18, ఫిబ్రవరి 2014, మంగళవారం

23 నిమిషాల్లో 29 వ రాష్ట్రం




'నోటా' బాటే రైటు


లోక్ సభ, రాజ్య సభల్లో రణగొణ ధ్వనుల నడుమ తూతూ మంత్రంగా సాగిపోతున్న బిల్లుల ఇంట్రడక్షన్, ఆమోదం ప్రక్రియ చూస్తుంటే ఏమనిపిస్తోంది?

"వచ్చే ఎన్నికల్లో వోటర్లందరూ కూడబలుక్కుని కనీసం ఒక్కసారయినా మూకుమ్మడిగా బ్యాలట్ పత్రంలోని 'నోటా' (NONE OF THE ABOVE) అవకాశాన్ని ఉపయోగించుకుని అన్నే పార్టీలవారినీ ముక్తకంఠంతో తిరస్కరిస్తే బాగుండునని"   

నిష్టూరం అనిపించినా ఇదే నిజం.


రాష్ట్రంలో ఒక చారిత్రిక ఘట్టానికి తెర లేచే సమయం ఆసన్నమౌతోంది. మరి కొన్నింటికి తెరలు దించాల్సిన తరుణం కూడా ఇదే.
ఈరోజు లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు పై చర్చ, ఆమోదం అంటూ మీడియా కోయిలలు ముందస్తుగా కూత పెడుతున్నాయి. సోనియా గాంధీ కూడా నాలుగ్గంటల పాటు జరిగే చర్చలో పాల్గొంటారని కూడా వార్త. చర్చ జరుగుతుందని ఎలాటి అత్యాశలు లేవు కాని,  ఇది నిజం కావాలని మాత్రం  భవదీయుడి ఆశ. ఎందుకిలా నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో, ఏ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన ప్రక్రియను ముందుకు తీసుకుపోవాల్సి వచ్చిందో జాతికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అందరికంటే కూడా సోనియాపై ఎక్కువ వుంది. అలాగే ఈ నిర్ణయం వల్ల మనస్తాపం చెందుతున్న మనస్సుల్లో చెలరేగుతున్న భయాందోళనలను నివృత్తి చేయడానికి ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తీరాలి. మాట్లాడడానికి వీలు లేని పరిస్థితులు తలెత్తితే, కనీసం లిఖిత పూర్వక ప్రకటన అన్నా చేయాలి.
రాష్ట్రాన్ని విభజించడంతో పని పూర్తయిందని అనుకోకూడదు. ఈ ఘడియ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళపై మరింత బాధ్యత వుంది. సంయమనంతో వ్యవహరించి - 'విడిపోయి కలిసుందాం' అని ఇన్నాళ్ళుగా చెబుతూ వస్తున్న మాటల్లో ఏమాత్రం డొల్లతనం లేదని నిరూపించుకోవాలి. అద్దంలో చందమామ మాదిరిగా ఇన్నేళ్ళుగా వూరిస్తూ వచ్చిన లక్ష్యం దగ్గర పడుతున్నప్పుడు కావాల్సింది అవతలివారిపట్ల రవంత సానుభూతి. అడ్డగోలుగా అడ్డం పడుతున్నారని , మళ్ళీ అడ్డగోలు ప్రకటనలు, ఆరోపణలు చేయడానికి ఇది ఎంతమాత్రం తరుణం కాదు.  
ఇప్పుడు కావాల్సింది కాసింత సంయమనం. కొద్ది సర్దుబాటు మనస్తత్వం. కాదు కూడదు అనుకుంటే -దీపనిర్వాణగంధం సామెత  మిగులుతుంది. నిష్టూరం అనిపించినా ఇదే నిజం.  
(18-02-2014 - 9 AM)

17, ఫిబ్రవరి 2014, సోమవారం

"SHOW WILL CONTINUE"

వార్త - వ్యాఖ్య  
తప్పుకుంటారా  తప్పిస్తారా
సీఎం కిరణ్ రేపు (మంగళవారం)మధ్యాన్నం మూడుగంటలకు తమ పదవికి రాజీనామా చేస్తారు. (వార్త)
అంటే ఆఖరివరకు ఆడి ఆఖరి బంతికి  బ్యాట్ పారేసి అవుట్ కావడం.
సీఎం కిరణ్ కొత్తపార్టీ  పెడతారు (వార్త)
అంటే బ్యాట్ పారేయకపోవడం (గెలుపు ఓటమి వోటరు అధీనం)
ఏదిఏమైనా ఆట ముగియడం ఖాయం
కాకపొతే, మేరా నామ్ జోకర్ సినిమాలో రాజకపూర్ చెప్పినట్టు
"SHOW WILL CONTINUE"  
(17-02-2014)

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని?

