8, ఆగస్టు 2015, శనివారం

"Back to village" - శ్రీమంతుడు



'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో  రిటైర్ కావడానికి ముందే రాశాను. నాకు తెలిసి, ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి, వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు  మాత్రమే ఈ పని చేసి చూపించారు.  హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,   పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.  చదువులకోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా,  స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.

ఈరోజు 'శ్రీమంతుడు' సినిమా చూస్తున్నప్పుడు ఈ జ్ఞాపకం మరో సారి మదిలో మెదిలింది. (08-08-2015)


(మా ఊర్లో మా పూర్వీకులు కట్టించిన ఇల్లు)

వివాదాల సుడిగుండాల్లో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 09-08-2015,SUNDAY)

దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు మాదిరిగా నడుస్తోంది పోలవరం కధ. కొత్తగా పురుడుపోసుకున్న రెండు రాష్ట్రాల నడుమ ఈ పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కంచికి చేరని కధలా సాగిపోతోంది. బాలారిష్టాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. వార్తల్లో మాత్రమే  కనిపించే ఈ ప్రాజెక్ట్  వాస్తవరూపం దాల్చడానికి ఏండ్లూ పూండ్లూ పట్టేట్టు వుంది.  
దేశంలోని నదులన్నింటినీ  అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941  జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్  ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా  మూడు లక్షల యాభై  వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్  మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. ఆరోజుల్లో మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ కు నామకరణం  కూడా చేశారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న  భద్రాచలం  సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు,  పోలవరం కుడి గట్టు కాల్వని,   కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం  2004  కల్లా ఎనిమిదివేల ఆరువందల కోట్లకు పెరిగిపోయింది. 

