18, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఆ మూడు పత్రికలు


ఆ మూడు పత్రికలను నేను కొని చదువుతాను. గత కొన్ని దశాబ్దాలుగా నాకిది అలవాటు. ఇదే రంగంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న నాకు - ఈరోజు ఒకే వార్తను ఈ పత్రికలు ప్రచురించిన తీరు చూసిన తరువాత ఉదయం లేవగానే అనూచానంగా చేసుకున్న పత్రికాపఠనానికి ఇక స్వస్తి చెప్పటం మంచిదా అనే ఆలోచన కలిగింది. డెబ్బయ్యవ దశకం మొదట్లో నార్ల గారి సంపాదకత్వంలో వెలువడిన నాటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉపసంపాదకుడుగా చేరినప్పుడు గొప్ప వృత్తిలో ప్రవేశిస్తున్నాను అన్న ఆనందంతో వొళ్ళు పులకరించిన మాట వాస్తవం. మరి ఇన్నేళ్ళ తరువాత పత్రికలే చదవకూడదు అన్న నిర్వేదంలోకి యెందుకు జారిపోతున్నట్టు.
సరే! అసలు విషయానికి వద్దాం.
నామినేషన్ల సందర్భంగా అభ్యర్ధులు తమ ఆస్తులు అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్లు సమర్పించడం ఒక నిబంధన. వాటిని ప్రజలకు తెలియచెప్పడం పత్రికల బాధ్యత.  ఈ క్రమంలో శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ జగన్ మోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ల వివరాలను అన్ని పత్రికలు ప్రచురించాయి. కానీ ఈ మూడు పత్రికలు వాటికి తమదైన రీతిలో వ్యాఖ్యానాలను కూడా జతపరిచాయి. ఆ పత్రికలకు ఈనాటి పరిస్థితుల్లో అలాటి సమాచారం ప్రచురించడం ఒక అనివార్యత కావచ్చు. కానీ నా కెందుకో వార్త రూపంలో ఆ పత్రికలు తమ మనసులోని మాటని చెప్పే ప్రయత్నం చేసాయని అనిపించింది.
ఈరోజు తాపీగా ఇంట్లో కూర్చుని నీతులు చెబుతున్నానని అనిపించవచ్చు  కానీ ఎందుకో ఏమిటో నాకది  సబబుగా అనిపించలేదు.

యేమో! నేను కూడా ఏదయినా పత్రికలో పనిచేస్తూ వున్నట్టయితే  ఆ వాలువేగంలో నేనూ కొట్టుకుపోతూ వుండేవాడినేమో! ఎవరికి ఎరుక?            

16, ఏప్రిల్ 2014, బుధవారం

గాలి వార్త


ఇలా అంటున్నారు అలా అనుకుంటున్నారు అని గాలి పోగుచేసి వార్త వండడం ఏరకంగా చూసినా పాత్రికేయ విలువలకు తగినది కాదు. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా ఈ వృత్తిలో వుంటున్న నాకు ఈ విషయం తెలవంది కాదు. కానీ ఛానల్స్ లో చర్చలకు వెళ్ళినప్పుడు బ్రేక్ సమయంలో ఆయా పార్టీల నాయకులు మాట్లాడుకునే విషయాలు చెవినపడుతుంటాయి. సాధారణంగా ఒక చెవితో  విని రెండో చెవితో వొదిలేయాల్సినవే. నిజమెంతో అబద్ధమెంతో తెలవని విధంగా, నిర్ధారించడానికి ఆధారాలు లేకుండా సాగుతాయి ఈ వూహాగానాలు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పెట్టే ఖర్చు గురించి అంతా కాకపోయినా కొంతలో కొంతయినా పేపర్లలో వస్తూనే వుంటాయి వివరాలు. ఇప్పుడు మరోరకం పెట్టుబడి వ్యయం గురించి చెప్పాడొకాయన.
"ఇన్నాళ్ళుగా కోట్లు ఖర్చు చేసి  నియోజకవర్గాన్ని  సాక్కుంటూ వచ్చాను. ఇప్పుడు టిక్కెట్టు లేదంటే యెట్లా" అని గొడవ పెట్టుకునే వార్తలు వింటూనే వున్నాం. "ఇదేమన్నా వ్యాపారమా ఇలా ముందస్తు పెట్టుబడులు పెట్టి లాభాలు ఆశించడానికి" అని సామాన్యులు అనుకున్నా వారిని లక్ష్యపెట్టేవాళ్ళు వుండరు. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా అలాటిదే.

