5, నవంబర్ 2013, మంగళవారం

ఐ పాడ్ మేజిక్



అన్నిరకాల మేజిక్ లు అయిపోయి ఇక ఐ పాడ్ మేజిక్ లు వచ్చేసాయి. మూడునిమిషాలే కాబట్టి హాయిగా చూసెయ్యొచ్చు. ఒక పనయిపోతుంది. ఏమంటారు? లింకుపై నొక్కి చూడండి.
http://www.lifo.gr/tv/videos/460

3, నవంబర్ 2013, ఆదివారం

ఆడవాళ్లా మజాకా!


ఆడవాళ్లంటే గౌరవం పెరిగే సందర్భం నిన్న అనుభవంలోకి వచ్చింది.
ప్రభుత్వ సర్వీసులో వున్నవాళ్ళు పదవీ విరమణ వయసు రాగానే ఇంటికి పంపించేస్తారు. అంతవరకూ ఆఫీసులో నలుగురితో వారు సంపాదించుకున్న ఆదరణను బట్టి వీడ్కోలు గౌరవం వుంటుంది. కాకపొతే కొంత స్థాయీ భేదాలు కూడా  సహజం.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో దాదాపు నలభయ్ ఏళ్ళ బట్టి పనిచేస్తూ వచ్చిన విజయలక్ష్మి అనే ఆవిడ మొన్న అక్టోబర్ ముప్పయి ఒకటిన రిటైర్ అయింది. మామూలుగానే చిన్న కార్యక్రమం పెట్టి వీడ్కోలు ఇచ్చి వుంటే ఇప్పుడీ విషయం రాయాల్సిన అవసరం వుండివుండేది కాదు.
ముందు కొంత నేపధ్యం చెప్పుకుందాం.
గతంలో నేను రేడియోలో పనిచేసేటప్పుడు న్యూస్ ఎడిటర్లు, కరస్పాండెంట్లు అంతా మగ మహారాజులే. స్టెనోలు, టైపిస్టులు మాత్రం ఆడవాళ్లు. న్యూస్ రీడర్లు కొంత మినహాయింపు.  ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారిపోయింది. న్యూస్ యూనిట్ హెడ్ బాఖర్ మీర్జా అయినప్పటికీ న్యూస్ ఎడిటర్ శ్రీమతి సుప్రశాంతి. న్యూస్ కరస్పాండెంట్ శ్రీమతి లక్ష్మి. న్యూస్ రీడర్లు శ్రీమతి తురగా ఉషారమణి, శ్రీమతి మాధవీలత. ఇంగ్లీష్ స్టెనో గ్రాఫర్ శ్రీమతి శైలజ, తెలుగు స్టెనో శ్రీమతి విజయలక్ష్మి. చివరాఖరుకు నాలుగో తరగతి అధికారులు (క్లాస్ ఫోర్ ) కూడా శ్రీమతి శ్యామల, శ్రీమతి అన్నపూర్ణ.
మా యూనిట్లో ఈ ఆడవాళ్లందరూ కలసి  ప్రభుత్వంలో ఒక విభాగాన్ని యెంత సమర్ధవంతంగా నడపవచ్చో రుజువు చేశారు.
2011 లో మొత్తం దేశంలోని ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాల్లో ‘బెస్ట్ న్యూస్ యూనిట్ అవార్డ్’ హైదరాబాదుకు లభిస్తే ‘బెస్ట్ న్యూస్ ఎడిటర్ అవార్డ్’ను శ్రీమతి సుప్రశాంతి కైవసం చేసుకున్నారు. ‘2009 బెస్ట్ న్యూస్ కరస్పాండెంట్ అవార్డ్’ శ్రీమతి లక్ష్మికి లభించింది. లక్ష్మి 2010 లో రాష్ట్రపతి లావోస్, కంబోడియా పర్యటనలను, 2013 లో ప్రధాని జపాన్ పర్యటనను  ఆకాశవాణి తరపున కవర్ చేస్తే, సుప్రశాంతి 2011 లో ప్రధాని వెంట మాల్దీవులకు, మళ్ళీ 2013  లో ప్రధాని వెంట జర్మనీకి వెళ్ళి వచ్చారు.


