6, డిసెంబర్ 2014, శనివారం

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతారాగాలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 07-12-2014, SUNDAY)

"మోడీ ప్రాభవం తగ్గుతోందా? ఆయన నేతృత్వంలోని ఎండీయే కూటమికి, 'కాని కాలం' దాపురించిందా? జాతి హఠాత్తుగా ఏదైనా విపత్తును ఎదుర్కోబోతోందా ? దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిందా? త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయా?"
ఈ ప్రశ్నలకు వేటికీ 'అవును' అనే సమాధానం లేదు. అయినప్పుడు కొత్తగా వినబడుతున్న ప్రతిపక్షాల ఐక్యతారాగాలకు అర్ధం ఏమిటి?    
రాజకీయ శూన్యత వున్నప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయాల వికాసానికి అవకాశం వుంటుంది. అది లేనప్పుడు , ఒకప్పటి జనతా పార్టీ కొమ్మలయిన  ఆరు పార్టీలు కలిసి ఏకమై ఒకే పార్టీగా ఏర్పడి సాధించేది ఏమిటి? ఈ కొత్త రాజకీయ కూటమి లేదా కొత్త పేరుతొ ఆవిర్భవించబోయే సరి కొత్త పార్టీ - పాలకపక్షం అయిన బీజేపీకి విసరబోయే సరికొత్త సవాలు ఏమిటి? ప్రస్తుత లోకసభలో ఈ ఆరుపార్టీలకీ వున్న మొత్తం పదిహేనుమంది సభ్యులు ఒక పార్టీగా ఏకమైనా దానివల్ల పాలక పక్షానికి అద్యతన భావిలో ఎదురయ్యే ముప్పు ఏమీ లేనప్పుడు ఈ కొత్త పార్టీ వల్ల   పాలక పక్షం బీజేపీకి  ఎదురయ్యే ముప్పు ఏముంటుంది?   
ఇప్పుడు జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చిస్తున్న అంశాలు ఇవే. 

  
దేశ రాజకీయాలను శాసించగల అత్యధిక పార్లమెంట్ స్థానాలు కలిగిన ఉత్తర ప్రదేశ్ లో పాలకపక్షం సమాజ్ వాదీ పార్టీ, జనత దళ్ (యు), రాష్ట్రీయ జనతా దళ్, జనతా దళ్ (యస్), ఇండియన్ నేషనల్ లోక్ దళ్, సమాజ్ వాదీ జనతా పార్టీ - ఈ ఆరూ  పైకి చిన్నా చితకగా కనిపించినా ఒకరకంగా ఇవన్నీ  ఓ మోస్తరు పెద్ద పార్టీలే. కొన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపగల సామర్ధ్యం వున్న పార్టీలే. ఈ పార్టీల అగ్ర నాయకులు మూలాయం సింగ్ యాదవ్,  శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, దుష్యంత్  చౌతాలా  ఇటీవల ఢిల్లీలో సమావేశమై తమ పార్టీలనన్నింటినీ ఏకం చేసి ఒకే పార్టీగా ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న మోడీ ప్రాభవానికి అడ్డుకట్ట వేయడం  ఈ కొత్త పార్టీ  ప్రధాన ధ్యేయంగా కనబడుతోంది.  మరో జాతీయ పార్టీ  కాంగ్రెస్ పరిస్తితి అంత ఆశాజనకంగా లేని ప్రస్తుత పరిస్తితుల్లో కొత్త పార్టీ ఆవశ్యకత ఆ కొరతను తీర్చగలుగుతుందని ఆశించడం ఈ పార్టీ ఆలోచన పురుడు పోసుకోవడానికి దోహదపడివుండవచ్చు.  విచిత్రం ఏమిటంటే అలనాడు కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి అన్ని పార్టీలు కలిసి  జనతా పార్టీగా ఏకం కావడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ (అప్పుడు జనసంఘం) ప్రభుత్వాన్నే  ఇరకాటాన పెట్టడానికి  ఇప్పుడీ పార్టీలన్నీ ఏకం కావడం.  ప్రస్తుతం ఈ ఆరు పార్టీల  విలీనం ద్వారా ఏర్పడబోతున్న కొత్త రాజకీయ పార్టీ జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కాగలుగుతుందా అనే ప్రశ్నకు 'రాజకీయ శూన్యత' అనే అంశం ఒక్కటే సానుకూల సమాధానం చెప్పడానికి ప్రతికూలంగా ఉంటోంది.
గతంలో ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించి గట్టి అనుభవమే మనకుంది.
స్వాతంత్ర్యానంతర రాజకీయాలో చీకటి అధ్యాయంగా  పేర్కొనే ఎమర్జెన్సీ పరిణామాల అనంతరం ప్రతిపక్షాల నడుమ సయోధ్యకు దండలో దారం మాదిరిగా నాటి నేత లోక్ నాయక్ శ్రీ జయప్రకాశ్ నారాయణ్ ఎంతగానో దోహదపడ్డారు. ఆయన సారధ్యంలో జనతా ప్రయోగం కొంతవరకు అంటే కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడం వరకు విజయవంతం అయింది. శ్రీమతి ఇందిరాగాంధీని దెబ్బతీయాలన్న ఉమ్మడి లక్ష్యం నెరవేరిన తరువాత జనతా పార్టీలో ఆంతరంగిక   విభేదాలు పెచ్చరిల్లాయి. కేవలం కక్ష సాధింపు, అధికార వ్యామోహం తప్ప కలగూరగంప వంటి  జనతా ప్రభుత్వానికి వేరే ధ్యాస, లక్ష్యం లేవన్న  అపనింద మోస్తూ  జనతా ప్రయోగం నీళ్ళు కారిపోవడానికి అందులో చేరిన ఆయా  పార్టీల నేతలే కారణం అయ్యారు. ప్రతిపక్షాల ఐక్యత పట్ల ప్రజల్లో ఓ రకమైన ఉదాసీన భావం ప్రబలడానికి కూడా జనతా ప్రయోగ వైఫల్యం దోహదం చేసింది. తరువాతి కాలంలో ప్రతిపక్షాల ఐక్యతారాగం కొత్త పల్లవి అందుకుంది. ఎవరి అస్తిత్వాన్ని వారు కాపాడుకుంటూనే, భావసారూప్యత ప్రాతిపదికగా సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయింది. ఇందువల్ల ప్రభుత్వాల మనుగడకు  కొంతవరకు వెసులుబాటు లభించింది  కానీ ప్రజలపట్ల బాధ్యతలను నెరవేర్చడంలో వాటికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.     
అందుకే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఆరు పార్టీలు కలవబోతున్నాయి అనే వార్త ఉత్తర భారతంలోని మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది కాని ప్రజల్లో దానిపట్ల అంత ఆసక్తి కానరావడం లేదు.
కాంగ్రెస్ పార్టీ బలహీన పడడం అన్న ఒక్క కారణంతో,  అందువల్ల ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో ఈ కొత్త పార్టీ ఆలోచన రూపుదిద్దుకున్నదంటే నమ్మడం కష్టం. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని ఈ పార్టీలు నమ్ముతుండవచ్చునేమో కాని  దేశ రాజకీయాల తీరుతెన్నులు గమనించేవారు విశ్వసించడం కష్టం. లోక్ సభలో రెండు స్థానాలు కలిగిన బీజేపీ తదనంతర కాలంలో పుంజుకుని కేంద్రంలో అధికారం దక్కించుకున్న విషయాన్ని  మరువకూడదు.    
కొత్త పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నది ఈనాడు సాగుతున్న చర్చ. భవిష్యత్తులో సంభవించగల రాజకీయ పరిణామాలకు దీన్ని ఒక సంకేతంగా చూడవచ్చు. ప్రస్తుతం ఈ పార్టీల ప్రభావం ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలకే పరిమితం. అక్కడకూడా వీటి మధ్య ఆధిపత్య పోరు జనాలకు సుపరిచితం. ఈ పార్టీలకు ప్రస్తుత పార్లమెంటులో వున్న బలం కాంగ్రెస్ తో పోలిస్తే తక్కువే. ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల తోడ్పాటు లేకుండా జాతీయ స్థాయిలో ఈ కొత్త పార్టీ సాధించేది పూజ్యం. కాంగ్రెస్ ను కలుపుకుని పోవడం ద్వారా ఓ మేరకు ఫలితం ఉండవచ్చు.
మరో ఊహాగానం కూడా షికారు చేస్తోంది. అసలు ఈ కొత్త పార్టీ ఆలోచన కాంగ్రెస్ పుణ్యమే అని ఓ వాదన వినబడుతోంది. అయితే దాన్ని నిర్ధారించే ఆధారాలు ప్రస్తుతం లేవనే చెప్పాలి.
రాజకీయ పార్టీల కలయిక పవిత్రంగా వుండి, పాలూ నీళ్ళలా కలిసిపోవాలి. అతుకులు పెట్టి అతికినప్పుడు  అంత త్వరగానే అతుకు ఊడిపోయే ప్రమాదం పొంచుకునే వుంటుంది. వీటికి అవకాశంవాదం తోడయితే ఇక చెప్పేపనేలేదు. (06-12-2014)

