊరట. పార్లమెంటును స్తంభింపచేస్తే  ప్రభుత్వ ఖజానాకు, ప్రజాధనానికి చేటు. ఇక ఆ పార్టీలు బయట మాట్లాడుకున్నా,  పోట్లాడుకున్నా అది వాటి తలనొప్పే. ప్రజలమీద భారం పడదు.
పొతే, పార్లమెంటు సమావేశాల తీరుతెన్నులపై సామాన్యుడి మనసులోని మాటను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతి నుద్దేశించి ఆకాశవాణి, దూరదర్సన్ ల ద్వారా ప్రజలకు ఇచ్చిన సందేశంలో బయట పెట్టారు. భారత ప్రజాస్వామ్య వృక్షపు వేర్లు బలంగా ఉన్నప్పటికీ ఆకులు వాడిపోతున్నాయనీ, కొత్త చిగుళ్ళు వేయాల్సిన అవసరం వుందని అన్నారు. ప్రజాస్వామ్య వేదికలు ఒత్తిళ్లకు గురవుతున్నాయని చర్చావేదికగా ఉండాల్సిన పార్లమెంటు యుద్ధ క్షేత్రంగా మారిపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంలో  రాజకీయ పార్టీలు పునః పరిశీలన  చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి హెచ్చరించారు. సామాన్యుడి మాటను రాజకీయ నాయకులు ఎటూ చెవిన పెట్టరు. దేశ రాజకీయాల్లో తలపండిన పెద్దమనిషి, అనేక (రాజకీయ) యుద్దముల ఆరితేరినవాడు అయిన ప్రణబ్ కుమార్ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో ఇచ్చిన సలహా అయినా కనీసం చెవికెక్కించుకుంటారేమో చూడాలి.     
(14-08-2015)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com  మొబైల్:  9849130595

NOTE: Courtesy Image Owner