25, డిసెంబర్ 2013, బుధవారం

HAPPY HAPPY CHRISTMAS MERRY MERRY CHRISTMAS



HAPPY HAPPY CHRISTMAS MERRY MERRY CHRISTMAS

24, డిసెంబర్ 2013, మంగళవారం

పడగొట్టినా నిలబడతాం


యు ఎస్ ఎస్ న్యూయార్క్

పేరు చూడగానే ఇది అమెరికా నౌక అనితెలిసిపోతూనే వుంది. కాకపోతే,   ఇది ఆదేశం తాజాగా నిర్మించుకున్న ఓ  యుద్ధనౌక. ఉగ్రవాదుల పీచమణిచే లక్ష్యంతో అమెరికా రూపకల్పన చేసిన నౌకల శ్రేణిలో ఇది అయిదవది. ఈ భారీ యుద్ధ నౌకలో 360  మంది నావికులు, 700  మంది నౌకా సైనికులు అధునాతన యుద్ధ సామగ్రి, పరికరాలతో సదా సిద్ధంగా వుంటారు.
అన్ని యుద్ధ నౌకల్లో ఇదొకటి అనుకోవచ్చుకానీ దీనికొక ప్రత్యేకత వుంది. దీని నిర్మాణంలో సుమారు ఇరవై నాలుగువేల టన్నుల ఉక్కును   ఉపయోగించారు. అందులో మాత్రం విశిష్టత ఏముంది అనిపించవచ్చు. అలా వాడిన ఉక్కు ఒక్కటే  ఈ నౌకకు ఇంతటి  ప్రత్యేకతను సమకూర్చిపెట్టింది. పదమూడేళ్లక్రితం ఉగ్రవాదుల ముష్కర దాడిలో నేలమట్టం అయిన న్యూ యార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట హర్మ్యాల నిర్మాణంలో వాడిన ఉక్కు, ఇనుములనే సేకరించి, కరిగించి  వాటితో  ఈ యుద్ధ నౌకను నిర్మించారు. నౌకను తయారుచేసిన కర్మాగారానికి ఆ ఉక్కు శకలాలను తీసుకుని వచ్చినప్పుడు అక్కడి పనివారు దానిని చూసి నాటి ఘోర దృశ్యాలను తలచుకుని విచలితులయ్యారని నేవీ కెప్టెన్ కెవిన్ వెన్సింగ్ చెప్పారు. కరిగించిన ఆ ఉక్కును చేతితో తాకినప్పుడు ఉద్వేగంతో తన వొంటిపై రోమాలు నిక్కబొడుచుకున్నాయని ఫౌండ్రీ ఆపరేషన్స్ మేనేజర్ జూనియర్ షావర్స్ గుర్తుచేసుకున్నారు.


‘ఈ నౌకను చూస్తున్నప్పుడు మా అందరికీ ఒక విషయం స్పురణకు వస్తుంది. అవును ‘వాళ్లు’ నేలమట్టం చేయగలిగారు. కానీ మమ్మల్ని ఆ నేల మీదనే ఎల్లకాలం వుంచలేరు. మళ్ళీ లేచి నిలబడతాం. ఈ నౌకే దానికి ప్రత్యక్ష సాక్ష్యం.’
సముద్ర జలాల్లో ఠీవిగా నిలబడిన ఆ నౌకను చూస్తూ అన్నారాయన.

(శ్రీ పీవీవీజీ స్వామి గారు పంపిన మెయిల్ ఆధారంగా -  ఫోటోగ్రాఫర్ కు కృతజ్ఞతలు)

పద్మ'ఛీ'లు

'పద్మశ్రీ వెనక్కి ఇవ్వండి' - వార్త
పంచ్ డైలాగులకు అలవాటుపడ్డ సినిమా వాళ్ళతో కాస్త జాగ్రత్త. 'పద్మశ్రీ ఇచ్చిన వారికే తిరిగి వాపసు ఇస్తాం , ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో ఫంక్షన్ పెట్టండి మీడియాను పిలవండి'అన్నా అనగలరు. - వ్యాఖ్య 

23, డిసెంబర్ 2013, సోమవారం

తానే మారునా!........