NOTE: Photo Courtesy Image Owner

నడిచి వచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు


జడి జడిగా పడుతున్న వాన చినుకుల్ని కారు వైపర్లు తుడుస్తుంటే ఎదట రోడ్డు స్పష్టాస్పష్టంగా కానవచ్చినట్టు గతంలోని చిన్నతనం. గుర్తుకు వస్తున్న చిన్ననాటి జ్ఞాపకాలు.





"......నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా|......
".......అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్
దుష్టునిఁ గంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా!......."
పల్లె మేలుకుంటున్న వేళ దూరంగా వుండి వుండి గాలిలో  తేలుతూ  వినవచ్చే కృష్ణ శతకంలోని పద్యాలు. అప్పయ్య మాస్టారి నాన్నగారు శివరాజు నాగభూషణ రావు గారు మంచి కృష్ణ భక్తులు. పొద్దున్నే లేచి స్నానాదులు ముగించుకుని సూర్యోదయానికి పూర్వమే సుస్వరంతో ఆ పద్యాలను గొంతెత్తి పాడేవారు.  మా వూరికి అదే  సుప్రభాతం.
పట్నంలో ఉంటూ సెలవులకు వూరికి వచ్చినప్పుడు చేసే ఒకే ఒక్క పని కరువుతీరా నిద్రపోవడం. ఇంటి ముందు ఆరుబయట మంచం వేసుకుని పడుకుంటే ప్రాణం గాలిలో తేలిపోయేది. దుప్పటి ముసుగు కప్పుకుని పడుకుంటే మెళకువ వచ్చినా లేవకుండా మరి కాసేపు పడుకుంటే బాగుంటుందని అనిపించేది. కల్లాపు జల్లడానికి వచ్చిన జీతగాళ్ళకు నా మంచం అడ్డు. 'పోనీలే సీనాయి (అంటే నేను)ని కాసేపు పడుకోనివ్వండి'. ఎక్కడినుంచో మా బామ్మ గొంతు. ఇంట్లో ఆవిడది సుగ్రీవాజ్ఞ. వెంటనే ఇద్దరు జీతగాళ్ళు నేను పడుకున్న నవారు  మంచాన్ని అలాగే పట్టి లేపి పక్కకు పెట్టి తమ పని కానిచ్చుకునేవారు. ఇదంతా ఎంతో సరదాగా వుండేది.
(సారీ! మరికొన్ని ముచ్చట్లు మరో సారి)
NOTE: Courtesy Image Owner       
  


5, డిసెంబర్ 2014, శుక్రవారం

బెడ్రూంకు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోతోంది



వెతకబోయిన తీగె కాలికి తగిలిందన్న సామెత జీవితంలో అతి కొద్ది సందర్భాలలో మాత్రమే నిజమవుతుంది. నా విషయంలో మాత్రం ఈ మినహాయింపు వున్న దాఖలా నాకెప్పుడూ కనబడలేదు. అదేమిటో ఇంటి తాళాలు కూడా వెతక్కుండా ఏనాడూ కళ్లబడలేదు. అయితే ఈ వెతుకులాటలో కూడా ఒక ప్రయోజనం లేక పోలేదు. వెతికేవి కనబడవు కానీ, ఎప్పుడో, ఎక్కడో దాచినవి, దాచి మరచిపోయినవి హఠాత్తుగా దర్శనమిస్తుంటాయి. అల్లా దొరికిందే ఇదిగో ఈ ఇంటర్వ్యూ.