1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న  పోలవరానికి,  వై. ఎస్.  రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం వున్న ఆయకట్టు స్థిరీకరణతో సహా సేద్యపు నీటి సౌకర్యం కల్పించడం ప్రాజెక్ట్ లక్ష్యం.  పోలవరం నుంచి మళ్లించిన గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ప్రకాశం బరాజ్ ఎగువన కొత్తగా మరో బరాజ్ నిర్మించడం కూడా ఈ పధకంలో ఓ భాగం. ఇందువల్ల హైదరాబాదు నుండి తొమ్మిదో నెంబరు జాతీయ రహదారిలో ప్రయాణించే వారు  విజయవాడ వరకు పోకుండానే ఆ బరాజ్ పైనుంచి  గుంటూరు జిల్లాకు చేరడానికి వీలుపడుతుంది. ఇవీ ఈ ప్రాజెక్ట్ వల్ల అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కానీ, విభజన అనంతరం ఏర్పడ్డ కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వొనగూడే ప్రయోజనాలు. కొద్దో గొప్పో తెలంగాణాలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు కూడా ప్రయోజనం వుంటుంది.          
అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా గోదావరి నదులే ప్రధాన సేద్యపు నీటివనరులు. ఇందులో కృష్ణానది నుంచి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. పోతే,  గోదావరిలో మిగులు జలాలు ఎక్కువ. ఏటా కొన్ని వందల వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళించడం ద్వారా కృష్ణానదీ జలాలను వాటి అవసరం ఎక్కువగా వున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడం సాధ్య పడుతుంది. ఈ కోణంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే పోలవరం. అసలు ఏ సేద్యపు నీటి  ప్రాజెక్ట్ అయినా కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందించడం లక్ష్యంగా రూపుదిద్దుకుంటుంది. కానీ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా సరఫరా అయ్యే జలాలు ఉభయగోదావరి,  కృష్ణాజిల్లాల్లో వున్న ఆయకట్టు స్థిరీకరణకు మాత్రమే  ప్రధానంగా ఉపయోగపడతాయి. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల మునకకు గురయ్యే ప్రాంతాలు మాత్రం తెలంగాణలో వున్నాయి. వాటిల్లో చాలావరకు ఆదివాసీలు నివసించే ప్రదేశాలు. ప్రధానమైన అడ్డంకి  ఇదే.
రాష్ట్రంలో పలు జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ ప్రాజెక్ట్ కు కొన్ని సహజ సిద్ధమైన బాలారిష్టాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్ట్  నిర్మాణం వల్ల సుమారు రెండువందల డెబ్బయ్ ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయి. దాదాపు నలభయ్ వేల పైచిలుకు కుటుంబాలవారు నిరాశ్రయులవుతారు. వారికి  పునరావాసం కల్పించాల్సి వుంటుంది. ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఈ తిప్పలు తప్పవు. కానీ పోలవరం వల్ల నిరాశ్రయులయ్యేవారిలో  సగం మంది అక్కడి నేలను, అడివినీ నమ్ముకున్న షెడ్యూల్ల్ తెగలవారు కావడం గమనార్హం. దీనికితోడు ఈ ప్రాజక్ట్  తలపెట్టినప్పుడు రాష్ట్రం ఒకటిగా వుంది. తరువాత రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సమయంలో కూడా పోలవరం అంశం ప్రధాన అవరోధంగా  నిలిచింది. ప్రాజెక్ట్ ఒక రాష్ట్రంలో,  ముంపుకు గురయ్యే ప్రాంతాలు మరో రాష్ట్రంలో వుండే విచిత్ర పరిస్తితి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు విభజన  నిర్ణయం తీసుకున్న నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం,  తెలంగాణాలోని అనేక గ్రామాలను  ఆంధ్ర ప్రదేశ్ కు బదలాయించే ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఆఖరి క్షణంలో ప్రయత్నించినా అది కుదరలేదు. ఆ తరువాత వచ్చిన మోడీ నాయకత్వంలోని  ఎండీయే సర్కారు ఆ ఆర్డినెన్సు తీసుకురావడమే  కాకుండా దాన్ని లోకసభలో ఆమోదింపచేసుకోవడంతో  తెలంగాణా ప్రాంతంలో అగ్గి రాజుకుంది.  పోలవరం డిజైన్ మార్చాలని, తద్వారా ముంపుకు గురయ్యే ప్రాంతాల విస్తీర్ణం తగ్గేలా చూడాలని మొదటి నుంచి పట్టుబడుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులకు కేంద్రం వైఖరి  మింగుడు పడలేదు. అయినా కానీ టీఆర్ ఎస్ ప్రభుత్వం ఓ మెట్టు దిగి ఈ విషయంలో మరింత పట్టు పట్టకుండా పట్టువిడుపు ధోరణి ప్రదర్శించిన ఫలితంగా రాజుకున్న అగ్గి మరింత ప్రజ్వరిల్లకుండా ఆదిలోనే సమసిపోయింది.
పొరుగునవున్న ఒడిశా,  ఛత్తీస్ ఘడ్   ప్రభుత్వాలు కూడా ఈ పోలవరం  ప్రాజక్ట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల తమ రాష్ట్రాల్లో భూములు విస్తారంగా మునకకు గురవుతాయని, మునుపటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణంతో ముందుకు పోతోందని ఆరొపిస్తూ ఒడిశా, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాలు గతంలోనే సుప్రీం కోర్టులో కేసు వేశాయి.    
పోలవరం ప్రాజెక్ట్ పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో వున్నట్టు కానవస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో దీన్ని జాతీయ ప్రాజక్ట్ గా చేపట్టి పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు.  అధికార పీఠం ఎక్కిన బీజేపీ ఇప్పుడు ఈ విషయంలో నిరాసక్తతతో కూడిన ఆసక్తి చూపుతోందన్న అపప్రధ మోస్తోంది. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.
నిధుల లేమితో కునారిల్లుతున్న పోలవరం  ప్రాజెక్ట్ అనుకున్న విధంగా,  అనుకున్న  వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే. ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం  అంచనాలకు మించి పెరిగిపోవడం మాత్రం  ఖాయం.