"పొత్తుల్లో సీటు పోయిన ఒకాయన, సీటు దక్కించుకున్న శాల్తీని నువ్వెలా గెలుస్తావో చూస్తాను. ఇండిపెండెంటుగా వేసి నీ అంతు  చూస్తాను" అని పత్రికలకు ఎక్కాడట. "ఇదేమిటి మీ వాడు ఇలా బెదిరిస్తున్నాడు అని అవతల పార్టీ అభ్యర్ధి ఇవతల పార్టీ నాయకుడ్ని ఆశ్రయిస్తే,  'ఏదో సర్దుబాటు చేసుకోవాలి. ఖర్చు అయిందంటున్నాడు కదా ఆ విషయం ఏదో మీరూ మీరూ చూసుకోండి'అని సలహా చెప్పాడట. సర్దుబాటు చేసుకున్నారు  అంటే  కోట్లు చేతులు మారినట్టే అనుకోవాలి. ఇలాటివాళ్ళు  కూడా వుంటారా అంటే వుంటారేమో రాజకీయం అన్నది ఇంత ధనమయం అయినప్పుడు.      

ప్రముఖ అందాల సినీ తార ఇలా చెబుతున్నారు

వార్త :
"పలానా చోట ఒక పార్టీ అభ్యర్దినీ, మరో చోట మరో పార్టీ అభ్యర్దినీ, ఇంకో చోట ఇంకో పార్టీ అభ్యర్దినీ బలపరుస్తాను" టీవీ స్క్రోలింగుల్లో  సినీ నటుడు పవన్ కళ్యాణ్


వ్యాఖ్య :  
ప్రముఖ అందాల సినీ తార ఇలా చెబుతున్నారు
"నేను నా ముఖ సౌందర్యం కోసం లక్స్  టాయిలెట్ సబ్బుని వాడతాను.
"హస్త లావణ్యం కోసం హమామ్ సబ్బుని వాడతాను.
"పాద సౌకుమార్యం కోసం మార్గో సబ్బుని వాడతాను
"మీరూ నాలాగే రకరకాల సబ్బులని రోజూ వాడి చూడండి"  

ఎప్పుడూ ఇంతే!


"మీరేమో ఇలా కంప్యూటర్ దగ్గర కూర్చుని వోటు వెయ్యండి, అది మీ జన్మహక్కు అంటూ మెసేజిలు పెట్టుకుంటూ కూర్చున్నారు. అవతల పుణ్యకాలం దాటిపోయి  పోలింగు టైం కూడా అయిపోయి కూర్చుంది"


(NOTE:COURTESY IMAGE OWNER)

15, ఏప్రిల్ 2014, మంగళవారం

పరిపూర్ణానంద స్వామి అమెరికా పర్యటన




సంస్కృతి సంప్రదాయాలకు కొత్త  భాష్యం చెబుతూ తన అద్భుత ప్రవచనాలతో, కార్యక్రమాలతో యువతీ యువకులను సయితం ఆధ్యాత్మికత వైపు ఆకర్షిస్తున్న శ్రీ పరిపూర్ణానంద స్వామి రేపు ఉదయం బయలుదేరి మూడు మాసాల పర్యటనపై అమెరికా వెడుతున్నారు. రేడియోలో, దూరదర్శన్ లో నా సీనియర్ సహచరులు శ్రీ ఆర్ వీ వీ కృష్ణారావు గారు స్వామి వెంట ఈ విదేశీ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్స్ లో ఈ సాయంత్రం స్వామీజీకి వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు శ్రీ కృష్ణారావు గారు తెలియచేశారు. శ్రీ పీఠం తరపున నిర్మించిన టెలీ సీరియల్ 'గోమాత' ప్రీవ్యూ కూడా వుంటుంది.        

నవ్వో నవ్వకనో వొదిలేయండి!


ఇది కధ కాదు కానీ మొన్నీమధ్య ఓ ఫంక్షన్లో కలిసిన ఓ పెద్దమనిషి చెప్పిన కధ ఇది.
ఆ పెద్దమనిషి గారింటికి ఈ నడుమ ఏదో దేశం నుంచి అక్కడ ఏనాడో సెటిలై పోయిన  మరో తెలుగు పెద్ద మనిషి గారు వచ్చారట. మొదటి రోజు నిద్రలేచేసరికి బయట ఆరుబయట పత్రికలు చదువుతూ కనబడ్డారట. రెండో రోజు ఆయన ధోరణిలో  మార్పు మొదలై మూడో రోజుకల్లా అది విపరీత ప్రవర్తనకింద మారిపోయిందట. ఎందుకిలా అయ్యిందని ఇంటాయన భయపడిపోతుంటే ఇల్లాలు కల్పించుకుని చెప్పిందట.



