29, అక్టోబర్ 2014, బుధవారం

నీటి జగడాలు, కరెంటు కయ్యాలు

(Published by 'SURYA" Telugu Daily in it Edit page on 30-10-2014, Thursday)

ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు, పొరుగు  దేశాలను  ఆక్రమించుకోవడం కోసమో, ముడి చమురు  వనరులపై పెత్తనం కోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ  ఒకే ఒక కారణం నీళ్ళు’.  నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు.
దాదాపు పదిహేడేళ్ళ క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు ఈ జోస్యం చెప్పారు. ఆయన వరల్డ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు భవిష్యత్తు గురించి వేసిన ఈ అంచనా అప్పట్లో ప్రపంచ రాజకీయ నాయకులను ఎంతగానో కలవర పరచింది. అదృష్టవశాత్తు ఇస్మాయిల్ గారి జోస్యం వెనువెంటనే నిజమవలేదు కానీ, కాలక్రమంలో  సాగు నీరు, తాగు నీటి  అవసరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దృష్ట్యా తలెత్తుతూ వచ్చిన నీటి  తగాదాలు మాత్రం  అనేక దేశాల నడుమ ఉద్రిక్తతల పెరుగుదలకు దోహదం చేసిన మాట వాస్తవం.
ఆసియా ఖండంలో ఇరిగేషన్ డాముల కింద నీరు పంచుకునే విషయంలో బోలెడు, బొచ్చెడు  తగాదాలు. భారత దేశం పాకిస్తాన్ నడుమ జలవిద్యుచ్చక్తి పంపిణీ విషయంలో ముదిరి పాకాన పడుతున్న వివాదాలు, మరోపక్క  చైనా, నేపాల్, బంగ్లాదేశ్ ల నడుమ నదీ జలాల చిక్కుముళ్ళు.
పోతే, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, కీర్గిజిస్తాన్ ల వ్యవహారం కూడా విభిన్నంగా లేదు. అముదారియా, సర్ దారియా నదులు, అలాగే నీటిమట్టం స్తాయి బాగా పడిపోతున్న అరల్ సీ విషయంలో ఈ దేశాల నడుమ సాగుతున్న నీటి పంచాయతీలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి కానీ ముగింపుకు రావడం లేదు.
ఇక, అర్జెంటీనా, ఉరుగ్వేలు - ప్లేట్ నదీ జలాలను పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాన్ని హేగ్ లోని అంతర్జాతీయ న్యాయ స్తానం వరకూ తీసుకువెళ్ళాయి. రియో గ్రాండే, కొలరాడో నదీ జలాలు గురించి అమెరికా, మెక్సికో లు జుట్లు పట్టుకుంటున్నాయి.           

తిగ్రిస్ నదిలో తన వాటా నీళ్ళను ఇక ముందు వాడుకోవడానికి వీల్లేదని ఇరాక్ సిరియాను డిమాండ్ చేసి ఎంతో కాలం కాలేదు. మధ్యప్రాత్యంలో పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాలు, ఇరాన్, ఇరాక్ దేశాలు టర్కీ డాం లనుంచి వచ్చే నీటి సరపరాల విషయంలో అవగాహన కుదరక తలలు పట్టుకుంటున్నాయి.
ఆఫ్రికాలో జమ్బెజీ నది ఉపనది అయిన చోబే నది, బోత్స్వానా, మొజాంబిక్ దేశాల నడుమ చిచ్చు రేపింది.
జీవనదులన్నా ఎండిపోతాయేమో కాని ఈ తగాదాలు, వివాదాలకు  మాత్రం ముగింపు  అంటూ వున్నట్టులేదు.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం వివిధ దేశాల నడుమ జలాల పంపిణీ జరిగే నదులు దాదాపు రెండు వందల యాభయ్ కి పైగా వున్నాయి. ఈ నదుల పరీవాహక ప్రాంతాన్ని లెక్క వేస్తే, అది ఈ భూగోళం ఉపరితలంలో సగానికి పైగా  వుంటుంది. అంతర్జాతీయంగా నదీ జలాల వివాదాలు వున్న దేశాలు మూడు వందలకు పైగా వున్నాయి కాని, వీటిల్లో సాయుధ సంఘర్షణలకు దారితీసే వివాదాలు చాలా తక్కువనే చెప్పాలి. గత శతాబ్ద కాలంలో నీళ్ళ కోసం జరిగిన యుద్ధాలు కేవలం ఏడు మాత్రమే లెక్క తేలాయి.
నీరే ప్రాణాధారమన్నారు శతకకారులు. సేద్యానికయినా, పరిశ్రమలకయినా, తాగడానికయినా నీళ్ళు అవసరం. నానాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని 2025 నాటికి  మానవాళి అవసరాలు తీర్చడానికి  ప్రపంచ వ్యాప్తంగా వున్న నదుల్లో పారే నీటిపై అపరితమయిన వొత్తిడి పెరగగలదని ఐక్యరాజ్య సమితి (ఐ.ఎన్.డి.పి.) అంచనా. ఈ నేపధ్యంలో నీళ్లపై హక్కులు, నీటి  కేటాయింపులు గురించిన ఉద్రిక్తతలు బాగా పెరిగే అవకాశం వుందని వరల్డ్ వాటర్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న కాలంలో ప్రపంచ రాజకీయాల్లో నీటి  తగాదాలు ప్రధానాంశంగా మారే వీలుందని అమెరికా రక్షణశాఖ హెచ్చరించింది. దేశాల నడుమ సరిహద్దు వివాదాల్లో నదీ జలాల పంపిణీ అంశం కీలకం కాగలదని పేర్కొన్నది. చాద్, సోమాలియా, యెమెన్ దేశాల మధ్య సంఘర్షణలకు నీటి తగాదాలకు సంబంధం వుందన్నది పెంటగాన్ అభిప్రాయం.                  
ఈ పంచాయతీలు కేవలం దేశాలకే పరిమితం కాలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నీటి వినియోగదారులు కూడా వీటికి అతీతం కాదన్నది జగమెరిగిన సత్యం. పొలాల్లో నీరు కావిడి తగాదాలు, వీధి కొళాయిల వద్ద ఆడంగుల  కొట్లాటలు పాత సినిమాలు చూసేవారందరికీ  అనుభవైకవేద్యం.