అసలేంజరుగుతోంది? -భండారు శ్రీనివాసరావు  
 అసలేంజరుగుతోంది?’ -  ఒక కేసుకు సంబంధించి, దేశంలో పరిస్తితులపై అత్యున్నత న్యాయస్తానం సుప్రీం కోర్టు కొంతకాలం క్రితం చేసిన వ్యాఖ్య ఇది.
గత కొన్ని మాసాల నుంచి  పాత పేపర్లు తిరగేసినా, టీవీ చర్చలు పునశ్చరణ చేసుకున్నా సామాన్య జనానికి సయితం మనసులో మెదిలే ప్రశ్న ఇదే.
ఎంత చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంత చెడిపోయిన రాజకీయపార్టీకయినా ఏవోకొన్ని సిద్ధాంత మూలాలుంటాయి. కొన్ని స్థిరమైన భావజాలాలుంటాయి. కానీ ఈనాడు  దాదాపు  అన్ని రాజకీయపార్టీలు తమ  సిద్ధాంతాలకు చెల్లు చీటీ రాసినట్టే కానవస్తోంది.
 అలాగే అన్ని రాజకీయ పార్టీలకు, పేరు ఏదయినా అధిష్టానం అంటూ ఒకటుంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువఅని గొప్పలు చెప్పుకునే పార్టీలలో కూడా ఎవరూ నోరెత్తి అధిష్టానాన్ని బాహాటంగా ఎగర్తించే సాహసం చెయ్యరు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? చోటామోటా నాయకులు సయితం తమ పార్టీ అధినాయకులను విలేఖరుల ముందే  పూచికపుల్లలుగా తీసివేస్తున్నారు. ఔరా! వీరికెంత ధైర్యం!అని నలుగురూ అనుకునేలా నలుగురిముందే తమ నాయకులను  చెరిగి పారేస్తున్నారు.
నాయకురాలి జాతీయతను ప్రశ్నించినా, నాయకుడి రెండు కళ్ళ విధానాన్ని విమర్శించినా  ఇదేరకమయిన తెగింపు. ఏం చేస్తారులే అనే ధైర్యం.
ఏకంగా పార్లమెంటును, శాసన సభను వేదికగా చేసుకుని తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తూ, సొంత పార్టీనే నగుబాటు చేసినా ఏం కాదన్న ధీమా.
అసెంబ్లీ. పార్లమెంటు  సమావేశాల్లోనే  ధిక్కార స్వరాన్ని బాహాటంగా వినిపించినా పోయేదేమీలేదన్న మొండితనం.
చట్టసభల సాక్షిగానే చట్ట ఉల్లంఘనకు పాల్పడే మంకుతనం.
రాష్ట్రం రెండు ముక్కలవుతుందా మూడు చెక్కలవుతుందా తేలే ఘడియ  తేలకముందే పార్టీలన్నీ రెండుముక్కలుగా పైనుంచి కిందవరకూ చీలిపోయాయి. ప్రాంతాల విషయం వచ్చేసరికి ఎవరికీ పార్టీల సంగతి పట్టడం లేదు. విధానాల సంగతి గుర్తు రావడం లేదు. పార్టీలు వేరయినా మాట్లాడేది ఒక్కటిగానే వుంటోంది. ఎదుటి వారిని చీల్చి చెండాడడానికి నాలుకలన్నీ ఒక్కటవుతున్నాయి. విద్వేషాగ్నులు రగల్చడానికి, నిందారోపణలు చేయడానికి సొంత పార్టీ వారు, పరాయి పక్షం వారు అన్న తేడా లేకుండా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్తితిని గమనించేవారికి ఎవరు యే పార్టీ వారో చప్పున ఒక పట్టాన చెప్పడం కష్టమవుతోంది. పైపెచ్చు వీరిలో అనేకమంది ఏదో ఒక పార్టీని నిజాయితీగా  అంటిపెట్టుకుని నిష్కళంక రాజకీయాలు చేస్తున్నవారు కాకపోవడం వల్లకూడా అయోమయం పెచ్చుపెరుగుతోంది. మొన్న మొన్నటి వరకూ వేరే పార్టీలో వుండి ఆ గూటి పలుకులు పలికి  ఇప్పుడు మళ్ళీ అదే నోటితో వేరే పలుకులు వల్లె వేయడం చూసి విస్తుబోవడం వీక్షకుల వంతు అవుతోంది. కళ్ళకు గంతలు కట్టి -  వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ  పేరేమీఅని అడిగినట్టు అడిగితే  'ఎవరు ఎవరో' చెప్పలేని దుస్తితి.          
గతంలో పార్టీ విధానాలను మీడియాకు వివరించడానికి ప్రతి పార్టీకి అధికార ప్రతినిధులు వుండేవారు.  ఇప్పటికీ లేకపోలేదు. కానీ పార్టీ పేరుపెట్టుకుని  ప్రతిఒక్కరూ మీడియాతో మాట్లాడేస్తున్నారు.  దానికి పార్టీ అనుమతి వుందా లేదా అన్నది వారికి  అప్రస్తుతం. వారు చెప్పేది పార్టీ విధానమా కాదా అన్నది మీడియాకు అప్రస్తుతం. ఇలా -  ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా అప్పటికామాటలాడేవారితోనే మరింత గందరగోళం ఏర్పడుతోంది.
ఒక పార్టీ వారు చెప్పిన దానిని మరో పార్టీ వారు ఖండించే పద్దతి పోయి ఎవరి పార్టీవారిని వారే దుయ్యపట్టే కొత్త సంస్కృతి తాజాగా రూపుదిద్దుకుని వున్న  అయోమయాన్ని మరింత పెంచింది. అలాగే ఒక పార్టీని మరో పార్టీ సమర్ధించే విధానం కూడా పరిస్తితిని మరింతగా గందరగోళపరుస్తోంది. అవసరాన్నిబట్టి అవలంబిస్తున్న ఈ రెండు నాల్కల ధోరణి రాజకీయపార్టీల దివాళాకోరుతనాన్ని ఎత్తి  చూపుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలదీ ఇదే వరస కావడం మరో విషాదం.
వీటన్నిటికీ తోడు, క్రికెట్ పరిభాష లోని  మ్యాచ్ ఫిక్సింగ్పదం  రాజకీయాల్లోకి దూసుకువచ్చింది. వీరు వారితో ఫిక్సయ్యారని ఒకరంటే, వారు వీరితో కుమ్మక్కయ్యారని మరొకరంటున్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో యక్షుడు అడిగి వుంటే ధర్మరాజు కూడా జవాబు చెప్పలేని స్తితి.
ఇంతటి  అయోమయం, ఇంతటి కంగాళీ వ్యవహారం, ఇంతటి దగాకోరు రాజకీయం గత నాలుగు దశాబ్దాల జర్నలిస్టు జీవితంలో ఏనాడు కనీ వినీ ఎరుగని విషయాలు.
ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని?
(16-02-2014)

ఏమి చెప్పుదు సంజయా!


ఆ వార్త దావానలంలా నగరంలో ఒక్కసారిగా గుప్పుమంది.
ఒకరు కాదు, ఇద్దరు కాదు ఒకేసారి చిత్రపరిశ్రమకు చెందిన ముగ్గురు – నిర్మాత, డైరక్టర్, రచయిత – ఓ హోటల్ గదిలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి వెళ్ళిన పోలీసులకు ఆ గదిలో ఓ లేఖ దొరికింది.
అందులో ఇలా వుంది.
విషయం : మహాభారతం మీద మీరు నిర్మించాలనుకున్న సినిమా
రిఫరెన్స్ : ప్రభుత్వం నుంచి  ఆర్ధిక సాయం కోసం  మీరు పెట్టుకున్న ధరఖాస్తు
అయ్యా !
మీరు పంపిన పై ధరఖాస్తు కింది సంతకందారు పరిశీలనకై వచ్చింది. 'మహాభారతం' అనే సినిమా తీయడానికి ప్రభుత్వ సాయం కోసం  మీరు పెట్టుకున్న అర్జీని  ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. మహాభారతం సబ్జెక్ట్ లోని కొన్ని అంశాలు మరీ సున్నితమైనవిగా భావించి ప్రభుత్వం ఈ ధరఖాస్తును పరిశీలించేందుకు ఒక అత్యున్నత  స్తాయి సంఘాన్ని ఏర్పాటుచేసింది.  మీరు దాఖలు చేసిన మహా భారతం  స్క్రిప్ట్ ను నిశితంగా  పరిశీలించిన తరువాత వాటిని ఈ కింది విధంగా క్రోడీకరించడం జరిగింది.    