డాట్ కామ్ బూమ్ తొలిమొగ్గ వేస్తున్న రోజుల్లోనే ఆహ్లాద  రచయిత శ్రీ  మల్లాది వెంకట కృష్ణమూర్తి సంపాదకత్వంలో ఆరేళ్ళ క్రితం  (19-02-2006) ‘శృంగారం డాట్ కామ్’ (www.srungaram.com) అనే వెబ్ పత్రికలో శ్రీ దోర్బల శర్మ నాతో జరిపిన  ఇంటర్వ్యూ అది. వృత్తి జీవితంలో నేను అనేకమందిని ఇంటర్వ్యూ చేసివుంటాను కాని నన్ను మరో జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేయడం మాత్రం అదే తొలిసారి. బహుశా  ఆఖరుసారి కూడా. అప్పట్లో ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్  లేని కారణంగా దాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలగలేదు. కాకపొతే ఆ వెబ్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఇంచార్జ్  శ్రీ ఎస్. రామకృష్ణ పోస్ట్ లో ఆ ఇంటర్వ్యూ ప్రతిని పంపారు. ఇన్నేళ్ళ తరువాత దేనికోసమో వెతుకుతుంటే అదిప్పుడు నా కళ్ళబడింది. మానవ సహజమయిన బలహీనతతో దాన్ని యధాతధంగా ఈ బ్లాగులో వుంచుతున్నాను. ఇందులోని మంచిచెడ్డలు చదువరులకే వొదిలేస్తున్నాను. - భండారు శ్రీనివాసరావు
(04-12 - 2014)
ఇంటర్వ్యూ కు ముందు శర్మ గారి  ఉపోద్ఘాతం :
తెలుగు పత్రికారంగంలో దిగ్గజం వంటివారయిన నార్ల వేంకటేశ్వర రావుతో కలసి పనిచేసిన ప్రముఖ పాత్రికేయుల్లో ఒకరు భండారు శ్రీనివాసరావు. ప్రస్తుతం దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా వున్న ఆయన 1945 డిసెంబర్ లో    కృష్ణాజిల్లా కంభంపాడులో జన్మించారు. జగమెరిగిన భండారు పర్వతాలరావు ఆయనకు స్వయానా పెద్దన్నయ్య. జర్నలిస్టుగా మూడున్నర  దశాబ్దాల అనుభవం కలిగిన శ్రీనివాసరావు – రేడియో, దూరదర్శన్ లలో అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ఎందరో జాతీయ స్తాయి నాయకులను ఇంటర్వ్యూ చేశారు.
సుదీర్ఘమయిన తన పాత్రికేయ వృత్తిలో మరచిపోలేని అనుభవంగా - మదర్  థెరిస్సాతో  తన ఇంటర్వ్యూను ఆయన పేర్కొంటారు. మదర్  థెరిస్సా హైదరాబాద్ సందర్శించినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసే అదృష్టం కలిగిందని, అల్లాగే ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వుండగా భద్రాచలం అడవుల్లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతో జరిపిన ప్రత్యేక యాత్ర కవరేజీని మరచిపోలేనని ఆయన అంటారు.
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్.) అధికారి అయిన శ్రీనివాసరావు విద్యాభ్యాసం ఖమ్మం, విజయవాడల్లో జరిగింది.ఖమ్మం ఎస్.ఆర్.అండ్ బీ.జీ.ఎన్.ఆర్. డిగ్రీ కాలేజీలో పీయూసీ చదివారు. బీకాం విజయవాడ ఎస్.ఆర్. ఆర్. కాలేజీలో. ప్రసిద్ధ సినీ దర్శకుడు, జంధ్యాల కాలేజీలో తనకు బెంచ్ మేట్ గా గుర్తుచేసుకున్నారు. 1971  లో విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్  ఎడిటర్ గా చేరి  1975  దాకా అక్కడే పని చేశారు. అప్పటినుంచి 1987   దాకా హైదరాబాద్ ఆకాశవాణిలో న్యూస్ కరస్పాండెంట్ గా పనిచేశారు. తరువాత నాటి యు.ఎస్.ఎస్.ఆర్. (సోవియట్ రష్యా)కు చెందిన మాస్కో రేడియో తెలుగు విభాగంలో న్యూస్ రీడర్ గా పని చేయడానికి మాస్కో వెళ్లారు.సుమారు అయిదేళ్ళు అక్కడేవున్న ఆయన నాటి సోవియట్ యూనియన్ పతనాన్ని స్వయంగా చూశారు. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చి ఆకాశవాణిలో చేరి న్యూస్ ఎడిటర్ గా  2004 దాకా కొనసాగారు. దూరదర్శన్ లో న్యూస్ ఎడిటర్ గా విధులు నిర్వహించి 2005 డిసెంబరు 31వ తేదీన పదవీవిరమణ చేసారు. విధి నిర్వహణలో భాగంగా  దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలు సందర్శించిన ఆయనకు అన్ని సామాజిక, దేశీయ సమస్యలపై మంచి అవగాహన వుంది. మలేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలు సందర్శించారు.
పత్రికా రచయితగా భండారు శ్రీనివాసరావు  1974 – 75 మధ్య కాలంలోనే ఆంధ్ర జ్యోతిలో ‘వాక్టూనులు’ పేర నిర్వహించిన శీర్షిక మంచి  పాఠక జనాదరణ పొందింది. ఆకాశవాణిలో ఆయన పదేళ్ళపాటు నడిపిన ‘జీవన స్రవంతి’ కార్యక్రమం విననివాళ్లు వుండరు. ‘ప్రజాతంత్ర’ వారపత్రికలో కిందటేడాది ‘అమెరికా అనుభవాలు-అనుభూతులు’ శీర్షికన ఆయన ఒక సీరియల్ రాశారు. ‘నడచి వచ్చిన దారి’ శీర్షికన ఒక ఆటోబయాగ్రఫీని, ‘మార్పు చూసిన కళ్ళు’ పేరుతొ తాను చూసిన ఆ నాటి సోవియట్ యూనియన్ అనుభవాలను సీరియల్ గా రాయాలన్న తలంపు వున్నట్టు తన మనసులోని మాటను వెల్లడించారు. పెద్దన్నయ్య భండారు పర్వతాలరావే తనకు వృత్తిలో స్పూర్తినిచ్చారని చెప్పే శ్రీనివాసరావు ‘శృంగారం డాట్ కామ్’ కోసం- ‘బెడ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోయిందం’టూ సీనియర్ పాత్రికేయుడు దోర్బల శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. -  సంపాదకుడు.
హైదరాబాదులోని  ఎర్రమంజిల్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే వున్న క్వార్టర్ అది. ఇంటి ముందు ‘భండారు శ్రీనివాసరావు, దూరదర్శన్’ అనే నేమ్ ప్లేట్  వుంది. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకల్లా ఆ ఇంటికున్న చిన్న గేటు తీసుకుని లోనికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే ఆయనే వచ్చి నన్ను ఆహ్వానించారు. నన్ను నేను పరిచయం చేసుకున్నాక ఇంటర్వ్యూ ప్రారంభించాను. ‘శృంగారం గురించి నేనేం మాట్లాడగలను?’ అని తొలుత సందేహించిన భండారు – ఆ తరువాత నేను అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు లోతయిన విశ్లేషణతో కూడుకుని వున్నాయి. ఈ తరం విధిగా తెలుసుకోవాల్సిన విషయాలను ఆయన వెల్లడించారు.
ప్ర) శృంగారం అనగానే ఎందుకంత వెనుకంజ వేసారు?
జ) నేనే కాదు. సాధారణంగా ఆ మాట వినగానే మనలో చాలామంది వెనుకంజ వేస్తారు. ఎందుకంటె మన మైండ్ సెట్ ఆ విధంగా తయారయింది. చిన్నతనం, యుక్త వయస్సు, వృద్ధాప్యం – ఇలా యే ప్రాయంలోనయినా సరే దాని గురించి స్వేచ్చగా మాట్లాడే తెగువని చాలామంది చూపలేరు. కనుకే వెంటనే మాట్లాడడానికి కాసింత భయమేసింది.
ప్ర) దాన్ని భయమంటారా?
జ) జంకు కావచ్చు. శృంగార విషయాలను స్వేచ్చగా చర్చించుకునే అవకాశం మన సంస్కృతిలో లేకపోవడమే దీనికి కారణం. దాన్ని గోప్యంగా వుంచేలా మనమంతా ‘ట్యూన్’ అయివున్నాం. ఈ నేపధ్యంలో ‘తెర’ తీసేదెవరు? ‘తెర తీయగరాదా’ అనే ధైర్యం కూడా సాంప్రదాయపరులలో చాలామందికి లేదు.
ప్ర) దీన్నిబట్టి సెక్స్ గురించి చాలామందికి తెలియదనుకోవచ్చా?
జ) సెక్స్ గురించి మన సమాజంలో చాలామందికి సంపూర్ణంగా తెలియని మాట నిజమే. దీన్ని ఇలా గోప్యంగా వుంచడం వల్లనే అలా తెలియకుండా పోతుందన్నది ఒక కారణం కావచ్చు. అయితే మన చుట్టూ వున్న చాలామందికి ‘సెన్సెక్స్’ గురించి తెలిసినంతగా ‘సెక్స్’ గురించి తెలియదనవచ్చు. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో ‘సెన్సెక్స్’ అనే మాటను మనం చాలాసార్లు వింటూ వుంటాం. కానీ ‘సెక్స్’ అన్న మాటను అనడానికీ, వినడానికీ అనేకులు మొహమాట పడతారు.
ప్ర) మనం సెక్స్ ప్రాధాన్యాన్ని తెలుసుకోవడం లేదా?                  
