1, ఏప్రిల్ 2014, మంగళవారం

జై జగన్ ! నై జగన్ !


గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలు, ఇక దేశంలో ఏ సమస్యలు లేవన్నట్టుగా కేవలం రెండే రెండు అంశాల చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చాయి. ఒకటి తెలంగాణా, రెండోది జగన్. ఒకటి కాంగ్రెస్ పుణ్యమా అని ఎన్నికలకు ముందే దాదాపుగా సమసిపోయింది. అది వున్నన్నాళ్ళు,  'ప్రో తెలంగాణా యాంటీ తెలంగాణా' అనే రెండు కోణాలుగా విడిపోయాయి. సమాజంలో వున్న అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు, చదువుకున్నవాళ్ళు, చదువు లేనివాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్ధులు, పత్రికలు, టీవీలు, జర్నలిస్టులు చివారాఖరుకు బంధుమిత్రులు అందరూ రాష్ట్రం చీలకముందే రెండుగా చీలిపోయారు. సరే ఆ అంకం ముగిసింది. కానీ మిగిలివున్న జగన్ అంశం ఇంకా సెలవేస్తూనే వుంది. నిజం చెప్పాలంటే తెలంగాణా అంశం వల్ల జగన్ అంశం కాస్త తెరచాటు అయింది కానీ, ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాలను ఇంతగా ప్రభావితం చేసిన విషయం మరోటిలేదు. జగన్ని సమర్ధించేవాళ్ళందరూ అవినీతిని సమర్ధించేవాళ్లని కొందరు ఆరోపిస్తే, జగన్ని వ్యతిరేకించేవాళ్లందరూ  పైకి కనబడేంత పత్తిత్తులు కాదని జగన్ మద్దతుదారుల వాదనగా సాగింది. ఈ వాదోపవాదాల మాటున అనేక కీలక అంశాలు చాటుకు వెళ్లిపోయాయి. ఈ క్రమంలో, మళ్ళీ ముందు చెప్పుకున్నట్టుగానే పౌర సమాజం రెండుగా విడిపోయింది.
పోతే, జర్నలిస్టులుగా వున్నవాళ్ళు కూడా ఇందుకు అతీతం కాదన్నట్టుగా వ్యవహరిస్తూ వుండడం ఇందులో విషాదం. తెలంగాణా వంటి భావోద్వేగ సమస్య పట్ల వైఖరులను కొంత సమర్ధించుకోవచ్చు కానీ పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్న అంశం పట్ల కూడా ఉద్వేగాలకు ఆవల నిలబడి ఆలోచించుకోలేని పరిస్తితి ఏర్పడడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. కాకపొతే ఈ విషయంలో సమాజంలోని అన్నివర్గాలు ఇక వెనక్కు రాలేనంత ముందుకు వెళ్ళిపోవడం చూస్తే, రాగల పరిణామాలను కాలానికి వొదిలి వేచి చూడడమే మంచిదని అనిపిస్తోంది.
సరే! మిగిలిన అన్ని వర్గాలను వొదిలిపెట్టి విషయాన్ని  మరో  కోణం నుంచి చూద్దాం.
పదిమందిని కలుసుకోవడంతో పాటు పది రకాల మనుషుల్ని కలుసుకోగగల వెసులుబాటు జర్నలిష్టులకు (మాత్రమే) వుంటుంది. ఈ క్రమంలోనే  ఒక సైకాలజిష్టు కలిసారు. ఆయన విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా వుందా లేక ఆయన కూడా ఈ సమాజంలో భాగమే కనుక అందరిలాగే ఒక వాదానికే కట్టుబడి ఈ మాటలు చెబుతున్నారా అన్నది ఆయన విజ్ఞతకు, ఆ పలుకులలోని వాస్తవికతను ముందే చెప్పినట్టుగా కాలానికి వొదిలి వేద్దాం. తొందరపడడం యెందుకు, తేల్చే ఘడియ కనుచూపు మేరలో వున్నప్పుడు. ఎలాగు మనకో సామెత వుండనే వుంది. 'విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడ'ని. ఇక ఆయన ఏం చెప్పారంటే....ఆయన మాటల్లోనే......
"ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళు దానిలోని ఔచిత్యాలను గమనంలోకి తీసుకోరు. నమ్మకం, అభిమానం, కొండొకచో ప్రేమ వారినలా ప్రవర్తించేలా చేస్తుంది. వాటికి హేతుబద్ధమైన  లేదా శాస్త్రీయమైన  ప్రాతిపదికలు వుండవు. మన పిల్లవాడు అద్దం పగలగొడితే, చిన్నవాడు పోనీలే అనుకుంటాం. అదే పక్కపిల్లవాడు చేస్తే రాలుగాయి, అసలు పెంపకాన్ని అనాలి అనేస్తాం. ఇది మానవ సహజం.
"ఒకప్పుడు, ఆ మాటకు వస్తే ఇంత చదువు సంధ్యలు పెరిగిపోయిన ఈ రోజుల్లో కూడా సినిమా అభిమానులది ఇదే వరస. వాళ్ళకో అభిమాన హీరో వుంటాడు. అతన్ని ఎంతగా అభిమానిస్తారో అతడికి సినీ రంగంలో ప్రత్యర్ధిగా వున్న మరో హీరోను అంతగా ద్వేషిస్తారు. యెందుకు అంటే ఇతమిద్ధంగా కారణం చెప్పలేరు. ఎదుటి హీరోలో కనిపించే లక్షణాలన్నీ వారికి అవలక్షణాలుగా కానవస్తాయి. తమ హీరోలో బలహీనతలను వారసలు పట్టించుకోరు. ఈ అభిమానం, ఈ  వైమనస్యం వారిని ఏ స్తితికి తీసుకువెడతాయంటే ఆఖరికి వాళ్లు సినిమా పోస్టర్ల మీద పేడ కొట్టే పరిస్తితి వరకు దిగజారుస్తాయి. ప్రస్తుతం ఈ మనస్తత్వమే రంగూ రూపూ మార్చుకుని సోషల్ మీడియాలో విశృంఖల విహారం చేస్తోంది. మొదటి వాక్యం  చదివేసి ఒక అభిప్రాయానికి వచ్చేసి కామెంట్లు పెట్టేస్తారు. ఆవిధంగా ఇప్పుడు పౌర సమాజం, చదువుకున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తారతమ్యం లేకుండా రెండు వర్గాలుగా విడిపోయి, 'జై జగన్, నై జగన్' అని  వాదించుకుంటోంది. ఎవరి శాతం యెంత అన్న విషయంలో ఎవరి లెక్కలు వాళ్లకు వున్నా  ఇంకా అసలు  లెక్కలు తేలలేదు. రాబోయే ఎన్నికల్లో ప్రస్పుటం అయ్యే ఈ లెక్కల్లోని వ్యత్యాసమే ఆయా రాజకీయ పార్టీల లెక్కల్ని, తలరాతల్ని  మార్చబోతోంది"
అయితే 'ఇందులో కొత్త విషయం ఏముంది, వేచి  చూడడం అన్న సలహా తప్ప' అన్న అనుమానం నాకూ వచ్చింది.
నాకనిపించేది ఏమిటంటే సినిమా హీరోలని అమితంగా అభిమానించే జనాలు వున్నట్టే, అసలు  అభిమానాలు, దురభిమానాలతో నిమిత్తంలేని ప్రేక్షక జనాలు కూడా వుంటారు. సినిమాల జయాపజయాల్లో వాళ్ల పాత్ర కూడా అంతర్లీనంగా వుంటుంది. అలాగే రాజకీయాల్లో కూడా. 'చంద్రబాబు మా మేనత్త కొడుకు కాదు,  జగన్  మా మేనమామ కొడుకు కాదు' అనే బాపతు. వారెవరో, వారెందరో ఒక పట్టాన తేలడం కష్టం. చివరికి తేల్చేది, ముంచేది అలాటి వాళ్ళేనేమో!   

