25, జులై 2015, శనివారం

మళ్ళీ మొదలయిన పాదయాత్రలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 26-07-2015, SUNDAY)

సాధారణంగా రాజకీయ నాయకులు పాద యాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా దాని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా దాగేవుంటుంది. అయితే, చేసేది రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది.


కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాద యాత్ర చేసి తిరిగి చక్కాపోయారు. నడిచింది పది కిలోమీటర్లు మాత్రమే కానీ రాజకీయంగా చతికిల పడివున్న  తన పార్టీకి ఓ మేరకు జవసత్వాలను అందించిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం నిజానికి కాంగ్రెస్ పార్టీకి  సీమాంధ్ర ప్రాంతంలో నూకలు చెల్లిపోయాయనే అంతా అనుకున్నారు. నిరుడు అసెంబ్లీకి, లోక సభకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని నిట్ట నిలువునా మట్టి కరిపించారు. విభజన నిర్ణయంలో అన్ని పార్టీలకి ఎంతో కొంత పాత్ర వున్నప్పటికీ సీమాంధ్ర ఓటర్లు మాత్రం ఒక్క కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా పెట్టుకుని దాన్ని  ఘోరాతిఘోరంగా ఓడించారు. ఇది ఆ పార్టీకి నిజంగా మింగుడు పడని విషయం. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ అని పేరున్న కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం వచ్చిన దాదిగా ఇంతటి స్థాయిలో ఘోర పరాజయం ఎన్నడూ దాపురించలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఇక ఆ పార్టీకి సీమాంధ్రలో పుట్టగతులు వుండవని ఆ పార్టీవారే బలంగా నమ్మే స్తితి ఏర్పడింది. కొంత కాలం  క్రితం తెలంగాణా రాష్ట్రంలో పర్యటించి వెళ్ళిన రాహుల్ గాంధీ, అదే సమయంలో సీమాంధ్ర పర్యటనను దానితో  జత చేసుకోవడానికి సంకోచించాల్సిసిన పరిస్తితి ఏర్పడిందంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ దీనస్తితి అర్ధం చేసుకోవచ్చు. మరి రాష్ట్ర విభజన జరిగి ఏడాది తిరగగానే ఆ విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ  అదే ప్రాంతంలో ఒకరోజు పాదయాత్ర చేసి వెళ్ళగలిగారంటే, అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఏమైనా మెరుగు పడిందా అంటే అదీ లేదు. అంటే ఏమిటి? అలా తిరగగలిగిన పరిస్తితి విపక్ష నేతకు కల్పించింది అక్కడి పాలక పక్షమే. అందుకే  రాహుల్ పర్యటనలో ఆయన చేసిన ప్రసంగాలపై తెలుగుదేశం అధినేత స్వయంగా కల్పించుకుని వ్యాఖ్యానాలు చేయాల్సిన పరిస్తితి ఆ పార్టీకి ఏర్పడింది. ఈసారి రాహుల్ తన పర్యటనకు రైతుల ఆత్మహత్యలను కీలక అంశంగా తీసుకున్నారు. రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యల పాపం పూర్తిగా తెలుగుదేశానిదే అని సూత్రీకరించారు. నిజానికి రైతుల ఆత్మహత్యలకు ఏఒక్క ప్రభుత్వాన్నో కారణంగా చూపించడం సమంజసం కాదు. ప్రభుత్వాలు ఏ పార్టీకి చెందినా అవి తీసుకునే నిర్ణయాలు లేదా వాటి ఆలోచనలు దీర్ఘ కాలంలో ఇటువంటి పర్యవసానాలకు, పరిణామాలకు  కారణం అవుతాయి. అంటే, రైతన్నల ఉసురు తీయడంలో అన్ని  పార్టీలకి ఎంతో కొంత పాత్ర వుండే తీరుతుంది. కానీ ఈ రోజుల్లో రాజకీయాల రంగూ రుచీ వేరు. అధికారంలో లేనప్పుడు చెప్పే మాటలు వేరు. చేసే ఆరోపణలు వేరు. అదే పార్టీ అధికారంలోకి రాగానే అదే అంశంపై మాట్లాడే మాటలు వేరు, చేసే ప్రత్యారోపణలు వేరు. అధికారానికి రాకముందు రైతే వారికి  దేముడు. రైతులకు ఏంచేసినా తక్కువే అనే రీతిలో నాయకుల ప్రసంగాలు సాగుతాయి. 'మీకు నేనున్నా' అనే భరోసాలకు కొదవే వుండదు. అదే అధికారపీఠం ఎక్కగానే మాటలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం కనిపించదు. అన్నీ ఆ తానులో ముక్కలే.   ఇందుకు చరిత్ర పుటలను గాలించాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఏన్నర్ధం క్రితమో అంతకు కాస్త ముందో ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి తనకున్న అనేక రాజకీయ రికార్డులకు మరోటి జోడించారు. ఇటీవలి సంగతే కనుక చాలామందికి ఇది గుర్తు వుండి వుండవచ్చు. కానీ ఆయన అంతకు ముందు ముప్పయి అయిదు సంవత్సరాలకు పూర్వం జరిపిన పాదయాత్ర గురించి తెలిసిన వారు తక్కువ. నిజానికి అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే పేరున్న రాజకీయ నాయకుడు ఒకడున్నాడని తెలిసిన వారే తక్కువ.             

అప్పట్లో స్థానికులకు సయితం అంతగా  పరిచయం లేని చంద్రబాబు నాయుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించారు. గడప గడప తొక్కారు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించారు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించారు. ప్రతి వూరిలో ఆగి ఆ ఊరి సమస్యలను అడిగి అడిగి  తెలుసుకున్నారు.
రచ్చబండ్లమీద,  ఇళ్ళ అరుగుల మీద  సేద తీరారు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల వద్దే అడ్డంకులు ఎదురయినా  మడమ తిప్పలేదు. ఓ జత దుస్తులు, కాలికి చెప్పులు, తోడుగా కొందరు యువకులు. అంతే! ఇంతకు  మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా  కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ దిరిగారు. రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని   ఎన్నికల్లో గెలిచారు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు.



