5, మార్చి 2014, బుధవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 15

మాస్కో గోంగూర 




మాస్కోలో పాలకు కొదవలేదు. ఉన్నదల్లా పెరుగుకే. అక్కడ దొరికే కిఫీర్ అనేది అటు పెరుగు ఇటు మజ్జిగ కాని బ్రహ్మపదార్ధం. పాలు తోడు పెట్టి పెరుగు చేసుకోవచ్చు. కానీ తోడుకు పెరుగేదీ?
డిల్లీనుంచి ఎవరో తెలిసిన పెద్దమనిషి వస్తుంటే ఓ గిన్నెడు పెరుగు పట్రమ్మని కోరాము. అలా దిగుమతిచేసుకున్న పెరుగుతో ప్రారంభించిన 'తోడు' ప్రయోగాలు కొద్దిరోజుల్లోనే విజయవంతమయి, సొంతంగా ఇంట్లోనే పెరుగు ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించగలిగాము.దాంతో  ఇక మాస్కోలోని తెలుగులోగిళ్ళలో  పెరుగు వడలు,పెరుగు పచ్చళ్ళు ,ఆవకాయకారంతో పెరుగన్నాలు,  మజ్జిగ పులుసులు - స్వైరవిహారం చేయడం మొదలెట్టాయి. గొప్పచెప్పుకోవడం కాదు కానీ, రీనక్ గోంగూర,మాస్కో పెరుగుకు పేటెంట్ ఇవ్వాల్సివస్తే అది మా ఆవిడకే ఇవ్వాలి.



పెరుగు సమస్య తీరిపోవడంతో బియ్యంపై దృష్టి పెట్టాము. అక్కడ దొరికే బియ్యం చాలా చాలా కారు చవక. అయితే పేరుకు బియ్యమే కానీ వండితే వచ్చేది అన్నం కాదు. తినడానికే కాదు చూడడానికి కూడా పసందుగా లేని రష్యన్ బియ్యం బదులు మామూలు బియ్యం సంపాదించడం ఎల్లా అన్నది మా దినసరి సమస్యగా మారింది.

శ్రీ రాయపాటి

 ఆ సమయంలో మాస్కో వచ్చిన రాజ్య సభ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు - ఒక రోజు సాయంత్రం నగరంలోని డిల్లీ రెస్టారెంట్ లో తెలుగు వాళ్ళందరికీ విందు ఇచ్చారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఆ హోటల్ లో బాస్మతి బియ్యంతో చేసిన ఫ్రయిడ్ రయిస్ వడ్డించారు.



మాస్కోలో మా ఇంట్లో శ్రీ రాయపాటి

వెంటనే  ఆ రెస్టారెంట్ మేనేజర్ ను కదిలించి చూసాను.
 వాళ్లకు డిల్లీ నుంచి వారానికి ఒకసారి బియ్యం బస్తాలలో వస్తుంటాయట. బియ్యంకోసం మేము పడుతున్నపాట్లు విన్నవాడయి- మనసు కరిగిన వాడయి - నెలకిన్ని కిలోలని బియ్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలాగే ఐ టీ డీ సీ నడిపే బాంబే రెస్టారెంట్ నుంచి మరికొంత నెలసరి బియ్యం కోటా సంపాదించుకునే తెలివితేటలను 'అవసరమే' మాకు నేర్పింది.




. కొంత ఎక్కువ ఖర్చయినప్పటికీ రెండు ప్రధాన సమస్యలు తీరిపోవడంతో - మాస్కోలో చదువుకునే తెలుగు పిల్లలకు శనాదివారాల్లో  మా ఇల్లు తెలుగు భోజనశాలగా మారిపోయింది. వాళ్ళంతా మా ఆవిడను అన్నపూర్ణ అని పిలిచేవాళ్ళు. ఇళ్ళకు దూరంగా, ఇంటి భోజనానికి  మరీ దూరంగా నాలుక చవిచచ్చిన ఆ పిల్లలు - మా ఆవిడ వడ్డించే  'రీనక్ గోంగూర పచ్చడి, గడ్డపెరుగు అన్నం' తినడానికి చాలా చాలా దూరాలనుంచి చచ్చీచెడీ వచ్చేవారు. వాళ్ళ ఆటా పాటలతో మా ఇల్లు సందడే సందడి.  రెండు రోజులు యిట్టే సరదాగా గడిచిపోయేవి. ఒకరికి పెట్టడంలోవున్న హాయినీ, ఆనందాన్నీ ఒక జీవితానికి సరిపడా మాస్కో జీవితం మాకు అందించింది. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి?
(శంకరాభరణం  శంకర శాస్త్రి గారి నోట రష్యన్ మాట - ఆ కధా కమామిషు మరోసారి)  

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

పాతికేళ్ళనాటి మాస్కో - 14

ఇంతకీ ఆ కార్డు ముక్కలో ఏమున్నదంటే !