29, మార్చి 2014, శనివారం

నేనెవర్ని అనే గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ


మీరెవరు మీ కధా కమామిషూ ఏమిటని ఫేస్ బుక్ మిత్రబృందంలో కొందరికి డౌటేహం. అది తీర్చేందుకే ఈ ప్రయత్నం. సుదీర్ఘ సుత్తి అనిపిస్తే మన్నించండి.
పందొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరయయ్యవ తేది.
విజయవాడ, లబ్బీపేట లోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.
అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.
ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-
'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.
అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.
ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్నా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ టీ ఐ , యు ఎన్ ఐ వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.
ఉదయం ఎనిమిది గంటలకల్లా అన్నం తిని ఆంధ్రజ్యోతికి వెళ్ళేవాడిని. అన్నయ్య పర్వతాలరావుగారు ఇమ్మన్న రూపాయి నోటు వొదినె సరోజినీ దేవి నా చేతిలో పెట్టేది. రాను పోను సిటీ బస్సుకు నలభై పైసలు. మధ్యాహ్నం ఆఫీసుకు ఎదురుగా వున్న  టీ స్టాల్లో ముప్పయి పైసలు పెట్టి ఒక సమోసా తిని టీ తాగేవాడిని. రోజుకు ముప్పయి పైసలు మిగిలేవి. వేరే ఖర్చులు లేవు. అలా నెలకు సుమారు పది రూపాయలు ఆదా. అదే నా మొట్టమొదటి నెలసరి ఆదాయం.
అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నాదగ్గరకు వచ్చి ఎక్కవుంటెంటుని  కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది - పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.
ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా ప్రూఫ్ లో అచ్చయిన నా వార్తల్ని  నేనే చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు బాద్యతలు స్వీకరించడం జరిగిపోయాయి. ఎందుకో ఏమోగానీ, దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో పిల్లలకోసం ప్రత్యేక కధలు , బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పందొమ్మిదివందల డెబ్బయి ఒకటి,  ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు ఉపేంద్ర, ఐ.వెంకటరావు, కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ ( ఆ  మధ్య కాలం చేశారు), సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ (ఇటీవలే చనిపోయారు) వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.
అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో ఏదో విషయంలో పేచీ వచ్చి, రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో విలేకరిగా చేరడం యాదృచ్చికమే అని చెప్పాలి. అంతకుముందు ఈ ఉద్యోగాన్ని ఎంతో సమర్ధంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న తురగా కృష్ణమోహనరావు గారు - గోల్కొండ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి- దురదృష్టవశాత్తు -నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ విధంగా ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి ఆకాశవాణి ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా నేను ధరకాస్తు చేసుకోవడం, ఇంటర్వ్యూకు హాజరు కావడం - సెలెక్ట్ కావడం జరిగిపోయాయి. ఆంద్రజ్యోతి అనుభవం ఈ ఉద్యోగం పొందడానికి అదనపు అర్హతగానే కాకుండా- అసలైన అర్హతగా తోడ్పడిందని నా నమ్మకం. రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్రజ్యోతి ద్వారా లభిస్తే - సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తా సేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు,  రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియోలోకి వెళ్లి వార్తలు చదివేయడం, వారానికి రెండు మార్లు వార్తావాహిని (న్యూస్ రీల్) - ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యేక వార్తలు) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.
ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్యమంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం వల్ల -వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం రేడియో పై ఎక్కువగా ఆధారపడాల్సిరావడం వల్లా  రేడియో విలేకరిగా నా ప్రాధాన్యత కొంత పెరిగింది. అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు - రేడియో మీది అభిమానాన్ని, నా మీది వ్యక్తిగత అభిమానాన్ని కలబోసి ప్రదర్శించేవారు. విలేకరుల సమావేశాలను -'శ్రీనివాస్ వచ్చాడా!' అని కనుక్కుని మొదలు పెట్టడం అప్పుడప్పుడు నలుగురిలో ఇబ్బందిగా వుండేది. తన ఎయిర్ బస్ మంత్రివర్గంపై చెలరేగిన విమర్శల దరిమిలా- మంత్రుల మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించడానికి ఓసారి విలేకరులకు కబురు పెట్టారు. మధ్యాన్నం వార్తల టైం దగ్గర పడుతుండడంతో-రాజీనామాల సంగతి ముందుగా నాకు చెప్పడం- విలేకరుల సమావేశం మొదలు కాకముందే ఆ సమాచారం ప్రాంతీయ వార్తల్లో ప్రసారం కావడం జరిగిపోయింది. ఇది నా వృత్తి జీవితంలో మరచిపోలేని సంఘటన.
ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తెసుకుని న్యూస్ బుల్లెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది.అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్లో  కూర్చునే వారు. ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్లో  ఎవరికీ వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీటుకి మారిపోయారు. సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకు పోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి సీఎం గారు పిలుస్తున్నారు రండి అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి. అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియోస్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజానురాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచి తనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.
పొతే, ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ ఏ ఎస్ , ఐ పీ ఎస్ అధికారులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు, విమానయానాలు, విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్
చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తులో' వృత్తి జీవితం గడిచిపోయింది.
అటు చూస్తే, వ్యక్తిగత జీవితం ఓ గుండు సున్నా. జీతానికీ, జీవితానికీ పొంతన లేకపోవడంతో అందినంతవరకు అప్పులు చేయడం (చేబదుళ్లు పుట్టవు కానీ జర్నలిష్టులకు మాత్రం బ్యాంకు రుణాలు కోకొల్లలు ) వాటిని తీర్చడం కోసం మళ్ళీ కొత్తవి చేయడం - అదో రుణ చక్ర భ్రమణం. ఇలా ఊబిలో కూరుకుపోయిన జీవితానికి ఆసరాగా మా ఆవిడ నిర్మల- 'అమ్మవొడి'ని ప్రారంభించింది. కన్న సంతానం ఇద్దరు పిల్లలతో పాటు - మరో పాతికమంది పసి పిల్లల ఆలనా పాలనా నెత్తిన వేసుకుంది. ఓ గృహిణిగా సంసార బాధ్యతలో పాలు పంచుకుంటున్నదని అనుకున్నానే కాని, అలవికాని భారం మోస్తున్నదని అనుకోలేదు. ఫలితం - పదేళ్ళ తరవాత ఆమెకు జరిగిన ఓపెన్ హార్ట్ సర్జరీ. మరో పదేళ్ళ అనంతరం మొన్నీమధ్య రెండో సర్జరీ.
ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు - కే ఎస్ శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్ దూర  దర్శన్ వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ. మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.
వెనక్కు తిరిగి చూసుకుంటే- ఎన్నో అనుభూతులు-అనుభవాలు.
అన్నింటి సమగ్ర సమాహారమే జీవితం.
నిజానికి జీవితంలో ఫెయిల్యూర్ స్టొరీలు వుండవచ్చు కానీ, ఏ జీవితం ఫెయిల్యూర్ కాదు.