ప్పటికింకా  నిండా  మూడుపదులు నిండని ఆ యువకుడే మళ్ళీ నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు పూర్వం  ఆరుపదులు పైబడిన  వయస్సులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పునర్వైభవం కోసం తిరిగి కాలినడకనే మార్గంగా  ఎంచుకున్నారు.. వస్తున్నా మీకోసంఅంటూ సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నారు. కాకపొతే, అప్పటికీ ఇప్పటికీ ఎన్నో తేడాలు కొట్టవచ్చినట్టు కానవస్తాయి. అప్పుడు జత దుస్తులు, చెప్పులతో, వేళ్ళమీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో  కార్యకర్తలను వెంటేసుకుని,  మందీ మార్భలం, హంగూ ఆర్భాటం  లేకుండా తిరిగిన చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో జరిపిన  పాదయాత్రలో అంతా కొత్తదనమే.   విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న డ్యూమాక్స్ స్పోర్ట్స్ షూ ధరించి, కుడియెడమల పార్టీ  నాయకులు, కార్యకర్తలు వెంట నడుస్తుండగా ,  ప్రత్యేకంగా రూపొందించి రికార్డు చేసిన పాదయాత్రా గీతాలు హోరెత్తిస్తుండగా, ‘రాజువెడలె రవితేజములడరగ’  అన్నట్టు పాదయాత్రకు నడుం కట్టారు. ఇప్పటి  పరిస్థితుల్లో ఇవన్నీ తప్పనిసరి ఆర్భాటాలు. పైగా తొమ్మిదేళ్ళ పైచిలుకు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. రెండు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో వోడించి సమర్ధుడైన  ముఖ్యమంత్రిగా దేశవిదేశాల్లో మన్ననలందుకున్న రాజకీయ నాయకుడు. ప్రచారం ద్వారా రాజకీయ లబ్ది పొందే విషయంలో ఆయువుపట్లన్నీ  తెలిసిన వాడు.  తెలుగుదేశం పార్టీకి  పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలలో  ఏఒక్క చిన్న అంశాన్ని కూడా విస్మరించినా అది కూడదీసుకోలేని  తప్పిదం కాగలదన్న ఎరుక గలిగిన రాజకీయ దురంధరుడు. అందుకే, ఈ యాత్రకు పేరు పెట్టడం దగ్గరనుంచి, యాత్రసాగే మార్గం నిర్ణయించే వరకు ఆయన  అనేక రోజులపాటు సహచరులతో మంతనాలు జరిపారు. పార్టీకి  చెందని వృత్తి  నిపుణులను  కూడా విశ్వాసంలోకి తీసుకుని, యాత్ర సందర్భంగా చేసే ప్రసంగాలు, ప్రజలను ఆకట్టుకునే హావభావాలు మొదలయిన అంశాల్లో  కూడా గట్టి కసరత్తు చేసారని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. సుదీర్ఘ  పాదయాత్రల్లో  ఎదురయ్యే సాధకబాధకాలు, శారీరక ఇబ్బందులు  అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పిమ్మటనే ఆయన ఈ సాహస నిర్ణయం తీసుకున్నారు. పార్టీ  ఎదుర్కుంటున్న క్లిష్ట పరిస్తితిని దృష్టిలో వుంచుకుని ఆలోచిస్తే,  తెలుగు దేశాన్ని  వొడ్డున పడేయడానికి ఇంతకంటే మరో దారి కనిపించని స్తితిలోనే,   ఆయన ఇంతటి ధైర్యం చేశారని అనుకోవాలి. నాటి  ఉప ఎన్నికల్లో వరస పరాజయాలు, కట్టుతప్పుతున్న పార్టీ శ్రేణులు, నాయకత్వ పటిమపట్ల  తలెత్తుతున్న సందేహాలు, ప్రాంతాల పరంగా  నాయకుల్లో  రగులుతున్న విద్వేషాలు, రాజకీయ వారసత్వం గురించి కుటుంబ సభ్యుల్లో పొటమరిస్తున్న విభేదాలు ఇలా వొకటి కాదు రెండు కాదు అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు పాదయాత్రకు మించిన ప్రత్యామ్నాయం  కనిపించకనే అలవికి మించిన ఈ భారాన్ని తలకెత్తుకోవాల్సివచ్చింది.
ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర అంత తేలికయిన విషయమేమీ  కాదు. శారీరక శ్రమతో పాటు ఎన్నో  వ్యయ ప్రయాసలు ఇందులో ఇమిడి వున్నాయి. ఒక రోజు యాత్రకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. షష్టిపూర్తి దాటిన  వయస్సులో ఇంతంత దూరాలు నడవడం ఆషామాషీ కాదు. కాకపొతే, వ్యక్తిగత క్రమశిక్షణకు, దినవారీ వ్యాయామాలకు, యోగాభ్యాసాలకు   మారుపేరు చంద్రబాబు అన్న పేరు తెచ్చుకున్న మనిషి కాబట్టి  కాలి నడకలో ఎదురయ్యే శారీరక శ్రమను ఆయన కొంత మేర అధిగమించి  తన గురుతర లక్ష్యాన్ని సాధించడమే కాకుండా అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆరోజుల్లో ఇది సాధ్యం అని ఎవరయినా అన్నా ఎవరూ నమ్మలేని పరిస్తితి.


అంతకుముందు దశాబ్దం క్రితం  వై ఎస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్ర, దానితో సాధించిన విజయం  రాజకీయ నాయకులను  పాదయాత్రలకు పురికొల్పేలా చేసాయి. ఆ యాత్ర చేసిన రాజశేఖర రెడ్డి, అంతకు ముందు రెండు మార్లు ప్రయత్నించి అందుకోలేని ఎన్నికల విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాదయాత్రలకు కొంత సెంటిమెంటు రంగు కూడా అంటుకుంది.  
ఈ పాదయాత్రల  వల్ల రాజకీయ పార్టీలకు  వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమీ వుండకపోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక  ఎన్నికలకు ఇంకా బోలెడు వ్యవధానం వుంది. అయితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలాంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి. తమ నడుమ  వుండేవారికే జనం ఈ నడుమ పట్టం కడుతున్నారు. ఏసీ  గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారు. కాపపోతే, యాత్ర సందర్భంలో ప్రజల సమస్యలు ప్రస్తావనకు తెచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వుండాల్సి వస్తుంది. అంతకు ముందు అధికారంలో వున్నప్పుడు  ఏం చేసారన్న ప్రశ్న సహజంగా జనం నుంచి ఎదురయ్యే అవకాశం వుంటుంది.
ప్రజల ఇబ్బందులను, కడగండ్లను కళ్ళారా చూడగలిగే అవకాశం ఈ పాద యాత్రల  వల్ల రాజకీయ నాయకులకు లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా పరిష్కరించ గలిగితే  యాత్రా ఫలసిద్ధి కూడా  ప్రాప్తిస్తుంది. 
2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ప్రజా ప్రస్తానంపాదయాత్ర  రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది.  చంద్రబాబు  ‘వస్తున్నా ..మీకోసంపాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్  నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340  కిలోమీటర్లు సాగి  శ్ర్రీకాకుళంజిల్లా ఇచ్చాపురంలోనే ముగిసింది. మనోవాంఛాఫలసిధ్యర్ధం ఈ ఇద్దరు నాయకులు తమ తమ యాత్రలకు తుది మజిలీగా ఇచ్చాపురాన్ని ఎంపిక చేసుకున్నారేమో అనిపిస్తుంది. వారు తలపోసినట్టుగానే ఇద్దరికీ కోరిక నెరవేరింది. దానితో రాజకీయ నాయకుల్లో పాదయాత్రల సెంటిమెంటు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఏదయితేనేం, ఏ పేరుతొ అయితేనేం నాయకులు ఏసీ గదులు ఒదిలి కొద్ది కాలం అయినా ప్రజలతో మమేకం అయ్యే వీలు ఏర్పడింది. రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి. (25-07-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE : Courtesy Image Owner   