అయితే, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తిచేయడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికీ, ప్రత్యేకించి అక్కడ పాలనసాగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికీ ఎంతో ప్రయోజనం లభిస్తుంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరతామని ఆ పార్టీ అధినాయకులు పదేపదే ప్రకటనలు చేయిస్తున్నారు. కానీ పార్టీ అధినేతకు అది అంత సులభంగా అయ్యేపని కాదని తెలుసు. కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం వరకు చేసింది. కానీ నిధుల విడుదల అరకొరగా జరుగుతోంది. అంచేతే టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు అనే కొత్తపల్లవి ఎత్తుకుంది. పోలవరం అన్ని గండాలు గడిచి పూర్తయ్యేలోగా పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. కాబట్టే పట్టిసీమ ప్రాజెక్టును ఆఘమేఘాల మీద పూర్తిచేయాలని అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆగస్టు పదిహేనుకల్లా పూర్తిచేసి నీరు విడుదల చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఒక్క చిత్తశుద్ధి మాత్రమే సరిపోదు. అందుకు  అవసరమైన విత్తం కూడా కావాలి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దగ్గర బాగా కొరతగా వున్నది అదొక్కటే.
దీనికి తోడు పట్టిసీమ ప్రాజెక్టుపై ముసురుకుంటున్న వివాదాల ముసురు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన వై.ఎస్.ఆర్.సీ.పీ. దీనికి ఏకంగా 'మాయలేడి' అనే పేరు పెట్టింది. కేవలం కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికే తెలుగుదేశం ప్రభుత్వం, పోలవరాన్ని పక్కనబెట్టి పట్టిసీమ ప్రాజెక్టును తెర మీదకు తీసుకు వచ్చిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సహజంగా పాలక పక్షాలు భావిస్తుంటాయి. అయితే అదే ప్రశ్న ప్రజలనుంచి రాకుండా చూసుకోవాలి. తాడును పామనుకుని జాగ్రత్త పడడానికి, పామును తాడనుకుని నిర్లక్ష్యంగా వుండడానికీ ఎంతో వ్యత్యాసం వుంది.  
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 9849130595


(08-08-2015)

NOTE: Courtesy Image Owner 

మూడు పెగ్గులు నాలుగు హగ్గులు


'ప్రతిరోజూ నియమం తప్పకుండా రెండో మూడో పెగ్గులు లాగించడమే  నా ఆరోగ్య రహస్యం' అన్నాడొక శతాయుష్కుడు.
తాగుబోతుల లెక్కలు వేరు. జగ్గుల లెక్కలో సీసాలకు సీసాలు పట్టించేవాళ్లు కూడా 'నేను తాగేది చాలా తక్కువ. మహా అయితే ఒకటో రెండో..' అంటుంటారు నాలుగో పెగ్గు పట్టిస్తూ.
ఈ పెగ్గులు సరే! తాగిమాట్లాడే మాటలు. మరి హగ్గులు అంటున్నారు, అవేమిటి?
ఈ హగ్గులు ఇంగ్లీషు హగ్గులు. అంటే కౌగలింతలు అన్నమాట.
ఆడామగా హాయిగా మరో ధ్యాస లేకుండా గట్టిగా కావిలించుకుంటే, అదీ రోజుకు మూడు నాలుగు సార్లు, ఇక ఆ జంటకు ఆయుస్సు అమాంతం పెరిగిపోతుందని హగ్గారావుల ఉవాచ. దీనికి మద్దతుగా వాళ్లు అనేక శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను ఉదహరిస్తున్నారు. అవి వింటుంటే కౌగలింతల్లో తేలిపోతున్నట్టుగా వుంటుంది.
సాధారణంగా ఓ జంట ఎంతసేపు కౌగలించుకుంటుంది అన్న పరిశోధనలతో మొదలు పెట్టి ఈ శాస్త్ర కారులు తేల్చినదేమిటంటే -
ఉత్తుత్తి కౌగలింతలు మూడు సెకన్లలో ముగిసిపోతాయి.
అదే ఇరవై సెకన్లు గాట్టిగా కావిలించుకుంటే దానివల్ల కలిగే మేళ్ళు అంతా ఇంతా కాదని అంటున్నారు. ఈరకం కౌగలింతలు శరీరం మీదా, మనస్సు మీదా కూడా ఏకకాలంలో సానుకూల ప్రభావం చూపుతాయన్నది వారి అభిప్రాయం.
ఎలాటి భేషజాలు లేకుండా, నిజాయితీతో అవతల వ్యక్తిని దగ్గరకు తీసుకుని కౌగలించుకోవడం వల్ల శరీరంలో "oxytocin" అనే నోరు తిరగని ఓ హార్మోను తయారవుతుందట. దీనికి వాళ్లు 'లవ్ హార్మోను' అని పేరు కూడా పెట్టేసారు. ఈ హార్మోను పుణ్యమా అని శారీరకంగా, మానసికంగా ఎంతో మంచి జరుగుతుందట. శరీరం గాల్లో తేలిపోతున్న విధంగా తేలిక పడుతుందట. మానసిక ఆందోళనలు వగయిరా మంత్రం వేసినట్టు మాయం అయిపోతాయిట. లేనిపోని భయాలు ఏమైన వుంటే కౌగలింతలు కలిగించే హాయిలో కనుమరుగయిపోతాయిట.
మనం కోరుకున్న అబ్బాయో, అమ్మాయో మన బాహుబంధాల్లో వున్నట్టయితే ఇక అన్ని రకాల భవబంధాలు హుష్ కాకి. ప్రేమ బంధం ఒక్కటే శాశ్వితం.
కేవలం కౌగలింతల దగ్గరే ఈ పరిశోధకులు ఆగిపోలేదు. పసి పాపను ఉయ్యాల్లో ఊపుతున్నప్పుడు, పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్నప్పుడు, జీవిత భాగస్వామితో కాలు చేయీ కలిపి నృత్యం చేస్తున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆత్మీయులతో కరచాలనం చేస్తున్నప్పుడు సయితం 'లవ్ హార్మోను' లావాలా తన్నుకువస్తుందట. పైగా ఇదంతా టోటల్ గా ఫ్రీ. ముఫ్థ్, ఉచితం. ఇంకా యెందుకు ఆలశ్యం.
కౌగలించుకుందాం రండి.
గట్టిగా అనకండి. ఏ తెలుగు నిర్మాతో విన్నాడంటే ఏకంగా ఈ పేరు పెట్టి ఓ సినిమా చుట్టేసి మనమీద ఒదిలేసే ప్రమాదం వుంది.     (08-08-2015)