(ఎడమనుంచి కుడికి - రంగారావు,విజయలక్ష్మి దంపతులు, లక్ష్మారెడ్డి, అద్దంకి రాం కుమార్, డి. వెంకట్రామయ్య, భండారు శ్రీనివాసరావు, శైలజ, సుప్రశాంతి, లక్ష్మి, తురగా ఉషారమణి)     

సరే! ఇదంతా వృత్తిగతం. ఇన్ని అవార్డులు రివార్డులు పొందిన తరువాత సామాన్యంగా ఎవరయినా సరే  తాము అసామాన్యులమని అనుకోవడం సహజం. కానీ వీరిద్దరూ దానికి పూర్తిగా మినహాయింపు. వీరే కాదు, ఇప్పుడు ఆ యూనిట్లో పనిచేస్తున్న మహిళలందరూ భేషజాలు ఎరుగనివారే. అందుకే ఒక స్టెనోగ్రాఫర్ రిటైర్మెంట్ వేడుకను అంతా  పూనుకుని ఎంతో  ఘనంగా నిర్వహించారు.దాదాపు అరవై మంది క్యాజువల్ న్యూస్ రీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గౌరవం పొందిన విజయలక్ష్మికి అభినందనలు. ఈ అభినందన వేడుకను కనుల పండుగగా నిర్వహించిన వారందరికీ శతాభివందనలు. (వయసు రీత్యా చిన్నవారయినా మానసికంగా బాగా పరిణతి చెందినవారు కాబట్టి  తప్పులేదేమో!)
(03-11-2013)

పెళ్ళాన్ని సంతోషంగా వుంచాలంటే :


భార్యను సుఖపెట్టాలనుకున్న భర్త ఆమెకు :
ఒక స్నేహితుడిగా
ఒక ప్రేమికుడిగా
ఒక సాటి మనిషిగా
ఒక వంటమనిషిగా
ఒక ఎలెక్త్రీషియన్ గా
ఒక ప్లంబర్ గా
ఒక కార్పెంటర్ గా
ఒక డెకొరేటర్ గా
ఒక మంచి శ్రోతగా
ఒక పనివాడిగా
ఒక అంగరక్షకుడిగా
చెప్పిన  ప్రతిమాట చెవి వొగ్గి వినేవాడిగా
చెప్పిన ప్రతిపని బుద్దిగా చేసేవాడిగా
ఒక శ్రేయోభిలాషిగా
చక్కని తెలివితేటలు కలవాడిగా
ధైర్యశాలిగా
సంపాదన పరుడిగా
అడిగినవన్నీ కొనిపెట్టేవాడిగా
అడగనివి కూడా కొనేవాడిగా
ఏవీ కొన్నా వాటిని గురించి ఏవీ అడగనివాడిగా
ఆమె పుట్టిన రోజును మరచిపోనివాడిగా
వుంటే చాలు.
పోతే, భర్తను సంతోషంగా వుంచాలంటే
ఇవేవీ అక్కరలేదు
అతడ్ని వొంటరిగా  వొదిలిపెడితే చాలు.
అతడికి అదే పదివేలు.


(ఒక ఇంగ్లీష్ గల్పికకు సంక్షిప్త స్వేచ్చానువాదం )

2, నవంబర్ 2013, శనివారం

దీపావళి శుభాకాంక్షలు


మీ హృదయాంగణంలో
మీ గృహ ప్రాంగణంలో
దీపావళి దివ్యకాంతులు ప్రసరించాలని మనసారా కోరుకుంటూ –


(నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు) 


  

1, నవంబర్ 2013, శుక్రవారం

ఆకాశవాణి నూతన డైరెక్టర్ జనరల్ ఆర్. వెంకటేశ్వర్లు గారికి అభినందన మందారమాల


ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ గా తెలుగువారయిన శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాకు తెలిసి ఆకాశవాణిలో ఇంతటి అత్యున్నత పదవి తెలుగువారికి దక్కడం ఇదే మొదటి సారి.  గతంలో ఆకాశవాణి, దూరదర్శన్ ఈ రెంటికీ కలిపి ఏర్పాటుచేసిన ప్రసార భారతి సంస్థకు సారధ్యం వహించిన ఖ్యాతి శ్రీ కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మగారికి లభించింది.


(శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు)

శ్రీ వెంకటేశ్వర్లు పరిచయం వున్నవారందరికీ ముందు గుర్తు వచ్చేది ఆయన మందస్మిత వదనం. గతంలో ఆయన ఆలిండియా రేడియో, ఫీల్డ్ పబ్లిసిటీ సంస్థల అధికారిగా పనిచేసిన రోజులనుంచీ నాకు ఆయనతో పరిచయం. తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ వరంగల్ రేడియో స్టేషన్ డైరెక్టర్ గా, హైదరాబాదు దూరదర్శన్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు ఆయనతో సాన్నిహిత్యం మరింత బలపడింది. మెట్లెక్కిన కొద్దీ  సహజంగా కానవచ్చే బెట్టుసరి వైఖరి వెంకటేశ్వర్లు గారిలో కలికానికి కానరాకపోవడం వల్ల మా మైత్రీబంధం మరింత గట్టిపడింది. ఎప్పుడు ఎక్కడ కనబడినా ‘ఏం మిత్రమా కుశలమా’ అనే మాట ఆయన నోట వినబడేది. అధికారిక అంతరం లేని ఆయన అంతరంగం వల్ల ఆయనతో నా వ్యవహార శైలి మునుపటి మాదిరిగానే కొనసాగుతూ వచ్చింది.
ఆర్ వీ వెంకటేశ్వర్లు గారు (అందరికీ ఆర్వీగా పరిచయం) ఢిల్లీ వెళ్ళిపోయిన తరువాత పెద్దగా కలిసింది లేదు. ఈరోజు ఆయన ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ గా నియమితులయినారని తెలిసి కాస్త సందేహిస్తూనే అభినందించడానికి ఫోను చేసాను. కొన్ని ఆయన లైన్లోకి రాగానే ఫోను కట్టయింది. బిజీ గా వుండొచ్చు అనుకున్నాను. క్షణాల వ్యవధిలో నా ఫోను మోగింది. “ఏం మిత్రమా! యెలా వున్నారు!” అంటూ అదే పలకరింపు.
కాసేపు మాట్లాడారు. కానీ నాకు చాలాసేపు అనిపించింది. హైదరాబాదు వచ్చినప్పుడు కలుద్దాం అని చెప్పి నేనే ముగించాను.