24, జులై 2015, శుక్రవారం

పాత బంగారు లోకం (నిజంగా పాతదే)

పొద్దున్నే పెడితే టీవీ లేదు. కరెంటు వుంది. ఈ కేబుల్ వాడికి చెప్పాలి. సెట్ అప్ బాక్స్ గుడ్డూ అంటూ వేలకువేలు పట్టుకుపోయాడు కాని టీవీ ఎప్పుడూ అంతే. ఇరవై నాలుగ్గంటలు వెధవ చాకిరీ వెధవ చాకిరీ అనుకుంటున్నదేమో తెలియదు. ఒక ఛానల్  వస్తే ఇంకో ఛానల్ గుర్రు బర్రు. పిక్చర్  ట్యూబ్ పగిలిపోతున్నట్టు ఒకటే చప్పుళ్ళు. డిజిటల్ క్వాలిటీ ప్రసారాలు అంటూ చేసిన ప్రచారాలు అంతటితోనే  సరి. ఎవడో ఈ బాక్సులు తయారుచేసేవాడు బాగుపడివుంటాడు. డిజిటల్ సంగతి సరే వెనకే బాగావుండేదని అంతా అనేవారే  కాని అడిగేవాడు లేడు. అదే సర్కారు ధైర్యం.
టీవీ లేకపోతే పోయింది. ఈ సెల్ ఫోనుకేమొచ్చింది. వూరికే చెవికోసిన మేకలా అరుస్తుండేది. ఇవ్వాళ ఏమిటి ఇలా మూగనోము పట్టింది. చార్జ్  అయిపోయిందా అంటే అదీ లేదు. ఏవైందబ్బా!
సెల్ ఫోను సరే అసలు నాకేమైంది. చుట్టూ ప్రపంచం చిత్రంగా మారిపోతోంది. రేడియోలో వెంకటేశ్వర సుప్రభాతం కమ్మగా వినబడుతోంది. హాల్లో ఓ మూల బల్లపై, వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ లాగా ఇన్నాళ్ళు మౌనంగా   పడున్న లాండ్ లైన్ ఫోను గణ గణా మోగుతోంది. వరండాలోకి వెళ్ళి చూస్తే అందరి ఇళ్ళ పైకప్పుల మీద దొండ పాదుల పందిళ్ళ మాదిరిగా దూరదర్శన్ యాంటీనాలు దర్శనమిచ్చాయి. వెళ్ళి  టీవీ పెడితే,  పాలూ చేలూ పెరుగూ పేడా గురించి ఎవరో  చెబితే ‘మా స్టుడియోకి వచ్చి ఎన్నో మంచి విషయాలు చెప్పారం’టూ యాంఖరమ్మ వయ్యారాలు పోతూ అంటోంది.
రోజూ పొద్దున్నే ఇంటి గుమ్మం ముందు పడివుండే పేపరు మధ్యాహ్నానికి కానీ మొహం చూపించలేదు. అప్పుడు కానీ ‘ఈ చిత్రం భళారే విచిత్రం’ కారణం అర్ధం కాలేదు. అంతరిక్షంలో ఎక్కడినుంచో దారితప్పి  భూమి వైపు అమిత వేగంతో దూసుకువస్తున్న ఓ గ్రహశకలం మరోసారి దారితప్పి రోదసిలో వున్న మన సమాచార కృత్రిమ ఉపగ్రహాన్ని డీకొన్నదట. దాంతో దేశంలో సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిందట.
ఈ ‘ట’ వార్తలు ఇంకా పూర్తి కాకముందే మెలకువ వచ్చేసింది. కల చెదిరింది. అన్ని గదుల్లో టీవీలు, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు తెగ  మోగిపోతున్నాయి.
అయ్యో ఇది కలా !


కల నిజమైతే యెంత బాగుంటుంది.  
(10-11-2013)   

NOTE: Courtesy Image Owner           

20, జులై 2015, సోమవారం

సలహాలు వింటే ఇంతే!

ఒకడు ఇల్లు కట్టుకుందామని అనుకున్నాడు. బుద్ధి తక్కువై ఎవర్నో సలహా అడిగాడు. మంచి సున్నం గానుగ ఆడించి దాంతో కట్టుకో, ఇల్లు చల్లగా వుంటుందన్నాడు ఆ సలహాలరాయుడు. అది విని మనవాడు సున్నం గానుగా ఏర్పాటుచేసుకుని పని మొదలు పెట్టబోయే సమయానికి దారిన పోయే దానయ్య అటుగా వచ్చి, సున్నం పని ఎప్పుడో సున్నా అయిపొయింది, ఎంచక్కా ఇటుకలతో ఇల్లు కట్టుకో అని ఓ ఉచిత సలహా పారేసి తన దారిన పోయాడు. మనవాడు, సున్నం గానుగ పక్కన బెట్టి ఇటుకలు పోగేసాడు. మరో దానయ్య వచ్చి ఇటుకల ఇళ్లు బీసీ కాలం నాటివి, చక్కగా కాంక్రీటు దిమ్మెలు వేసి కట్టుకో నాలుగు కాలాల పాటు మన్నుతుంది అని చెప్పాడు. మన వాడు ఇటుకలు ఆటక ఎక్కించి కాంక్రీటు వేటలో పడ్డాడు. చివరికి ఇల్లు కట్టాలన్న కోరిక కలగానే మిగిలి పోయింది. నీతి : పనిమంతుడు సలహాలు వినాలి కాని పాటించ రాదు.