NOTE: Courtesy Image owner 

7, ఆగస్టు 2015, శుక్రవారం

బాబు బలి



నిజానికి ఇది నా కామెంటు కాదు. ఈరోజు ఉదయం ఓ టీవీ ఛానల్ చర్చకు వెళ్ళినప్పుడు, విరామ సమయంలో  బాహుబలి ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా కలెక్షన్లు గురించి చెబుతూ, వాళ్ల వూళ్ళో వాళ్లు ఏకంగా ఒక బస్సు మాట్లాడుకుని వెళ్ళి ఆ సినిమా చూసి వచ్చారని ఒకరంటే, ఆ సినిమా చూడని జన్మ వ్యర్ధం అన్న రీతిలో ప్రచారం సాగడం కూడా ఒక కారణమని మరొకరన్నారు.  సినిమా రంగంలో ఒకప్పుడు మేటి నిర్మాత అనిపించుకున్న ఒక పెద్ద మనిషి కల్పించుకుని బాహుబలి సినిమాను చంద్రబాబుతో పోలుస్తూ చేసిన వ్యాఖ్య ఇది. ఆయన ఏమన్నారంటే - 'విడిగా ఎవర్ని కదిలించినా అదో సినిమానా అన్నట్టు పెదవి విరుస్తున్నారని, అదే నలుగురిలో వున్నప్పుడు వాళ్ళే మళ్ళీ గొప్ప సినిమా అని పొగుడుతున్నారని అన్నారు. నిరుడు ఎన్నికల ముందు ఎవర్ని కదిలించినా విడిగా చంద్రబాబును విమర్శించేవారనీ, కలసికట్టుగా మాత్రం గెలిపించారనీ ఓ పోలిక చెప్పారు.
నాకు ముందు అర్ధం కాలేదు. తరువాత అర్ధం అయ్యీ కానట్టు అనిపించింది. బహుశా సినిమా పరిజ్ఞానం ఆట్టే లేకపోవడం ఓ కారణం కావచ్చు.