మన దేశంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య రగిలిన చిచ్చుకు కావేరి నదీ జలాలు కారణం. అలాగే, ఆంధ్ర, ఒడిశాల నడుమ వంశధార నదీ జలాల  వివాదం. ఇప్పుడు తాజాగా కొత్తగా పురుడుపోసుకున్న రాష్ట్రాలు - ఆంద్రప్రదేశ్, తెలంగాణాల నడుమ రాజుకుంటున్న కృష్ణా నదీ జలవివాదం.


ఇది రోజురోజుకూ కాదు పూటపూటకూ ముదిరి ఇరువైపులా మాటల యుద్ధాలకు దారితీస్తోంది. విడివిడిగా వీరిద్దరి వాదనలు విన్నవారికి వారు చెప్పేది సబబే అనిపిస్తుంది. ఎందుకంటె ఉభయ పక్షాలవాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రజల కోణం నుంచే మాట్లాడుతున్నారు. అది నిజమే కావచ్చు. కానీ ఇరుపక్కలా నష్టపోయేది కూడా ప్రజలే కదా. నిన్న మొన్నటి దాకా కలిసివున్నవారే కదా! ఇప్పుడు గీతలు గీసుకుని వ్యవహరించడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఇందులో రాజకీయ కోణం దాగుందని ఎవరయినా అనుకుంటే తప్పేమిటి?
ఆంద్ర ప్రదేశ్ లో తాగునీటికి నీళ్ళు కావాలని ఆ రాష్ట్రం వారు అడిగితే  తెలంగాణా వాదులకు కోపం. తెలంగాణలో ఎండిపోతున్న పంటలు కాపాడుకోవడానికి కరెంటు ఉత్పత్తికోసం  శ్రీశైలం నుంచి నీరు వొదిలితే  ఆంద్ర  నాయకులకు ఆగ్రహం.
కొందరికి నీళ్ళు  వెంటనే కావాలి. మరొకరికి అధ్యతన భవిష్యత్తులో పొంచి వున్న తాగునీటి, సాగునీటి అవసరాలు తీరాలి. నిజానికి  కాసింత సంయమనం, కాసింత సర్దుబాటు మనస్తత్వం వుంటే సరిచేసుకోలేని సమస్యేమీ కాదు. ఇరు పక్షాల వాళ్ళు, కొన్ని రోజులు మాటల యుద్ధాలకు విరామం ప్రకటించి, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం కుదరని జటిల విషయం కూడా కాదు. అంతేకానీ, 'అక్కడికి రా! ఇక్కడికి రా! నీ వాదం గొప్పదో, నా వాదం గొప్పదో తేల్చుకుందాం' అని పరస్పరం సవాళ్లు విసురుకోవడానికి ఇది సినిమా స్క్రిప్ట్ కాదుకదా! వాదం నెగ్గించుకోవడం కాదిక్కడ సమస్య. సమస్యను పరిష్కరించుకోవడం ఒక్కటే ఇప్పుడు కీలకం. అది పూర్తిగా పక్కకుపోయింది.        
పారే నీటికి ప్రాంతం లేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రంలో కలిసే నదులకు ఒక రాష్ట్రం అంటూ లేదు. ఆ నదులు పారే ప్రాంతాలవాళ్ళు ఆ నీళ్ళు మాకే హక్కుభుక్తం అని వాదించుకుంటారు.
వచ్చిన చిక్కల్లా అలా అనుకునే నీటితోనే. ఆ నీటిని తమ స్వార్ధానికి వాడుకునే మనుషులతోనే.
(29-10-2014)   