(COURTESY IMAGE OWNER)

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అన్నారు మనసు కవి ఆత్రేయ.
నిజమే, పుష్కర స్నానం కోసం వచ్చి నిండు ప్రాణాలు బలి ఇచ్చి వెళ్లారు. పుష్కర పుణ్యం సంగతి యేమో కానీ వారి పుణ్యమా అని మొద్దు నిద్దర పోతున్న ప్రభుత్వాలు నిద్రలేచాయి. జనాలు రావడం గురించే తాపత్రయ పడి ప్రచారం చేసుకున్న నేతలు, ఏర్పాట్లు అంటే ఘాట్లు, లైట్లు అనుకుని 'క్రౌడ్ మేనేజ్ మెంటు' గాలికి ఒదిలేసిన అధికారులు, మొదటి రోజు దుర్ఘటనతో మేలుకుని తమ పని తీరు మార్చుకోబట్టే మిగిలిన పుష్కర దినాలు ప్రశాంతంగా సాగిపోతున్నాయి.
వాళ్లు చనిపోయి ఇతరులని బతికిస్తున్నారు. ఆ పోయినోళ్ళు మంచోళ్ళే కాదు ధన్య జీవులు, పుణ్య జీవులు.
వారికి మరోసారి హాట్స్ ఆఫ్.


19, జులై 2015, ఆదివారం

అదిగో నవలోకం


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 23-07-2015, THURSDAY)

ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని 'అమరావతి' రూపురేఖలు గురించి సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన 'సీడ్ క్యాపిటల్' ప్రణాళిక  రాష్ట్ర ప్రభుత్వానికి  అందింది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నాయకత్వంలో హైదరాబాదు వచ్చిన అధికారుల బృందం, ప్రత్యేక విమానంలో రాజమండ్రి  వెళ్ళి,  గోదావరి పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం గత కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసివున్న  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుని ఈ ప్రణాళికను  అందచేసింది. అంతకుముందే 'సీడ్ క్యాపిటల్' గురించిన  ఊహా చిత్రాలను కొన్నింటిని  ఆ రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు విడుదలచేసింది. ఇటువంటి అద్భుతమైన  రాజధానిని సొంతం చేసుకోబోతున్న ఆ రాష్ట్ర ప్రజలు ఎంతటి అదృష్టవంతులో కదా అని ఇతరులకు కన్నుకుట్టే  రీతిలో ఊహలకు రూపకల్పన చేశారు. ఈ ఊహల్ని వాస్తవం చేయగలిగితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లోనే కాకుండా చరిత్ర పుటల్లో కూడా  శాశ్వితంగా మిగిలిపోతారు. రాజధానిని నిర్మించగలగడం అనే  అపూర్వ సువర్ణావకాశం ఒక్క  చంద్రబాబుకే  లభించింది. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదన్న సంగతి గమనార్హం. ఈ రకంగా చూస్తే, ఈ కలని నిజం చేయగలిగితే  ప్రజలే కాదు ఆయన కూడా అదృష్టవంతుడే.   
'కలలు కనండి. ఆ కనే కలలు కూడా  గొప్పగా కనండి. కన్న  ఆ గొప్ప కలల్ని నిజం చేసుకోండి' అంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  యువతీ యువకులకు సలహా ఇస్తుండడం అందరికీ తెలిసిందే.  ఈ ఊహా చిత్రాలు చూసిన వారికి చంద్రబాబు కూడా కలాం గారు చెప్పినట్టే గొప్ప కలలే కంటున్నారు అనిపిస్తుంది.  కాకపోతే వాటిని వాస్తవం చేసి చూపడం అన్న బాధ్యత ఒక్కటే ఆయన భుజ స్కంధాల మీద మిగిలివుంది. మరో రకంగా కూడా ఆయన అదృష్టవంతుడు.  ఆయన సమర్ధత మీద ఆయనకు వున్న నమ్మకాన్ని మించి ఆయన అభిమానులు మరింత నమ్మకం పెంచుకున్నారు. ఆయన ఒక్కరే రాజధాని నిర్మాణం పూర్తిచేయగలరన్న విశ్వాసంతో వున్నారు. ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో ఈ విషయం ప్రస్పుటంగా కానవస్తుంది.   
ఈ ఊహా చిత్రాలతో పాటు విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం భవిష్యత్తులో నిర్మించబోయే ఆంధ్ర రాజధాని నగరం ఇలా వుంటుంది.




"కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లా పరిధిలో ప్రధాన రాజధాని నగర నిర్మాణం జరుగుతుంది. దీని విస్తీర్ణం సుమారు పదిహేడు చదరపు కిలోమీటర్లు. (ఇది మరికొంత పెరిగిందని తాజా సమాచారం వల్ల తెలుస్తోంది) ఇందులో కొంత భాగంలో ప్రధానమైన ప్రభుత్వ పరిపాలనా భవన సముదాయాలు వుంటాయి. మిగిలిన ప్రదేశంలో ఐటీ సంబంధిత కార్యాలయాలు, కార్పోరేట్ సంస్థల ఆఫీసులు ఏర్పాటు అవుతాయి. రాజధాని నగరంలోని ప్రధాన రహదారులకు సమాంతరంగా కాలువలు  నిర్మిస్తారు. కృష్ణా నది నుంచి ఇందుకోసం నీటిని వాటిలోకి మళ్లిస్తారు. ఈ నీళ్ళు మళ్ళీ వెళ్ళి మరో వైపు కృష్ణా నదిలోనే కలుస్తాయి. కాలువలు, రహదారులకు ఇరువైపులా ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తారు. భవన పరిసరాలను మాత్రమే కాకుండా వాటిపైన కూడా ఆకు పచ్చని తివాచీ పరిచినట్టు పచ్చదనం తొణికిసలాడేలా పధకాలు సిద్ధం చేశారు. విహంగ వీక్షణం చేసేవారికి పైనుంచి కిందికి చూస్తే యావత్తు రాజధానీ  నగరం హరితవనం మాదిరిగా కానవస్తుంది. భవిష్యత్తులో సయితం భవననిర్మాణాలు, ఇతర నిర్మాణాలు     ప్రణాళికాబద్ధంగా  జరిగేందుకోసం మొత్తం ప్రధాన రాజధాని ప్రాంతాన్ని సెక్టార్లుగా విభజిస్తారు. ఆరు వరసల రహదారులు, వాటి పక్కనే నడక దారులు,  సర్వీసు రోడ్లు వుంటాయి. నగరం మధ్య నుంచి మెట్రో రైలు నిర్మాణం జరిగేలా రూపకల్పన చేశారు. మెట్రో స్టేషన్లు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా వుంటాయి.  రాజధాని నగరం మధ్యలో స్వచ్చమైన నీరు పారే కాలువలు, అక్కడక్కడా జలాశయాలు, వాటిని దాటి వెళ్ళడానికి వీలుగా ఊయల వంతెనలు ఓహ్! అమరావతి అంటే 'దేవతల  నగరం' అన్న పేరు సార్ధకం అయ్యేలా అనేక సుందర నిర్మాణాలకు ఈ కొత్త రాజధాని ఆవాసం కాబోతోంది. కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై ఎత్తయిన వంతెన నిర్మాణం  కూడా ఈ పధకంలో భాగం. ఇంతేనా అంటే ఇంకా చాలా వుంది. ఈ సీడ్ క్యాపిటల్ కు అభిముఖంగా గుంటూరు జిల్లా వైపు నది మధ్యలో ఒక  ద్వీపాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తారు. ఈ మొత్తం ప్రణాళికను రూపొందించింది సింగపూరు ప్రభుత్వం కాబట్టి ఆ దేశపు పొరుగున వున్న మలేసియాలోని జంట టవర్లను పోలిన రెండు ఎత్తయిన ఆకాశహర్మ్యాలు కూడా నూతన రాజధానికి అంతర్జాతీయ సొగసులను అద్దబోతున్నాయి."           
భారీగా నిర్మించిన సినిమాలను  విడుదల చేసే  ముందు 'టీజర్' పేరుతొ లఘు చిత్ర ప్రకటనలు  టీవీల్లో చూపించడం ఈరోజుల్లో అలవాటు. ఈ ఊహా చిత్రాలు చూస్తుంటే ఆ  విధానాన్ని  ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు కూడా వర్తింపచేస్తున్నారేమో అనిపించేలా వున్నాయి.
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ఆస్థానంలో పనిచేసే గురువు, ఆయన శిష్యులు కలిసి నిమిషాల్లో ఓ మాయానగర్ నిర్మిస్తారు. ఆరోజుల్లో ప్రేక్షకులకు  ఆ దృశ్యాలు పరమాద్భుతంగా తోచాయి. ఇప్పుడీ ఊహా చిత్రాలు టీవీల్లో చూసిన వారికి అవి స్పురణకు వస్తే తప్పు ఎంచడానికి లేదు. అంత గొప్పగా వున్నాయి. అంతే కాదు  వీటిని నిజం చేయడం మానవ మాత్రుడుకి సాధ్యమా అనిపించేలా అపూర్వంగా అపురూపంగా వున్నాయి.
తెలుగుదేశం పార్టీ  అభిమానులనే కాదు, ప్రజలందరినీ అలరించేలా వున్నాయి ఈ ఊహా చిత్రాలు. ముందే చెప్పినట్టు ఈ విధంగా కాకపోయినా ఇందులో కొంతయినా నిజం చేస్తూ రాజధాని నిర్మాణం త్వరలో పూర్తి చేయగలిగితే 'ఆంధ్రులు యెంత అదృష్ట వంతులు' అని దేశవిదేశాల్లో గొప్పగా చెప్పుకోవడం ఖాయం. సమర్ధుడయిన ముఖ్యమంత్రి అన్న పేరు ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబుకు, అమరావతి  రాజధాని నిర్మాణం సకాలంలో పూర్తిచేయగలిగితే ఆయనకు అంతకన్నా గొప్ప కీర్తి మరొకటి వుండదు.