NOTE: Courtesy Image owner 

6, ఆగస్టు 2015, గురువారం

అణుబాంబు - భగవద్గీత


(ఆగస్టు ఆరోతేదీ - మొదటి అణుబాంబు ప్రయోగం)
FIRST POSTING LINK
http://bhandarusrinivasarao.blogspot.in/2014/11/blog-post_13.html
ప్రపంచ అద్భుత సంఘటనల్లో ఒకదానిగా ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి అణు బాంబు పరీక్ష జరిగి ఇప్పటికి కాస్త అటూ ఇటూగా డెబ్బయ్ ఏళ్ళు. న్యూ మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ల దూరంలో 1945 జులై 16 వ తేదీన  ట్రినిటీ అనే గుప్త నామంతో అమెరికా అణు పరీక్ష జయప్రదంగా నిర్వహించింది. అప్పటినుంచి లోకంలో  అణు శకం మొదలయిందని చెప్పుకోవచ్చు.
అప్పట్లో అమెరికా జరిపిన అణు పరీక్షకూ, భగవద్గీతకూ సంబంధమేమిటన్న అనుమానం రావచ్చు.  దాన్ని నివృత్తి చేసుకోవాలంటే గతాన్ని కొంత నెమరు వేసుకోవాలి.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన పేరు ట్రినిటీ అయితే పరీక్షించిన అణుబాంబు కు నిర్దేశించిన నామం ది గాడ్జెట్’ . తొలి అణు పరీక్షను విజయవంతంగా  జరిపిన విజయోత్సాహంతో  అమెరికా కొద్ది వ్యవధిలోనే   రెండు అణు బాంబులను జపాను పై ప్రయోగించి అణు బాంబు శక్తిసామర్ధ్యాలను లోకానికి ఎత్తిచూపింది.
1945  ఆరోతేదీన తొలి బాంబు ప్రయోగం జపాను లోని హిరోషిమాపై జరిగింది. మరో మూడురోజులకే తొమ్మిదో తేదీన రెండో అణు బాంబును నాగాసాకీపై అమెరికా ప్రయోగించింది.
హిరోషిమాపై  జారవిడిచిన అణుబాంబు  గుప్తనామం లిటిల్ బాయ్’  కాగా,  నాగాసాకీని మట్టుబెట్టిన  బాంబుకు పెట్టిన పేరు ఫ్యాట్ మ్యాన్
నిజానికి హిరోషిమాపై  ప్రయోగించిన తొలి బాంబు  పరీక్ష చేసి ప్రయోగించినది కాదు. అయినా విజయవంతం అయింది. ఈ బాంబును  ముందుగా  పరీక్షించకపోవడానికి కూడా ఒక కారణం వుంది. ఒకే ఒక్క బాంబుకు కావాల్సిన  యురేనియం -235 నిల్వలు మాత్రమే అమెరికా వద్ద మిగిలివుండడంతో ఆ బాంబును  ముందుగా పరీక్షించి చూసే  వీలు లేకుండా పోయింది. పోతే నాగాసాకీపై ప్రయోగించిన బాంబు ట్రినిటీ మాదిరి తయారు చేసిన అణు బాంబు.
ఈ రెండు బాంబులు కలసి సృష్టించిన మారణ హోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభై ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. ఆ  బాంబులు కలిగించిన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ తరువాత అయిదేళ్ళలోమరణించిన వారి సంఖ్య  లక్షలకు చేరింది. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచివున్న ముప్పు యెంతటిదో   అర్ధం చేసుకోవచ్చు. 