NOTE: Courtesy Image Owner

28, అక్టోబర్ 2014, మంగళవారం

పదును


పనికోసం వెళ్ళిన అతడికి యజమాని గొడ్డలి చేతికి ఇచ్చి చెట్ల మొద్దులు నరికే పని వొప్పచెప్పాడు. గిట్టుబాటు అయ్యే కూలీ కూడా బాగానే ఉండడంతో అతగాడు ఉత్సాహంగా మొదటి రోజునే ఇరవై మొద్దులు  నరికేసాడు. 'బాగా చేసావ్' అని యజమాని మెచ్చుకున్నాడు. ముందు చెప్పిన దానికన్నా ఎక్కువ కూలీ అతడి చేతిలో పెట్టాడు.
మరునాడు రెట్టించిన ఉత్శాహంతో అతడు ఎక్కువ మొద్దులు నరికి  కొట్టి యజమాని మెప్పుతో పాటు మరిన్ని డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. కానీ రోజల్లా కష్టపడ్డా పదిహేను మొద్దులే నరకగలిగాడు. మూడో రోజు పది మొద్దులు  కొట్టేసరికే ప్రాణాలు ఠావులు తప్పినంత పనయింది. ఆ సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది.  కారణం అంతుపట్టలేదు కానీ కంగారు పెరిగిపోయింది.


యజమాని దగ్గరకు వెళ్లి చెప్పుకున్నాడు, 'వొంట్లో సత్తువ తగ్గిపోతోంది, మునపటిలా పనిచేయలేని నిస్సత్తువ ఆవరిస్తోంది, కారణం అర్ధం కావడం లేదు' అని.
అంతా విని యజమాని ఒకే ఒక ప్రశ్న అడిగాడు, 'గొడ్డలికి పదును పెట్టి ఎన్నాళ్ళయిందని'
'పదును పెట్టడమా! అంత తీరిక ఏది ? పొద్దస్తమానం చెట్ల మానులు నరకడంతోనే సరిపోతోంది'
అతడే కాదు మనలో చాలామందిమి అదే చేస్తాం. గానుగెద్దులా పని చేయడం ఒక్కటే కాదు మధ్య మధ్య కాసింత విశ్రాంతి తీసుకుంటూ వుండాలి. 'చేసే పనిని  మరింత బాగా ఎలా చేయొచ్చు' అని ఆలొచిస్తూ వుండాలి. వీలయితే కాస్త ధ్యానం, యోగం చేస్తూ వుండాలి.  స్టీఫెన్ కోవే అన్నట్టు, 'పదును' పెట్టే తీరిక చేసుకోలేకపోతే, చెట్లు కొట్టేవాడి కధలో మాదిరి  మనలో నిస్సత్తువ పెరిగిపోతుంది. పనిలో పాటవం తగ్గిపోతుంది.
(ఒక ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)

