4, మార్చి 2014, మంగళవారం

అబ్రకదబ్ర (అనే కాశీపట్నం చూడరా బాబూ)


"ముఖ్యమంత్రి కాగానే చరిత్రను మార్చే సంతకాలు చేస్తా!" - వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
"ముఖ్యమంత్రి అవగానే సీమాంధ్రను సింగపూర్ చేసేస్తా!" - చంద్రబాబు నాయుడు
"తెలంగాణా రాష్ట్రంలో హెలికాఫ్టర్ అంబులెన్సులు ఏర్పాటుచేస్తా! ఆదిలాబాదును బంగారు తునకగా మారుస్తా!" " - కేసీఆర్
"సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తాం" - కేంద్ర మంత్రి జై రామ్ రమేష్ 


Photo courtesy: Image Owner 

జంపు జిలానీలు


ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడుతున్న మాట:
"ఈరోజు ప్లస్సెంత ? మైనస్ యెంత?"


ఈ ఫోటో తియ్యడానికి కెమెరా ఎక్కడ పెట్టాలి?


Photo Courtesy Image Owner

పాతికేళ్ళనాటి మాస్కో - 11

పిలవకుండానే పలికే డాక్టర్లు.

ఉదయం పది గంటలు దాటుతోంది. పిల్లలు స్కూలుకు వెళ్ళారు. మా ఆవిడతో కలసి హిందీ రామాయణం కొత్త ఎపిసోడు కాసెట్ చూస్తున్నాము. ఇంతలో డోర్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తె నలుగురయిదుగురు రష్యన్లు. 'దోం  సెం దేసిత్  జేవిచ్ పజాలుస్తా' అందులో ఒకతను అంటున్నాడు. పజాలుస్తా (ఇంగ్లీష్ లో ప్లీజ్ ) అన్న పదం తప్ప ఏమీ అర్ధం కాలేదు. తొంగి చూస్తె వారి వెనుక ఒక చక్రాల కుర్చీ కనిపించింది. ఒక్క క్షణం కేజీబీ వాళ్ళేమోనన్న అనుమానం మనసులో మెదిలింది. వాళ్ళను లోపలకు రమ్మని సైగ చేసాను. కూర్చోమన్న నా అభ్యర్ధనను పట్టించుకోకుండా ఇంట్లో ఇంకా ఎవరయినా వున్నారా అన్నట్టుగా కలయచూస్తున్నారు. సమయానికి పిల్లలు కూడా లేకపోవడంతో- మా ఆవిడ పై అంతస్తులో వుండే జస్వంత్ సింగ్ భార్యను పిలుచుకుని వచ్చింది. ఆ కుటుంబం చాలా ఏళ్ళుగా మాస్కోలో వుంటున్నారు కాబట్టి రష్యన్ బాగా వచ్చు. ఆవిడ వాళ్ళతో మాట్లాడి హిందీలో మళ్ళీ మాకు చెప్పినదాన్నిబట్టి అర్ధం అయింది ఏమిటంటే - ఆ వచ్చిన వాళ్ళు డాక్టర్లు. మా ఇంట్లో ఎవరికో బాగా లేదని వారికి సమాచారం అందిందిట. అంతే! రయ్యిమని వచ్చేసారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే కొంత ఆలస్యంగానే అయినా బుర్రలో లైటు వెలిగింది. అంతకు కొద్ది సేపటిక్రితం రేడియోకు ఫోన్ చేసి గీర్మన్ తో మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. ఆఫీసు కు పోవడానికి బద్ధకం వేసి 'జలుబుగా వుంది, ఈ రోజు రాలేనని' చెప్పాను. బహుశా అతను ఈ విషయం సంబంధిత అధికారులకు చేరవేసివుంటాడని జస్వంత్ సింగ్ గారి భార్య మాకు టీకా తాత్పర్యం చెప్పింది.


రష్యన్ డాక్టర్లతో పిచ్చాపా'టీ'

మాస్కోలో అంబులెన్సులు రాత్రింబగళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఏ ఇంటి నుంచి సమాచారం అందిందో - ఆ ఇంటికి దగ్గరలో తిరుగాడుతున్న అంబులెన్సుకు వైర్ లెస్ లో వివరాలు తెలియచేస్తారు. నిమిషాల వ్యవధిలో వారు అక్కడికి చేరుకొని వైద్య సహాయం అందిస్తారు. మొత్తానికి ఉత్తుత్తి జలుబు పుణ్యమా అని మాస్కో జీవితంలోని మరో మంచి కోణం తెలుసుకోగలిగాము. వచ్చిన డాక్టర్ల బృందానికి ఏ భాషలో క్షమాపణలు చెప్పామో గుర్తులేదు కానీ ఆఫీసుకు డుమ్మా కొట్టడానికి మేము ఎన్నుకున్న ఎత్తుగడను అర్ధం చేసుకుని నవ్వుకుంటూ వాళ్ళు  వెళ్ళిపోవడం మాత్రం ఇంకా కళ్లల్లో మెదులుతున్నట్టేవుంది.
పోతే, పనిలో పనిగా జస్వంత్ సింగ్ గారి భార్య అంబులెన్సు సర్వీసు గురించి మరి కొన్ని సంగతులు మా చెవిన వేసి వెళ్ళింది. మైనస్ ముప్పయి, నలభయి డిగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఆ నగరంలో వోడ్కా అనేది అక్కడి జనాలకు ఒక నిత్యావసర వస్తువులాంటిది. వొళ్ళు వెచ్చగా ఉంచుకోవడానికి వోడ్కా పుచ్చుకునే వారు కోకొల్లలు. ఈ విషయంలో కూడా అక్కడ మహిళలలదే పైచేయి.


మాస్కోలో 'దేవదాసులు'

 తాగి తాగి ఆ తాగిన మత్తులో మంచులో తూలి పడిపోయి ఇంటికి చేరలేని   డోసు బాబులను అంబులెన్సు బృందాలు  వెతికిపట్టుకుని ఆసుపత్రులకు చేరవేస్తుంటాయట. వారివద్దవుండే ప్రోపుస్కా (ఫోటో గుర్తింపు కార్డు) ఆధారంగా వారి ఇళ్ళకూ, ఆఫీసులకూ సమాచారాన్ని అందిస్తాయిట.  అంతే కాదు , ఆసుపత్రుల్లో అలా చేరిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వాళ్లకు జీతంతో కూడిన సెలవు ఇవ్వడమనేది కొసమెరుపు.
 
(మాస్కో  గురించి మరో మంచి ముచ్చట మరో సారి )

3, మార్చి 2014, సోమవారం

జంబూ ద్వీపం వూహాచిత్రం



జంబూద్వీపం చిత్రం వూహాజనితమైనా బాగుంది. పసిఫిక్ మహాసముద్రానికి శాంతి సముద్రం అని పేరు. దానికి ఇందులో ఇచ్చిన నామం 'ప్రశాంతోదధి' అలాగే, అట్లాంటిక్ మహాసముద్రానికి 'అతులాంతకోదధి', ఆర్కిటిక్ సముద్రానికి 'ఆర్కోదధి',  అమెరికాకు 'పాతాళదేశం(నాగ దేశం), ఆసియాకు 'హరివర్షపం','ఆర్యఖండం', ఆస్ట్రేలియాకు 'అస్త్రాలయ' - ఇలా బహు రసవత్తరమైన పేర్లు పెట్టారు.



(పలివెల భార్గవ రామ్ సౌజన్యంతో)



 
      

పాతికేళ్ళనాటి మాస్కో - 10


వృద్ధులు - కురు వృద్ధులు
సోవియట్ యూనియన్ జనాభా తక్కువే కానీ వృద్ధుల సంఖ్య ఎక్కువే.
రేపెలా గడుస్తుంది అన్న బెంగ లేకపోవడం, చవుకగా లభించే పౌష్టికాహారం, శుభ్రమయిన గాలీ నీరూ ఇవన్నీ సోవియట్ పౌరుల ఆయు ప్రమాణాలను గణనీయంగా పెంచడానికి దోహదం చేసి వుంటాయనుకోవచ్చు. ప్రతివారికీ పని చూపించే బాధ్యత ప్రభుత్వంపై వుండడం, పిల్లలను కనడమే కానీ చదువు సంధ్యలు చూడాల్సిన అవసరం లేకపోవడం వీటన్నిటి వల్లా ఆరోగ్యం తొణికిసలాడే వృద్దులే ఎక్కువగా కానవస్తారు. ఎనభయి దాటిన స్త్రీలు కూడా గోళ్ళు గిల్లుకుంటూ ఇంటి పట్టున వుండరు. పూలూ పళ్ళు అమ్ముకుంటూ కనబడతారు. ఆత్మాభిమానానికీ, ఆత్మ స్తయిర్యానికీ ప్రతీకలుగా నిలబడతారు.


(టాక్సీలో స్కూలుకు వెడుతున్న సందీప్)

సామాన్యుల స్వర్గం
పౌర సదుపాయాలను అన్నిటినీ సామాన్యుడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశారు. చలి దేశం కాబట్టి - నిత్యావసరాల కోసం ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని లేకుండా నివాస భవనాలకు దగ్గరలోనే షాపులు ఉండేవి. పాలు,వెన్న, కోడిగుడ్లు అమ్మే దుకాణాలను 'ప్రోదుక్తి' అని పిలిచేవారు. అలాగే స్కూళ్ళు, దేస్కిసాద్లు (చైల్డ్ కేర్ సెంటర్లు ) సలూన్లు, పిల్లల ఆసుపత్రులు అన్ని ప్రాంతాలవారికీ అందుబాటులో ఉండేట్టు చూసారు.
(పిలవకుండానే పలికే డాక్టర్ల గురించి మరోసారి)


2, మార్చి 2014, ఆదివారం

తెలంగాణా ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ (తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు) గురించి కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్