పాలకులు తీర్చలేని చిరు కోరిక


'ప్రజల మేనిఫెస్టో పేరుతొ ప్రోగ్రాం చేస్తున్నాం మీ అభిప్రాయం చెప్పండ'ని ఇప్పుడే ఒక ఛానల్ వాళ్లు ఇంటికి వచ్చి రికార్డ్ చేసుకుని వెళ్లారు.
అందులో చెప్పిన సారాంశం ఒక్క ముక్కలో చెప్పాలంటే.....

"సాధారణ జన జీవితంలో ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని. అది చేస్తే మా నెత్తిన పాలుపోసినట్టేనని"  

వీరీ వీరీ గుమ్మడిపండు వీరీ పేరేమి?

వార్త - వ్యాఖ్య
News item in Deccan Chronicle today: " A total of 88 MLAs have defected to various political parties. The candidates are the same, the constituencies are the same but the parties have changed"

కొత్త జెండాలతో, కొత్త ఎజెండాలతో, కొత్త కండువాలతో వోట్లకోసం ఇళ్లకు వచ్చే అభ్యర్ధులకు  పాత కండువాలతో వున్న వాళ్ల పాత ఫోటోలను చూపిస్తే కర్రు కాల్చి వాత పెట్టినట్టు అవుతుంది. ఏ స్వచ్చంద సంస్థ అయినా ఈ పుణ్యం కట్టుకుంటే బాగుంటుంది కాని వాటికి కూడా ఈ మధ్య సొంత ఎజెండాలు ఏర్పడుతున్నాయి. 