NOTE: Courtesy Image Owner 

27, అక్టోబర్ 2014, సోమవారం

మారథాన్



నడుస్తూనే వున్నాను
గత అరవై ఎనిమిదేళ్ళుగా
వాగులు  వంకలు దాటుకుంటూ
దారులు డొంకలు వెతుక్కుంటూ 
నడుస్తూనే వున్నాను 
కొన్ని చోట్ల నా దారి రహదారి
పలు చోట్ల దారంతా వరద గోదారి
ముళ్ళకంపలు చీకు మొక్కలు
గుంటలు, గతుకులు
పడుతూ లేస్తూ
నడుస్తూ వస్తుంటే అదోరకం   ఆనందం
అలా నడుస్తూ పోతుంటే ఇంకోరకం విషాదం 
ఈ నడక ఎన్నాళ్ళో తెలియదు
పరుగులాంటి నడకకు చివరి మజిలీ ఏదో  తెలుసు
కానీ చేరేదేప్పుడో మాత్రం  తెలవదు
అయితే ఈ నడకలో నేను వొంటరిని కాను
నాతోపాటు కోటానుకోట్లమంది భుజం భుజం కలిపి నడుస్తూనే వున్నారు
వారిలో కొందరే తెలుసు కొందరసలే తెలియదు
చాలా మంది ఎవ్వరో తెలియదు కానీ కలిసి నడవక తప్పదు
కొందరి భాష తెలుసు మరికొందరి యాస తెలుసు
చాలామంది ఊసే తెలవదు
నడిచి నడిచి ఒక్కోసారి అలసట అనిపిస్తుంది.
కానీ ఆగే పని లేదు,  ఆగడం మన చేతిలో లేదు
ఆగితే మాత్రం ఆగినట్టే
ఇక అక్కడితో నడక ఆగినట్టే
అదే ఆఖరి అడుగు
అదే చివరి మజిలీ 
కలిసి నడుస్తున్న వాళ్ళు లిప్తపాటు ఆగి చూస్తారు
అంతే!
మళ్ళీ నడక మొదలెడతారు.
నన్ను దాటుకుంటూ ముందుకెడతారు
నేను అక్కడే ఆగిపోతాను  
అయినా ఈ జీవన యానం అంతటితో  ముగిసేది కాదు 
ముగిసినట్టు అనిపించినా నిజానికి అది ముగింపు కాదు
మరో ప్రయాణానికి కొనసాగింపు.   

(27-10-2014)

NOTE: Courtesy Image Owner 

26, అక్టోబర్ 2014, ఆదివారం

తెగీ తెగని ఆలోచనలు


(The following is the translation of my younger son Santosh Bhandaru's  stray thoughts)
 

అపోలో ఆసుపత్రిలో డాక్టర్ భార్గవని కలవడం కోసం ఎదురుచూస్తున్నాను. మా అమ్మని చూపించడంకోసం గత ఆరేడు నెలలుగా నాకిది అలవాటయిపోయింది. పోయిన ప్రతిసారీ నాకక్కడ రకరకాల మనుషులు తారసపడుతున్నారు. వెయిట్ చేసే టైం పెరిగిపోతున్నకొద్దీ నేను గమనిస్తున్న వ్యక్తుల సంఖ్యకూడా క్రమంగా పెరిగిపోతూ వస్తోంది. వాళ్ళని చూస్తుంటే నాకు మొత్తం ప్రపంచంలోని వ్యక్తులనందర్నీ  అరచేతిలో ఉంచుకుని గమనిస్తున్న భావన కలిగేది.
వారిలో కొందర్ని చూడగానే స్తితిమంతులని తెలిసిపోయేది. వారి మాటలో, నడకలో, చూపులో అది కొట్టవచ్చినట్టు కనబడేది.   ఆడి, బీఎండబ్ల్యు, మెర్సిడెజ్ వంటి  ఖరీదయిన వాహనాల్లో ఆసుపత్రికి వచ్చాము సుమా అనే  అభిప్రాయం అవతలవాళ్ళకు కలిగేలా వారి ప్రవర్తన వుండేది. డాక్టర్ గారి అసిస్టెంట్ తో మాట్లాడేటప్పుడు ఇది మరీ కొట్టవచ్చినట్టు కనబడేది. ఇటీవలి కాలంలో ఈ మోస్తరు జనం మనకు మాల్స్ లో, సినిమాహాల్స్ లో, రెస్టారెంట్లలో మనకు కనబడుతూనే వున్నారు.
పొతే మరో రకం వాళ్ళున్నారు. వాళ్ళ మొహం చూస్తూనే చెప్పొచ్చు వాళ్ళు ఎంతో బాధలో వున్నారని. మొదటి రకం వారికంటే భగవంతుడు వీరిని కాసింత చిన్న చూపు చూసివుండవచ్చునేమో కానీ వీళ్ళూ డబ్బుకు అంతగా కటకట పడేవాళ్ళు కాదు. కానీ వీరి బాధకు రెండు కారణాలు. ఒకటి తాము అమితంగా ప్రేమిస్తున్న కుటుంబసభ్యుల అనారోగ్యం గురించిన కలత ఒక కారణం అయితే, పెరిగిపోతున్న ఆసుపత్రి ఖర్చుల గురించిన బెంగ మరో కారణం. వీటిల్లో ఏది ఎక్కువ వారిని చింతకు గురిచేస్తున్నదీ చెప్పడం కష్టం.
ఇక మూడో రకం. వీరు సమాజంలో కింది స్థాయికి చెందిన వాళ్ళు. అయితే వారికి ఒక విషయంలో మాత్రం స్పష్టమైన అవగాహన  వుంది, అదేమిటంటే ఇలాటి ఆసుపత్రిలో వైద్యం అంటే మాటలు కాదు, జేబు  పేలిపోయే బిల్లు చేతిలో పెడతారని వారికి తెలుసు. కానీ విచిత్రం ఏమిటంటే వారిని కలత పెట్టాల్సిన ఇలాటి విషయం వారికి చీమకుట్టినట్టు కూడా అనిపించకపోవడం. వారి సమస్య అల్లా ఇంత పెద్ద ఆసుపత్రిలో అయినా సరైన వైద్యం దొరుకుతుందా లేదా అనే.
కూర్చుని చూసే నాకు ఇన్ని రకాల మనుషుల్లో ఉన్న వైవిధ్యం అర్ధం అవుతూనే వుంది. కొందరు తమ ఆధిక్యత ప్రదర్శిస్తారు. కొందరు సాటి వారిపట్ల నిర్లిప్తంగా వ్యవహరిస్తారు. చుట్టు పక్కల వారినీ, చుట్టుపక్కల అసలేం  జరుగుతున్నదో అనే  విషయాలను మరి కొందరు అసలు పట్టించుకోకుండానే  గడిపేస్తారు.    అయితే అర్ధం కానిదల్లా ఒక్కటే. అదేమిటో చిత్రం బయట తమ స్థాయీ బేధాలను, భేషజాలను  ఇంతగా ప్రదర్శించే మనుషులు, డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రం పూర్తిగా మారిపోతారు. కొత్త వ్యక్తుల్లా కనబడతారు. వారి మాటలో మార్దవం తొణికిసలాడుతుంది. వాళ్ళ నడకలో హుందాతనం గోచరిస్తుంది. వాళ్ళ పలకరింపులో మర్యాద, వాళ్ళ మోహంలో మందహాసం. ఒక్కసారిగా ఇలా మారిపోగలిగిన ఈ  మనుషులు, ఇలా మారగలిగిన శక్తి కలిగి వుండీ ఎందుకు  అదే మాదిరిగా  జీవించ లేకపొతున్నారు. సాటి వారిపట్ల అదేరకమైన  గౌరవ ప్రపత్తులను ప్రదర్శించలేకపోతున్నారు. తోటివారిపట్ల  మనుషుల ప్రవర్తనలో ఎందుకిన్ని తేడాలు కనిపిస్తున్నాయి?