బందరులో   ఒక పెద్దమనిషి గారున్నారు. ఇస్కస్ (ఇండో సోవియట్ సాంస్కృతిక సంస్థ)ద్వారా  సోవియట్ యూనియన్ పర్యటనకు రావాలనుకుంటున్న ఆంద్ర ప్రదేశ్ ప్రతినిదివర్గంలో ఆయన వున్నారు. శాకాహారి అయిన ఆయన రష్యాలో తిండీ తిప్పలు గురించి ముందే వాకబు చేసుకుని, నా అడ్రసు తెలుసుకుని ఆ కార్డు రాసారు. ఫలానా రోజున మాస్కోలో ఫలానా హోటల్ లో ఉంటాననీ, వచ్చికలుసుకోవాల్సిందనీ అందులో కోరారు.



 దాని ప్రకారమే  ఆ ఫలానా రోజున ఆ ఫలానా హోటల్ కు వెళ్లి ఆయన్ని కలుసుకున్నాను. మాస్కో రావడానికి ముందే రష్యాలోని మరో రెండు మూడు నగరాలు  వారిని తిప్పి తీసుకువచ్చారు.బడలికతో నీరసించివున్న   ఆయన నన్ను పక్కకు తీసుకువెళ్ళి- 'ఈ రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఏమయినా అభ్యంతరమా' అని అడగలేక అడిగారు. పరిస్తితిని అర్ధంచేసుకుని వెంటనే ఆ పెద్దమనిషిని మా ఇంటికి  బయలుదేరదీసాను. ఈ విషయం ఎలాతెలిసిందో ఏమో ఒక్కక్కరుగా వచ్చి అదే కోరిక కోరారు. ఇప్పట్లోలాగా ఆరోజుల్లో సెల్ ఫోనులు లేవు. ఇంటికి ఫోను చేసి ఇంతమంది వస్తున్నారని చెప్పే వీలు లేదు. ఏమయితే అయిందని  వాళ్ళతో వున్న రష్యన్ దుబాసీతో సహా  అందర్నీవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన  బస్సులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లాను. బిలబిలమంటూ ఇంటికి వచ్చిన అతిధులను చూసి మా ఆవిడ ముందు కంగారు పడినా - తరవాత తమాయించుకుని  అందరికీ పచ్చళ్ళు, సాంబారు, పెరుగుతో భోజనాలు పెట్టింది. 'అన్నదాతా సుఖీభవా' అని అంతా ఆశీర్వదిస్తుంటే-' ఇచ్చుటలో వున్న హాయీ వేరెచ్చటనూ లేనేలేదనీ- లేటుగ తెలుసుకున్నాను' అన్న బాపూ రమణల బుద్దిమంతుడి పాట గుర్తుకు వచ్చింది. ఆ రోజు మా ఇంట్లో నాలుగు మెతుకులు తిన్న వారందరూ పోతూ పోతూ  ఇచ్చిన టీ పొట్లాలు, కాఫీ పొడి  పాకెట్లు, వక్కపొడి మొదలయిన- 'అమూల్య కానుకలతో' ఆ తరవాత  కొన్నాళ్ళు మాకు పండగే పండగ.


(రేడియో మాస్కోలో గుజరాతీ న్యూస్ రీడర్ శ్రీ వ్యాస్)

పోతే మరో విషయం తప్పక చెప్పాలి. అలా ఆ రోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఇన్నేళ్ళ తరవాత ఇప్పటికీ కూడా ఏటా గ్రీటింగ్ కార్డులు పంపిస్తూనే వున్నారు. వాళ్ళ సహృదయతకు ఖరీదు కట్టే షరాబు యెవ్వడు?
(మరికొన్ని మంచి జ్ఞాపకాలతో మరోసారి)    