జ) అనే చెప్పాలి. మనిషి జీవితానికి సెక్స్ యెంత అవసరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విశ్లేషణ ప్రకారం  మానవుని ఆయుర్దాయం నూరేళ్ళు అనుకుంటే అందులో సగటున ఒక ఇరవై ఏళ్లకు  మించిన కాలమయినా శృంగారానికి కేటాయిస్తున్నట్టు లేదు. ఎవరికయినా యుక్త వయస్సు వచ్చేసరికి పరిస్తితి ఎలా  వుంటుందంటే – ‘అప్పటికి ఒక పదేళ్ళ కిందటి వరకు సెక్స్ గురించి తెలవదు. ఓ పదేళ్ళ  తరువాత  సెక్స్ అవసరం వుండదు.’  దీన్ని బట్టి శృంగారానికి లభిస్తున్న ప్రాధాన్యం అర్ధం అవుతోంది.
ప్ర) మధ్య వయస్కులు శృంగారానికి దూరం అవుతున్నారంటారా?
జ) అలా అని నిర్దిష్టంగా చెప్పలేం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈ మధ్య ‘ప్లస్ ఫార్టీ’ శృంగారం అని ఒకటి వచ్చింది. ఇది నలభై  నుంచి  యాభై ఏళ్ళ వయస్సులోని వారికి వర్తిస్తుంది. ఈ రకమయిన శృంగార పోకడ భార్యాభర్తల మధ్య వున్నప్పుడు ఓకే. కానీ ఇది అలా కాకుండా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నట్టు వింటున్నాం. ఒక పెళ్ళయిన వ్యక్తి, చివరికి పిల్లాపాపలున్న స్త్రీలు సైతం సమాజం లోని నియమాలను తోసిరాజంటూ ఇలాటి శృంగార సంబంధాలకు సిద్ధపడుతున్నట్టు వినవస్తోంది. శృంగారం లోని ఆనందాలను అనుభవించడానికి అదొక మంచి అవకాశంగా వారు భావిస్తున్నట్టున్నారు.
ప్ర) ఇలా వివాహేతర సంబంధాలను పెట్టుకోవడం ఎంతవరకు మంచిది? 
జ) మంచీ చెడు నిర్ణయం అన్నది ఎవరికి వారు చేసుకోవాల్సిందే. ఒకరికి మంచి మరొకరికి చెడు  కావచ్చు. ఆయా వ్యక్తుల విచక్షణ, పరిస్తితులకు దీన్ని వొదిలేయాల్సిందే. మంచి చెడుల విచక్షణలో ఆయా వ్యక్తుల అభిరుచులు, కాలమాన స్తితిగతులు ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు నాగయ్య నటించిన సినిమాలే మంచివి, నిన్నటి నాగేశ్వరరావు సినిమాలు చెడ్డవి అనలేం. యే కాలానికి తగ్గట్టు ఆ రకమయిన పద్ధతులు, నియమాలు వుండడం సహజం. కాకపొతే అన్నింటికీ విలువలు ముఖ్యం అని మరచిపోకూడదు.  విలువలకు అతీతంగా, వాటికి భంగం కలగకుండా చూసుకోవడం  ప్రధానం.
ప్ర) పై పరిస్తితిని విలువలు దిగజారడంగా భావించవచ్చా?
జ) అలా జనరలైజ్ చేయడానికి లేదు. అప్పట్లో విలువలతో కూడిన సంపాదనలు వుండేవి. ఇప్పుడు ప్రతిదానికి డబ్బు సంపాదనే ప్రధానమయినది. విలువలు లేని సంపాదనలు ఎక్కువయ్యాయి. ఇలాటి చోట సెక్స్ లోను విలువలు వుంటాయని అనుకోలేం.
ప్ర) సెక్స్ పట్ల నేటి యువత స్పందన యెలా వుంటోంది?
జ) ఇప్పుడు ఓ మోటార్ బైకు పై ఓ అమ్మాయి, ఓ అబ్బాయి చాలా తేలిగ్గా తిరిగేస్తున్నారు. వారిలో అపోజిట్ సెక్స్ పట్ల, స్పర్స పట్ల ఒక సున్నితత్వం లేకుండా పోయింది. అప్పట్లో అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు తాకడానికే జంకేవారు. శారీరకంగా స్పర్శిస్తే ఒక గగుర్పాటు కలిగేది. కానీ ఇప్పటివారిలో ఈ స్పందన కానరావడం లేదు.  చాలా ఈజీగా ఒకరికొకరు షేక్ హాండ్లు ఇచ్చుకోవడం, ఇద్దరు మగవాళ్ళ మధ్య ఒక అమ్మాయి స్వేచ్చగా తిరగడం జరుగుతోంది. పాతకాలంతో పోల్చుకుని దీన్ని తప్పుపట్టడం కూడా సరికాదు.
ప్ర) అసలు నేటి యువత ప్రధాన లక్ష్యం ఏమిటి? 
జ) వారి ప్రధాన లక్ష్యం డబ్బు. దాన్ని యెలా సంపాదించాలి? ఇంతే. వారి ప్రాధాన్యాలు ఇప్పుడు కెరీర్, సంపాదన. ఇవే. వీటి గొడవలో పడి అసలు సెక్స్ కు ఇవ్వాల్సిన గౌరవం, స్తానం ఇవ్వడం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి తేలిగ్గా ప్రేమించుకోవడం, కలసి తిరగడం, పెళ్ళయితే సరి. లేకపోతే అంతకంటే తేలిగ్గా మరచిపోవడం. ఇదంతా చాలా సులభంగా చేసేస్తున్నారు. ఒకరికోసం ఒకరు తపించడాలు, మనసులు బరువెక్కడాలు వంటి సన్నివేశాలు లేనేలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువతరానిది టేకిట్ ఈజీ పాలసీ. ప్రతి దాన్నీ తేలిగ్గానే తీసుకుంటారు, ఒక్క సంపాదన విషయాన్ని మినహాయిస్తే. కుదిరితే ఓ కప్పు కాఫీ అనేవారే ఎక్కువవుతున్నారు.
ప్ర) పెళ్లి కాకుండా భార్యాభర్తల్లా వుండడం ఎంతవరకు సబబు?  
జ) ‘పెళ్లి’ అనేది ఇద్దరు స్త్రీ పురుషులు కలసి వుండడానికి చేసుకునే ఒప్పందం అనుకున్నప్పుడు సమాజం పెట్టిన వివాహం అనే కట్టుబాటు కొందరికి నచ్చకపోవచ్చు. అలాటివారు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తల్లా కలసి వుంటారు. అందులో తప్పు పట్టడానికి ఏమీ వుండదు. కాకపొతే ఆ ‘బంధాన్ని’ (?) నాలుగు కాలాలపాటు నిలబెట్టుకోగలిగితే సంతోషమే. అయితే అదే అనుమానం.
ప్ర) మీరు పెళ్లి ఆర్భాటాలకు వ్యతిరేకం అని విన్నాను. నిజమేనా?
జ) నిజమే! నాకు టీనేజ్ వచ్చేసరికే దాదాపు పదిహేను ఇరవై మంది మేనకోడళ్లను బుట్టల్లో ఎత్తుకెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాను.  నాకు ఏడుగురు అక్కయ్యలు. వాళ్ళలో చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళను నేను దగ్గరుండి మరీ చూసాను. నాకు ఇరవై  ఏళ్ళ వయస్సు వచ్చేదాకా అనేక పెళ్ళిళ్ళు చూసి చూసి ఒకరకంగా చికాకు ఏర్పడింది. నా పెళ్లి వరకు వచ్చేసరికి ఆ పెళ్లి తంతు శుద్ద దండగమారి  ఆర్భాటంలా అనిపించింది. అందుకే నేను ఆ రకమయిన అట్టహాసమేదీ జరుపుకోలేదు.
ప్ర) వివాహ వేడుకలోని అనుభూతిని కోల్పోయినట్టు ఫీలవుతున్నారా? 
జ) బాపు తీసిన  ‘పెళ్లి పుస్తకం’ లాటి కళాత్మక సినిమాలు చూస్తున్నప్పుడు ఆ తంతులో ఇంత గొప్ప అనుభూతి వున్నదా అనిపిస్తుంది. నిజమే. ఇప్పుడు అలా అనిపిస్తున్న సంగతి ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, నాకు అప్పట్లో పెళ్లి తంతులోని అనవసర ఖర్చులు, ఆర్భాటాలు, గందరగోళాలు  కనిపించినంతగా, శాస్త్రోక్తమయిన ఆ శుభ కార్యంలో వధూవరులకు లభించే అనుభూతి కానరాలేదు. దానిని మిస్ అయ్యానేమోనని ఇప్పుడు అనిపిస్తున్న మాట నిజమే.
ప్ర) పెళ్లి వద్దనుకున్న వాళ్లకు పెళ్ళాం మాత్రం ఎందుకంటారు?
జ) నేను  వద్దనుకున్నది ఆ ఆచారాలు, వ్యవహారాలనే కాని మొత్తంగా పెళ్లాన్నే కాదుగా. అందుకే నేను అప్పట్లో ‘పెళ్లి వద్దు, పెళ్ళాం కావాలి’ అనే నినాదాన్ని కూడా వినిపించాను. అలాగే దీనితో పాటు ‘ఉద్యోగం వద్దు – ఉపాధి కావాలి’ అనీ అన్నాను. ఆ రోజుల్లో  మామీద ఆనాటి సమకాలీన సమాజ స్తితిగతుల ప్రభావం ఎక్కువగా వుండేది. నాలాటి యువతలో ఇలాటి భావాలు రావడానికి కూడా ఆ నాటి వర్తమాన పరిస్థితులు, కాలానుగుణమయిన మార్పులే   అదే కారణం. ఇప్పటివారు కూడా దీనికి మినహాయింపు కాదు. కాలాన్నిబట్టే పోకడలు. అందుకే ఈ నాటి తరం భావజాలాన్ని సమర్ధించడానికి కూడా అప్పట్లో నాలాటి వాళ్లు ప్రదర్శించిన తిరుగుబాటు ధోరణే కారణం కావచ్చు.  నేను లేవనెత్తిన ఈ రెండు నినాదాల్లో ఒకదాన్ని పాటించగలిగాను. రెండో దాని విషయంలో పాక్షిక సర్దుబాటు చేసుకుని జర్నలిజం లోకి దిగాను.
ప్ర) ప్రేమ ప్రణయం – వీటిపట్ల మీ కవితాత్మక భావనలు కొన్ని చెబుతారా?   
జ) వృత్తిరీత్యా జర్నలిస్ట్ నే అయినా నేనూ కొంత ప్రేమ కవిత్వం రాశాను. అంతా వయసు మహిమ. చెబుతాను వినండి.
“రాత్రి ఒక నక్షత్రం రాలి పడింది.
తెల్లారి చూస్తే అది నువ్వే”