కానీ, ఇది సామాన్యమైన వ్యవహారం కాదు. ప్రతిదీ డబ్బుతో ముడిపడి వుంటుంది. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంతో చూస్తారు. ప్రతి స్వల్ప విషయాన్ని భూతద్దంతో శోధిస్తారు. ప్రతిపక్షాల సంగతి సరే సరి. కాలం గడిచే కొద్దీ వీలును బట్టి  పుట్టుకొచ్చే 'విభీషణుల'తోనే అసలు చిక్కు.  పడగ నీడల్లో కొత్త రాజధాని నిర్మాణం సాగాల్సి వుంటుంది. నిజానికి ఇదంతా కత్తి మీద సాము.
సమర్ధుడన్న ఒక్క పేరు మినహా రాజధాని నిర్మాణంలో చంద్రబాబుకు కలిసి వచ్చే అంశాలు అంతగా లేవు. రాష్ట్ర ఖజానా బోసిపోయి వుంది. రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చిందేమీ లేదు. ఇలాటి భారీ ఆలోచనలు సకాలంలో ఆచరణలోకి రావాలంటే ప్రధానంగా కావాల్సింది  కేంద్ర సాయం . కేంద్రంలో అధికారంలో  వున్నది టీడీపీ  మిత్ర పక్షమే అయినప్పటికీ, గత ఏడాది అనుభవాల నేపధ్యంలో  ఆ దిక్కుగా చూస్తే అంతగా కలిసివచ్చే అవకాశాలు కానరావడం లేదు. అధవా ఏదయినా చేసినా ఆ అరకొర సాయం ఇంతటి  భారీ ప్రణాళికలకు అక్కరకు రాకపోవచ్చు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుడికి రాజధాని విషయంలో సలహా ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చింది. సింగపూరుతో పాటు ఈ మధ్య ఆయన పర్యటించి వచ్చిన కజకిస్తాన్, కీర్గిస్తాన్,  తుర్కుమిస్తాన్ మొదలయిన దేశాల రాజధానీ నగరాలను కూడా పరిశీలించడం మంచిదని ప్రధాని తనకు సూచించినట్టు చంద్రబాబే స్వయంగా తమ పార్టీ ఎంపీ లతో చెప్పినట్టు ఆ వార్త సారాంశం. పైగా  ప్రధాని సలహా మేరకు ఆ నగరాల పర్యటనకు ఏర్పాట్లు చేయాల్సిందని ఆదేశించినట్టు ఆ వార్త తెలుపుతోంది.
ఇప్పటికే అమరావతి రాజధాని విషయంలో అనేక విదేశాల పేర్లు వినబడుతూ వస్తున్నాయి. ఇప్పుడు అదనంగా మరికొన్ని దేశాలు అంటే,  మరికొంత కాలయాపన తప్పనిసరి అవుతుంది. అమరావతి అని పేరు పెట్టి తెలుగుతనం లేని మరో విదేశీ నగరాన్ని నిర్మించ బోతున్నారని ఇప్పటికే కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.   
ప్రభుత్వం చెబుతున్నట్టు  రాజధాని నిర్మాణం కోసం సమీకరణ పేరుతొ ప్రజలనుంచి సేకరించిన కొన్ని వేల  ఎకరాల  భూమి సిద్ధంగా వుంది. ఆ విషయంలో తలెత్తిన  రాజకీయ వివాదాలు యెలా వున్నా చివరికి ప్రభుత్వాల మాటే చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక కావాల్సింది నిధులు. ఇక్కడే అసలు చిక్కు ఎదురవుతుంది.
గారెలు వండాలంటే నూనె, మూకుడు, పిండి వంటి సంబారాలు అనేకం కావాలి. గారెకు చిల్లి పెట్టడానికి 'వేలు' తప్ప వేరే ఏమీ లేదన్న చందంగా 'చంద్రబాబు సమర్ధత' తప్ప రాజధాని నిర్మాణానికి అవసరమైనవి ఏమీ ఆయనకు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది వాస్తవం. ఇన్నిన్ని నిర్మాణాలు ఇంత అధునాతనంగా రూపుదిద్దుకోవాలంటే ఆషామాషీ  విషయం కాదు.
రాజమండ్రిలో ముఖ్యమంత్రిని కలవడానికి సింగపూరు బృందం వచ్చిన సందర్భంలో రాష్ట్ర సమాచార సలహాదారుడు పరకాల ప్రభాకర్ ఈ విషయంలో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్టోబరు నెలలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముందుగానే 'మాస్టర్ డెవలపర్' ని ప్రభుత్వం ఎంపిక చేస్తుందని చప్పారు. జపాన్ తో సహా కొన్ని దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. దీనిని బట్టి రాజధాని నిర్మాణం డెవలపర్ల చేతిలో వుంటుందని అర్ధం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత భూమి చూపించడం వరకు పరిమితం కావచ్చు. ప్రభుత్వానికి నిధుల భారం తగ్గిపోవచ్చు. స్విస్  ఛాలెంజ్ పద్ధతిలో అయితే రూపాయి ఖర్చు కూడా లేకపోవచ్చు. కానీ, ప్రజలనుంచి  సేకరించిన భూమిని మాస్టర్ డెవలపర్ చేతిలో పెట్టడం వల్ల  కొత్త వివాదాలు ఉత్పన్నం కావచ్చు. అందుకే కీడెంచి, అన్ని అంశాలను  అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా, వివాద రహితంగా చేయడం మంచిది. నిధుల లేమి కారణంగానే ప్రభుత్వం, ఇప్పటికే 'రియల్ ఎస్టేట్' రంగంలో చలామణిలో వున్న 'డెవలప్ మెంటు'  విధానాన్ని 'స్విస్ ఛాలంజ్' అనే కొత్త పేరుతొ  ఎంచుకుని వుండవచ్చు. కానీ అవతల నిర్మాణ భాగస్వామి 'విదేశీ సంస్థ' అయినప్పుడు మరిన్ని జాగ్రత్తలు అవసరం.        