'నేను మొదట్లోనే చెబుదామనుకున్నాను. ఒకదానితో ఒకటి పొంతనలేని అన్ని తెలుగు పేపర్లు ముందు పడేస్తే ఇలాగే ఏదో అవుతుందని. మనమంటే అలవాటుపడి ముదిరిపోయాము.  కానీ, దేశం కాని దేశం నుంచి వచ్చిన ఈ పెద్దమనిషి ఏం హరాయించుకుంటాడో ఏవిటో అని. నేను  భయపడ్డంతా అయింది. ముందా పేపర్లు తీసి బయట పడేయండి. ఆయనే సర్డుకుంటాడు'     

మరవతగని మనిషి మరుపున పడుతున్నాడా!



యాభయ్ ఐదేళ్ల  పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో గాంధీనగరం మునిసిపల్ స్కూలు ఆవరణలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని వాజ్ పాయ్.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సర్వేలు, రాజకీయ విశ్లేషకులు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపు తధ్యం అని కోడై కూస్తున్న సమయంలో ఒకనాడు అ పార్టీకి పెద్దదిక్కు అయిన వాజ్ పాయ్ ఇప్పుడు ఎక్కడ వున్నారు, యెలా వున్నారు అన్నది జనంలో చాలామందికి తెలియని విషయం.  తెలుసుకుంటే మరింత బాధ కలిగించే ఈ సంగతులను గత నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించింది. ఆ కధనాన్ని సంక్షిప్తం చేస్తే:
ఢిల్లీ లోని అశోకా రోడ్డులో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వుంది. ఎప్పుడూ నాయకులు, కార్యకర్తలతో సందడిగా వుండే ఆ ప్రదేశానికి అయిదే అయిదు నిమిషాల నడక దూరంలో కృష్ణ మీనన్ మార్గ్ లోని ఓ  బంగ్లా  ఎస్పీజీ కాపలాలో కానవస్తుంది. అందులోకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. బయటకు వచ్చేవాళ్ళు అంతే. నీరవ నిశ్శబ్ధం తాండవించే ఆ భవనంలో చక్రాల కుర్చీలో కూర్చుని ఒక వృద్ధుడు టీవీలో వార్తలు చూస్తూ, పత్రికల్లో ప్రధాన శీర్షికలు చదువుతూ కానవస్తారు. తన వాగ్దాటితో ప్రత్యర్ధులను ఆకట్టుకున్న ఒకనాటి నేత వాజ్ పాయ్ ఆయనే అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే.
ఆయన ఏదో కష్ట జీవితం గడుపుతున్నారని కాదు కానీ ఆయన  ప్రస్తుత జీవన శైలి గమనించినప్పుడు ఎవరికయినా మనసు కష్టపడుతుంది.



వాజ్ పాయ్ కవితలు రాస్తారు. వాటిని వినడానికి ఒకప్పుడు పార్టీ నాయకులు ఎగబడేవారు. ఇప్పుడు ఆ ఇంటి గడప తొక్కేవారే కరువయ్యారు. క్రమం తప్పకుండా వచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు వాజ్  పాయ్ కి అరవై ఏళ్ళుగా తెలిసిన ఎన్ ఎం గటాతే కాగా మరొకరు బీజేపీ మూలస్థంభాల్లో ఒకరయిన ఎల్ కే అద్వానీ.   పార్టీ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన బీ సీ ఖండూరీ కూడా అప్పుడప్పుడు వచ్చి వాజ్ పాయ్ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తెను అడిగి తెలుసుకుంటూ వుంటారు. పోతే, మాజీ ప్రధాని జన్మదినాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి వెళ్ళే వ్యక్తి మరొకరు వున్నారు. ఆయనే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.
వారానికి ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్ళే ఆయన స్నేహితుడు గటాతే  చెప్పేదాని  ప్రకారం ప్రస్తుతం వాజ్ పాయ్ రోజువారీ దినచర్యలో  ఎక్కువ సమయం ఫిజియో తెరపిష్టులతో గడిచిపోతుంది. మాట సరిగా రాకపోవడం వల్ల సంభాషణల్లో పాలుపంచుకోలేరు. పత్రికలు చదవరు కానీ హెడ్ లైన్స్ తిరగేస్తారు.
భాష అర్ధం కాని  వారిని సయితం  తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.

(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)