“ఊహల్లో నేనూ
వూహించుకుంటూ నువ్వూ
వర్తమానాన్ని నష్ట పోతున్నాం”

వీటికి ఒక అర్ధం అంటూ లేదు. మనసుకు తోచింది ఇలా రాస్తూ పోయాను.
ప్ర) అప్పటికీ ఇప్పటికీ వచ్చిన సాంస్కృతిక మార్పు ఏమిటి? 
జ) ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బెడ్రూం కు డ్రాయింగ్ రూమ్ కు తేడా లేకుండా పోతోంది. బెడ్ రూమ్ విషయాలన్నీ టీవీ ద్వారా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చేశాయి. మార్పు సహజమే. ఒప్పుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు జర్నలిష్టులు పది రూపాయలు ఇస్తే కానీ పేరా వార్త రాయడం లేదని వింటున్నాం. ఇలాటి పెడ ధోరణి ఇదివరకూ లేకపోలేదు. అప్పట్లోనే పెగ్గు పడితే కాని వార్త రాయని వాళ్ళను ఎందర్ని చూడలేదు. అప్పుడూ ప్రమాణాలు పడిపోవడం చూసాము. కాకపొతే, ఇప్పుడు ప్రమాణాలే లేవు. ఇది యెంత దూరం పోతుంది  అంటే –  పెండ్యులం  అన్నది వూగి వూగి ఎక్కడో ఒకచోట ఆగుతుంది. అంతదాకా ఎదురుచూడక తప్పదు.”

అంటూ ఆయన తన ఇంటర్వ్యూ ముగించారు. (19-02-2006)
NOTE: Courtesy Image Owner 

3, డిసెంబర్ 2014, బుధవారం

మంచి ప్రార్ధన


'దేవుడా! నాకు డబ్బివ్వు. ఎంతంటే, అవసరంలో ఉన్నవారికి సాయపడేటంత.
'దేవుడా! నాకు అధికారం ఇవ్వు. ఎంతంటే, అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడేటంత.

'దేవుడా! నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు. వయసు మళ్ళినప్పుడు ఎవరిమీదా ఆధారపడకుండా వుండేటంత' 


(NOTE: COURTESY IMAGE OWNER)
   

వీసా అక్కరలేని గోంగూర



దేశాలు తిరగాలంటే మాటలా. వీసాలు కావాలి, విమానం టికెట్లు కావాలి. కానీ  మా ఆవిడ చేసిన గోంగూర పచ్చడి ప్యాకెట్లు  ఇవేవీ అక్కరలేకుండానే దేశదేశాలు తిరుగుతున్నాయి. అమెరికాలో వున్న మా పిల్లలకి మూన్నెళ్ళకోమారు తాను  స్వయంగా చేసిన పచ్చళ్ళూ కారాలు పంపడం మా ఆవిడకో అలవాటు. మొన్న ఇలాగే ఓ కొరియర్లో కొన్ని పచ్చళ్ళ ప్యాకెట్లు పంపింది. అది అమెరికా ఎప్పుడు చేరుతుందో తెలుసుకోవడానికి కొరియర్ కంపెనీ వాడు ఓ ట్రాకింగ్ నెంబరు ఇచ్చాడు. దాన్నిబట్టి చూస్తే  మా గోంగూర ప్యాకెట్టు రెండు రోజులు కూడా తిరగకుండానే  మూడు దేశాలు చుట్టి తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని తెలిసింది. హైదరాబాదు నుంచి మొదలయిన దాని ప్రయాణం బెంగళూరు, ముంబై మీదుగా దుబాయి చేరి, అటునుంచి తుపాను దిశ మార్చుకున్నట్టు ఏకంగా ఇటలీ లోని సొమ్మా లాంబార్డో విమానాశ్రయం చేరుకుందని ఆఖరు వార్తలు తెలుపుతున్నాయి. అమెరికాలోని సియాటిల్ చేరేలోగా ఇంకా ఎన్ని ఖండాలు చుట్టబెడుతుందో వేచి చూడాలి.  

   

తోట్లవల్లూరు కబుర్లు

మూడేళ్ళ నాటి ఓ ముచ్చట (2011) 
అనుక్షణం వార్తలమధ్య గడిపే జర్నలిష్టులను ప్రతిరోజూ  పత్రికల్లో వచ్చే వార్తలు అంతగా ఆకట్టుకోవు. కానీ, (2011)నవంబర్ ఇరవై ఐదో తేదీన ఈనాడు లో పడ్డ  వార్తను చూసిలోగడ ఆలిండియా రేడియో, దూర దర్శన్ లలో  న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన ఆర్.వీ.వీ. కృష్ణారావు కాసేపు చకితులయ్యారు. దానికో కారణం వుంది. అది తెలుసుకోవాలంటే అంతకు ముందు శనివారం నాడు హైదరాబాదులో  జరిగిన ఒక పెళ్లి. అది చెప్పుకునే ముందు ఈనాడులో పడ్డ వార్త సారాంశం తెలుసుకుందాం.

తోట్లవల్లూరును మరచిపోలేను.


(ప్రెసిడెంట్ ఒబామాతో డాక్టర్ నోరి)


(తోట్లవల్లూరు, న్యూస్ టుడే-  కేన్సర్ చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాత  కీర్తి గడించిన  డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గురువారం కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో పర్యటించి తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను చిన్నప్పుడు నివసించిన ఇంటిని సాంబశివరావు కొనుగోలు చేసి కొత్తగా  నిర్మించుకున్న ఇంటికి వెళ్లి అంతా  కలయతిరిగిచూసారు. ఇక్కడో బావి వుండాలే!అని ఆ ఇంట్లోవారిని వాకబు చేశారు.   పమిడిముక్కల మండలం ఘంటాడలో తాను జన్మించినా, కుటుంబ సభ్యులతో చిన్నతనంలో  గడిపిన తోట్లవల్లూరును జీవితంలో మరచిపోలేనని చెప్పారు. తనకు నామకరణం చేసిన కలగా పూర్ణచంద్ర శాస్త్రి ఇంటివద్ద కొద్దిసేపు గడిపి వేణుగోపాలస్వామి ఆలయంలో  అర్చకులు ప్రసాదంగా ఇచ్చిన చిట్టి గారెలు తిని దాదాపు యాభై అరవై  ఏళ్ళ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.)