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

పాతికేళ్ళనాటి మాస్కో - 13


బస్సులో బంధువులు 






ఆ వచ్చిన వాళ్ళెవ్వరూ మా బంధువులు కాదు. కనీసం ముఖ పరిచయం వున్న వాళ్ళు కూడా కాదు. కానీ ఒక్క పూట మా ఇంట్లోగడిపిన 'పుణ్యానికి' ఆత్మ బంధువులుగా మారారు.
నిజానికి అది మా ఆవిడ చేసుకున్న పుణ్యం.ఇంకా చెప్పాలంటే - ఆమెను కట్టుకుని నేను చేసుకున్న పుణ్యం. ఇది మూట కట్టుకోవడానికి చాలా రోజులముందు బందరు నుంచి నాకో రోజు ఓ కార్డు ముక్క వచ్చింది. నిజానికి రాలేదు. నేనే వెళ్లి తెచ్చుకున్నాను. మాస్కోలో వుండే విదేశీయులెవరికీ నేరుగా ఇళ్ళకు ఉత్తరాలు రావు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వస్తాయి. అంటే  హైదరాబాదులో వున్న మా వాళ్ళెవారయినా నాకు ఉత్తరం రాయాలనుకుంటే నా పేరు రాసి  తరవాత  కేరాఫ్ మాస్కో రేడియో అని రాసి డిల్లీలో వున్న మన విదేశాంగ శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాలి. అలా వచ్చిన ఉత్తరాలనన్నింటినీ 'డిప్లొమాటిక్ బాగ్ లో' వారానికోసారి మాస్కోకు విమానంలో పంపుతారు.



 మన ఎంబసికి చేరిన ఉత్తరాలను మనమే వెళ్లి వెదికి తెచ్చుకోవాలి.అలా ఉత్తరాలను గాలించి తెచ్చుకోవడంలో వున్న తృప్తి అనుభవిస్తే కానీ అర్ధం కాదు. చుట్టపక్కాలనుంచివచ్చే  ఉత్తరం ముక్కకోసం ఎంతగా మొహం వాచిపోయేవాళ్లమో ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.   మేము జవాబు రాయాలన్నా ఇదే వరస. ఇందులోవున్న ఏకైక సౌలభ్యం ఏమిటంటే మనకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎయిర్ మెయిల్ స్టాంప్  ఖర్చులు పెట్టుకోనక్కరలేదు. మామూలు తపాల స్టాంపులతో డిల్లీకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడనుంచి రాయాలన్నప్పుడు మాకూ అంతే. అందుకే ఎవరయినా వస్తున్నప్పుడు ఏమి పట్టుకురావాలని అడిగినప్పుడు ఇండియన్ స్టాంపులు తెమ్మని అడిగేవాళ్ళం. ఈ ఉత్తరాలతో పాటే ఇండియా నుంచి  ఇంగ్లీష్ దినపత్రికలు వచ్చేవి. వాటిల్లో బెంగళూరు నుంచి వెలువడే హిందూ వుండేది.



.మన రాష్ట్రం సమాచారం తెలియాలంటే హిందూలో హైదరాబాద్ నుంచి వారం వారం హెచ్ జే రాజేంద్రప్రసాద్ గారు రాసే ఆంద్ర ప్రదేశ్ న్యూస్ లెటర్ ఒక్కటే శరణ్యం.


(ప్రెస్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీ రాజేంద్ర ప్రసాద్, కుడి నుంచి రెండోవారు)   

 తరువాతి రోజుల్లో మాస్కోకు వచ్చిన అప్పటి ఆంద్ర జ్యోతి ఎడిటర్ -  ఐ. వెంకట్రావు గారు  తెలుగు పత్రిక కోసం అక్కడి తెలుగువాళ్ళు పడుతున్న  ఆరాటాన్ని గమనించి- హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే ఎంబసీ ద్వారా ఆంద్ర జ్యోతి దినపత్రికను పంపడం ప్రారంభించారు.


(శ్రీ  ఐ. వెంకట్రావు)


మాస్కోలో ఉంటున్న తెలుగు వారిలో నా పరపతి పెరగడానికి ఇది దోహదం చేసింది కూడా. ఇక కార్డు విషయానికి వస్తే-

కార్డు కదా! కొంత విరామం తీసుకుందాం. ఏమంటారు?



NOTE: All the images in this blog are copy righted to their respective owners.