ఓటర్ల మేనిఫెస్టో



‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం  చంపుకుంటారు.’ – విల్ రోగర్స్


ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ను విడుదల చేస్తుంది. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి తమను మాత్రమే ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే  ఆ పవిత్రమయిన వోటు వేసినందుకు (గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి చేయబోతున్నదో అనే అనేకానేక  ఉచిత వరాలతో కూడిన ఎన్నో  వివరాలు ఈ మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి పార్టీ ఎంతో పెద్ద కసరత్తు చేస్తుంది. ఇందునిమిత్తం  పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ పలు మార్లు సమావేశాలు జరిపి – ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా చర్చిస్తుంది. అర చేతిలో వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి పెద్ద పెద్ద పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక మేనిఫెస్టో విడుదల అనేది మరో పెద్ద తంతు. వోటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ యా పార్టీలకు చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ అంతకంటే అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా రిలీజ్ మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు పడే యాతన ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు  ముందు ఓ తప్పనిసరి తతంగంగా  తయారయింది. కాకపొతే,  ఎన్నికల తరువాత మాత్రం  మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.
 ‘మీరిలా వోటు వేసి గెలించండి. మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాం’ అనే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మాదిరిగానే, ‘ మీరిలా చేస్తామని మాట ఇవ్వండి. అప్పుడు మా వోటు అచ్చంగా మీకే’ అంటూ ఓటర్లే తమ మేనిఫెస్టోలతో ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జయ ప్రకాష్ నారాయణ గారు తమ లోక్ సత్తాను రాజకీయ పార్టీగా రూపు మార్చకుండా వుండి వుంటే బహుశా ఈ ప్రయోగం ఆయనే చేసివుండేవారేమో.  ఇలా ఈ దిశగా సాగిన ఆలోచనలనుంచి పుట్టుకొచ్చినదే ఇదిగో ఈ ‘ఓటర్ల మేనిఫెస్టో’.
      
1.  ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చే ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి రాగానే తాము దాన్ని యెలా అమలు చేయబోతున్నామో అన్న  విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన అసంగ్దిగ్ధతలకు తావివ్వకుండా, శష భిషలకు పోకుండా  ఎన్నికల ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది యెలా సాధ్యమో కూడా  వోటర్లకు తెలియచెప్పాలి. యేరు దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన  తరువాత బోడి మల్లయ్య సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత వాగ్దానాల అమలుకు అయ్యే మొదటి ఏడాది వ్యయాన్ని తమ పార్టీ నిధులనుంచే ఖర్చు చేయాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి చెప్పాలి.  (మీడియాకు మనవి: ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై వొదులుతున్న ‘ఉచిత’ హామీలను యెలా అమలు చేస్తారని మీడియా ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు తెలియచెప్పాలి.)
2. భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలి.
3. ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. (ఆన్ లైన్ విధానంలో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.)
4. ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ  రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య హక్కు పేరుతొ నడిరోడ్లపై  ధర్నాలు, బైఠాయింపులు, రాస్తా  రోఖోలు నిర్వహించరాదు.(అలాగే ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను ఎటువంటి పరిస్తితిలోను ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి  స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ రకమయిన ఆందోళనల కారణంగా ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా ప్రసారం చేయాలి. ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం  చూపిస్తున్నారు. అలాకాకుండా రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న పౌరుల స్పందనలను ప్రత్యక్ష  ప్రసారం చేయాలి)
5. ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ ప్రకటనలు, అవాకులు చవాకులులతో కూడిన స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6. ‘త్వంశు౦ఠ   అంటే  త్వంశు౦ఠ’ అంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా గోష్టులను పదే పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ‘ఉచిత వినోదపు పన్ను’ రాబట్టాలి.
7. సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే కుదుర్చుకోవాలి. ఎన్నికలు ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన  తరువాత ప్రభుత్వం ఏర్పాటుకోసం అవకాశవాద కూటముల ఏర్పాటును నిషేధించాలి.
గమనిక: ఇవి కేవలం తొలి ఆలోచనలే. ఎన్నికల ఘడియ దగ్గర పడే  లోగా వీటికి మరింత స్పష్టమయిన పటిష్టమయిన రూపం ఇవ్వడంలో అంతా తలా ఓ చేయి వేయాలని  మనవి.