1
. మీరు పంపిన స్క్రిప్ట్ లో  మహాభారతం కధలో వందమంది కౌరవులు, అయిదుగురు పాండవులు వుంటారని  పేర్కొన్నారు.  ఈ సంఖ్యల పట్ల కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆ శాఖ జారీ చేసిన మార్గదర్శిక సూత్రాల ప్రకారం ఒక కుటుంబంలో ఇంత మంది సంతానం వుండడం, అలాటి విషయాలను సినిమా మాధ్యమం ద్వారా ప్రచారం చేయడం ఆమోదయోగ్యం కాదు. చిన్న కుటుంబం ఆవశ్యకతను గురించి ప్రచారం చేయడం కోసం ప్రభత్వం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న దృష్ట్యా నూర్గురు కౌరవులను చూపించే మహాభారతం వంటి సినిమాలకు సాయం చేయరాదని ఆ మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది. ఈ చిత్రంలో కౌరవ పాండవుల సంఖ్యను మూడు దాటకుండా చూసుకోగలిగితే ఆర్ధిక సాయం చేసే విషయాన్ని పరిశీలించవచ్చని ఆ శాఖ సిఫారసు చేసింది.

2
. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ కధలోని మరో ప్రధాన అంశంపై అభ్యంతరం తెలిపింది. మహాభారతం స్ర్కిప్ట్ ప్రకారం కౌరవులు  క్లోనింగ్ విధానం ప్రకారం జన్మించినట్టు వుంది. ప్రస్తుత చట్టాల ప్రకారం భారత దేశంలో క్లోనింగ్ నిషేధం. ఈ దృష్ట్యా , కౌరవులు సాధారణ పద్ధతిలో జన్మించినట్టు స్క్రిప్ట్ ను మార్చాల్సివుంటుంది.
3
. జాతీయ మహిళా హక్కుల కమిషన్ అభ్యంతరం మరో రకంగా వుంది. అయిదుగురు పాండవులకు కలిపి ఒకే భార్య వున్నట్టుగా స్క్రిప్ట్ లో చూపించారు. మహిళలను  కించపరిచే  విధంగా రూపొందించిన ఈ కధను ఎట్టి పరిస్తితిలోను ప్రస్తుతం వున్నవిదంగా చూపించడం తగదని స్పష్టం చేసింది.
4
. ఈ చిత్రంలో దృతరాష్ట్రుడు అనే పాత్ర అనేక సందర్భాలలో కనిపిస్తుంది. అతడిని అనేక దృశ్యాలలో 'అంధుడు అంధుడు' అని నిందాపూర్వకంగా మాట్లాడిన అంశాలను తొలగించాలని  వికలాంగుల మంత్రిత్వశాఖ గట్టిగా సిఫారసు చేసింది.
5
.  ఓ ఘట్టంలో ద్రౌపది అనే స్త్రీ పాత్రను నిండు సభలో వస్త్రాపహరణం చేస్తున్నట్టు వుంది. ఇది  స్త్రీ జాతికే అవమానకరమని , ఈ సన్నివేశాన్ని  తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని మహిళా శిశు సంక్షేమ  శాఖ తన సిఫారసులో పేర్కొన్నది. ఇలాటి సన్నివేశాలను సినిమాల్లో చూపించడంవల్ల మహిళా సంఘాలనుంచి తీవ్ర వ్యతిరేకత  వ్యక్తం అయ్యే అవకాశం వుందని, దరిమిలా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావచ్చనీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ సన్నివేశాలను తొలగించకుండా స్క్రిప్ట్  ఆమోదించడం తమకు సమ్మతం కాదని పేర్కొన్నది.
6
. కౌరవ పాండవులను జూదరులుగా  చూపించారని, ప్రజల్లో జూద ప్రవృత్తిని ప్రోత్సహించే విధంగా వున్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని కూడా సూచించింది.  అంతగా కధకు అవసరం అనుకుంటే  కౌరవ పాండవులు గుర్రపు పందేల్లో పోటీ పడినట్టు చూపించుకోవచ్చని సూచించింది. గుర్రపు పందేలు జూదం కిందికి రావని సుప్రీం కోర్టు  గతంలో పేర్కొన్న  విషయాన్ని హోం శాఖ తన సిఫార్సుకు జత చేసింది.
ఇన్ని కారణాల దృష్ట్యా మహాభారతం సినిమా స్క్రిప్ట్ ను తదనుగుణంగా మారిస్తే తప్ప ఆర్ధిక సాయం చేసే విషయాన్ని పరిశీలించడం జరగదని ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగింది.  

తెలుసా ఎవరికయినా?

Antonia Edvige Albina Maino - ఎవరో తెలుసా ? అని మల్లాది గారు అడిగారు.
తెలుసా ఎవరికయినా?