నోరి మధురబాబు ఇక లేరు



నోరి మధురబాబు ఇక లేరంటూ ఈ ఉదయమే దుర్గ ప్రసాద్ నుంచి మెసేజ్. కొద్దికాలంగా అస్వస్తులుగా వుంటున్న శ్రీ మధురబాబుతో మా కుటుంబానికి చాలా సన్నిహిత సాన్నిహిత్యం. అమెరికాలో సుప్రసిద్ధ కేన్సర్ వైద్యులు డాక్టర్ నోరి, శ్రీ మధురబాబు సోదరులు. స్టేట్ బాంక్ జనరల్ మేనేజర్ గా ఆయన పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఆయన ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట ఏర్పాటు చేసిన నాగార్జున గ్రామీణ బాంక్ కు శ్రీ మధురబాబు మొట్టమొదటి చైర్మన్. అప్పటినుంచి ఆయనతో ఏర్పడ్డ చక్కని పరిచయం ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.


(కీర్తిశేషులు మధురబాబు) 

4, మార్చి 2014, మంగళవారం

పెద్ద గీత ముందు చిన్నగీత ఈ జీవితం


వాళ్ల ఆఫీసుదగ్గర పెద్ద వర్షం పడుతోందని ఎవరో నెట్లో పెట్టారు. వెళ్ళి తలుపు తెరిచాను. విసిరి కొట్టినట్టు జల్లు. మొహం చేత్తో తుడుచుకుంటూ బయటకు చూసాను. నాలుగంతస్తుల పైనుంచి పరికిస్తుంటే  నిలబడి చూడాలనిపించేంత అందంగా కురుస్తోంది వర్షం.


ఫోను చప్పుడయింది. 'కింద వున్నాం పైకి వస్తున్నాం' అన్న మెసేజి. లోపలకు వెళ్ళి టవల్ తో మొహం తుడుచుకుని హాల్లోకి వచ్చాను. ఈలోపలే పైకి వచ్చిన  టీవీ  సిబ్బంది వాళ్ల ఏర్పాట్లు వాళ్లు చేసుకుంటున్నారు. కరెంటు పోయిన సంగతి కూడా తెలియలేదు ఇన్వర్టర్ వుండడం వల్ల. లైటింగ్ సెట్ చేసుకుంటూ వుండగానే పెద్ద శబ్దంతో ఫోకస్ బల్బు పేలిపోయింది. బాల్కనీ వెలుతురులోనే వాళ్లు మునిసిపల్ ఎన్నికలమీద 'బైట్' తీసుకు వెళ్ళిపోయారు. ఇంతలో పనిమనిషి ఆయాసపడుతూ వచ్చింది. లిఫ్ట్ లేదేమో నాలుగు అంతస్తులు మెట్లెక్కి వచ్చినట్టుంది. కాస్త ముందు వచ్చివుంటే బాగుండేది అనుకుంటున్నాను. ఇంతలో ఆవిడే నోరు విప్పింది. 'పాడు వర్షం పాడువర్షం. మొత్తం ఇల్లంతా కొల్లేరు చేసింది. పక్కబట్టలు, బియ్యపు మూట అన్నీ తడిసి ముద్దయ్యాయి. కాలంకాని కాలంలో ఈ పాడు వర్షం మా ప్రాణం తీయడానికే వచ్చింది"
కాసేపటి  క్రితం హాయిగా  అనిపించిన వాతావరణం 'మదిలో, గదిలో' ఒక్కసారిగా మారిపోయింది.
నిజమే పెద్ద గీత ముందు చిన్నగీత ఈ జీవితం.

పాతికేళ్ళనాటి మాస్కో - 12

నదిపై పిల్లల  ఫుట్ బాల్  ఆట 
నీళ్ళపై నడయాడగల యోగపురుషులున్న పుణ్య భూమి గా పేరుగాంచిన భారత దేశంనుంచి వెళ్ళిన మేము - మాస్కోలో 'నదిపై ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లల'ను కళ్ళారా చూసాము.
ఉత్తర ధృవానికి చేరువగా వుండడం వల్ల, మాస్కోలో ఉష్ణోగ్రతలు సున్నాకంటే ముప్పయి నలభై డిగ్రీలు తక్కువగా వుంటాయి. ఈ చల్లదనానికి మాస్కో నగరం మధ్యలో పాయలుగా పారే మాస్కవా నదిలో నీళ్ళు గడ్డకట్టుకు పోతాయి. కాంక్రీటు మాదిరిగా గట్టిపడిన ఆ నది ఉపరితలం పిల్లలకు ఆట మైదానంగా మారిపోతుంది. ఇక దానిపై ఫుట్ బాల్ ఆటలేనా, స్కేటింగ్ లేనా, ఓహ్! అది చూసి తీరాల్సిన దృశ్యం.


(మంచులో మంచి దుస్తుల్లో సంతోష్ భండారు)


సాధారణంగా మనవైపు ముసురు పట్టినప్పుడు, చల్లగాలులు వీస్తున్నప్పుడు చంటి పిల్లలను బయట తిప్పడానికి సంకోచిస్తాము. కానీ అక్కడ అలా కాదు. ఒక పక్క మంచు నిలబడి కురుస్తూనే వుంటుంది. మరో పక్క నెలలు నిండని శిశువులను సయితం చలి దుస్తుల్లో 'ప్యాక్' చేసి ఆరుబయట వొదిలేసి తల్లులు 'షాపింగ్' చేస్తుంటారు. అది చూస్తూ 'మన దేశం నుంచి వెళ్ళిన తల్లులు' ఇలా ఎలా ? అన్న ప్రశ్నలు వేసుకుని సతమతమౌతుంటారు.
తుమ్మి చిరంజీవ
అలా అని - తుమ్మని వాళ్ళూ , పడిసం పట్టని వాళ్ళూ అసలే లేరని కాదు. మనదగ్గర పల్లెల్లో ఇప్పటికీ పిల్లలు తుమ్మినప్పుడు దగ్గరున్న పెద్దవాళ్ళు వాళ్ళ నెత్తిపై తట్టి 'చిరంజీవ! చిరంజీవ!!' అని అంటూ వుండడం కద్దు. అలాగే అక్కడ కూడా ఎవరయినా తుమ్మగానే పక్కనున్నవాళ్ళు ' బూజ్ ద్దరోవా '( బహుశా దీనికి అర్ధం వెయ్యేళ్ళు బతకమని కాబోలు) అంటుంటారు. మోడరన్ అమ్మాయిల మాటేమోగాని పాత తరం మనుషులు ఇప్పటికీ చిన్న చిన్న నలతలకు ఇళ్ళల్లోనే చిట్కా వైద్యాలు చేస్తుంటారని పిలిపెంకో దంపతులు చెబుతుండేవాళ్ళు.
భోజనాలకు కటకట




పిలిపెంకో ఓసారి పట్టుపట్టి మమ్మల్ని లెనిన్ గ్రాడ్ రైల్లో తీసుకువెళ్ళాడు. అక్కడ పట్టుమని రెండు రాత్రులు కూడా గడపలేదు. ఎప్పుడు వెళ్లి ఇంట్లో పడదామా అన్న ఆరాటంతోనే సరిపోయింది. ఆ నగరంలో చూడాల్సినవి ఎన్నోవున్నాయి. కానీ తినకుండా తిరగడం అన్నదే సమస్యగా మారింది.



 శాఖాహారులకు హోటళ్ళలో తినడానికి ఏమీ దొరకదు. ముతక బియ్యంతో పొడి పొడిగా వండిన అన్నంపై ఉప్పూ మిరియప్పొడి చల్లుకు తినాలి. పెరుగు కాదు కానీ పెరుగు లాంటిది 'కిఫీర్'   దొరుకుతుంది. దానితో సరిపెట్టుకుని భోజనం అయిందనుకోవాలి. అలాగని మాంసాహారులకు రుచికరంగా అన్నీ దొరుకుతాయని అనుకోనక్కరలేదు. ఉడికించిన కోడిగుడ్లు మినహా మిగిలినవేవీ మనవైపునుంచి వెళ్ళిన వాళ్లకు అంతగా రుచిస్తాయనుకోవడానికి లేదు. మాంసాన్ని ఉప్పునీళ్ళల్లో ఉడికించి అదేమాదిరిగా సర్వ్ చేస్తారు. ఉప్పుకారాలు దట్టించి, నూనెల్లో వేయించి వేయిన్నొక్క రకాలుగా వంటలు వండుకుని తినే అలవాటు వున్న వాళ్లకు ఆ తిండి సయించడం కష్టమే. అందుకే అక్కడికి వ్యాపారపు పనులమీదనో లేక ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం ఆహ్వానం మేరకో వచ్చినవాళ్ళు భోజనానికి కటకట పడుతుంటారు.అలా వచ్చినవాళ్ళు మొదటి రోజు అక్కడి హోటళ్లు, బస ఏర్పాట్లు చూసి పరవాలేదనుకుంటారు. విందుల్లో మందు తప్ప ఇష్టపడి తినదగిన భోజనం కనబడక పోవడంతో- ఆకలి ఎరుగని దేశంలో వాళ్లకు ఆకలి కష్టాలు మొదలవుతాయి.

(భోజనానికి బస్సు వేసుకువచ్చిన అతిధులతో మా ఇల్లు ఎలా కళకళ లాడిందన్న ముచ్చట మరోసారి)

ఏం చేయాలి?


‘అమ్మా! పెరుగు ఎలా వస్తుంది’
‘ఏవిటే అర్ధంలేని ప్రశ్నలు మీ అన్నయ్య లాగా. పాలు కాచి పెరుగు తోడు పెడితే పెరుగు వస్తుంది’
‘మరి తోడు పెట్టడానికి పెరుగు ఎక్కడినుంచి వస్తుంది?’
‘ఏవండీ నన్ను పనిచేసుకోనీకుండా చంటిది ప్రశ్నలతో చంపేస్తోంది. కాస్త దీన్ని దగ్గరకు తీసుకోండి’
చలపతి ఆలోచనలో పడ్డాడు. తన చిన్నతనంలో తనకు ఇన్ని అనుమానాలు వచ్చేవా?
వచ్చేవి. కానీ వాటిని విసుక్కోకుండా తీర్చేందుకు బామ్మా తాతయ్యా వుండేవారు.

తాతయ్య వేలు పట్టుకుని తాను బడికి వెళ్ళేవాడు. ఇప్పుడో! తన పిల్లల్ని ‘ఆటో అంకుల్’ స్కూలుకు ‘తోలుకు’ పోతున్నాడు.
బామ్మ పొద్దుగుంకుతుండగానే గోరుముద్దలు తినిపించి, వొళ్ళో పండుకోబెట్టుకుని చిచ్చెకొడుతూ ‘అనగనగా ఒక రాజు కధలు’ చెప్పేది. ఇప్పుడో! పిల్లలు తమ గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని ‘గేములు’ ఆడుకుంటున్నారు.
చిన్నప్పుడు తనకు చిన్నగా వొళ్ళు వెచ్చబడ్డా బామ్మా తాతయ్యా పెద్దగా గిలగిలలాడిపోయేవాళ్ళు. ఆడుకుంటూ కిందపడి మోకాలు చెక్కుకుపోతే అప్పుడు బామ్మ పడే ఆదుర్దా చూసితీరాలి. ఇప్పుడు అంతటి ప్రేమ పిల్లలపై తమకూ వున్నా చూపించే తీరికలేని జీవితాలు తమ ఇద్దరివీ. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులే. సాయంత్రం ఇంటికి చేరేసరికి వున్న కాస్త వోపిక వొండుకు తినడానికే సరిపోతుంది.
తాను తన పిల్లలకు అన్నీ అమర్చాడు. మంచి స్కూల్లో చేర్పించాడు. విడిగా వారిద్దరికీ పడక గది ఏర్పాటు చేసాడు. కొంచెం ఖర్చయినా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాడు. వారం విడిచి వారం మల్టీప్లెక్స్ సినిమాలు చూపిస్తాడు. ఖరీదయిన రెస్టారెంటు తీసుకువెడతాడు. ఇక అరుణ మాట చెప్పనక్కరలేదు. ఇంట్లో వున్న కాసేపు ఆమెకు పిల్లల తోడిదే లోకం.
అయినా ఎక్కడో ఏదో లోపం జరుగుతుందోన్న అనుమానం. తాము ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేవరకు వాళ్ళిద్దరూ పక్కింటి ఆంటీ ఇంట్లో వుంటారు. తాము కనబడగానే వాళ్ళ కళ్ళల్లో కనబడే వెలుగు చూసినప్పుడు ‘లోపం’ గురించిన ఆ అనుమానం పెనుభూతంగా మారి భయపెడుతుంది. కానీ, అవసరం అనుమానాలను అణచిపెడుతుంది.
అమ్మానాన్నా ఎక్కడో వుంటారు. నెలకు ఇంత అని క్రమం తప్పకుండా డబ్బు పంపుతూనే ఉంటాడు. తెచ్చి తమ దగ్గరే అట్టిపెట్టుకునే ఆలోచన వచ్చినా ఇంకేదో ఆలోచన పట్టి ఆపుతుంది.
కానీ పిల్లలు ఏదో కోల్పోతున్నారు. బామ్మా తాతల ఆప్యాయత. అది తాము పూడ్చలేనిది.
వాళ్లకు మేధో వికాసం కలిగించే కంప్యూటర్లు ఇస్తే సరిపోతుందా? మానసిక స్వాంతన కలిగించే బామ్మా తాతల ప్రేమను అందివ్వాలా?
ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?