ఈ వార్త కళ్లబడగానే  కృష్ణారావు గారికి నెప్పల్లి  ప్రసాద్ గారి అబ్బాయి పెళ్ళిలో జరిగిన సంఘటన సినిమా రీలులా కళ్ళముందు కదలాడింది.
ప్రసాద్ గారు అమెరికాలో పేరుమోసిన చార్టర్డ్ అక్కౌంటెంట్. వారి ఆహ్వానం మేరకు కృష్ణారావు గారు ఆ పెళ్ళికి వెళ్లారు. అక్కడ ఆయనకు  వూహించని అతిధి తారసపడ్డారు. ఆయనే నోరి దత్తాత్రేయుడు గారు. ఆయన హస్తవాసికి తిరుగులేదు. క్షణం తీరికలేని వైద్యులు. కేన్సర్ రక్కసి పీచమడిచే పనిలో పడి దేశదేశాలు తిరుగుతుంటారు. ఇటీవల సోనియా గాంధీ గారికి వైద్యం చేసిన డాక్టర్ల  బృందానికి ఆయనే నేతృత్వం వహించారని పత్రికల్లో  వచ్చింది.  దత్తాత్రేయుడి గారికి  నెప్పల్లి ప్రసాద్ గారు  అత్యంత ఆత్మీయులు. అందుకే వారి కుమారుడి వివాహానికి అమెరికానుంచి రెక్కలు కట్టుకుని ఇండియాకు  వచ్చారు. వారిని పెళ్ళిలో చూడగానే కృష్ణారావు గారికి చిన్నప్పటి తోట్లవల్లూరు సంగతులు మదిలో మెదిలాయి. దత్తాత్రేయుడు గారి కుటుంబం, కృష్ణారావు గారి కుటుంబం యాభయ్ , అరవై ఏళ్ళనాడు ఆ వూళ్ళో ఒకే ఇంట్లో నివాసం వుండేవి. చిరకాలం నాటి  బాల్య మిత్రుడు అన్నేళ్ల తరువాత   తారసపడగానే కృష్ణారావు గారు ఆయనతో మాటలు కలిపారు. మాటల మధ్యలో తోట్లవల్లూరు సంగతి ఎత్తారు. పెళ్ళిలో నలుగురి మధ్యవున్న కారణంగానో యేమో ఆయన  నుంచి వెంటనే  స్పందన కాన రాలేదు. అయినా కృష్ణారావు గారు నిరుత్సాహ పడలేదు. పెళ్ళయిన తరువాతో అంతకు  ముందో కానీ, భోజనాల సమయంలో మరోసారి దత్తాత్రేయుడు  గారితో ముచ్చటించే వీలు చిక్కించుకున్నారు. చిన్నప్పటి సంగతులు కొన్ని  గుర్తు చేశారు. ఈ సారి ఆయన గుర్తుపట్టినట్టే అనిపించింది.
ఎన్నో ఏళ్ళయింది తోట్లవల్లూరు వెళ్లి. మేము అమ్మేసిన ఇల్లెలా వుంది? వూరెలా వుంది ?” అని అడిగారు.
వీలయితే ఈసారి కలసివెడదాంఅని కూడా అన్నారు.  
కోట పోయింది. చదువుకున్న స్కూలు అలాగే వుంది. మనం ఆడుకున్న గుడీ అలానే వుంది. పక్కన కృష్ణానది అందరి  జ్ఞాపకాలను వొడిలో దాచుకుని అలాగే పారుతోంది.బదులు చెప్పారు.
అంతటితో ఆగలేదు. చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, మసలిన మనుషులు అన్నింటినీ  గుర్తుచేశారు.
వేణుగోపాలస్వామి ఆలయం, గుళ్ళో ప్రసాదంగా పెట్టే చిట్టిగారెలు, కట్టు పొంగలి రుచి, వాళ్లు వున్న ఇల్లు, ఇంటి ముందు గిలక బావి, దొడ్లో బాదం చెట్టుఇలా ఒకటేమిటి గుర్తుకొచ్చినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పేశారు కృష్ణారావు గారు.
విందు పూర్తయింది. పెళ్లయిపోయింది. ఇంటికి తిరిగివచ్చిన తరువాత కూడా కృష్ణారావు గారికి తోట్లవల్లూరు గురించిన తలపులు వొదలలేదు. అది ఆయన సొంత వూరు  కాకపోయినా, దత్తాత్రేయుడు గారి మాదిరిగానే కృష్ణారావు గారికి కూడా ఆ వూరితో మరచిపోలేని అనుబంధాలు, జ్ఞాపకాలు అనేకం వున్నాయి.
కృష్ణారావు గారి నాన్న గారు రాయసం గంగన్న పంతులు గారు. దేవాదాయ శాఖలో ఉద్యోగి. చిన్న చిన్న దేవాలయాలను పర్యవేక్షించే అధికారి. బదిలీ మీద కుటుంబాన్ని వెంట తీసుకుని తోట్లవల్లూరు వెళ్లారు.
ఆ వూళ్ళో నోరి సత్యనారాయణ గారింట్లో ఓ వాటా అద్దెకు తీసుకున్నారు.
సత్యనారాయణ గారికి   నలుగురు కుమారులు. పెద్దబ్బాయి  నోరి రాధాకృష్ణ మూర్తి గారు. ఐ.పి.ఎస్. అధికారి. పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ గానో ఆ పై పదవిలోనో రిటైర్ అయ్యారు. పోలీసు ఉద్యోగంలో చేరక మునుపు ఆయన బందరు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేవారు.
రెండో కుమారుడు ఎన్.మధురబాబు గారు. స్టేట్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామీణ బ్యాంకుల  వ్యవస్థలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొల్పిన మొట్టమొదటి గ్రామీణ  బ్యాంక్  నాగార్జున గ్రామీణ బ్యాంక్ కు మొదటి  చైర్మన్ గా పనిచేసి సమర్ధుడయిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జ్యోతిష శాస్త్రంలో కూడా దిట్ట, మూడో కుమారుడు రామతీర్ధ కాగా కనిష్ట  కుమారుడు నోరి దత్తాత్రేయుడు గారు. చిన్నప్పుడు దత్తు అని పిలిచేవాళ్ళు.
కొత్త వూరిలో కృష్ణారావుగారికి కొత్త స్నేహితులు లభించారు. ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. అమ్మా నాన్నా ఏదయినా పనిమీద బెజవాడ  వెళ్ళాల్సి వస్తే ఆ నాలుగు రోజులు తన భోజనం పడకా కూడా నోరి  వారింట్లోనేఅని కృష్ణారావు గారు నాతో  ఈ విషయాలు చెబుతూ గుర్తు చేసుకున్నారు.   
వారి తండ్రిగారి అకాల మరణం తరువాత నోరి వారి మకాం బందరుకు మారిపోయింది.
కృష్ణారావు గారు మాత్రం తండ్రిగారి  ఉద్యోగరీత్యా  తోట్లవల్లూరులోనే మరికొంత కాలం గడిపారు.
ఆ నాటి రోజులు గురించీ, అప్పటి వాతావరణం గురించీ ఆయన మాటల్లోనే.              
నదికి ఆనుకునే కాలవ. బెజవాడ నుంచి లాంచీలు తిరుగుతుండేవి. శివ కామేశ్వరి, శివ పార్వతి, గంగ వాటి పేర్లు.         
నోరి వారి కుటుంబం యావత్తూ కుసుమ హరనాధ బాబా భక్తులు.  ఇంట్లో  రోజూ భజనలు. పూజలు. తండ్రి చనిపోయిన తరువాత వారి కుటుంబం బందరు వెళ్ళగానే ఆ వాటాలోకి అప్పయ్య శాస్త్రి గారు అద్దెకు దిగారు.
తోట్లవల్లూరులో వాళ్లు వున్న ఇల్లు బాగా పెద్దదేమీ కాదు. ఉత్తర ముఖంగావున్న ఆ ఇంటి ముందు గిలక బావి. దొడ్లో బాదం చెట్టు. కుడి పక్క  తాడికొండ వారి నివాసం. ఆ ఇంట్లోనే రామమందిరం. దాపునే తోట్లవల్లూరు కరణం గారయిన అడిదం వారి ఇల్లు. మరోపక్క గోవిందరాజుల వాళ్లు వుండేవాళ్ళు. పోతే,  శివలెంక వీరేశ లింగం గారి  ఇల్లు కూడా పక్కనే. వీరేశ లింగం గారు పేరు మోసిన  పెద్ద జ్యోతిష్కులు. సినీ నటుడు   ముదిగొండ లింగమూర్తి గారి  వియ్యంకులు. మద్రాసునుంచి భానుమతి వంటి ప్రముఖ సినీ  కళాకారులు కూడా ఆయనను కలవడానికి తోట్లవల్లూరు వచ్చేవాళ్ళు. వీరేశలింగం గారి  అబ్బాయి ఎస్.వి.ఎం. శాస్త్రి గారు  దక్షిణ  మధ్య రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తోట్లవల్లూరులోని శివాలయానికి శివలెంక వారు అనువంశిక ధర్మ కర్తలు.
వూళ్ళో వున్న పెద్దగుడి వేణుగోపాలస్వామిది. ఆ గుడికి తగ్గట్టు  పెద్ద గాలి గోపురం. దాని మీద పావురాళ్ళు. వాటి రక్తం పూస్తే పక్షవాతం వంటి రోగాలు నయమవుతాయని చెప్పుకునే వాళ్లు. అది బొమ్మదేవరపల్లి  జమీందారులు కట్టించిన గుడి కావడం వల్ల వైభోగానికి  తక్కువలేదు. పూజలు, పునస్కారాలు, ప్రసాదాల వితరణ ఘనంగానే  జరిగేవి. తిరునక్షత్రం నాడు పులిహోర చేసేవాళ్ళు. పర్లాంగు దూరంలో  కృష్ణానది. ధనుర్మాసంలో ఆలయ అర్చకులు ఆ బావినుంచి మంగళ వాయిద్యాలతో తీర్ధపు బిందెలు తెచ్చేవాళ్లు. మా  పిల్లల  ఆటలన్నీ గుళ్ళో పొగడ చెట్టు కిందనే.
మా వీధి లోనే పోస్టాఫీసు. అన్నంభొట్లవాళ్లు టపా పని చూసేవారు. ఉయ్యూరు నుంచి ప్రతిరోజూ ఒక భారీ మనిషి  (పోస్టల్ రన్నర్) తపాలా సంచీ మోసుకుంటూ అయిదుమైళ్లు గబగబా నడుచుకుంటూ  తోట్లవల్లూరు వస్తుండేవాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ, చేతిలో వున్న పొడుగుపాటి బల్లేన్ని నేల మీద పోటు  పొడుచుకుంటూ  అతగాడు నడిచివస్తుంటే ఆ బల్లెం పైన కట్టిన మువ్వలు అదోరకం శబ్దం  చేస్తుండేవి.
తోట్లవల్లూరు  జమీందారులు బొమ్మదేవర వంశీకులు వేణుగోపాలస్వామి దేవాలయానికి అనువంశిక ధర్మకర్తలే కాదుదానికి కర్తా కర్మా క్రియా అన్నీ వాళ్ళే.  జమీందార్ల దగ్గర ఏనుగుల్ని సంరక్షించే నాగయ్య అనే వ్యక్తి తరువాతి రోజుల్లో ఈ గుడి వ్యవహారాలూ కనిపెట్టి  చూసేవాడు. కృష్ణారావు గారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు ప్రభుత్వం తరపున అంటే దేవాదాయ శాఖ తరపున ఆలయం బాధ్యతలు  చూస్తుండే వారు. అప్పట్లో ఆయన నెల  జీతం  అరవై రూపాయలు. కరవుభత్యం కింద  ఇరవై రూపాయలు. పైన మరో అర్ధ రూపాయి. ఆ వూరి మొత్తంలో  నెలసరి అంత జీతం వచ్చేవాడు మరొకడు లేకపోవడం వల్ల అది చిన్న జీతంగా ఆయన ఎప్పుడూ భావించలేదు. కాకపొతే అంత జీతం అన్నది ఆయనకు వూళ్ళో ఒక ప్రత్యేకతను, అయాచిత  గౌరవాన్ని కట్టబెట్టింది. 
ఆ రోజుల్లో బెజవాడ నుంచి  తోట్లవల్లూరుకు  ప్రైవేటు సర్వీసులవాళ్లు బస్సులు నడిపేవాళ్ళు. ఒకటి  రామాంజనేయ మోటార్ సర్వీస్, రెండోది గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్. బస్సులమీద ఆ  పేర్లు రాసివుండేవి. గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్  అని రాసి  పక్కనే ఇన్ లిక్విడేషన్ అని కూడా వుండేది. దాని అర్ధం ఇప్పటికీ తెలియదు. వీటిల్లో   రామాంజనేయా సర్వీసు బస్సు ఖచ్చితంగా  టైం ప్రకారం నడిచేది. ఒక బస్సు డ్రైవర్  పేరు సుబ్రహ్మణ్యం అని గుర్తు.
వెనుక బెజవాడ నుంచి  రావాలంటే చుట్టూ తిరిగి  రావాల్సివచ్చేది. ఇప్పుడు కృష్ణానది కరకట్ట మీదుగా హంసలదీవి దాకా రోడ్డు వేసారు. దాంతో  రాకపోకలు సులువయ్యాయి.
తోట్లవల్లూరులో  వున్న హైస్కూలే చుట్టుపక్కల వూళ్ళకు దిక్కు. వల్లూరిపాలెం నుంచి ఆడపిల్లలు  నడుచుకుంటూ స్కూలుకు వచ్చేవాళ్ళు. పక్కనున్న భద్రిరాజుపాలెం నుంచి కూడా చదువుకోవడానికి పిల్లలు  తోట్లవల్లూరు  రావడం గుర్తు.
వూళ్ళో గుర్రబ్బళ్లు  కూడా వుండేవి. ఒకరోజు బండి చక్రం కింద ఓ కుక్క పిల్ల నలిగి చనిపోవడం చూసిన పిల్లలకు ఆ రోజు అన్నం తినబుద్దికాలేదు.
తోట్లవల్లూరు గురించిన  పాత సంగతులు  కృష్ణారావు గారికి  ఇంకా అనేకం గుర్తున్నాయని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకనిపించింది.
పెళ్ళిలో కలసి కాకతాళీయంగా  ఆయన    చెప్పిన నాలుగు ముచ్చట్లు నోరి దత్తాత్రేయుడి గారి తోట్లవల్లూరు పర్యటనకు ప్రేరణకావడం  నా ఈ రచనకు ప్రేరణగా మారింది. (28-11-2011) 
NOTE: Courtesy Image Owner   

    


2, డిసెంబర్ 2014, మంగళవారం

ఆరు మాసాలు - అరవై వివాదాలు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 04-12-2014, THURSDAY)

'ఎంతో చేద్దామనుకున్నాను. కొంతే  చేయగలిగాను. ఏదయినా మంచి పని చేయాలని అనుకున్నప్పుడు ఇన్నిన్ని అవాంతరాలు, అడ్డంకులు ఉంటాయని అప్పుడు వూహించలేకపోయాను'
పదవి దిగిపోయేముందు  ప్రతి రాజకీయ నాయకుడూ చెప్పే మాట ఇది.
'ఈసారి మరో అవకాశం ఇచ్చి చూడండి. ఏం చేద్దామని అనుకున్నానో, ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను'
ఆ ప్రతి రాజకీయ నాయకుడు  మళ్ళీ మళ్ళీ చెప్పే మాటలు కూడా ఇవే.  
కొత్త రాష్ట్రం ఏర్పడీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటయి అక్షరాలా ఆరు మాసాలు. మరో కొత్త రాష్ట్రంలో మరో కొత్త ప్రభుత్వం ఏర్పడి మరో వారంలో ఆరు నెలలు పూర్తవుతాయి. తప్పదనుకున్నా, తప్పే అయినా తప్పనిసరిగా పోల్చి చూసుకోవాల్సిన పరిస్తితి ఈ రెండు తెలుగు రాష్ట్రాలదీ. బహుశా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలలో వేటిల్లో కూడా ఈ ఆంద్ర,  తెలంగాణాల్లో వున్న విచిత్ర, వింత  పరిస్తితి వుందనుకోలేము.
కోరి కోరి, పోరి పోరి కోరిన రాష్ట్రం తెచ్చుకుని ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీ ఆర్ ఎస్ పార్టీకి విభజన తలనొప్పులు తప్పలేదు.
అవిభాజ్య ఆంద్ర ప్రదేశ్ గా వున్నప్పుడు, 'కలసివుంటే పండగ, వేరు కుంపటి దండగ' అంటూ పల్లవులు పాడి, చివరకు గత్యంతరం లేని స్తితిలో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి, విభజనానంతర అవశేష ఆంద్ర ప్రదేశ్ లో అధికార పగ్గాలు దక్కించుకున్న తెలుగు దేశం పార్టీకి అవే తలనొప్పులు. వచ్చిపడ్డవి కొన్నయితే, కొని తెచ్చుకున్నవి మరి కొన్ని. ఈ నొప్పులు వారివరకు పరిమితమయితే కధ వేరుగా వుండేది. అవి ప్రజల వరకు బదిలీ అవుతుండడమే ఇందులోని విషాదం.
కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు కొత్త ఇబ్బందులు సహజం. అవి ఎలా ఉంటాయో, వాటి పర్యవసానాలు ఎలా వుండబోతాయో అన్నది అందరికీ ముందే తెలుసు. అయినా అందరి సమ్మతితోనే రాష్ట్ర విభజన జరిగి పోయింది. విభజన నిర్ణయం జరిగీ జరగగానే, ఉమ్మడి రాష్ట్రంలో అటు లోక సభకు ఎన్నికలు జరిగాయి. మరో విడ్డూరం ఏమిటంటే, రాష్ట్ర విభజన జరగక ముందే రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికల తంతు ముగించారు. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరువాతనే, జూన్ రెండో తేదీన రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిచేశారు. ఎన్నికయిన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ వారం రోజుల తేడాతో కొలువు తీరాయి. ఇక అప్పుడు మొదలయింది అసలు కధ. 
    
మొదటి అధ్యాయం చంద్రబాబు నాయుడు సర్కారు ఎక్కుబెట్టిన  పీపీయే అస్త్రంతో  శ్రీకారం చుట్టుకుంది. అది పెరిగి పెరిగి  రగిలి రగిలి మంటలుగా మారుతూ ఉన్నప్పుడే, తెలంగాణా సర్కారు తన అంబుల పొదిలోని ఫీజు రీ ఇంబర్స్ మెంటు అంశాన్ని తీసి అంకుశంలా ప్రయోగించింది. దానితో, పిల్లల చదువులతో పాటు  కాలేజీ యాజమాన్యాలు కూడా గందరగోళంలో పడ్డాయి. స్థానికత వివాదం సుడులు రేపుతుండగానే మరో పక్క  కరెంటు సెగ రాజుకుంది. అటూ ఇటూ అందరూ కలిసి  దాన్ని మరింత ఎగదోశారు. రెండు పార్టీల నడుమ సహజంగా వున్న వైరుధ్యాలు ఆధ్యం పోశాయి. ఇరువైపులా మాటల తూటాలు పేలాయి. అనేక సందర్భాలలో అవి సభ్యతాసంస్కారాలకు కొంత  దూరం జరిగాయి. వీటికి తోడు శ్రీశైలం జలవివాదం కమ్ముకుంది. వీధి కొళాయిల దగ్గర తగాదాలను మరిపించింది. చివరికి సేద్యపు నీటి  ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్ చేసేవరకు కధ ముదిరింది. కాదేదీ వివాదానికి అతీతం అన్నట్టుగా, వాహనాల రిజిస్ట్రేషన్, ఇంటర్ బోర్డు, ఉమ్మడి పరీక్షలు  ఇలా ఏది తీసుకున్నా ప్రతి చిన్న అంశం రెండు రాష్ట్రాల నడుమ పెద్ద వివాదాలకు కారణమవుతోంది.  ఇక ఉన్నతాధికారుల విభజన పూర్తిగా తేలకుండానే  మిగిలిపోయింది. తమ నిష్క్రియాయపరత్వానికి ఓ సాకుగా ఈ అంశం ఉభయ ప్రభుత్వాలకు ఉపయోగపడుతోంది. అది వేరే విషయం.
ఒక్క ముక్కలో చెప్పాలంటే,     
గత ఆరుమాసాలుగా ఈ రెండు నవజాత రాష్ట్రాలలోని  రెండు ప్రభుత్వాల నడుమ సయోధ్య అన్నది కలికానికి  కూడా కనబడకుండా పోయింది. ఇద్దరు  ముఖ్యమంత్రుల నడుమ మాటా  మంతీ లేదు. కలుసుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. దానికి కూడా గవర్నర్ స్వయంగా పూనుకోవాల్సివచ్చింది.
ఇదీ, ఈ ఆరు నెలలుగా అవిశ్రాంతంగా సాగిపోతున్న కధ.
'ఆరు నెలలు.
'అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయా! ఇంకెంత? మరో నాలుగున్నర ఏళ్ళు. ఎంతలో గడిచిపోతాయి'
కాచుకు కూర్చున్న ప్రతిపక్షాల ఆశ.
'ఆరునెలలు.
'ఆరునెలలు చాలా స్వల్ప కాలం. ఎంతో చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఇది మరీ తక్కువ సమయం. అయినా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు అలాగే మిగిలున్నాయి. మిగులు తరుగులన్నీ పూర్తిచేసుకోవడానికి అది చాలు'
అధికార పక్షం ఆకాంక్ష.
అటయినా, ఇటయినా ఇదే ఆట. ఆడేవారు వేరు కాని పాత్రల స్వభావం ఒకటే.
ఇక ఇంతేనా అంటే ఇంతే అని చెబితే అది 'అర్ధ సత్య' అవుతుంది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రశేఖర రావు, అటు చంద్ర బాబు నాయుడు ఇరువురికీ తమ తమ రాష్ట్రాల గురించి ఎన్నో  కలలు వున్నాయి. వాటిని సాకారం చేసుకోవడంకోసం ఎన్నో పధకాలు తయారు చేస్తున్నారు. ఒకరు బంగారు తెలంగాణా సాధన అంటుంటే, మరొకరు స్వర్ణాంధ్ర సాధన అంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తమ స్వప్నాలు యెంత సుందరంగా వున్నాయో ప్రజలకు విడమరచి చెబుతున్నారు. వాటిని నిజం చేయడం ఎలాగో తమకు తెలుసని అంటున్నారు కానీ ఎలా అన్నది చెప్పడం లేదు. వారి ప్రత్యర్ధులు సయితం వొప్పుకునే మంచి గుణం వారికి వున్న సమర్ధత. ఆ సమర్ధత పట్ల వారి వారి రాష్ట్రాల్లో అధిక సంఖ్యాకులకు వున్న అపార  నమ్మకం. ఇదే ప్రస్తుతానికి వారికి శ్రీరామ రక్ష.
ఏ రాజకీయ నాయకుడికీ ఇంతవరకూ లభించని అపూర్వ అవకాశం వీరిద్దరికీ లభించింది. ఒకరికి కొత్త రాష్ట్రాన్ని నిర్మించే అవకాశం. మరొకరికి కొంగొత్త రాజధాని నగరాన్ని నిర్మించే  అవకాశం.
ఇద్దరూ ఈ విషయంలో ఎవరికీ తీసిపోకూడదనే పావులు కదుపుతున్నారు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. తమ కృషి పట్ల, తమ సామర్ధ్యం పట్ల ప్రజల్లో  విశ్వాసం పాదుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు.   
ఎంతటి నమ్మకమైనా కాలం కలిసి రాకుంటే సడలిపోతుంది.  ఎంతటి కవచమైనా పరిస్తితులను బట్టి శిధిలమవుతుంది.
ప్రజల్లో నమ్మకం కలిగించేవాడు నాయకుడవుతాడు. ఆ నమ్మకాన్ని పది కాలాలపాటు నిలబెట్టుకోగలిగినవాడు ప్రజా నాయకుడు అవుతాడు.  
లేకుంటే, గతంలో ఓ వెలుగు వెలిగి మలిగిపోయిన అనేకానేక మంది రాజకీయుల్లో ఒకడిగా మిగిలిపోతాడు.
ఇది చరిత్ర చెప్పే సత్యం.         

(02-12-2014)