పోతే, ట్రినిటీ పరీక్షకు అంతా సిద్ధం చేసుకున్న  అమెరికా శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణు విస్పోటన  పరీక్షకు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ముహూర్తం నిర్ణయించారు. కానీ వాతావరణం  ఉరుములు, మెరుపులు వర్షంతో అనుకూలించలేదు. ఆ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా వుంటాయని అధికారులు భావించి కొద్ది సేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్ ట్రూమన్ తో సహా అంతా  ఎదురు చూస్తున్న వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభై అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు  అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా  చూపారు.  సరిగ్గా 5-10 కి  20 నిమిషాల కౌంట్ డౌన్ మొదలయింది. అక్కడికి  16 మైళ్ల దూరంలో  నిర్మించిన  ఎత్తయిన టవర్ నుంచి  ఉన్నతాధికారులు  ప్రయోగ ప్రక్రియని  పరిశీలిస్తున్నారు. స్తానిక కాల మానం ప్రకారం ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభై అయిదు సెకన్లకు మానవాళి  భవిష్యత్తును  ప్రశ్నార్ధకం చేస్తూ తొలి  అణు విస్పోటనం తన భీషణ రూపాన్ని ప్రదర్శిస్తూ లోక భీకరంగా ఆవిష్కృతమయింది.   పేలుడుకు  ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి.  క్షణంలో వందోవంతులో   20 కిలో టన్నుల టి.ఎం.టి. శక్తికి సరిసమానమైన ఎనర్జీ విడుదలయింది. ఒకటి రెండు క్షణాలపాటు ఆ ప్రదేశం,  చుట్టుపక్కల కొండలు పట్టపగలు వెలుతురును తలదన్నే విధంగా  వేయి సూర్యుల కాంతితో (దివి సూర్య సహస్రస్య  భగవద్గీత 11 వ అధ్యాయం 12 వ శ్లోకం ప్రధమ పాదం)  వెలిగిపోయాయి.  బాంబు పేలిన చోట పది అడుగుల లోతు  వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి   ఏర్పడింది.  ఆ ప్రదేశం యావత్తు నిప్పుల కొలిమిలా మారింది. నీలంనుంచి ఎరుపు, ఎరుపు  నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు -  ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో దర్శనమిచ్చాయి. పెద్ద పుట్టగొడుగు మాదిరిగా  నల్లటి నలుపు రంగుతో మిశ్రితమయిన ఎర్రటి పొగ మేఘాలు  గగన తలంలో ఏడున్నర మైళ్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి.
ట్రినిటీ పరీక్ష డైరెక్టర్ కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్  బాంబు పేలుడు సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. ప్రపంచ వినాశనానికి దోహదం చేసే దారుణ  ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి పలుకుల్లో ధ్వనించింది. ఛీ! జరగరానిది జరిగి పోయింది ‘Now we all sons of bitches’- అదీ ఆయన వ్యాఖ్య.
ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్ర వేత్త , ఈ నాటి ఈ వ్యాసానికి ప్రేరకుడు అయిన జె.రాబర్ట్  ఓపెన్ హీమర్    (J.Robert Oppenheimer) వేయి సూర్యుల కాంతి  అన్న భగవద్గీత లోని సంస్కృతపాదం ఆధారంగా ఆనాటి దృశ్యాన్ని వర్ణించారు.   ఆ తరువాత  చాలా ఏళ్ళకు అణు పరీక్షను గురించి మాట్లాడుతూ మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు  ఎందుకంటె అది సంస్కృతంలో వుంది.  భగవద్గీతలోని వాక్యం అది. ‘కాలోస్మి  లోకక్షయకృత్ ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
("kālo'smi lokakṣayakṛtpravṛddho lokānsamāhartumiha pravṛttaḥ"  which he translated as "I am become Death, the destroyer of worlds)

అంటే-
నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వంసహా శక్తిని


పాత కధ - కొత్త మలుపు

అనగనగా ఓ రాజుగారు. ఓ రోజు వేటకు వెడదామని అనుకుని ఆస్థానంలోని అధికారులని ఏర్పాట్లు చేయమని కోరాడు. అడవిలో వేటాడే సమయంలో వాన పడే అవకాశం వుందా అని ఆరా తీసాడు. సంబంధిత అధికారులు అన్ని లెక్కలు వేసి అలా జరగదని, వర్షం పడే వీలు ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. సరే అని రాజుగారు మందీ మార్బలం వెంట తీసుకుని వేటకు బయలు దేరారు. బట్టల మూటలు గాడిదపై పెట్టుకుని వెడుతున్న ఓ  చాకలి దారిలో తారసపడ్డాడు. రాజు గారిని, ఆయన పరివారాన్నీ చూసి, వారి హడావిడి గమనించి రాజుతో మనవి చేసుకున్నాడు. 'అయ్యా! మీరు బయలుదేరిన ముహూర్తం బాగా లేదు. వర్షం పడేట్టు వుంది కనుక మీరు వేటకు మరో రోజు వెళ్ళండి' అని సలహా చెప్పాడు. కానీ రాజు అతడి మాట చెవిన పెట్టకుండా ముందుకు సాగాడు. కొద్ది దూరం పోగానే హఠాత్తుగా మబ్బులు కమ్మి భోరున వర్షం కురిసి అందరూ తడిసి ముద్దయ్యారు. వర్షం రాదని  చెప్పిన అధికారిపై రాజుగారికి వొళ్ళు మండింది. వర్షం పడుతుందని హెచ్చరించిన చాకలికి ఆ ఉద్యోగం ఇస్తున్నట్టు ఆ మంటలో ఓ  ప్రకటన చేసాడు. అయితే, వర్షం జోస్యం తన ప్రతిభకాదనీ, వర్షం పడే ముందు తన గాడిద చెవులు టపటపా కొట్టుకుంటూ సంకేతం ఇస్తుందని, అది చూసిన తరువాతే తాను వర్షం పడుతుందని ముందుగా చెప్పగలిగాననీ  వివరణ ఇచ్చుకున్నాడు. దానితో రాజుగారు ఇంకెంతమాత్రం ఆలోచించకుండా వర్షం పడదని చెప్పిన అధికారి  కుర్చీలో ఆ గాడిదనే కూర్చోబెట్టాలని మరో ఆర్డరు వేసాడు.
నిజమే!  ఇదంతా పరమ పాతకదే. కొత్త మలుపు  ఏమిటంటే:


అప్పటినుంచి గాడిదలు అధికారులుగా పనిచేసే కొత్త సంప్రదాయం మొదలయింది.



NOTE: Courtesy Image Owner

5, ఆగస్టు 2015, బుధవారం

బ్రేకింగ్ న్యూస్!


గమనిక: "వంశీ వంశీ పోస్ట్ చేసిన ఆంగ్లగల్పిక ఆధారంగా"


రిపోర్టర్: "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. మీరు ఏ పండుని ఇష్టపడతారు?"
నరేంద్ర మోడీ : "ఆపిల్ పండు"
రిపోర్టర్: ఇప్పుడే అందిన వార్త! "ఆపిల్ పండు మినహా ప్రధాని మోడీగారికి మామిడిపళ్ళు ఇష్టం లేదు. అరటి పండును  అస్సలు ఇష్టపడరు. మోడీ అభిప్రాయం గురించి వివిధ పార్టీల నాయకులను కదిలించినప్పుడు వారు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం :
మనీష్ తివారి: "ఆపిల్ పండు మోడీ గారు ఇష్టపడడంలో విచిత్రం లేదు. ఆపిల్ పండు రంగు ఎరుపు. ఆయనకి  ఎర్రటి రక్తపుటేర్లు పారించడం కూడా ఇష్టమే"
అహమ్మద్ పటేల్ : "ఆశ్చర్యం ఏముంది. పచ్చటి పండు ఇష్టం లేదు అంటే అర్ధం ఏమిటి? ఆయనకు ముస్లిం లు అంటే పడదు. అందుకే ఎర్రటి ఆపిల్ ఇష్టం అంటున్నారు"
ఆర్నాబ్ గోస్వామి: "మోడీ గారికి ఆపిల్ పండు ఇష్టం అయితే కావచ్చు. కానీ మిగిలిన పండ్లకంటే ఆయనకు ఆపిల్ యెందుకు ఇష్టమో జాతికి సమాధానం చెప్పుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయన భుజస్కంధాలపై వుంది. ఈ విషయంలో ఆయన తన బాధ్యత నుంచి ఎంతమాత్రం తప్పించుకోలేరు"
సోనియా గాంధి : 'ఓ పక్క తాను పేద ప్రజల పక్షపాతినని చెప్పుకుంటూ, మరో పక్క అత్యంత ఖరీదైన ఆపిల్ పండ్లని యెలా కొనగలుగుతున్నారో, ఆ డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయో మోడీజీ బయట పెట్టాలి"
ఏచూరి: "ఆపిల్ ఇష్టం అని అంటున్నారంటే మోడీ ఖచ్చితంగా ఆపిల్ వంటి బహుళ జాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలం. పేద ప్రజలకు పచ్చి వ్యతిరేకం"
కేజ్రీవాల్: "సాధారణంగా మామూలు మనుషులు మామిడి పండ్లను ఇష్టపడతారు. సాంప్రదాయ విరుద్ధంగా ఆపిల్ పండు ఇష్టపడే మోడీ, ఆమ్ ఆద్మీకి పూర్తిగా వ్యతిరేకం అని వేరే చెప్పాలా?"
సగటు పౌరుడు: "ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి"

NOTE: Courtesy Image Owner