ప్రభుత్వం ఇవ్వచూపే భూమికి ఆకర్షితులై రాజధాని నిర్మాణానికి పెట్టుబళ్ళు పెట్టేవాళ్లు గొంతెమ్మ కోర్కెలు కోరడం సహజం. నిజంగానే చంద్రబాబు  నిజాయితీగా    ప్రయత్నాలు చేసినా సరే, ఈనాటి రాజకీయాల వరస చూస్తుంటే,   నిప్పులేకుండానే  పొగ రాజుకోవడం అంతే  సహజం. రాజకీయాల్లో కాకలు తీరిన చంద్రబాబుకు ఈ విషయం తెలియదనుకోలేము. అయినా సరే ఆయన ముందడుగు వేసే ధోరణిలోనే ముందుకు సాగుతున్నారు. అన్ని సందేహాలకు   ప్రభుత్వం దగ్గర, ఆయన దగ్గర  సమాధానాలు వుండి వుండవచ్చు. కానీ  సంతృప్తి కరమైన వివరణ మాత్రం ఇంతవరకు బయటకు రాని  మాట కూడా నిజమే. ఈ లావాదేవీల్లో ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని వ్యవహారాలు చక్కబెట్టి వుంటే అనవసరమైన రాద్ధాంతాలు కొన్ని తప్పేవి అన్న వాదన వుంది. అలా చేసివుంటే  భవిష్యత్తులో ఎదురయ్యే మంచి చెడులకు చంద్రబాబును ఒక్కరినే బాధ్యులను చేసే పరిస్తితి ఉత్పన్నం అవ్వదు కూడా.   
రాజధాని లేకుండా వేరు పడిన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చక్కని, భేషయిన రాజధాని నిర్మిస్తానని అంటుంటే అభ్యంతర పెట్టడం, విమర్శలు చేయడం  కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఇలాటి ప్రయత్నాలను  మనఃస్పూర్తిగా స్వాగతించాలి. అయితే ముఖ్యమంత్రి కూడా, రాజధాని యెలా వుంటుందో ప్రజలకు ముందుగానే  చూపెట్టినట్టే, వారిని విశ్వాసంలోకి తీసుకుని ఆ  రాజధాని నిర్మాణం యెలా జరుగుతుందో వెల్లడిస్తే అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. కానిపక్షంలో,  ఇప్పుడున్న సందేహాలు ముదిరి అనుమానాలుగా మారతాయి. ఆ అనుమానాలు కాలక్రమంలో ఆరోపణలుగా రూపాంతరం చెందే అవకాశం కూడా వుంటుంది. ముఖ్య మంత్రి సమర్ధత మీద లేశ మాత్రం అనుమానం లేదని చెబుతున్నవారు కూడా ఈ మొత్తం వ్యవహారంలో తమకు ఎలాటి అనుమానాలు లేవని  గట్టిగా చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన సలహాదారులు ఈ విషయం గమనంలో పెట్టుకోవాలి.
ముందే చెప్పినట్టు,  రాజధాని నిర్మాణం ఆయనకు ఒక్కరికే సాధ్యం అని నమ్మే వాళ్లకు ఈరోజుల్లో  కొదవ లేదు.ఈ రకంగా ఆయన అదృష్టవంతులు.   హైదరాబాదులో ఆయన హయాములో నిర్మితమైన హై టెక్ సిటీ గురించి ఇప్పటికీ జనాలు గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. ఇంత నమ్మకం ప్రజల్లో  వున్నప్పుడు మరింత పారదర్శకంగా వ్యవహరిస్తే ఆయనకే మేలు జరుగుతుంది.          
రాజధాని అమరావతి ఊహా చిత్రాలు, ఇవన్నీ  ఉత్తుత్తి ప్రచారార్భాటం కింద ప్రత్యర్ధులు కొట్టివేస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపించడంలో చంద్రబాబుకు  సాటి రాగలవారు లేరని చెప్పడానికి కూడా ఈ ఊహా చిత్రాలను వారు ఉదహరిస్తున్నారు. ఆయన అభిమానులు సయితం అదే అంటున్నారు. సమర్ధత విషయంలో చంద్రబాబుకి ఎంతటి మంచి పేరు వుందో, ప్రచారం విషయలో ఆయనకు అంతటి బలహీనత వుందన్న విషయం రహస్యమేమీ కాదన్నది వారి ముక్తాయింపు.
రాజధాని విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎవరివి యెలా వున్నా, సామాన్య జనం అందరూ ముక్త కంఠంతో కోరుకునేది మాత్రం, వేరుపడ్డ  రాష్ట్రానికి ఏదో ఒక రాజధాని తక్షణం కావాలనే. ఇక ఆ రాజధాని చంద్రబాబు ఊహల్లో వున్న అపురూప నగరం అయితే అంతకంటే కావాల్సింది వారికి మరోటి వుండదు.    
సమర్ధుడైన వాడికి లక్ష్యం ఒక్కటే ముఖ్యం. లక్ష్యశుద్ధి వుంటే గమ్యం చేరడం సులభం కాకపోయినా అసాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణం తీరుతెన్నులు చూస్తుంటే ఇదొక్కటే సరిపోకపోవచ్చు. వచ్చే ఎన్నికలదాకా ఈ ఊహల ప్రచారం రాజకీయంగా కొంత వూపు ఇవ్వొచ్చు. సాధారణ రాజకీయ నాయకులు ఇలాగే ఆలోచిస్తారు. వారికి ఈరోజు గడిస్తే చాలు.
మరి చంద్రబాబు ఈ కేటగిరీ కిందికి రావాలని అనుకుంటున్నారా? తనదయిన తరహాలో మరో మార్గాన్ని కోరుకుంటున్నారా?
కాలమే సమాధానం చెప్పాలి.
(21-07-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595