28, మార్చి 2014, శుక్రవారం

టీవీ సూపర్ ఫైన్ ప్రేక్షకులకు ఒక ముఖ్య గమనిక


“2014 లో ‘యుగాంతం’ కాబోతోందని గతంలో మేము ప్రసారం చేశాము. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల యుగాంతం 3014 సంవత్సరానికి వాయిదా పడిందని తెలపడానికి విచారిస్తున్నాము. అంతవరకూ చూస్తూ వుండండి టీవీ సూపర్  ఫైన్.”

27, మార్చి 2014, గురువారం

"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"




sr అనే బ్లాగు వీక్షకులు ఒకరు నేను రాసిన ప్రణయ గీతాలపై  ఒక కామెంటుతో పాటు ఒక ప్రశ్నను సంధించారు.
"గేయం పక్కనపెడితే, మీరు ఒక ఛానల్ కు అమ్ముడు పోయారా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను"
రామాయణంలో పిడకల వేట అన్నట్టు ప్రణయ కవిత్వం చదివి అడగాల్సిన ప్రశ్న కాకపోయినా వీరు నాకు మంచి మేలు చేశారనే అనుకుంటున్నాను.
ఎందుకంటే నేనూ ఎన్నాళ్ళనుంచో ఒక వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన పై పాఠకుడికి ముందు కృతజ్ఞతలు.
ఒక చానలు కు అమ్ముడు పోయారా అన్నది వారి సందేహం. ఒక ఛానల్ కు అమ్ముడుపోవడం కాదు ప్రతి రోజూ ఒక ఛానల్ కు పొద్దున్నే పోతున్నాను అన్నది నా జవాబు. వాళ్లు పిలుస్తున్నారు, నేను వెడుతున్నాను. అంచేత ఈ వివరాలు నలుగురికీ తెలియాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పాఠకుడు  తన వ్యాఖ్యతో ఆ అవసరం కలిపించారు.
ప్రతివారం నా షెడ్యూలు ఇది.
సోమవారం ఉదయం ఏడుగంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, సాయంత్రం నాలుగున్నర నుంచి అయిదు వరకు - జెమిని న్యూస్, మంగళవారం ఉదయం ఏడుగంటల నుంచి ఎనిమిది వరకు - హెచ్ ఎం టీ వీ, బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు - సాక్షి టీవీ, గురువారం ఉదయం ఏడు గంటలనుంచి అటూ ఇటూగా ఎనిమిది వరకు - మహా న్యూస్, శుక్రవారం ఉదయం ఏడు గంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, శనివారం ప్రత్యేకించి ఒక ఛానల్ అంటూ ఏమీ లేదు ఎవరు ముందు పిలిస్తే ఆ ఛానల్ కు (సాధారణంగా 10 టీవీ), ఆదివారం ఉదయం ఏడునుంచి ఏడు నలభై అయిదు వరకు - V 6 ఛానల్. ఇవికాక మధ్యాహ్నం, రాత్రి వేళల్లో  సందర్భాన్నిబట్టి చర్చాకార్యక్రమాలు వుంటాయి. గత రెండు మూడు సంవత్సరాలనుంచి నాది మారని షెడ్యూలు. కొత్త ఛానల్స్ వాళ్లు పిలుస్తున్నా, పాత చానల్స్ వాళ్లు అడుగుతున్నా వొప్పుకోలేని స్తితి.
మరి ఒక ఛానల్ కు అమ్ముడు పోతే ఇన్ని చానల్స్ వాళ్లు యెందుకు పిలుస్తారు. ఇంకో విషయం. నా అవసరాలను బట్టి నేను అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డా కొనడానికి నాకేదో అర్హత వుండాలి కదా! నాకంత మార్కెట్ వుందని అనుకోను. ఈ కొనడాలు, అమ్మడాలు అనే వ్యాఖ్యలతో నాకు తెలిసిన జర్నలిజం రంగాన్ని అవమానించవద్దు. ఇది నా విజ్ఞప్తి.
పోతే, మా కుటుంబం నమ్ముకున్న ఒక సూక్తితో దీన్ని ముగిస్తాను.
"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"