'చీపిరి యెంత గొప్పదయినా దాన్ని పట్టుకుని వూడ్చేది చెయ్యే కదా అనేది 'ఆ చెయ్యి' ధీమా!



(Courtesy Cartoonist)



బల్బు మాడింది


శంకరం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే ఏడేళ్ళ బుడుగు తండ్రిని అడిగాడు.
నేను ఇక్కడికి ఎక్కడినుంచి యెలా  వచ్చాను?’
శంకరానికి ముందా ప్రశ్న అర్ధం కాలేదు. అర్ధం అయినతర్వాత దానికి జవాబు ఏం చెప్పాలో ఓ పట్టాన అర్ధం కాలేదు.
తల్లి గర్భంలోనుంచి పిల్లలు యెలా వస్తారో  చెప్పే ఈడు  కాదు పిల్లాడిది. అందుకే సమాధానం చెప్పకుండా దాటవేద్దామనుకున్నాడు. వాడి వయసా చిన్నది. కొన్నేళ్ళు పోతే వాళ్ళకే తెలుస్తుంది అనుకునే సంస్కృతి ఇంటావంటా వొంటబట్టించుకున్న కుటుంబమాయె.
కానీ కాసేపటి తరువాత శంకరం మనసు మార్చుకున్నాడు. ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇంకా బూజు పట్టిన పాత సంస్కృతినే పట్టుకుని వేలాడితే యెలా అని కూడా అనుకున్నాడు. అందుకే స్త్రీల  గర్భధారణ గురించీ, నవమాసాలు మోసి బిడ్డను కనే దాకా అతడు ఎక్కడినుంచి భూమిమీదకు యెలా వచ్చాడో అంతా అరటిపండు వొలిచి చెప్పినట్టు పిల్లాడికి చెప్పేసి అమ్మయ్యఅనుకున్నాడు. తను అందరిలాటి తండ్రిని కాదు కొంత స్పెషల్ అని కూడా అనుకున్నాడు.
మరి కాసేపటికి బుర్రలో బల్బ్ వెలిగింది.
వున్నట్టుండి బుడుగు ఎందుకా ప్రశ్న వేసాడు. అదే అడిగాడు.
ఏం లేదు నాన్నా! నిన్న మన పక్క వాటాలో దిగిన సుందరం అంకుల్ పిల్లాడిని మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే అమలాపురం నుంచి అన్నాడు. దాంతో మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలని నిన్నడిగాను. అంతే!
బుడుగు జవాబుతో  శంకరం బుర్ర గిర్రున తిరిగింది.



(నెట్లో కానవచ్చిన ఇంగ్లీష్ ఆర్టికిల్ ఆధారంగా) 

NOTE: Courtesy Image owner

ఈరోజు పీవీ తొమ్మిదో వర్ధంతి - ఓ జ్ఞాపకం

పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులుఅనధికారులుమందీ మార్బలాలు, వందిమాగధులు,  ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమాఅన్నట్టు వుండేది.



మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు – నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు  - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని  పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండిఅన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.


పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా!అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ  పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది – కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత – కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి  ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.  


ఆనో భద్రాః క్రతవో యన్తు విశ్వతఃఅని రిగ్వేదం చెబుతోంది. అంటే అన్ని వైపులనుంచి ఉత్తమమైన భావాలు నాలో ప్రవేశించు గాక అని అర్ధం.

పరీక్ష జరిగే హాలు నిశ్శబ్దంగా వుంది. విద్యార్ధులందరూ జవాబులు రాసే క్రమంలో తలమునకలైవున్నారు.


(శ్రీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్)

పరీక్షరాసే వారిలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వున్నారు. తరగతి మొత్తంలో చాలా తెలివిగల విద్యార్ధి. అతడి వెనుకనే మనీష్ కూర్చుని ప్రశ్నాపత్రాన్ని దీక్షగా చూస్తున్నాడు. సహజంగా మందబుద్ధి అయిన మనీష్ కు ఆ పరీక్ష గట్టెక్కడం అన్నది ఒక పరీక్ష గా తయారయింది. అందుకే అతడు ఈ విషయంలో తన స్నేహితుడయిన విద్యాసాగర్ సాయం కోసం ఎదురుచూస్తూ బిత్తర చూపులు చూస్తున్నాడు. ఈలోగా ఈశ్వరచంద్ర విద్యాసాగ ర్ జవాబులురాసే పని పూర్తయింది. రాసిన సమాధానాలను మరోమారు పరిశీలించుకునే పనిలో పడిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనీష్ మరో మారు ఈశ్వర్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసాడు. తన స్నేహితుడు కోరుతున్నదేమిటో ఈశ్వర్ కు సులువుగానే అర్ధం అయింది. కానీ ఈ విషయంలో స్నేహితుడికి సాయం చేయడానికి అతడికి మనస్కరించ లేదు. కానీ, దీనంగా అభ్యర్ధిస్తున్న స్నేహితుడి చూపులకు అతడి మనసు మెత్తపడింది. దాంతో అప్పటి వరకు తాను రాసిన సమాధాన పత్రాన్ని మనీష్ కు రహస్యంగా అందించాడు. ఇది ఎవరూ చూడలేదనుకున్నాడు కానీ, ఈశ్వర్ కాపీ అందిస్తూ వుండడం పరీక్ష హాలులో పర్యవేక్షణ చేస్తున్న ఉపాధ్యాయుడి కంటబడింది. అయ్యవారు ఆగ్రహంతో వూగిపోతూ ఈశ్వర్ ని పట్టుకుని కఠినంగా శిక్షించాడు. నలుగురిలో జరిగిన ఈ అవమానంతో స్వతహాగా అభిమానధనుడయిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎంతగానో కుంగిపోయాడు.

పరీక్ష పూర్తి కాగానే ఉపాధ్యాయుడు ఈశ్వర్ ని తన గదికి పిలిపించుకున్నాడు.

చూడు. ఈశ్వర్. నువ్వు చాలా తెలివైన విద్యార్ధివి. బాగా చదువుకుని పైకి రావాల్సినవాడివి. నీలాటి తెలివయిన కుర్రవాడిని అలా శిక్షించినందుకు నాకెంతో బాధగా వుందిఅంటూ ఓదార్చే ప్రయత్నం చేసాడు.

స్నేహితుడికి సాయం చేయాలన్న సదుద్దేశ్యం తప్ప దగా చేయాలన్న అభిప్రాయం తనకు యే కోశానా లేదని విద్యాసాగర్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

డానికి ఉపాధ్యాయుడు ఇలా జవాబు చెప్పారు.

తప్పుచేసినవాడు పాపితో సమానం. కానీ తప్పుచేసేవాడికి సాయం చేసేవాడు కూడా వాడితో సమానమే. అందుకే, నిన్నుశిక్షించాల్సి వచ్చింది. నిజమే. నువ్వు మనీష్ కి సాయం చేయాలని అనుకున్నావు. కానీ అలా చేయడం ద్వారా అతడిలోని బద్ధకానికి కూడా సాయం చేస్తున్న సంగతి మరచిపోయావు. అల్లా ఎవరో ఒకరు నీలా సాయం చేస్తూ పోతుంటే, ముందు ముందు తోటివారి సాయం తీసుకోకుండా అతడిక యేపనీ చేయలేడు

ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి మహా మేధావి స్వయంగా వెల్లడించిన ఈ ఉదంతం   ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఒకటుంది.

మనం చేసే ప్రతి పని వల్ల వచ్చే ఫలితం మంచి చెడుల సమ్మిశ్రమం. ఇతరుల జీవితాలను మంచి వైపు నడిపించే దిశగా మనం చేసే పనుల ఫలితం వుండేలాగా చూసుకోవాలి. అటువంటి చక్కటి భావనలు అన్ని వైపులనుంచి మన మనస్సులో ప్రవేశించేలా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూవుండాలి.