20, ఫిబ్రవరి 2014, గురువారం

ఒక ప్రక్రియ ముగిసింది ఇక ప్రజలే ప్రభువులు కావాలి


మన  రాష్ట్రానికి సంబంధించిన  ఒక ప్రధానమైన ఘట్టం చరిత్రలో చోటుచేసుకుంది. చాలా ఏళ్ళుగా నలుగుతూ, సలుపుతూ వచ్చిన ఒక సమస్యకు 'ముగింపు' దొరికింది. పడింది 'శుభం' కార్డా, మరో సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం.  దాన్ని కాలమే తేలుస్తుంది.


ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 'ఆంధ్రప్రదేశ్' ఏర్పాటయినప్పుడు ఇలాగే సంతసించినవాళ్ళు వున్నారు. సందేహించినవాళ్లు వున్నారు. ఆనాడు సంశయం వ్యక్తం చేసిన వాళ్ల భయాలే నిజం అయ్యాయని ఈనాడు విభజనను గట్టిగా కోరుతున్నవారు ఎంతో గట్టిగా వాదించిన సందర్భాలు వున్నాయి. అంచేత సందేహిస్తున్నవారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం  కూడా తగదు. ఎవరు అవునన్నా   ఎవరు కాదన్నా తెలంగాణా ఆవిష్కృతం కాబోతోంది. ఈ సమయంలో గెలుపు వోటముల ప్రసక్తిని పక్కనబెట్టాలి. యుద్దంలో, ఆటల్లో మాత్రమే ఈ మాటలు వినబడతాయి. ఇంతకాలం జరిగింది యుద్ధమూ కాదు, ఆటా కాదు. ఉభయప్రాంతాల జనంలో వున్న ఆకాంక్షకు చక్కని  అభివ్యక్తీకరణ మాత్రమే. కొందరు రాజకీయులు దీనికి అగ్గి రాజేసారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం ఎంతమాత్రం లేదు. ఇకనుంచయినా సరే, రెండు ప్రాంతాల ప్రజలు  రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ  ప్రాంతాల సత్వర  అభివృద్ధిలో  స్వయంగా భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్న నగ్న సత్యాన్ని రాజకీయ నాయకులకు ఎరుకపరచాలి.
(ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లును  ఈరోజు, 20-02-2014,   మధ్యాహ్నం  3-10 కి హోం మంత్రి శ్రీ షిండే  రాజ్యసభలో  ప్రవేశపెట్టారు.  దాదాపు  అయిదు గంటలకు పైగా చర్చ జరిగింది. తరువాత విపక్షాలు డివిజన్ కోరినా సభాపతి వొప్పుకోలేదు. మూజువాణీ వోటుతో  రాత్రి  8- 08 నిమిషాలకు బిల్లును ఆమోదించింది)  



డౌటేహం


"ఆంధ్రా బ్యాంకులో పనిచేసే స్నేహితుడు ఒకరు అడిగారు. విభజన  అనంతరం తెలంగాణాలో తమ బ్యాంకు సంగతేమిటని? కర్నాటక, మహారాష్ట్ర బ్యాంకులు మాదిరిగానే   అనే జవాబు ఆయనకు నచ్చినట్టులేదు." 

ఎప్పుడూ ఇంతే!

"వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు"
"ప్రారంభమైన అనంతరం తిరిగి వాయిదా పడ్డ ఉభయసభలు" 

తిరుక్షవరం

'మా తిరుపతిని ఇచ్చేయండి' - కేంద్రానికి తమిళ నేత రాం దాస్ వినతి (ఈరోజు ఆంధ్ర జ్యోతిలో వార్త)
'సందట్లో సడేమియా అంటే ఇదే కాబోలు' - వ్యాఖ్య 

వార్త - వ్యాఖ్య

'జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ' - వార్త
'నేషనల్ హై వే పై సైకిల్ సవారీ' - వ్యాఖ్య 

ఇదేం ఆట?


ఆఖరి బ్యాట్స్ మన్ కిరణ్ బ్యాట్ కింద పడేసి అవుట్ అయ్యానని ప్రకటించి మరీ మైదానం నుంచి పెవిలియన్ దారి పట్టాడు. అంపైర్ నరసింహన్ ఏవీ చెప్పకుండా మూడో అంపైర్  నిర్ణయానికి వొదిలేసి కూర్చున్నాడు. ఇంతకీ ఆట పూర్తయిందా! మళ్ళీ మొదలవుతుందా!
(స్పోర్ట్స్ న్యూస్ రాసేటప్పుడు గౌరవవాచకాలు వాడకపోవడం జర్నలిజంలో ఒక సంప్రదాయం)

19, ఫిబ్రవరి 2014, బుధవారం

యక్షప్రశ్న


యక్షుడు : ధర్మరాజా! నేను ఇంతవరకు అడిగిన అన్ని ప్రశ్నలకు నువ్వు ఎంతో విజ్ఞతతో కూడిన సరయిన సమాధానాలు చెప్పి నన్ను సంతోషపెట్టావు. ఇక ఈ చిట్ట చివరి ప్రశ్నకు కూడా సరైన జవాబు చెప్పి నీ సోదరుల ప్రాణాలు దక్కించుకో! ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి తమ పదవికి రాజీనామా చేసారని, దాన్ని గవర్నర్ ఆమోదించారనీ దాదాపు అన్ని టీవీ ఛానల్స్ లో స్క్రోలింగులు వచ్చాయి. ఇంతకీ,  సీఎం రాజీనామాను ఆమోదించినట్టా లేదా!"
ధర్మరాజు: నమస్కారం వెళ్లివస్తాను. మీ ప్రశ్నకో నమస్కారం.

(19-02-2014)