Image Courtesy Culte.com


17, జులై 2015, శుక్రవారం

వినదగునెవ్వరు చెప్పిన.... (Hindu paper editorial on Rajahmundry tragedy)





AN AVOIDABLE TRAGEDY

"Several factors appear to have contributed to the Godavari tragedy. These include lack of proper barricading to enable pilgrims to move in single file towards the river, the failure of the authorities to guide devotees, especially those unfamiliar with the town, to more spacious ghats elsewhere, and the absence of planning for crowd management. All this indicate that even a good deal of advance preparation and elaborate security arrangements are not enough to guarantee safety at mass events unless some elementary safeguards are in place. After the Maha Kumbh Mela tragedy in 1954, Jawahar Lal Nehru asked the VIPs to stay away from such events. It was recognised  even then that the presence of VIPs puts needless pressure and strain on the administrative machinery and severely compromises optimal measures to control milling crowds. While VIPs do have a right to participate in such events, it should be ensured that their presence does not compromise the safety of the public" (17-07-2015)      

16, జులై 2015, గురువారం

'ఆకాశంలో సగం'

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 19-07-2015, SUNDAY)  

స్త్రీ జాతిని 'ఆకాశంలో సగం' అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తే వాళ్లు నేటి సమాజంలో ఎక్కువగానే కానవస్తారు. చేతల దగ్గరికి వచ్చేసరికి ఈ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోవడం కద్దు. ఈ నేపధ్యంలో ఒక వార్త కొన్ని పత్రికల్లో చాలా చిన్నగా వచ్చింది. ఆ వార్తకు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యం ఇవ్వలేదేమో, ఆ అంశానికి దొరకాల్సినంత ప్రాచుర్యం లభించలేదేమో అనిపించింది. ఆ వార్త ఏమిటంటే-
ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఫ్లిప్ కార్ట్ అనే ఒక సంస్థ యాజమాన్యం, తమ దగ్గర పనిచేసే మహిళా సిబ్బందికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఉద్యోగినులకు ఇచ్చే ప్రసూతి సెలవులను ఇరవై నాలుగు వారాలకు పెంచింది. అంటే సుమారు ఆరుమాసాలపాటు జీతంతో కూడిన సెలవు. అంతే కాదు, ప్రసూతి సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరే ఉద్యోగినులకు నాలుగు నెలలపాటు  పనివేళల్లో, వారికి వీలయిన సమయాల్లో పనిచేసుకునే  వెసులుబాటు కల్పించింది..
చట్టం ప్రకారం  ఉద్యోగినులకు ఇవ్వాల్సిన సెలవుల్ని మించి ఈ కంపెనీ తమ మహిళా సిబ్బందికి ఈ సదుపాయాలను కల్పించడం విశేషం.
సరే. షరా మామూలుగానే ఈ రాయితీలకు వక్ర భాష్యాలు వెలువడ్డాయి. తమ సంస్థలో పనిచేసేందుకు అధిక సంఖ్యలో ఆడవారిని ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ కంపెనీ ఈ నిర్ణయాలు తీసుకుందని వాటి తాత్పర్యం.
వెనుక కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న సోవియట్ యూనియన్ లో ఆడవారికి ఈ రకమైన రాయితీలు ఇవ్వడం నేను చూసాను. గర్భవతులయిన ఉద్యోగినులకు, గర్భం ధరించిన సమాచారం తెలియచేసినప్పటి నుంచి, సుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు నడిచే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా కనిపెట్టి చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు.    
నిజానికి గత రెండు దశాబ్దాల కాలంలో మనదేశంలో మహిళలు  గణనీయమైన పురోగతి సాధించడం కళ్ళారా చూస్తున్నాం. ఓ అరవై ఏళ్ళక్రితం  ఆడపిల్ల ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టడం కనాకష్టం. 'ఆడపిల్లకు చదువెందుకు, ఇంట్లో ఏవో పద్దులు రాసుకునే అక్షర జ్ఞానం వుంటే చాలు' అని పెద్దవాళ్ళు అంటూ వుండడం నాకెరుక. నూటికో కోటికో చదువుకున్న ఆడవాళ్లు కనిపిస్తే విడ్డూరంగా చూసే కాలం గడిచిపోయి ఎన్నో ఏళ్ళు కాలేదు. సైకిల్ తొక్కే ఆడపిల్లల్ని రౌడీ పిల్లలు అనేవాళ్ళు. లంగా ఓణీ కాకుండా చుడిదార్ వేసుకుంటే నోటితో కాకపోయినా  నొసటితో వెక్కిరించేవాళ్ళు.
మారడం కాల ధర్మం. అందుకే కాలం మారింది. ఇంకా మారుతోంది. మగా ఆడా తేడా చదువుల్లో లేకుండా పోయింది. కాకపొతే,  చదువుకున్న ఒక తరం ఆడవాళ్ళు, చదివిన చదువుకు సార్ధక్యం లేకుండా మళ్ళీ గృహిణులుగానే ఇంటి పనులకు పరిమితం అయిపోయారు. దానితో, 'చదువుకుని  ఏం చేస్తారు ఉద్యోగాలు చేస్తారా, వూళ్ళు ఏలాలా?' అనే కొత్త వ్యంగ్యాస్త్రాలు వ్యవహారంలోకి వచ్చాయి.
ముందే చెప్పినట్టు మారుతూ పోవడం కాల ధర్మం. తరువాతి తరం ఆడపిల్లలు మగ పిల్లలతో పోటీలు పడి చదువుల్లో రాణిస్తూ వస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వేడి నీళ్ళకు చన్నీళ్ళ మాదిరిగా వారి సంపాదనలు కుటుంబ ఖర్చులకు అవసరం కావడంతో మగవాళ్ళే సర్దుకుపోయి, ఉద్యోగం చేసే ఆడపిల్లలకి  పెళ్లి చూపుల్లో ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. అంతటితో మార్పు ఆగలేదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని రాత్రింబవళ్ళు పనిచేయాల్సిన కొత్త కొలువులు వచ్చి పడ్డాయి. వాటికి తగ్గట్టే మంచి మంచి జీత భత్యాలు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఆ జీతాలు కూడా తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. ఈ ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు ఈనాడు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. మగ పిల్లల మాదిరిగానే కన్న తలితండ్రులను, వున్న వూరినీ విడిచి వెళ్ళి పరాయి వూళ్లల్లోనే కాదు పరాయి దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రీత్యా  ఆర్దిక స్వాతంత్రం అయితే ఆడవారికి కొంత వరకు వచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఆ మేరకు వారికి లభిస్తోందా అంటే చప్పున జవాబు చెప్పలేని పరిస్తితి.
ఉదాహరణకు సినీ రంగంలో రాణిస్తున్న తారల సంగతే తీసుకుందాం. ఆదాయం బాగానే వున్నా మగ తారల మాదిరిగా సంపాదించుకున్న ఆస్తిపాస్తులను  కాపాడుకోలేని పరిస్తితి ఆ రంగంలో ఎక్కువ. అన్నింటికీ ఎవరిమీదనో ఆధారపడాల్సిన స్తితే.
సరే! ఇవన్నీ బాగా చదువుకుని, బాగా సంపాదిస్తూ వున్న మహిళల సంగతి. కుటుంబ అర్దిక స్తితి గతులు మెరుగు పరచడంలోనే కాదు,  దేశ ఆర్ధిక వ్యవస్థ  పురోగమనంలో కూడా వీరి పాత్ర తక్కువేమీ కాదు. ఆ మేరకు వారికి జాతి రుణపడి వుండాలి.


మరో రకం ఆడవారు వున్నారు. నిజానికి వీరి జనాభానే అధికం. వీరు చదువు సంధ్యలు లేనివాళ్ళు. అధవా చదువుకున్నా ఏదో నాలుగు అక్షరం ముక్కలే. చిన్న  చిన్న పనిపాట్లు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న వారు. తమ కుటుంబాలకు ఆర్ధికంగా సాయపడుతున్నవారు. సంపాదన వుందన్న మాటే కాని దానిపై పెత్తనం బొత్తిగా లేనివాళ్ళు. గ్రామాల్లో పొలం కూలీలుగా పనిచేసుకుంటూ, బస్తీల్లో అయితే  నాలుగిళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ, నాలుగు రాళ్ళు పోగేసి మొగుడి చేతిలో పోసి చేతులు దులుపుకునే వాళ్లు. తమ చెమటతో తడిసిన ఆ సొమ్మును వాళ్లు తాగుడు కోసం తగలేస్తున్నా నోరు తెరిచి అడగలేని మూగవాళ్ళు.  వీరికి బొత్తిగా ఆర్ధిక స్వాతంత్రం లేదు, పోనీ వ్యక్తిగత స్వేచ్చ వుందా అంటే అదీ లేదు. మరబొమ్మల్లా కాయకష్టం చేసి నాలుగు డబ్బులు సంపాదించడం తప్ప.
మరో వివక్షకు కూడా వీరు గురవుతున్నారు. చేసేది ఒకే పని అయినా దినసరి కూలీ డబ్బులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. ఆడవాళ్లు చేసే ఇంటి పనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, బయట పనిపాటుల్లో వారికి ముడుతున్నది నామమాత్రమే.   
ఇలాటివారు నేటి సమాజంలో ఎల్లెడలా కనిపిస్తారు. పనికి తగ్గ వేతనాలు వుండవు. పని వేళలూ వుండవు. రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేస్తారు. పనిచేసిన రోజున బాగా చేసావు అనేవాళ్ళూ వుండరు, పనికి రాని రోజున 'మా నాగాల రాణి ఇవ్వాళ రాలేదు, ఎగనామం పెట్టింది' అనే సన్నాయి నొక్కులకు మాత్రం తక్కువ వుండదు. మరి వీరి జీవితాలు మారేదెన్నడో!   
యాభయ్ ఏళ్ళ క్రితం గడప దాటని ఆడవాళ్ళను చూసాను. అదే కళ్ళతో చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళను చూస్తూ వున్నాను.
కాల ధర్మం మీద నమ్మకం వున్నవాడ్ని. చివర చెప్పిన బడుగు బలహీనవర్గాల  ఆడవారికి కూడా మంచి కాలం రాకపోతుందా? నేను చూడక పోతానా?  (16-07-2015)                
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE : Courtesy Image Owner