తెలుసుకోవడానికే ఇన్నాళ్ళు పట్టింది, తెలియడానికి ఎన్నేళ్ళు పడుతుందో?


NOTE: Courtesy Image Owner

25, అక్టోబర్ 2014, శనివారం

ప్రపంచాన్ని వణికిస్తున్న 'ఎబోలా' ముప్పు

(Published by 'SURYA' Telugu Daily in its Edit Page on 26-10-2014, SUNDAY)
ప్రపంచ జనాభాలో అత్యధికులను  ఓ మూడక్షరాల పదం వణికిస్తోంది. 'ఎబోలా' అనే వ్యాధి ఛాపకింది నీరులా వ్యాపిస్తోందని ఏకంగా ప్రపంచ  ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించిందంటే పొంచివున్న పెను ముప్పు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఎబోలా అనే పేరు గల వ్యాధి ఒకటి  వుందని కొన్నేళ్ళ ముందువరకు అనేక దేశాలకు తెలియనే తెలియదు. ఇది సాధారణ వ్యాధి కాదనీ, చాలా ప్రమాదకరమైనదనీ, ప్రాణాంతకమైనదనీ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో గడగడలాడించిన స్వైన్ ఫ్లూ వ్యాధి గాలి ద్వారా వ్యాపించేది. అయితే ఎబోలా వైరస్  అంతకంటే చురుగ్గా త్వరగా పాకిపోతుంది.  ఈ వ్యాధి  యెంత త్వరగా తేలిగ్గా వ్యాపిస్తుందంటే, ఎబోలా రోగిని తాకినా, లేదా ఆ రోగి చెమట చుక్క ఇతరులపై చిందినాకూడా  వారికి ఈ వ్యాధి వైరస్  సోకుతుంది.  ఇప్పటికే పశ్చిమాఫ్రికా దేశాల్లో వేలాదిమంది ఈ వ్యాధి కారణంగా అసువులుబాశారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా దేశాలను కూడా ఈ వ్యాధి విడిచిపెట్టలేదు. ఆ దేశాలలోని వైద్యనిపుణులకు ఎబోలా పెను సవాలుగా మారుతూ,  అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా వ్యవహరించని కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీస్ వాపోవాదం గమనార్హం. ఆ దేశంలో ఎబోలా బారిన పడి రెండువేలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ తరువాత జాగ్రత్తపడి తీసుకున్న చర్యల కారణంగా ఎబోలా బాధితుల సంఖ్య పెరగకుండా అడ్డుకట్ట వేయగలిగామని ఆమె అన్నారు. తమ దేశ ఆర్ధిక వ్యవస్థను సైతం ఈ వ్యాధి అతలాకుతలం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఎబోలా వ్యాధికి అడ్డుకట్ట వేయడం చిన్న చిన్న దేశాలకు అలవి కాని పని అనీ, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి  సహకారం అవసరమని సర్లీస్ చెప్పిన మాటలు మిగిలిన దేశాలకు ఒక హెచ్చరిక లాంటివి.  
ఆ దేశాల పరిస్తితి ఈ విధంగా వుంటే, ప్రజారోగ్యం విషయం అంతగా పట్టించుకోవన్న పేరుపడిన  ఆసియా దేశాలు, పొంచివున్న ఈ పెను ముప్పును ఎలా తప్పించుకోగలుగుతాయి అన్నది సమాధానం దొరకని ప్రశ్న. ఈ వ్యాధి కేవలం పశ్చిమాఫ్రికా దేశాలకు పరిమితమై వున్నప్పుడు పరిస్తితి వేరు. భారతీయులు అత్యధిక సంఖ్యలో నివసిస్తూ అనునిత్యం రాకపోకలు సాగిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలల్లో కూడా ఎబోలా జాడలు బయటపడుతున్న తరుణంలో ఇక ప్రమత్తంగా వుండడం ఏమాత్రం మంచిది కాదు  అన్న భావన క్రమంగా ప్రబలుతోంది. భారత దేశంలోని మీడియా కూడా ఈ విషయంలో తన బాధ్యతను గుర్తెరిగి ఎబోలా ఎంతటి ప్రాణాంతకమైనదో సవివరంగా ప్రజలకు తెలియచెప్పే  కర్తవ్యాన్ని నెత్తికెత్తుకున్నాయి. ఒక రకంగా ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన ఈ రకం విధులలో పత్రికలు, మీడియా కూడా పాలుపంచుకోవడం ముదావహం.