ఆయనకు మరోసారి మనః పూర్వక అభినందనలు. (01-11-2013)                     

గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈగడ్డ


మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు మరణించినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షిక ఇది. ‘ఏ పత్రికలో ఇలా వచ్చింది – ఈ హెడ్డింగు పెట్టింది ఎవరు’ అంటూ చాలామంది అడిగారు. అంజయ్య గారు చనిపోయినప్పుడు అప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న శ్రీ  వర్దెల్లి మురళి ఈ శీర్షిక పెట్టారు. ప్రస్తుతం శ్రీ మురళి సాక్షి పత్రిక ఎడిటర్ గా వున్నారు.
ఎలాగూ హెడ్డింగుల ప్రసక్తి వచ్చింది కాబట్టి మరో విషయం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రాష్ట్రంలో మొదటిసారి నల్గొండకు రైలు మార్గం ఏర్పాటు అయింది. అప్పుడు ఆంధ్ర ప్రభ ఎడిటర్ గా వున్న శ్రీ ఏబీకే ప్రసాద్ పెట్టిన పతాక శీర్షిక – “ నల్గొండకు రైలొచ్చింది”
ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన హెడ్డింగు - " పేదోని అన్నం గిన్నె తొణికింది". (రెండు రూపాయల కిలో బియ్యం పధకం నేపధ్యంలో అనుకుంటాను.) ఈ శీర్షిక పెట్టింది కూడా  ఏబీకే గారే.    

పాశం యాదగిరిని తెలవని జర్నలిష్టులు హైదరాబాదులో వుండరు. చాలామందికి తెలవని సంగతి ఏమిటంటే - ఆయన ‘యాదు’ లో చాలా చక్కని చిక్కని సంగతులు ఎన్నో వున్నాయి. కదిలించి చూడాలే కాని ఇలాటి కదిలించే కబుర్లు ఎన్నో. 

పుణ్యమూర్తి పుట్టినరోజు

పుణ్యమూర్తి పుట్టినరోజు
కొందరికి అమ్మ. మరికొందరికి అత్తయ్య. ఇంకొందరికి  బామ్మ. ఎందరెందరికో అమ్ముమ్మ. ఆమే మా అమ్మ, కీర్తిశేషులు భండారు వెంకట్రావమ్మ. ఈరోజు ఆ  పుణ్యమూర్తి పుట్టినరోజు. మా  అందరి గుండెల్లో ఆమె ఇంకా జీవించే వుంది. అంచేత ఆమెకు మేము జయంతులు జరపం. ఏటా పుట్టిన రోజులే.


కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తాలూకా గండ్రాయిలో పుట్టి అదే జిల్లా లోని మరో కుగ్రామం కంభంపాడును మెట్టి రాఘవరావుగారి అర్ధాంగిగా ఏడుగురు ఆడపిల్లలకి, నలుగురు మొగపిల్లలకు తల్లయి, అత్త పాత్రలో కూడా తల్లి ప్రేమనే పంచి,  భండారు వంశాంకురాలను కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలకు అతీతంగా విశ్వవ్యాప్తం చేసిన మహనీయురాలు. మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు 1972 లో పూనుకుని చేసిన మా అమ్మ ‘సహస్ర  చంద్రదర్శనం’ కార్యక్రమానికి  పిల్లాజెల్లా అందరూ దేశవిదేశాలనుంచి తరలి వచ్చి ఆమె ఆశీస్సులు స్వీకరించి వెళ్ళిన శుభ సందర్భం ఇప్పటికీ మా అందరి మనస్సులో పదిలంగా వుంది.

పుణ్యలోకాలలో వున్న ఆమె ఆశీస్సులు ఇప్పటిమాదిరిగానే ఎప్పటికీ అందరికీ లభిస్తూ వుండాలని కోరుకుంటూ – భండారు కుటుంబం.