ఎబోలా అనేది కొత్త వ్యాధి. ఈ వ్యాధి వైరస్  ఎలా వ్యాపిస్తుందో కనుక్కోగలిగారు కాని దీన్ని అరికట్టే వాక్సిన్ కానీ ఔషధాలను కానీ ఇంతవరకు కనుగొనలేదు. కేవలం రోగిని తాకడం ద్వారా వ్యాపించే  గుణం ఉండడంతో ఈ వ్యాధికి చికిత్స చేయగల వైద్య సిబ్బంది కూడా కరువవుతున్నారు. ప్రస్తుతం  పశ్చిమాఫ్రికా దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. రోగ లక్షాలను తెలుసుకుని రోగిని గుర్తించడం ఒక  సమస్య అయితే,  ఆ రోగికి వైద్య సహాయం అందించే సిబ్బందిని వెతికి పట్టుకోవడం మరో సమస్య. అయితే ఈ సమస్యకు  సమర్ధవంతమైన పరిష్కారం కనుగొన్న  దేశం ఒకటి వుంది. ఎబోలా అనే ఈ మూడక్షరాల మహమ్మారికి క్యూబా అనే రెండక్షరాల దేశం ముకుతాడు వేసే పనికి పూనుకుంది. ఇంకో విశేషం ఏమిటంటే ఆ వ్యాధి ఇంతవరకు ఆ దేశంలో పొడసూపలేదు.  ఈ వ్యాధి పొటమరించిన ఆఫ్రికా ఖండానికి కొన్ని వేల మైళ్ళ ఆవల వున్న దేశం అయినప్పటికీ, క్యూబా తన బాధ్యతగా  ఎబోలా వ్యాధి పీడిత దేశాలకు అండగా నిలిచింది. ఈ విషయంలో క్యూబా నిర్వర్తిస్తున్న పాత్ర అనితర సాధ్యం. ఈ కితాబు ఇచ్చింది ఎవరో కాదు. క్యూబా పొడకూడా గిట్టని  అమెరికాలోని ప్రధాన వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్. ఈ పత్రిక  ఈ మధ్య ఏకంగా క్యూబా కృషి గురించిన ఓ సవివర వార్తా కధనాన్ని ప్రచురించింది. నిజానికి అమెరికా ఈ వ్యాధి నివారణ చర్యల విషయంలో ముందంజ వేయకపోయినప్పటికీ, ఆ అమెరికా పత్రిక కధనంతోనే ఈ వ్యాధిపట్ల అవగాహన పెంపొందించుకోవడానికీ,  ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయంలో మిగిలిన దేశాలకు ఒక మార్గం దొరికినట్టయింది. మిగిలిన దేశాలన్నీ వ్యాధి పట్ల గుండెలు బాదుకుంటూ, చేతులుకట్టుకుని కూర్చుంటే క్యూబా మాత్రం తనవంతు సాయంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బందిని ఈ వ్యాధి పీడిత దేశాలకు సాయంగా పంపింది. వాస్తవానికి ఈ వ్యాధి వేలాదిమందికి సోకినా వారిలో అధిక సంఖ్యాకులు రోగులకు వైద్యసాయం అందించిన సిబ్బందీ డాక్టర్లే కావడం విశేషం. చికిత్స అందించేవారే రోగం బారిన పడుతూ ఉండడంతో సాయం అందించేవారి కొరత ప్రధాన సమస్యగా మారింది. క్యూబా ఈ విషయంలో గణనీయమైన సేవా పాత్ర పోషించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక శ్లాఘించింది. పశ్చిమాఫ్రికా  దేశాలు ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన  క్యూబా తక్షణం స్పందించి తన వైద్య బృందాలను, అవసరమైన మందులను హుటాహుటిన ఆదేశాలకు తరలించింది. సొంత దేశంలోని వైద్యులే సాయం చేయడానికి తటపటాయిస్తున్న తరుణంలో క్యూబా అందిస్తున్న  ఈ ఆపన్న హస్తం ఆ దేశాలకు వరప్రసాదంగా మారింది.  రోగులకు చికిత్స  అందిస్తూ వైరస్ సోకిన వారిలో క్యూబన్ వైద్య సహాయక బృంద సభ్యులు కూడా వున్నారు. అయినా వారు వెరవకుండా సహాయక చర్యల్లో పాల్గొనడం ఆ దేశాలవారిని నివ్వెరపరుస్తోంది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి  వెళ్ళింది. దానితో  ఎబోలా  వ్యాధిని అరికట్టే విషయంలో ఏం చేయాలనే దానిపై ఆ సంస్థ క్యూబన్ వైద్య నిపుణుల  సాయం కోరాల్సిన పరిస్తితి ఏర్పడింది.                                  
ఈ క్యూబా కధనం అలా ఉంచితే, మన దేశంలో పరిస్తితి వేరేగా వుంది. 'సమస్య ఎదురయినప్పుడు చూసుకుందాం, ఇప్పటినుంచీ ఎందుకు లాయిలాసా' అనేవాళ్ళు ఎక్కువున్న దేశం కాబట్టి ఎబోలా  గురించి ఆందోళన పడేవాళ్ళు తక్కువనే చెప్పాలి. అయినా కొన్ని పత్రికలు పట్టించుకుని ప్రచురిస్తున్న కధనాలు కొంత కదలిక తెచ్చాయనే అనుకోవాలి.
ఎబోలా అనేది ప్రాణాంతక వ్యాధి అని ముందే చెప్పుకున్నాం. రక్తం, చెమట, లాలాజలం ద్వారా ఆ వైరస్ త్వరితగతిన ఇతరులకు సోకుతుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట, కీళ్ళ నొప్పులు,  కడుపు నొప్పి, ఆకలి మందగించడం ఈ వ్యాధి లక్షణాలు. అయితే ఇవన్నీ షరా మామూలుగా  జనాలకు అలవాటయినవే. ఈ లక్షణాలు  వుంటే వారికి ఈ వ్యాధి సోకినట్టుగా కంగారు పడనక్కరలేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యుల సలహా. చేతులు శుభ్రంగా సబ్బుతో  కడుక్కోవాలి. పరిసరాల్ని పరిశుభ్రంగా వుంచుకోవాలనీ, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనీ వాళ్ళు చెబుతున్నారు. ఇవన్నీ మామూలుగా చెప్పే విషయాలే కావడంవల్ల జనం అంతగా  పట్టించుకునే అవకాశాలు కూడా వుండవు. కాకపోతే ఈ వ్యాధి తీవ్రత పట్ల అవగాహన పెంచడం అవసరం. ఎందుకంటె ఒకసారి ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయితే ఇక ఆ రోగి మరణానికి చేరువ అయినట్టే అన్నది వైద్యులు చేసే హెచ్చరిక. చెవులు, ముక్కు, దేహంలోని ఇతర బాహ్య రంధ్రాల ద్వారా అపరిమితమైన  రక్తస్రావం జరిగి  రోగి, కొన్ని వారాల్లోనే ప్రాణాలు కోల్పోతాడు అనేది వాళ్ళు చెప్పే మరో బహుపరాక్. బయట తిండ్లు మానుకోవడం లేదా తగ్గించడం  మంచిదని వారిచ్చే ఇంకో సలహా.  
ఇటీవల ఢిల్లీలో ఎబోలా వ్యాధి గురించి ఓ అవగాహనా గోష్టి నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రవేటు డాక్టర్లు  కూడా దీనికి హాజయ్యారు. భారతదేశం వంటి సువిశాల దేశంలో, జనసాంద్రత ఎక్కువ వున్న దేశంలో ఎలోబా వంటి వ్యాధుల లక్షణాలను రోగుల్లో ఖచ్చితంగా గుర్తుపట్టి, వారిని మిగిలిన రోగులనుంచీ, జనాలనుంచీ వేరుచేసి విడిగా వైద్యం  పరిస్తితులు పరిమితంగా వుంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సంయుక్తంగా, కలసికట్టుగా, ఎంతో సమన్వయంతో, కార్య దీక్షతో, మినుమిక్కిలి   నిబద్ధతతతో - నిర్విరామ కృషి చేయగలిగితే కొంత మేరకు ఫలితం ఉండొచ్చు.అయితే,  క్యూబా డాక్టర్లను ఆదర్శంగా తీసుకుని వైద్యం చేసే సిబ్బంది మన దేశంలో చాలా అరుదన్నది  చాలామంది అభిప్రాయం.
ఎబోలా వ్యాధిని ఎదుర్కునే కృషిలో మొదటి, చివరి అవరోధం ఇదొక్కటే.
(25-10-2014)


24, అక్టోబర్ 2014, శుక్రవారం

ఛ ఛ ....


'ఛ ఛ ....అలా అనకుండా వుండాల్సింది' అన్నాడు రామా రావు
వచ్చిన పావు గంటలో  అతడలా అనడం నాలుగోసారి. అనకుండా వుండాల్సింది అంటాడే కాని అన్నది ఏమిటో చెప్పడు. బహుశా తలచుకోవడానికి కూడా మనస్తాపం  కలిగించే విషయమేమో. అందుకే నేనూ  'విషయం ఏమిటీ' అని రెట్టించి అడగలేదు.
కాసేపయిన తరువాత కాస్త కుదుటపడ్డాడేమో గొంతు సవరించుకుని చెప్పడం మొదలెట్టాడు.


'మన సుబ్బారావు లేడూ, ఓహో నీకు తెలవదు కదూ, నేనీ వూరు వచ్చిన కొత్తలో పరిచయం అయ్యాడు. ఇట్టే కలిసిపోయే రకం. ఇద్దరికీ సంబంధం లేని ఓ పనికిరాని వెషయం మీద మొన్నోరోజు  మాటా మాటా అనుకున్నాం. నిజానికి నాదే తప్పు. కానీ నా మాటే నెగ్గాలనే పంతంలో  నోటికి వచ్చినట్టు ఒక మాటకు పది అనేసాను. పాపం చిన్నబుచ్చుకుని మొహం ఇంత చేసుకుని వెళ్ళాడు. అతడు వెళ్ళిన తరువాత నాకనిపించింది, అతడివాదనలో తప్పేమీ లేదని. అనవసరంగా అతడి మనసుని  కష్టపెట్టానని అనిపించింది. అతడింటికి  వెళ్ళి 'సారీ!  తప్పు నాదే. ఏమనుకోకు, క్షమించు'  అని చెప్పాలని కూడా అనిపించింది. కానీ పోలేదు. ఇప్పుడు పోవాలన్నా పోలేను'
'ఏమిటి ఎందుకని'
'ఎందుకంటే  మేము మాటా మాటా అనుకున్న  రాత్రే గుండెపోటు వచ్చిపోయాడు. మర్నాడు సుబ్బారావు కొడుకు ఫోను చేసి  చెప్పాడు"

'ఛ ఛా....' అనుకున్నాడు రామారావు మరోసారి.
NOTE: Courtesy Image Owner 

22, అక్టోబర్ 2014, బుధవారం

ఆకాంక్ష



మీ గృహ ప్రాంగణంలో
మీ హృదయాంగణంలో
దీపావళి దివ్య కాంతులు
వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ -

- నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు